జై రాధే! జై శ్యామ్!
జై బృందావన రాధా మదనమోహన్
బృందావనంలో భక్తులకు, సాధుసంతులకు తెలుసు...
"భగవంతుడు భోగాన్ని కాదు... భక్తుని ప్రేమకై వెంపర్లాడతాడు."
ఈ మాటకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన ఒక అద్భుత సంఘటన చూద్దాం ఇవాళ.
పదహారో శతాబ్దంలో ఉన్నతోద్యోగిగా తన జీవితం మొదలు పెట్టి... కృష్ణుడికోసం అన్నీ వదిలి మధూకరం చేసి జీవనం సాగించిన మారిన మహాత్ముడు "సనాతన గోస్వామి" ఒకప్పుడు రాజసభలో ఉన్నతోద్యోగిగా ఉండేవాడు.
ధనం...
అధికారం...
ప్రతిష్ఠ...
అన్నీ ఉన్నాయి.
కానీ అతని హృదయం మాత్రం ఎప్పుడూ శ్రీ కృష్ణుణ్ణే కోరుకుంటుండేది.
ఓ సమయంలో అన్నీ వదిలేశాడు.
రాజభవనాలు వదిలాడు.
సంపదలు వదిలాడు.
గౌరవాలు వదిలాడు.
బృందావనానికి వచ్చి చిన్న ద్వాదశాదిత్య కొండ అనే చిన్న కొండపై ఒక మట్టి ఇల్లు కుటీరంలా కూర్చుకొని నివసించడం ప్రారంభించాడు.
అక్కడ శ్రీ కృష్ణుడి ముని మనవడౌన వజ్రనాభుడు పూజించిన శ్రీ కృష్ణమూర్తిని, పురుషోత్తమ చౌబే అనే బ్రాహ్మణుడు సనాతన గోస్వామికి ఇచ్చి ఆ మూర్తి నిత్యసేవ కొనసాగించమని చెప్పారు.
సనాతన గోస్వామి బృందావనంలో తాను ఉండే ఆ మట్టి ఇంట్లోనే ఉంచి సేవ చేసేవాడు. తన సంపదలూ, పరపతీ అన్నీ వదిలేసి సాధు జీవితం జీవిస్తూంనే మదనమోహనుని సేవ చేసేవాడు.
ప్రతిరోజూ యమునాతీరంలో గ్రామంలోకి వెళ్లి మధుకరి (భిక్ష) తెచ్చుకునేవాడు.
కొన్ని ఇళ్లలో ఒక పిడికెడు పిండి దొరికేది.
మరికొన్ని ఇళ్లలో కొద్దిగా గోధుమలు లేదా బియ్యం దొరికేవి... అంతే. ఎక్కువ కావాలని ఆశపడకుండా ఆ రోజుకు సరిపోయేంత తెచ్చుకునేవాడు.
కుటీరానికొచ్చి, సాయంత్రం కర్రలు వెలిగించి వాటితో చిన్న చిన్న రొట్టెలు చేసేవాడు.
అవి కూడా చాలా గట్టిగా ఉండేవి.
ఉప్పు లేదు...
నెయ్యి లేదు...
ఆధరువుగా కూరాలేదు, పప్పూ లేదు.
వాటినే ఎంతో ప్రేమగా తన మదనమోహనుడికి భక్తితో సమర్పించేవాడు. తానూ అవే తినేవాడు.
"ప్రభూ! నా దగ్గర ఇదొక్కటే ఉంది. ప్రేమతో చేశాను. స్వీకరించు." అని ప్రార్థించేవాడు.
అలా కొన్ని రోజులు గడిచాయి.
ఒక రాత్రి...
సనాతన గోస్వామికి ఒక అద్భుతమైన కల వచ్చింది.
మదనమోహనుడు చిన్న బాలుడిలా వచ్చి నిలబడ్డాడు.
ముత్యాల సరాలతో తలపాగా...
దానిమీద అందాల నెమలిపించం కుచ్చు...
తలపాగా చివర్లనుంచు బయటకి వేలాడి ఊగుతున్న గిరజాల జుట్టు..
నుదుటిపై పత్రలేఖ మధ్యలో కస్తూరి తిలకం...
గుండ్రని నేరేడు పళ్ళలాంటి కళ్ళు.
మురళి లాంటి ముక్కు,
శ్వాసలో ఊగుతున్న ముత్యం...
పెదవుల మీద చిరునవ్వు.
కళ్లలో చిలిపితనం.
"సనాతనా! ఓ సనాతనా!" అని పిలిచాడు.
"ఏమిటి ప్రభూ?" అని గోస్వామి వినయంగా అడిగాడు.
మదనమోహనుడు పెదవి విరిచాడు, గారాలుపోతూ " ఏమిటి సనాతనా! ప్రతిరోజూ ఈ రుచీ పచీలేని రొట్టెలేనా? కూరలేకపోతే కనీసం ఉప్పుకూడా లేకుండానా? కొంచెం ఉప్పు వేయలేవా?" అని చిన్న పిల్లాడిలా గోముగా అడిగాడు.
సనాతన గోస్వామి ఒక్కసారిగా నవ్వాడు.
ఆ నవ్వులో ప్రేమ ఉంది.
ఆ నవ్వులో భక్తి ఉంది.
ఆ నవ్వులో వైరాగ్యం ఉంది.
చేతులు జోడించి "ప్రభూ! నేడు ఉప్పు అడుగుతున్నావు. రేపు నెయ్యి అడుగుతావు. ఎల్లుండి కూరలడుగుతావు, ఆతరవాత మిఠాయిలు అడుగుతావు. ఆపై ఛప్పన్ భోగ్ అడుగుతావు. నేను అన్నీవదిలిన విరాగిని, పేద మధూకరిని. నీ కోరికలు తీర్చలేను." అని అన్నాడు...
మదనమోహనుడు చిన్నపిల్లాడు తాతగారి దగ్గర మారాం చేస్తున్నట్లుగా బుంగమూతి పెట్టుకున్నాడు...
అది చూసి సనాతన గోస్వామి "నా దగ్గర ఉన్నది ప్రేమ మాత్రమే. అది సరిపోతే తిను. లేకపోతే ఉపవాసం ఉండు. నేనూ ఉపవాసం ఉంటాను" అన్నాడు, ఓ తాత మనవడి గారాన్ని సరిచేస్తున్నట్లు. అది విన్న మదనమోహనుడు పెద్దగా నవ్వి "సనాతనా! నీ వైరాగ్యంతో నువ్వు నన్ను ఓడించావు." అన్నాడు. సనాతన గోస్వామి కూడా నవ్వాడు.
తెల్లారింది సనాతన గోస్వామి తన మదనమోహనుడు సేవలో యథావిధిగా కాలం వెళ్లదీస్తున్నాడు.
ఆ రోజు నుండి... మదనమోహనుడు ఎప్పుడూ ఉప్పు గురించి మాట్లాడలేదట.
ఎందుకంటే...
ఆయనకు అర్థమైంది.
ఆ రొట్టెల్లో ఉప్పు లేదు.
కానీ...
ప్రేమ ఉంది... భక్తి ఉంది... పరమ వైరాగ్య సంపన్నమైన నివేదన అది.
అలా చాలా కాలం కొనసాగింది....
కొన్ని రోజుల తరువాతముల్తాన్ కు చెందిన కృష్ణ భక్తుడైన రామ్ దాస్ కపూర్ అనే ఒక ధనవంతుడైన వ్యాపారి యమునా నదిలో ప్రయాణిస్తున్నాడు. అకస్మాత్తుగా పడవ ఇసుకలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా కదల్లేదు.
స్థానికులందరూ ప్రయత్నించారు, అందులో ఒక నవ యువకుడన్నాడు... "అక్కడ ఎదురుగా కొండమీద మదనమోహనుడు ఉన్నాడు. ఆయనను ప్రార్థించు." అన్నాడు.
వ్యాపారి ఆర్ధ్రతతో "ప్రభూ! నా పడవను కాపాడు.నీ ఆలయాన్ని నిర్మించి నేను నీ సేవ చేసుకుంటాను " అని ప్రార్థించాడు.
అతి కొద్ది సేపట్లో... యమునలో నీరు వచ్చి, నీటి అలజడికి బురదలో కూరుకున్న పడవ కదిలి పైకి లేచింది. పడవ అద్భుతంగా కదిలింది, మామూలుగా ఏ ఇబ్బందీ లేకుండా!
స్థానికులు జై రాధా మదనగోపాల్ కీ జై! జై రాధామదనగోపాల్ కీ జై! అని నినదించారు, ఆ వ్యాపారి పడవ సరంగు కార్మికులు, సేవకులు అందరూ నినదించారు.. జై రాధా మదన గోపాల్ కీ జై... ఆ యువకుడు మెల్లగా జనం మధ్యలోకి వెళ్ళి కనపడకుండా పోవడం ఎవరూ గమనించలేదు.
వ్యాపారి ఆనందంతో ద్వాదశాదిత్య కొండాదగ్గరున్న సనాతన గోస్వామి కుటీరానికొచ్చి సనాతన గోస్వామికి జరిగినది వివరించి, తన మొక్కు గురించి చెప్పి గోవర్ధన కొండలా కానుకలు సమర్పించాడు. సనాతన గోస్వామి ఆధ్వర్యంలో అందమైన ఆలయం నిర్మించాడు. భోగాలు, నైవేద్యాలు ఏర్పాటుచేశాడు.
మదనమోహనుడికి కావాలసింది తన రొట్టెలో ఉప్పు కాదు...
తనకు నిత్యం సేవచేసే విరాగి సనాతన గోస్వామి పేదరికం తొలగడం.
భక్తుడు అడగడు.
కానీ భగవంతుడు చూసుకుంటాడు.
భక్తుడు చెప్పడు.
కానీ భగవంతుడు అర్థం చేసుకుంటాడు.
ఆ రోజు సనాతన గోస్వామి మదనమోహనుడి ముందు కూర్చొని "ప్రభూ! నేను నీకు ఉప్పు పెట్టలేకపోయాను. కానీ నా హృదయాన్ని పెట్టాను. ఇప్పుడిన్ని భోగాలు సేవకులు వచ్చారు... నన్నూ నారొట్టెలనూ మరచిపోకే... " అన్నాడట...
అప్పుడు మదనమోహనుడు మౌనంగా చిరునవ్వు నవ్వాడట. ఎందుకంటే...
మదనమోహనునికి ఉప్పు లేని రొట్టెను తినడం సులభం.
కానీ అంత ప్రేమతో నిండిన భక్తుల హృదయాన్ని పొందడం చాలా కష్టం.
భగవంతుడు భోగాల కోసం ఎదురు చూడడు.
భక్తి - ప్రేమ - జ్ఞానం - వైరాగ్యపూర్ణుడైన భక్తునికోసం ఆర్తితో కోసం ఎదురు చూస్తాడు.
"పత్రం పుష్పం ఫలం తోయం
యో మే భక్త్యా ప్రయచ్ఛతి..."
ప్రేమతో సమర్పించిన చిన్న కానుక కూడా భగవంతునికి అమూల్యమే! అత్యంత ప్రీతికరమే!
----
ఇప్పటికీ బృందావనంలో సనాతన గోస్వామి సమాధి స్థలం మదనమోహనుని అనుగ్రహవృష్టికి , సనాతన గోస్వామి నిరాడంబర భక్తికి సాక్షిగా కనపడుతూనే ఉంటుంది
జై శ్రీ మదనమోహన లాల్ కీ జై!
జై జై శ్రీ రాధే!
జై శ్రీ సనాతన గోస్వామి కీ జై!
No comments:
Post a Comment