Pages

Saturday, June 20, 2026

బృందావన కథలు – 20 (కదంబవృక్షం చెప్పిన ప్రేమకథ)

జై రాధే! జై శ్యామ్!

బృందావనం…
అది ఒక ప్రదేశం కాదు…
అది ప్రేమ శ్వాసించే లోకం...
ప్రతి వృక్షం ఒక గోపికలా నిలుస్తుంది…
ప్రతి పువ్వు ఒక ప్రేమలేఖలా వికసిస్తుంది…
అక్కడ గాలి కూడా “రాధే… రాధే…” అని జపిస్తుంది.
యమునా అలలు కూడా “శ్యామ్… శ్యామ్…” అని గానం చేస్తాయి.
యమునా తీరం…
సాయంత్రపు మబ్బులు బృందావనాన్ని నీలిరంగు ముసుగుతో కప్పుకున్న వేళ…
వాయువులో మల్లెల పరిమళం తేలుతూ ఉంది...
వేణుగాన స్వరాలు దూరాన్నుంచి అలలలా వచ్చి వృక్షాల కొమ్మలను తాకుతున్నాయి...
ఆ యమునా ఒడ్డున ఒక పురాతన కదంబవృక్షం నిలిచి ఉంది!
అది సాధారణ చెట్టు కాదు…
రాధా కృష్ణుల ప్రతి చూపుకూ, ప్రతి చిరునవ్వుకూ, ప్రతి మౌనానికీ సాక్షిగా నిలిచిన ప్రేమసాక్షి!
ఎన్నో వేల సంవత్సరాలుగా అది అక్కడే నిలబడి ఉంది.
వర్షాలు వచ్చాయి…
గాలులు వీచాయి…
యమునా ప్రవాహం మారింది…
కాని ఆ చెట్టు గుండెలో మాత్రం ఒకే జ్ఞాపకం ఎప్పటికీ పచ్చగా నిలిచింది, adE "రాధా మాధవుల ప్రేమ" - "కృష్ణ రాసలీలలు"
ఒకరోజు యమునమ్మ అలలు ఆకదంబ వృక్షాన్ని చూసి మెల్లగా కదులుతూ “ఓ కదంబమా… నువ్వెందుకు ఎప్పుడూ ఇలా పులకించి ఉంటావు?” అని అడిగాయి
అప్పుడు కదంబవృక్షం తన ఆకులను కొద్దిగా కదుపుతూ సన్నగా నవ్వింది.
“నా కొమ్మలపై నిలబడి, పడుకొని
శ్యామసుందరుడు వేణువు ఊదాడు,
నా నీడలో రాధారాణి తన మనసును దాచుకుంది,
వాళ్లిద్దరూ నన్ను ఆనుకుని కూర్చున్నారు,
నా చుట్టూ తిరుగుతూ ఆడుకున్నారు,
విరహం భరించారు... ప్రేమించుకున్నారు,
గోపికలంతా ఇక్కడచేరి గోవిందునితో రాసలీలలాడారు,
అన్నిటికీ నేను సాక్షిని,
ఆ మధుర జ్ఞాపకాలలో జీవిస్తుంటాను,
అందుకే నా ప్రతి ఆకు ప్రేమగీతం పాడుతుంది…”
అంటూ తన జ్ఞాపకాల తలుపులు తెరిచింది
---
ఒక పౌర్ణమి సాయంత్రం…
వెండి వెలుగుతో యమునా మెరిసిపోతోంది.
యమునమ్మ నీలిరంగు చీర కట్టుకున్న వధువులా నెమ్మదిగా ప్రవహిస్తోంది.
ఆకాశమంతా వెండి మబ్బులు తేలుతున్నాయి.
మల్లెల పరిమళం గాలిలో కలిసిపోయింది.
గోకులం నిశ్శబ్దంగా ఉంది.
నావద్దకు చేరిన గోపికల కళ్లలో ఆత్రుత.
దూరంగా వాయువులో మురళీనాదం.
ఆ స్వరం వినగానే,
నా ఆకులన్నీ ఒక్కసారిగా కంపించాయి.
ఎందుకంటే ఆ స్వరం ఎవరిదో నాకు తెలుసు...
అప్పుడు కృష్ణుడు వచ్చాడు…
నీలమేఘ శ్యాముడు…
తలపై నెమలిపింఛం…
అధరాలపై చిరునవ్వు…
కళ్లలో చిలిపి చంద్రకాంతి…
చేతిలో వేణువు...
కృష్ణుడు నా దగ్గరికు నడిచి వచ్చాడు,
నా కొమ్మను ఆనుకుని నిలబడ్డాడు.
ఆ స్పర్శ తగిలిన క్షణంలో నా వేర్లనుంచి - చిటారుకొమ్మ చిగురాకు వరకూ అమృతం ప్రవహించినట్లైంది.
వేణువును పెదవులకు చేర్చిన క్షణంలో…
బృందావనం అంతా ఒక కొత్త ప్రాణం పోసుకున్నట్లు ప్రకాశించింది.
ఆ స్వరాలు వినగానే...
ఆహాఁ!
అది సంగీతం కాదు…
అది ప్రేమకు రూపం కల్పించిన మధురమైన రాగం...
ఆ స్వరం వినగానే యమునమ్మ అలలు ఆగిపోయాయి…
చంద్రుడు మబ్బుల వెనుకనుంచి తొంగిచూశాడు…
గాలే మత్తెక్కినట్టు నెమ్మదిగా వీచింది…
వెన్నెలలో వికసించిన తెల్ల కలువలా…
మల్లెల పరిమళంలా…
కన్నుల్లో అనంతమైన ప్రేమతో…
రాధారాణి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆమె అడుగులు నేలను తాకుతున్నాయో లేదో కూడా తెలియలేదు.
ఆమె వచ్చి నా నీడలో నిలిచింది,
శ్రీకృష్ణుడు చిరునవ్వుతో చూశాడు.
ఆ చూపు…
అది మాట కాదు…
అది వేదం కాదు…
అది మంత్రం కాదు...
అది ప్రేమకు అర్థం చెప్పలేని మౌనసంగీతం.
ఆ చూపు…
అది రెండు కళ్ల కలయిక కాదు…
అది రెండు ఆత్మలు ఒకటైపోయిన క్షణం.
రాధా మెల్లగా తలవంచింది.
ఆమె చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి.
ఆమె జడలోని మల్లెలు జారిపడి నా వేర్లపై పడ్డాయి.
ఆ రోజు నుంచి నా వేర్లలో కూడా ప్రేమ పరిమళిస్తోంది.
---
కొన్నిసార్లు ఇద్దరూ నా చుట్టూ తిరుగుతూ చిలిపిగా మాటలాడేవారు.
కృష్ణుడు నా కొమ్మల వెనుక దాక్కుని రాధను ఆటపట్టించేవాడు.
“రాధే! నన్ను కనుక్కోగలవా?” అని నవ్వుతుండగా
రాధారాణి కోపంగా నటిస్తూ “కాన్హా! చాలింక బయటకు రా… నీ వేణువు నిన్ను దాచలేదు!” అనేది.
కానీ ఆమె కోపంలో కూడా ప్రేమే ఉండేది.
అతని చిలిపితనంలో కూడా ఆరాధనే ఉండేది.
అప్పుడు గాలి కూడా నవ్వేది…
నా ఆకులు కూడా సంతోషంగా ఊగేవి…
---
ఒకసారి రాధారాణి అలిగింది.
కృష్ణుడు ఆలస్యంగా వచ్చాడు.
రాధ వచ్చి నా కింద కూర్చుంది.
ఆమె కళ్లలో విరహం నిండిపోయింది.
ఆ విరహపు కన్నీటి చుక్కలు నా వేర్లపై పడ్డప్పుడు
నా గుండెలో ఏదో విరిగినట్టు అనిపించింది.
కొద్దిసేపటికి కృష్ణుడు వచ్చాడు, మాట్లాడలేదు.
నిశ్శబ్దంగా వచ్చి రాధ పాదాల దగ్గర కూర్చున్నాడు.
తర్వాత తన వేణువులో ఒక మృదువైన రాగం పలికించాడు.
ఆ రాగం వినగానే రాధ కళ్లలోని అలక వెన్నలా కరిగిపోయింది.
ఆమె మెల్లగా “శ్యామా… నీ వేణుగానంలో ఏముంది? ఎందుకు నాకోపం కూడా దానిముందు నిలువలేకపోతోంది?" అని అడిగింది.
అప్పుడు కృష్ణుడు నవ్వుతూ “రాధే… నీ ప్రేమ ముందు నేనూ ఓడిపోయినవాడినే కదా…” అని అన్నాడు
ఆ మాట విన్న క్షణంలో నా కొమ్మలన్నీ పూలతో నిండిపోయాయి. నిట్టనిలువునా పులకించిపోయాను...
---
రాసలీల రాత్రుల్లో..
అవి మాటల్లో చెప్పలేని దివ్య క్షణాలు...
నా కొమ్మలపై చంద్రకాంతి జారుతూ ఉండేది.
గోపికల నూపుర ధ్వనులు గాలిలో తేలేవి.
కృష్ణుడు ప్రతి గోపికతో నృత్యం చేస్తున్నా
ఆయన చూపు మాత్రం రాధపై నిలిచి ఉండేది.
ఎందుకంటే —
“రాధా హృదయం లేకుండా
కృష్ణుడి వేణువుకు స్వరం లేదు…”
“రాధ లేకుండా కృష్ణుడు సంపూర్ణుడు కాదు…
కృష్ణుడు లేకుండా రాధకు శ్వాస లేదు…”
ఆ రాత్రుల్లో నా ఆకులన్నీ తాళం వేస్తూ ఊగేవి.
యమునమ్మ అలలు కూడా నృత్యం చేసేవి.
చంద్రుడు కూడా ఆ లీల చూడటానికి కదలకుండా నిలిచిపోయేవాడు
---
కాలం గడిచింది…
ద్వాపరయుగం ముగిసింది…
కృష్ణుడు మథురకు వెళ్లిపోయాడు…
ఆ రోజు బృందావనం ఏడ్చింది.
యమునమ్మ అలలు నిశ్శబ్దమయ్యాయి.
నా ఆకులు గాలికి కూడా కదల్లేదు
ఆ రోజు గోపికలు, సఖులతో సహా రాధారాణి నెమ్మదిగా నా దగ్గరకు వచ్చింది.
ఆమె కళ్లలో యమునానది అంత లోతైన విరహం.
ఆమె నా కొమ్మను హత్తుకుని మెల్లగా ఏడ్చింది.
“ఓ కదంబమా… ఇక ఈ నీడలో వేణుగానం వినిపించదా?”
నేను సమాధానం చెప్పలేక నిశ్శబ్దంగా నిలిచిపోయాను.
ఎందుకంటే ఆ రోజు గాలి కూడా ఏడ్చింది…
యమునమ్మ అలలు కూడా నిశ్శబ్దమయ్యాయి…
కానీ అప్పుడే నాకు ఒక సత్యం తెలిసింది...
కృష్ణుడు బృందావనం విడిచిపెట్టలేదు…
ఆయన రాధ హృదయంలోనే నిలిచిపోయాడు.
అందుకే నేటికీ,
ఎవరైనా “రాధే… రాధే…” అని పిలిస్తే
నా ఆకులు పులకరిస్తాయి…
యమునా అలలు చిరునవ్వు నవ్వుతాయి…
వేణుగానం గాలిలో మళ్లీ వినిపిస్తుంది…
ఎందుకంటే
"రాధాకృష్ణుల ప్రేమ కథ కాదు… అది బృందావన శ్వాస…
రాధాకృష్ణుల ప్రేమ కథ కాదు… అది శ్వాస… అది భక్తి… అది ఎన్నికాలాలకూ చెదరని దివ్యానురాగం"
-----
రాధే రాధే
“కదంబ నీడలో మొదలైన ఆ ప్రేమ
కాలాన్ని దాటి నేటికీ పరిమళిస్తుంది…
రాధా నామం పలికిన ప్రతి హృదయంలో
కృష్ణుడి వేణువు ఇంకా మ్రోగుతూనే ఉంది…”
జై రాధే కృష్ణ
-శంకరకింకరః

No comments:

Post a Comment