Pages

Tuesday, May 19, 2026

బృందావన కథలు - 4 ( భక్తి - ప్రేమ - దీక్ష - అలకల కలయిక. కృష్ణదాస్ - రాధాదాస్ )

జై రాధే కృష్ణ

కృష్ణునికి దాసుడిగా తనను ప్రకటించుకుని, నిరంతరం ఆయన సేవలో లీనమై జీవించిన ఒక భక్తుడు “కృష్ణదాస్”గా ప్రసిద్ధి చెందాడు.

ఒకసారి బృందావనంలో సత్సంగంలో మహాభారత కథలు వింటూ ఉండగా, “ఏ కార్యమైనా పుష్కరకాలం — పన్నెండేళ్లు — వ్రతంలాగా ఆచరిస్తే అది సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది” అని భీష్మాదులు చెప్పిన మాటలు అతని హృదయంలో గాఢంగా ముద్రపడ్డాయి.

మరుసటి రోజు ఒక దివ్యమైన సంకల్పం పుట్టింది. ఒక అందమైన పూలమాల తీసుకుని ఠాకూర్ కి సమర్పించి ఇలా అన్నాడు:

“స్వామీ! ఈరోజు నుంచి పన్నెండేళ్ల పాటు ప్రతిరోజూ నీకు పూలమాలలు తీసుకొస్తాను. పదమూడో సంవత్సరపు మొదటి రోజున నువ్వే నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించి, నీ చేతులారా మాలను నువ్వే ధరించాలి.”

ఆ రోజు నుంచి ప్రతిరోజూ రంగురంగుల, సువాసనభరితమైన పూలమాలలు సమర్పిస్తూ, కృష్ణస్మరణలో మునిగి జీవించాడు.

ఒక సంవత్సరం… రెండు… మూడు… ఐదు… ఏడు… పది… చివరకు పన్నెండో సంవత్సరపు చివరి రోజు వచ్చింది.

ఆ రోజు కూడా స్వామికి మాల సమర్పించి, తన వ్రతాన్ని మరలా గుర్తు చేశాడు:

“స్వామీ! పన్నెండేళ్లు నీకు సేవ చేశాను. రేపు నేను రాను… నువ్వే నీ మిత్రులతో, గోపికలతో కలిసి నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం తీసుకోవాలి, మాల వేసుకోవాలి నేను ఎదురుచూస్తుంటాను.” అని ఒకటికి పది సార్లు చెప్పాడు.

ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు.

“ఎవరెవరితో వస్తాడు? గోపాలురతోనా? గోపికలతోనా? సర్కార్ (రాధమ్మ)ని తీసుకొస్తాడా? ఎలా వస్తాడు? ఎప్పుడొస్తాడు?”

అని ఆలోచిస్తూ, తన చిన్న కుటీరాన్ని శుభ్రపరిచి, కడిగి, ముగ్గులు వేసి అలంకరించాడు.

తెల్లవారుఝామునే స్నానం చేసి, ఛప్పన్ భోగ్ సిద్ధం చేశాడు. సువాసనగల పూలమాలలు కట్టి సిద్ధం చేశాడు.

గుమ్మం దగ్గర నిలబడి ఎదురు చూస్తున్నాడు.

సూర్యుడు ఉదయించి అరుణ కాంతుల నుంచి క్రమంగా తీక్ష్ణ కాంతిని విరజిమ్ముతున్నాడు… కానీ స్వామి రాలేదు.

“ఏమో… నందుడు ఏదైనా పని చెప్పాడేమో… యశోదమ్మ ఆపిందేమో… ఇంకొంచెంలో వస్తాడు…”

అని తనను తాను ఓదార్చుకున్నాడు.

మధ్యాహ్నం సమీపించింది.

“ఈ ఠాకూర్‌కి ఎక్కడలేని రాచకార్యాలుంటాయి… ఎవరైనా కష్టంలో ఉంటే వెంటనే సహాయం చేయాలి కదా…”

అని ప్రేమతో కూడిన కోపంతో అనుకుంటున్నాడు.

మధ్యాహ్నం దాటింది… అలక పెరిగింది… కోపం మరింత ఉద్ధృతమైంది:

“అవున్లే! ఈ కృష్ణుడికి ఇప్పుడు రాచరికాలు ఎక్కువైపోయాయి!

పన్నెండేళ్లు సేవ చేశాను… ఒక్కరోజు రమ్మంటే రాడా?”

సాయంత్రం సమీపించింది.

ఇక రాడని నిర్ణయించుకున్నాడు.

వండిన ఛప్పన్ భోగ్, పూలమాలలు మూటకట్టుకుని,

“ఈ కృష్ణుడు మాట మీద ఉండడు! సేవ చేయించుకుంటాడు కానీ సేవకుల మనసులోని కోరికలు నెరవేర్చడు! ఏం తనని దర్శించడానికి వచ్చిన పెద్ద పెద్ద భక్తుల కోరికలే తీరుస్తాడా, వాళ్ళమాటలే విని వాళ్ళనే పట్టించుకొని, వాళ్ళకి కావలసినవి తీరుస్తాడా? మరి నేను వెర్రివాణ్ణా ఇన్నేళ్లు సేవచేసాను, నన్ను పట్టించుకోడా?నేనంటే అసలు లెక్కలేదా” అని కోపంతో, అలకతో, బృందావనాన్ని వదిలి, బర్సానాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

ఇల్లు తాళం వేసి, మూటముల్లె నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు… లోలోపల మాత్రం — “పన్నెండేళ్ల వ్రతం ఫలించలేదే?” అనే వేదన, రోషం.

అప్పుడే వెనకనుండి ఒక గోపాలుడు కేక వేశాడు:

“బాబా! పక్కకు జరుగు! గోవుల మంద వస్తోంది!”

కృష్ణదాస్ పక్కకు జరిగి చూస్తే — వందలాది, వేలాది గోవులు మందలుగా వస్తున్నాయి.

“ఎవరివి ఇవి?” అని అడిగాడు.

“నందబాబావి!” అన్నాడు ఆ బాలుడు.

కొద్దిసేపటికి బాలుడు దగ్గరకు వచ్చి,

“బాబా! నీ దగ్గర ఎంతో మంచి వంటల వాసన వస్తోంది. ఏముంది మూటలో?” అని అడిగాడు.

కృష్ణదాస్ విసుగుతో జరిగిందంతా చెప్తూ

“కృష్ణుడి కోసం సిద్ధం చేసినవి. కానీ అతను రాలేదు!” అన్నాడు

బాలుడు మృదువుగా అన్నాడు:

“నాకు చాలా ఆకలేస్తోంది బాబా… పొద్దున్నుంచి గోవులు కాస్తూ ఏమీ తినలేదు… నువ్వూ తినలేదు కదా… ఇద్దరం కలిసి తిందామా?”

కృష్ణదాస్ కోపంతోనే: 

“అవును! నేనూ తినలేదు! రాని కృష్ణుడి కోసం ఎందుకు ఆకలితో ఉండాలి?”అని మూట విప్పాడు.

అప్పుడు బాలుడు అన్నాడు:

“బాబా! నువ్వొక ముద్ద తిను… నాకు ఒక ముద్ద పెట్టు… ఇద్దరం కలిసి తిందాం.”

కృష్ణదాస్ చిరాకు పడ్డాడు:

“నీకు భోజనం పెట్టడం కాకుండా నోట్లో పెట్టాలా? ఈ నందగావ్ పిల్లలందరికీ ఇదే అలవాటా!”

బాలుడు అమాయకంగా తన చేతులు చూపించాడు:

“చూడూ బాబా… గోవుల సేవ చేస్తూ చేతులు అన్నీ పేడతో నిండిపోయాయి… నేను ఎలా తినగలను? నువ్వే తినిపించవా?”

అది చూసి కృష్ణదాస్ " మీ నందగావ్ పిల్లలకి ఏదో మాయ మాటలు చెప్పి సేవ చేయించుకోవడం బాగా అలవాటు, ఆ కృష్ణుడు అలవాటు చేసాడా?" అంటూ దెప్పుతూ ఒక ముద్ద అతనికి పెట్టి, ఒక ముద్ద తాను తినసాగాడు.

అలా కొద్దిసేపటికి బాలుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి.

“ఏమైంది?” అని అడిగాడు.

బాలుడు ఏడుస్తూ అన్నాడు:

“బాబా… మాల ఎందుకు వేయలేదు? మాల వేయి బాబా!”

అప్పుడే కృష్ణదాస్ ఆశ్చర్యపోయి:

“నువ్వెవరు?” అని అడిగాడు.

క్షణంలోనే ఆ బాలుడు పెద్ద పెద్ద కళ్ళతో, గిరజాల జుట్టుతో, ముత్యాలసరాలు, నెమలి పింఛంతో, పీతాంబరధారియై   శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు:

“బాబా! ప్రతిరోజూ నువ్వు నీ చేతులతో నాకు మాల వేస్తుంటే, అది నీ ఆలింగనం లాంటిది. పన్నెండేళ్లుగా ఆ ప్రేమకు నేను అలవాటు పడ్డాను. నేను నీ ఇంటికి వచ్చి నేనే మాల ఎలా వేసుకుంటాను? నువ్వే వేయాలి కదా!”

భక్తులు దేవుని యెదుట పొంగిన భక్తి వల్ల అమాయకంగానూ, ఒక్కోసారి గడుసుగానూ ప్రవర్తిస్తారు, భగవంతుడు ఆ చేష్టలు చూసి మురిసిపోతాడు.

ఇది విని కూడా కృష్ణదాస్ గడుసుగా అన్నాడు:

“అది కాదు! నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు! నేను బర్సానా వెళ్లి అక్కడ సర్కార్ కి (రాధారాణికి) ఫిర్యాదు చేస్తానని భయపడి వచ్చావు! నాకోసం కాదులే ! ఈ మాలను నేను మా లాడ్లీ  రాధారాణికే ఇస్తాను!”

అని మూటలు సర్దుకుని వేగంగా బర్సానా వైపు బయలుదేరాడు.

వెనక కృష్ణుడు ఆత్రంగా పిలుస్తూ:

“బాబా! ఆగు! నా మాట విను, చెప్పేది విను!” అంటూ వడిగా వస్తున్నాడు

కానీ కృష్ణదాస్ వినలేదు:

“నేనాగను! ఇకపై నా పేరు కృష్ణదాస్ కాదు… రాధాదాస్!”

అని వెనక్కి చూడకుండా ముందుకు సాగిపోయాడు.

తన వెనక కృష్ణుడు "బాబా! ఆగు, ఆగు! అని అరుస్తూ వెంటపడి, వెంటపడి వస్తున్నాడు" 

కృష్ణదాస్ పట్టించుకోకుండా నేను లాడ్లీ దగ్గరకెళ్ళిపోతానని వడివడిగా వెనక్కి చూడకుండా వెళ్తున్నాడు.

కాసేపటికి కృష్ణదాస్ బర్సానాకు చేరుకుని రాధారాణి సన్నిధిలో చూసే సరికి — అక్కడ కృష్ణుడు నిలబడి చిలిపి నవ్వులు రువ్వుతూ ఉన్నాడు!

ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి చూస్తే — వెనుకనుండి వస్తున్నది కృష్ణుడు కాదు గారాలపట్టి తన సర్కార్ రాధారాణి! 

ఆ దివ్యలీల చూసి కృష్ణదాస్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. 

ఆ ఇద్దరూ వేరు కాదు 

కిశోరీయే కిశోర్ - కిశోరే కిశోరీ, 

లాడ్లీయే లాలా -'లాలాయే లాడ్లి,

ఠాకూరే సర్కార్, సర్కారే ఠాకూర్,

రాధాకృష్ణులు వేర్వేరు కాదు ఇద్దరూ ఒకటే అని తెలుసుకొని, భక్తి పరవశంలో నామం చేస్తూ, పాటలు పాడుతూ నృత్యం చేస్తూ, ఇద్దరికీ తాను చేసిన వంటలు ప్రేమతో సమర్పించి, ఇద్దరికీ పూలమాలలు తానే స్వయంగా అర్పించాడు. 

పన్నెండేళ్ళూ తాను పూమాలలు సమర్పిస్తున్నాననుకున్నాడు, కానీ పూమాలలు వేస్తూ రోజూ ఠాకూర్ని ఆలింగనం చేస్కుంటున్నానని గమనించలేకపోయాడు. పన్నెండేళ్లలో ప్రతిదినం కృష్ణదాస్ వల్ల పొందిన ఆలింగన సాంత్వనను శ్రీ కృష్ణుడు వదలలేకపోయాడు... అది కృష్ణుడికి తదేక వ్రతమైంది, కృష్ణదాస్ పుష్కర కాలం తదేక దీక్షతో చేసిన కార్యం ఇలా సిద్ధించి వ్రతం సంపూర్ణంగా సాఫల్యమైంది.

ఆవిధంగా కృష్ణదాస్… రాధాదాస్ అయ్యాడు.

తుమ్ కృపాళు సర్కార్ హమారీ!

పార్ కరో యా మారోరీ కిశోరీ రాధే!!

-శంకరకింకరః

Monday, May 18, 2026

బృందావన కథలు - 3 (బిహారిన్దాస్ తిలకం)

జై రాధే కృష్ణ

బృందావనంలో శ్రీకృష్ణుడితో కూడి, బరసానాలో విరాజిల్లే లాడ్లీ రాధారాణి  లీలలు అమోఘమైనవి, అనిర్వచనీయమైనవి. నేటికీ ఆ లాడ్లీ (గారాల పట్టి) తన భక్తులను ప్రేమతో కాపాడుతూ, అనేక లీలలతో వారిని ఆనందింపజేస్తూనే ఉంది.

పూర్వం అన్యమత రాజులు పాలించిన కాలంలో, ఒక పాదుషా ఇలా ఫర్మానా జారీ చేశాడు:

“రేపటి నుండి రాజోద్యోగులెవరూ తిలకం, చందనం, విభూది, బొట్టు వంటి ధార్మిక చిహ్నాలు ధరించకూడదు. ఎవరైనా తమ ఇష్టదేవతా చిహ్నాలతో వస్తే, వారికి కఠినమైన మరణ శిక్ష విధించబడుతుంది.”

అక్కడ రాజసేవలో ఉన్న రాధారాణి భక్తుడు బిహారిందాస్ ఈ వార్త విని తీవ్రంగా కలత చెందాడు. ఈ రాజాజ్ఞ రాజ్యమంతా ప్రకటించారు. బిహారిన్దాస్ ఇంటికి చేరగానే అతని తల్లి ప్రేమతో, “నాయనా, ఇకపై తిలకం ధరించకు; ప్రాణాపాయం ఉంది” అని హెచ్చరించింది.

బిహారిందాస్ బాధతో ఏమీ పలకకుండా ధ్యానంలో మునిగిపోయాడు. కళ్లలో కన్నీళ్లు ధారగాపోతూనే ఉన్నాయి. ఆ వేళ రాధారాణి ప్రత్యక్షమై, “ఏమిటి ఈ బాధ? ఎందుకు ఇంత వేదన?” అని మృదువుగా అడిగింది.

అప్పుడు బిహారిందాస్ వినమ్రంగా అన్నాడు:

“అమ్మా! ప్రియురాలి అలంకారం ప్రియునికోసం అయినట్లే, 

పతివ్రతా స్త్రీ అలంకారం తన భర్తకోసం అయినట్లే, 

భక్తుని అలంకారం భగవంతునికోసమే కదా! 

నేను ప్రతిరోజూ నీకోసం చందనం తిలకం ధరిస్తాను. ఇక అది చేయలేనని బాధపడుతున్నాను.”

రాధారాణి సానుభూతితో, “ఎందుకు చేయలేవు?” అని అడిగింది. బిహారిందాస్ పాదుషా ఆజ్ఞను వివరించి కన్నీళ్లతో తన బాధను తెలియజేశాడు.

అప్పుడు రాసేశ్వరి రాధారాణి తన కుడికాలి బ్రొటనవేలితో అతని నుదుటిపై, ఆజ్ఞా చక్రం నుండి నొసటిపైవ్వరకూ ఉన్న చందన తిలకాన్ని ముక్కు చివరి వరకు పొడవుగా లాగి చందన తిలకం దిద్దింది.

“ఇప్పుడు ఇది ఇంతకుముందు కంటే మరింత విశిష్టంగా రెండింతలు పొడవుగా ఉంది. ధైర్యంగా వెళ్ళు— ప్రేమాస్పదమైన నీ భక్తిని ఎవరూ అడ్డుకోలేరు” అని ఆశీర్వదించి అంతర్ధానమైంది.

బిహారిందాస్ కళ్లుతెరిచి చూసినప్పుడు, అది కల కాదని గ్రహించాడు. తన నుదుటిపై అద్భుతమైన చందన తిలకం ప్రకాశిస్తోంది. రాధారాణి ప్రత్యక్షమై తన కాలి బ్రొటనవేలితో తన నుదురు స్పర్శించిన అనుభూతి మళ్ళీ మళ్ళీ నెమరువేసుకోసాగాడు. అతని కళ్లలో కన్నీళ్లు ఇంకా ఉన్నప్పటికీ, అవి ఇప్పుడు భయం వల్ల కాదు—ఆనందం, ప్రేమ, ధైర్యం వల్ల.

మరుసటి రోజు ఉదయం, అదే తిలకంతో రాజసభకు వెళ్లగా, భటులు అతన్ని పట్టుకొని పాదుషా ముందుకు తీసుకువచ్చారు. పాదుషా గంభీరంగా, “నా ఆజ్ఞను ఎందుకు అతిక్రమించావు?” అని ప్రశ్నించాడు.


బిహారిందాస్ తన అనుభవాన్ని భక్తి పరవశంతో వివరించాడు.

అది విన్న పాదుషా నవ్వుతూ అన్నాడు:

“ఇదే నిజమైన భక్తి! మేము భగవంతుని పట్ల మీ అందరి నిష్ఠను పరీక్షించడానికి మాత్రమే ఈ ఫర్మానా జారీ చేశాము. మీరు అందరూ మీ ఇష్టదేవతా చిహ్నాలను భగవంతుని ప్రీతికోసం ధరించండి—ఆడంబరం కోసం, మీ అలంకారం కోసం కాదు.” అని చెప్పి బిహారిందాస్‌ను ఘనంగా సత్కరించి పంపించాడు.


బిహారిందాస్ గోస్వామికి జై!

(ఈ రోజుకూడా ఆయన పరంపరలోని భక్తులు నుదుటంతా చందనం అలంకరించి, ముక్కు వరకు విస్తరించే తిలకాన్ని రాధారాణి కృపగా ధరిస్తుంటారు.)

జై శ్యామా ప్యారీ కుంజ్ బిహారీ

-శంకరకింకరః

Thursday, April 30, 2026

బృందావన కథలు - 2 (యమునా తటిలో పూలవనం - గర్భగృహంలో శునకం)

జై రాధే కృష్ణ

బృందావనంలోని బాంకే బిహారీ ఆలయం ఒక అద్భుతమైన, విశిష్టమైన క్షేత్రం. ఇక్కడ శంఖనాదం వినిపించదు, గంటలు మోగవు, భక్తుల గోల ఉండదు. బిహారీజీ దర్బార్ ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. వినిపించేది కేవలం భక్తుల హృదయాల్లోంచి ఉప్పొంగే నామస్మరణ, జయజయధ్వానాలే.

ఈ ఆలయంలో దర్శనం కూడా అత్యంత విశేషం. స్వామివారి ముందు పరదా ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు తీస్తారు అన్నది ఎవరూ చెప్పలేరు. ఆలయం తెరుచుకునే సమయం, మూసే సమయం కూడా నిర్దిష్టంగా ఉండదు. అన్నీ స్వామివారి సంకల్పానుసారమే జరుగుతాయి. సేవలు, అర్చనలు, భోగాలు—అన్నీ బాంకే బిహారీ లాల్ చిత్తానుసారమే జరుగుతాయి.

ఒకసారి కలకత్తా నుండి ఒక ధనిక సేఠ్ గారు—శ్రీకృష్ణుని పరమభక్తుడు—బృందావనానికి విచ్చేశారు. ఆయన యమునా తీరంలోని భూములను కౌలుకు తీసుకొని, అక్కడ వివిధ రకాల పూల మొక్కలు నాటి, ఒక సుందరమైన పూలవనాన్ని నిర్మించారు. ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యపడి, “శ్రావణ మాసంలో యమునకు వరదలు వస్తాయి, ఈ వనం మొత్తం కొట్టుకుపోతుంది” అని హెచ్చరించారు.

అప్పుడు సేఠ్ గారు సాంత్వనంగా ఇలా చెప్పారు:
“యమునమ్మ తీసుకెళ్తే అది నష్టమా? నేను తీసుకెళ్ళిన పూలు కృష్ణుని చేరతాయో లేదో తెలీదు, ఆ యమునమ్మే తీస్కెళ్తే ఖచ్చితంగా శ్రీకృష్ణుణ్ణే చేరతాయి. ఆమె స్వయంగా కాళిందీ దేవి—శ్రీకృష్ణుని అష్టమహిషుల్లో ఒకరు. ఆమె ఈ పూలను స్వీకరిస్తే, అవి శ్రీకృష్ణునికి చేరితే, అది నాకు మహానందం. ”

శ్రావణం వచ్చింది. యమునా నది ఉప్పొంగి ప్రవహించింది. పూలవనం అంతా జలాల్లో కలిసిపోయింది. కానీ సేఠ్ గారి హృదయం ఆనందంతో నిండిపోయింది. ప్రతి సంవత్సరం ఇదే దృశ్యం, ఇదే ఆనందం—ఆయనకు అది దైవానుభూతిగా మారింది.

కాలం గడిచింది. వృద్ధాప్యం, అనారోగ్యం ఆయనను చేరుకున్నాయి. కలకతా, ఢిల్లీ, బొంబాయి ఇలా కుటుంబ సభ్యులు సేఠ్ ను వైద్యంకోసం పెద్ద పెద్ద వైద్యశాలలకు తీసుకెళ్లారు. వైద్యులు “ఇక ఎక్కువ కాలం లేదు, చివరి కోరిక తీర్చండి” అని కుటుంబ సభ్యులకు చెప్పారు. అప్పుడు సేఠ్ గారు ఒకే ఒక్క కోరిక చెప్పారు:
“బృందావనంలోని బాంకే బిహారీ లాల్ దర్శనం చేసి, ఆయన చరణామృతం స్వీకరించాలి.”

కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడి ఎయిర్ ఆమ్బులెన్స్ వంటిది ఏర్పాటు చేసి ఆయనను బృందావనానికి తీసుకువచ్చారు. ఆ రోజు రాత్రి ఆలయంలో మహోత్సవాలు ముగిసి, ఆలయం మూసే సమయం వచ్చింది. సేఠ్ కుటుంబ సభ్యులంతా ఆలయం తెరిచే ఉంటుందా ? దర్శనం లభిస్తుందా? తమ తండ్రి చివరి కోరిక తీరుతుందా అని బెంగపడుతున్నారు.

అప్పుడే అదేసమయంలో ఒక అద్భుతం జరిగింది.

గర్భగృహంలోకి ఎక్కడినుంచి వచ్చిందో ఒక కుక్క ప్రవేశించి, స్వామివారి వెనుకనుంచి బయటకు పరుగెత్తింది. దీనితో ఆలయాన్ని పవిత్రీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో అప్పుడు శుద్ధి చేయాలా మరునాడా అనే తర్జన భర్జన జరుగుతుంటే ప్రధానార్చకులు లేదు శుద్ధికార్యక్రమం, కన్నయ్యకు పంచామృత అభిషేకం, అలంకారం, భోగం అన్నీ ఇప్పుడే జరగాలని నిర్ణయించారు.

గోస్వాములు వెంటనే మంత్రాలతో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, స్వామివారికి పంచామృత అభిషేకం చేసి, అనేకానేక రంగుల పూలతో కొత్త అలంకరణ చేసి, ఛప్పన్ భోగ్ నైవేద్యాలు సమర్పించారు.

అదే సమయంలో సేఠ్ గారి కుటుంబం ఆయనను ఆలయానికి తీసుకొచ్చింది. నడవలేని స్థితిలో ఉన్న ఆయనకు ప్రధాన పూజారి గారు పంచామృత తీర్థం, ప్రసాదం అందించారు. తన జీవితాంతం యమునమ్మకు సమర్పించిన రంగురంగుల పూలన్నీ ఆ రోజు స్వామివారి అలంకరణలో చూశాడు ఆ సేఠ్ జీ. చరణ తీర్థం మాత్రమే కావాలనుకున్నాడు కానీ పంచామృత తీర్థం లభించింది. ఆ సేఠ్ తన చివరి క్షణాల్లో ఆ స్వామి దివ్య రూపాన్ని, తన బాంకే బిహారీని తాను పెంచిన పూలవనంలోని రంగురంగులతో సువాసనలతో అద్భుతంగా వికసించి గుభాళించే పూల మధ్యలో విహరిస్తున్న స్వామిలా ఆనందంతో తృప్తిగా దర్శించుకున్నాడు.

అవే ఆ జీవునికి ఈ భూమి మీద చివరి క్షణాలు!

జై బాంకే బిహారీ కృష్ణ కన్హయ్యా లాల్ కీ
రాధే రాధే రాధే రాధే రాధే రాధే

-శంకరకింకరః


Wednesday, April 29, 2026

శ్రీకృష్ణస్తోత్రం రాధాకృతం

 

శ్రీకృష్ణస్తోత్రం రాధాకృతం

గోలోకనాథ గోపీశ మదీశ ప్రాణవల్లభ . హే దీనబంధో దీనేశ సర్వేశ్వర నమోఽస్తు తే .. 1.. గోపేశ గోసమూహేశ యశోదాఽఽనందవర్ధన . నందాత్మజ సదానంద నిత్యానంద నమోఽస్తు తే .. 2.. శతమన్యోర్భగ్నమన్యో బ్రహ్మదర్పవినాశక . కాలీయదమన ప్రాణనాథ కృష్ణ నమోఽస్తు తే .. 3.. శివానంతేశ బ్రహ్మేశ బ్రాహ్మణేశ పరాత్పర . బ్రహ్మస్వరూప బ్రహ్మజ్ఞ బ్రహ్మబీజ నమోఽస్తు తే .. 4.. చరాచరతరోర్బీజ గుణాతీత గుణాత్మక . గుణబీజ గుణాధార గుణేశ్వర నమోఽస్తు తే .. 5.. అణిమాదికసిద్ధీశ సిద్ధేః సిద్ధిస్వరూపక . తపస్తపస్వింస్తపసాం బీజరూప నమోఽస్తు తే .. 6.. యదనిర్వచనీయం చ వస్తు నిర్వచనీయకం . తత్స్వరూప తయోర్బీజ సర్వబీజ నమోఽస్తు తే .. 7.. అహం సరస్వతీ లక్ష్మీర్దుర్గా గంగా శ్రుతిప్రసూః . యస్య పాదార్చనాన్నిత్యం పూజ్యాస్తస్మై నమో నమః .. 8.. స్పర్శనే యస్య భృత్యానాం ధ్యానే చాపి దివానిశం . పవిత్రాణి చ తీర్థాని తస్మై భగవతే నమః .. 9.. ఇత్యేవముక్త్వా సా దేవీ జలే సన్న్యస్య విగ్రహం . మనఃప్రాణాంశ్చ శ్రీకృష్ణే తస్థౌ స్థాణుసమా సతీ .. 10.. రాధాకృతం హరేః స్తోత్రం త్రిసంధ్యం యః పఠేన్నరః . హరిభక్తిం చ దాస్యం చ లభేద్రాధాగతిం ధ్రువం .. 11.. విపత్తౌ యః పఠేద్భక్త్యా సద్యః సంపత్తిమాప్నుయాత్ . చిరకాలగతం ద్రవ్యం హృతం నష్టం చ లభ్యతే .. 12.. బంధువృద్ధిర్భవేత్తస్య ప్రసన్నం మానసం పరం . చింతాగ్రస్తః పఠేద్భక్త్యా పరాం నిర్వృతిమాప్నుయాత్ .. 13.. పతిభేదే పుత్రభేదే మిత్రభేదే చ సంకటే . మాసం భక్త్యా యది పఠేత్సద్యః సందర్శనం లభేత్ .. 14.. భక్త్యా కుమారీ స్తోత్రం చ శృణుయాద్వత్సరం యది . శ్రీకృష్ణసదృశం కాంతం గుణవంతం లభేద్ధ్రువం .. 15.. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే గోపికావస్త్రహరణప్రస్తావోనామ సప్తవింశోఽశ్యాయే రాధాకృతం శ్రీకృష్ణస్తోత్రం సంపూర్ణం .

Tuesday, April 28, 2026

బృందావన కథలు - 1 - మామ్మ రెండు పేడాలు

(హిందీలో విన్న కథలకు తెలుగులో అనువాదం)

జై శ్రీ రాధే గోవింద

ఒక వృద్ధ మహిళ రైలులో ప్రయాణిస్తూ నిశ్శబ్దంగా కన్నీళ్లు కారుస్తూ కూర్చుంది. ఆమె పక్కన కూర్చున్న ఒక యువకుడు ఆవిడ బాధను గమనించి, ఏమైందో తెలుసుకోవాలని వినయంగా పలకరించాడు.

ఆమె మాత్రం సమాధానం చెప్పకుండా అతని వైపు చూసి మరింతగా ఏడుస్తూనే ఉంది. యువకుడు మరోసారి, దగ్గరగా కూర్చుని, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు? మీ బాధకి కారణమేమిటి?” అని సానుభూతితో అడిగాడు.

అయినా ఆవిడ మాటాడలేదు. ఇంకా కన్నీళ్లు ఆపుకోలేక కొంగుతో ముఖం మూసుకుని ఏడుస్తూనే ఉంది. యువకుడు ఓర్పుగా మళ్లీ అడిగాడు:

“అమ్మా, చెప్పండి. నేను ఏమైనా సహాయం చేయగలిగితే తప్పకుండా చేస్తాను. దయచేసి ఏడవకండి.”

అప్పుడు ఆ ముదుసలి తన చేతిలో ఉన్న చిన్న సంచిని చూపిస్తూ, దాన్ని తెరవమని సైగ చేసింది. యువకుడు సంచిని తెరిచి చూడగా, అందులో సువాసన వెదజల్లుతున్న ఒక వస్త్రం, నాలుగు పేడాలు, రెండు వందల రూపాయలు, అలాగే ఒక చీటీ కనిపించాయి. అతనికి ఏమీ అర్థం కాక ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు.

ఆమె చీటీని చదవమని సూచించింది. యువకుడు చీటీని తెరిచి చూడగా, విషయం అర్థం కాక మళ్లీ ఆమె వైపు చూసాడు. అప్పుడు ఆ వృద్ధ మహిళ తన కథను చెప్పడం ప్రారంభించింది:

“నేను వృద్ధురాలిని. మా ఊరినుంచి ఒంటరిగా బాంకే బీహారి (శ్రీకృష్ణ) దర్శనం కోసం బృందావనానికి వెళ్లాను. ఆలయ మెట్లు ఎక్కి హుండీలో రెండు వందల రూపాయలు సమర్పించాను. దర్శనం పూర్తయ్యాక అక్కడి గోస్వామి (పూజారి) ప్రసాదంగా ఒక పేడా ఇచ్చారు.

నేను మరొకటి ఇవ్వమని అడిగితే, ‘అమ్మా, అలా కుదరదు. అందరికీ ఒక్కొక్కటే ఇస్తాం’ అన్నారు. దాంతో కోపంగా ‘నాకు ఇది కూడా అవసరం లేదు’ అని తిరిగి ఇచ్చేసి బయటకు వచ్చేశాను.

బయటకు వచ్చాక కోపంతోనే ‘ఇంత దూరం నుంచి వచ్చాను, రెండు పేడాలు కూడా ఇవ్వలేదు’ అని అనుకుంటూ బాధతో ఒకచోట కూర్చున్నాను.

అప్పుడే ఒక చిన్న పిల్లవాడు ఒక సంచి పట్టుకుని వచ్చి, ‘మామ్మా, ఇది కాసేపు పట్టుకోండి, నేను వెంటనే వస్తాను’ అని చెప్పి వెళ్లిపోయాడు. కానీ అతను తిరిగి రాలేదు.

చాలా సేపు ఎదురు చూసి, ఆ సంచీలో ఏముందో చూడాలని తెరిచి చూడగా—అందులో రెండు వందల రూపాయలు, నాలుగు పేడాలు, సువాసనతో నిండిన ఠాకూర్ వస్త్రం, అలాగే ఈ చీటీ కనిపించాయి…”

అంటూ ఆమె కన్నీళ్లతో ఆ చీటీని చూపించింది.

ఆ యువకుడు ఆ చీటీని చదివాడు. అందులో ఇలా వ్రాయబడి ఉంది:

“మామ్మా, నీకు ఎన్ని కావాలంటే అన్ని పేడాలు ఇస్తాను. కానీ నా మీద కోపపడకూ. మళ్లీ మళ్లీ నన్ను చూడడానికి రావాలి.”

ఆ మాటలు చదివిన వెంటనే, ఆ యువకుడికి కూడా కళ్లలో నీళ్లు తడిశాయి. ఆ వృద్ధ మహిళ మాత్రం “కృష్ణా… కన్నయ్యా… ఠాకూర్…” అని భక్తితో పిలుస్తూ, ఆనందభాష్పాలతో కూర్చుంది.

జై శ్రీ బృందావన విహారీ కీ జై

-శంకరకింకరః

Tuesday, March 17, 2026

రహస్యమ్ = ఔపనిషదేయం

 రహస్యమ్ = ఔపనిషదేయం


ఎక్కడైనా స్తోత్రాలలో కానీ, సూక్తాలలో కానీ రహస్యం అని వచ్చిందంటే అది ఔపనిషదేయం అని అర్థం. ఉపనిషద్ వాక్యంలాగా ఆ స్తోత్రాన్ని, సూక్తాన్ని పరిగణించాలని అర్థం.

రాఖీ - రక్షా కర్మ

 రక్షావిధిశ్చ భవిష్యోత్తరే । “ ఉపాకర్మ్మదినే ప్రోక్తమృషీణాంచైవ తర్పణం । వస్త్రైర్వ్విచిత్రైః కార్పాసైః క్షౌమైర్వ్వా మలవర్జ్జితైః । విచిత్రం గ్రథితం సూత్రం స్థాపయేద్భాజనోపరి తతోఽపరాహ్ణసమయే రక్షాపోటలికాం శుభాం ॥ కారయేదక్షతైః శస్తైః సిద్ధార్థైర్హేమభూషితాం । ॥ ఉపలగృహమధ్యే దండచతుష్కే న్యసేచ్ఛుభం పీఠం । తత్రోపవిశేద్రాజా సామాత్యః సపురోహితః ససుహృత్ ॥ తదను పురోధా నృపతే రక్షాం బధ్నీత మంత్రేణ । యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః । తేన త్వాం ప్రతిబధ్రామి రక్షే మా చల మా చల ॥ “ వైదికశ్చ ।  యదా వఘ్న దాక్షపణా హిత్యయః శతానీకా మనష్య మానా తన్మయా బధ్నామి శతం శారదాయా యుష్మన్ జరదిష్టిర్యథా సం । “ బ్రాహ్మణైః క్షత్త్రియైర్వైశ్యైః శూద్రైశ్చాన్యైశ్చ మానవైః । కర్త్తవ్యో రక్షణాచారో విప్రాన్ శంపూజ్య శక్తితః ॥ అనేన విధినా యస్తు రక్షికాబంధమాచరేత్ । స సర్వ్వదోషరహితః సుఖం సంవత్సరం వసేదితి ॥ “



(రక్షాకర్మ యథా ।  ఉదకుంభాచ్చాపో గృహీత్వా ప్రోక్షయన్ రక్షాకర్మ కుర్య్యాత్ తద్వక్ష్యామః । “ 


కృత్యానాం ప్రతిఘాతార్థం తథా రక్షోభయస్య చ । రక్షాకర్మ్మ కరిష్యామి బ్రహ్మా తదనుమన్యతాం ॥ నాగాః పిశాచా గంధర్వ్వాః పితరో యక్షరాక్షసాః । అభిద్రవంతి యే యే త్వాం బ్రహ్మాద్యా ఘ్నంతు తాన్ సదా ॥ పృథివ్యామంతరీక్షే చ యే చరంతి నిశాచరాః । దిక్షు వాస్తునివాసాశ్చ పాంతు త్వాంతే నమస్కృతాః ॥ పాంతు త్వాం మునయో బ్రాహ్మ్యా దివ్యా రాజర్షయస్తథా । పర్వ్వతాశ్చైవ నద్యశ్చ సర్వ్వాః సర్వ్వేఽపి సాగరాః ॥ అగ్నీ రక్షతు తే జిహ్వాం ప్రాణాన్ వాయుస్తథైవ చ । సోమో వ్యానమపానంతే పర్జన్యః పరిరక్షతు ॥ ఉదానం విద్యుతః పాంతు సమానం స్తనయిత్నవః । బలమింద్రో బలపతిర్మంనుర్మన్యే మతింతథా ॥ కామాంస్తే పాంతు గంధర్వ్వాః సత్త్వమింద్రోఽభిరక్షతు । ప్రజ్ఞాంతే వరుణో రాజా సముద్రో నాభిమండలం ॥ చక్షుః సూర్య్యో దిశః శ్రోత్రే చంద్రమాః పాతు తే మనః । నక్షత్రాణి సదా రూపం ఛాయాం పాంతు నిశాస్తవ ॥ రేతస్త్వాప్యాయయంత్వాపో రోమాణ్యోషధయస్తథా । ఆకాశం ఖాని తే పాతు దేహంతవ వసుంధరా ॥ వైశ్వానరః శిరః పాతు విష్ణుస్తవ పరాక్రమం । పౌరుషం పురుషశ్రేష్ఠో బ్రహ్మాత్మానం ధ్రువో భ్రువౌ ॥ ఏతా దేహే విశేషేణ తవ నిత్యా హి దేవతాః । ఏతాస్త్వాం సతతం పాంతు దీర్ఘమాయురవాప్నుహి ॥ స్వస్తి తే భగవాన్ బ్రహ్మ స్వస్తి దేవాశ్చ కుర్వ్వతాం । స్వస్తి తే చంద్రసూర్య్యౌ చ స్వస్తి నారదపర్వ్వతౌ ॥ స్వస్త్యగ్నిశ్చైవ వాయుశ్చ స్వస్తి దేవాః సహేంద్రగాః । పితామహకృతా రక్షా స్వస్త్యాయుర్వర్ద్ధతాం తవ ॥ ఈతయస్తే ప్రశామ్యంతు సదా భవ గతవ్యథః ॥ “ ఇతి  ॥ ఏతైర్వేదాత్మకైర్మంత్రైః కృత్యా వ్యాధివినాశనైః । మయైవం కృతరక్షస్త్వం దీర్ఘర్మాయురవాప్నుహి ॥ “

Monday, March 2, 2026

గుడ్లగూబ

దివా న పశ్యత్యులూకః - సూర్యే దోషో న విద్యతే! - दिवा न पश्यत्युलूकः — सूर्ये दोषो न विद्यते! - న్యాయ శాస్త్రంలో ఉదహరిస్తుంటారీ వాక్యాన్ని.

ఉలూకస్య యథా భానుః అన్ధకారస్య కారణమ్!
తథాఽవిద్వాంసి సత్యం హి దుఃఖాయైవ ప్రజాయతే!!
उलूकस्य यथा भानुः अन्धकारस्य कारणम्!
तथाऽविद्वांसि सत्यं हि दुःखायैव प्रजायते!!
ఎలా గుడ్లగూబ అంధకారానికి సూర్యుడు కారణంలా అనిపిస్తాడో, అలాగే అజ్ఞానులకు సత్యం కూడా బాధకరంగా అనిపిస్తుంది. దోషం సూర్యుడిది కాదు దివాంధానిది.
जैसे उल्लू के लिए सूर्य ही अंधकार का कारण बन जाता है, वैसे ही अज्ञानी के लिए सत्य कष्ट का कारण बनता है! दोष उल्लू में है, सूर्य में नहीं!
𝑱𝒖𝒔𝒕 𝒂𝒔 𝒕𝒉𝒆 𝒔𝒖𝒏 𝒂𝒑𝒑𝒆𝒂𝒓𝒔 𝒂𝒔 𝒅𝒂𝒓𝒌𝒏𝒆𝒔𝒔 𝒕𝒐 𝒕𝒉𝒆 𝒐𝒘𝒍, 𝒔𝒐 𝒕𝒐𝒐 𝒕𝒓𝒖𝒕𝒉 𝒃𝒆𝒄𝒐𝒎𝒆𝒔 𝒂 𝒔𝒐𝒖𝒓𝒄𝒆 𝒐𝒇 𝒅𝒊𝒔𝒄𝒐𝒎𝒇𝒐𝒓𝒕 𝒕𝒐 𝒕𝒉𝒆 𝒊𝒈𝒏𝒐𝒓𝒂𝒏𝒕. 𝑻𝒉𝒆 𝒇𝒂𝒖𝒍𝒕 𝒍𝒊𝒆𝒔 𝒘𝒊𝒕𝒉 𝒕𝒉𝒆 𝑶𝒘𝒍, 𝒏𝒐𝒕 𝒘𝒊𝒕𝒉 𝒕𝒉𝒆 𝑺𝒖𝒏.

-శంకరకింకరః

Tuesday, October 28, 2025

విద్యను, చదువును పరీక్షించండి, వేషాన్ని కాదు

అక్షరాణి పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిమ్? శంభురంబరహీనోపి సర్వజ్ఞః కిం న జాయతే ?

దిగంబరుడైనంత మాత్రాన ఆ పరమశివుడు సర్వజ్ఞుడు అని తెలియదా ? విద్యను, చదువును పరీక్షించండి, వేషాన్నేం పరీక్షిస్తారు?.