జై రాధే! జై శ్యామ్!
బృందావనం...
ఈ పేరు వినగానే భక్తుని హృదయంలో చెప్పలేని మాధుర్యం పొంగిపొర్లుతుంది.
అది కేవలం ఒక గ్రామం కాదు...
ఒక పవిత్రక్షేత్రం మాత్రమే కాదు...
అది ప్రేమకు పరమపీఠం...
మాధుర్యభక్తికి మహామందిరం...
రాధాకృష్ణుల నిత్యవిహార భూమి...
యమునమ్మ మెల్లగా ప్రవహించే ప్రతి అలలోనూ "రాధే... రాధే..." అనే నామమే వినిపిస్తుంది.
కదంబవృక్షాల కొమ్మలు గాలికి ఊగుతున్నప్పుడు, అవి కూడా రాధానామ సంకీర్తనే చేస్తున్నట్లుంటాయి.
నెమళ్లు విప్పిన పింఛాలలో రాధామాధవుల ప్రేమరంగులే మెరవగా...
గోవర్ధనగిరి వేల సంవత్సరాలుగా ఆ దివ్యప్రేమకు మౌనసాక్షిగా నిలిచి ఉంది.
బృందావన ధూళిలోని ప్రతి రేణువూ ఒక లీలను దాచుకొని ఉంది...
ప్రతి తీగ ఒక రహస్యాన్ని ఆలపిస్తోంది...
ప్రతి పుష్పం ఒక ప్రేమగీతాన్ని పరిమళిస్తోంది...
అలాంటి బృందావనంలో...
శ్రీకృష్ణుని మహిమను గానం చేసిన మహాభక్తులు ఎందరో పుట్టారు.
కానీ...
ఆ ప్రేమకు మూలమైన శ్రీరాధాదేవి పరమోన్నత తత్త్వాన్ని, ఆమె కృపామహిమను, ఆమె లేకుండా కృష్ణప్రాప్తి సంపూర్ణం కాదనే రహస్యాన్ని ప్రపంచానికి ధైర్యంగా ప్రకటించిన మహాసంతులు మాత్రం చాలా అరుదు.
ఆ రోజుల్లో...
ఎక్కడ చూసినా "కృష్ణ... కృష్ణ..." అనే నామమే వినిపించేది.
భాగవత పారాయణాలు...
గీతాగానం...
కృష్ణలీలలు...
అన్నీ విస్తృతంగా ప్రచారంలో ఉండేవి.
కానీ రాధానామాన్ని జపించే వారు చాలా తక్కువ.
రాధాదేవిని పరాశక్తిగా భావించి ఆరాధించే వారు ఇంకా తక్కువ.
రాధాకృపే కృష్ణప్రాప్తికి ద్వారం అని గ్రహించినవారు అయితే మరీ అరుదు.
అటువంటి సమయంలో...
భక్తి చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
ఒక మహాత్ముడు వచ్చి లోకానికి ఇలా ప్రకటించాడు
"కృష్ణుని చేరాలని కోరుకుంటే ముందుగా రాధమ్మను ఆశ్రయించండి.
తల్లి చేయి పట్టకుండా తండ్రి వద్దకు వెళ్లలేని చిన్నబిడ్డలాగే,
రాధాకృప లేకుండా కృష్ణకృప సంపూర్ణంగా లభించదు."
ఈ ఒక్క వాక్యమే...
వేలాది భక్తుల ఆరాధనను కొత్త దిశగా నడిపించింది.
ఆ మహాత్ముడే... " శ్రీ హిత హరివంశ మహాప్రభువు."
అది పదహారవ శతాబ్దం...
ఉత్తర భారతదేశమంతా భక్తి ఉద్యమపు పవనాలతో పరిమళిస్తోంది.
ఎక్కడ చూసినా హరినామ సంకీర్తనలు...
భాగవత పారాయణాలు...
కృష్ణభజనలు...
భక్తి ఒక మహాసముద్రంలా ఉప్పొంగుతోంది.
అయితే రాధామహిమను విశదంగా ప్రకటించే కాలం ఇంకా రాలేదు.
ఆ సమయాన...
బ్రజమండలానికి కొంతదూరంలోని దేవవనం అనే పవిత్రప్రాంతంలో ఒక వైదిక బ్రాహ్మణ దంపతులు నివసించేవారు. వారిద్దరూ నిత్యం రాధాకృష్ణులను ఆరాధిస్తూ, భక్తులతో సత్సంగాలు చేస్తూ, సద్గుణసంపన్నమైన జీవితం గడిపేవారు.
ఒక పౌర్ణమి రాత్రి...
ఆ దంపతులిద్దరికీ ఒకే దివ్యస్వప్నం కలిగింది.
స్వప్నంలో...
చంద్రకాంతిని మించిన కాంతితో...
అనంత కరుణామూర్తిగా...
సర్వలోకాల జనని...
ఆ పరాశక్తి...
శ్రీరాధారాణి ప్రత్యక్షమయ్యారు.
ఆమె చిరునవ్వు యమునా అలల చిరు సవ్వడి ఉంది.
ఆమె చూపు లక్షల చంద్రుల శీతలతను మించిపోయింది.
ఆమె మృదువుగా "పుణ్య దంపతులారా! మీకు శుభం జరగబోతోంది. నా నిత్యసేవలో భాగమైన ఒక మహాభాగవతుడు మీ ఇంట జన్మించబోతున్నాడు. అతడు సాధారణ శిశువు కాదు. నా ప్రాణవల్లభుడైన శ్రీకృష్ణుని దివ్యమురళి అంశంతో భూమిపై అవతరిస్తాడు.
నా ప్రేమను...
నా తత్త్వాన్ని...
నా కృపను...
నా మహిమను ప్రపంచానికి తెలియజేస్తాడు." అని పలికింది
ఆ మాటలు వినగానే... ఆ దంపతుల ఇద్దరి కళ్లలో ఆనందబాష్పాలు పొంగిపోయాయి. మెలకువ వచ్చి చూస్తే ఇద్దరికీ అదే కలవచ్చిందని ఒకరి మొఖం ఒకరు చూసుకోగానే అర్థం అయ్యింది. ఇద్దరూ "జై రాధే రాధే! జై రాధే కృష్ణా!..." అంటూ భజన చేసారు. ఆ దివ్యదర్శనానుభూతి మాత్రం వారి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది.
రహో రస రసికవర, శ్రీరాధా రస బరసత!
హిత హరివంశ కహత, రసిక జన హరషత!!
భావం: రాధారాణి అనుగ్రహమే పరమరసం. ఆ రసాన్ని ఆస్వాదించేవారే నిజమైన రసికులు.
కొన్ని నెలల తరువాత...
శుభలగ్నంలో...
ఒక తేజోమయమైన బాలుడు జన్మించాడు.
బాలుడు జన్మించిన వెంటనే...
ఆ ఇంటి చుట్టూ అపూర్వమైన పరిమళం వ్యాపించిందని, ఎక్కడి నుంచో కోయిలల కుహూకారాలు వినిపించాయని, మంగళవాయిద్యాలు, వేదఘోషలు వినపడ్డాయనీ, సమీపంలోని గోవులు సైతం అసాధారణమైన ప్రశాంతతతో నిలిచిపోయి పాలిచ్చాయనీ, లేగదూడలు గెంతులేసాయనీ బ్రజవాసులు చెప్పుకుంటుంటారు.
ఆ శిశువుకు "హిత హరివంశ" అని పేరు పెట్టారు...
"హిత" అంటే... మంచి - మేలు.
లోకహితం...
ప్రేమతో చేసే మేలు...
సర్వజీవుల శ్రేయస్సు.
ఆ పేరు అతనికి మాత్రమే కాదు...
అతని జీవితానికే నిర్వచనమైంది.
(తరువాయి భాగం.... రేపు)
జై రాధే! జై శ్యామ్!
రాధే! రాధే!
No comments:
Post a Comment