శ్రీ గురుభ్యోనమః
అది కేవలం ఒక పురాతన నగరం కాదు...
బ్రహ్మవిద్యా సంస్థానం...
ఎందరో ఉపాసకులకు నెలవు...
ఏ ఆలయ గోపురమైనా జగదంబ వైభవాన్ని ఎలుగెత్తి చాటుతుంది...
దేవతలందరూ చిలుకలుగా మారి అమ్మ నెలవులో తిరుగాడే చోటు...
ప్రతి వీధిలో వేద పండితులు, శాస్త్ర పండితులు, శ్రీవిద్యోపాసకులు, వేదాంతులు, బ్రహ్మవిద్యోపాసకులు తారసపడే చోటు...
సాక్షాత్తూ ఆది శంకర భగవత్పాదులే పీఠ స్థాపన చేసి స్వయంగా అధిష్ఠించిన చోటు...
అన్ని కథలూ, అందరి కథలూ చేరే చోటు...
భరతభూమిలోని అన్ని నగరాలకూ తలమానికమైన చోటు...
"నగరేషు కాంచీ...."
ఆ నగరంలో అనేకానేక దేవాలయాలు, ఇటు విష్ణ్వాలయాలు, అటు శైవాలయాలు, మధ్యలో తామరపువ్వు దుద్దులా జగజ్జననీ "శ్రీ కామాక్షీ పరమేశ్వరి" అనంత కరుణాసముద్రాంతరంగయై కొలువై ఉంటుంది.
"కామాన్ అక్ష్ణోతీతి కామాక్షీ"
భక్తుల యోగ్యమైన కోరికలని తన ఒక్క కటాక్షం వీక్షణంతోనే నెరవేర్చే తల్లి.
ఆ తల్లి కరుణకు అసాధ్యమనే మాట లేదు.
ఆమె ఒక్క కటాక్షంతో అజ్ఞాని - జ్ఞానిగా మారుతాడు...
పాపి - పుణ్యాత్ముడవుతాడు…
దుర్బలుడు - మహాబలుడౌతాడు…
మూగవాడు - వాగ్ఝరితో మహాకవిగా వెలుగుతాడు.
అలాంటి దివ్యలీలకు సాక్ష్యంగా నిలిచిన మహనీయుడే మూకశంకరులు, జగత్తు "మూకకవి" అని గౌరవించిన భక్తశిరోమణి, ఆనక ఆయనే జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ మూకశంకరేంద్ర సరస్వతీ మహా స్వామి.
సామాన్య శకం నాలుగవ శతాబ్దంలో
కాంచీపురంలో జ్యోతిష్యంలోనూ, ఖగోళ శాస్త్రంలోనూ దిట్ట ఐన విద్వావతి అనే ఒక సద్బ్రాహ్మణునికి అతని భార్యకు వరాలరాశిగా ఓ కుమారుడు జన్మించాడు.
ఆ బిడ్డ అపూర్వమైన తేజస్సుతో జన్మించాడు.
కానీ...
నెలలు సంవత్సరాలుగా మారుతున్నా అతని నోట మాట పలకలేదు, అతడు ఏశబ్దం వినలేదు.
తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వైద్యులను ఆశ్రయించారు. మంత్రాలు, హోమాలు, వ్రతాలు చేశారు.
బహుశా అమ్మ సంకల్పం వేరుగా ఉన్నట్లుంది.
ఆ బాలుణ్ణి అందరూ "మూకః - మూగవాడు" అని పిలవడం పరిపాటి అయ్యింది.
---
ఈ జగత్తు లేని అతని నోటిమాటను చూసింది...
కానీ ఆ జగజ్జనని కామాక్షి తల్లి అతని మనసుని చూసింది.
---
ప్రతి ఉదయం...
సూర్యుడు ఉదయించకముందే...
బ్రాహ్మీ ముహూర్తంలో నిత్య విధి నిర్వర్తించుకొని,
ఆ బాలుడు కంచి కామాక్షి ఆలయానికి చేరుకునేవాడు.
గాయత్రిమంటపంలో గర్భగుడి ముందు నిశ్శబ్దంగా కూర్చునేవాడు.
వినపడని కారణాన అతను ఎక్కువగా ఏ వేద మంత్రాలు, ఉపాసనా మంత్రాలు నేర్చుకోలేకపోయాడు.
శ్లోకాలు చదవలేడు, స్తోత్రాలు చేయలేడు, కీర్తనలు పాడలేడు.
కానీ...
అతని కన్నీళ్లు ప్రార్థనగా మారేవి.
అతని మౌనం జపంగా మారేది.
అతని హృదయం ఎప్పుడూ"అమ్మా… అమ్మా" అంటూ ఆర్ద్రతతో పిలిచేది.
రోజులు గడిచాయి...
నెలలు గడిచాయి...
సంవత్సరాలు గడిచాయి...
కానీ ఆ బాలుడి భక్తి మాత్రం తగ్గలేదు.
కామాక్షి సన్నిధి అతని ఇల్లు అయింది.
అమ్మవారి పాదాలు అతని ప్రపంచమయ్యాయి.
ఒకరోజు...
ఆలయంలో మహోత్సవం.
వేదఘోషలు మారుమ్రోగుతున్నాయి.
సన్నాయి భజంత్రీలు
ఢక్కాలు, తూర్యఘోషలు మిన్నంటాయి.
ఘంటానాదాలు గగనాన్ని తాకుతున్నాయి.
అర్చకులు మహామంగళహారతి సమర్పిస్తున్నారు.
ఎర్రని చీర అలంకారంలో...
రత్నాభరణాలు, రత్న కిరీటం ధరించి...
చెఱుకు విల్లు, పుష్పబాణాలు, పాశాంకుశాలు ధరించి..
చిలుక రూపంలో ఉన్న సాధక పండితులు అమ్మవారి చెవిలోకి వినపడేట్టుగా కీర్తిస్తుండగా…
ఆ మహా మంగళ హారతుల కాంతిలో గాయత్రి మంటపంలోని గర్భగుడిలో ఉన్న కామాక్షి అమ్మవారు కోట్ల చంద్రుల కాంతిని మించిన సౌందర్యంతో ప్రకాశిస్తున్నది.
భక్త కోటులు అమ్మ దర్శనానికి వెంపర్లాడుతూ వంగి వంగి అమ్మను చూస్తున్నారు.
కామాక్షి తావకకటాక్షమహేంద్రనీల-
సింహాసనం శ్రితవతో మకరధ్వజస్య!
సామ్రాజ్యమంగలవిధౌ ముణికుండలశ్రీః
నీరాజనోత్సవతరంగితదీపమాల!!
ఉత్సవాల్లో భాగంగా ఆ సాయంత్రం భద్రపీఠంపై అమ్మవారిని ఊరు ఏగించడానికి శుక్రవార మంటపంలో అమ్మవారిని భద్రపీఠం పై ఉంచి అర్చక స్వాములు షోడశోపచారాలతో పూజ చేసి భద్ర పీఠ వాహనంపై ఉన్న అమ్మను గుడి ఆవరణలో ప్రదక్షిణగా తీసుకెళ్ళి తూర్పు ద్వారంగుండా ఊరు ఏగింపుకు తీసుకువస్తున్నారు. ఆ భద్రపీఠవాహనానికి ముందు ఆదిశంకర సన్నిధిలోను శంకరుల మూర్తిని పల్లకీలో వేదపండితులు తీసుకొచ్చి బ్రహ్మరథం పట్టారు. ముందు శంకరుల బ్రహ్మరథం ఆ వెనక జగదంబ భద్రపీఠం ఊరేగింపుగా అర్చకులు, ఆలయ సిబ్బంది, భటులు, భక్త కోట్లు, పండితులు, సువాసినులతో కలిసి బయకుదేరారు.
ఆ సమయంలో… ఆలయ ప్రాంగణం అంతా నిశ్శబ్దంగా ఖాళీగా ఉంది. అతి కొద్ది మంది ఉన్నారు…
గాయత్రి మంటపంలో ఒక సాధకుడు కూర్చుని శ్రీవిద్యామంత్ర సాధన తపస్సులా చేస్తున్నాడు.
అక్కడే మరో ప్రక్క ఈ మూగబాలుడు కూడా కూర్చొని అమ్మను తదేకంగా చూస్తూ మనసులోనే ‘అమ్మా అమ్మా’ అని తలచుకుంటున్నాడు.
ఓ అద్భుతం సాకారమయ్యే వేళ అది... ఆ సమయంలో...
జగన్మాత సామాన్య స్త్రీ రూపాన్ని ధరించి ఆలయ మండపంలో ప్రత్యక్షమైంది.
సింధూరారుణ విగ్రహాం… ఎర్రని సింధూర కాంతిలో ఉన్న అమ్మ పాదాలపై దేవకాంతలు మరింత ఎరుపును ఆపాదించే పారాణి దిద్ది, నూపురాలు అలంకరించిన పాదాలతో నెమ్మదిగా నడుస్తూ.. క్షల్ క్షల్ అని గజ్జెలు మంద్రంగా చప్పుడు చేస్తుండగా…
సుపర్వస్త్రీలోలాలకపరిచితం షట్పదకులైః
స్ఫురల్లాక్షారాగం తరుణతరణిజ్యోతిరరుణైః !
భృతం కాంత్యంభోభిః విసృమరమరందైః సరసిజైః
విధత్తే కామాక్ష్యాః చరణయుగలం బంధుపదవీం !
ఘనమైన తన జుత్తుని జడవేసి కొప్పుకట్టి, చుట్టూ దమనంతో కలిపి మల్లెలు, కనకాంబరాలతో కట్టిన దండ చుట్టి, మధ్యలో సంపెంగలు దూర్చి ఉన్న సిగతో… వేదమాత పాపిట దిద్దిన సిందూరంతో… అష్టమినాటి చంద్ర బింబంలాంటి నొసలు పై ఉదయించే సూర్యుని వంటి కుంకుమ బొట్టుతో… ఎక్కుపెట్టిన విల్లులా ఉండే చక్కనైన కత్తిరింపబడని కనుబొమలతో(సుభ్రూః)… విప్పారిన తామరలవంటి కళ్లతో… సంపెంగ పువ్వు ఆకారంలోని ముక్కుతో, ముత్యాలు, పగడాలు వజ్రాల నత్తులు అడ్దబేసర్లతో…పద్మరాగమణులవంటి చెక్కిళ్లతో... ఎర్రని పెదవులతో స్మితముఖియై నడుస్తూ వస్తూంటే దివ్య చందన సువాసనలు గుప్పు గుప్పుమని వస్తుండగా.. తమలపాకుli, వక్కలు, కాల్చిన ముత్యంపొడి, పచ్చకర్పూరం, జాజికాయ జాపత్రి గుండ, ఎండిన ఖర్జూరాలు వేసిన తాంబూలం నోటి నిండా పెట్టుకుని నములుతూ…
వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీం!
మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం!!
ఆ మహా మాయ, జగజ్జనని మొదటగా ఆ మహాసాధకుని వద్దకు వెళ్లింది…
ఆమె నోట తాంబూలం ఉంది.
దివ్యసుగంధం వెదజల్లుతోంది.
తన నోటిలోని తాంబూలపు పిడచను ప్రసాదంగా అందించింది.
కానీ...
అతడు ఆమెను సామాన్య స్త్రీగా భావించాడు.
"ఎంగిలి తాంబూలమా?" అని సంకోచించి స్వీకరించలేదు. సౌమ్యంగా ఓ నవ్వు నవ్వి మళ్ళీ కళ్ళుమూసుకొని జపం చేయసాగాడు…
అమ్మ చిరునవ్వు నవ్వింది.
కోపం లేదు...
కరుణ మాత్రమే.
ఆమె నెమ్మదిగా ఇంకోవైపుకు తిరిగి...
మండపంలో ఇంకో మూలన కళ్ళుమూసి ధ్యానంలో కూర్చున్న మూగబాలుడి వద్దకు వచ్చింది.
చందనం, పువ్వులు, పారాణి, నోటి తాంబూలం సువాసనలు మేళవించి గుప్పున వచ్చిన వాసనకు ఆ
బాలుడు కళ్లు తెరిచాడు.
ఆ స్త్రీ ముఖంలో ఏదో అపూర్వమైన తేజస్సు.
ఆమె తన చేయి చాచి...
తాంబూల శేష ప్రసాదాన్ని అతని అరచేతిలో ఉంచింది.
అతడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు.
"ఇది అమ్మ ప్రసాదం" అనే భావంతో...
పరమభక్తితో తలవంచి స్వీకరించాడు.
ఆ మరుక్షణమే...
అత్యంత అబ్బురపోయే సంఘటన జరిగింది..
అది కేవలం తాంబూలం కాదు...
సాక్షాత్తు “వాగ్దేవి అనుగ్రహం”
అతని నాలుకపై నిద్రాణంగా ఉన్న సరస్వతి మేల్కొంది. వాగ్దేవతలందరూ ఒకేసారి అనుగ్రహించారు...
జన్మలో ఒక్క మాట పలకని ఆ నోటి నుండి...
గంగాప్రవాహంలా సంస్కృత కవిత్వం ఉబికి వచ్చింది.
ఆలయంలో ఉన్నవారంతా ఆశ్చర్యంతో నిలిచిపోయారు.
మూగవాడని అందరికీ తెలిసిన ఆ బాలుడు...
అనర్గళంగా కామాక్షి మహిమను గానం చేస్తున్నాడు...
రాకాచంద్రసమానకాంతివదనా నాకాధిరాజస్తుతా
మూకానామపి కుర్వతీ సురధునీనీకాశవాగ్వైభవం!
శ్రీకాంచీనగరీవిహారరసికా శోకాపహంత్రీ సతాం
ఏకా పుణ్యపరంపరా పశుపతేరాకారిణీ రాజతే!!
ఆ రోజు ప్రారంభమైన ఆ దివ్య కవితా ప్రవాహమే...
తరువాత "మూకపంచశతి"గా లోకప్రసిద్ధి పొందింది.
ఐదు శతకాలుగా విభజించబడిన ఆ అయిదువందల శ్లోకాల ప్రతి అక్షరం...
కామాక్షి కరుణకు సాక్ష్యంగా నేటికీ భక్తుల హృదయాలను పరవశింపజేస్తూనే ఉంది.
ఆ రోజు నుండి...
ప్రపంచం ఆయనను "మూకుడు" అని పిలవలేదు. "మూకకవి"గా కీర్తించి భక్తిశ్రద్ధలతో నమస్కరించింది.
ఆయన నోటి నుండి ప్రవహించిన ఆ దివ్య కవిత్వమే కాలక్రమేణా "మూకపంచశతి'"గా ప్రసిద్ధి చెందింది. ఐదు శతకాలుగా విభజించబడిన ఈ దివ్య స్తోత్రరత్నం
-ఆర్యాశతకం,
-పాదారవిందశతకం,
-స్తుతిశతకం,
-కటాక్షశతకం,
-మందస్మితశతకం
...అనే ఈ అయిదు భాగాలలో అమ్మవారి అనంత సౌందర్యాన్ని, కరుణను, కటాక్షామృతాన్ని అక్షరాలతో కూర్చి ప్రపంచానికందించారు మూకమహాకవి. ఆపదబంధాలు, ఛందో వ్యాకరణప్రయోగాలు, అద్భుతమైన అలంకారాల ప్రయోగ విన్యాసాలు ఆహా... అదో గొప్ప కావ్యమైంది...
కంపాతీచరాణాం కరుణాకోరకితదృష్టిపాతానాం!
కేలీవనం మనో మే కేషాంచిద్భవతు చిద్విలాసానాం!!
మూకకవిలో వెల్లివిరిసిన అసాధారణ పాండిత్యాన్ని, బ్రహ్మవిద్యాస్వరూపిణి ఐన అమ్మ కామాక్షి యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని, అతనికి సద్యః ఫలితంగా భాసించిన వేదపాండిత్యాన్ని గమనించిన అప్పటి కాంచీ కామకోటి సర్వజ్ఞ మూలామ్నాయ పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ మార్తాండ విద్యాఘనేంద్ర సరస్వతి మహాస్వాములు, ఆయనకు సన్యాసదీక్షను ప్రసాదించారు.
సన్యాసాశ్రమంలో ఆయనకు "శ్రీ మూకశంకరేంద్ర సరస్వతి" అనే యోగపట్టా ప్రసాదించి,శంకర పరంపరాగత కాంచీ కామకోటి మూలామ్నాయ సర్వజ్ఞ పీఠానికి ఇరవయ్యవ జగద్గురువుగా అభిషేకించారు.
జగద్గురువుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం...
వేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు, ఆగమాలు అన్నింటిలోనూ అపార పాండిత్యాన్ని ప్రదర్శించి, అనేక మంది శిష్యులను తీర్చిదిద్దారు.
ఆయన ఆశీస్సుల కోసం పండితులు మాత్రమే కాదు... అనేకమంది రాజులు కూడా వచ్చేవారు.
కాశ్మీర దేశాధిపతులైన మాతృగుప్తుడు, ప్రవరసేనుడు వంటి మహారాజులు సైతం ఆయనను దర్శించి, సేవించారని గురుపరంపరలో ప్రసిద్ధి.
దాదాపు ముప్పై తొమ్మిది సంవత్సరాలపాటు ( 385CE - 398CE) కాంచీ కామకోటి పీఠాన్ని అలంకరించిన శ్రీ మూకశంకరులు, ధర్మప్రచారం, వేదరక్షణ, శ్రీవిద్యా సంప్రదాయ పరిరక్షణలో అపూర్వ సేవలను అందించి, భక్తుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
ఆయన అపర శివావతారం... శివుడే ఒకనాడు దూత్వాసునిగా వచ్చి ఆర్యాద్విశతి రచించి, కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలోబర్చావిశేషాలను నిర్దేశించారు.
ఆ తరవాత ఆపరమ శివుడే ఆది శంకర భగవత్పాదులుగా వచ్చి సౌందర్యలహరినిచ్చి, శ్రీచక్ర ప్రతిష్ఠాపన గావించి, కామకోటిమూలామ్నాయ సర్వజ్ఞ పీఠాన్ని అక్కడే స్థాపించి అధిష్ఠించారు.
ఆ అంశయే మూక శంకరంద్రులుగా వచ్చి 500శ్లోకాలతో అమ్మను స్తుతించి కంచి కామకోటి మూలామ్నాయ సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు.
కంచి కామకోటి మూలామ్నాయ సర్వజ్ఞ పీఠాధిపతి బ్రహ్మలీన జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ మూకశంకరేంద్ర సరస్వతీ మహా స్వామికీ జై!
…
నేటికీ కామాక్షి అమ్మవారి ఆలయంలో భక్తులు దర్శనానికొచ్చి చెప్పుకునేదొక్కటే...
తల్లి కటాక్షం లభిస్తే...
మూగవాడైనా మహాకవి అవుతాడు...
సామాన్య వటువైనా జగద్గురువు అవుతాడు...
మనిషి జీవితమే ఆదర్శపూర్వమైన దివ్యచరిత్రగా మారుతుంది.
ఐశ్వర్యమిందుమౌలేరైకాత్మ్యప్రకృతి కాంచిమధ్యగతం!
ఐందవకిశోరశేఖరమైదంపర్యం చకాస్తి నిగమానాం!!
భక్తి అనేది నాలుకతో పలికే మాటల్లో ఉండదు...
మనసునిండా అమ్మని తలచుకొని అర్పించే ప్రేమలో ఉంటుంది.
ప్రపంచం మొత్తం మనలో ఉన్న లోపాలను మాత్రమే చూస్తుంది.
జగన్మాత మాత్రం మన భక్తిని చూస్తుంది.
మనలోని లోపాలనే తన అనుగ్రహానికి హేతువుగా చూస్తుంది
జ్ఞానం గొప్ప సాధనతో రావచ్చు...
కానీ, జగదంబ అనుగ్రహం లభిస్తే జ్ఞానం కరతలామలకం ఔతుంది, వాగ్ఝరి అమృతధారలా ప్రవహిస్తుంది.
అమ్మ కటాక్షం కలిగితే...
మౌనం కూడా వేదమవుతుంది...
పామరులు కూడా మహాకవులుగా వెలుగొందుతారు...
నోటినుండి వచ్చే ప్రతిమాటా భక్తి కవిత్వమౌతుంది…
జీవితమే జగదంబలీలాతరంగ కావ్యమై నిలుస్తుంది...
---
అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే!
జయ దుర్గే! శివ దుర్గే! హర దుర్గే!
జయ జయ - జయ జయ కామాక్షీ!
జయ జయ - జయ కయ కామాక్షీ!
(యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్!
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే !!
విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ !
న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పరమేశ్వర !!)
-శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేంద్ర)