Pages

Sunday, July 31, 2022

శంకరుల కాల నిర్ణయం - 2

 ధర్మాకృతి : శంకరుల కాలము - 2


ప్రముఖ చరిత్రకారులు డా.సర్ జడునాథ్ సర్కార్ గారు తమ “History of Dasanami Nagas”లో “No paer earlier than the 19th Century has been preserved in Sringeri Mutt and the same list can be accepted as correct at the best from 13th Century downwards but not earlier than that period” అని శృంగేరీ గురించి చెబుతూ అంటారు. ఇదే పుస్తకంలో ఇంకొక చోట R.N.Ghosh అనే ఆయనకు శివాభినవనృసింహభారతీ స్వామివారు ఈవిధంగా చెప్పినట్లు వ్రాస్తున్నారు. “At the request of modern archaeologist, my Guru constructed this list, in which Sankaracharya’s birth day is given as 14 vikram Samrat and his immediate successor of Sureswara is started to have lived as the head of Monastery for eight hundred years till 757 AD. You may take it as true or false as you like”. సందర్భానుసారంగా చెప్పవలసి వచ్చింది కాబట్టి వ్రాశాను గానీ, శృంగేరీ పీఠ చరిత్రను, ఔన్నత్యాన్ని కించపరచాలని కాదు. హైందవులందరికీ ఆ పీఠం పూజనీయమైనది.


ఏతావాతా చెప్పవచ్చిందేమంటే ఆదిశంకరుల కాలం క్రీ.పూ.509 అనడానికే ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. శృంగేరీ పీఠపు ముప్ఫై రెండవ ఆచార్యుల జీవిత చరిత్రను అత్యంత రమణీయంగా ఆంధ్రీకరించిన ప్రముఖ విద్వాంసులు, విమర్శకులు అయిన శ్రీ నాగపూడి కుప్పుస్వామయ్య గారు కూడా ఈవిధంగానే అభిప్రాయపడ్డారు. శంకరులకాలం క్రీ.పూ.509 అనడానికి సంప్రదాయ చరిత్రకారులు కొన్ని తిరుగులేని ఆధారాలు చెబుతున్నారు. 


౧. పైన చర్చించిన శంకర పీఠాల సంప్రదాయం ప్రకారం (శృంగేరి మినహాయించి) శంకరుల కాలం క్రీ.పూ.509 అనడం సరిగా సరిపోతోంది. వీరందరూ కుమ్మక్కయి ఈ కాల నిర్ణయం చేశారనడానికి వేరువేరు చోట్ల వేరువేరుగా పరిరక్షింపబడిన సంప్రదాయాలు అవడాన వీలులేదు.


౨. ప్రాచీన శంకర విజయాలలో సూచించిన శంకరుల జననకాలపు గ్రహస్థితి ఈ కాలానికే సరిపోతోంది. వేరే ఏ తేదీకీ దగ్గరగా లేదు.


౩. పతంజలి చరిత్ర ఆధారంగా గోవింద భగవత్పాదుల సిద్ధి క్రీ.పూ.493గా నిర్ణయింపబడినది. శృంగేరీ పీఠానికి సంబంధమున్న అభినవ విరూపాక్ష పీఠాచార్యులు ఈ నిర్ణయం చేయడం విశేషం. ఈ నిర్ణయాన్ని అనుసరించి కూడా శంకరుల కాలం క్రీ.పూ.509 అని చెప్పుకోవడం సమంజసం. 


౪. జైన విజయాన్ననుసరించి కుమారిల భట్టు కాలం క్రీ.పూ.557గా గుర్తించబడింది. కుమారిలభట్టు కంటే శంకరులు 46 ఏండ్లు చిన్నవారని శంకర విజయాలు చెబుతున్నాయి. 


౫. క్రీ.శ.788కన్నా ముందున్నారని ఆధునిక చరిత్రకారులు ఒప్పుకొన్న అనేకమంది (ముఖ్యంగా భవభూతి, మహేంద్రవర్మల)గ్రంథాలలో శంకరుల యొక్క అద్వైత సిద్ధాంత ప్రసక్తి ఉంది. 


౬. కోట వేంకటాచలం గారు అనేక విధాలుగా శంకరుల కాలం క్రీ.పూ.509గా నిర్ణయించారు. నేపాళ రాజుల వంశచరిత్ర ఆధారంగా పునరుద్ధరించి వారి కాలాన్ని నిర్ణయించి పురాణ ప్రమాణంతో బలపరిచారు. శంకరులు వృషదేవవర్మ కాలంలో నేపాళదేశం పర్యటించినట్లు చెప్పబడింది. వృషదేవవర్మ కాలం కలిశకం 2555-2615గా నిర్ణయించబడినది. తద్వారా శంకరుల కాలం క్రీ.పూ 509 అనడం సరిపోతుంది. వేంకటాచలం గారు భాగవతము, విష్ణు పురాణము మొదలైన పురాణాల ఆధారంగా బుద్ధుని కాలనిర్ణయం, నాగార్జునుని కాలనిర్ణయం చేశారు. దాని బట్టి కూడా శంకరుల కాలం నిర్ణయింపబడింది. 


౭. శంకరుని కాలంలో మగధ రాజ్యపు రాజుగా చెప్పబడుతున్న ఆంద్రహాలుని కాలాన్ని బట్టి కూడా ఈ నిర్ణయాన్ని సమర్ధించవచ్చు.


౮. ముఖ్యమైనదింకొకటున్నది. కాశ్మీరులో ఉన్న శంకరాచార్య పర్వతంపై ఉన్న శంకరాచార్య దేవాలయం క్రీ.పూ.367కన్నా ముందు అయి ఉండాలని ఋజువు అవుతోంది.


అయితే ఒకే శంకరులు అనేక కాలాల్లో ఉన్నారనడానికి తగిన ఆధారాలు కనిపించడానికి కారణం ఏమిటి? బౌద్ధగ్రంథాలలో శతాబ్దాల అంతరంలో జీవించి ఉన్న బౌద్ధాచార్యులిరువురకు, శంకరులనే బ్రాహ్మణ సన్యాసి సమకాలీనులుగా చెప్పబడింది. ఇదెలా సాధ్యం? బౌద్ధంలో కూడా అనేక కాలాల్లో ఉన్న నాగార్జునాచార్యులందరినీ నాగార్జునాచార్యుడనే పిలుస్తున్నారు. ప్రస్తుతం లామాలను చూడడం లేదా? అలాగే ఆదిశంకరుల నుండి ఇప్పటివరకు అనేక పీఠాలలో, అనేక కాలాలలో శంకర తుల్యులైన మహామహులున్నారు. శంకర పీఠాలలో వారినందరినీ శంకరాచార్యుల వారనే కదా పిలుస్తున్నాం. మరి ఈ ప్రసిద్ధులైన శంకరాచార్యుల ప్రశంస అనేక గ్రంథాలలోనూ, అనేక శాసనాలలోనూ ఉండడం సహజం. కాబట్టి ఇవన్నీ కట్టుకథలని త్రోసి పుచ్చనక్కరలేదు. అయితే ఈ మహాత్ముల కాలాన్ని ఆదిశంకరుల కాలంగా పొరబడడమే ప్రమాదం. ధీమంతులైన మహాపురుషులు కూడా ఈవిషయంలో ప్రమాదంలో పడినారు. ఏం చేస్తాం! ప్రమాదో ధీమతామపి!!


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Saturday, July 30, 2022

శంకరుల కాల నిర్ణయం - 1

 ధర్మాకృతి : శంకరుల కాలము - 1

ఆంగ్లేయ చరిత్రకారులు, వారినే అనుసరిస్తున్న ఆధునిక చరిత్రకారులు ఆదిశంకరుల కాలాన్ని క్రీ.శ.766గా నిర్ణయించారు. పాశ్చాత్యులకు మన సంస్కృతి పౌరాతన్యాన్ని ఒప్పుకోవడానికి మనసొప్పలేదు. బానిసలకు ఇంతటి మహోన్నతమైన సంస్కృతి చరిత్రకు అందని అనాది కాలం నుంచే ఉన్నదనే నిజం ముఖ్యంగా మెకాలే తరువాతి కాలపు చరిత్రకారులకు కొరుకుడు పడలేదు. అందువల్లనే మన చారిత్రిక పురుషులు పౌరాతన్యాన్ని సాధ్యమైనంత కుదించడానికి ప్రయత్నం చేశారు. మన దురదృష్టవశాత్తు వామాచారులైన చరిత్రకారులు నెహ్రూ gaari కాలం నుండి ప్రభుత్వంలో ఆధిపత్యం చేయడం మొదలుపెట్టారు. వీరికి మన పూర్వ ఔన్నత్యం మీద నమ్మకం లేదు. మన పురాణాలను, సంప్రదాయాలను, ఆధారాలను పుక్కిట పురాణాలుగా తేల్చివేస్తారు. సంబంధం లేని ఆధారాలను కంబోడియానుండో, చైనా నుండో వీలయితే రష్యా నుండో పట్టుకొని వస్తారు. శంకరుల విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. కంబోడియా శాసనం, శంకరులు తమ గ్రంథాలలో చెప్పిన విషయాలు మొదలుగా గల ఇరవై ఆధారాలను శంకరుల కాలం నిర్ణయించడానికి ప్రమాణాలుగా తీసుకున్నారు. సాంప్రదాయిక చరిత్రకారులు ఆ ఆ ప్రమాణాలను అత్యంత సమర్థవంతంగా ఖండించారు. ఇద్దరి వాదనలనూ విని నిర్ణయించేదెవ్వరు? క్రీ.పూ.ఆరవ శతాబ్దం నుండి క్రీ.శ.తొమ్మిదవ శతాబ్దం వరకూ ఎవరికి తోచిన కాలం వారు చెబుతూనే ఉన్నారు.
అయితే శంకరుల నుండి ఈనాటి వరకూ అవిచ్ఛిన్న పరంపర చూపుతున్న పీఠాలు నాలుగున్నాయి. విచ్ఛిన్నమయిన పరంపరతో ఇంకొక పీఠమున్నది. ఆధునిక పరిశోధకులు ఈ పీఠాల సంప్రదాయాన్ని ఎందుకు పరిగణనలోనికి తీసుకోరో అర్థం కాదు. ద్వారక, పూరీ, కంచి పీఠముల వారు శంకరుల కాలాన్ని వారి వద్దనున్న గురు పరంపర ఆధారంగా క్రీ.పూ.509గా నిర్ణయించారు. శృంగేరీ వారు మాత్రం 1954దాకా శంకరుల కాలం క్రీ.పూ.44 అని చెప్పేవారు. ప్రస్తుతం వీరు శంకరుల కాలం క్రీ.శ.788 అంటున్నారని అర్థమవుతోంది. విచ్ఛిన్నపరంపర అయిన జోషిమఠం వారు కూడా శంకరుల కాలం క్రీ.పూ.509గానే చెబుతున్నారు. ద్వారకా పీఠం వారు ప్రస్తుతపు ఆచార్యుల వారితో సహా 80మంది ఆచార్యుల పీఠాధిరోహణ, సిద్ధి వివరాలను చూపుతున్నారు. 18వ శతాబ్దము వరకు కంచిలో ఎంతమంది పీఠాధిపతులు చూపబడ్డారో దాదాపు అంతేమంది ద్వారకలో కూడా ఉన్నారు. వీరి పూర్వ పీఠాధిపతులచే వ్రాయబడిన గ్రంథంలో సుధన్వమహారాజుగారి తామ్రశాసనపు నకలు ముద్రించబడినది. అందులో శంకరులు యుధిష్ఠిర శకం 2031వైశాఖ శుక్ల పంచమి నాడు జన్మించినట్లు చెప్పబడింది. పూరీ మఠం నూట నలభై మంది ఆచార్యుల పేర్లను తెలియచెబుతూ శంకరుల కాలం క్రీ.పూ.509గా నిర్ణయించింది. కంచి పీఠం వారు 1524-39లలో సర్వజ్ఞ శివేంద్రులచే వ్రాయబడిన పుణ్య శ్లోక మంజరి, సదాశివ బ్రహ్మేంద్రులచే వ్రాయబడిన గురురత్నమాలిక ఆధారంగా ప్రస్తుతము శంకర విజయేంద్రులతో సహా 70మంది ఆచార్యుల వివరాలు అందజేస్తూ శంకరుల కాలం క్రీ.పూ.509గా నిర్ణయించారు.

చిక్కల్లా శృంగేరీ పీఠం వారు చెప్పే కాలంతో వస్తోంది. 1954సం. వరకూ వీరు శంకరుల కాలం క్రీ.పూ.44గా చెప్పారు. వీరి పీఠంతో సంబంధం ఉన్న కూడలి పీఠం వారు కూడా శంకరులాదిగా అరవై ఏడు పీఠాధిపతుల వివరాలు తెలియబరచి శంకరుల కాలం క్రీ.పూ.44గా నిర్ణయించారు. క్రీ.శ.1844లో ఒక కోర్టు అఫిడవిటులో అప్పటి శృంగేరీ యాజమాన్యము వారు వారి పరంపరలో రమారమి 2000సం.ల పూర్వమున్న శంకరుల కాలంనుండి అప్పటివరకూ 68 మంది ఆచార్యులున్నట్లు, వారి అధిష్ఠానములకు పూజ జరుగుతున్నట్లు వ్రాతపూర్వకముగా తెలియజేశారు. తరువాత ఏ కారణము చేతనో ఆ పీఠాధిపతుల పూజాపేటిక నుండి గ్రహించబడినదని చెప్పబడిన పరంపరా విశేశములో ముప్ఫై ఇరువురు పీఠాధిపతుల పేర్లు మాత్రమే ఉదహరించబడినవి. 1910వ సం.లో అప్పటి శృంగేరీ పీఠాధిపతులచే కాలడిలో వేయించబడిన శిలాశాసనం (ప్రస్తుతం తొలగించబడినది). ఆదిశంకరుల కాలం అప్పటికి 2000సం. పూర్వముగా గుర్తించినది. అయితే తరువాత కాలంలో బహుశః 1967-68లలో అప్పటి పీఠాధిపతులు పూర్వాపరాలను పరిశీలించి శంకరుల కాలం క్రీ.శ.788గా నిర్ణయించారు. కాబట్టి శృంగేరీ పీఠం వారిచే చెప్పబడిన కాలం వారి సంప్రదాయ పరంగా వచ్చినది కాదు. శృంగేరీ పరంపర పరస్పర స్పర్థకల ఇరువురి మధ్య బడి విచ్ఛిన్నము చేయబడినందున దానిని దాని ననుసరించు వారిని ప్రమాణముగా అంగీకరింపవీలులేదని, భారత చరిత్ర చతురానన, భారత చరిత్ర భాస్కర శ్రీ కోట వేంకటాచలం గారు స్పష్టపరిచారు.

Thursday, July 14, 2022

*వేదవ్యాసుడు- గురుపూర్ణిమ*

 *వేదవ్యాసుడు- గురుపూర్ణిమ*

(బ్రహ్మశ్రీ రేమిళ్ల వేంకటరామకృష్ణశాస్త్రిగారు)
_______________________________
व्यासं वशिष्ठनप्तारं शक्तेः पौत्रम् अकल्मषम्
पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम् ।।
వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రం అకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం ..
వేదవ్యాసమహర్షి వశిష్ఠునికి మునిమనుమడు,
శక్తికి పౌత్రుడు, పరాశరుని కుమారుడు, శుకమహర్షికి తండ్రి. అకల్మషుడు. భారతీయులకు మానవాళికి జ్ఞానభిక్షపెట్టిన పరమేష్ఠిగురువు.
వీరిని త్రిమూర్త్యాత్మకముగా మనం ప్రార్థిస్తూ ఉంటాం.
త్రిమూర్త్యాత్మక గురుస్వరూపుడు -
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః..
అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహు రపరో హరిః
అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః.
ఇక్కడ మొదటి శ్లోకంలో గురువును బ్రహ్మవిష్ణుస్వరూపంగా, పరబ్రహ్మస్వరూపంగా భావించి నమస్కరిస్తూన్నాం. రెండవ శ్లోకంలో వ్యాసుని త్రిమూర్తిస్వరూపంగా భావిస్తూన్నాం.
రెండిటి సమన్వయంచేత గురువుగా వ్యాసమహర్షిని భావించాల(భావిస్తున్నామ)న్నమాట.
సాక్షాత్ శ్రీకృష్ణస్వరూపుడు-
అభ్రశ్యామః పింగల జటాబద్ధకలాపః
ప్రాంశుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః .
సర్వాన్ లోకాన్ ప్లావయమానః
కవిముఖ్యః పర్వసు రూపం వివృణోతు.
ఇది వ్యాసులవారివర్ణన. ఆయన మేఘమువలె నల్లనైనవాడు. పింగళవర్ణంలో జటలుకలవాడు.పొడగరి.చేతిలో దండముకలవాడు. కృష్ణమృగాజినం ధరించినవాడు. కవిముఖ్యుడు.
ఇవి బదరికాశ్రమంలో తపస్సుచేసినప్పటి శ్రీకృష్ణునుకి కూడా వర్తిస్తాయి. ఇంతే కాక ఈక్రిందిశ్లోకం వ్యాసనారాయణుల అభేదాన్ని తెలుపుతోంది-
శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం
సూత్రభాష్యకృతౌ వన్దే భగవన్తౌ పునః పునః।
ఇది బ్రహ్మసూత్రకర్త వ్యాసునికి శ్రీకృష్ణునికి, భాష్యకర్త శంకరాచార్యునకు సంకరునికి అభేదాన్ని ప్రతిపాదిస్తోంది. భగవద్గీతనందించిన కృష్ణుడూ కవే.
అనేక పురాణాలను,మహాభారతాన్ని అందించిన వ్యాసుడూ కవే.పైగా వ్యాసుడు కవిముఖ్యుడు.
ఆయన మానవజాతికందించిన సాహిత్యం వెలకట్టలేనిది. అందుకే ఆయన కవిముఖ్యుడు.
ఆదిత్యసదృశుడు వ్యాసుడు -
కవిం పురాణ మనుశాసితార మణోరణీయాంస మనుస్మరేద్యః
సర్వస్యధాతార మచింత్యరూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్.
పెనుచీకటికవ్వలి పరతత్త్వాన్ని ఆదిత్యవర్ణునిగా,
కవిగా ఈశ్లోకం చెపుతోంది. నన్నయగారి ఈ పద్యాన్ని గమనించండి-
భారత భారతీ శుభగభస్తి చయంబుల ఘోర సం
సార వికార సంతమసజాల విజృంభము వాపి సూరి చే
తోరుచిరాబ్జ బోధన రతుండగు దివ్య పరాశరాత్మజాం
భోరుహమిత్రు గొల్చి మునిపూజితు భూరి యశోవిరాజితున్.
(ఆం.మ.భా.అవ.22ప.)
ఇందులో వ్యాసుని అంభోరుహమిత్రునిగా అంటే సూర్యునిగా అభివర్ణించాడు.
సూర్యుడు పద్మాలకు వికాసం కలిగించినట్లే వ్యాసుడు పండితులమనఃపద్మాలను వికసింపజేస్తాడు.
సూర్యునివల్ల చీకటితొలగినట్లే వ్యాసునివల్ల మన అజ్ఞానతిమిరం తొలగిపోతుంది.
కాబట్టే ఆయన మునిపూజితుడు, గొప్పకీర్తిచే ప్రకాసించువాడూ అయ్యేడు.
జనహితప్రారంభుడు –
ఎవరే పనిచేసినా అది జనాలకు హితాన్ని కూర్చేదైతే అంతకుమించిన గొప్పపని ఏమీ ఉండదు.
వ్యాసుడు కురువంశాన్ని నిలబెట్టినా, మహాభారతాన్ని, హరివంశాన్ని, అష్టాదశపురాణాల్ని, మహాభావగతాన్ని, బ్రహ్మసూత్రాల్ని ... రచించినా జనహితంకోసమే.
తాను తరించడం కాదు, శిష్యులను తరింపజేయడమే ఉత్తమగురులక్షణం.
అదే వ్యాసులవారి లక్ష్యం. నన్నయగారి ఈ పద్యం గమనించండి.
పరమబ్రహ్మనిధింబరాశరసుతున్ బ్రహ్మర్షిముఖ్యున్ దయా
పరుఁ గౌరవ్యపితామహున్ జనహితప్రారమ్భుఁ గృష్ణాజినాం
బరు నీలాంబుదవర్ణదేహు ననురూప ప్రాంశు నుద్యద్దివా
కర రుక్పింగజటాకలాపు గతరాగద్వేషు నిర్మత్సరున్ .
(ఆం.మ.భా.ఆది.3ఆ.3ప.)
వ్యాసులవారు వేదాలకునిధి, పరమబ్రహ్మకునిధి(పరతత్వాన్ని ఎరిగినవారు) బ్రహ్మర్షులలో ముఖ్యుడు, దయాపరుడు,జనహితానికే ప్రయత్నం చేసేవాడు, రాగద్వేషాలు లేనివాడు,
మాత్సర్యం లేనివాడు.
ఇవి సద్గురువుకు ఉండవలసిన లక్షణాలు.
శ్రీమన్నారాయణుడే వేదవ్యాసుడు
రామాయణకాలంలో రాముని పరతత్త్వంగా తెలిసినవారు మహర్షులు మాత్రమే. కాని మహాభారతంలో వ్యాసుని గొప్పతనం చాలమందికి తెలుసు.
కాని ఆయన కథలో ప్రత్యక్షంగా పూనుకున్న సందర్భాలు చాలతక్కువ. తిక్కనగారు వ్యాసుని ఎలా ఆవిష్కరించారో చూడండి -
విద్వన్మోదవిధాయి నిర్మలవచోవిస్ఫూర్తివిఖ్యాతుఁ గృ
ష్ణద్వైపాయను నీవెఱుంగుము విభున్ నారాయణుంగా విప
శ్చిద్వంద్యంబగు భారతాధ్యయనముంజేయంగ శక్తుండు ధ
ర్మాద్వైతుండు సరోజలోచనుఁడ కాకన్యుండు తద్వాచ్యుఁడే.
(ఆం.మ.భా.శాంతి.6ఆ.476ప.)
విద్వన్మోదవిధాయి - పండితులకు , జ్ఞానులకు ఆనందం కలిగించేవాడు, నిర్మలవచోవిస్ఫూర్తివిఖ్యాతుఁడు, కృష్ణద్వైపాయనుడు, ధర్మాద్వైతుడు, సరోజలోచనుడు, తద్వాచ్యుడు,మోక్షప్రదాత. ఈవిశేషణాలను గమనిస్తే వ్యాసుడు నారాయణాభిన్నుడని వేరే చెప్పనవసరం లేదు.
నిర్వాణదానక్రియాశీలుడు -
బాలార్క ద్యుతి పుంజ పింజర జటా భారంబుఁ బ్రావృట్ఘన
శ్రీలీలం బ్రహసించు నింగమును రోచిస్స్ఫారదండంబు ను
న్మీలన్నీల మృగాజినాంబరమునై నిర్వాణదానక్రియా
శీలుండైన పరాశరాత్మజుఁడు విచ్చేసెం గృపాలోలుఁడై.
(ఆ.మ.భా.అశ్వ.3ఆ.147ప)
పాండవులకు ఏసమస్య వచ్చినా అక్కడ వ్యాసులవారు ప్రత్యక్షంకావడం చూస్తూ ఉంటాం. అదే ఆయన కృపాలోలత.నిర్వాణదానక్రియాశీలత.
యోగామృత స్ఫీతస్వాంతుడు – వ్యాసుడు
వ్యాసుని జీవితాన్ని పరికిస్తే ఆయన ఎంతటి స్థితప్రజ్ఞడో తెలుస్తుంది.అది యోగంవల్లకాని సాధ్యంకాదు. అందుకే ఎఱ్ఱన గారు ఆయన్ని యోగామృతస్ఫీత స్వాంతుడు అని వర్ణించారు ఈ పద్యంలో -
ప్రీతుండై చనుదెంచె నాశ్రితజనాభీష్ట క్రియాశీలుఁ డు
ద్గీతామ్నాయుఁడు నిర్విధూత దురిత క్లేశుండు యోగామృత-
స్ఫీతస్వాంతుఁ డనంత సంతత సమావిర్భూత కారుణ్య ధా
రా తోయస్నపనైకశీలుఁడగు పారాశర్యుఁడచ్చోటికిన్ .
(ఆ.మ.భా.అరణ్య.6ఆ.103ప.)
ఒకకసారి ఆ విశేషణాలను గమనించండి. ఆశ్రితజనాభీష్టక్రియాశీలుడు, నిర్విధూతదురితక్లేశుండు, యోగామృతస్ఫీతస్వాంతుడు,
సంతత.... కారుణ్యధారా స్నపనైకశీలుడు.
ఆయన కృపావృష్టిని కురిపించే స్వభావంకలవాడు.
తన జ్ఞానంచే పాపాలను పోగొట్టగలవాడు. (జ్ఞానవిధూతపాప్మా—భగవద్గీత)
ఆగమ పదార్థతత్త్వవిదుడు- వేదవ్యాసుడు
ప్రాంశుఁ బయోదనీలతనుభాసితు నుజ్జ్వలదండధారుఁ బిం
గాంశుజటాచ్ఛటాభరణు నాగమపుంజ పదార్థతత్త్వ ని
స్సంశయకారుఁ గృష్ణమృగచర్మ కృతాంబరకృత్యు భారతీ
వంశవివర్థనుం ద్రిదశ వందితు సాత్యవతేయుఁ గొల్చెదన్ .
(ఆ.మ.భా.భీష్మ.1ఆ.71 ప.)
ఆయన వేదాలను విభజించేడంటే పేజీలు చూసి బైండింగు చేయించలేదు. వాటితత్త్వాని ఎరింగిన మహానుభావుడు. అందుకే ఆపనికి పూనుకున్నాడు.
విద్వత్సంస్తవనీయ భవ్యకవితావేశుండు విజ్ఞాన సం
పద్విఖ్యాతుఁడు సంయమిప్రకర సంభావ్యానుభావుండు గృష్ణ ద్వైపాయనుఁ డర్థిలోక హితనిష్ఠంబూని కావించె ధ
ర్మాద్వైతస్థితి భారతాఖ్య మగు లేఖ్యంబైన యామ్నాయమున్.
(ఆ.మ.భా.విరాట.1ఆ.3ప.)
ఆయన అర్థిలోకహితనిష్ఠను పూని భారతరచన చేసాడు. మొదట అనుకున్నట్లుగా జనహితప్రారంభుడన్నమాటను గుర్తుచేసుకోవాలి.ఈ పద్యలను ఇంకా విస్తృతంగా వ్యాఖ్యానింపవచ్చు. కాని నిడివి పెరుగుతుందని విరమిస్తున్నాను. మన్నించండి.
ఇటువంటి మహానుభావును మనం గురుపూర్ణిమరోజున గురువుగా ఆరాధించాలి,ధ్యానించాలి, పూజించాలి.
🙏శ్రీగురుచరణారవిందాభ్యాం నమః।।🙏