Pages

Thursday, August 13, 2026

శ్రీమాత లీలామృతం -5 (అభిరామి భట్టార్ — అమ్మపై నమ్మకం)

శ్రీగురుమూర్తే త్వాం నమామి కామాక్షి.


//సాన్నిధ్యం కురు కళ్యాణీ మమ పూజాగృహే శుభే

బింబే దీపే తథా పుష్పే హరిద్రా కుంకుమే మమ!!


ఓ కళ్యాణీ! శుభప్రదమైన నా పూజాగృహంలో, నేను పూజించే బింబంలో, దీపంలో, పుష్పంలో, పసుపులో, కుంకుమలో నీ సాన్నిధ్యాన్ని ప్రసాదించు.//


కావేరీ నదీమతల్లి సాగరసంగమానికి అడుగులు వేసే పవిత్రమైన చోళమండల తీరాన, సముద్రపు చల్లని గాలులు వేదమంత్రాల గుసగుసలతో ముచ్చటించే ఒక దివ్యక్షేత్రం ఉంది. అదే 'తిరుక్కడైయూర్'. చూడ్డానికి అదొక చిన్న పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న పట్టణంగానే తోచవచ్చు; కానీ ఆ నేల యుగయుగాలుగా పరమభక్తుల పాద ధూళితో, వారి ఆర్ద్రతనిండిన కన్నులనుండి జాలువారిన స్వచ్చమైన అశ్రుబిందువులతో, అగ్నిహోత్రాల భస్మంతో, పునీతమైన తపస్సుతో, వేద ఘోషలతో, మంత్ర జపాలతో కలగలిసిన భక్తి రససిద్ధమైన పుణ్యరేణువుల సమాహారమని బోధపడుతుంది. 


నాదస్వర శ్రుతిలో, గర్భగుడి నీరాజనాల వెలుగులో అక్కడ శతాబ్దాల - సహస్రాబ్దాల భక్తిపరిమళం తెలుస్తూనే ఉంటుంది. ఆ క్షేత్రంలో, ఆయుష్షును ప్రసాదించే అమృతఘటేశ్వరుడు ఒకవైపైతే, సమస్త విశ్వాన్ని తన కరుణాకటాక్షంతో బ్రోచే జగన్మాత అభిరామి అమ్మవారు మరొకవైపు కొలువై ఉంటారు. మృత్యుదేవతనే శాసించిన మార్కండేయుని మృత్యుంజయ గాథకు, అమ్మవారి అనుగ్రహాన్ని అమృతకావ్యంగా మలిచి తన మరణశిక్షను పోగొట్టుకున్న అభిరామి భట్టార్ చిత్తశుద్ధికి ఆ తిరుక్కడైయూర్ అమరసాక్షిగా నిలిచింది.


పూర్వం మృకండు మహర్షి, మరుద్మతి దంపతుల నిష్కామ తపస్సుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్కుడైనా జ్ఞాననిధియైన కుమారుడు కావాలా, లేక దీర్ఘాయుష్కుడైనా అజ్ఞానియైన సంతానం కావాలా అని అడిగినప్పుడు, వారు జ్ఞానానికే పట్టంగట్టారు. అలా లభించిన సత్పుత్రుడే మార్కండేయుడు. పదహారేళ్ల పసివయసులోనే కాలం ముంచుకొస్తున్నా, ఆ బాలుని భక్తి చలించలేదు. యముడు పాశంతో ఎదురుగా నిలిచిన వేళ, భయంతో వణకిపోక, గర్భగుడిలోని శివలింగాన్ని పెనవేసుకుని 'మహాదేవా!' అని ఆక్రందన చేశాడు, చన్ద్రశేఖరమాశ్రయే మమకింకరిష్యతి వై యమః అని ధిక్కరించాడు. భక్తుడి ఆక్రందనకు శివుడు సాకారమై లింగం నుంచి కాలాంతకుడిగా ఉద్భవించి యముణ్ణి నిగ్రహించిన పరమ పవిత్రస్థలమిది. కాల గమనాన్ని మార్చగల శక్తి ఒక్క దైవభక్తికే ఉందనే అక్షరసత్యానికి ఈ నేల తొలి తార్కాణం అనవచ్చు.


కాలచక్రం తిరిగింది. మృత్యువును జయించిన ఆ శివక్షేత్రంలోనే, అమ్మవారి ప్రేమతో కాలపు చీకట్లను వెన్నెలగా మార్చి తన మృత్యువును దాటిన మరో అద్భుత ఘట్టానికి కావేరీ తీరం వేదికైంది. అక్కడ, ఆలయ అర్చకత్వమే జీవితంగా భావించే "అమృతలింగ అయ్యర్" ఇంట ఒక ముద్దులొలికే బాలుడు జన్మించాడు. అతడి పేరు "సుబ్రహ్మణ్య అయ్యర్" అని పెట్టారు. 


సూర్యోదయానికంటే ముందే మేల్కొనే ఆ ఇంట, పాలు త్రాగే వయసు నుంచే అతనికి మంత్రోచ్చారణలు, గుడిలోని నాదస్వర విన్యాసాలు, ధూపదీపాల పరిమళాలు ఆశ్చర్యమైన అనుభవాలుగా మారి అతణ్ణాకర్షించాయి. పసిపిల్లలు ఆటబొమ్మల కోసం ఆరాటపడితే, ఈ బాలుడు మాత్రం గర్భగుడిలోని దివ్యదీప కాంతుల వైపు, అభిరామి అమ్మవారి నయనాల వైపు అమాయకంగా, నిశ్చలంగా చూస్తూ ఉండిపోయేవాడు. "అమ్మా! నన్ను ఎందుకు అలా చూస్తున్నావు?" అని చిరు పెదవులతో మురిసిపోతుంటే, ఆ తండ్రి అమృతలింగ అయ్యర్ తన కొడుకులో అసాధారణమైన భక్తిబీజాన్ని గమనించాడు. ఆయన ఆ బాలుడికి కేవలం వేదశాస్త్రాలు, సంగీతసాహిత్యాలే కాదు, దేవీతత్వాన్ని గుండెల్లో నింపుకునే అనురాగాన్ని కూడా దీక్షా పరంగా వారసత్వంగా అందించాడు.


సుబ్రహ్మణ్యుడి బాల్యం దాటి యౌవనంలోకి అడుగుపెడుతున్న కొద్దీ, అతని విద్య అంతా అమ్మవారి పాదాల చెంత సమర్పించే సుగంధ పుష్పంగా మారిపోయింది. లోకం చూపులో సిరిసంపదలు, హోదాలు కోరుకునేవిగా కనిపిస్తే, సుబ్రహ్మణ్యుడి కళ్లకు మాత్రం అభిరామి అమ్మవారి కిరీటంలో మెరిసే చిన్న రత్నం సమస్త విశ్వం కన్నా అందంగా కనిపించేది. ఆ తల్లి చిరునవ్వు అతనికి వెన్నెల ప్రవాహంలా, ఆ కరుణాకటాక్షం పాపాలను కడిగే గంగాలా అనిపించేవి. క్రమంగా అతని భక్తి ఒక దివ్యానుభూతిగా మారడంతో, బాహ్య ప్రపంచంతో అతనికి సంబంధ తెగిపోయింది. గర్భగుడి ముందర నిలబడి దేవితో ఏకాంతంగా సంభాషించేవాడు; హఠాత్తుగా ఆనందబాష్పాలు రాల్చేవాడు; మరుక్షణంలోనే జగన్మాతతో అమాయకంగా నవ్వుతూ మాట్లాడేవాడు. 


చంద్రమండల మధ్యస్థే మహాత్రిపుర సుందరి

శ్రీ చక్ర రాజనిలయే అభిరామి నమోస్తుతే!


ఈ లోకంలో లౌకిక కొలమానాలతో మనుష్యులనుకూడా కొలిచే వారికి అతడొక 'పిచ్చివాడిలా' కనిపించాడు. కానీ, అహంకారాన్ని వదిలేసి దైవంలో నిశ్శబ్దంగా లీనమైన ఆ చిత్తమే అమ్మవారి దృష్టిలో నిజమైన అమృతత్వమని వారికి బోధపడలేదు.


ఇలాంటి సమయంలోనే, తంజావూరు మహారాజు శరభోజి-2 /సర్ఫోజి-2 తిరుక్కడైయూర్ ఆలయ సందర్శనానికి వచ్చాడు. రాజపరివారం, అధికారులు, జనులు గౌరవప్రపత్తులతో నమస్కరిస్తుంటే, సుబ్రహ్మణ్య అయ్యర్ మాత్రం ఆ ఆడంబరాన్ని, పటాటోపాన్ని ఆ సమూహాన్ని చూడ ఇచ్చగించలేదు. అతని కంటిపాపల్లో కేవలం జగజ్జనని అభిరామి దేవి పూర్ణరూపమే ప్రకాశిస్తోంది. అంతరాలయంలో విడిగా ఒక మూల కూర్చుని నవ్వుతూ అమ్మతో ఏదో మాట్లాడుకుంటున్నాడు.

 

అది గమనించిన సర్ఫోజీ "ఇతడెవరు?" అని ప్రశ్నించగా, కొందరు ప్రాపంచికులు "ఇతనికి పిచ్చి పట్టింది" అని సుబ్రహ్మణ్యం గురించి నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. సర్ఫోజీ అతని వద్దకు వచ్చి చూస్తే అతని కళ్లలో గొప్పతేజస్సు గోచరమైంది, పరిక్షించే ఉద్దేశంతో—"ఓయ్ భట్టర్! ఈ రోజు ఏ తిథి?" అని అడిగాడు. అది అమావాస్య రాత్రికి ముందు సమయం. కానీ, ఆ క్షణంలో సుబ్రహ్మణ్యుడి అంతరంగంలో అమావాస్య చీకట్లు లేవు; అమ్మవారి దివ్యప్రసన్న ముఖారవిందమనే కోటి సూర్యచంద్రుల వెలుగులు విరబూస్తున్నాయి. ఆ అమ్మవారిని చూసి నవ్వుతూ మాట్లాడుకునే భావావేశంలో, తానెక్కడున్నాడో మరిచి, నోరుజారి "ఈ రోజు పౌర్ణమి" అని నవ్వుతూ పలికాడు.


సర్ఫోజీకి  తనను భట్టర్ గేలి చేస్తున్నాడనే భావన కలిగి తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. "అమావాస్య నాడు పౌర్ణమి అని నాతోనే బొంకుతావా! నీ మాట నిజమైతే ఈ రాత్రి నింగిలో నిండు చంద్రుడు ఉదయించాలి. లేదంటే నిన్ను అగ్నికుండంలో తగలేసి ప్రాణదండన విధిస్తాను" అని అరిచి తన అధికారులకు తగు ఉత్తరువులిచ్చి ఏర్పాట్లకై ఆజ్ఞాపించాడు. 


ఆసాయంత్రం, అధికారులు ఒక గొయ్యి తీసి, కింద రగిలే అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లుతుండగా , దానిపై వంద తాళ్లతో అల్లిన పీఠంపై సుబ్రహ్మణ్యుడిని వేలాడదీశారు. సుబ్రహ్మణ్య భట్టర్ అమ్మవారిని గురించి స్తుతించి పౌర్ణమి చంద్రుణ్ణి తెప్పించాలి అలా నూరు పద్యాలకి అవకాశం ఇచ్చారు. ఆ అమావాస్యరాత్రిపూట పౌర్ణమి చంద్రుడు కనిపించే వరకూ ప్రతీ పద్యానికి ఒక తాడు చొప్పున కోసివేస్తూ, వంద పద్యాలు పూర్తయ్యేలోపు చంద్రుడు రాకపోతే అగ్నికి ఆహుతి చేయడమే రాజశిక్ష! సూర్యుడు అస్తమించాడు. కాలమేఘాల్లాంటి నల్లటి అమావాస్య చీకటి లోకాన్ని ఆవరించింది. కానీ అగ్నిజ్వాలల మధ్య వేలాడుతున్న భట్టర్ హృదయంలో మాత్రం అచంచలమైన భక్తి అఖండదీపమై వెలుగుతోంది. భయం అతని ఛాయలకు కూడా రాలేదు. తానొక భౌతికదేహమనే స్పృహే అతనికి లేదు; అతనికి ఉన్నదల్లా 'అమ్మ నన్ను వీడదు' అన్న విశ్వాసం అదే కొండంత అండ. 


తన ఆర్తిని, అమ్మవారి దివ్యరూపాన్ని అక్షర మాలికలుగా అల్లుతూ ఆ అగ్నిగుండం సాక్షిగా అతడు గళమెత్తాడు. ఒక పద్యం చివరి పదం, తదుపరి పద్యానికి మొదలయ్యే 'అంతాది' శైలిలో కవిత్వ ధార అమృత ప్రవాహంలా జాలువారింది. అందులోనే పుట్టుకొచ్చింది అమరకావ్యం 'అభిరామి అంతాది'. అలా ఒక్కొక్క తాడు తెగుతుండగా, అమ్మవారి దివ్యసౌందర్యాన్ని తన హృదయఫలకంపై నిలుపుకుంటూ 78వ పద్యాన్ని గానం చేశాడు:


సెప్పుం కనక కలశముం పోలుం తిరుములైమేల్

అప్పుం కళభ అభిరామ వల్లీ, అణి తరళక్

కొప్పుం, వయిరక్ కుళైయుం, విళియిన్ కొళుంగడైయుం,

తుప్పుం, నిలవుం ఎళుదివైత్తేన్, ఎన్ తుణై విళిక్కే.


"బంగారు కలశాలవలె శోభిల్లే నీ దివ్య వక్షస్థలానికి పూసిన సుగంధ చందన పరిమళాలు, చెవులకు మెరిసే ముత్యాల ఆభరణాలు, వజ్రఖచిత కుండలాలు, కరుణను వర్షించే నీ దివ్య నయనాల చూపులు, పగడాలవంటి నీ దంతకాంతులు, పెదవులపై నటించే చంద్రబింబంలాంటి మృదువైన చిరునవ్వు—ఇవన్నీ నా నేత్రాలకు, నా హృదయంలో అమరచిత్రంలా లిఖించుకున్నానమ్మా!" అని తన్మయత్వంతో అమ్మ రూపాన్ని కొనియాడాడు. ఆపై, ఏమాత్రం చలించని అనన్య శరణాగతితో 79వ పద్యంలోకి అడుగుపెట్టాడు:


విళిక్కే అరుళుండు, అభిరామ వల్లిక్కు, వేదం సొన్న

వళిక్కే వళిపడ నెంజుండు ఎమక్కు, అవ్వళి కిడక్క,

పళిక్కే సుళన్రు, వెం పావంగళే సెయ్దు, పాళ్ నరకక్

కుళిక్కే అళుందుం కయవర్ తమ్మోడు, ఎన్న కూట్టు ఇనియే?


"ఓ అభిరామవల్లీ! నీ దివ్య నేత్రాలలో అపారమైన కరుణ నిండి ఉంది. వేదాలు మార్గనిర్దేశం చేసిన దివ్య పథంలో శ్రీవిద్యామార్గంలో నిన్ను నిశ్చలమైన హృదయంతో ఆరాధించే భాగ్యం నాకు దక్కింది. అంతటి దివ్యమార్గం నా కళ్లముందు వెలుగుతుండగా, అధికారమదంతో, అధర్మపు దారుల్లో తిరుగుతూ, పాపకూపాల్లో పడి, నరకానికి చేరువయ్యే దుర్మార్గుల సాంగత్యంతో నాకేమి పని తల్లీ?" అంటూ తన సర్వస్వాన్నీ దేవి పాదాల చెంత ఆత్మనివేదన చేసుకున్నాడు. ఆ పద్యంలో 'నేను గొప్ప భక్తుడిని' అనే అహంకారం లేదు; 'తల్లి పాదాలు తప్ప ఈ లోకపు నిందలు, శిక్షలు నాకేమీ కావు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే...' అన్న సంపూర్ణ శరణాగతి మాత్రమే ప్రస్ఫుటమైంది.


అది 79వ తాడు తెగిపడే క్షణం! అగ్నిజ్వాలల వేడి అతడి పాదాలను తాకుతోంది. జనుల గుండెల్లో ఆందోళన, అయ్యో అనే బాధ. సరిగ్గా అదే సమయంలో సన్నాయి, భజంత్రీలు మ్రోగాయి, ఆకాశంనుండి తూర్యఘోషలు వినిపిస్తుండగా, అమ్మవారి ఆలయంలో మహామంగళ నీరాజనాలు అకస్మాత్తుగా మొదలైయ్యాయి..  దేవీ కరుణ భూమ్యాకాశాలను ఏకం చేస్తూ భక్తపరాధీనతను చాటిచెప్పింది. గర్భగుడిలోని అభిరామి అమ్మవారు తన చెవికున్న రత్నఖచిత తాటంకాన్ని (కమ్మను) తీసి ఆకాశంలోకి విసిరింది. ఆ తాటంకం గగనతలంలో నిలిచి, అమావాస్య కటిక చీకట్లను పటాపంచలు చేస్తూ, నిండు పౌర్ణమి చంద్రబింబంలా ప్రకాశించింది! రాత్రికి రాత్రే అమావాస్య ఆకాశం కాస్తా వెన్నెల సముద్రమై మునిగిపోయింది. ఆ అద్భుతాన్ని చూసిన రాజు శరభోజి  భట్టార్ పాదాలపై పడి క్షమాపణలు కోరాడు. కానీ భట్టార్ కళ్లలో గెలుపు గర్వం లేదు; "ఇది నా పాండిత్యం కాదు, ఇది నా తల్లి వాత్సల్యం!" అంటూ ఆనందభాష్పాలతో అమ్మవారి పాదాలకే ప్రణమిల్లాడు. నాటి నుండి అతడు 'అభిరామి భట్టార్' గా జగత్ప్రసిద్ధుడయ్యాడు.


తిరుక్కడైయూర్ క్షేత్రం మనకు రెండు గొప్పసత్యాలను నొక్కిచెబుతుంది. ఒకవైపు, మృత్యుంజయుడైన శివుడు మార్కండేయుని కోసం కాలాన్ని ఆపి భక్తుడి ఆయుష్షును శాశ్వతం చేశాడు; మరొకవైపు, జగన్మాత అభిరామి దేవి తన భక్తుడి నోటి మాటను సత్యం చేయడానికీ, మృత్యువునుండి కాపాడడానికీ విశ్వంలోని కాలనియమాన్నే నియమాన్నే ఏమార్చి అమావాస్యను పౌర్ణమిగా మార్చింది. 


భక్తి అంటే కేవలం పూజలు చేయడం, ఆచారాలు పాటించడం మాత్రమే కాదు.

సర్వస్వాన్నీ కోల్పోయే పరిస్థితి ఎదురైనా "నా తల్లి నన్ను చేయివిడవదు" అని అచంచలమైన విశ్వాసంతో నిలబడటమే నిజమైన భక్తి. 

అభిరామి భట్టార్ హృదయంలో వెలిగిన ఆ అంతరంగ పౌర్ణమి కాంతి, యుగాలు మారినా, తరాలు గడిచినా మానవజాతికి భగవద్బక్తి, జగదంబ ప్రేమయొక్క సాధికారతను చాటిచేప్తూ దివ్యజ్యోతిలా వెలుగుతూనే ఉంటుంది!


అభిరామి అమ్మవారి పాదాలే శరణం

అమృతఘటేశ్వర స్వామి పాదాలే శరణం

జయ మార్కండేయ మహర్షి 

జయ అభిరామి భట్టార్


అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే

జయ దుర్గే శివ దుర్గే హర దుర్గే


జయ జయ జయ జయ్ కామాక్షి

జయ జయ జయ జయ కామాక్షి


- శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేంద్ర కుమార్)

Wednesday, August 12, 2026

పండితుల పుత్రులు

 కేచిత్ పండితపుత్రాః శుణ్ఠాః,

కేచిచ్చ మూర్ఖాః భవంతి!
కొందరు పండితుల పుత్రులు శుంఠలు మరికొందరి పండితుల పుత్రులు మూర్ఖులు...
తాతలు ​తండ్రులు గొప్ప పండితులు, జ్ఞానులు అయినంత మాత్రాన వారి పిల్లలందరూ పండితులు కావలసిన అవసరం లేదు. కొందరు ఏమాత్రం పరిజ్ఞానం లేని మొద్దులుగా మారితే, మరికొందరు మంచిచెడుల విచక్షణ, వివేకం లేని మూర్ఖులుగా తయారవుతారు.
"మూర్ఖుడు కాశీ కెళ్ళినా, గాడిద తీర్థం కెళ్ళినా... వాళ్ల బుద్ధి మారదు" అని తెలుగు నానుడి పెద్దలు ఊరికెనే చెప్పలేదు.
-శంకరకింకరః

మూర్ఖస్య నాస్త్యౌషధమ్

 "మూర్ఖస్య నాస్త్యౌషధమ్" - మూర్ఖుడికి, మూర్ఖత్వానికి ఏ శాస్త్రంలోనూ మందు లేదు.

శక్యో వారయితుం జలేన హుతభుక్, ఛత్రేణ సూర్యాతపో
నాగేంద్రో నిశితాంకుశేన సమదో, దండేన గౌర్గర్దభః!
వ్యాధిర్భేషజ సంగ్రహైశ్చ వివిధైర్మన్త్రప్రయోగైర్విషం
సర్వస్యౌషధ మస్తి శాస్త్ర విహితం,"మూర్ఖస్య నాస్త్యౌషధమ్"!!
అగ్నిని నీటితో ఆర్పవచ్చు.
ఎండవేడిని గొడుగుతో తప్పించుకోవచ్చు.
మదించిన ఏనుగును అంకుశంతో అదుపు చేయవచ్చు.
ఆవునైనా, గాడిదనైనా, ఏ పశువునైనా కర్రతో అదుపులోపెట్టవచ్చు.
వ్యాధులకు వివిధ ఔషధాలు ఉన్నాయి.
విషానికి కూడా విరుగుడు ఉంది.
కానీ...
తనకు తెలియకపోయినా తెలుసన్న అహంకారంతో, మంచి మాట వినకుండా, సత్యాసత్యాలు తెలియకుండా అన్నీ తనకే తెలుసుననే కుపాండిత్యం ఉన్న "మూర్ఖుడిని మార్చడానికి మాత్రం ఈ శాస్త్రంలో ఏ ఔషధమూ లేదు."
ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుంది. కానీ సత్యాసత్య విచారాన, సమయాసమయ సందర్భం లేని, మంచి సలహా వినని, అహంకారంతో ఉండే మూర్ఖత్వానికి మందు లేదు. ఆ ముర్ఖుడిని ఎవరూ బాగు చేయలేరు

బృందావన కథలు – 50 (స్వామి హరిదాస్)

జయ శ్రీరాధేకృష్ణ!

లోకంలో గాయకులనేకులు
ధనాన్ని కోరేవారుంటారు...
కీర్తిని కోరేవారుంటారు...
సుఖసంతోషాలను కోరేవారుంటారు.
రాజుల మెప్పును కోరేవారుంటారు...
కానీ...
తన గానంతో దేవుడినే తన వద్దకు రప్పించిన భక్తుడు ఒకరున్నారు!
ఆయనకు సంగీతం కేవలం ఒక కళ కాదు - అది ఒక ఆరాధన.
ఆయనకు రాగం ఒక స్వర సమ్మేళనం కాదు.
అది రాధాశ్యాముల పాదపద్మాలకు సమర్పించిన పుష్పం.
ఆయనకు తంబురా మీటే ఒక వాద్యపరికరం కాదు.
అది ఆయన హృదయంతో పలికించే ప్రార్థన.
ఆ మహాభక్తుడు బృందావన నికుంజాలలో తన ప్రాణనాథుడైన శ్రీకృష్ణుని కోసం పాడిన సిద్ధపురుషుడు సంగీత సమ్రాట్ "స్వామి హరిదాస్!"
---
బృందావనం...
యమున ఒడ్డున వెన్నెల పరుచుకుంది.
కదంబ వృక్షాలు మౌనంగా నిలబడి ఉన్నాయి.
నిధివనంలోని తీగలు గాలికి ఊగుతూ, ఏదో రహస్యాన్ని ఒకదానికొకటి చెప్పుకుంటున్నాయి.
ఎక్కడో ఒక కోయిల కుహూ రాగాలు, నెమళ్ల ఖ్రేంకణాలు...
“రాధే... రాధే...” అంటున్నట్లు వినిపిస్తున్నాయి.
అ ప్రాంతంలోనే ఒక చిన్న కుటీరం.
ఆ కుటీరం అతి సాధారణం, వైభోగాలు ఏం లేవు.
బంగారు సింహాసనాలు లేవు.
వెండి పాత్రలు లేవు.
సేవకులు లేరు.
ప్రముఖంగా ఉన్నది ఒక్కటే ఒక పాత తంబురా...
వినపడుతున్నది ఒక్కటే రాధానామం...
కనిపిస్తున్నది ఒక్కటే శ్యామసుందరునిపై అంతులేని ప్రేమ.
స్వామి హరిదాస్ తన గానాన్ని ఎవరికో వినిపించడానికి పాడేవారు కాదు.
ఆయన పాడేది తనకు కనిపిస్తున్న రాధేశ్యామసుందరుని కోసం!
అందుకే ఆయన గానం విని మనుషులే కాదు ప్రకృతే పరవశించేది.
---
ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన ఆస్థాన గాయకుడు తాన్సేన్ గానం విని ముగ్ధుడయ్యాడు. “తానసేన్! నీ గానంలో ఇంత మాధుర్యం ఉంటే, నీకు ఈ సంగీతం నేర్పిన గురువు గానం ఇంకెంత అద్భుతంగా ఉండాలి! ఆయనను నా ఆస్థానానికి తీసుకురా. నేను ఆయన గానం వినాలి.” అని అన్నాడు.
తాన్సేన్ సన్నగా నవ్వి “రాజా! నా గురువుగారు బృందావనంలో ఉంటారు. ఆయన రాజుల కోసం పాడరు. బంగారం కోసం పాడరు. కీర్తి కోసం పాడరు. ఆయనకు ఉన్న ఒకే ఒక్క ప్రముఖ శ్రోతఉన్నాడు ఆయనకోసమే పాడతారు మా గురువుగారు, ఆ ప్రముఖ శ్రోత నికుంజ బిహారి శ్రీకృష్ణుడు. మీరు నిజంగా ఆయన గానం వినాలనుకుంటే... రాజుగా వెళ్లకండి. ఒక భక్తుడిగా వెళ్లండి.” అని చెప్పాడు
అక్బర్ ఆ మాటను ఆశ్చర్యపోయి సరే చూద్దాం అని బయలుదేరాడు.
రాజవస్త్రాలను విడిచాడు.
రాజభటులను దూరంగా ఉంచాడు.
సామాన్య భక్తుని వేషంలో తాన్సేన్వెంట బృందావనానికి బయలుదేరాడు.
నిధివన సమీపంలో స్వామి హరిదాస్ తన సాధనలో ఉన్నారు.
తాన్సేన్ తన గురువు నమస్కరించి పక్కన కూర్చున్నాడు. అదిగమనించిన స్వామి హరిదాస్ తాన్సేన్ ను పాడమన్నారు. తాన్సేన్ అద్భుతంగా పాడసాగాడు. మధ్యలో ఒక స్వరాన్ని తప్పుగా ఆలపించాడు...
ఆ క్షణం స్వామిహరిదాస్ తలెత్తి చూసి ఆపమన్నట్లు సైగ చేసారు.
తంబురాను చేతిలోకి తీసుకున్నారు.
ఒక్కసారి శ్రుతిని సరిచేసి.
గానం మొదలు పెట్టారు.
ఆ రాగ తాళ స్వరాల లయ విన్యాసం...
చుట్టూ ఉన్న భక్తులందరి హృదయాలను కరిగించింది.
మరో స్వరం, మరో రాగం, మరో గానం...
అది యమునా అలలపై సున్నితంగా తేలుతున్న ఆకులా అందరి మనసులలో ఊగుతోంది.
మరో రాగం విరిసింది.
అది కదంబ పుష్పాల పరిమళంలా నిధివనమంతా వ్యాపించింది.
కోయిల తన గానాన్ని ఆపింది.
నెమలి తన నాట్యాన్ని ఆపింది.
యమునా ప్రవాహం సైతం నెమ్మదించినట్లు అనిపించింది.
తాన్సేన్ తలవంచాడు.
అక్బర్ కళ్లను మూసుకున్నాడు.
ఆయన చెంపలపై కన్నీటి బిందువులు జారాయి.
"అది సంగీతం కాదు - అది భక్తి స్వస్వరూపం."
గానం ముగిసిన తరువాత అక్బర్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు.
కొంతసేపటికి తాన్సేన్ వైపు తిరిగి “ఇంతటి గానం నేను ఎప్పుడూ వినలేదు. నువ్వు ఇంత అద్భుతంగా పాడగలిగితే, నీ గురువు గానం నీకంటే ఎందుకు ఇంత గొప్పగా ఉంది? అంత గొప్పగా నువ్వెందుకు పాడలేకపోతున్నావు” అని అన్నాడు
తాన్సేన్ చిరునవ్వు నవ్వి
“షెహన్ షాహ్! నేను మీ కోసం పాడుతాను.
నా గురువుగారు సమస్తలోకాలకీ షెహన్ షాహ్ ఐన శ్రీకృష్ణుని కోసం పాడుతారు.
మీరు నా గానానికి బహుమతి ఇస్తారు.
కానీ నా గురువు గానానికి స్వయంగా శ్రీకృష్ణుడు తనను తానే అర్పించుకుంటాడు.” అన్నాడు.
ఔను ఆమాట సత్యం, గతంలో కొంత కాలం క్రితం జరిగిందదే!
స్వామి హరిదాస్ గానం చేసేటప్పుడు కొన్నిసార్లు ఎవరో ఎదురుగా నిలబడి ఉన్నట్లుగా చిరునవ్వేవారు.
ఎవరో అదృశ్య అతిథితో మాట్లాడుతున్నట్లుగా కనిపించేవారు.
భక్తులకు, శిష్యులకు ఆశ్చర్యంగా ఉండేది, ఆయనలో ఆయనే ఏమైనా మాట్లాడుకుంటున్నారా లేక నిజంగానే దివ్య స్వరూపాలేమైనా ఆయనకు కనపడుతున్నాయా అని సందేహించేవారు.
ఒకరోజు ధైర్యం చేసి “గురుదేవా! అక్కడ ఎవరూ లేరు కదా? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు?” అని అడిగారు
స్వామి హరిదాస్ నవ్వి...
“ఎవరితోనా?
నా శ్యాముడితో!
పక్కనున్న రాధమ్మతో!
మీకు కనిపించడంలేదా?” అని అడిగారు.
శిష్యులు ఒకరినొకరు చూసుకున్నారు.
వారికి ఏమీ కనిపించలేదు.
స్వామి హరిదాస్ మాత్రం మళ్లీ తన గానంలో మునిగిపోయారు.
ఆయనకు కనిపించేది ఏదో అదృశ్య స్వరూపం కాదు "మన కళ్లకు కనిపించని సత్యం" .
“గురుదేవా! మీరు దర్శిస్తున్న ఆ దివ్యరూపాన్ని మాకూ చూపించండి.” అని శిష్యులు రోజూ ప్రార్థించసాగారు.
ఒకరోజు అదే అదే విషయం అడిగారు శిష్యులు. ఆ కోరిక విని స్వామి హరిదాస్ కొంతసేపు మౌనంగా ఉన్నారు.
తరువాత శిష్యులను వెంటబెట్టుకుని నిధివనంలోని ఒక పవిత్ర ప్రదేశంలో ఆసీనులయ్యారు.
తంబురాను చేతిలోకి తీసుకున్నారు.
కళ్లను మూసి
“రాధే...”
మరోసారి...
“శ్యామా...”
ఈసారి...
“రాధే... శ్యామా...”
అంటూ నామాన్ని రాగయుక్తంగా పాడసాగారు...
ఆ స్వరం నిధివనాన్ని తాకింది.
కదంబ వృక్షాలను తాకింది.
యమునను తాకింది.
ఆకాశాన్ని తాకింది.
అప్పుడు..
ఒక అపూర్వమైన పరిమళం వ్యాపించింది.
వెన్నెల మరింత తెల్లగా మారింది.
గాలి ఒక్కసారిగా నిశ్చలమైంది.
శిష్యులు కళ్లెత్తి చూశారు.
అక్కడ...
రాధారాణి!
ఆమె పక్కన...
శ్యామసుందరుడు!
వర్ణించలేని సౌందర్యం.
చూడలేనంత మాధుర్యం.
శిష్యుల నోటి నుంచి మాట రాలేదు.
కళ్ల నుంచి మాత్రం కన్నీళ్లు ఆగలేదు.
స్వామి హరిదాస్ మాత్రం వారిని చూసి ఆశ్చర్యపడలేదు.
ఎందుకంటే ఆయనకు వారు కొత్తవారు కాదు.
ప్రతిరోజూ తన గానంలో ఆయన వారినే పిలిచేవారు. వారిముందే, వారికోసమే పాడేవారు.
ఆ రోజు మాత్రం
బృందావనం మొత్తం స్వామి హరిదాస్ కి శ్రీ యుగళం ఇచ్చే దర్శనానికి సాక్షిగా నిలిచింది.
స్వామి హరిదాస్ తన గానం ఆపి చేతులు జోడించి
“ప్రభూ!
మీరు నా కోసం వచ్చారు.
కానీ నా కోరిక నా కోసం కాదు.
ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికీ ఇలాంటి దివ్యదర్శనం సాధ్యం కాదు.
నా బృందావనానికి వచ్చే ప్రతి దీనుడికీ...
ప్రతి కన్నీటి భక్తుడికీ...
ప్రతి నామస్మరణ చేసే హృదయానికీ...
మీ కరుణ లభించాలి.
మీరు ఇక్కడే ఉండండి.
మమ్మల్ని విడిచి వెళ్లవద్దు.” అని కోరాడు
రాధారాణి చిరునవ్వు నవ్వింది.
శ్యామసుందరుడు తన భక్తుని వైపు చూశాడు.
ఆ దివ్యరూపాలు క్రమంగా ఒకదానిలో ఒకటి లీనమయ్యాయి.
రాధా...
శ్యామ...
రెండు రూపాలు...
ఒకే మాధురమైన రూపంగా మారాయి.
ఆ రూపమే "శ్రీ బాంకే బిహారీ!"
అది కేవలం ఒక మూర్తి ప్రకటింపబడడం కాదు.
భక్తి పిలిస్తే భగవంతుడు వస్తాడనే సత్యానికి బృందావనం ఇచ్చిన సజీవ సాక్ష్యం.
కాలం గడిచింది స్వామి హరిదాస్ బాంకే బిహారీలో లీనమైయ్యారు.
ఆయన సంగీతం ముగిసింది...
కానీ గానం ఇంకా వినిపిస్తూనే ఉంది
ఈరోజు కూడా నిధివనం వైపు గాలి వీచినప్పుడు...
చాలా జాగ్రత్తగా చెవులు రిక్కించి భక్తితో వింటే ఎవరికైనా వినిపించవచ్చు..
ఆ తంబురా నాదం...
ఆ మృదువైన ఆలాపన...
ఆ హృదయాన్ని కట్టేసే కృష్ణ నామ గానం...
“రాధే... శ్యామా...”
అది స్వామి హరిదాస్ గానమో...
యమునా అలల గుసగుసో...
బృందావనపు గాలి పలికే నామమో...
విడిగా చెప్పడం కష్టం?
కానీ ఒక విషయం మాత్రం నిజం...
భగవంతుణ్ణి స్వార్థం లేకుండా ప్రేమించిన హృదయానికి,
భగవంతుడు ఎప్పుడూ దూరంగా ఉండడు.
ఆయనను వెతకడానికి అడవులకు వెళ్లవలసిన అవసరం లేదు.
ఆయనను చూడటానికి కళ్లను మూసుకోవలసిన అవసరం లేదు.
ఒక్కసారి హృదయం నిజంగా “రాధే... శ్యామా...” అని పిలిస్తే చాలు.
ఎందుకంటే...
భక్తుడు దేవుణ్ణి పిలిచినప్పుడు,
దేవుడు రావాలా వద్దా అని ఆలోచించడు.
భక్తుని ప్రేమే ఆయనకు ఆహ్వానం.
భక్తుని హృదయమే ఆయనకు బృందావనం.
---
బృందావన కథలకు మంగళం
ఇలా యభై వ కథతో మన “బృందావన కథలు” యాత్ర ప్రస్తుతానికి ముగుస్తోంది.
కళ్ళతోచూసిన పదాలు మనసులోకి చేరి నిశ్శబ్దమవుతాయి.
పుస్తకాల్లో దూరి పుటలు మూసుకుపోతాయి.
కథలన్నీ ముగుస్తాయి, ఎవరి గాథలైనా కంచికే చేరతాయి.
ఐతే...
బృందావనం ఎప్పుడూ భక్తులకై తెరిచే ఉంటుంది.
రాధానామం మాత్రం ఆగదు.
యమున ప్రవహిస్తూనే ఉంటుంది.
కదంబాలు ఊగుతూనే ఉంటాయి.
నిధివనం తన రహస్యాన్ని దాచుకుంటూనే ఉంటుంది.
బాంకే బిహారీ తన మధురమైన చిరునవ్వుతో భక్తులను కాస్తూనే ఉంటాడు.
మనం ఈ కథలను చదివింది కేవలం గతాన్ని తెలుసుకోవడానికి కాదు.
మన హృదయంలో ఒక చిన్న బృందావనం నిర్మించుకోవడానికి.
అక్కడ...
కోపానికి చోటుండకూడదు.
అహంకారానికి చోటుండకూడదు.
ద్వేషానికి చోటుండకూడదు.
ఉండవలసింది ఒక్కటే—
రాధా...
కృష్ణా...
అనే రెండు నామాలు.
ఆ రెంటిమధ్య ఉండే ప్రేమ...
చివరగా...
మన జీవితంలో ఎన్నో జన్మలు గడిచినా,
ఎన్నో మార్గాలు తిరిగినా,
ఎన్నో సాధనలు చేసినా,
నిత్యం మన శ్వాసలో ఖచ్చితంగా
“రాధే... కృష్ణా...”
అనే నామం ఉండాలి.
అప్పుడు...
మన హృదయం కూడా బృందావనమే.
మన కన్నీరు కూడా యమునే.
మన నిశ్వాసం కూడా వేణునాదమే.
మన జీవితం కూడా...
రాధాశ్యాముల పాదపద్మాలకు ఒక చిన్న సేవే!
గట్టివాడవని పట్టితి నీ చేయి
పట్టి విడువరాదు కృష్ణా!
పుట్టినప్పటినుండి పుణ్యములెరుగను
పాపపు పనులే చేసితిని అట్టే
నా కర్మము అణచగ జాలక
పట్టితి నీ పాద పద్మములు కృష్ణా!
గట్టివాడవని పట్టితి నీ చేయి
పట్టి విడువరాదు కృష్ణా!
ఎన్ని జన్మలనో ఎత్తి అలసితిని
ఇకనైనా నన్ను బ్రోవగదే
అన్యమెరుగని దాసుడనయ్యా
నన్ను నీ దరి చేర్చుకోరాదా కృష్ణా!
గట్టివాడవని పట్టితి నీ చేయి
పట్టి విడువరాదు కృష్ణా!
ఈకృతితో మంగళం చెప్పుకుంటూ
జయ శ్రీరాధే!
జయ శ్రీకృష్ణ!
జయ బృందావన్!
రాధే రాధే!
- శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేంద్ర కుమార్)

చంద్ర సాచివ్యం - సుందరకాండ, రాసపంచాధ్యాయీ

 చంద్ర సాచివ్యం - సుందరకాండ, రాసపంచాధ్యాయీ

వాల్మీకి మహర్షి రచించిన సుందరకాండ 5వ సర్గలో, లంకలోకి ప్రవేశించిన ఆంజనేయస్వామికి ఆ రాత్రి చంద్రుడు అపూర్వమైన సహకారం అందిస్తాడు. తన శీతల కిరణాలను సర్వత్రా విరజిమ్మి, ప్రతి వీధిని, ప్రతి గృహాన్ని, ప్రతి దారిని స్పష్టంగా దర్శనమిచ్చేలా చేస్తాడు. సీతామాత అన్వేషణకు బయలుదేరిన హనుమంతునికి ఆ చంద్రప్రకాశమే మార్గదర్శిగా నిలుస్తుంది.
హంసో యథా రాజతపఞ్జరస్థః - సింహో యథా మన్దరకన్దరస్థః!
వీరో యథా గర్వితకుఞ్జరస్థః - చన్ద్రోఽపి బభ్రాజ తథామ్బరస్థః!!
(వాల్మీకి రామాయణం, సుందరకాండ 5వ సర్గ)
వెండి పంజరంలో ఉన్న హంసవలె, మందరపర్వత గుహలోని సింహంవలె, గర్విత గజంపై ఆసీనుడైన వీరునివలె, ఆకాశంలో చంద్రుడు అపూర్వ కాంతితో ప్రకాశించాడు.
తదనంతరం చంద్రుని శీతల కాంతి జగత్తును ఎలా ప్రకాశింపజేసిందో మహర్షి ఇలా వర్ణిస్తారు...
ప్రకాశచన్ద్రోదయ నష్టదోషః - ప్రవృత్త రక్షః పిశితాశ దోషః!
రామాభిరామేరిత చిత్తదోషః - స్వర్గప్రకాశో భగవాన్ ప్రదోషః!!

(వాల్మీకి రామాయణం, సుందరకాండ 5వ సర్గ)
చంద్రోదయంతో రాత్రి చీకట్లు తొలగిపోయాయి. చంద్రుని నిర్మల కాంతి సమస్త దిక్కులను ప్రకాశింపజేసి, సీతాన్వేషణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించింది. ఈ చంద్రకాంతి కేవలం ప్రకృతిలోని వస్తువులను ప్రకాశింపజేయలేదు; హనుమంతుని కార్యసిద్ధికి సహాయకంగా మార్గదర్శకంగా నిలిచింది.
అదేవిధంగా, శ్రీమద్భాగవతం దశమ స్కంధంలోని రాసపంచాధ్యాయి (29-33 అధ్యాయాలు)లో, వేణునాదాన్ని ఆలకించి పరమప్రియుడైన శ్రీకృష్ణుని అన్వేషించేందుకు గోపికలు రాత్రివేళ బృందావనంలోకి ప్రవేశిస్తారు. ఆ సందర్భంలో కూడా వ్యాసమహర్షి శరద్ పూర్ణిమ చంద్రుని నిర్మల కాంతిని ఎంతో రమణీయంగా వర్ణిస్తారు.
భగవానపి తా రాత్రిః శరదోత్ఫుల్లమల్లికాః |
వీక్ష్య రన్తుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రితః ||
(శ్రీమద్భాగవతం 10.29.1)
"శరదృతువులో వికసించిన మల్లెల పరిమళాలతో నిండిన ఆ పూర్ణిమ రాత్రిని దర్శించిన శ్రీకృష్ణుడు, యోగమాయను ఆశ్రయించి రాసలీలకు సంకల్పించాడు."
ఈ రెండు మహాగ్రంథాలలోనూ ఒక అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది.
ఇక్కడ వెతుకుతున్నవారు సాధకులు.
వెతకబడేది పరమాత్మ.
ఎటువైపు నడవాలో, ఏ మార్గంలో సాగాలో, ఏమి గ్రహించాలో స్పష్టంగా చూపించే వెలుగే గురువు.
అజ్ఞానతిమిరాన్ధస్య జ్ఞానాఞ్జనశలాకయా !
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః !!
"అజ్ఞానాంధకారంలో మునిగిన శిష్యునికి జ్ఞానాంజనం అద్ది దృష్టిని ప్రసాదించేవాది గురువు."
సుందరకాండలో హనుమంతుడు లంకలోని గృహాలను పరిశీలిస్తూ, రత్నఖచిత కిటికీలను, వాటి అలంకారాలను ఎంతో నిశితంగా దర్శిస్తాడు.
భాగవతంలో గోపికలు శ్రీకృష్ణుని వెతుకుతూ వస్తున్నప్పుడు, ఆయన ముఖారవిందాన్ని, ముఖ్యంగా చెవులలో ఊగిసలాడుతున్న మకరకుండలాలను పరమాత్మ దగ్గరకు వచ్చేవారికి దారిచూపడానికి ఊగుతున్నాయా అన్నట్లు వ్యాసమహర్షి మనోహరంగా వర్ణిస్తారు.
మనిషి ముఖానికి ద్వారం నోరైతే, చెవులు జ్ఞానానికి కిటికీలు.
చెవుల ద్వారానే శ్రుతి, అంటే వేదం, మనలోకి ప్రవేశిస్తుంది.
రత్నాలతో అలంకరించిన కిటికీలు, మకరకుండలాలు - వేదాభరణాలు, వేదానికి ఆభరణం వేద విహిత ఆచరణకు సంకేతాలు.
వేదానికి ఆభరణం వేదవిహిత కర్మాచరణ, అదే జ్ఞానానికి పరమాత్మను పొణ్దడానికి మార్గం.
---
సుందరకాండలో హనుమంతుడు లంకలో సంచరిస్తూ ఎన్నో రకాల సాధకులను దర్శిస్తాడు. ఎవరో అగ్నిహోత్రం నిర్వహించడంలో నిమగ్నులై ఉంటారు. ఎవరో జపమాలను చేతబట్టి, దర్భకట్టలు మంత్రాలు చేస్తుంటారు. పూర్తిగా కర్మకాండలో లీనమై ఉంటారు.
ప్రతి ఒక్కరి మార్గం వేరు. ప్రతి ఒక్కరి సాధన వేరు. హనుమంతుడు మాత్రం వారందరినీ గమనిస్తూ, తన లక్ష్యమైన సీతామాత అన్వేషణను కొనసాగిస్తాడు.
అదేవిధంగా భాగవతంలో గోపికలందరూ బృందావనంలో శ్రీకృష్ణుని అన్వేషణలో పరుగులు తీస్తుంటారు. వారు ఒకరిని ఒకరు చూడరు; ఎవరి సాధనను వారు గమనించరు. ఎవరు ముందున్నారు, ఎవరు వెనుక ఉన్నారు అనే భావమే వారికి లేదు.
ఎందుకంటే
పరమాత్మను చేరే మార్గంలో పోటీ ఉండదు.
పోలిక ఉండదు.
ప్రతి సాధకుని ప్రయాణం అతనిదే.
నాయమాత్మా ప్రవచనేన లభ్యో
న మేధయా న బహునా శ్రుతేన!
యమేవైష వృణుతే తేన లభ్యః !!
(కఠోపనిషత్ 1.2.23)
"ఆత్మతత్త్వం వాక్చాతుర్యంతో కాదు, మేధస్సుతో కాదు, వినికిడితో మాత్రమే కాదు; తనను ఆశ్రయించినవారికి మాత్రమే పరమాత్మ తనను తాను అనుగ్రహిస్తాడు."
అందుకే వ్యాస వాల్మీకులిద్దరూ ఈ రెండు ఘట్టాలూ ఒకే విధంగా చెప్పారు.
సాధన మార్గాలు అనేకం కావచ్చు.
సాధకులు ఎందరో కావచ్చు.
ఎలాగైతే ఎవరి ఆకలి వారిదే,
ఎవరి నిద్ర వారిదే,
ఎవరి అనుభవం వారిదే... అదేవిధంగా...
కానీ, సాధకుల అంతిమ గమ్యం ఒక్కటే "పరమాత్మను పొందడం"
ఆ గమ్యానికి దారి చూపి, ఆ మార్గంలో నడిపించే "చంద్రకాంతి - స్వగురుకృపయే", ఆ ప్రయాణాన్ని సార్థకం చేసేది నిరంతర సాధన.
"గురుకృపా హి కేవలం - శిష్య పరమ మంగళం."
- శంకరకింకరః

Sunday, August 9, 2026

బృందావన కథలు – 49 (బృందాదేవి నిస్స్వార్థ సేవ)

జయ శ్రీరాధే!

జయ శ్రీకృష్ణ!
జయ బృందావన్!
వృందే నమస్తే చరణారవిందం
రాధాకృష్ణోః సేవయా ప్రసన్నే!
త్వయా వినా నైవ భవేత్ కదాచిత్
వృందావనే దివ్యవిలాసలీలా!!
“ఓ వృందాదేవీ! నీ పాదపద్మములకు నమస్కారం. నిరతమూ రాధాకృష్ణుల సేవలో ఆనందించే తల్లీ! నీ అనుగ్రహం లేకుండా వృందావనంలో శ్రీ యుగళి దివ్యలీలలను అనుభవించడం సాధ్యం కాదు. మమ్మనుగ్రహించి శ్రీ యుగళి దివ్యలీలలను మాకు సాకారం చేయి."
బృందావనం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది...
యమునా తీరం...
కదంబ వృక్షాలు...
గోవర్ధన గిరి...
గోపికల ప్రేమ...
రాధామాధవుల మధుర లీలలు...
కానీ...
ఈ లీలలన్నీ ఎవరి నిర్వహణలో జరుగుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించామా?
వేదిక సిద్ధం చేసే దర్శకుడు కనబడడు...
కానీ నాటకం అతని వల్లే విజయవంతమవుతుంది.
అలాగే...
బృందావనంలోని ప్రతి పుష్పం వికసించడం వెనుక...
ప్రతి కోకిల గానం వెనుక...
ప్రతి మలయమారుతం వీచడం వెనుక...
ప్రతి కుఞ్జం అలంకరించబడడం వెనుక...
ఒక మహా సేవకురాలు ఉన్నారు.
ఆమెయే శ్రీ బృందాదేవి.
ఒకసారి...
శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణునితో కుఞ్జవిహారం చేయాలని సంకల్పించారు.
ఆ సంకల్పం బృందాదేవికి చేరవేయబడింది...
ఆమె ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు.
"ఈరోజు రాధామాధవుల లీల మరింత మధురంగా జరగాలి" అని భావించి...
"ఈ రోజు 'రాధే... రాధే...' అనే నామమే ఆలపించండి." వేలాది చిలుకలకు ఆజ్ఞ ఇచ్చింది.
నెమళ్లను పిలిచి " రాధాశ్యాములకు అల్లంత దూరంలో కనువిందు చేసేలా పురివిప్పి నృత్యం చేయండి" అని ఆజ్ఞ వేసింది
కోకిలలతో
"మీ గానం మృదువుగా ఉండాలి.
వారి సంభాషణకు అంతరాయం కలగకూడదు." అని నెమ్మదిగా చెప్పింది.
తుమ్మెదలను పిలిచి
"విరబూసిన పువ్వుల చుట్టూ మాత్రమే విహరించండి.
యుగళ సర్కారుల సమీపంలో ఎక్కువగా నాదం చేయవద్దు." అని ఆదేశించింది...
మలయమారుతాన్ని పిలిచి...
"చందన పరిమళాన్ని మెల్లగా తీసుకురా...
రాధాకృష్ణుల అలకలు (కురులు) చెదరకూడదు."
మేఘాలతో...
"ఎక్కువ ఎండ కాయకూడదు...
అలా అని పూర్తిgA చీకటి కాకూడదు...
సరిగ్గా వారి ఏకాంతానికనుకూలమైన వెలుగు ఉండాలి, అలా సూర్యకాంతిని కప్పండి." అని చెప్పింది.
కదంబ వృక్షాలతో...
"మీ కొమ్మలు కిందకు వంచండి.
స్వాభావికంగా ప్రేమయుగళం కూర్చోడానికి పుష్ప మండపం ఏర్పడాలి." అని శాసనం చేసింది
మల్లెలు, మాలతీలు, జాజిపూలతో...
"మీ సుగంధాన్ని కొంచెం పెంచండి.
ఈరోజు యుగళమిలనం అత్యంత విశేషంగా గుర్తుండిపోవాలి." అను ఆజ్ఞ ఇచ్చింది...
అలా...
బృందాదేవి ఒక్కో అంశాన్ని స్వయంగా పరిశీలిస్తూ...
బృందావనాన్ని ఒక దివ్య ప్రేమాలయంగా మార్చింది.
కొంతసేపటికి...
రాధారాణి, శ్రీకృష్ణుడు ఆ కుఞ్జంలోకి ప్రవేశించారు.
చిలుకలు "రాధే... రాధే..." అని పలుకుతున్నాయి.
కోకిలలు మృదుస్వరంతో ఆలపిస్తున్నాయి.
మలయమారుతం పుష్పసుగంధాన్ని మోసుకొస్తోంది.
యమునా అలలు కూడా నెమ్మదిగా ప్రవహిస్తున్నాయి.
అన్నీ...
అన్నీ...
వారి ఆనందానికే సేవ చేస్తున్నట్లు అనిపించింది.
శ్రీకృష్ణుడు చిరునవ్వుతో రాధారాణిని చూసి
"ప్రియే! ఈరోజు బృందావనం మరింత అందంగా ఉంది, ప్రకృతికూడా పరవశిస్తోంది." అన్నాడు.
రాధారాణి చిరునవ్వుతో...
"శ్యామా!
ఇది ప్రకృతి మనకోసం చేసిన ఏర్పాటు కాదు...
మన ప్రియసఖి బృందాదేవి చేసిన ప్రకృత్యలంకార సేవ." అని పలికి, కొంచెందూరంలో సేవకై వేచిఉన్న బృందాదేవిని చూసి...
"బృందా! దగ్గరకు రా." అని రాధారాణి పికిచారు.
బృందాదేవి వినయంతో వచ్చి నమస్కరించింది.
రాధారాణి ఆమెను ఆలింగనం చేసుకొని అన్నారు...
"సఖీ! నీ సేవలో స్వార్థం లేదు...
ప్రతిఫలం కోరే భావం లేదు...
పేర్లు, సత్కారాలు పొందాలన్న తాపత్రయం లేదు...
అందుకే నీ సేవ నన్ను అత్యంత సంతోషపరుస్తుంది."
శ్రీకృష్ణుడు కూడా చిరునవ్వుతో...
"బృందా! నీ సేవ లేకుంటే నా బృందావన లీలలు సంపూర్ణం కావు." అని మెచ్చుకిన్నారు..
ఆ మాటలు విన్న బృందాదేవి కన్నీళ్లు పెట్టుకుంది.
"ప్రభూ...
నాకు మీ పాదసేవే చాలు.
నా పేరు ఎవరికీ తెలియకపోయినా పరవాలేదు.
మీ ఆనందమే నా జీవితం."
అని వినమ్రంగా చెప్పింది.
---
సేవ అంటే...
ముందు దూసుకుపోయి ప్రశంసలు పొందడం కాదు.
వెనుక ఉండి...కార్యక్రమం నిర్వర్తించడం, భగవంతుని ప్రీతికలిగేటట్లు ప్రవర్తించడం.
తన పేరు వినిపించకపోయినా...
తన కీర్తి రాకపోయినా...
తన సేవ ద్వారా రాధాకృష్ణుల ఆనందం కలిగించగలిగితే...
అదే బృందాదేవి చేసిన నిజమైన "నిష్కామ సేవ."
బృందావనంలో రాధాకృష్ణుల కంటే ముందు భక్తుని సేవను గమనించేది బృందాదేవియే అంటారు బృందావన వాసులు.
ఆమె అనుగ్రహం లభిస్తే...
రాధారాణి కృప సులభంగా లభిస్తుంది.
"ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయః తద్ధామ వృందావనం!"
వ్రజధామంలోని ప్రతి గడ్డి పరక కూడా సేవలో నిమగ్నమై ఉంటుంది. ఆ సేవా సంప్రదాయానికి జీవంత స్వరూపమే 'శ్రీ బృందాదేవి.'
మన జీవితంలో కూడా...
మన కుటుంబంలో...
మన దేవాలయంలో...
మన గురుసేవలో...
మన సమాజంలో...
పేర్లు, పద్దులు, బిరుదులు, కీర్తి కాంక్ష వదిలి
బృందాదేవిలా నిశ్శబ్దంగా - నిష్కామంగా సేవ చేయగలిగితే...
ఆ సేవను పరమాత్మ స్వయంగా స్వీకరిస్తారు.
జయ శ్రీరాధే!
జయ శ్రీకృష్ణ!
జయ శ్రీ బృందాదేవి!
— శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేంద్ర కుమార్)

Friday, August 7, 2026

బృందావన కథలు – 48 (బ్రజరజస్సు మహిమ)

"దేవతలకైనా దుర్లభమైనది బృందావన ధూళి"

జయ శ్రీరాధేకృష్ణ!
బంగారానికి విలువ ఉంది...
ముత్యాలకు విలువ ఉంది...
వజ్రాలకు విలువ ఉంది...
అవి మనిషిని ధనవంతుణ్ని చేయగలవు.
కానీ...
కృష్ణ భక్తిలోకంలో వాటన్నింటికంటే అమూల్యమైన ఒక సంపద ఉంది.
అది బంగారం కాదు...
అది మాణిక్యం కాదు...
అది రాజ్యమూ కాదు...
అది బ్రజరజస్సు... బృందావన ధూళి!
అది సాధారణ మట్టిలా కనిపించవచ్చు.
కానీ...
ప్రేమతో చూసే కన్నులకు...
అది మట్టి కాదు...
శ్రీశ్రీ రాధా-కృష్ణుల పాదరేణువులు.
అందుకే బ్రజధామంలో అడుగుపెట్టిన మహానుభావులు ముందుగా చేసే పని...
ఆ ధూళిని తలపై చల్లుకోవడం...
కళ్లకు అద్దుకోవడం...
హృదయానికి హత్తుకోవడం.
తమ వంటికి పూసుకోవడం.
ఆ మట్టిపై నందనందనుడు తన చిన్నిపాదాలతో పరుగులు తీశాడు...
ఆ మట్టిపై శ్రీరాధారాణి చరణకమలాలు విహరించాయి..
ఆ మట్టిపై గోపికల ప్రేమతోకూడిన కన్నీళ్లు ముత్యాల్లా జారాయి...
ఆ మట్టిపై గోపకులతో కలిసి ఆడుకున్న కృష్ణుని ఆటలు దాగున్నాయి...
ఆ మట్టిపై కృష్ణుడి కాచిన గోవుల గిట్టల ముద్రలు పడ్డాయి...
ఆ మట్టిపై కృష్ణుడు చేసిన అనేకానేక లీలల గాథలు ఇంకా సజీవంగా ఉన్నాయి...
ఆ రేణువులపై గోపబాలుర నవ్వులు, వేణునాదాలు, గోపికల రాసలీలలు కలిసిపోయాయి...
అందుకే...
అది మట్టి కాదు...
కృష్ణ ప్రేమకు తెఱగు...
కృష్ణ భక్తుల ప్రాణం...
వారి ముక్తికి మార్గం...
ఒకరోజు...
మథుర నుండి శ్రీకృష్ణుడు తన ప్రియసఖుడు, పరమ జ్ఞానియైన ఉద్ధవుడిని బృందావనానికి తన కుశల సందేశం చెప్పడానికి పంపాడు.
ఉద్ధవుడు గొప్ప జ్ఞాని.
సాక్షాత్తూ బృహస్పతికి శిష్యుడు.
వేదశాస్త్రాలలో నిష్ణాతుడు.
అటువంటి మహాజ్ఞాని బృందావనంలో అడుగుపెట్టిన క్షణం నుండి...
అతను చూసింది తాను శాస్త్రాలద్వారా తెలుసుకోనిది...
ప్రతి చెట్టు - పుట్టా "కృష్ణా..." అని నిట్టూరుస్తోంది.
ప్రతి లత ఆయన కోసం ఎదురు చూస్తోంది.
ప్రతి గోవు ఆయన దారినే చూస్తూ అంబారావం చేస్తున్నది.
ప్రతి గాలి వేణుగానాన్ని మోస్తోంది.
అక్కడి గోపికలను చూసిన ఉద్ధవుడు ఆశ్చర్యపోయాడు.
వారు కృష్ణుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ బాధతో ఏడవడం కాదు...
కృష్ణుడు చెప్పినవిధంగానే జీవిస్తున్నారు
కృష్ణుడు ఇష్టపడేవిధంగా జీవిస్తున్నారు
కాదు కాదు కృష్ణుడిగానే జీవిస్తున్నారు.
వారి శ్వాసలో కృష్ణుడు...
వారి చూపులో కృష్ణుడు...
వారి మాటల్లో కృష్ణుడు...
వారి కన్నీళ్లలో కృష్ణుడు...
వాళ్లను చూసినతరవాత, అంత జ్ఞానిఐన ఉద్ధవుడు మరింత వినయంతో కరిగిపోయాడు.
పరంపరగా వస్తున్న వేల సంవత్సరాల జ్ఞానాన్ని తాను తెలుసుకున్నా...
అది గోపగోపికలు, బృందావనం ఆ కృష్ణ పరమాత్మపై చూపే నిష్కల్మశమైన ప్రేమ ముందు తక్కువేనని తెలుసుకున్నాడు.
చివరకు ఆయన చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు—
ఆసామహో చరణరేణుజుషామహం స్యాం
వృన్దావనే కిమపి గుల్మలతౌషధీనామ్!
యా దుస్త్యజం స్వజనమార్యపథం చ హిత్వా
భేజుర్ముకున్దపదవీం శ్రుతిభిర్విమృగ్యామ్!!
(శ్రీమద్భాగవతం 10.47.61)
"అయ్యో! ఈ గోపికల పాదరేణువును పొందే భాగ్యం నాకు కలిగితే ఎంత ధన్యుడనయ్యేదాన్ని! వారు నడిచే బృందావనంలో ఒక చిన్న గడ్డిమొక్కగా, ఒక లతగా, ఒక ఔషధిగా పుట్టినా చాలు. వారి పాదధూళి నాపై పడుతుంది."
జ్ఞానానికి ప్రతీక అయిన ఉద్ధవుడు...
స్వర్గాన్ని కోరుకోలేదు.
వైకుంఠాన్ని అడగలేదు.
ఒక్క చిటికెడు బ్రజరజస్సును మాత్రమే కోరుకున్నాడు.
---
మరో సందర్భంలో...
సకల కామనలనూ జయించిన పరమశివుడికీ బృందావనంలో జరిగే రాసలీలను చూడాలి... అనే కోరిక కలిగింది...
కానీ...
అది అందరికీ లభించే భాగ్యం కాదు. సమస్తాన్నీ నియంత్రించగల శివుడే ఐనా లోకాచారప్రియుడైన కారణాన
శ్రీరాధాదేవి అనుమతితో గోపికా రూపాన్ని ధరించి...
బృందావనంలో ప్రవేశించి రాసలీలలను స్వయంగా దర్శించాడు...
నేటికీగోపేశ్వర మహాదేవుడుగా అక్కడే నిలిచి ఉన్నాడు.
బ్రజధామ మహాత్మ్యాన్ని కాపాడడానికే కాదు...
బ్రజరజస్సును తన శిరస్సుపై ధరించడానికి కూడా.
సృష్టికర్త బ్రహ్మదేవుడే...
ఒకప్పుడు తన పదవిపై, త్నకున్న జ్ఞానంపై గర్వించాడు.
గోపబాలులను, గోవులను అపహరించి శ్రీకృష్ణుని పరీక్షించాలని చూశాడు.
కానీ...
కృష్ణుని అనంత వైభవాన్ని దర్శించిన తరువాత...
ఆయన అహంకారం కరిగిపోయింది.
బ్రజభూమిలోని ఒక్క రేణువు కూడా బ్రహ్మలోక వైభవానికంటే గొప్పదన్న సత్యం అవగతమైంది.
ఈ యుగంలోనూ ...
ఎందరో భక్తులు బృందావనంలో అడుగుపెట్టారు బ్రజధూళిని తమ నెత్తిన వేసుకున్నారు.
శ్రీకృష్ణచైతన్య మహాప్రభువు
యమునాతీరంలో...
గోవర్ధన సమీపంలో...
బృందావన ధూళి కనిపించగానే...
ఆయన ఒక్కసారిగా నేలపై సాష్టాంగంగా పడ్డారు.
ఆ ధూళిని గుండెలకు పూసుకున్నారు.
కళ్లకు అద్దుకున్నారు.
భక్తులు ఆశ్చర్యంగా చూస్తుండగా
"ఇది ధూళి కాదు...
నా గోపాలుడి పాదరేణువు...
నా రాధారాణి చరణస్పర్శతో పవిత్రమైన బ్రజరజస్సనే అమృతం..." అనేవారు.
నేటికీ...
బృందావనానికి వెళ్లే భక్తులు...
అక్కడి నుండి బంగారం తీసుకురారు...
రత్నాలు తీసుకురారు...
పట్టు వస్త్రాలు తీసుకురారు...
బొమ్మలో, మరే కానుకలో తీసుకురారు...
ఒక్క పిడికెడు...
బ్రజరజస్సు తీసుకొస్తాడు.
అది ఇంట్లో అలంకరించడానికి కాదు...
హృదయంలో నిలుపుకోడానికి.
ఆ బ్రజరేణువులను నుదుటిపై ధరించినప్పుడు...
తన మనసు వినయాన్ని నేర్చుకుంటుంది.
ఆ బ్రజరేణువులను కళ్లకు అద్దుకున్నప్పుడు...
తన దృష్టి పవిత్రమవుతుంది.
ఆ బ్రజరేణువులను హృదయానికి పూసుకున్నప్పుడు...
రాధా-కృష్ణుల ప్రేమ తన హృదయంలో చిగురిస్తుంది.
బ్రజరజస్సు మామూలు మట్టి కాదు.
అది శ్రీశ్రీ రాధా-కృష్ణుల చరణస్పర్శతో పవిత్రమైనపరమతీర్థం.
ఆ ధూళిని గౌరవించే హృదయంలోవినయం పుడుతుంది.
వినయం ఉన్న చోటభక్తి వికసిస్తుంది.
భక్తి వికసించిన చోటప్రేమ పుష్పిస్తుంది.
ప్రేమ వికసించిన హృదయంలో...
శ్రీశ్రీ రాధా-కృష్ణులు శాశ్వతంగా నివసిస్తారు.
బ్రజరజస్సును శిరస్సుపై ధరించడం - దాని మహిమను హృదయంలో ధరించడం.
ఈ రెండూ బృందావన రాధాకృష్ణ భక్తుల నిత్య నియమం.
జయ జయ శ్రీరాధే!
జయ జయ శ్యామసుందర!
జయ జయ శ్రీ బృందావన్!
- శంకరకింకరః