జై రాధే శ్యామ్
బృందావనంలో ఆ ఉదయం స్వర్గం భూమిపైకి దిగివచ్చినట్లుగా విరాజిల్లుతోంది. యమునా తీరాల నుండి వీచే మృదుమారుతం పూల పరిమళాలను తన రెక్కలపై మోసుకొని వనమంతా చల్లుతోంది. కదంబ వృక్షాలు సున్నితంగా తమ కొమ్మలను రెమ్మలను ఊపుతున్నాయి. మల్లెలు తమ తెల్లని నవ్వులు చిందిస్తున్నాయి. మందారాలు, సంపెంగలు, పారిజాతాలు తమ అందాలతో వనరాజ్యాన్ని అలంకరిస్తున్నాయి.
పక్షులు మధురమైన రాగాలు ఆలపిస్తున్నాయి. తుమ్మెదలు పుష్పాలపై వాలుతూ ప్రేమగీతాలు పాడుతున్నాయి. యమునా తరంగాలు తీరాన్ని ముద్దాడుతూ మృదువుగా మురళీనాదానికి తాళం వేస్తున్నట్లున్నాయి.
ఆ దివ్యవేళలో, శ్రీమతి రాధారాణి తన ప్రియ సఖులతో కలిసి కుసుమసరోవర సమీపంలోని లతాకుంజాలలో విహరిస్తోంది.
ఆమె అడుగులు పడిన చోట భూమి పులకించిపోతోంది.
ఆమె నవ్విన చోట గాలికి చెక్కిలిగింతలు పుడుతున్నాయి.
ఆమె చూపులు తాకిన చోట పుష్పాలు వికసిస్తున్నాయి.
అప్పుడే రాధారాణి చూపులు ఒక అందమైన తీగసంపెంగ పువ్వుపై నిలిచిపోయాయి.
ఆ పుష్పం బంగారు కాంతులా మెరిసిపోతోంది. దాని పరిమళం గాలిలో కలసి మనసులను మత్తెక్కిస్తోంది.
రాధారాణి ఆ పువ్వును చూసి మనసులో అనుకుంది—
"ఈ సంపెంగ పుష్పాన్ని ధరించి నా కాన్హా ఎదుట నిలబడితే... ఆయన చూపులు ఎలా ఉంటాయో?"
ఆ ఆలోచన రాగానే ఆమె పెదవులపై ఒక చిరునవ్వు విరిసింది. చెక్కిళ్లపై సిగ్గు రంగులు పూశాయి.
మెల్లగా తన సుకుమారమైన హస్తాన్ని చాచి ఆ పుష్పాన్ని కోయబోయింది.
కానీ...
అనుకోకుండా ఆమె నీలవర్ణపు మేలిముసుగు పక్కనే ఉన్న ముల్లుల పొదలో చిక్కుకుంది.
రాధారాణి ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
మనసులో ఒక చిన్న ఆలోచన మెరిసింది—
"అయ్యో...! ఈ వెన్నదొంగ మళ్లీ దొంగతనంగా వచ్చి నా ముసుగు లాగుతున్నాడేమో?"
అని తలచుకొని చుట్టూ చూసింది.
అప్పుడే...
పూల తీగల వెనుక నుంచి ఒక మృదువైన స్వరం వినిపించింది
“ఓ సుందరీ! మీకు సహాయం చేయనా?”
రాధారాణి ఆశ్చర్యంగా ఆ వైపు చూసింది.
అక్కడ ఒక యువకుడు నిలబడి ఉన్నాడు.
నల్లని నొక్కుల కురులు...
మేఘశ్యామ వర్ణం...
తామర రేకులవంటి నేత్రాలు...
పెదవులపై మృదుస్మితం...
కానీ వస్త్రధారణ మాత్రం ఒక సాధారణ తోటమాలివాడిలా ఉంది.
అతడు చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తూ
“నేను బృందాదేవి సేవకుడిని దేవీ. ఈ పుష్పవాటికను సంరక్షించే మాలిని. మీకు ఇబ్బంది కలిగిందని చూసి వచ్చాను.” అన్నాడు.
రాధారాణి కనుబొమ్మలు కొద్దిగా ముడిచింది.
“నీవు తోటమాలివాడివా? ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడూ నిన్ను చూడలేదే?”
అని కొంచెం గద్దించినట్లుగా అడిగింది.
కానీ మనసులో మాత్రం
"ఎందుకో... ఈ స్వరం... ఈ చూపులు... ఈ చిరునవ్వు... నా హృదయానికి ఎప్పటినుంచో తెలిసినట్లుంది..."
అని అనుకుంది.
ఆ యువకుడు కళ్లతో కొంటెగా, పెదవులతో సన్నగా నవ్వాడు.
“కొన్ని పరిచయాలు కళ్లతో కాదు దేవీ... హృదయంతో దర్శిస్తే గుర్తుకొస్తాయి.”
అని చెప్పి మెల్లగా ఆమె దగ్గరకు వచ్చాడు.
ఆ ముల్లులలో చిక్కుకున్న ముసుగును ఎంతో జాగ్రత్తగా విడదీయసాగాడు.
అప్పుడు...
అనుకోకుండా ఆయన వేళ్లు రాధారాణి సుకుమార హస్తాన్ని తాకాయి.
ఆ స్పర్శతో—
కాలమే ఒక క్షణం ఆగిపోయింది.
గాలి వీచడం మరిచిపోయింది.
తుమ్మెదలు గానం నిలిపివేశాయి.
యమునా తరంగాలు సైతం నిశ్చలమయ్యాయి.
రాధారాణి హృదయంలో మాత్రం ప్రేమ తరంగాలు ఉప్పొంగసాగాయి.
ఆమె తలను వంచుకుంది.
ఆ సమయంలో గాలి మెల్లగా ఒక ప్రేమగీతాన్ని తీసుకొచ్చింది
"యమునా తీరమున
చల్లని గాలిలో
వేణువు మ్రోగెనే...
కృష్ణుని మురళి మ్రోగెనే"
మరలా—
"మురళీ గానమే మధురం...
మోహన రూపమే మనోహరం..."
రాధారాణి కళ్లలో ప్రేమ కాంతులు మెరవసాగాయి.
వేయి వేణువులు ఒకేసారి కృష్ణనామాన్ని ఆలపిస్తున్నట్లుగా ఆమె హృదయం తన్మయత్వం పొందింది.
కానీ...
ఆ రహస్యం లలితా, విశాఖల కళ్ల నుంచి దాగలేదు. కృష్ణుడు ఏ వేషం వేసినా లలిత-విశాఖ సఖులకు దొరికిపోతాడు...
ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు.
లలితా సఖి అంది—
“రాధే! ఈ తోటమాలివాడి కళ్లలో పూలకంటే ఎక్కువ చిలిపితనం కనిపిస్తోంది!”
విశాఖ నవ్వుతూ—
“ఇతడు పూలను కాపాడే మాలివాడు కాదు... హృదయ కుసుమాలను దోచుకునే దొంగవాడు!”
అందరూ ఒకేసారి నవ్వుతూ అన్నారు—
“ఇతడే మన శ్యామసుందరుడు! మురళీకృష్ణుడు! గోపీ మానసచోరుడు”
అప్పుడే సఖులు నవ్వుతూ ఆలపించారు—
"వనమాలీ వాసుదేవా
జగన్మోహన రాధారమణా
శశివదనా సరసిజనయనా..."
అంతే...
ఆ తోటమాలి పెదవులపై దాగి ఉన్న చిరునవ్వు మరింత విరిసింది.
రాధారాణి సిగ్గుతో కళ్లను దించి.
చిరుకోపంతో తల వంచింది.
ఆ సమయంలో ప్రేమగాలి మళ్లీ ఒక గీతాన్ని ఆలపించింది—
"రాధే రాధే జపో చలే ఆయేంగే బిహారీ,
కృష్ణుడు మాత్రం అమాయకంగా నిలబడి ఉన్నాడు. చేతితో మెల్లిగా రాధముఖం యెత్తి కళ్లలోకి చూస్తూ తన కళ్లతో "ముల్లులలో చిక్కుకుంది నీ ముసుగు మాత్రమే కాదు రాధే...
నీ ప్రేమ తీగలలో చిక్కుకున్నది నా హృదయం కూడా..." అంటూ గీతం ఆలపించసాగాడు... రాధ కృష్ణుని మొహంలోకి చూస్తూ మైమరచిపోయింది....
"రాధ అనే నామములో ప్రేమ ఉన్నది,
కృష్ణ అనే శబ్దములో ప్రాణమున్నది.
రాధ లేక శ్యాముడు అసంపూర్ణమే,
కృష్ణ లేక రాధ ప్రేమ నిర్జీవమే."
రాధే... రాధే...
– శంకరకింకరః