జై రాధే! జై శ్యామ్!
ఆత్మదేవ బ్రాహ్మణుడు హిత హరివంశ మహాప్రభువును తన గృహంలోకి ఆహ్వానించాడు.
అది సాధారణమైన ఇల్లు కాదు...
వేదమంత్రాల నాదంతో పవిత్రమైన గృహం...
తులసి పరిమళంతో నిండిన ప్రాంగణం...
రాధాకృష్ణుల నామసంకీర్తన ఎప్పుడూ ఆగని దివ్య మందిరం.
ఆ గృహంలోని ప్రతి గోడ...
ప్రతి దీపం...
ప్రతి శ్వాస...
"రాధే... రాధే..." అనే మధురనామాన్నే ఆలపిస్తున్నట్లు అనిపించింది.
ఆత్మదేవుడు హరివంశ మహాప్రభువును దేవుడిగృహంలోకి తీసుకువెళ్లాడు.
దీపాల వెలుగులో...
చందన పరిమళాల మధ్య...
పుష్పాలతో అలంకరించబడిన ఒక దివ్యమూర్తి తేజోమయంగా ప్రకాశిస్తోంది.
హరివంశుని చూపు ఆ మూర్తిపై పడిన క్షణమే...
ఆయన శరీరమంతా పులకరించింది.
కళ్లనుండి ఆనందబాష్పాలు ధారలుగా జారాయి.
ఆయన చేతులు తెలియకుండానే నమస్కారముద్రలో ముడివడ్డాయి.
వణుకుతున్న స్వరంతో...
శ్రీ రాధావల్లభ నామ కో, లేత మిటత సబ దోష!
హిత హరివంశ యహ కహత హైం, ప్రేమ బఢత సంతోష!!
భావం: "శ్రీ రాధావల్లభ" నామస్మరణతో దోషాలు తొలగి, హృదయంలో ప్రేమ పెరుగుతుంది.
"రాధావల్లభా!... నా ప్రాణవల్లభా!... ఇన్నాళ్లకు నీ దర్శనభాగ్యం ప్రసాదించావా!" అని పలికాడు.
ఆత్మదేవుడు మౌనంగా ఆ దృశ్యాన్ని చూస్తూ నిలిచిపోయాడు.
తాను ఎన్నో సంవత్సరాలుగా సేవించిన ఆ దివ్యమూర్తి...
తన నిజమైన సేవకుణ్ణి చేరుకున్నదని అతని హృదయం గ్రహించింది.
కొద్దిసేపటి తరువాత ఆత్మదేవుడు మెల్లగా మాట్లాడటం ప్రారంభించాడు.
"స్వామీ... ఈ మూర్తి సాధారణ విగ్రహం కాదు. ఇది పరమశివుని మనోమూర్తి.
నికుంజవనంలో రాధామాధవుల నిత్యలీలలను ధ్యానిస్తూ పరమశివుడు పరమానందంలో మునిగిపోయినప్పుడు...
ఆ దివ్యప్రేమరసమే ఈ మూర్తిగా అవతరించింది.
అందుకే...
ఈ శ్రీమూర్తిలో శ్రీకృష్ణుడు మాత్రమే కాదు...
శ్రీరాధా–కృష్ణుల అవిభాజ్య ప్రేమతత్త్వం సాక్షాత్కారమై ఉంది.
తరతరాలుగా మా వంశంలో ఈ మూర్తిని ఆరాధిస్తున్నాము.
కానీ...
నా మనస్సులో ఎప్పుడూ ఒక భావన కలిగేది.
'ఈ మూర్తికి తగిన నిజమైన సేవకుడు ఇంకెవరో వస్తారు.'
ఈరోజు...
మిమ్మల్ని చూసిన క్షణంలోనే...
ఆ సందేహం తొలగిపోయింది."
హరివంశ మహాప్రభువు వినయంగా తలవంచాడు.
"ఆత్మదేవా!
నేను సేవకుణ్ణి మాత్రమే.
యజమాని ఆమె...
ఆమెయే సర్కార్...
ఆజ్ఞ ఆమెది...
జరుగుతున్నది కూడా ఆమె సంకల్పమే."
ఆ రాత్రి...
ఆత్మదేవునికి మళ్లీ ఒక దివ్యస్వప్నం కలిగింది.
సువర్ణకాంతులతో ప్రకాశిస్తున్న నికుంజవనంలో...
రాధారాణి చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యారు.
"ఆత్మదేవా...
హరివంశుడు నా నిత్యపార్షదుడు.
నీ ఇంట ఉన్న రాధావల్లభుడు ఇక నుండి అతని సేవను స్వీకరించాలి.
నీకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
వారిని కూడా నా సంకల్పానుసారంగా హరివంశునికి వివాహం చేయుము.
ఇది లౌకిక నిర్ణయం కాదు...
నా సేవాపరంపర కొనసాగడానికి నేను ఏర్పరచిన దివ్యవ్యవస్థ." అని ఆమె మృదువుగా పలికారు ఆ మాటలు వినపడగానే... ఆత్మదేవుడు ఆనందభాష్పాలతో నమస్కరించాడు.
మరుసటి ఉదయం...
ఆత్మదేవుడు తన స్వప్నాన్ని హరివంశ మహాప్రభువుకు వినిపించాడు.
హరివంశుడు కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు.
తరువాత కన్నులు మూసుకుని రాధానామాన్ని స్మరించాడు.
ఆ క్షణంలో...
అంతరంగంలో అదే దివ్యవాణి వినిపించింది "హరివంశా! నీకు ముందే చెప్పానుకదా? ఇది నా సంకల్పం. కన్యలను స్వీకరించు."
ఆయన వినయంగా అంగీకరించాడు.
శుభముహూర్తంలో...
వేదఘోషల మధ్య...
బ్రజవాసుల ఆనందహర్షధ్వానాల నడుమ...
ఆత్మదేవుని ఇద్దరు కుమార్తెలతో హిత హరివంశ మహాప్రభువుకు వివాహం జరిగింది.
అది కేవలం రెండు కుటుంబాల కలయిక కాదు.
రాధాసేవా పరంపరను నిలబెట్టడానికి జరిగిన ఒక దివ్యసంకల్పం.
వివాహానంతరం...
ఆత్మదేవుడు దేవుడిగృహంలోకి వెళ్లి...
ఎన్నో సంవత్సరాలుగా తాను కన్నీళ్లతో సేవించిన శ్రీ రాధావల్లభ మూర్తిని చేతుల్లోకి తీసుకున్నాడు.
అతని చేతులు వణుకుతున్నాయి.
కళ్లలో ఆనందమూ...
విరహమూ...
రెండూ కలిసిపోయాయి.
ఆ మూర్తిని హరివంశ మహాప్రభువు చేతుల్లో ఉంచుతూ ఇలా అన్నాడు—
"స్వామీ... ఈనాటి నుండి ఈయన నా రాధావల్లభుడు కాదు... మీ రాధావల్లభుడు. నిజానికి... మనందరికీ యజమాని ఆయనే.
నేను చేసిన సేవను మీరు కొనసాగించండి."
హరివంశ మహాప్రభువు ఆ దివ్యమూర్తిని హృదయానికి హత్తుకున్నాడు.
ఆయన కళ్లనుండి జారిన కన్నీటి బిందువులు...
రాధావల్లభుని పాదాలపై పడ్డాయి.
ఆయన గొంతు గద్గదమైంది.
"ప్రభూ...
నన్ను ఎన్నుకున్నది నా యోగ్యత కాదు.
రాధమ్మ కృప.
ఈ దేహం ఉన్నంతవరకు...
నీ సేవే నా శ్వాస."
జుగల కిశోర చరన కీ సేవా, యహీ మోరీ ఆస|
హిత హరివంశ సదా కహై, ఔర న కఛు విశ్వాస||
భావం: రాధా-కృష్ణుల యుగళసేవే జీవిత లక్ష్యం.
కొద్ది రోజుల తరువాత...
హిత హరివంశ మహాప్రభువు...
తన కుటుంబ సభ్యులతో కలిసి...
శ్రీ రాధావల్లభుని హృదయానికి హత్తుకొని...
బృందావనానికి బయలుదేరాడు.
మార్గమంతా ఆయన నోట ఒకటే నామం—
"రాధే... రాధే..."
ఆ నామం వినిపించిన చోటల్లా...
ప్రజలు చేతులు జోడించి నమస్కరించేవారు.
కొంతమంది కూడా తెలియకుండానే...
ఆ నామాన్ని జపించడం ప్రారంభించేవారు.
రాధానామం...
ఒక హృదయం నుంచి మరొక హృదయానికి...
దీపం నుంచి మరో దీపం వెలిగినట్లు వ్యాపిస్తోంది.
చివరికి...
యమునమ్మ తీరాలు కనిపించాయి.
గోవర్ధనగిరి శిఖరాలు కనువిందు చేశాయి.
కదంబవనాల సువాసనలు గాలిలో తేలాయి.
హరివంశ మహాప్రభువు బృందావన భూమిలో మొదటి అడుగు పెట్టగానే...
ఆయన మోకాళ్లపై కూర్చున్నాడు.
రెండు చేతులతో ఆ పవిత్రధూళిని తీసుకొని తన శిరస్సుపై చల్లుకున్నాడు.
కన్నీళ్లు ఆగడం లేదు...
ఆనందంతో కంపిస్తున్న స్వరంతో
"అమ్మా రాధే!
నీ అడుగులు తాకిన ఈ ధూళి నేడు నా నుదుటిని తాకింది.
ఇక నా జన్మ ధన్యమైంది.
ఈ బృందావనంలో ప్రతి రేణువూ ...
ప్రతి వృక్షమూ
ప్రతి తీగా, ఆకూ, పువ్వు...
వీచే గాలీ అన్నీ అంతా నీ నామమే నీ స్వరూపమే..." అన్నాడు
అక్కడున్న బ్రజవాసులు ఆ దృశ్యాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు.
"ఈ మహాత్ముడు సాధారణ యోగి కాదు... రాధమ్మ స్వయంగా పంపించిన మహాపురుషుడు..." అని పరస్పరం చెప్పుకున్నారు.
కుంజ భవన మేం ఆజు బిరాజత, రాధా సంగ శ్యామ|
హిత హరివంశ నిహారత రహ్యో, పులకిత భయో ధామ||
భావం: నికుంజంలో రాధా-శ్యాములు విరాజిల్లుతున్న దివ్యదర్శనం భక్తుని హృదయాన్ని పులకింపజేస్తుంది.
(తరువాయి భాగం.... రేపు)
జై రాధే! జై శ్యామ్!
రాధే! రాధే!
No comments:
Post a Comment