Pages

Wednesday, June 15, 2016

ద్రావిడ బ్రాహ్మణులు

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

      తెలుగునాట ఉన్న వివిధ బ్రాహ్మణ శాఖలలో ద్రావిడ శాఖ దాని చరిత్రకు సంబంధించి ప్రస్తుతం కొంత అస్తవ్యస్తమైన కథనాలు కనబడుతున్నాయి. అసలు విషయం తెలియని కొత్తతరం కొంత పాత తరంతోపాటు అపఖ్యాతితోకూడిన కథనాలను నిజమని నమ్మే ప్రమాదం ఉంది. ఐతే శోచనీయం ఏమంటే పెద్దలైనవారే తప్పుడు చరిత్రను తెలియక ప్రచారం సాగించడంలో ముందున్నారు. "ప్రమాదో ధీమతామపి" అని కదా ఆర్యోక్తి, బహుశా అది ఇక్కడ కూడా పని చేస్తున్నట్లున్నది.

      సరే విషయానికి వస్తే, చరిత్రపుటలనాధారం చేసుకుని తెలుగు బ్రాహ్మణుల చరిత్ర, వెలంగమాన్ అగ్రహారీకులకు సంబంధించి దొరికిన కొన్ని వ్యాసాలు, చరిత్ర అధారంగారాజరాజ నరేంద్రుని చరిత్ర, నన్నయభట్టారకుని మిత్రుడైన నారాయణభట్టుగారు మొదలైన అంశాలను పరిశీలించడం జరిగింది. ఆమేరకు లభించిన విషయాలని క్రోడీకరించి పంచే ప్రయత్నం ఇది.

ముందు అపప్రదలను దూరం చేసుకుని, తరవాత మనం మన్ పూర్వీకులు ఎవరో వారి వైభవమేమిటో వివరించే ప్రయత్నం చేస్తాను.
ద్రావిడులు రాక్షస జాతి - రావణ వంశం అనేది సాధారణంగా కొన్ని చోట్ల వినిపిస్తూ వస్తున్నది. అది నిజమే కాదు. విచారణ చేద్దాం.. నిజానికి రామాయణం ఎఱిగిన వారు ఎవరూ వ్యాఖ్య చేయరు. పుత్ర మిత్ర కళత్రాదులతో సహా రావణుడు రాముడిచేతిలో మరణించాడు. మిగిలింది విభీషణుడు అతని మంత్రులు, కుటుంబం ఒక్కటే. ఒకవేళ అలా అనుక్కున్నా విభీషణుడి వంశం అని అన్నా కాస్త గౌరవంగా ధార్మికుడి వంశం అని గొప్పగా చెప్పుకున్నారు అనుకునే అవకాశం ఉండేది. కానీ దిక్కుమాలిన రావణుడి వంశస్థులం అని చెప్పుకోవడం దారుణమైన స్థితి. అసలు రావణుడి వంశం మిగలనే లేదు. కాబట్టి రావణుడి వారసులం అనే ప్రసక్తే లేదు.

      భారతీయులను విడగొట్టి పాలించడం కోసం బ్రిటీషువారు పుట్టించి తీసుకువచ్చిన ఆర్య ద్రావిడ కాన్సెప్టుతో పాటు అప్పట్లో వారు లేవనెత్తిన శైవ వైష్ణవ మతాల గొడవలకి కలిపి సిద్ధాంతాన్ని కొందరు దక్షిణాత్యులకు ఔతరాహికులకు ఆపాదించి రుద్దడంలో మ్లేచ్ఛులు విజయం సాధించారు. దాని పర్యవసానంగా ద్రావిడులు (కేవలం తెలుగు ద్రావిడ బ్రాహ్మణులే కాదు దాక్షిణాత్యులందరినీ ద్రావిడులని పిలిచారు) అంటే దాక్షిణాత్యులు శ్రీలంకతో కలిపి ద్రావిడులనీ వారికి అధిపతి రావణుడనీ కొత్త చెత్త సిద్ధాంతాలు చేసారు. సాధారణంగా ఇటువేపు వారు అప్పట్లో శైవ మతానుయాయులెక్కువ కాబట్టి వాళ్లందరూ రావణ బ్రహ్మ వంశీకులని ఆపాదించుకున్నారు. దీనికి రావణుడు అనే ఋషి కూర్చిన మహన్యాసం (ఇప్పటికీ సింహభాగం రావణుడు రాముని చేత నిహతుడైన దశకంఠుడే అని నమ్ముతారు, ఒక వేళ నిజమైనా కాకున్నా మనకి అప్రస్తుతం) తో పాటు రావణుని శివభక్తితత్పరతను తోడు తెచ్చుకుని ద్రావిడులందరూ ప్రత్యేకంగా రావణవంశంవారు ముఖ్యంగా ద్రావిడ బ్రాహ్మణులు అని ఒక అపప్రదని గొప్పగా చెప్పుకోవడం జరుగుతోంది. అందులో నిజంలేదు. ద్రావిడ బ్రాహ్మణులు (ముఖ్యంగా తెలుగునాట ఉన్న ద్రావిడ బ్రాహ్మణులకి) పూర్వాపరాలు విచారణ చేద్దాం.


ద్రావిడ బ్రాహ్మణులు వైదిక నిష్ఠ కలిగి వేద సంపత్తి కలిగినవారు
      కావేరి నది ఒడ్డున తంజావూరు, కుంభకోణం పట్టణానికి దగ్గరలో కావేరి ఉత్తర తీరంలో ఉన్న వెలంగమాన్ అగ్రహారంలో ఉన్న కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు  దాదాపు 10 శతాబ్దాల క్రితం రాజ రాజ నరేంద్రుని కాలంలో తెలుగునాటికి చేరాయి వారిని గుర్తించడంకోసం ద్రవిడ (తమిళ /అరవ/దాక్షిణాత్య) దేశంనుంచి వచ్చారు కాబట్టి ద్రావిడులు అని పిలిచారు. సరే అంతకు ముందు వారెక్కడివారు అని విచారణ చేస్తే అంతకు ముందు 400/500 సంవత్సరాల క్రితం వారు సౌరాష్ట్ర దేశం నుండి అంతకు ముందు సరస్వతీ నదీ పరీవాహక ప్రాంతం నుండి వలస వచ్చారని చరిత్ర వ్యాసాల ద్వారా తెలుస్తున్నది. మన పూర్వీకులు బ్రాహ్మణులకుండవలసిన ముఖ్యమైన 6 లక్షణాలనూ పుణికి పుచ్చుకుని జీవనం సాగించేవారు. వేదాధ్యయనం - అధ్యాపనం, యజ్ఞం చేయడం - చేయించడం, దానం ఇవ్వడం - పుచ్చుకోవడం చేస్తూ వేదాధ్యయన అధ్యాపనంలో ఎక్కువ ఆసక్తి కనబరిచి కదులుతున్న నడుస్తున్న సరస్వతులవలె జీవించారు. సరస్వతీ నదీ ప్రాంతంనుండి విద్యనూ, జ్ఞానాన్ని పంచుతూ సౌరాష్ట్రమీదుగా కొన్నాళ్ళకు కావేరీ తీరం చేరి అక్కడ వాసం ఏర్పరచుకున్నారు. వారి వల్ల అక్కడం వేదం బ్రాహ్మణ్యం మరింత శోభాయమానంగా పరిఢమిల్లింది. ఇతర రాజ్యాలు రాజులు కూడా వారిని ఆహ్వానించేంతగా అనుష్ఠాన బలం వేదాధ్యయన అధ్యాపనం యజన యాజనాలు చేసేవారు. యజ్ఞాలు చేయించడంలో దిట్టలని పేర్గాంచారు.

      అలా ఎంతో కాలం గడిచాక, రాజమహేంద్రవరాన్ని పాలించే రాజ రాజ నరేంద్రుడు లుప్తమైన తన ధనాగారం నింపి ప్రజలరక్షణకూ, రాజ్యాలను గెలిచి కీర్తిని పొందడానికీ, ధనార్జనకై దండయాత్రలు చేసి ఇతరులను సామంతులుగా మార్చుకొని కప్పం పుచ్చుకునేవాడు అలా తంజావూరు రాజ్యంపైకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ముసలివాడైన రాజేంద్ర చోళుడు కయ్యంకన్నా వియ్యం మేలని తన కూతురిని రాజరాజ నరేంద్రునికిచ్చి వివాహం చేశాడు. ప్రతిగా రాజ రాజ నరేంద్రుడు మామూలు కానుకలు అడగలేదు. ఆయన కొంత ఆలోచించి అక్కడ రాజ్యం తిరిగి చూసి బ్రాహ్మణులను చూసి అబ్బురపడి తన రాజ్యంలోనూ అటువంటి వైదిక నిష్ఠ కల వారుండాలని కాంక్షించి "బ్రాహ్మణ భిక్ష"ను కోరాడు.

{ఐతే మరొక వృత్తాంతం ప్రకారం కేవలం 500 సంవత్సరాల క్రితం తంజావూరి పాలకులతో మనస్పర్థలు వచ్చి పద్దెనిమిది కుటుంబములు ర్యాలి గ్రామమునకు అటుపిమ్మటి మరికొన్ని గ్రామములలోనూ వసించారనీ, పెద్దాపురం రాజావారు వీరి వర్ఛస్సు, వైదిక నిష్ఠ ఎరిగి సంతోషపడి అగ్రహారాలిచ్చి అక్కడనే ఉండమన్నారనీ కథనం బహు ప్రాచుర్యంలో ఉన్నది. ఐతే చారిత్రక ఆధారాల ప్రకారం రాజ రాజ నరేంద్రుని కాలంలోనే వారు ఇక్కడకు వలసవచ్చారనేది సరిపోతున్నది.}

      వెంటనే రాజేంద్ర చోళుడు బిత్తరపోయి నేను నీకు కూతురితోపాటు సేవకులను పంపడం పరిపాటి కానీ బ్రాహ్మణులను అలా పంపలేను, వారిని శాసించలేను. వారికి నీ కోరిక చేరవేస్తాను ఎవరు నీ రాజ్యానికి వస్తే వారిని చేరదీయమని చెప్పడం జరిగింది. అలా రాజేంద్ర చోళుని మర్యాద కాపాడడానికీవైదిక ధర్మం పరిఢమిల్లాలనే ధార్మికమైన  రాజ రాజ నరేంద్రుని కోరికనూ మన్నించి 6 వంశాలకి చెందిన, 18 కుటుంబాలు 18 గోత్రీకులు బయలుదేరి రాజ రాజ నరేంద్రుని రాజ్యానికి చేరడం జరిగింది. అక్కడనుంచి ర్యాలి అగ్రహారం, పుదురు అగ్రహారం ఇలా ఇంకా కొన్ని చోట్ల కోనసీమలో  వసించారు.

      అప్పట్లో ద్రావిడులలో బాగా ఖ్యాతి పొందినవారు నారాయణ భట్టుగారు వారు రాజ రాజ నరేంద్రుని ఆస్థానంలో మంత్రిగా చేశారు నన్నయ్యభట్టారకుని మిత్రులు. భారతం తెనిగించడంలో నన్నయగారికి చేదోడు వాదోడుగా ఉండు సంస్కృత  భారత అనువాదం మరియు తెనిగించే విధంలో సహాయపడ్డారు. అయ్యగారి దగ్గర పనిచేశారు కాబట్టి ఆయన వంశస్థులు అయ్యగారి వారయ్యారు. ఉపాధ్యాయ వృత్తిని చేసినవారు ఉపాధ్యాయుల వారు, కంచినాథుడైన ఏకామ్రేశ్వరుని సేవించినవారు కంచినాథం వారయ్యారు. సోమయాగం చేసిన అయ్యగార్లు అయ్యలసోమయాజులైయ్యారు, దక్షిణగా వడ్లు, నూకలు పుచ్చుకునేవారు వడ్లమాని, నూకల అయ్యారు, గంటి వంటి ఊర్లలో స్థిరపడ్డవారు ఆయా ఊరి పేర్లతో పిలువబడ్డారు. వేదంలో నిష్ణాతులు వేదుల వారయ్యారుతెలుగులో అగ్రహారం తమిళంలో పెరియఊరు  అదే పేరూరయ్యింది. పెద్దింటివారు కాబట్టి పెరియ వారయ్యారు కాలక్రమంలో పేరి వారయ్యారు.. కాశీలో చదువుకొచ్చిన భట్టారకులు కాశీభొట్లవారయ్యారు. ఇలా సాగుతుండగా ముందొచ్చిన 18 కుటుంబాలవారి అనంతరం మరికొంతమంది వెనకొచ్చినవారు కొంత కాలం నల్గొండ జిల్లాలో పేరూరులో వాసం చేసి అట్నుంచి ఖాళీ చేసి గోదావరీ తీరం చేరారు. ఇందులో కాల క్రమేణా కొంత మంది ఆరామాలు / వనాలలో ఉండడం కోసం మరికొంత ముందుకి సాగారు. ఇందులో మళ్ళీ 3/4 తెగలుగా విడారు. వేషభాషలలో తెలుగుదనం మొత్తం జీర్ణమైనా అక్కడక్కడా కొంత తమిళ బ్రాహ్మణ సంప్రదాయాలు ఇంకా సజీవంగా కొనసాగుతూ ఉన్నాయి తెలుగు ద్రావిడ బ్రాహ్మణులలో...

          కానీ.... మన పూర్వీకులు ఉద్దేశ్యంతో దేశసంచారం చేశారో పరమ పావనమైన సరస్వతీ నదిని వదిలి , సౌరాష్ట్ర దేశం వదిలి, కావేరీ తీరం వదిలి గోదావరితీరం చేరారో ఉద్దేశ్యం లక్ష్యం మాత్రం కొనఊపిరితో మాత్రమే ఉంది. వేదవేదాంగాలు, శాస్త్రాధ్యయనం, యజన-యాజనాదులు, వైదిక నిష్ఠ చూసి పొంగి పోయి రాజ రాజ నరేంద్రుడు భిక్షగా మన పూర్వీకులని పొందాడో లక్ష్యం ఆయనకు నెరవేరి ఉండవచ్చుగాకకానీ ప్రస్తుతం ప్రత్యేకత మనకుండేదో అది మనలో లుప్తమైయ్యింది అనడంలో సందేహం లేదు... కించిత్ లజ్జతోనే వాక్యం వ్రాస్తున్నాను. ఏధర్మం చెప్పినా, శాస్త్ర ప్రమాణం చూపినా, వైదిక నిష్ఠ కలిగిన పూర్వీకుల వారసులమైన మనం పెక్కు చోట్ల  "మా ద్రావిళ్ళకిదిలేదు, అది లేదు అని చెప్పుకుంటూ శాస్త్రవిహితమైనవి వదిలేస్తూ మనకి అనుకూలమైనవి మాత్రమే ఆచరించే స్థితికి వచ్చాం... అది లేదు ఇది లేదు అని చర్చించి సిద్ధాంతీకరించే స్థితికొచ్చేసాం ధర్మ భ్రష్టత్వం, శాస్త్ర భ్రష్టత్వం కానిస్తున్నాం, కనీసం సంధ్యావందనం గాయత్రి స్వరంతో చెప్పే కుటుంబాలే వెతుక్కునే పరిస్థితి, అటువంటి వారు ఆచార్య వ్యవహారాలు నిర్థారిస్తున్న ప్రతుత పరిస్థితి ద్రావిడులది..." వేదమాత తిరిగి ద్రావిడ బ్రాహ్మణశాఖకు పునర్వైభవాన్ని అందించుగాక అని కోరుకుంటూ...

శ్రీ అయ్యగారి నాగేంద్ర కుమార్
శంకరకింకర
ఒక మామూలు ద్రావిడ బ్రాహ్మణుడు

12 comments:

  1. ద్రవిడ బ్రాహ్మణ వంశ వృక్షం ఈ లింక్ లో చూడండి
    https://kastephale.wordpress.com/2013/04/23/

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ, కీశే శ్రీ చిట్టిల్ల సుబ్బారాయుడుగారు వ్రాసిన ద్రావిడ చరిత్ర పరిశీలించాను. దానితోపాటు తెలుగు బ్రాహ్మణుల చరిత్ర గ్రంథాలు, వ్యాసాలు పరిశీలించి అందుట్లోని కొన్ని విషయాలు క్రోడీకరించి పైనిది వ్రాశాను... తెలిసీ తెలియని వారు రావణవంశం అంటే కడుపులో దేవేసిందనుక్కోండి...

      Delete
  2. Very original and informative. Poodipeddi Venuigopal Rao, Brahmapur

    ReplyDelete
  3. Are all Dravida families originally from Saurashtra?Thank you.

    ReplyDelete
  4. నాగేంద్రగారు…
    మీ ఆవేదనలో అర్దం ఉంది. నిజమే గాయత్రిని సస్వరంతో ఉచ్ఛరించేవారు ఈ రోజుల్లో చాలా తక్కువగా కనిపిస్తున్నారు. అలాగని నిష్టాగరిష్టులు లేకపోలేరు.

    అయలసోమయాజుల ఉమామహేశ్వర రవి (భువనానందనాధ)

    ReplyDelete
  5. నాగేంద్రగారు…
    మీ ఆవేదనలో అర్దం ఉంది. నిజమే గాయత్రిని సస్వరంతో ఉచ్ఛరించేవారు ఈ రోజుల్లో చాలా తక్కువగా కనిపిస్తున్నారు. అలాగని నిష్టాగరిష్టులు లేకపోలేరు.

    అయలసోమయాజుల ఉమామహేశ్వర రవి (భువనానందనాధ)

    ReplyDelete
  6. నాగేంద్ర గారు
    మీ ఆవేదన చాలా అర్థవంతమైనది బ్రాహ్మణుల లోనే ఒకరంటే ఒకరికి పడటం లేదు ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి స్వతంత్ర జీవనానికి అలవాటు పడ్డారు కుటుంబాల్లో నాలుగు మంచి మాటలు చెప్పే పెద్ద వారే కరువయ్యారు పోనీ స్వతంత్రించి చెబుదామంటే చాదస్తం అనుకుంటారు ఇంకా పిల్లలకి ఎలా తెలుస్తాయి

    ReplyDelete
  7. చాలా ఉపయోగకరమైన విషయం తెలియజేశారు సోదరా...

    ReplyDelete
  8. చాలా బాగుంది మా ఊరు ర్యాలీ గురించి వ్రాసారు...

    ReplyDelete