Pages

Wednesday, November 6, 2013

కార్తీక పురాణము (సంస్కృత మూల సహితం) - 03వ అధ్యాయం

శ్రీ గురుభ్యోనమః
ఓం శ్రీ పరాదేవతాయైనమః
శ్రీ కార్తీక దామోదర త్ర్యంబక దేవతాభ్యోనమః
అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే తృతీయాధ్యాయః
శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం మూడవ అధ్యాయం

శ్రీ వసిష్ఠ ఉవాచ
కార్తికేమాసి రాజేంద్ర స్నానదానజపాదికం
లేశంవాకురుతేమర్త్యస్తదక్షయ్యఫలంస్మృతం!!
అనిత్యం దేహమాశ్రిత్య కార్తికోక్తంచరేన్నహి
స్త్రియోవాపురుషోవాపి శ్వానయోనిశతంవ్రజేత్!!
పౌర్ణమ్యాం కార్తికేమాసి స్నానదానాంతునాచరేత్
కోటిజన్మనుచండాల యోనౌసంజాయతెనృపః!!
క్రమాద్యోనౌసముత్పన్నో భవతి బ్రహ్మరాక్షసః
అత్రైవోదాహరంతీమ మితిహాసంపురాతనం!!
తా! వశిష్ఠ మహర్షి ఇట్లు పలికెను ’ ఓ రాజా! కార్తీక మాసములో స్నాన, దాన, జపాదులైన పుణ్య కార్యములలో ఏ స్వల్పము చేసినను ఆ అల్పమే అనంత ఫలప్రదాత యగును. స్త్రీలైనా పురుషులైనా సరే అశాశ్వతమైన ఈ శరీర మునకు కలిగే కష్టమునకు భయపడి కార్తీక వ్రతము చేయనిచో వంద మార్లు కుక్కగా జన్మించవలసి వచ్చును. కార్తీక పూర్ణిమ రోజున స్నాన దానాలు ఉపవాసము చేయని మనుష్యుడు కోటి మార్లు చండాలుడై పుట్టును. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై యుండును. ఈ విషయమై పూర్వమొక కథ గలదు ఆ విషయము చెప్పెదను వినుము.

తత్వనిష్ఠస్యచరితం తత్సమానేనమేశ్రుణు
ఆంధ్రదేశేద్విజఃకశ్చిత్తత్వనిష్ఠ ఇతిశ్రుతః!!
సర్వశాస్త్రార్ధకుశల స్సత్యవాదీజితేంద్రియః
తీర్థయాత్రాసునిరత స్సర్వభూతదయాపరః!!
కదాచిత్తీర్థయాత్రార్థ మటమానోనరేశ్వర
గోదావరీతటే రాజన్ వటెచాంబరచుంబిని!!
తస్మిన్ త్రయఃపిశాచాశ్ఛబ్రహ్మరాక్షస సంజ్ఞికాః
ఊర్ధ్వ కేశాఃకరాళాస్యౌః కృష్ణ దేహాఃకృశోదరాః!!
రక్తనేత్రశ్మశ్రుముఖా దీర్ఘదంతాసి పాణయః
కపాలా వరణా రాజన్ సర్వభూతభయంకరాః!!
తా!’ఇతిహాసము’ ఒక తత్త్వనిష్ఠునిదైయున్నది గనుక దానిని చక్కగా వినుము. ఓ రాజా! పూర్వము ఆంధ్ర దేశమున తత్వనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, సత్యవాక్పాలకుడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, ప్రాణులయందు దయ గలవాడు, తీర్థయాత్రలందు అనురక్తి కలవాడు. రాజా! ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోతూ గోదావరీ తీరంలో ఆకాశాన్ని ముద్దుపెడుతున్నవా అన్నట్లుండు మఱ్ఱిచెట్లమీద ఉన్న 3బ్రహ్మరాక్షసులను చూసెను. ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పెకి నిక్కి, నోరు వికటముగా, శరీరము నల్లగా, ఉదరము కృశించి, నేత్రములు గడ్డము ముఖము ఎఱ్ఱగా, దంతములు పొడుగుగా ఉండి వారి చేతులలో ఖడ్గములున్నవి, కాపలములను ధరించి ఉన్నవారు సమస్త జంతువులను భయపెట్టుతున్నవారైరి.

వటస్య పరితోరాజన్ త్రిగవ్యూతిర్నిరంతరం
మనుష్యాః పశవస్తద్వత్పక్షిణశ్చమృగా స్తథా!!
నకదాచిచ్ఛరంతిస్మ రాక్షసానాంమహాభయాత్
మహాపర్వతసంకాశైః పశుపక్షిమృగాదిభిః!!
వటవృక్షసమీపేతు బహుర్భీమదారుణైః
ముచ్యం తెబహవోన్యోనం శబ్దాః ప్రాణభయప్రదాః!!
తా! ఆ రాక్షసుల భయముచేత ఆ మఱ్ఱిచెట్టుకు చుట్టూ చాలా దూరము (కొన్ని మైళ్ళ) వరకు  మనుష్యులే కాదు, మృగములు, పశుపక్ష్యాదులు కూడ సంచరించవు. ఆ వట వృక్షం దగ్గర నిత్యమూ పర్వత సమాన శరీరులు అగు పశు పక్ష్యాదులు (తెలియక వెళ్ళినవి) ప్రాణములను గూర్చి భయపడి భయంకరమగు బిగ్గరయగు శబ్దలు చేయుచుండెడివి.

దిష్ట్యాద్విజవరోరాజన్ కార్తికస్నానతత్పరః
గచ్ఛన్ దదర్శతన్మార్గే రాక్షసాన్ వృక్షమాశ్రితాన్!!
సంత్రస్తహృదయస్తత్ర రుర్దభీత్యాచవిహ్వలః
స్మరన్విష్ణు పదద్వంద్వం తత్వనిష్ఠోవనీపతే!!
త్రాహి దేవేశలోకేశ త్రాహి నారాయణావ్యయ
సమస్తభయవిధ్వంసిన్ త్రాహిమాం శరణాగతం
నాన్యంపశ్యామి దేవేశ త్వత్తోహంజగదీశ్వర!!
తా! అనేక కార్తీక వ్రతములాచరించిన ఆ తత్త్వనిష్ఠుడు దైవ ప్రేరణచేత ఆ మార్గమునపోతూ మఱ్ఱిచెట్టుమీది ఆ బ్రహ్మరాక్షసులను చూసెను. వారిని చూసి భయపడి, మనస్సు చికాకు పొంది హృదయము చలించినవాడై భయముతో శోకించుచు శ్రీ హరి పాదారవిందములను స్మరించుచూ ’ఓ దేవేశా, లోకేశా, నన్ను రక్షింపుము, ఓ నారాయాణా నన్ను పాలింపుము, నా భయమంతయూ తొలగతోయుమో దేవేశా, నీకన్న నాకు దిక్కెవరు శరణు శరణు’

ఏవంపలాయమానంతం రాక్షసానుగతాస్తదా
భయాత్కంపాన్వితం విప్రందృష్ట్వాతత్తేజసాహతాః!!
దర్శనాత్తస్యవిప్రస్య సంజ్ఞాసంజాయతే మలా
చక్రుః ప్రణామంతేభూమౌ బ్రాహ్మణాయ మహాత్మనే!!
తే రాక్షసాః ప్రాంజలయ స్తదగ్రౌనృపపుంగవ
తుష్టువుర్వివిధైర్వాక్యైర్విప్రంభూతదయాపరమ్!!
తా! ఈ ప్రకారము స్తుతించుచూ వారి భయమున పరిగెత్తుతున్న బ్రాహ్మణునిచూచి బ్రహ్మరాక్షసులు వానిని భక్షించవలెనని ఎంచి అతని వెంబడి పరిగెత్తసాగిరి. కొంత దూరము పోగానే బ్రాహ్మణుని సమీప స్థితి దర్శనమువల్ల బ్రహ్మరాక్షసులకు స్వస్మృతి కలిగినది. తరవాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందుగ భూమిమీద పడి సాష్ఠాంగ ప్రణామము లాచరించి నమస్కరించి అనేక వాక్యములతో స్తుతించిరి.

బ్రహ్మన్ తేదర్శనాత్సద్యో నయంనిష్కల్మషాలయాః
భవదాగమసంబ్రహ్మన్ లోకోపకరణాయవై
మహతాంజీవనంలోకే ప్రాణినాముపకారకం!!
మహద్విచలనంవిప్ర తేచప్రాహుర్మహీపతే
ఏవం ప్రత్యుదితంశ్రుత్వా బ్రాహ్మణోభయవర్జితః!!
కేయీయమితితానాహ ప్రసన్నేనాంతరాత్మనా
కిమిదంకర్మణాకేన వికారం రూపమీదృశం!!
భవద్భిఃకింకృతంపూర్వం విద్వద్భిరతినిందితం
వదధ్వంనాత్రసందేహో యుష్మాకంమాభయంయతః!!
తేనస్మరంతితేసర్వం పృథక్ తత్కర్మనిందితం
విప్రాగ్ర్యమూచుస్తత్రేత్థం తద్వదామస్సమాగతాః!!
తా! ఆ రాక్షసులు ఏక కంఠమున ’బ్రాహ్మణోత్తమా మీదర్శనము వల్ల మేము పాపరహితులమైనాము. మీరాక మాకు ఉపకారమైనది. అది నిజమే కదా, మహాత్ములు జీవించుటు జంతువులకుపకారమే కదా! మహాత్ములు యాత్రచేయుట లోకమునుద్ధరించుటకే కదా!’ అని స్తుతించిరి. ఈ మాటలను విన్న బ్రాహ్మణుడు భయముని వదిలి స్థిమిత పడ్డ మనసుతో ఇట్లు పలికెను ’ మీరెవరు? ఏ దుష్కర్మ చేత ఇలాంటి వికృతరూపము కలిగింది. లోకనింద్యమైన ఏకర్మమును మీరు పూర్వము చేసియున్నారు? మీకు భయముపోవు కాలము సమీపించినది కనుక సందేహములేకుండ సర్వమూ నాకు తెలియ జేయుము’. అంత ఆ రాక్షసులు తాము చేసిన నింద్య కర్మలను వేరు వేరుగా జ్ఞప్తితెచ్చుకొని ఆ బ్రాహ్మణునితో ఇట్లు పలికిరి.

ప్రథమ ఉవాచ
అహంపురాద్రావిడేషు గ్రామణీః బ్రాహ్మణాధమః
నిష్టురోవాక్యచతురః గ్రామెమందరసంజ్ఞకె
బ్రహ్మస్వంచమయా భుక్తం కుటుంబాసక్తబుద్ధినా
బంధుభ్యోబ్రాహ్మణేభ్యశ్చ నాన్నందత్తంమయాపురా
బ్రహ్మస్వంప్రణయాద్భుక్తం దహత్యాసప్తమంకులం
తదేవచౌర్యరూపేణ దహత్యాచంద్రతారకం
రౌరవెయాతనాంభుక్త్వా సభూమౌబ్రహ్మరాక్షసః
దోషస్యాస్యప్రశమనె ఉపాయంకురుభూమర
తా! మొదటి వాడు ఇట్లు చెప్పెను ’అయ్యా! నేను పూర్వ జన్మములో ద్రావిడదేశములో మందర గ్రామమునకు గ్రామాధికారిని. బ్రాహ్మణులలో నీచుడనై కఠినమైన మాటలు. ఇతరులను వంచించు మాటలు మాట్లాడడంలో నేర్పరిని. నాకుటుంబ లాభముకొరకు ఇతర బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించితిని. బంధువులకు గానీ సాటి బ్రాహ్మణులకు గానీ ఒక్కనాడునూ అన్నము పెట్టనైతిని, బ్రాహ్మణుల సొమ్ము నా స్నేహితులచేత హరింపబడి నాకుటుంబ నాశనము జరిగినది. బ్రాహ్మణుల ధనమును అపహరించిన సూర్య చంద్ర నక్షత్రములుండు వరకు కుటుంబము నశించును. తరవాత మృతినొంది యమబాధలను ఎన్నిటినో పొందొ రౌరవాది నరకబాధల పొంది తరవాత ఆదోషముచేతనే భూమి యందు బ్రహ్మరాక్షస జన్మనెత్తితిని. కనుక ఓ బ్రాహ్మణోత్తమా ఈ నా దోషము పోవు ఉపాయము తెల్పుము’

ద్వితీయోవాచతంవిప్రం వినయావతోనృప
మాతాపిత్రోరహం ద్వేష్యో నిత్యంనిష్ఠురభాషణః!!
దారావత్య సమాయుక్తో మృష్టాన్నంభక్షయామ్యహం
పిత్రోర్మమోభయోశ్చాపి పర్యూషాన్నేనభోజనం!!
బంధుభ్యోబ్రాహ్మణేభ్యశ్చ ద్రవ్యాసక్తేనయన్మయా
నాదత్తంచాణుమాత్రం వా తస్మాద్దుర్బుద్ధినామయా!!
ఆంధ్రదేశనివాసేన చాజ్ఞానే నాల్పమేధినా
తేనకర్మవిపాకేన యాతనాంచయుగాష్టకం!!
భుక్త్వాపశ్చాద్భువంప్రాప్య బ్రహ్మరాక్షసరూపధృత్
పాప పంకేనిమగ్నంమా ముద్ధరేహమహీసుర!!
తా! అందులో రెండవ రాక్షసుడు తనగురించి ఇలా చెప్పుచున్నాడు. ’ అయ్యా! నేను ఆంధ్రదేశమందుండేవాడను, నేను రోజూ తల్లిదండ్రులతో కలహిస్తూ వారందరినీ దూషిస్తూ ఉండేవాడిని. ఇంతేకాక నేను నాభార్యాపిల్లలు షడ్రసోపేతమైన భోజనము చేయుచూ, నా తల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నం పెట్టేవాడిని. బంధువలను, బ్రాహ్మణులను ఏనాడూ ఆదరించలేదు, ఒకనాడైననూ అన్నము పెట్టలేదు. నేను ఎంతో సంపాదించితిని కానీ నా తల్లిదండ్రులకు సరియైన భోజనమును పెట్టి ఎరుగను. తరవాత నేను మృతిని పొంది యమలోకమున 8 యుగములు బాధలను పొంది తరవాత బ్రహ్మరాక్షసుడనై భూమి మీద జన్మనెత్తితిని. ఓ బ్రాహ్మణోత్తమా! నాకీ పాపముతొలగే ఉపాయము చెప్పి నన్ను మీరే ఉద్ధరించవలెను.’

ఏవముక్తే తృతీయస్తు ప్రాహేదంప్రణతోనృప
ఆంధ్రదేశేర్చకోవిప్ర విష్ణోరాయతనేశుభే
స్నానసంధ్యాపరిత్యక్తః పరనిందాపరాయణః
బహుభాషీనిష్ఠురోహం దయాహీనోశుచిర్ద్విజ
తైల విష్ణోదీపసంస్థం మయాచాపహృతంపురా
వేశ్యాగారేతుత తైలం తద్ఘృతందీప్యతేమయా
తస్మాత్తద్ద్రవ్యమాదాయ తయారత్యాతిలాలసః
తేనకర్మవిపాకేన నరకేభుక్తయాతనః
పశ్చాద్భూమిమనుప్రాప్య నానాయోనిషువై క్రమాత్
బ్రహ్మరాక్షసయోనౌతు సంజాతోవ్యత్రపాదవే
రక్షమాంకృపయాబ్రహ్మన్ సర్వభూతదయానిధే
తా! ఇట్లు రెండవ రాక్షసుడుచెప్పగానే, మూడవ రాక్షసుడు కూడ నమస్కరించి తన స్థితిని చెప్పసాగెను. ’అయ్యా! నేను ఆంధ్రదేశ వాసిని, బ్రాహ్మణుడను, విష్ణ్వాలయమునందు అర్చకుడను. స్నానసంధ్యావందనాదులను విడిచి స్వామి పూజనొదిలి పరనిందలను చేయుచు. విశేషముగా మాట్లాడుచు, కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచుండెడివాడను. దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములలోని నెయ్యి నూనెను అపహరించి వేశ్యా గృహమందు దీపములను బెట్టించి ఆనేతిని వేశ్యానుభవమునకు వెచ్చించి, దేవతానివేదాన్నము అపహరించి వేశ్యకు బెట్టి ఆమెతో నేను సంభోగించేవాడిని. ఆదోషములచేత మరణానంతరము నరకమున అనేక యాతనములు పొంది పిమ్మట భూమిమీద నానాయోనులందు జన్మించి ఇప్పుడు బ్రహ్మరాక్షసునిగా జన్మించితిని. అయ్యా! సమస్త భూతములందు అపార కరుణాపూర్ణుడవైన బ్రాహ్మణోత్తమా నన్ను రక్షించి నాకు ముక్తిని ప్రసాదించు మార్గము తెలుపుము.

తై రేవముదితం శ్రుత్వా విప్రోవిస్మితమానసః
మాభయంభవతామల్ప ముద్ధరిష్యేసంకటాత్!!
కార్తికస్నాన కామేన అగచ్ఛధ్వంమయాసహ
ఇత్యుక్త్వాతైస్తతోవిప్రః కావేర్యాంకార్తికేనృప
స్వయంకృత్వాతతస్స్నానం తేషాం ముక్తిమకారయత్!!
తత్క్షణాదేవముక్తాస్స్యుర్దివ్యరూపధరాశ్చతే
యూయుర్విష్ణుపదంరాజన్ కార్తీకస్నానమాత్రతః!!
తా! తత్త్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల మాటలు విని ఆశ్చర్య చకితుడై ఇట్లనెను ’ మీరు ఏమాత్రము అధైర్య పడవలదు. మీ దుఃఖము పోగొట్టుటకై నేను కార్తీక స్నానమునకు పోయెదను, మీరూ నాతో రండి.’ అని వారిని తనతో తీసుకొని పోయి బ్రహ్మరాక్షసుల కొరకు తాను స సంకల్ప స్నానము చేసి వారితోనూ స సంకల్ప స్నానము చేయించి వారి బ్రహ్మరాక్షసత్వమును నశింపచేసెను.  ఆ బ్రాహ్మణుడి విధిగా స్నానమాచరించి ఆరాక్షసులకొరకు ఫలితము ఇవ్వగా, ఆ ముగ్గురు దోషరహితులై దివ్య రూపములను ధరించి వైకుంఠమును చేరిరి.

మోహేనైవాధవాజ్ఞానాత్కావేర్యాంచభృగూదయె
యోనిమజ్జతిరాజేంద్ర విష్ణోఃపూజాంవిధాయచ
వాజపేయాయుతానాంచ ఫలంయాతినసంశయః!!
యేనకేనావ్యుపాయేన కావేర్యాంకార్తికేనృప
ఆవశ్యకమిదంమిదంస్నానం కుర్యాద్విష్ణుపరాయణ!!
నకుర్యాద్యది కార్తిక్యాం స్నానం భక్త్యానరాధమః
దశజన్మనిచండాలః పశ్చాత్సూకరతాంవ్రజేత్
తస్మాత్కార్తికమాసేతు స్త్రియోవాపురుషస్యచ
స్నానమావశ్యకం రాజన్ నాత్రకార్యావిచారణా
తా! ఓ జనక మహారాజా! విను, మోహముచేతగానీ, అజ్ఞానము చేతగానీ, కార్తీక మాసమున సూర్యోదయ కాలములో కావేరియందు స్నానము చేసి తరవాత శ్రీ హరి పూజను చేసిన వారికి వాజపేయాది యజ్ఞములు చేసిన ఫలితము కలుగును, ఎటువంటి సందేహము లేదు. కార్తీక మాసములో ఏదో ఒక ఉపాయముచేత ప్రయత్నించి కావేరీ స్నానము తప్పక చేయవలెను. కార్తీక మాసమున ప్రాతస్నానం చేయనివారు పది జన్మలందు ఛండాలుడై జన్మించి తరవాత పందిగా జన్మించును. కాబట్టి స్త్రీ పురుషులను బేధములేక  కార్తీక స్నానము తప్పక చేయవలెను, ఈ విషయమై విచారణ అవసరం లేదు.

ఇతి స్కాందపురాణే కార్తిక మహాత్మ్యె తృతీయోధ్యాయస్సమాప్తః
ఇది సాంతపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి మూడవ అధ్యాయము సమాప్తము.

సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు

మీ

శ్రీ అయ్యగారి సూర్యనాగేంద్ర కుమార్ శర్మ
~~~~~~~~~~~~~~~~~~~~~~ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు जय जय शंकर हर हर शंकर
 

No comments:

Post a Comment