Pages

Friday, May 18, 2012

శ్రీ శ్యామ శాస్త్రి (శ్రీ కామాక్షీ చరణదాసుడు) - 3



శ్రీ శ్యామ శాస్త్రి గారి ఉపాసనా, నాదోపాసన ఇతర జీవిత విశేషాలు

శ్రీ శ్యామ శాస్త్రి గారి "సంగీత కుసుమార్చన" ద్వారా అతి శీఘ్ర కాలంలోనే "మహా వాగ్గేయకారుడనీ, సంగీత కారుడనీ పేరు సంపాదించారు". "పెద్ద పెద్ద విమర్శకులు కూడా ఆయన సంగీతానికి, సాహిత్యానికి దాసోహం అయ్యారు". ఆయన స్వరజతులను వారు మనస్సు నిండా నింపుకుని ఆనందించేవారు. వారి కృతులలోని లాలిత్యం, అమ్మతో మాట్లాడుతున్నట్టుగా ఉండే సాహిత్యం ఆకృతులు విన్నప్పుడు తన్మయత్వంతో కళ్ళు చెమర్చేవి. [ఇది నిజం. ఇప్పటికీ వారి కృతులు ఏ సంగీతం తెలియని నాబోటికే కళ్ళు చెమరిస్తే స్వయంగా శ్యామ శాస్త్రి గారు ఆలపించినప్పుడు ఎలా ఉంటుందో కదా....]. తన గురువుగారు నేర్పిన గహనమైన సంగీత శాస్త్రపు లోతుల్లోని ఎన్నో రాగాలతో వీరు హేలగా సంగీత కుసుమాలు తయారు చేసేవారు. కొన్ని కొన్ని గొప్పనైన అపూర్వ  రాగాలయందు ఆయనకున్న అధికారం వేరెవరికీ ఉండదన్నది అతిశయోక్తి కాదు. ఆయన తొలి కృతి సావేరి రాగంలో సంస్కృతంలో రచించినది.

పల్లవి
జనని నత జన పరిపాలిని
పాహి మాం భవాని త్రి-లోక (జనని)
అనుపల్లవి
దనుజ వైరి నుతే సకల జన
పరితాప పాప హారిణి జయ-శాలిని (జనని)

చరణం 1
సతత వినుత సుత గణ పతి
సేనాని రాజ రాజేశ్వరి
విశాలాక్ష తరుణి అఖిల జన
పావని (శ్రీ రాజ రాజేశ్వరి)
సతి శుభ చరితే సదా మధుర
భాషా విగళదమృత రస ధ్వని
సుర నుత పద యుగ దర్శిత ఇహ మమ
గాత్రమతి-మాత్రమజని సుజని (జనని)

చరణం 2
కువలయ లోచన యుగళే
కల్యాణి నీల వేణి వికచ
కోకనద రజచ్చరణే అతి
రమణి (ఘన నీల వేణి)
భువి దివి రక్షణి ధృతామర గణే
భాగ్యవతి శక్తి సంపూర్ణే
కవన నిపుణ మతిం అయి దిశ ఇహ తవ
కాంతిముపయాతుం గిరీశ రమణి (జనని)

చరణం 3
చరణ నిపతదమర సముదయే
కాళి సారస ముఖి
సు-శోభితోరు యుగళ వర
కదలి (నవ సారస ముఖి)
సురుచిర మురళీ మృదంగ స్వర
సంశోభిని రస-కృత మహీ తలే
సరసిజ కర యుగళే కటి కలిత మణి
కాంచీ భృతే కాంచీపుర వాసిని (జనని)

ఈ కృతి వల్ల ఆయన సంగీతంలో ఎన్ని శిఖరాలు దాటారో విదితమౌతుందని పండితులు చెప్తారు.

శ్రీ శ్యామ శాస్త్రి గారు వంశపారంపర్యంగా వచ్చిన కామాక్షి సేవను వదలకుండా, అమ్మవారి ఉపాసనలో నిమగ్నమై ఉండేవారు. వారు శ్రీవిద్యా సాంప్రదాయంలో మంచి నిష్ణాతులు. శ్యామ శాస్త్రి గారి  సర్వ వేళలా తల్లి కామాక్షినే ధ్యానిస్తూ ఉండేవారు. అది పూజ ఐనా సంగీతమైనా. [ పోతన గారు ప్రహ్లాదుని గురించి చెప్పినట్టు ఏ పని చేసినా అమ్మ గురించే ధ్యానం, అంతగా ధ్యానం చేయడం వల్లనే నేమో ఆయనకీ కామాక్షికీ అబేధ స్థితి ఏర్పడింది] ఒక్కోసారి "ఆయన కామాక్షితో మాట్లాడేవారు", మరోసారి "కామాక్షియే ఆయనతో మాట్లాడేది". రాను రాను అది నిత్యమయ్యిపోయింది. అదీ ఆయన అపార భక్తికి ఉపాసనకి తార్కాణం. "శ్రీ ముత్తు స్వామి దీక్షితుల వారికి శ్రీ విద్యా సాంప్రదాయంలోని రహస్యాలు శ్రీ శ్యామ శాస్త్రి వారు బోధించారని ఆ పరంపరలోని వారు చెప్తారు".

పుణ్య దినాలలోనూ,పర్వ దినాలలోను, శుక్రవారాదులలోనూ జరిగే విశేష పూజలలో వారు "త్వరగా అంతర్ముఖులయ్యే వారు". భక్తి పారవశ్యంతో కన్నుల ఆనంద భాష్పాలతో కీర్తనలు పాడేవారు. ఆ సమయాలలో లౌకిక విషయాలపైగానీ, పదార్థములపై గానీ స్మృతి ఉండని సమయంలో తీయటి గొంతుతో హృదయ భావాలు పొంగుతుండగా ఎన్నో గొప్ప కృతులు చేసారు. భావ మాధుర్యానికి, సంగీత మాధురిమకు, సాహిత్యంలోని లాలిత్యం అదే సమయంలో ప్రగాఢ గాంభీర్యం, భావ సాంద్రత. నేటికీ ఎందరో సాహితీ వేత్తలకు సంగీతకారులకు ఆదర్శం.

శ్రీ శ్యామ శాస్త్రి గారు స్ఫురద్రూపి, శుభ్రమైన తెల్లని పంచె చక్కని అంచు కలది కట్టు కుని, చేతిలో వెండి తొడుగున్న పొన్ను కర్ర పట్టుకుని, కాశ్మీర జిలుగుల శాలువా పైన ఆచ్చాదించుకుని నుదుట విభూతి, పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని, మెడలో బంగారు రుద్రాక్షల మాల వేసుకుని ప్రత్యేకంగా కనపడేవారు. "పుంసాం మోహన రూపాయ" అన్నట్టు ఆయన అలా వీధిలో వెళ్తూంటే వీధిలో వారి చేతులు "అసంకల్పితంగా చేతులు రెండూ ముకుళించుకునేవి". ఆయన రూపం అద్భుత రమణీయకం అని ఆయన గురించి వ్రాసిన గ్రంథాలలో వ్రాసారు. ఒక్క సారి చూస్తే మరచిపోలేని అద్భుత రూపం, తేజస్సు వారి స్వంతం. ఆయన నడచి వెళ్తూంటే వీధులలోఅందరూ లేచి నిలబడి గౌరవ ప్రకటనం చేసేవారు. కూడళ్ళలో, రద్దీ ప్రాంతాల్లో కూడా వారిని చూడగానే పక్కకి తప్పుకుని నమస్కరిస్తూ దారి ఇచ్చే వారు. అప్పట్లో "వారిని చూడడమే మహా భాగ్యంగా భావించే వారు". "నడిచే కామాక్షిని చూస్తున్నాం" అనుక్కునేవారు. [ అలా అని వారి బయటికి వచ్చినప్పుడు శిష్య బృందాలు గుంపులు గుంపులుగా ఆయన వెనక ముందూ నడుస్తూ హడావుడి చేసారనుక్కునేరు. వారికి ఉన్న శిష్యులు అతి తక్కువ ముందే, ఆయనకి అటువంటి కోటరీలు, ఆభిజాత్యాలు పటాటోపాలేమీ లేవు]. ఆయన అందరినీ చక్కగా పలకరించేవారు. "అజాత శత్రువు" అని పేరు విమర్శకులు సైతం ఆయనను "సంగీత సామ్రాట్టు" అని పిలిచేవారు. అందరిచేత గౌరవం పొందిన సిద్ధ పురుషుడు.

శ్రీ శ్యామశాస్త్రి గారి సమకాలీకులైన శ్రీ త్యాగరాజు గారు, శ్రీ ముత్తు స్వామి దీక్షితుల వారికి చాలా మంది శిష్యులుండేవారు. కానీ శ్యామ శాస్త్రి వారికి అతి కొద్ది మందేశిష్యులు. ఉన్న వారికి కూడా శ్రద్ధగా ఆయన నేర్పలేదని అంటారు. జీవితాంతం తోడున్న ఆయన కొడుకులే ముఖ్య శిష్యులైనారు. ఒక వేళ శ్యామ శాస్త్రి వారు కూడా శిష్యులకు సంపూర్ణంగా సంగీత శిక్షణ ఇచ్చి ఉంటే ఆయన "వ్రాసిన 300 కృతులకు పైగా" ఇప్పుడు లభ్యమైయ్యేవి. ఆయన ఎప్పుడూ శిష్యులుండాలనీ, ప్రచారం కావాలనీ, కోరుకోలేదు. అలాగే జీతంకోసం సంగీతం చెప్పే స్థితి ఆయనకు కలగలేదు. కామాక్షి దయ వల్ల ఆయన ఆ వంశంలో "పుట్టడానికి ముందే సరిపడా ఆస్తి సమకూర్చబడింది". అందువల్లనే అనుక్కుంటా రాజుల వద్దకు, జమీందారీల వద్దకు వారెప్పుడూ వెళ్ళే వారు కాదు. వీలైతే వారికి దూరంగా ఉండడానికే ఎక్కువగా ప్రయత్నించేవారు. ఆయన నరులను స్తుతి చేసి ఎరుగడు. కేవలం అమ్మ వారి మీదనే వారి కృతులు.  శిష్యులకి ఆయన సంగీతం శ్రద్ధగా నేర్పకపోవడానికి కారణాలలో పైవి కూడా కారణమైనా, అసలు కారణం ఇంకోటుంది. అది వారి నిత్య తపస్సు. "సంగీతం మొదలెట్టగానే ఒక ట్రాన్స్ అంటాం కదా అలా అంతర్ముఖులై ఎన్నో గొప్ప గొప్ప రాగాలలో కీర్తనలు చేసేవారు". అది సంగీతం నేర్చుకోడానికి వచ్చిన శిష్యులకి అర్థం కాక అన్నప్రాశన నాడే ఆవకాయ అన్నం లా ఉండేది. పట్టు బట్టి వారి దగ్గర నేర్చుకున్నది వారి కుమారులు మరి కొంతమంది ఒకరో ఇద్దరో.

పండితులు విమర్శకులు వారి కృతులకు ప్రాచుర్యం రాకపోవడానికి కారణం రెండు విధాలుగా చెప్తారు. ఒకటి పైన చెప్పిన కారణం రెండవది.. శ్యామ శాస్త్రి గారి కృతులు సంగీత పరంగా గొప్ప విద్వత్తుతో కూడుకున్నవి. తాళ క్రమ విషయాలలో అత్యంత గహనమైనవి గంభీరమైనవి. వాటిని పాడడం అంత సులభం కాదు.సంగీత సాధనలో బాగా పండిన ఒక స్థాయి వారికి గానీ ఆ రాగ తాళ క్రమ విన్యాసం అర్థం కాదు. శ్యామశాస్త్రి గారి కీర్తనలు కొన్ని పాడగలిగితే సంగీత విద్వాంసుడైనట్టే అని సంగీతజ్ఞుల అభిప్రాయం! అంగీకారం!. సాధారణ పామర జనులకు వారి సాహిత్యం చదివితే అర్థం అయ్యేలా ఉన్నా, సంగీత గాంభీర్యం వల్ల అర్థం కాదు. ఈయన కృతులు సంగీతంలో కృషి చేసిన వారికి చాలా ఆనందాన్నిస్తాయి. ఆయన అపార సంగీత జ్ఞానం వల్ల ఆయన కృతులలో మాంజి, కల్గడ, చింతామణి వంటి అపూర్వమైన రాగాలు ఉండడంవల్లా, ఆయన కృతులు చౌక కాలము, మధ్యమ కాలము లలో ఉండడం వలన, సంగీతం అనే అరణ్యంలో ఆయన కున్న సామర్థ్యం రీత్యా ఎన్నో సుందర వనాలను తీర్చి దిద్దగల సామర్థాన్ని సూచిస్తాయి.

ఒకసారి వారి మిత్రుడొకరు పుదుక్కోటకు ఆహ్వానిస్తే వెళ్ళి అక్కడి బృహదంబా దేవాలయంలో దర్శనం చేసుకుంటున్న శ్యామ శాస్త్రి గారి వద్దకు ఒక బ్రాహ్మణుడు గబగబా వచ్చి "మధురలో మీనాక్షి అమ్మ ఎదురు చూస్తోంది. నువ్వు వెళ్ళి అక్కడకి వెళ్ళి మీనాక్షీ సన్నిధానంలో ఆమెను స్తుతిస్తూ కొన్ని కీర్తనలు చేయి" అని కోరగా అది అమ్మవారి ఆజ్ఞగా భావించి అలాగే నిశ్చయించుకొన్నారు. తిరిగి తంజావూరు వచ్చి తిరిగి తన ఉపాసన ఇతర నిత్య కర్మాదులు, నిత్య విధులలో ఉండి మధురై సంగతి మరుగైంది. కొంత కాలానికి కలలో ఆ బ్రాహ్మణుడే తిరిగి కనపడి మధురై సంగతి జ్ఞాపకం చేసాడు. అదీ ఆయన సంగీతంలోని మాధుర్యం అమ్మతనం మీద అమ్మవారి మీద వారు వ్రాసిన కృతులు వినడానికి మీనాక్షమ్మే ఆయనను రప్పించుకునేందుకు ఎదురు చూసిందంటే శ్రీ శ్యామశాస్త్రి గారు భక్తి మాధుర్యం ఏమిటో ఆయన సాహిత్యమేమో అర్థం అవుతుంది. [ముఖ్యంగా సంగీత కారులు సాహిత్యాన్ని ఒక సారి వ్రాసుకుని దానికి సంగీత రచన వేరుగా చేస్తారు. అందువల్లనే చాలా కీర్తనలలో పదాలు సగంలో విరిగి పోయినట్టు అనిపిస్తుంది. ఉదా: కుందరదన అన్న చోట కొన్ని  కీర్తనలలో కుం... ............. దర.............. దన................ అన్నట్టు ఉంటుంది దీనికి కారణం సాహిత్యం దానికి సంగీతం వేరుగా రచించడం. కానీ శ్యామశాస్త్రి గారి సాహిత్యం తోపాటే సంగీతం కూడా రచించేవారు కాబట్టి పదాలు తేలికగా అర్థం అవుతాయి, పదాలని విరవడం ఈయన బాణీలో అత్యల్పం, శూన్యమనే చెప్పొచ్చు.]

సరే, మీనాక్షి తల్లి నుండి మళ్ళీ పిలుపు రావడంతో, మరచినందుకు చింతించి తన శిష్యుడైన అలసూరు కృష్ణయ్య గారిని వెంటబెట్టుకుని మధురై వెళ్ళారు. వారి గురించి అందరూ విన్నవారే కాని తంజావూరు వారికి తప్ప వారెవరో ఎవరికీ తెలియదు ఆర్భాటాలకూ పేరు ప్రతిష్ఠలకూ, ప్రత్యేక గురింపులకూ వారు విలువిచ్చేవారు కాదు. అంత గొప్ప పేరున్నా, పలు ప్రాంతాలలో వారి అభిమానులున్నా, రాజాదులు వారి సేవకు కాచుక్కూచున్నా ఎవ్వరినీ ప్రత్యేక దర్శనాలు, ప్రతేకతలు కోరకుండా ఉన్న కొద్దిశిష్యులను కూడా వెంటబెట్టుకెళ్ళకుండా, కేవలం ఒక్క శిష్యుణ్ణే వెంటబెట్టుకెళ్ళారు. శ్యామ శాస్త్రి గారు మీనాక్షి కోవెలలో అమ్మను చూస్తూ అమ్మకి ఎదురుగా నిలబడి కొన్ని కృతులు చేస్తుంటే, ఎవరో సంగీత కారుడు అని అర్చకులు కానీ, వచ్చివెళ్తున్న భక్తులు కానీ పట్టించుకోలేదు. అందరూ ఏ సంగీత విద్వాంసుణ్ణి చూడాలనుక్కుంటారో ఆ కామాక్షీ స్వరూపమైన శ్యామశాస్త్రి ఈయనే అని తెలుసుకోలేకపోయారు. నాలుగు కృతులు అయ్యింతరవాత ఐదవ కృతి అహిరి రాగంలో మొదలు పెట్టగానే ఆ గాన గాంధర్వా మాధుర్య ప్రవాహానికి భక్తులందరూ తన్మయావస్తలోకి వెళ్ళిపోయారు [అప్పుడే వారు అక్కడ మీనాక్షి అమ్మ మీద నవరత్న మాలికా కృతులు చేసారు.] ఆయన గాత్రానికి, సాహిత్యానికి, ఆనంద తన్మయత్వానికి మీనాక్షి తల్లే ఆనందించింది. వెంటనే అర్చక స్వాముల్లోని ఒక అర్చకుడు అందరి ముందూ " ఈయన ఎవరో గొప్ప సంగీత విద్వాంసుడు, అంతే కాదు అమ్మవారికి ఆంతరంగికుడైన భక్తుడు. ఈయనని దేవాలయ మర్యాదలతో సత్కరించాలి"  అని ఆవేశంతో ఊగిపోతూ పలికాడు. అప్పటి మొదలు నేటి వరకూ శ్యామశాస్త్రి గారి కుటుంబానికి మధురైలో ఆలయ మర్యాదలతో సత్కరించడం ఆ ఆలయ ఆచారమైంది. [ఏ ప్రత్యేకతలూ కోరుకోకుండా నిరాడంబరంగా ఉంటూ మన కున్న విభూతిని ఈశ్వర పరం చేయటం వల్ల, నిష్కామం గా ఉండడం వల్ల సంతసించిన పరమేశ్వరుడు సాధకునికి దక్కవలసినదాన్ని అయాచితంగా ఇస్తాడు]. శ్యామశాస్త్రి గారి పక్కనున్న శిష్యుని వలన ఆయనే వాగ్గేయకార సార్వభౌముడైన శ్రీ శ్యామశాస్త్రి గారు అని తెలుసుకుని ఆయన నిరాడంబరతను చూసి అవాక్కవ్వడం దేవాలయం వారి వంతయ్యింది. అక్కడున్న భక్తజనులు, దేవాలయం వారు, అర్చకులు ఆయనను చూసి ఆనంద పరవశులయ్యారు ఎన్నో సత్కారాలుచేశారు.

మీనాక్షి అమ్మ వారి మీద శ్యామ శాస్త్రి గారి నవరత్న మాలికా కృతులలో ఏడు మటుక్కు చాలా ప్రచారంలో ఉన్నాయి [మిగతా రెండూ నాకు తెలియలేదు, చాలామందికి తెలియవు, ఎవరికైనా తెలిస్తే తెలియజేయ మనవి]

సరోజ దళ నేత్రి - శంకరాభరణ రాగం - ఆది తాళము
దేవి మీన నేత్రి -  శంకరాభరణ రాగం - ఆది తాళము
మరి వేరే గతి - శంకరాభరణ రాగం - ఆది తాళము
నన్ను బ్రోవు లలితా - లలితా రాగం - మిశ్ర లఘు తాళము
మాయమ్మ - అహిరి రాగం - ఆది తాళము ( ఈ కృతికే అర్చక స్వామిని మీనాక్షమ్మ ఆవేశించి, పైన చెప్పిన ఘట్టం జరిగింది)
దేవి నీదు పద సారస - కాంభోజి రాగం - ఆది తాళము
మీన లోచన బ్రోవ - ధన్యాసి రాగం  - చాపు తాళము

కొందరి మతం ప్రకారం ఈ కృతి నవ కృతుల్లో ఒకటిగా అంటారు
రావే  పర్వతరాజ కుమారి - కళ్యాణి రాగం - ఆదితాళం
కానీ చాలామంది సంగీతజ్ఞుల ప్రకారం మీనాక్షి అమ్మవారిమీద  మిగిలిన రెండు కృతులు శ్రీ రాగంలోనూ, నాటకురంజిలోనూ చేశారు ప్రస్తుతం అవి అలభ్యం. ఈ రాగాలలో కామాక్షి అమ్మవారిని కీర్తించారు.

సశేషం....


Thursday, May 17, 2012

శ్రీ శ్యామ శాస్త్రి (శ్రీ కామాక్షీ చరణదాసుడు) - 2





శ్రీ శ్యామ శాస్త్రి గారి చిన్నప్పుడు తిరువారూరులో వారికి విద్యాభ్యాసాలు నేర్పించారు. సంస్కృతం, తెలుగు చెప్పించారు. శ్రీ శ్యామ శాస్త్రిగారి మేనమామ గారు కూడా అక్కడే ఉండడంతో ఆయన కూడా కొన్ని విషయాలు నేర్పించేవారు. యుక్త వయస్సు వచ్చేసరికి సంస్కృతాంధ్రభాషలలో మంచి పాండిత్యం సంపాదించారు. మేనమామ సంగీతాభిమాని పైగా సంగీతం తెలిసినవారు కావటంతో ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నారు. వారు సంగీతం నేర్చుకున్న సంగతి వారింటిలోవారు ఎక్కువగా గమనించలేదు కూడా. పైగా వారి కుటుంబంలో సంగీతాభిరుచి కలవారూ లేరు. అందువల్ల మేన మామ దగ్గర పూర్తి చేసిన ప్రాథమిక సంగీత విద్య గురించి ఎవరూ అంతగా గమనించలేదు. అప్పటికీ అతనిలోని సంగీత జ్ఙానిని ఎవ్వరూ గుర్తించలేదు. సంగీత ప్రపంచాన్ని ప్రభావం చేయగలడనీ తెలుసుకోలేదు. చక్కని ప్రతిభ కనబరచాడనీ, మధుర గాత్రమనీ సంగీతంలో ఇంకా శిక్షణ ఇప్పించాలనీ తల్లి తండ్రులు అనుక్కోలేదు. కారణ జన్ములు వారికి వారే తగిన శిక్షణనిచ్చుకొని మహాత్ములౌతారు అన్నది వీరి విషయంలో నిజమైంది. త్యాగరాజ స్వామికి నారదులవారు మారు వేషంలో సంగీత గ్రంథాన్నిచ్చినట్లు, ముత్తు స్వామి దీక్షితర్ గారికీ చిదంబరనాథుడు అనుగ్రహించినట్లు శ్యామశాస్త్రి గారి జీవితంలో అంతకన్నా గొప్ప విషయం జరిగింది.

శ్రీ శ్యామశాస్త్రి గారికి "సంగీత స్వామి" అన్న పేరుతో సర్వ విద్యలకూ, జ్ఙానమునకూ ఆలవాలమైన సదాశివుడే వారికి దగ్గరుండి శిక్షణ ఇప్పించారు. పూర్వాశ్రమంలో ఆంధ్రబ్రాహ్మణుడైన ఒక ఉపాసకుడు తురీయాశ్రమం ఐన సన్యాసం తీసుకుని కాశీలో విశ్వేశ్వర సన్నిధానంలో నర్తన చేస్తూ పాటలు పాడుతూ స్వయం విశ్వనాధ స్వరూపుడై (బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతి) చాతుర్మాస్యానికి తంజావూరు వచ్చినప్పుడు దేవతార్చనకై శ్రీ విశ్వనాథ అయ్యరు వారింటికి ఆహ్వానింపబడ్డారు. సంతోషించిన సంగీత స్వామి వారింటికి వచ్చి దేవతార్చన భిక్షా స్వీకారం అయ్యింతరవాత శ్రీ విశ్వనాథ అయ్యరు వారి కోరిక మేరకు శ్రీ శ్యామ శాస్త్రిని ఆశీర్వదించబోయి చూడగా "శ్యామ శాస్త్రి ఎవరో అర్థం అయ్యింది". భవిష్యత్తూ తెలిసింది. ఆయన చేయవలసిన పనీ అవగతం అయ్యింది. శ్రీ శ్యామ శాస్త్రి గారుఅప్పటికే చేస్తున్న ఉపాసన గురించి అతని సంగీత సాధన గురించి చెప్పేసరికి అవాక్కవ్వడం వారి తల్లితండ్రుల వంతయ్యింది. శ్రీ శ్యామ శాస్త్రి గారిని అప్పుడే శిష్యునిగా స్వీకరించి సంగీతంలో రాగ, తాళ, స్వరముల యొక్క గహనమైన విషయాలను, ఎలా ప్రస్తారం చేయాలో ఆ క్రమాలనూ బోధించారు. చక్కని బుద్ధి తేజస్సు, మేధస్సు కల శ్యామ శాస్త్రి గారికి తన సూక్ష్మ గ్రాహ్మ బుద్ధితో అన్నీ ఎంతో తొందరగా నేర్చుకున్నారు. సంగీత స్వామి సకల సంగీత శాస్త్రమును, గాంధర్వ విద్యారహస్యములెన్నో కల తాళ పత్ర గ్రంథములను ఇచ్చి సంగీత సామ్రాట్టును చేసారు. [ఐతే ఇంత ఖాళీలేని శిక్షణలో కూడా శ్యామ శాస్త్రి గారు ఏనాడూ తన ఉపాసనని మరవలేదు. తన కుటుంబం ఎన్నో వంశాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా సేవచేస్తున్న కామాక్షీ పాదములను వదలలేదు. సంగీత స్వామి అంటే విశ్వనాధుడే దక్షిణామూర్తిగా శ్యామశాస్త్రి గార్కి సంగీతం నేర్పించడానికి వచ్చిన స్వామి.]

నాలుగు నెలల సమయం ఇట్టే అయ్యిపొయింది చాతుర్మాస్యం ముగిసింది "సంగీత స్వామి" వచ్చిన పనీ అయ్యిపోయింది. ఐతే ఆ స్వామి వెళ్ళేటప్పుడు ఇంకో విద్వాంసునీ అనుగ్రహిద్దామనుక్కున్నారేమో. వెళ్తూ వెళ్తూ శ్యామ శాస్త్రి గారిని పిలిచి " శ్యామా! నీకు సమస్త సంగీత శాస్త్రమూ తెలిసింది. ఇప్పుడు నువ్వు మంచి సంగీతం వినాలి. తంజావూరు రాజాస్థాన పండితుడైన పచ్చి మిరియం ఆది అప్పయ్య తో స్నేహం చెయ్యి. అతని ద్వారా మంచి సంగీతం విను, సంగీత చర్చ చెయ్యి కానీ అతని వద్ద నువ్వేమీ సంగీతం నేర్చుకోకుండా జాగ్రత్త పడు " అని చెప్పి తిరిగి తన కర్తవ్యం అయ్యింది అన్నట్లు నవ్వుతూ కాశీకి వెళ్ళిపోయారు.

ఆది అప్పయ్య మంచి సంగీత విద్వాంసుడు, కొందరికి సంగీతం బోధించే వారు. [ ఇందు వలననే చాలా మంది ఆది అప్పయ్య గారిని శ్రీ శ్యామ శాస్త్రి గారికి గురువని చెపుతూ ఉంటారు, కానీ అది వాస్తవం కాదని వారి చరిత్ర] ఇప్పటికీ వారి కీర్తనలు కృతులు కొన్ని ప్రచారంలో ఉన్నాయని అంటారు. వర్ణాలలో నేర్పే విరిబోణి వారిదే. గుర్వాజ్ఞ ప్రకారం శ్రీ శ్యామ శాస్త్రి గారు ఆది అప్పయ్య తో స్నేహం చేసి ఇద్దరూ మంచి మిత్రులైయ్యారు. ఆది అప్పయ్యకు శ్యామ శాస్త్రి గారంటే ఎనలేని గౌరవం అభిమానం ఏర్పడ్డాయి.  అప్పటికే ఆది అప్పయ్య గారు మలి వయస్సు వారు, శ్యామశాస్త్రి గారు యువకులు. వారిద్దరి సమాగమం ఉన్నప్పుడు ఆది అప్పయ్యగారు ఎవరినీ అనుమతించేవారు కాదు. శ్యామ శాస్త్రి గారెవరో ఆయన పసిగట్టారు. ఆయన శ్యామశాస్త్రి గారిని "కామాక్షీ" అని సంబోధించే వారు. కామాక్షి అమ్మ "తాంబూల పూరిత ముఖి" కదా ఈయనా అంతే ఎప్పుడూ చక్కని తాంబూలం నములుతూ ఉండేవారు. [ ఆయన చిత్రాలలో ఇప్పటికీ వారి పక్కన తాంబూలం పెట్టెను చిత్రిస్తారు, అలాగే తమలపాకులు మడిచి చేతిలో పెట్టుకున్నట్టు చిత్రిస్తారు].

శ్రీ శ్యామ శాస్త్రి గారు ఒకనాడు ఆది అప్పయ్య గారితో చర్చ చేస్తుండగా నోట్లోని తాంబూలపు రసం ఆది అప్పయ్య గారి పంచె మీద పడింది. కానీ ఆది అప్పయ్య గారు ఏమాత్రం చలించలేదు కనీసం తుడుచుకోవటానికి కూడా కదలలేదు. అదే సమయంలో శ్యామశాస్త్రి గారు క్షమాపణ చెప్పి లేచి వెళ్ళి నీరు తెచ్చి కడుగ బోగా, ఆది అప్పయ్య గారు " శ్యామా! ఇది నాకు కామాక్షీ అనుగ్రహం. కామాక్షీ దీనికొరకే నేను వేచి ఉన్నాను. ఇకపై నాకు నిజమైన సంగీత లోకానికి ప్రవేశం లభించింది" అని శ్యామశాస్త్రి గారిని ఆ మరక కూడా స్పృశించనీయలేదు. ఆ తరవాత ఆది అప్పయ్య గారు చేసిన కృతులు, వర్ణాలు ఇప్పటికీ ఉన్నాయి.

శ్రీ శ్యామ శాస్త్రి గారు దారిద్ర్యమెప్పుడూ అనుభవించలేదు. తన తండ్రికి వచ్చిన అగ్రహారాలు, పొలాలతో, కానుకలతో ఎప్పుడూ సుభిక్షంగానే ఉండేది ఆయిల్లు. కామాక్షి కి దారిద్ర్యమా? శ్రీ విశ్వనాథ అయ్యరు వారి తరవాత బంగారు కామాక్షిని శ్రీ శ్యామశాస్త్రి గారే పూజించాల్సి వచ్చింది. అంతకు ముందు వరకూ వందల సంవత్సరాలుగా బంగారు కామాక్షికి పూజ చేసిన పుష్పాలు వేరు, ఇక శ్యామ శాస్త్రి గారు చేసిన మామూలు పుష్పాల పూజతో పాటు అద్భుత సంగీత కుసుమాలు చేర్చి చేసిన పూజ అమోఘం అనిర్వచనీయం.

శ్రీ శ్యామ శాస్త్రి గారి ఉపాసనా, నాదోపాసన ఇతర జీవిత విశేషాలు మున్ముందు

మీ....


శ్రీ శ్యామ శాస్త్రి (శ్రీ కామాక్షీ చరణదాసుడు) - 1




శ్రీ గురుభ్యోనమః
అందరికీ నమస్సులు

//ఇందులో వీరి సంపూర్ణ జీవిత చరిత్రను పొందు పరచడం లేదు, కొన్ని ముఖ్య ఘట్టాలను మాత్రమే ప్రస్తుతించే ప్రయత్నం చేస్తున్నాను.//

సంగీత ప్రపంచంలో ఎందరో మహానుభావులు పుట్టి వారి విద్వత్తు చే వారి వారి స్థానాలను చిరస్థాయి చేసుకున్నవారెందరో మహానుభావులు ఉన్నారు. సంగీత ప్రపంచంలో అదీ ఘనమైన సాంప్రదాయ కర్ణాటక సంగీతంలో ఒకే కాలంలో ముగ్గురు విద్వాంసులు తమ కృతులచే విలక్షణ గాన పటిమచే సంగీత సామ్రాజ్యాన్నే వీరికి పూర్వం, వీరి తరవాత అన్న కాల విభజనే జరిగింది. ఎందరో సంగీత కళాకారులున్నా వీరి ముగ్గురి విషయంలోనే ఇంతగా ఎందుకు జరిగింది అన్నది ఇ ముగ్గురి విషయంలో చూస్తే  ఉన్నది ఒక్కటే కేవల సంగీత పాండిత్యమే కాదు, సంగీతోపాసన / నాదోపాసన ద్వారా వారు ఎలా పరమేశ్వరుని కృపకు చేరువయ్యారు అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసి ఉన్నది. వీరి జీవిత విషయాల ద్వారా కేవలం సంగీతం ద్వారా జీవితం పండించుకోవచ్చనేది కాక, మనకున్న వివిధ విభూతులద్వారా ఎలా భగవంతుని చేరుకోవాలో అన్వయం చేసుకోవడం ముఖ్యమని తలుస్తూ దీనిని ప్రారంభిస్తున్నాను. ఈ అన్వయం ఎవరికి వారు చేసుకోవడం శ్రేయం న్యాయం కూడా.


శ్రీ శ్యామ శాస్త్రి గారు ఈ సంగీత రత్న త్రయం గా పేర్గాంచిన శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తు స్వామి దీక్షితులలో వయస్సు రీత్యా పెద్దవారు. వారి పూర్వీకులు ఆంధ్ర దేశంలోని ప్రకాశం జిల్లా కంభం ప్రాంతం వారు. వారు ద్రవిడ దేశానికి వెళ్ళి స్థిర పడి తమిళ స్మార్త బ్రాహ్మణ శాఖ ఐన వడమ శాఖలో కలిసారు వీరినే ద్రవిడంలో వడదేశత్తు అని పిలుస్తారు. ఐతే ఈ కుటుంబానికి తెలుగు భాష పరిచయము కానీ, తెలుగు భాష యందు గౌరవము కానీ తరాలు మారినా తగ్గలేదు. చక్కని తేట తెలుగులో వీరి పాండిత్యం ఏ మాత్రమూ తగ్గలేదు పైగా వన్నెకెక్కింది. కంభం ప్రాంత నుండి కాంచీ పురానికి వలస వెళ్ళిన కారణాన వీర్ని కంబట్టార్ అని తమిళులు పిలిచేవారు. వీరి వంశము శ్రీ శంకర భగవత్పాదుల కాలంలోనే కంచిలో స్థిరపడినట్టుగా వీరి వంశ చరిత్ర ద్వారా తెలుస్తోంది. శంకర భగవత్పాదులు వీరి పూర్వీకులను కంచిలో కామాక్షి ఆలయ అర్చకులుగా నియమించారని చెప్తారు. అప్పటి నుండీ వీరు కంచి ఆలయ అర్చకులుగా కొనసాగుతున్నారు.

దాదాపు ఇరవై శతాబ్దాల తరవాత (క్రీశ 1500-1600) కాలంలో దక్షిణ దేశంలో రేగిన అశాంతి, దండయాత్రల వల్ల ఎన్నో ఆలయాలు ధ్వంసమై ఆలయ సంపద కొల్లగొట్టుకు పోతుంటే. వీరి కుటుంబం కంచిలో ఉన్న బ్రహ్మగారిచే నిర్మితమైన బంగారు కామాక్షి మూర్తిని తీసుకుని తమ సమస్త సంపదనూ వదిలి, అడవులలో తిరుగుతూ దాక్కుని అమ్మవారికి నిత్య పూజలు సేవ చేస్తూ దాదాపు 28-30 సంవత్సరాలు అడవులలో గడిపారు. తరవాత తంజావూరు సంస్థానాధీశులు వారికీ బంగారు కామాక్షికీ వసతులు కల్పించగా అక్కడే 15 సంవత్సరాలు గడిపారు. అక్కడి నుండీ అణక్కుడి జమీందారీలో పదిహేను సంవత్సరాలు తరవాత విజయపురంలో పదిహేను సంవత్సరాలు ఉండి అక్కడనుండి ఇతర గ్రామాలైన నాగూరు, మాడపురం, సిక్కిల్ గ్రామాలలో దాదాపుగా మరో పదిహేను సంవత్సరాలు ఉన్నారు. అక్కడ నుండి తిరువారూరుకు వచ్చి అక్కడ 45 సంవత్సరాలున్నారు. తిరువారూరు త్యాగరాజ స్వామి (పరమేశ్వరాలయం)లో ఒక ప్రత్యేక మంటపంలో ఉంచి పూజించే
వారు. ఇక్కడే మన ఈ వంశంలో ఒక రత్నం జన్మించింది. వారే శ్రీ శ్యామ శాస్త్రి. వారి తండ్రిగారు శ్రీ విశ్వనాధ అయ్యరు గారు అప్పటికి ఈ బంగారు కామాక్షి అమ్మకి సేవచేస్తూ అర్చకత్వం నిర్వహిస్తూ ఉండేవారు.

మైసూర్ పాలకుడు హైదర్ ఆలీ (టిప్పు సుల్తాన్ తండ్రి) తిరువారూరు మీద దండయాత్ర ప్రకటిస్తే ఏం చేయాలో తెలియక, అర్చకులు శ్రీ విశ్వనాధ అయ్యరు గారు తంజావూరు రాజుగారిని సంప్రదించి కోటలోనే బంగారు కామాక్షిని ప్రతిష్ఠించి అక్కడే సేవ చేసేవారు. ఆ కాలంలోనే ఇతర దేవాలయాలలోని విగ్రహములు కూడా తంజావూరు చేరాయి. ఎన్నో వైష్ణవ దేవాలయ విగ్రహాలు తంజావూరులోని రాజగోపాలస్వామి ఆలయం చేరాయి. అనంతరం కొద్ది కాలానికి హైదర్ ఆలీ మరణించిన తరవాత అన్ని విగ్రహాలూ ఆయా దేవస్థానాలకి తరలిపోయాయి. తరవాత తంజావూరులోనే అమ్మవారికి ఒక కోవెల నిర్మించి అక్కడే అమ్మవారిని ప్రతిష్ఠింప చేశారు. ఈ సమయంలో తంజావూరు రాజు గారు శ్రీ విశ్వనాథ అయ్యరు వారికి కొన్ని అగ్రహారాలను, కానుకలను ఇచ్చారు. అమ్మ వారి ఆలయానికి కొంత భూమిని కానుకలను ఇచ్చారు. ఇప్పుడు ఆదేవాలయము కట్టి 225 సం పైనే అయ్యింది. ఆ ఆలయమే ఇప్పటికీ శ్రీ కామాక్షీ అమ్మన్ కోవెల్ గా ప్రసిద్ధి చెందింది.

[ఈ మధ్యలో ఎన్ని తరాలు మారినా వారి కామాక్షీ సేవ మాత్రం ఏనాడూ మారలేదు, మానలేదు. ఎన్ని అడ్డంకులు అమ్మమీద అకుంఠిత దీక్షతో అమ్మనే నమ్ముకుని కొన్న శతాబ్దాలుగా వారు చేసిన బంగారు కామాక్షికి చేసిన సేవ అనన్య సామాన్యం. కన్న తండ్రి మాట కొడుకులు వినని ఈ నాటి ఈ పరిస్తితులకి వారి వంశాన్ని చూసి నేర్చుకోవలసినదెంతో ఉంది. దాదాపు రెండు వేల సంవత్సరాలకు పైగా కాంచీపుర ఆలయ అర్చకులుగా సేవచేసి. అమ్మవారి సేవే తమ సమస్త ఐశ్వర్యం అని భావించి ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి తరులుతూ ఎన్ని తరాలు అమ్మ సేవలో అంకితమయ్యాయో.]

ఇక శ్రీ శ్యామ శాస్త్రి గారి జననం గురించి ఒక కథ ఉంది. తిరువారూరులో శ్రీ విశ్వనాథ అయ్యరు వారున్నప్పుడు అక్కడ ఉన్న ఒక భక్తుడు ప్రతి శనివారం వేంకటేశ్వర సమారాధన చేసేవాడు. ఆ సమారాధనకి ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చి ఉన్నట్టుండి పూనకం వచ్చినట్టు శ్రీశ్యామ శాస్త్రి తల్లిగారిని పిలిచి నీకు వచ్చే సంవత్సరం చైత్ర మాసంలో కృత్తికా నక్షత్రం ఉండగా కొడుకు పుడతాడు, నువ్వు నూరుగురికి సమారాధన చేయమని ఆజ్ఙాపించాడు. అప్పటికే వారి వంశం వారు అన్ని ఊళ్ళూ తిరుగుతున్న కారణాన ఎక్కడా ఏ కొంతా దాచుకుందిలేదు. వారి వద్దనున్నదంతా బంగారు కామాక్షిని కొలవడం తప్ప. అందువల్ల ఆమె తటపటాయిస్తుంటే పోన్లే నూరు మందికి కాకపోతే అందులో పావు వంతు మందికి అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. ఆవిడ సంతోషించింది. తరవాత కొంతకాలానికి ఆవిడ గర్భిణి అయ్యింది. ఆ బ్రాహ్మణుడు చెప్పిన విధంగా నే చక్కటి కొడుకు పుట్టాడు. వేంకటే శ్వరుని అనుగ్రహం అనీ, కృత్తికా నక్షత్రంరోజున పుట్టాడు కాబట్టి సుబ్రహ్మణ్యం అనీ కలిపి 'వేంకట సుబ్రహ్మణ్యం' అని పేరు పెట్టారు. కామాక్షీ / వేంకటేశ్వరుల అనుగ్రహం కదా వారు కాస్త రంగు తక్కువ పైగా స్ఫురద్రూపి కావటంతో 'శ్యామ కృష్ణ' అని ముద్దుగా పిలుచుకునేవారు ఆదంపతులు. కానీ అప్పటికి వారికి పుట్టినవాడు పుం రూపంలో ఉన్న కామాక్షీ అంశ  / కామాక్షి సోదరుడైన వేంకటనాథుని అంశ అనుగ్రహం కలిగినవాడు అని కానీ తెలియదు. విశ్వ విఖ్యాత సంగీత ఖ్యాతిని ఆర్జిస్తాడనీ తెలియదు.

ఇక వారి సంగీత ప్రస్థానం మున్ముందు....


మీ....