జై రాధే! జై శ్యామ్!
బృందావనానికి చేరిన తరువాత...
హిత హరివంశ మహాప్రభువు జీవితం పూర్తిగా మారిపోయింది.
ఆయనకు బృందావనం ఒక నివాసస్థలం కాదు...
అది రాధారాణి శ్వాస.
అది నిత్యనికుంజం.
అది ప్రేమకు పరమపీఠం.
ప్రతిరోజూ తెల్లవారక ముందే యమునా స్నానం చేసి, శ్రీ రాధావల్లభునికి మంగళారతి చేసి, బ్రజధూళిని నుదుటిపై ధరించి, గంటలకొద్దీ రాధానామంలో లీనమై ఉండేవారు.
ఆయనను దర్శించుకోవడానికి దూరదూర ప్రాంతాల నుండి భక్తులు రావడం ప్రారంభమైంది.
ఎవరు వచ్చినా...
ఆయన శాస్త్రచర్చలతో వారిని ఆకట్టుకునేవారు కాదు.
వేదాంత వాదాలతో వారిని ఆశ్చర్యపరచేవారు కాదు.
ఆయన హృదయం నుండి జాలువారేది ఒక్కటే...
"ప్రేమ."
ఒక రోజు కొందరు వైష్ణవులు వినయంతో "స్వామీ! మేము శ్రీకృష్ణుని పరబ్రహ్మగా ఆరాధిస్తున్నాము. మీరు మాత్రం ఎందుకు ప్రతిచోటా రాధానామాన్నే ముందుగా పలుకుతున్నారు?" హరివంశ మహాప్రభువు చిరునవ్వు నవ్వారు.
యమునాతీరంలోని సరస్సులో వికసించిన ఒక చిన్న తెల్ల కలువను చేతిలోకి తీసుకొని "ఈ పుష్పం ఎంత అందంగా ఉందో చూడండి. కానీ దాని పరిమళాన్ని పువ్వు నుండి వేరు చేయగలరా?" అన్నారు
అందరూ... "అసాధ్యం స్వామీ!" అన్నారు.
ఆయన నవ్వుతూ
"అదేవిధంగా...
రాధా లేకుండా కృష్ణుడు లేడు.
కృష్ణుడు లేకుండా రాధ లేదు.
ఇద్దరూ ఒక్కటే.
కానీ ప్రేమకు మూలం రాధ.
ప్రేమకు ప్రతిస్పందన కృష్ణుడు.
అందుకే నేను ముందుగా రాధమ్మను పిలుస్తాను." అన్నారు.
అందరి హృదయాలు ఆనందంతో నిండిపోయాయి.
ఆ రోజు నుంచి... "రాధే... రాధే..." అనే నామం బ్రజమండలమంతా మరింత మధురంగా మారుమోగసాగింది.
మరొక రోజు... సత్సంగంలో ఒక యువసాధువు "స్వామీ! ముందుగా రాధమ్మనే ఎందుకు ఆశ్రయించాలి?" అని అడిగాడు
హరివంశ మహాప్రభువు దగ్గర ఆడుకుంటున్న ఒక చిన్నబాలుడిని చూపిస్తూ "ఆ బిడ్డ చూడండి. వాడు ఏదైనా కావాలంటే... నేరుగా తండ్రి దగ్గరకు వెళ్తాడా? లేదా... ముందు తల్లి ఒడిలోకి వెళ్తాడా?" అని అడిగారు.
అందరూ... "తల్లి దగ్గరకే వెళ్తాడు." అన్నారు.
ఆయన సంతోషంగా నవ్వి
"అదే రాధాతత్త్వం.
రాధమ్మ జగజ్జనని.
ఆమె కృప చూపితే...
కృష్ణుడు పరుగెత్తుకుంటూ వస్తాడు.
తల్లిని ఆశ్రయించిన బిడ్డను తండ్రి ఎప్పుడూ తిరస్కరించడు." అన్నారు
ఆ మాటలు విన్న కొందరు భక్తులు ఆనందభాష్పాలు పెట్టుకున్నారు. "రాధే రాధే నామం మారుమ్రోగింది.
---
ఒక సాయంత్రం...
సూర్యాస్తమయం తరువాత...
హరివంశ మహాప్రభువు తన శిష్యులతో కలిసి నిధివనం వైపు నడుస్తున్నారు.
ఆకాశంలో చంద్రుడు ఉదయిస్తున్నాడు.
యమునమ్మ నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది.
గాలిలో మల్లెపూల పరిమళం.
ఆయన ఒక్కసారిగా ఆగిపోయారు.
మెల్లగా బ్రజధూళిని చేతిలోకి తీసుకొని కన్నులకు అద్దుకున్నారు.
శిష్యులు ఆశ్చర్యంగా చూశారు.
"ఈ ధూళి సాధారణ ధూళి కాదు. రాధామాధవుల పాదస్పర్శతో పవిత్రమైన చరణరేణువు. ఈ ధూళిని గౌరవించలేని వాడు...
బృందావనాన్ని అర్థం చేసుకోలేడు." అని అన్నారు.
తర్వాత ఒక కదంబవృక్షాన్ని చూపిస్తూ
"ఈ చెట్లు కేవలం చెట్లు కావు.
ఇవి రాసలీలలకు సాక్షులు.
ఈ తీగలు కేవలం తీగలు కావు.
ఇవి రాధామాధవుల ఆలింగనాలను దాచుకున్న జ్ఞాపకాలు." అని చెప్పారు.
శిష్యులందరూ నిశ్శబ్దంగా ఆ లీలలు వింటూ అనుగమించారు...
ఒక రోజు...
ఒక ధనవంతుడు వచ్చి నమస్కరించి. "స్వామీ! నాకు అపారమైన ధనం ఉంది. రాధాకృష్ణుల కోసం ఒక బంగారు మందిరం కట్టించాలని ఉంది." అని అన్నాడు.
హరివంశ మహాప్రభువు చిరునవ్వు నవ్వారు. "కట్టు... అది కూడా మంచి సేవే."అని చెప్పి కాసేపు ఆగారు.
తర్వాత మెల్లగా "కానీ... నీ హృదయంలో వారికి ఒక చిన్న స్థలం కట్టావా?" అన్నారు.
ఆ ధనవంతుడు మౌనాన్నాశ్రయించాడు, ఏం చెప్పాలో అర్థం కాలేదు.
హరివంశ మహాప్రభువు అతని భుజంపై చేయివేసి "బంగారంతో మందిరాలు నిర్మించవచ్చు. ప్రేమతో మాత్రమే బృందావనం నిర్మించగలం. దేవుడు రాతిమందిరంలో కంటే... ప్రేమతో నిండిన హృదయంలో ఎక్కువకాలం నివసిస్తాడు." ఆ మాటలు అతని జీవితాన్ని మార్చేశాయి.
---
హరివంశ మహాప్రభువు ఎన్నో మాధుర్యభరిత పదాలను రచించారు.
ఆయన కవిత్వంలో...
వాదప్రతివాదాలు లేవు.
శాస్త్రగర్వం లేదు.
పాండిత్య ప్రదర్శన లేదు.
అక్కడ కనిపించేది ఒక్కటే...
రాధాప్రేమ.
రాధా నామ బడో సుఖదాయీ!
జపత మిటత భవ భయ భాఈ!!
భావం: "రాధా" నామజపం సంసారభయాన్ని తొలగించి పరమానందాన్ని ప్రసాదిస్తుంది.
హిత హరివంశ మహాప్రభువు కేవలం ఒక ఆచార్యుడు మాత్రమే కాదు...
ఆయన హృదయం అంతా రాధాప్రేమతో నిండిపోయిన కవి.
ఆయన పెదవులపై పలికిన ప్రతి పదం రాధానామామృతమే.
ఆయన రచించిన "హిత చౌరాసీ"లో ప్రతి పదం రాధామాధవుల నికుంజలీలను భక్తుని హృదయంలో ప్రత్యక్షం చేస్తుంది.
అలాగే సంప్రదాయంలో మహనీయులు అత్యంత గౌరవంతో పారాయణం చేసే "రాధా సుధానిధి"లో రాధాతత్త్వం అమృతధారలా ప్రవహిస్తుంది.
ఆ గ్రంథాలను చదివేవారికి శాస్త్రజ్ఞానం మాత్రమే కాదు...
రాధమ్మపై ప్రేమ పుడుతుంది.
కళ్లలో భక్తియుక్తబాష్పాలు నిండుతాయి.
హృదయం బృందావనమైపోతుంది.
ఆయన పదాలు ఆలపిస్తున్నప్పుడు...
వినేవారు ఎక్కడున్నారో కూడా మరిచిపోయేవారు.
కొంతమంది కన్నీళ్లు పెట్టుకునేవారు.
మరికొందరు "రాధే... రాధే..." అని పరవశించిపోయేవారు.
అందుకే ఆయన రచనలు నేటికీ "హిత చౌరాసీ"గా భక్తుల హృదయాలలో చిరంజీవిగా నిలిచాయి.
यस्याः कदापि वसनाञ्चल-खेलनोत्थ-
धन्यातिधन्य-पवनेन कृतार्थमानी।
योगीन्द्र-दुर्गम-गतिर् मधुसूदनोऽपि
तस्यै नमोऽस्तु वृषभानु-भुवो दिशेऽपि॥
యస్యాః కదాపి వసనాంచలఖేలనోత్థ
ధన్యాతిధన్యపవనేన కృతార్థమానీ।
యోగీంద్రదుర్గమగతిర్మధుసూదనోऽపి
తస్యై నమోऽస్తు వృషభానుభువో దిశేఽపి॥
(శ్రీరాధా రస సుధా నిధి)
భావం : "శ్రీరాధాదేవి కట్టుకున్న కొంగు తాకి వచ్చిన గాలి స్పర్శకే తాను ధన్యుడనుకొని ఆనందించే శ్రీకృష్ణుడు కూడా ఆమె ప్రేమమహిమకు వశుడే. అటువంటి వృషభానునందినికి నా నమస్సులు."
కాలం గడిచింది.
హిత హరివంశ మహాప్రభువు వయస్సులో పెద్దవారయ్యారు.
ఒకరోజు...
శిష్యులందరూ ఆయన చుట్టూ చేరారు. అందరి కళ్లలో ఆందోళన. "స్వామీ... మాకు చివరిగా ఒక ఉపదేశం చేయండి." అని ప్రార్థించారు.
హరివంశ మహాప్రభువు మెల్లగా కన్నులు తెరిచారు.
ఆ చూపులో అపారమైన కరుణ.
ముఖంపై చిరునవ్వు.
అత్యంత మృదువైన స్వరంతో
"రాధానామాన్ని ఎన్నడూ విడువకండి.
ప్రేమను కోల్పోవద్దు.
ఇతరుల లోపాలను చూడకండి.
ప్రతి జీవిలో రాధామాధవుల అంశాన్ని దర్శించండి."
కొద్దిసేపు ఆగి...
"బృందావనాన్ని బయట వెతకకండి.
రాధను హృదయంలో ప్రతిష్ఠించినవాడి హృదయమే నిజమైన బృందావనం.
అక్కడే కృష్ణుడు నిత్యం విహరిస్తాడు." అని అన్నారు.
ఆ మాటలు విన్న శిష్యులందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఒక ప్రాతఃకాలం...
రాధానామం జపిస్తూ...
"రాధే... రాధే..."
అనే మధురధ్వని మధ్య...
హిత హరివంశ మహాప్రభువు లోతైన ధ్యానంలో లీనమయ్యారు.
ఆ రోజు గురించి...
బ్రజవాసులు చెబుతూంటారు...
నిధివనం వైపు నుండి అపూర్వమైన పుష్పసుగంధం వ్యాపించిందని...
యమునమ్మ అలలు అసాధారణంగా మృదువుగా ప్రవహించాయని...
ఎన్నో నెమళ్లు ఒకేసారి నాట్యం చేశాయని...
భక్తుల విశ్వాసం ఏమిటంటే...
రాధారాణి స్వయంగా వచ్చి తన ప్రియభక్తుణ్ణి నిత్యనికుంజసేవలోకి తీసుకువెళ్లిందని.
నేటికీ బృందావనంలోని శ్రీ రాధావల్లభదాస్ మందిరంలో లో శ్రీ హిత హరివంశ మహాప్రభువు ప్రతిష్ఠించిన శ్రీ రాధావల్లభుని దర్శించడానికి దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.
అక్కడ ఒక అపూర్వమైన సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.
శ్రీరాధాదేవి ప్రత్యేక విగ్రహం స్థానంలో, ఆమె సన్నిధిని సూచించే దివ్య కిరీటాన్ని ప్రతిష్ఠించి ఆరాధిస్తారు. ఆమే అక్కడ సర్కార్. అది ఒక గొప్ప తత్త్వానికి ప్రతీక. "రాధమ్మ ఎప్పుడూ కృష్ణుని హృదయంలోనే ఉంటుంది; ఆమెను వేరుగా చూపించడం సాధ్యం కాదు" అనే రాధావల్లభ సంప్రదాయ మాధుర్యభావానికి అది చిరస్మరణీయ చిహ్నం
సబ సౌం ఊఁచీ ప్రేమ సగాఈ!
రాధా బిన శ్యామ న సుహాఈ!!
భావం: ప్రేమలో రాధాదేవి స్థానం అత్యున్నతం; రాధా లేకుండా కృష్ణుని లీల సంపూర్ణం కాదు.
హిత హరివంశ మహాప్రభువు ప్రపంచానికి కొత్త మతాన్ని ఇవ్వలేదు.
కొత్త దేవుణ్ణి పరిచయం చేయలేదు.
ఆయన మనకు గుర్తుచేసింది ఒక్కటే...
భక్తికి పరాకాష్ఠ ప్రేమ
ప్రేమే పరమతత్త్వం.
ఆ ప్రేమకు పరిపూర్ణ స్వరూపం...
శ్రీరాధారాణి.
అందుకే ఆయన జీవితమంతా ఒకే సందేశంగా మారింది—
"రాధాకృప లేకుండా కృష్ణప్రాప్తి లేదు.
ప్రేమ లేకుండా భక్తి లేదు.
వినయం లేకుండా ప్రేమ లేదు."
రాధా-నామైవ కార్యం మే
రాధైవ హృదయే మమ|
రాధికా-చరణామ్భోజే
నిత్యం మేఽస్తు మనో రతమ్||
భావార్థం: "రాధానామమే నా జీవిత ధ్యేయం కావాలి. నా హృదయంలో నిత్యం శ్రీరాధాదేవి కొలువై ఉండాలి. ఆమె పాదపద్మాల సేవలోనే నా మనస్సు ఎల్లప్పుడూ ఆనందంగా లీనమై ఉండాలి."
భక్తికి పరాకాష్ఠ ప్రేమ.
ప్రేమకు పరాకాష్ఠ రాధాతత్త్వం.
రాధాకృప కలిగితే కృష్ణసాన్నిధ్యం సహజంగా లభిస్తుంది.
అహంకారం కరిగిన చోటే బృందావనం వికసిస్తుంది.
ఇప్పటికీ...
మీరు బృందావన వీధుల్లో నడుస్తూ...
"రాధే... రాధే..." అని ఒక్కసారి ప్రేమతో పిలవండి.
ఎక్కడో ఒక మూలన...
కదంబచెట్టు నీడలో...
యమునా గాలి తాకిడిలో...
హిత హరివంశ మహాప్రభువు చిరునవ్వు ఇంకా వినిపిస్తూనే ఉంటుంది...
"కృష్ణుడిని వెదకకు...
ముందుగా రాధమ్మ హృదయంలోకి ప్రవేశించు.
అక్కడే శ్యామసుందరుడు నీ కోసం ఎదురుచూస్తున్నాడు..."
బృందావనంలో ప్రతి ధూళికణం ఇప్పటికీ అదే చెబుతోంది...
"రాధే... రాధే..."
జై రాధే! జై శ్యామ్!
రాధే! రాధే!
No comments:
Post a Comment