శ్రీగురుమూర్తే త్వాం నమామి కామాక్షి.
//సాన్నిధ్యం కురు కళ్యాణీ మమ పూజాగృహే శుభే
బింబే దీపే తథా పుష్పే హరిద్రా కుంకుమే మమ!!
ఓ కళ్యాణీ! శుభప్రదమైన నా పూజాగృహంలో, నేను పూజించే బింబంలో, దీపంలో, పుష్పంలో, పసుపులో, కుంకుమలో నీ సాన్నిధ్యాన్ని ప్రసాదించు.//
కావేరీ నదీమతల్లి సాగరసంగమానికి అడుగులు వేసే పవిత్రమైన చోళమండల తీరాన, సముద్రపు చల్లని గాలులు వేదమంత్రాల గుసగుసలతో ముచ్చటించే ఒక దివ్యక్షేత్రం ఉంది. అదే 'తిరుక్కడైయూర్'. చూడ్డానికి అదొక చిన్న పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న పట్టణంగానే తోచవచ్చు; కానీ ఆ నేల యుగయుగాలుగా పరమభక్తుల పాద ధూళితో, వారి ఆర్ద్రతనిండిన కన్నులనుండి జాలువారిన స్వచ్చమైన అశ్రుబిందువులతో, అగ్నిహోత్రాల భస్మంతో, పునీతమైన తపస్సుతో, వేద ఘోషలతో, మంత్ర జపాలతో కలగలిసిన భక్తి రససిద్ధమైన పుణ్యరేణువుల సమాహారమని బోధపడుతుంది.
నాదస్వర శ్రుతిలో, గర్భగుడి నీరాజనాల వెలుగులో అక్కడ శతాబ్దాల - సహస్రాబ్దాల భక్తిపరిమళం తెలుస్తూనే ఉంటుంది. ఆ క్షేత్రంలో, ఆయుష్షును ప్రసాదించే అమృతఘటేశ్వరుడు ఒకవైపైతే, సమస్త విశ్వాన్ని తన కరుణాకటాక్షంతో బ్రోచే జగన్మాత అభిరామి అమ్మవారు మరొకవైపు కొలువై ఉంటారు. మృత్యుదేవతనే శాసించిన మార్కండేయుని మృత్యుంజయ గాథకు, అమ్మవారి అనుగ్రహాన్ని అమృతకావ్యంగా మలిచి తన మరణశిక్షను పోగొట్టుకున్న అభిరామి భట్టార్ చిత్తశుద్ధికి ఆ తిరుక్కడైయూర్ అమరసాక్షిగా నిలిచింది.
పూర్వం మృకండు మహర్షి, మరుద్మతి దంపతుల నిష్కామ తపస్సుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్కుడైనా జ్ఞాననిధియైన కుమారుడు కావాలా, లేక దీర్ఘాయుష్కుడైనా అజ్ఞానియైన సంతానం కావాలా అని అడిగినప్పుడు, వారు జ్ఞానానికే పట్టంగట్టారు. అలా లభించిన సత్పుత్రుడే మార్కండేయుడు. పదహారేళ్ల పసివయసులోనే కాలం ముంచుకొస్తున్నా, ఆ బాలుని భక్తి చలించలేదు. యముడు పాశంతో ఎదురుగా నిలిచిన వేళ, భయంతో వణకిపోక, గర్భగుడిలోని శివలింగాన్ని పెనవేసుకుని 'మహాదేవా!' అని ఆక్రందన చేశాడు, చన్ద్రశేఖరమాశ్రయే మమకింకరిష్యతి వై యమః అని ధిక్కరించాడు. భక్తుడి ఆక్రందనకు శివుడు సాకారమై లింగం నుంచి కాలాంతకుడిగా ఉద్భవించి యముణ్ణి నిగ్రహించిన పరమ పవిత్రస్థలమిది. కాల గమనాన్ని మార్చగల శక్తి ఒక్క దైవభక్తికే ఉందనే అక్షరసత్యానికి ఈ నేల తొలి తార్కాణం అనవచ్చు.
కాలచక్రం తిరిగింది. మృత్యువును జయించిన ఆ శివక్షేత్రంలోనే, అమ్మవారి ప్రేమతో కాలపు చీకట్లను వెన్నెలగా మార్చి తన మృత్యువును దాటిన మరో అద్భుత ఘట్టానికి కావేరీ తీరం వేదికైంది. అక్కడ, ఆలయ అర్చకత్వమే జీవితంగా భావించే "అమృతలింగ అయ్యర్" ఇంట ఒక ముద్దులొలికే బాలుడు జన్మించాడు. అతడి పేరు "సుబ్రహ్మణ్య అయ్యర్" అని పెట్టారు.
సూర్యోదయానికంటే ముందే మేల్కొనే ఆ ఇంట, పాలు త్రాగే వయసు నుంచే అతనికి మంత్రోచ్చారణలు, గుడిలోని నాదస్వర విన్యాసాలు, ధూపదీపాల పరిమళాలు ఆశ్చర్యమైన అనుభవాలుగా మారి అతణ్ణాకర్షించాయి. పసిపిల్లలు ఆటబొమ్మల కోసం ఆరాటపడితే, ఈ బాలుడు మాత్రం గర్భగుడిలోని దివ్యదీప కాంతుల వైపు, అభిరామి అమ్మవారి నయనాల వైపు అమాయకంగా, నిశ్చలంగా చూస్తూ ఉండిపోయేవాడు. "అమ్మా! నన్ను ఎందుకు అలా చూస్తున్నావు?" అని చిరు పెదవులతో మురిసిపోతుంటే, ఆ తండ్రి అమృతలింగ అయ్యర్ తన కొడుకులో అసాధారణమైన భక్తిబీజాన్ని గమనించాడు. ఆయన ఆ బాలుడికి కేవలం వేదశాస్త్రాలు, సంగీతసాహిత్యాలే కాదు, దేవీతత్వాన్ని గుండెల్లో నింపుకునే అనురాగాన్ని కూడా దీక్షా పరంగా వారసత్వంగా అందించాడు.
సుబ్రహ్మణ్యుడి బాల్యం దాటి యౌవనంలోకి అడుగుపెడుతున్న కొద్దీ, అతని విద్య అంతా అమ్మవారి పాదాల చెంత సమర్పించే సుగంధ పుష్పంగా మారిపోయింది. లోకం చూపులో సిరిసంపదలు, హోదాలు కోరుకునేవిగా కనిపిస్తే, సుబ్రహ్మణ్యుడి కళ్లకు మాత్రం అభిరామి అమ్మవారి కిరీటంలో మెరిసే చిన్న రత్నం సమస్త విశ్వం కన్నా అందంగా కనిపించేది. ఆ తల్లి చిరునవ్వు అతనికి వెన్నెల ప్రవాహంలా, ఆ కరుణాకటాక్షం పాపాలను కడిగే గంగాలా అనిపించేవి. క్రమంగా అతని భక్తి ఒక దివ్యానుభూతిగా మారడంతో, బాహ్య ప్రపంచంతో అతనికి సంబంధ తెగిపోయింది. గర్భగుడి ముందర నిలబడి దేవితో ఏకాంతంగా సంభాషించేవాడు; హఠాత్తుగా ఆనందబాష్పాలు రాల్చేవాడు; మరుక్షణంలోనే జగన్మాతతో అమాయకంగా నవ్వుతూ మాట్లాడేవాడు.
చంద్రమండల మధ్యస్థే మహాత్రిపుర సుందరి
శ్రీ చక్ర రాజనిలయే అభిరామి నమోస్తుతే!
ఈ లోకంలో లౌకిక కొలమానాలతో మనుష్యులనుకూడా కొలిచే వారికి అతడొక 'పిచ్చివాడిలా' కనిపించాడు. కానీ, అహంకారాన్ని వదిలేసి దైవంలో నిశ్శబ్దంగా లీనమైన ఆ చిత్తమే అమ్మవారి దృష్టిలో నిజమైన అమృతత్వమని వారికి బోధపడలేదు.
ఇలాంటి సమయంలోనే, తంజావూరు మహారాజు శరభోజి-2 /సర్ఫోజి-2 తిరుక్కడైయూర్ ఆలయ సందర్శనానికి వచ్చాడు. రాజపరివారం, అధికారులు, జనులు గౌరవప్రపత్తులతో నమస్కరిస్తుంటే, సుబ్రహ్మణ్య అయ్యర్ మాత్రం ఆ ఆడంబరాన్ని, పటాటోపాన్ని ఆ సమూహాన్ని చూడ ఇచ్చగించలేదు. అతని కంటిపాపల్లో కేవలం జగజ్జనని అభిరామి దేవి పూర్ణరూపమే ప్రకాశిస్తోంది. అంతరాలయంలో విడిగా ఒక మూల కూర్చుని నవ్వుతూ అమ్మతో ఏదో మాట్లాడుకుంటున్నాడు.
అది గమనించిన సర్ఫోజీ "ఇతడెవరు?" అని ప్రశ్నించగా, కొందరు ప్రాపంచికులు "ఇతనికి పిచ్చి పట్టింది" అని సుబ్రహ్మణ్యం గురించి నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. సర్ఫోజీ అతని వద్దకు వచ్చి చూస్తే అతని కళ్లలో గొప్పతేజస్సు గోచరమైంది, పరిక్షించే ఉద్దేశంతో—"ఓయ్ భట్టర్! ఈ రోజు ఏ తిథి?" అని అడిగాడు. అది అమావాస్య రాత్రికి ముందు సమయం. కానీ, ఆ క్షణంలో సుబ్రహ్మణ్యుడి అంతరంగంలో అమావాస్య చీకట్లు లేవు; అమ్మవారి దివ్యప్రసన్న ముఖారవిందమనే కోటి సూర్యచంద్రుల వెలుగులు విరబూస్తున్నాయి. ఆ అమ్మవారిని చూసి నవ్వుతూ మాట్లాడుకునే భావావేశంలో, తానెక్కడున్నాడో మరిచి, నోరుజారి "ఈ రోజు పౌర్ణమి" అని నవ్వుతూ పలికాడు.
సర్ఫోజీకి తనను భట్టర్ గేలి చేస్తున్నాడనే భావన కలిగి తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. "అమావాస్య నాడు పౌర్ణమి అని నాతోనే బొంకుతావా! నీ మాట నిజమైతే ఈ రాత్రి నింగిలో నిండు చంద్రుడు ఉదయించాలి. లేదంటే నిన్ను అగ్నికుండంలో తగలేసి ప్రాణదండన విధిస్తాను" అని అరిచి తన అధికారులకు తగు ఉత్తరువులిచ్చి ఏర్పాట్లకై ఆజ్ఞాపించాడు.
ఆసాయంత్రం, అధికారులు ఒక గొయ్యి తీసి, కింద రగిలే అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లుతుండగా , దానిపై వంద తాళ్లతో అల్లిన పీఠంపై సుబ్రహ్మణ్యుడిని వేలాడదీశారు. సుబ్రహ్మణ్య భట్టర్ అమ్మవారిని గురించి స్తుతించి పౌర్ణమి చంద్రుణ్ణి తెప్పించాలి అలా నూరు పద్యాలకి అవకాశం ఇచ్చారు. ఆ అమావాస్యరాత్రిపూట పౌర్ణమి చంద్రుడు కనిపించే వరకూ ప్రతీ పద్యానికి ఒక తాడు చొప్పున కోసివేస్తూ, వంద పద్యాలు పూర్తయ్యేలోపు చంద్రుడు రాకపోతే అగ్నికి ఆహుతి చేయడమే రాజశిక్ష! సూర్యుడు అస్తమించాడు. కాలమేఘాల్లాంటి నల్లటి అమావాస్య చీకటి లోకాన్ని ఆవరించింది. కానీ అగ్నిజ్వాలల మధ్య వేలాడుతున్న భట్టర్ హృదయంలో మాత్రం అచంచలమైన భక్తి అఖండదీపమై వెలుగుతోంది. భయం అతని ఛాయలకు కూడా రాలేదు. తానొక భౌతికదేహమనే స్పృహే అతనికి లేదు; అతనికి ఉన్నదల్లా 'అమ్మ నన్ను వీడదు' అన్న విశ్వాసం అదే కొండంత అండ.
తన ఆర్తిని, అమ్మవారి దివ్యరూపాన్ని అక్షర మాలికలుగా అల్లుతూ ఆ అగ్నిగుండం సాక్షిగా అతడు గళమెత్తాడు. ఒక పద్యం చివరి పదం, తదుపరి పద్యానికి మొదలయ్యే 'అంతాది' శైలిలో కవిత్వ ధార అమృత ప్రవాహంలా జాలువారింది. అందులోనే పుట్టుకొచ్చింది అమరకావ్యం 'అభిరామి అంతాది'. అలా ఒక్కొక్క తాడు తెగుతుండగా, అమ్మవారి దివ్యసౌందర్యాన్ని తన హృదయఫలకంపై నిలుపుకుంటూ 78వ పద్యాన్ని గానం చేశాడు:
సెప్పుం కనక కలశముం పోలుం తిరుములైమేల్
అప్పుం కళభ అభిరామ వల్లీ, అణి తరళక్
కొప్పుం, వయిరక్ కుళైయుం, విళియిన్ కొళుంగడైయుం,
తుప్పుం, నిలవుం ఎళుదివైత్తేన్, ఎన్ తుణై విళిక్కే.
"బంగారు కలశాలవలె శోభిల్లే నీ దివ్య వక్షస్థలానికి పూసిన సుగంధ చందన పరిమళాలు, చెవులకు మెరిసే ముత్యాల ఆభరణాలు, వజ్రఖచిత కుండలాలు, కరుణను వర్షించే నీ దివ్య నయనాల చూపులు, పగడాలవంటి నీ దంతకాంతులు, పెదవులపై నటించే చంద్రబింబంలాంటి మృదువైన చిరునవ్వు—ఇవన్నీ నా నేత్రాలకు, నా హృదయంలో అమరచిత్రంలా లిఖించుకున్నానమ్మా!" అని తన్మయత్వంతో అమ్మ రూపాన్ని కొనియాడాడు. ఆపై, ఏమాత్రం చలించని అనన్య శరణాగతితో 79వ పద్యంలోకి అడుగుపెట్టాడు:
విళిక్కే అరుళుండు, అభిరామ వల్లిక్కు, వేదం సొన్న
వళిక్కే వళిపడ నెంజుండు ఎమక్కు, అవ్వళి కిడక్క,
పళిక్కే సుళన్రు, వెం పావంగళే సెయ్దు, పాళ్ నరకక్
కుళిక్కే అళుందుం కయవర్ తమ్మోడు, ఎన్న కూట్టు ఇనియే?
"ఓ అభిరామవల్లీ! నీ దివ్య నేత్రాలలో అపారమైన కరుణ నిండి ఉంది. వేదాలు మార్గనిర్దేశం చేసిన దివ్య పథంలో శ్రీవిద్యామార్గంలో నిన్ను నిశ్చలమైన హృదయంతో ఆరాధించే భాగ్యం నాకు దక్కింది. అంతటి దివ్యమార్గం నా కళ్లముందు వెలుగుతుండగా, అధికారమదంతో, అధర్మపు దారుల్లో తిరుగుతూ, పాపకూపాల్లో పడి, నరకానికి చేరువయ్యే దుర్మార్గుల సాంగత్యంతో నాకేమి పని తల్లీ?" అంటూ తన సర్వస్వాన్నీ దేవి పాదాల చెంత ఆత్మనివేదన చేసుకున్నాడు. ఆ పద్యంలో 'నేను గొప్ప భక్తుడిని' అనే అహంకారం లేదు; 'తల్లి పాదాలు తప్ప ఈ లోకపు నిందలు, శిక్షలు నాకేమీ కావు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే...' అన్న సంపూర్ణ శరణాగతి మాత్రమే ప్రస్ఫుటమైంది.
అది 79వ తాడు తెగిపడే క్షణం! అగ్నిజ్వాలల వేడి అతడి పాదాలను తాకుతోంది. జనుల గుండెల్లో ఆందోళన, అయ్యో అనే బాధ. సరిగ్గా అదే సమయంలో సన్నాయి, భజంత్రీలు మ్రోగాయి, ఆకాశంనుండి తూర్యఘోషలు వినిపిస్తుండగా, అమ్మవారి ఆలయంలో మహామంగళ నీరాజనాలు అకస్మాత్తుగా మొదలైయ్యాయి.. దేవీ కరుణ భూమ్యాకాశాలను ఏకం చేస్తూ భక్తపరాధీనతను చాటిచెప్పింది. గర్భగుడిలోని అభిరామి అమ్మవారు తన చెవికున్న రత్నఖచిత తాటంకాన్ని (కమ్మను) తీసి ఆకాశంలోకి విసిరింది. ఆ తాటంకం గగనతలంలో నిలిచి, అమావాస్య కటిక చీకట్లను పటాపంచలు చేస్తూ, నిండు పౌర్ణమి చంద్రబింబంలా ప్రకాశించింది! రాత్రికి రాత్రే అమావాస్య ఆకాశం కాస్తా వెన్నెల సముద్రమై మునిగిపోయింది. ఆ అద్భుతాన్ని చూసిన రాజు శరభోజి భట్టార్ పాదాలపై పడి క్షమాపణలు కోరాడు. కానీ భట్టార్ కళ్లలో గెలుపు గర్వం లేదు; "ఇది నా పాండిత్యం కాదు, ఇది నా తల్లి వాత్సల్యం!" అంటూ ఆనందభాష్పాలతో అమ్మవారి పాదాలకే ప్రణమిల్లాడు. నాటి నుండి అతడు 'అభిరామి భట్టార్' గా జగత్ప్రసిద్ధుడయ్యాడు.
తిరుక్కడైయూర్ క్షేత్రం మనకు రెండు గొప్పసత్యాలను నొక్కిచెబుతుంది. ఒకవైపు, మృత్యుంజయుడైన శివుడు మార్కండేయుని కోసం కాలాన్ని ఆపి భక్తుడి ఆయుష్షును శాశ్వతం చేశాడు; మరొకవైపు, జగన్మాత అభిరామి దేవి తన భక్తుడి నోటి మాటను సత్యం చేయడానికీ, మృత్యువునుండి కాపాడడానికీ విశ్వంలోని కాలనియమాన్నే నియమాన్నే ఏమార్చి అమావాస్యను పౌర్ణమిగా మార్చింది.
భక్తి అంటే కేవలం పూజలు చేయడం, ఆచారాలు పాటించడం మాత్రమే కాదు.
సర్వస్వాన్నీ కోల్పోయే పరిస్థితి ఎదురైనా "నా తల్లి నన్ను చేయివిడవదు" అని అచంచలమైన విశ్వాసంతో నిలబడటమే నిజమైన భక్తి.
అభిరామి భట్టార్ హృదయంలో వెలిగిన ఆ అంతరంగ పౌర్ణమి కాంతి, యుగాలు మారినా, తరాలు గడిచినా మానవజాతికి భగవద్బక్తి, జగదంబ ప్రేమయొక్క సాధికారతను చాటిచేప్తూ దివ్యజ్యోతిలా వెలుగుతూనే ఉంటుంది!
అభిరామి అమ్మవారి పాదాలే శరణం
అమృతఘటేశ్వర స్వామి పాదాలే శరణం
జయ మార్కండేయ మహర్షి
జయ అభిరామి భట్టార్
అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే
జయ దుర్గే శివ దుర్గే హర దుర్గే
జయ జయ జయ జయ్ కామాక్షి
జయ జయ జయ జయ కామాక్షి
- శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేంద్ర కుమార్)