జై రాధే! జై శ్యామ్!
కాలచక్రం నెమ్మదిగా ముందుకు సాగుతోంది...
దేవవనంలోని ఆ పవిత్ర గృహంలో పెరుగుతున్న ఆ బాలుడు సాధారణ బాలుడు కాదని అందరికీ కొద్దికొద్దిగా అర్థమవుతోంది.
పసితనంలోనే అతని ముఖంపై ఒక అపూర్వమైన ప్రశాంతత...
కళ్లలో చెప్పలేని కరుణ...
మాటల్లో మాధుర్యం...
చిరునవ్వులో దివ్యానందం...
వాటిని చూసినవారు,
"ఈ బాలుడు భగవంతుని ప్రత్యేక అనుగ్రహానికి పాత్రుడు" అని చెప్పుకొనేవారు.
చుట్టుపక్కల పిల్లలందరూ మట్టి బొమ్మలతో, గోళీలతో, చెట్లెక్కుతూ ఆడుకునేవారు.
కానీ...
హరివంశుడు మాత్రం అలాంటి ఆటల్లో పెద్దగా ఆసక్తి చూపేవాడు కాదు.
ఇంటిముందు తులసి చెట్టు దగ్గర చిన్నగా కూర్చుని...
కళ్లుమూసుకొని...
మెల్లగా...
"రాధే... రాధే... రాధే..."
అని జపించేవాడు.
ఆ నామం పలికిన ప్రతిసారీ...
అతని చిన్న ముఖం ఆనందంతో వికసించేది.
ఆ నామమే అతని శ్వాసగా మారిపోయింది.
ఒకరోజు గ్రామంలోని కొందరు వృద్ధ పండితులు అతన్ని గమనించేవారు, అతని భక్తికి ముచ్చటపడేవారు.
అతని వయస్సు చాలా చిన్నది.
కానీ నోట ఎప్పుడూ రాధానామమే.
వారిలో ఒకరు బాలుని చూసి ముచ్చటపడి "నాయనా! అందరూ 'కృష్ణ... కృష్ణ...' అని జపిస్తున్నారు. నీవేమిటి? ఎప్పుడూ 'రాధే... రాధే...' అంటున్నావు? శ్రీకృష్ణుని నామాన్ని ఎందుకు అంతగా జపించడం లేదు బాబూ?" అని అడిగారు.
హరివంశుడు మెల్లగా కళ్లుతెరిచాడు.
ఆ చిన్న ముఖంపై ఒక దివ్యమైన చిరునవ్వు.
వినమ్రంగా చేతులు జోడించి
"తాతయ్యా...
జాతి పువ్వు ఉన్నచోట పరిమళం ఉంటుంది.
పరిమళం ఉన్నచోట జాతి పువ్వు ఉంటుంది.
అలాగే...
'రాధా' అనే ఒక్క నామంలోనే కృష్ణుడు దాగి ఉన్నాడు.
రాధా కృష్ణులు వేర్వేరు కాదు.
రాధా నామాన్ని జపిస్తే...
కృష్ణుడు స్వయంగా ఆ నామంలో పలుకుతాడు." అన్నాడు
శ్రీరాధా చరణ కమల బిను, ఔర న మానూఁ ఠౌర!
హిత హరివంశ దాస కహై, యహీ జీవన ఠౌర!!
భావం: రాధాదేవి పాదపద్మాలే జీవితానికి పరమాశ్రయం.
ఆ మాటలు విన్న పండితులు ఒకరినొకరు చూసుకున్నారు.
ఇంత చిన్న వయస్సులో...
ఇంత గొప్ప తత్త్వాన్ని...
ఎవరు బోధించారు?
అనుకున్నారు... కానీ వారికి సమాధానం దొరకలేదు.
హరివంశుడు క్రమంగా యౌవనంలోకి అడుగుపెడుతున్నాడు.
వేదాలు అభ్యసించాడు.
శాస్త్రాలు నేర్చుకున్నాడు.
భాగవతాన్ని హృదయంగమం చేసుకున్నాడు.
కానీ...
అతని హృదయాన్ని పూర్తిగా ఆక్రమించింది మాత్రం రాధానామమే.
ఆతను తరచూ
"వేదాలు జ్ఞానాన్ని ఇస్తాయి.
శాస్త్రాలు మార్గాన్ని చూపుతాయి.
కానీ రాధానామం...
నేరుగా ప్రేమను మధుర భక్తిని ఆ పరాత్పరుణ్ణి ప్రసాదిస్తుంది. అదే రాధానామ మాధుర్యం " అని చెప్పేవారు
ఆ మాటలు వినగానే కథాకాలక్షేపానికి వచ్చిన భక్తుల హృదయాలు కరిగిపోయేవి.
ఒక రాత్రి...
శరద్ పౌర్ణమి.
ఆకాశంలో పూర్ణచంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు.
దేవవనం నిశ్శబ్దంగా నిద్రిస్తోంది.
హరివంశుడు ధ్యానంలో మునిగిపోయాడు.
అప్పుడే...
అతని ముందు ఒక దివ్యప్రకాశం...
ఆ ప్రకాశంమధ్యలో...
వేల చంద్రుల కాంతికంటే మృదువైన దివ్యసౌందర్యంతో...
శ్రీరాధారాణి ప్రత్యక్షమయ్యారు.
ఆమె కన్నుల్లో అనంతమైన వాత్సల్యం.
ఆమె చిరునవ్వులో అపారమైన కరుణ.
"హరివంశా...
సమయం ఆసన్నమైంది.
బృందావనానికి రా.
నా నికుంజలీలను...
నా ప్రేమరహస్యాన్ని...
నా కృపామహిమను...
ప్రపంచానికి తెలియజేయవలసిన బాధ్యత నీది." మృదువుగా ఇలా పలికారు.
ఆ దివ్యమైన వాక్కులు వినగానే...
హరివంశుని కళ్లలో ఆనందబాష్పాలు పొంగిపోయాయి. శరీరం పులకరించింది... వెంటనే లేచి సాష్టాంగపడ్డాడు.
"అమ్మా! కింకరుణ్ణి, నీ ఆజ్ఞే నా జీవితం." అని వినమ్రంగా అన్నాడు.
రాధారాణి చిరునవ్వుతో మళ్లీ "హరివంశా! నీవు బృందావనానికి వెళ్లే మార్గంలో ఒక మహాభాగవతుడిని కలుస్తావు. అతని పేరు ఆత్మదేవుడు. అతని ఇంట నేను నీకోసం ఒక అమూల్యమైన వరాన్ని దాచాను. నా సంకల్పం ప్రకారమే అన్నీ జరుగుతాయి. సందేహించకుండా అతని ఆతిథ్యాన్ని స్వీకరించు." అని చెప్పి... ఆ దివ్యరూపం క్రమంగా అంతర్ధానమైంది.
ఆతరవాత హరివంశుడు ఇంకా చాలాసేపు ధ్యానంలోనే ఉండిపోయాడు.
రాధా ముఖ చందా సమ, నయన కమల బిసాల!
అధర అరుణ అరవిన్ద సమ, మధుర మధుర ముస్కాన!!
భావం: రాధాదేవి ముఖచంద్రుడు, కమల నేత్రాలు, మధురస్మితం - ఇవన్నీ దివ్యసౌందర్యానికి పరాకాష్ఠ.
-------
ఒకానొక కాలంలో...
పరమశివుడు తన యోగసమాధిలో రాధామాధవుల నిత్యనికుంజలీలను దర్శించి పరమానందంలో మునిగిపోయాడు. ఆ దివ్యానుభూతి నుంచి ఆయన మనస్సులో ఒక అపూర్వమైన దివ్యమూర్తి అవిర్భవించింది.
అదే...
శ్రీ రాధావల్లభ మూర్తి.
ఆ మూర్తిలో శ్రీరాధాకృష్ణుల అవిభాజ్య ఏకత్వం ప్రతిఫలించింది.
అది కేవలం విగ్రహం కాదు...
ప్రేమకు రూపం.
మాధుర్యభక్తికి ప్రతీక.
రాధాకృష్ణుల నిత్య ఏకరస లీలలకు సాక్ష్యం.
ఆ దివ్యమూర్తిని పరమశివుడు ఒక మహాతపస్వికి ప్రసాదించాడని సంప్రదాయం చెబుతుంది.
ఆ తరువాత...
ఆ మూర్తి తరతరాలుగా పూజించబడుతూ చివరకు మహాభక్తుడైన ఆత్మదేవ బ్రాహ్మణుని ఇంటికి చేరింది.
ప్రతిరోజూ...
ఆత్మదేవుడు ఆర్తితో ఆ మూర్తిని సేవించేవాడు. అతనికి ఇద్దరు కూతుర్లు, మగసంతానం లేదు, అందువల్ల "ప్రభూ!
నీకు తగిన సేవకుడు వచ్చిన రోజున... నీవే అతని చేతికి వెళ్లాలి." అని ప్రార్థించేవాడు.
రాధారాణి ఆజ్ఞ ప్రకారం... హరివంశుడు బృందావన ప్రయాణం ప్రారంభించాడు.
అతని ప్రతి అడుగు... ఆజ్ఞానుసరణ.
ప్రతి శ్వాస... రాధానామమే.
మార్గమధ్యంలో... ఒకనాటి రాత్రి ఆయన ఆత్మదేవుడుండే గ్రామానికి చేరుకున్నాడు.
ఆత్మదేవుడు దూరం నుంచే హరివంశుణ్ణి చూశాడు.
ఒక్క క్షణంలోనే...
తాను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మహాత్ముడు ఇతడేనని అతని హృదయం చెప్పింది.
ఆనందంతో పరుగెత్తుకుంటూ వచ్చి, హరివంశుని రెండుచేతులూ పట్టుకుని.
"స్వామీ! మీ రాకకోసమే ఈ జీవితం ఎదురుచూస్తోంది." అన్నాడు.
హరివంశుడు ఆశ్చర్యపోయాడు.
"మీకు నా గురించి ఎలా తెలుసు?" అని అడిగాడు.
ఆత్మదేవుడు చిరునవ్వుతో
"నాకు తెలియదు స్వామీ...
కానీ ఆమెకు తెలుసు.
రాధారాణి చాలాకాలం క్రితమే ఈ రోజు గురించి సంకేతం ఇచ్చింది." అని చెప్పి...
ఆత్మదేవుడు తన ఇంటి దేవుడిగృహంలో ప్రతిష్ఠితమైన శ్రీ రాధావల్లభ మూర్తిని చూపించాడు.
ఆ దివ్యదర్శనం కలిగిన క్షణంలో...
హరివంశ మహాప్రభువు కళ్లనుండి ఆనందాశ్రువులు ధారగా ప్రవహించాయి.
ఆయన మౌనంగా నమస్కరించాడు.
ఆ క్షణంలో...
రాధారాణి సంకల్పం ఒక్కొక్కటిగా సాకారమవుతోంది.
(తరువాయి భాగం.... రేపు)
జై రాధే! జై శ్యామ్!
రాధే! రాధే!
– శంకరకింకరః
No comments:
Post a Comment