Pages

Friday, June 19, 2026

బృందావన కథలు – 17 (తోటమాలి – వనమాలి)

జై రాధే శ్యామ్

బృందావనంలో ఆ ఉదయం స్వర్గం భూమిపైకి దిగివచ్చినట్లుగా విరాజిల్లుతోంది. యమునా తీరాల నుండి వీచే మృదుమారుతం పూల పరిమళాలను తన రెక్కలపై మోసుకొని వనమంతా చల్లుతోంది. కదంబ వృక్షాలు సున్నితంగా తమ కొమ్మలను రెమ్మలను ఊపుతున్నాయి. మల్లెలు తమ తెల్లని నవ్వులు చిందిస్తున్నాయి. మందారాలు, సంపెంగలు, పారిజాతాలు తమ అందాలతో వనరాజ్యాన్ని అలంకరిస్తున్నాయి.
పక్షులు మధురమైన రాగాలు ఆలపిస్తున్నాయి. తుమ్మెదలు పుష్పాలపై వాలుతూ ప్రేమగీతాలు పాడుతున్నాయి. యమునా తరంగాలు తీరాన్ని ముద్దాడుతూ మృదువుగా మురళీనాదానికి తాళం వేస్తున్నట్లున్నాయి.
ఆ దివ్యవేళలో, శ్రీమతి రాధారాణి తన ప్రియ సఖులతో కలిసి కుసుమసరోవర సమీపంలోని లతాకుంజాలలో విహరిస్తోంది.
ఆమె అడుగులు పడిన చోట భూమి పులకించిపోతోంది.
ఆమె నవ్విన చోట గాలికి చెక్కిలిగింతలు పుడుతున్నాయి.
ఆమె చూపులు తాకిన చోట పుష్పాలు వికసిస్తున్నాయి.
అప్పుడే రాధారాణి చూపులు ఒక అందమైన తీగసంపెంగ పువ్వుపై నిలిచిపోయాయి.
ఆ పుష్పం బంగారు కాంతులా మెరిసిపోతోంది. దాని పరిమళం గాలిలో కలసి మనసులను మత్తెక్కిస్తోంది.
రాధారాణి ఆ పువ్వును చూసి మనసులో అనుకుంది—
"ఈ సంపెంగ పుష్పాన్ని ధరించి నా కాన్హా ఎదుట నిలబడితే... ఆయన చూపులు ఎలా ఉంటాయో?"
ఆ ఆలోచన రాగానే ఆమె పెదవులపై ఒక చిరునవ్వు విరిసింది. చెక్కిళ్లపై సిగ్గు రంగులు పూశాయి.
మెల్లగా తన సుకుమారమైన హస్తాన్ని చాచి ఆ పుష్పాన్ని కోయబోయింది.
కానీ...
అనుకోకుండా ఆమె నీలవర్ణపు మేలిముసుగు పక్కనే ఉన్న ముల్లుల పొదలో చిక్కుకుంది.
రాధారాణి ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
మనసులో ఒక చిన్న ఆలోచన మెరిసింది—
"అయ్యో...! ఈ వెన్నదొంగ మళ్లీ దొంగతనంగా వచ్చి నా ముసుగు లాగుతున్నాడేమో?"
అని తలచుకొని చుట్టూ చూసింది.
అప్పుడే...
పూల తీగల వెనుక నుంచి ఒక మృదువైన స్వరం వినిపించింది
“ఓ సుందరీ! మీకు సహాయం చేయనా?”
రాధారాణి ఆశ్చర్యంగా ఆ వైపు చూసింది.
అక్కడ ఒక యువకుడు నిలబడి ఉన్నాడు.
నల్లని నొక్కుల కురులు...
మేఘశ్యామ వర్ణం...
తామర రేకులవంటి నేత్రాలు...
పెదవులపై మృదుస్మితం...
కానీ వస్త్రధారణ మాత్రం ఒక సాధారణ తోటమాలివాడిలా ఉంది.
అతడు చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తూ
“నేను బృందాదేవి సేవకుడిని దేవీ. ఈ పుష్పవాటికను సంరక్షించే మాలిని. మీకు ఇబ్బంది కలిగిందని చూసి వచ్చాను.” అన్నాడు.
రాధారాణి కనుబొమ్మలు కొద్దిగా ముడిచింది.
“నీవు తోటమాలివాడివా? ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడూ నిన్ను చూడలేదే?”
అని కొంచెం గద్దించినట్లుగా అడిగింది.
కానీ మనసులో మాత్రం
"ఎందుకో... ఈ స్వరం... ఈ చూపులు... ఈ చిరునవ్వు... నా హృదయానికి ఎప్పటినుంచో తెలిసినట్లుంది..."
అని అనుకుంది.
ఆ యువకుడు కళ్లతో కొంటెగా, పెదవులతో సన్నగా నవ్వాడు.
“కొన్ని పరిచయాలు కళ్లతో కాదు దేవీ... హృదయంతో దర్శిస్తే గుర్తుకొస్తాయి.”
అని చెప్పి మెల్లగా ఆమె దగ్గరకు వచ్చాడు.
ఆ ముల్లులలో చిక్కుకున్న ముసుగును ఎంతో జాగ్రత్తగా విడదీయసాగాడు.
అప్పుడు...
అనుకోకుండా ఆయన వేళ్లు రాధారాణి సుకుమార హస్తాన్ని తాకాయి.
ఆ స్పర్శతో—
కాలమే ఒక క్షణం ఆగిపోయింది.
గాలి వీచడం మరిచిపోయింది.
తుమ్మెదలు గానం నిలిపివేశాయి.
యమునా తరంగాలు సైతం నిశ్చలమయ్యాయి.
రాధారాణి హృదయంలో మాత్రం ప్రేమ తరంగాలు ఉప్పొంగసాగాయి.
ఆమె తలను వంచుకుంది.
ఆ సమయంలో గాలి మెల్లగా ఒక ప్రేమగీతాన్ని తీసుకొచ్చింది
"యమునా తీరమున
చల్లని గాలిలో
వేణువు మ్రోగెనే...
కృష్ణుని మురళి మ్రోగెనే"
మరలా—
"మురళీ గానమే మధురం...
మోహన రూపమే మనోహరం..."
రాధారాణి కళ్లలో ప్రేమ కాంతులు మెరవసాగాయి.
వేయి వేణువులు ఒకేసారి కృష్ణనామాన్ని ఆలపిస్తున్నట్లుగా ఆమె హృదయం తన్మయత్వం పొందింది.
కానీ...
ఆ రహస్యం లలితా, విశాఖల కళ్ల నుంచి దాగలేదు. కృష్ణుడు ఏ వేషం వేసినా లలిత-విశాఖ సఖులకు దొరికిపోతాడు...
ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు.
లలితా సఖి అంది—
“రాధే! ఈ తోటమాలివాడి కళ్లలో పూలకంటే ఎక్కువ చిలిపితనం కనిపిస్తోంది!”
విశాఖ నవ్వుతూ—
“ఇతడు పూలను కాపాడే మాలివాడు కాదు... హృదయ కుసుమాలను దోచుకునే దొంగవాడు!”
అందరూ ఒకేసారి నవ్వుతూ అన్నారు—
“ఇతడే మన శ్యామసుందరుడు! మురళీకృష్ణుడు! గోపీ మానసచోరుడు”
అప్పుడే సఖులు నవ్వుతూ ఆలపించారు—
"వనమాలీ వాసుదేవా
జగన్మోహన రాధారమణా
శశివదనా సరసిజనయనా..."
అంతే...
ఆ తోటమాలి పెదవులపై దాగి ఉన్న చిరునవ్వు మరింత విరిసింది.
రాధారాణి సిగ్గుతో కళ్లను దించి.
చిరుకోపంతో తల వంచింది.
ఆ సమయంలో ప్రేమగాలి మళ్లీ ఒక గీతాన్ని ఆలపించింది—
"రాధే రాధే జపో చలే ఆయేంగే బిహారీ,
కృష్ణుడు మాత్రం అమాయకంగా నిలబడి ఉన్నాడు. చేతితో మెల్లిగా రాధముఖం యెత్తి కళ్లలోకి చూస్తూ తన కళ్లతో "ముల్లులలో చిక్కుకుంది నీ ముసుగు మాత్రమే కాదు రాధే...
నీ ప్రేమ తీగలలో చిక్కుకున్నది నా హృదయం కూడా..." అంటూ గీతం ఆలపించసాగాడు... రాధ కృష్ణుని మొహంలోకి చూస్తూ మైమరచిపోయింది....
"రాధ అనే నామములో ప్రేమ ఉన్నది,
కృష్ణ అనే శబ్దములో ప్రాణమున్నది.
రాధ లేక శ్యాముడు అసంపూర్ణమే,
కృష్ణ లేక రాధ ప్రేమ నిర్జీవమే."
రాధే... రాధే...
– శంకరకింకరః

శ్రీగురు దత్తాత్రేయ కథలు – 3 (అడవిలో చిక్కుకున్న భక్తుడు)

జై గురు దత్త! జై గురు దత్త!

భక్తవత్సలా! మాం పాహి!

జీవితంలో ఎన్నిసార్లు మనం దారి తప్పుతాము.
కొన్నిసార్లు అడవిలో...
మరికొన్నిసార్లు మనసులో...
మరికొన్నిసార్లు జీవితంలో...
కానీ గురుదత్తుని నమ్మిన భక్తుడు ఒంటరివాడు కాదు.
సమయం వచ్చినప్పుడు...
అవసరం వచ్చినప్పుడు...
ఎదో ఒక రూపంలో...
ఎదో ఒక వ్యక్తి రూపంలో...
ఎదో ఒక మార్గంగా...
గురుదత్తుడు వచ్చి రక్షిస్తాడు.
"గురుదత్తుని అభయహస్తం ఉన్నవారికి భయం ఉండదు."
----

సహ్యాద్రి పర్వతాల మధ్యలో దట్టమైన అరణ్యాలు విస్తరించి ఉండే రోజులవి
పగలు కూడా సూర్యకాంతి పూర్తిగా నేలను తాకలేని విధంగా ఎత్తైన వృక్షాలు ఆకాశాన్ని కప్పి ఉంచే చిక్కని అడవులు.
ఆ అడవుల్లో అక్కడక్కడా సన్యాసులు, యోగులు, భక్తులు తపస్సు చేసేవారు.
ఆ కాలంలో గోవిందుడనే ఒక యువకుడు ఉండేవాడు.
చిన్నప్పటి నుంచీ అతనికి దత్తాత్రేయ స్వామివారి మీద అపారమైన భక్తి.

ఇంట్లో ఏ పని మొదలుపెట్టినా... "దత్తా!" అని మొదలుపెట్టేవాడు.
నిద్రపోయే ముందు... "దత్తా!" అని జపించేవాడు.
కష్టంలో ఉన్నప్పుడు... "దత్తా!" అని పిలిచేవాడు.
అతని జీవితం మొత్తం గురుదత్త నామస్మరణతో నిండిపోయి ఉండేది.

ఒక రోజు అతనికి సహ్యాద్రి పర్వతాల్లో సంచరించే అవధూత దత్తుని క్షేత్రాలను, దత్త భక్తులను, సాధు సంతులను దర్శించాలి అనే కోరిక కలిగింది. ఇక బయలుదేరదామని నిర్ణయించుకుని, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని "జై గురు దత్తా మాంపాహి! జై గురుదత్తా మాంపాహి!" అంటూ ప్రయాణం ప్రారంభించాడు.

అలా దత్త భక్తులను, సాధుసంతులను దర్శిస్తూ, దత్తక్షేత్రాలు దర్శిస్తూ కొన్ని రోజులు గడిచాయి.
ఆ అడవుల్లోని, సెలయేళ్ళలో, నదుల్లో స్నానం చేశాడు.
సాధువుల ఆశీర్వాదం పొందాడు.
అతని మనసు భక్తి పారవశ్యంతో నిండిపోయింది.

అలా ఇంకా కొనసాగుతూ ఒకనాటి సాయంత్రం... సూర్యుడు అస్తమించబోతున్న సమయంలో ఒక కొండల మధ్య లోయదారిలో ప్రయాణిస్తూ ఉండగా అతను దారి తప్పిపోయాడు.

మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు, ఇంకొద్దిగా వెళితే ఏ గూడేనికో, భక్తుల ఆశ్రమానికో చేరుకుంటాన్లెమ్మని అలాగే నడవసాగాడు... రాత్రౌతోంది... మరింత చీకటి అలుముకుంటోంది ఐనా " ఇంకొద్దిసేపట్లో దారి దొరుకుతుంది." అనుకున్నాడు.

కానీ చీకటి వేగంగా కమ్ముకుంది. అడవి నిశ్శబ్దంగా మారింది, పక్షుల కిల కిలారావాలు ఆగిపోయి, అక్కడక్కడ ఒకటిరెండు పక్షిల కూతలు మాత్రమే వినిపిస్తున్నాయి దూరంగా గుడ్లగూబ అరుపులు వినిపిస్తున్నాయి. మరింత దూరంగా, తమ స్థావరాలు చేరిన జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. చెట్ల కొమ్మలు గాలికి ఊగుతూ భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి. కీచురాళ్ళ రొద ఎక్కువౌతోంది.

గోవిందుడి గుండెల్లో భయం మొదలైంది.
ఎటు చూసినా చీకటే.
దారి కనిపించడం లేదు.
మనిషి కాదు కదా దగ్గర్లో ఏజీవి జాడ కూడా లేదు.

కొంతసేపటికి వాన చినుకులు మొదలై, అది భారీ వర్షంగా మారింది.
మెరుపులు మెరుస్తున్నాయి - ఉరుములు గర్జిస్తున్నాయి. అడవి మరింత భయంకరంగా కనిపిస్తోంది. గోవిందుడు ఒక చెట్టు క్రింద నిలబడి వణికిపోయి, బిక్కు బిక్కుమంటున్నాడు...

"దత్తా! నన్ను కాపాడు. నాకు దారి చూపించు అంటూ జైగురుదత్తా! మాం పాహి!జైగురుదత్తా! మాం పాహి! " అని ప్రార్థించడం ప్రారంభించాడు.

సమయం గడుస్తోంది.
వర్షం తగ్గడం లేదు.
ఆకలి వేస్తోంది.
అలసట పెరుగుతోంది.
భయం మరింత ఎక్కువవుతోంది.

తాను ఉన్న చెట్టును ఆనుకుని మరింత అనువైన ప్రదేశంకోసం ఆ పెద్ద మాను చుట్టూ తిరుగుతూ వెనకకు చేరుకున్నాడు అప్పుడే...
దూరంలో ఒక చిన్న దీపం వెలుగుతున్నట్లు కనిపించింది.
"ఈ అడవిలో, ఇంత రాత్రిలో, ఇంత హోరువానలో దీపపు వెలుగా!?" అని ఆశ్చర్యపోయాడు.

కింద పడ్డ ఓ కర్ర ఊతంగా తీసుకొని జాగ్రత్తగా ఆ వెలుగు వైపుకు అడుగులో అడుగు వేసుకుంటూ నడిచాడు. కొద్దిదూరం వెళ్లగానే ఒక చిన్న కుటీరం కనిపించింది.
ఆ కుటీరం ముందు ఒక వృద్ధ సన్యాసి కూర్చున్నాడు.
తెల్లని గడ్డం.
ప్రశాంతమైన ముఖం.
కళ్లలో అపారమైన దయ వర్షిస్తున్నాయి.

గోవిందుడు ఆనందంతో గబ గబా వెళ్లాడు "స్వామీ! నేను దారి తప్పిఈ అడవిలో చిక్కుకుపోయాను. మీరెవరో ఆపద్బాంధవుడిలా కనపడ్డారు" అన్నాడు.

సన్యాసి చిరునవ్వు నవ్వి "నాయనా! ముందు లోపలికి రా." అని పిలిచాడు. గోవిందుడు ఒళ్ళు తుడుచుకోడానికి వేడినీళ్ళిచ్చాడు, కట్టుకోడానికి పొడి బట్టలు ఇచ్చాడు. ఆ తరావత తాగడానికి వేడి వేడి పాలు ఇచ్చాడు. కొన్ని పళ్ళముక్కలు, రొట్టెలు దుంపలు మొదలైన ఆహారం పెట్టాడు. గోవిందుడు ఆ సన్యాసికి మనసారా నమస్కరించాడు.

ఆ రాత్రంతా గోవిందుడితో ముసలాయన సన్యాసి అతనితో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడాడు.
ధర్మం గురించి చెప్పాడు.
భక్తి గురించి చెప్పాడు.
గురుభక్తి గురించి చెప్పాడు.
జీవితం గురించి చెప్పాడు.
ఇలా ఎన్నో విషయాలు...

గోవిందుడు ఆ సన్యాసికి కాళ్లు పడుతూ ఆ మాటలు వింటూ గడిపాడు, గోవిందుడికి ఆ రాత్రి ఒక వింతైన ఆత్మ శాంతి కలిగింది, మనసులోని అలజడి తగ్గింది. అతను తన జీవితంలో ఎప్పుడూ అనుభవించని ఏదో అలౌకిక ఆనందాన్ని పొందాడు.

తెల తెలవారుతుండగా వర్షం ఆగిపోయింది

సూర్యోదయం అయ్యింది .
గోవిందుడు స్నానాదికాలు ముగించుకున్నాడు,
సన్యాసి బయటకు వచ్చి ఒక దారిని చూపించి "ఈ దారిలో వెళ్తే ఒక గ్రామం వస్తుంది. అక్కడనుంచి నువ్వు చేరాల్సిన నీ వూరికి వెళ్లడం తేలకౌతుంది" అన్నాడు.

గోవిందుడు అటుచూసి "జైగురు దత్తా! మాంపాహి! జైగురు దత్తా! మాంపాహి!" అంటూ బయలుదేరాడు.

కొన్ని అడుగులు వేసాక, ఒక్కసారిగా గుర్తొచ్చింది. "స్వామివారికి సరిగా కృతజ్ఞత చెప్పలేదు. ఆయన దారి చూపగానే బయలుదేరిపోయాను, అయ్యో" అని వెనక్కి తిరిగి చూశాడు.

కానీ...
అక్కడ కుటీరం లేదు!
సన్యాసి లేడు!
దీపం లేదు!
ఏమీ లేదు!
అక్కడ ఒక పెద్ద రావిచెట్టు మాత్రమే ఉంది.
గోవిందుడు ఆశ్చర్యంతో నిలిచిపోయాడు.

తాను రాత్రంతా ఉన్న కుటీరం ఎక్కడ?
ఆ సన్యాసి ఎక్కడ?
అప్పుడే అతని దృష్టి చెట్టు కింద ఉన్న ఒక రాతిపై పడింది.
అందులో ఇలా చెక్కి ఉంది " జై శ్రీ గురు దత్త"

అతనికి అర్థమైంది.
ఆ రాత్రి తనను రక్షించిన వృద్ధ సన్యాసి మరెవరో కాదు...
సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయ స్వామివారే!

ఆ క్షణంలో అతని హృదయం ఉప్పొంగిపోయింది.
కళ్లలో ఆనందబాష్పాలు నిండిపోయాయి.
"దత్తా! నువ్వే వచ్చావా?" అని ఏడుస్తూ నమస్కరించాడు.

ఆ రోజు నుండి గోవిందుడి భక్తి మరింత పెరిగింది.
ఎక్కడికి వెళ్లినా...
ఎవరిని కలిసినా...
ఒకటే చెప్పేవాడు:
"దత్తుణ్ణి నమ్మినవాడిని దత్తుడు ఎప్పుడూ విడిచిపెట్టడు."

---

దత్త భక్తులు ఈ కథ చెప్పుకుంటూ "భక్తుడు ఒక అడుగు వేస్తే... దత్తుడు వంద అడుగులు ముందుకు వస్తాడు." అని అంటూంటారు.

జై గురు దత్త! జై గురు దత్త!
భక్తవత్సలా! మాం పాహి!

-శంకరకింకరః




బృందావన కథలు – 16 (రాధకోసమై వంటశాలలో కన్నయ్య)

జై రాధే కృష్ణ

బృందావనంలోని ఆ ఉదయం ఎంతో దివ్యంగా, మధురంగా ఉంది. యమునా తీరాలపై చల్లని మలయమారుతం మెల్లగా వీస్తోంది. కదంబ వృక్షాలపై వికసించిన పుష్పాలు తమ సుగంధాలను గాలిలో చల్లుతూ ఆ వాతావరణాన్నంతా ప్రేమరసంతో నింపుతున్నాయి. బృందావనపు వీధుల్లో గోపికల గానాలు మృదువుగా ప్రతిధ్వనిస్తున్నాయి. పక్షులు కూడా తమ కిలకిలారావాలతో ఆ మాధుర్యానికి స్వరాలద్దుతున్నాయి.
దూరంలో మురళీనాదం వినిపించింది… అది సాధారణ సంగీతం కాదు — అది రాధా నామాన్ని జపించే ప్రేమ గానం.
"శ్యామ్ నీ వేణువు పలుకుతోందే రాధా నామమే,
నీ స్వరములలో వినిపించేదే నా ప్రాణ నామమే…"
"నీ మురళి మాధుర్యములో నా మనసు మునిగెనయ్యా,
నీ రాధా నామ స్మరణలో నా హృదయం నిలిచెనయ్యా…"
ఆ ప్రేమనాదాల మధ్య, రాధారాణి తన వంటశాలలో ఎంతో శ్రద్ధగా భోజనం సిద్ధం చేస్తోంది. ఆమె చేతులు వంట చేస్తున్నాయి, కానీ మనసంతా కన్నయ్య స్మరణలోనే ఉంది.
ప్రతి పాత్రలో ప్రేమను కలుపుతోంది, ప్రతి వంటకంలో భక్తిని జోడిస్తోంది. అయితే ఎంతోసేపు పనులు చేస్తూ చేస్తూ అలసిపోయింది. ఆమె నుదుటిపై చిన్న చిన్న చెమట బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి.
అంతలో వెనుకనుంచి మెల్లగా రెండు చేతులు వచ్చి ఆమె కళ్లను మూసేశాయి.
రాధ స్వల్పంగా నవ్వుతూ—
"కృష్ణా... నీ స్పర్శను గుర్తుపట్టడానికి నాకు కళ్ల అవసరమా?" అంది.
ఆ మాట విన్న కన్నయ్య చిరునవ్వుతో ఆమె ఎదుటికి వచ్చాడు. నెమలిపింఛం కొంచెం వంగి ఉంది, కళ్లలో అల్లరి నిండిపోయి ఉంది.
"రాధే!" అని ఎంతో మృదువుగా పిలిచాడు.
"ఏమైంది కృష్ణా?"
కృష్ణుడు కొంచెం బాధగా ఆమె ముఖాన్ని చూస్తూ అన్నాడు—
"రాధే! నువ్వు అందరి కోసం ఎంతగా శ్రమిస్తున్నావో చూస్తుంటే నా మనసుకు బాధగా ఉంది. నీ చేతుల్లో అలసట కనిపిస్తుంటే నా హృదయం నిశ్చలంగా ఉండలేకపోతోంది. ఈరోజు నువ్వు విశ్రాంతి తీసుకో. భోజనం నేను తయారు చేస్తాను."
రాధ నవ్వుతూ—
"కృష్ణా! నీకు వెన్న దొంగిలించడం, గోపికలను ఆటపట్టించడం, మురళి ఊదటం మాత్రమే తెలుసు. వంట చేయడం కూడా వచ్చా?" అంది.
అది విన్న కన్నయ్య చిన్నపిల్లాడిలా పెదవులు ముడుచుకున్నాడు.
"రాధే! ప్రేమ ఉన్న చోట అసాధ్యం అనేదే ఉండదు." అన్నాడు.
అంటూనే రాధ చుట్టూ తిరుగుతూ అల్లరిగా పాడసాగాడు—
"రాధే రాధే బర్సానా రాధే,
నా హృదయం పలికేదంతా రాధే…"
"నీ పేరే నా శ్వాస...నీ ప్రేమే నా లోకం…"
రాధారాణి ఆ పాటలు విని మురిసిపోతూ,నవ్వుతూ తల ఊపింది.
"సరే కృష్ణా! చూద్దాం నీ మహా వంటలీల!" అని కొంటెగా కన్నుగీటింది
కృష్ణుడు ఆనందంగా వెంటనే వంటగదిలోకి అడుగుపెట్టాడు.
కానీ జగన్నాటక సూత్రధారికి కూడా ఆ రోజు వంటగది చిన్న యుద్ధరంగంలా మారిపోయింది.
ముందుగా పిండిని కలపడం మొదలుపెట్టాడు. ఒకసారి నీళ్లు ఎక్కువ పోశాడు. పిండి చాలా మెత్తగా అయిపోయింది. మళ్లీ పిండి వేసి కలిపాడు — ఇప్పుడు అది రాయిలా గట్టిగా తయారైంది.
"అయ్యో! కాళీయమర్దనం చేయడం కంటే ఇదే కష్టంగా ఉందే!" అని తల గోక్కున్నాడు.
కూరలు కోయడం మొదలుపెట్టాడు. కొన్ని ముక్కలు చాలా పెద్దవి, కొన్ని చాలా చిన్నవి అయ్యాయి.
బయట దాక్కొని చూస్తున్న గోపికలు నవ్వులు ఆపుకోలేకపోయారు.
"అయ్యయ్యో! వెన్న దొంగ ఈరోజు వంటవాడయ్యాడే!"
మరొక సఖి నవ్వుతూ—
"ఇది కొత్త బృందావన లీలా!" అంది.
అంతలో కన్నయ్య రొట్టెలు చేయడం మొదలుపెట్టాడు.
అవి గుండ్రంగా రావాలని ప్రయత్నించాడు. కానీ కొన్ని కృష్ణ పక్షంలోని చంద్రుని ముక్కల్లా, కొన్ని మేఘాల్లా, కొన్ని యమునా అలల్లా వంకరటింకరగా తయారయ్యాయి.
కొన్ని చోట్ల కాలిపోయాయి, మరికొన్ని చోట్ల పచ్చిగానే ఉన్నాయి.
అవి చూసి కృష్ణుడు తానే నవ్వుకున్నాడు.
"రాధే! ఇవి రొట్టెలా? లేక నేను పగలగొట్టిన ఉట్టికుండల ముక్కలా?" అని మెల్లగా అన్నాడు. తనకు తానే నవ్వుకున్నాడు.
చివరకు సంకోచంతో భోజనప్పళ్లెం రాధారాణి ముందుంచాడు.
"రాధే... నాకు వంట చేయడం రాదు. కానీ నీ కోసం నా హృదయం మొత్తం పెట్టి చేశాను."
రాధ ప్రేమగా ఒక రొట్టె ముక్క తీసుకుంది, కూరతో కలిపి ఆమె నోట్లో పెట్టుకున్న క్షణంలోనే ఆమె కళ్ళలో ప్రేమాశ్రువులు మెరిశాయి.
ఎందుకంటే ఆ రుచిలో నెయ్యి రుచి లేదు... పంచదార తీపి లేదు... తేనె రుచి లేదు... కానీ అక్కడ అపారమైన ప్రేమ ఉంది.
ఆమె ఆశ్చర్యంగా అడిగింది—
"కృష్ణా! ఈ రొట్టెలో ఇంత మాధుర్యం ఎలా వచ్చింది?"
కృష్ణుడు ఆమె కళ్లలోకి ప్రేమగా చూస్తూ మెల్లగా అన్నాడు—
"రాధే! నా చేతులు పిండిని కలిపాయి. కానీ నా హృదయం మాత్రం నీ నామాన్ని జపించింది."
"రాధే... రాధే... అని ప్రతి శ్వాస పలికింది,
నీ ప్రేమతో నా మనసంతా నిండిపోయింది…"
"రాధా నామమే నా జీవన గీతం,
నీ ప్రేమే నా జీవిత సత్యం…"
ఆ తరువాత కన్నయ్య మృదువుగా అన్నాడు—
"ప్రేమతో చేసిన సేవలో లోపాలు కనిపించవు రాధే... ప్రేమే రుచిగా మారుతుంది... భక్తే భోజనంగా మారుతుంది."
రాధారాణి కన్నయ్య భుజంపై తల ఆనించింది. కృష్ణుని చుట్టూ తన చేతిని వేసింది. ఇంకో చేతితో కృష్ణుని చేతిని మృదువుగా స్పృశించింది... కృష్ణుడు రాధవంక చూసాడు.. రాధ తల యెత్తి కృష్ణుని కళ్ళలోకి అనురాగంతో చూసింది.. ఒకరి కళ్లలో ఒకరి మొఖం ప్రతిబింబిస్తోంది....
ఆ క్షణంలో యమునా తరంగాలు కూడా మెల్లగా ఆలపిస్తున్నట్లనిపించింది—
"రాధే గోవిందా... రాధే గోపాలా,
ప్రేమరసామృతమయము నీవే గోపాలా..."
"రాధా కృష్ణుల ప్రేమే యమృత మాధుర్యం,
ఆ ప్రేమలోనే దాగియున్నది జగత్సౌందర్యం..."
ఆ నాటి సాయంత్రం బృందావనం మొత్తం పులకరింత కొత్తందాలు పులుముకుంది..
ప్రేమతో చేసిన చిన్న సేవ కూడా, భగవంతునికి సమర్పించిన మహాయజ్ఞంలోని పూర్ణాహుతియే. అది రాధాకృష్ణులు నేటికీ మనకు నేర్పిస్తున్న రసస్ఫోరక భావ సహిత ప్రేమ పాఠాలు, భక్తి గీతాలు.
రాధే రాధే!
— శంకరకింకరః
గాయతి వనమాలీ మధురం
గాయతి వనమాలీ!
పుష్పసుగంధి సుమలయ సమీరే
మునిజన సేవిత యమునాతీరే! (గాయతి...)
కూజిత శుకపికముఖ ఖగకుంజే
కుటిలాలక బహునీరదపుంజే! (గాయతి...)
తులసీదామ విభూషణ హారీ
జలజభవస్తుత సద్గుణ శౌరీ! (గాయతి...)
పరమహంస హృదయోత్సవకారీ
పరిపూరిత మురళీరవధారీ! (గాయతి...)
(- సదాశివబ్రహ్మేంద్ర సరస్వతీ స్వామి)

బృందావన కథలు – 15 (మాధవ దాస్ — ఉచ్చిష్ఠ భోజనం)

జై రాధే కృష్ణ

బృందావనంలోని లతా కుంజాలలో మాధవ దాస్ అనే ఒక మహాభక్తుడు నివసించేవాడు. ఆయనకు శ్రీకృష్ణుడంటే అపారమైన ప్రేమ. ఆయన కంటికి ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపించేవాడు. అందుకే లోక వ్యవహార-వ్యాపారాలన్నిటిని వదిలి, యమునాతీరంలోని కుంజవనాలలో నివసిస్తూ, రాత్రింబవళ్ళూ భగవన్నామ స్మరణలోనే మునిగిపోయేవాడు.
ఆయన జీవన విధానం చాలా విభిన్నంగా ఉండేది. బృందావనంలోని ఆశ్రమాలకు వచ్చిన సాధుసంతులందరూ భోజనం చేసిన తరువాత, వారి విస్తరాకులలో మిగిలిన ఉచ్చిష్ఠాన్ని — ఎంగిలి అన్నం మెతుకులను — ఎంతో భక్తితో, శ్రీకృష్ణుని ఉచ్చిష్ఠంగానే భావించి సేకరించేవాడు. ఆ ప్రసాదమంతా ఒకచోట చేర్చి, ముందుగా శ్రీకృష్ణునికి నైవేద్యంగా సమర్పించేవాడు. తరువాత దానినే మహాప్రసాదంగా భావించి భుజించేవాడు.
ఎందుకంటే మాధవ దాస్‌కు సాధుసంతులందరిలోనూ కృష్ణుడే దర్శనమిచ్చేవాడు.
ఒకరోజు సాధుసంతుల భోజనం, భజనలు, సత్సంగాల కారణంగా ఆయనకు తీవ్రమైన ఆకలి వేసింది. ఆతురతతో సాధువుల ఉచ్చిష్ఠాన్ని త్వరగా సేకరించి, విస్తరాకులో వేసుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నారు. కానీ ఆ ముద్ద నోట్లో పడగానే ఒక్కసారిగా ఆయనకు గుర్తొచ్చింది—
“అయ్యో! ఈరోజు నా కృష్ణుడికి నైవేద్యం పెట్టలేదు!”
ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆయన హృదయం కలవరపడిపోయింది.
ఇప్పుడు నోట్లో ఉన్న ముద్దను బయటకు ఉమ్మలేరు. ఎందుకంటే అది సాధువుల ప్రసాదం. సాధువులలో ఆయనకు కృష్ణుడే కనిపిస్తాడు.
“నా ప్రభువుకే సంబంధించిన ఈ ప్రసాదాన్ని ఎలా బయటకు ఉమ్మగలను? అలాగని నైవేద్యం చేయకుండా దానిని ఎలా మింగగలను?” అని తీవ్ర వేదన చెందారు.
అలా అయోమయంలోనే కూర్చున్నారు.
సాయంత్రం అయింది… రాత్రి దాటింది… అయినా ఆయన నోట్లోని ముద్దను మింగలేదు, బయటకు కూడా వేయలేదు. కన్నీరుతో కృష్ణుణ్ణి తలుచుకుంటూ రాత్రంతా విలపించారు.
ఆ భక్తి… ఆ తపన చూసి చివరకు శ్రీకృష్ణుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు.
ముగ్ధమోహనమైన చిరునవ్వుతో భగవంతుడు అడిగాడు—
“మాధవా! ఎందుకు ఇలా ఏడుస్తున్నావు?”
నోట్లో ముద్ద ఉండటంతో మాధవ దాస్ మాటలాడలేక, సైగలతో తన బాధను వివరించసాగాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు ప్రేమగా అన్నాడు—
“సరే మాధవా! ఆ ముద్దను నా చేతిలో పెట్టు.”
మాధవ దాస్ వెంటనే తల ఊపుతూ,
“ప్రభూ! ఇది నా ఎంగిలి ముద్ద. దాన్ని మీకు ఎలా ఇవ్వగలను?” అని సైగలతో సంకోచంగా తెలియజేశాడు.
భగవంతుడు నవ్వుతూ అన్నాడు—
“అయ్యో మాధవా! ప్రతిరోజూ ఇదే ఉచ్చిష్ఠాన్ని నాకే నైవేద్యంగా సమర్పిస్తావు కదా! మరి ఈరోజు ఎందుకు సంకోచిస్తున్నావు?”
కానీ మాధవ దాస్ ఇంకా బాధతోనే,
“ప్రభూ! అది ఇతర సాధుసంతుల ప్రసాదం. కానీ ఇది మాత్రం నా ఎంగిలి. నేను ఈ అపచారం చేయలేను” అని సైగ చేశాడు.
అప్పుడు కృష్ణుడు అపారమైన కరుణతో ఇలా అన్నాడు—
“మాధవా! నువ్వు ఎవరి ఉచ్చిష్ఠాన్ని నాకు సమర్పిస్తున్నావో, వారందరికంటే నువ్వే నాకు అత్యంత ప్రియమైనవాడివి.”
ఆ మాటలు విన్న మాధవ దాస్ మరింత భావవివశుడై వెక్కి వెక్కి ఏడవసాగాడు. ఎంతోసేపు ఏడుస్తూ ఉండగా, ఆయన నోరు కొద్దిగా తెరుచుకుంది. అప్పుడు నోటిలోని ఒక చిన్న అన్నం మెతుకు కింద పడింది.
శ్రీకృష్ణుడు వెంటనే దానిని తీసుకుని పరమానందంతో భుజించాడు.
ఆ తరువాత క్షణంలోనే భగవంతుడు అంతర్ధానమయ్యాడు.
ఈ సంఘటన ద్వారా మాధవ దాస్‌కు శ్రీకృష్ణుడు ప్రత్యక్ష దర్శనం ఇచ్చాడు.
ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది—
భగవంతునికి కావలసింది ఆడంబరాలు కాదు… అర్పణల వైభవం కాదు…
“నిజమైన భక్తి భావం మాత్రమే.”
భక్తుని హృదయంలోని నిర్మలమైన ప్రేమకు భగవంతుడు ఎల్లప్పుడూ లొంగిపోతాడు.
భగవంతుడు కుప్పలు తెప్పలుగా పెట్టే రకరకాల మహా నైవేద్యాలకోసం ఆకలితో ఉండడు…
ఆయన ఆకలి కేవలం నిర్మలమైన ప్రేమ భక్తిభావంతోనే తీరుతుంది...
రాధే రాధే
వనజాక్ష భక్తవత్సల
ఘనులగు త్రైమూర్తులందుఁ గరుణానిధివై
కన నీ సద్గుణజాలము
సనకాది మునీంద్రు లెన్నఁ జాలరు కృష్ణా.
- శంకరకింకరః

శ్రీగురు దత్తాత్రేయ కథలు – 2 (వేటగాని కథ)

జై గురు దత్త! జై గురు దత్త!

భక్తవత్సలా! మాం పాహి!
సహ్యాద్రి పర్వతాల మధ్య దట్టమైన అరణ్యం.
ఎత్తైన వృక్షాలు...
పక్షుల కిలకిలారావాలు...
అడవి జంతువుల సంచారం...
ఆ అడవిలోని ఒక గూడెంలో ఒక వేటగాడు జీవించేవాడు.
అతని జీవితం మొత్తం వేటపైనే ఆధారపడి ఉండేది.
జింకలు, కుందేళ్లు, అడవి పక్షులు...
కనిపించిన ప్రతి జీవిని వేటాడేవాడు.
దయ అంటే ఏమిటో తెలియదు.
పాపం అంటే ఏమిటో తెలియదు.
జీవహింసే అతని వృత్తి.
అదే అతని జీవనం.
తనకు, తన కుటుంబ ఆకలికే కాక, చంపిన జంతువుల మాంసాన్ని, చర్మాన్ని అన్నీ అమ్మేవాడు.
ఒక రోజు ఉదయం అతను విల్లు, బాణాలు తీసుకుని అడవిలోకి వెళ్లాడు. రోజంతా తిరిగినా ఒక్క జంతువు కూడా కనిపించలేదు. ఆకలితో, కోపంతో అతని మనసు మండిపోతోంది. సూర్యుడు అస్తమించబోతున్న సమయంలో ఒక అందమైన జింక కనిపించింది. వేటగాడు సంతోషంతో "ఈయాల యేట దొరికినాది!" అని ఆ జింక లక్ష్యంగా బాణం గురిపెట్టాడు.
అయితే, అతను ఆ బాణం వదలబోతున్న క్షణంలో... జింక అకస్మాత్తుగా పరిగెత్తి కొద్ది పక్కకెళ్ళి ఒక అవధూత వెనుకకు వెళ్లి నిలబడింది.
ఆ అవధూత దిగంబరంగా ఉన్నాడు.
ముఖంలో దివ్యకాంతి.
కళ్లలో అపారమైన కరుణ.
చుట్టూ నాలుగు బలిసిన కుక్కలు.
పక్కనే ఒక శాంతంగా కనిపిస్తున్న చక్కని ఆవు.
అసలే ఆకలితో వేటదొరకలేదనే విసుగుతో ఉన్నాడేమో, ఆ వేటగాడు "ఓ సామీ! ఆ జింకను పక్కకంపు, అది నా యేట..." అని అరిచాడు.
అవధూత చిరునవ్వు నవ్వాడు. "నాయనా! అది నీ వేట ఎలా అవుతుంది?" అని ప్రశ్నించాడు.
వేటగాడు ఆశ్చర్యపోయాడు " అది యేట నీమం, ఎవరు ఏ జంతువుకు ఎక్కుపెడితే ఆ యేట ఆడిదే. దీనికి నేను బాణం గురెట్టాను కాబట్టి అది నాదే." అన్నాడు.
అవధూత మళ్లీ అడిగాడు. "నువ్వు దానికి ప్రాణం ఇచ్చావా?"
"లేదు." అన్నాడు వేటగాడు
"అయితే దాని ప్రాణాన్ని తీసుకునే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? ఎవరికోసం ? ఎందుకోసం చంపుతున్నావు నువ్వీ జీవిని?".
ఆ ప్రశ్న వేటగాడి గుండెల్లో బాణంలా దిగింది. ఇంతవరకు ఆ ఆలోచన అతనికి ఎప్పుడూ రాలేదు.
అవధూత మెల్లగా మాట్లాడసాగాడు. "ఈ జింకకు ప్రాణం ఎవరిచ్చారో... నీకు కూడా ప్రాణం ఇచ్చినవాడు ఆయనే, ఈ అడవిలో ఉన్న ప్రతి జీవిలో అదే చైతన్యం ఉంది. జీవులను చంపడం ద్వారా పొట్ట నింపుకోవచ్చు. కానీ మనసుకు శాంతి దొరకుతుందా! దొరకదు కదా..."
వేటగాడు మొదటిసారి తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నాడు.
ఎన్ని జంతువులను చంపాడు!
ఎన్ని ప్రాణాలను తీసుకున్నాడు!
అతని కళ్లలో నీళ్లు తిరిగాయి.
విల్లు చేతిలో నుంచి జారిపోయింది.
బాణం నేలపైబడిపోయింది.
"సామీ! నేను చాలా పాపాలు చేశాను. నా పాపాలకు విముక్తి ఉందా? " అని వణుకుతున్న గొంతుతో అడుగుతూ అవధూత కాళ్లమీద పడ్డాడు.
అవధూత ప్రేమగా నవ్వాడు.
"పాపం కంటే పశ్చాత్తాపం గొప్పది.
తప్పు కప్పిపుచ్చుకోవడం కంటే ఒప్పుకుని మారడం గొప్పది.
నిజంగా పశ్చాత్తాపపడే హృదయాన్ని భగవంతుడు ఎప్పుడూ తిరస్కరించడు." అని చెప్పి అతని తలపై చేయి ఉంచాడు.
ఆ స్పర్శతో వేటగాడి హృదయంలో ఏదో అలజడి కలిగింది,
తన హృదయం ఆర్ధ్రత, కరుణలతో నిండిపోయింది.
ఎన్నో సంవత్సరాల క్రూరత్వం ఒక్క క్షణంలో కరిగిపోయింది.
అతని కళ్ల నుంచి ఆనందబాష్పాలు ధారగా కారాయి.
అతను అవధూత పాదాలపై పడి నమస్కరించాడు.
"సామీ! ఇక నుంచి ఏ ప్రాణినీ సంపను. నువ్వు సెప్పిన బాటలోనే ప్రేమగా బతుకుతా ." అని ప్రతిజ్ఞ చేశాడు.
అప్పుడు అవధూత తన అసలు స్వరూపాన్ని చూపించాడు.
మూడు ముఖాలు ప్రకాశిస్తున్నాయి.
చుట్టూ దివ్యకాంతి వ్యాపించింది.
నాలుగు కుక్కలు మాయమై నలుగు వేదపురుషులుగా వారి వేద మంత్ర స్వరంతో వినిపించారు .
కామధేనువు దివ్యరూపంలో వెలిగింది, ధర్మంగా తెలియబడింది.
వేటగాడు ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. "మా గూడెంలో పంతులుగారు సెప్పే దత్తాత్రేయ సామే!" అని కన్నీళ్లతో కేక వేశాడు.
శ్రీ దత్తాత్రేయుడు ఆశీర్వదిస్తూ అన్నారు:
"నాయనా! నిజమైన పశ్చాత్తాపం మనిషిని పవిత్రుణ్ని చేస్తుంది. ఈ రోజు నుంచి నీ హృదయం నా ఆలయం." అని చెప్పి అంతర్ధానమయ్యారు.
ఆ రోజు నుంచి వేటగాడు పూర్తిగా మారిపోయాడు. అడవిలో గాయపడిన జంతువులను కాపాడేవాడు. ఆకలితో ఉన్నవారికి సహాయం చేసేవాడు. దత్తనామాన్ని జపిస్తూ జీవించాడు. చివరికి అతని జీవితాంతంలో దత్తస్మరణలో లీనమై పరమశాంతిని పొందాడు.
దత్త భక్తులు ఈ కథ చెప్పుకుంటూ అంటారు...
దత్తుని కరుణాకటాక్షం ఒక క్షణమైనా మీద పడితే,
పరమ దుర్మార్గుడైనా మహాత్ముడవుతాడు. ఈ వేటగాడిలా... అదీ దత్తానుగ్రహ మహిమ!
---
భగవంతుడు నీ గతాన్ని చూడడు.
నీ హృదయంలో వచ్చిన నిజమైన మార్పును చూస్తాడు.
పూర్వం నువ్వెంత పెద్ద పాపపు పనులు చేసినా ...
నిజమైన పశ్చాత్తాపంతో భగవంతుని ఆశ్రయిస్తే...
ఆ భగవంతుని కృప అతనిని ఉన్నత స్థితికి చేర్చగలదు.
ఆ భగవంతుడే గురువైతే, ఇక దాని స్థాయి చెప్పడం ఎవరివల్లా కాదు.
పాపాన్ని నాశనం చేసేది శిక్ష కాదు...
పరిపూర్ణ పశ్చాత్తాపంతో కూడిన జీవనం, దేవతా-గురు అనుగ్రహం.
జై గురు దత్త! జై గురు దత్త!
భక్తవత్సలా! మాం పాహి!
జై గురుదత్త! జై గురుదత్త!

-శంకరకింకరః