Pages

Friday, June 19, 2026

బృందావన కథలు - 18 (నెమలి పించం – రాధా నామం)

జై శ్రీరాధే! జై శ్రీకృష్ణ!

బృందావనంలోని యమునా తీరం…
సాయంత్రపు అరుణ కాంతులు యమునా అలలపై వెండి తరంగాల్లా మెరిసిపోతున్న వేళ…
ఆకాశమంతా నీలిమతో నిండిపోయి, మొదటి నక్షత్రాలు మెల్లగా వెలుగులు చిందిస్తున్నాయి.
యమునా తీరాన కదంబ, తామల వృక్షాలు గాలికి మృదువుగా ఊగుతూ, ఆ దివ్యసంధ్యకు స్వాగత గీతం పాడుతున్నట్లున్నాయి.
మందార, మల్లెల పరిమళాలతో గాలి మధురంగా నిండిపోయింది.
కదంబ వృక్షాల నీడలో గోపికల గానాలు మెల్లగా తేలుతున్నాయి.
ఆ మధుర వాతావరణంలో శ్రీకృష్ణుడు తన మురళిని ఆలపిస్తున్నాడు.
ఆ మురళీ నాదం వినగానే యమునా అలలు సైతం తమ ప్రవాహాన్ని నెమ్మదించాయి.
చుట్టూ ఉన్న జింకలు, నెమళ్లు, కోయిలలు పరవశంతో నిలిచిపోయాయి.
ఆ మురళీ నాదం వినగానే వృందావనంలోని ప్రతి ఆకూ పరవశిస్తోంది.
రాధారాణి ఆయన పక్కనే కూర్చొని, ఆ స్వరాల్లో తన హృదయాన్నే కలిపేసింది.
కృష్ణుడి తలపై మెరిసే నెమలి పించాన్ని చూస్తూ రాధమ్మ మృదువుగా నవ్వింది.
“కృష్ణా! నీ కిరీటంలో ఈ నెమలి పించం ఎప్పుడూ ఎందుకు ఉంటుంది? నీకు ఇది అంత ప్రియమా?”
కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు.
ఆ నవ్వులో రాధాప్రేమ యొక్క అనంతత్వం ప్రతిఫలించింది.
ఆ నవ్వులో యుగయుగాల ప్రేమ మెరిసింది.
ఆయన మెల్లగా అన్నాడు—
“రాధే… ఇది కేవలం అలంకారం కాదు… ఇది నా ప్రాణస్మరణ.”
రాధమ్మ ఆశ్చర్యంగా చూసింది. ఆమె కన్నులలో ప్రేమ, ఆశ్చర్యం, భక్తి అన్నీ కలిసిపోయి ఒక దివ్య కాంతిలా మెరిసాయి.
“నిర్జీవమైన ఈ పించం… నీ ప్రాణస్మరణమా?” అనడిగింది.
కృష్ణుడు మెల్లగా తన కిరీటంలోని నెమలి పించాన్ని తీసి రాధమ్మ చెవి దగ్గర ఉంచాడు. అంతే…
ఆ పించం లోనుండి మృదువైన, మధురమైన నాదం వినిపించింది “రాధే… రాధే… రాధే…”
ఆ శబ్దం వినగానే రాధమ్మ కళ్లలో విస్మయం పరచుకుంది.
ఆమెకు ఆ ధ్వని కేవలం శబ్దంలా అనిపించలేదు;
అది కృష్ణ హృదయం పలికిన ప్రేమమంత్రంలా అనిపించింది.
ఆమె హృదయం ఆనందంతో వణికిపోయింది.
ఆమె శరీరం పులకాంకురాలతో పులకించింది.
ఆమె తన కృష్ణుణ్ణి చూస్తూ సిగ్గులమొగ్గైంది.
కృష్ణుడు ప్రేమతో చెప్పసాగాడు
“రాధే! ఈ పించంలోని ప్రతి అణువు నీ నామాన్నే జపిస్తోంది. దీనికి ఒక అద్భుతమైన రహస్యం ఉంది…”
----
పూర్వం నందగావ్‌లో ఒక అందమైన నెమలి ఉండేది.
దాని రెక్కలు ఇంద్రధనుస్సులా మెరిసేవి.
ప్రతిరోజూ అది యమునా తీరాన ఒక చెట్టు కొమ్మపై కూర్చొని “కృష్ణా… కృష్ణా…” అని భక్తితో క్రేంకణాలు చేస్తూ ఆలపించేది.
ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు…
తామరలపై మంచుతుంపర్లు మెరిసే ప్రాతఃకాలం నుంచీ,
చంద్రకాంతులు విరిసే రాత్రివేళ దాకా…
వానైనా, గాలైనా…
దాని నాలుకపై కేవలం కృష్ణ నామమే ఉండేది.
“మురళీ గానమే నా శ్వాసయ్యా…
నీ నామమే నా జీవాధారం…”
కానీ…
రోజులు గడిచినా కృష్ణుడు దాని వైపు చూడలేదు.
నెమలి హృదయం బాధతో నిండిపోయింది.
దాని కన్నులలోని ప్రకాశం మసకబారింది.
కృష్ణుని దర్శనం కోసం తపించిన ఆ చిన్న హృదయం విరహాగ్నిలో కరిగిపోయింది.
“నేను ఇంత ప్రేమగా పిలుస్తున్నా… నా స్వామి ఎందుకు కరుణించదం లేదు?” అని కన్నీళ్లు పెట్టుకుంది.
ఆ సమయంలో అక్కడికి ఒక చిన్న మైనా పక్షి వచ్చింది.
“సోదరా! ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు?” అని మృదువుగా అడిగింది.
నెమలి తన బాధ అంతా చెప్పుకుంది.
మైనా చిరునవ్వు నవ్వి “నీకు తెలియదా? కృష్ణుణ్ని చేరాలంటే ముందుగా రాధమ్మ కృప కావాలి. రాధా అనుగ్రహం లేనిదే కృష్ణుడు దొరకడు.” అని అంది
ఆ మాటలు విన్న నెమలి ఒక్కసారిగా మేల్కొన్నట్లైంది.
ఇప్పటివరకు తాను కేవలం కృష్ణుని చేరాలని మాత్రమే కోరుకుందని,
కానీ కృష్ణ హృదయ ద్వారం రాధామాత చేతుల్లోనే ఉందని అది గ్రహించింది.
అది వెంటనే బర్సానాకు బయలుదేరింది.
బర్సానాలో రాధారాణి సన్నిధికి చేరిన నెమలి… ఈసారి “కృష్ణ” అని కాదు… కన్నీళ్లు కారుతుండగా ప్రేమతో... “రాధే… రాధే…" అని జపించడం ప్రారంభించింది.
ఆ పిలుపులో అహంకారం లేదు…
ఆర్తి మాత్రమే ఉంది…
ఆశ లేదు…
కేవలం శరణాగతి మాత్రమే ఉంది.
ఆ నామస్మరణ విన్న రాధారాణి హృదయం కరిగిపోయింది.
సాక్షాత్తు రాధమ్మ ప్రత్యక్షమై మృదువుగా “వత్సా! నీ భక్తి నన్ను ఎంతో మెప్పించింది. ఇప్పుడు నీవు తిరిగి నందగావ్‌కు వెళ్లు. కృష్ణుడు స్వయంగా నీ వద్దకు వస్తాడు.” అని పలికి నెమలిని తన చేతుల్లోకి తీసుకొని నిమిరి పంపింది
రాధమ్మ ఆశీర్వాదంతో నెమలి ఆనందాశ్రువులు కార్చింది.
ఆ కన్నీటి బిందువులు యమునా తీరంలోని ఇసుకపై పడగా, అవి సాక్షాత్తు భక్తి ముత్యాల్లా మెరిసాయి.
నందగావ్‌కు తిరిగి వచ్చిన నెమలి ఈసారి పరమానందంతో
“రాధే… రాధే… రాధా నామమే భక్తికి మార్గం… రాధా కృపలోనే కృష్ణ దర్శనం…” అని పాడసాగింది
అంతే!
ఇంతకాలం విననట్లు ఉన్న కృష్ణుడు… “రాధే” అన్న నామం వినగానే పరవశుడై అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు.
ఆయన ఆ నెమలిని తన హృదయానికి హత్తుకొని ప్రేమగా “ప్రియమైన నెమలీ! నాకు అత్యంత ప్రియమైన నామాన్ని నీవు ఆలపించావు. రాధా నామం వినగానే నేను నన్ను నేను మరిచిపోతాను.” అన్నాడు
అప్పుడే అక్కడికి రాధమ్మ వచ్చింది, కృష్ణుడి కన్నుల్లో ఆనందబాష్పాలు మెరిశాయి.
ఆ దివ్య క్షణంలో నెమలి పరవశంతో నాట్యం చేయసాగింది.
దాని ప్రతి అడుగులో ఆనందం ఉంది…
ప్రతి విరబూసిన రెక్కలో భక్తి ఉంది…
దాని రెక్కలు గాలిలో విరబూసి, భక్తి గంగలా ప్రవహించాయి.
రాధాకృష్ణుల ప్రేమస్వరూపాన్ని చూసి అది సంపూర్ణ భక్తిలో లీనమైంది. రాధాకృష్ణుల చుట్టూ నాట్యం చేస్తూనే ఉంది, ఆనందంతో ఎగురుతోంది, తిరుగుతోంది, పాటపాడుతోంది, పురి విప్పుతోంది...
చివరకు… అలసి పోయి తన ప్రాణాలనే రాధమ్మ చరణాల వద్ద సమర్పించింది.
ఆనక కృష్ణుడు ప్రేమతో ఆ నెమలి పించాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.
ఆయన కన్నుల్లో కరుణ మెరిసింది.
“నీ భక్తి యుగయుగాల పాటు స్మరణీయంగా ఉండాలి. ఇకనుంచి నీ పించం నా కిరీటంలో శాశ్వతంగా ఉంటుంది.”
అని చెప్పి ఆ పించాన్ని తన శిరస్సుపై అలంకరించుకున్నాడు.
అప్పటి నుండి…
ఆ నెమలి పించంలోని ప్రతి అణువు
“రాధే… రాధే…”
అనే నామాన్ని జపిస్తూనే ఉంది.
---
ఈ నెమలి కథ గుర్తు చేయగానే...
రాధమ్మ కన్నీటి కళ్లతో కృష్ణుణ్ని చూసి మృదువుగా
“కృష్ణా! లోకానికి నువ్వు మురళీ గానాన్ని వినిపిస్తావు… కానీ నీ హృదయంలో మాత్రం ఎప్పుడూ నా నామమే నిండివుంటుంది కదా!” అని పలికింది
కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు.
ఆ నవ్వులో ప్రేమ ఉంది…
భక్తి ఉంది…
రాధాతత్త్వం ఉంది.
యమునా గాలి మళ్లీ మృదువుగా వీచింది…
కదంబవృక్షాలు ఆనందంతో ఊగాయి…
గోపికల హృదయాలు పరవశించాయి…
బృందావనం అంతా ఒక్క నామంతో మార్మోగిపోయింది—
గోపికల హృదయాల్లో…
యమునా అలలలో…
మురళీ స్వరాల్లో…
ప్రతి శ్వాసలో…
“రాధే… రాధే…”
కృష్ణుణ్ని చేరుకోవడానికి మార్గం భక్తి.
ఆ భక్తికి హృదయం రాధా నామం.
రాధా కృప లభించిన చోటే కృష్ణుని కరుణ ప్రవహిస్తుంది.
అందుకే భక్తులు అంటారు—
“రాధా నామం పలికితే… కృష్ణుడు స్వయంగా హృదయంలో ప్రత్యక్షమవుతాడు.”
“రాధే… రాధే…”
జై శ్రీ రాధేకృష్ణ
-శంకరకింకరః

No comments:

Post a Comment