Pages

Monday, December 18, 2017

తెలుగు సభల నిర్వహణ


ఇంటిలోన అరమరికలు వుంటె ఇల్లెక్కి చాటాలా
కంటిలోన నలక తీయాలంటె కనుగ్రుడ్డులు పెరికివేయాలా.....
నలుగురిలో మన జాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు

...

మహాభారతం పుట్టింది రాణ్మమాహేంద్రవరంలో
భాగవతం వెలిసింది ఏకశిలా నగరంలో
ఈ రెంటిలోన ఏదికాదన్న
ఇన్నాళ్ళ సంస్కృతీ నిండు సున్న
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

....


తెలుగు సభల నిర్వహణ అమోఘం. ఐతే ఇంతకుముందు ప్రభుత సాయంతో నడిచేవి ఇప్పుడు ప్రభుతే నడుపుతోంది. నా వూళ్ళో వేడుక చేస్తే నా వూరి ప్రత్యేకతలని ప్రత్యేకంగా చూపించడం ఏ మాత్రం తప్పు కాదు. అలా అని పూర్వ పెద్దలను విస్మరించకూడదు కదా! ఆ చిన్న మచ్చ ఈ చంద్రునిమీద తప్పలేదు. తెలుగులో అనువదింపబడ్డ అతిపెద్ద ఇతిహాసం కవిత్రయ భారతం
, భారతం అనే గారెలు లేని తెలుగు భోజనం రుచించదు కదా, తిరుపతి లడ్డూ ఐన అన్నమయ పదాల స్మరణ విస్మరణ.. త్యాగయ్య వారి పాయస తియ్యందనాలు లేవు. విశ్వనాథవారి బొబ్బట్లు కనపడట్లేదు.. అష్ట దిగ్గజాల ఆధరువులేవీ? ఇలాంటివే అక్కడక్కడా కించిత్ విస్మరింపబడిన దోషాలు. ఇవి ఖచ్చితంగా తెలుగు సభలే ఏ అనుమానమూ లేదు.... కానీ ఇవి మా ప్రాంత తెలుగు సభలు, ప్రపంచ సభల అనిపించుకునే స్థాయిని కలుపుకోలుతనం లోపించడం వల్లనూ.. చిన్న చిన్న పొరపాట్ల వల్ల నా దృష్టిలో కోల్పోయాయి.. 


ఎవరైనా గతంలో ఈప్రాంత కవులు కవయిత్రులు సాహిత్యం వివక్షకి గురైంది కాబట్టి ఇలా ఇప్పుడు చేసుకుంటున్నాం అంటే ఆ సమర్థన సరికాదు. ఆ వివక్షకి సమాధానమే విభజన. విభజన ఐపోయిన చరిత్ర. ఇప్పుడు కలిసి మెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. కొత్తగా భాషకి సాహిత్యానికి, కవులు కళాకారులకు మళ్ళీ కొత్తగా విభజన అంటించద్దు అని నా బోటి కొత్తతరపు వారి ఆవేదన. రాజకీయాలకతీతంగా జరగాల్సిన ప్రపంచ సభలు, ఇంత గొప్ప నిర్వహణ ప్రాంతీయ సభలైయ్యాయన్నదే ఆవేదన.

అధికారికంగా సభల నిర్వహణనెత్తుకున్న ప్రభుతను శ్లాఘిస్తున్నాను. కానీ ప్రభుత్వం రాజకీయం సమ్మిళితమై రాజ్యంచేస్తున్నవన్నది సత్యం. ప్రభుత్వంగా చేయాల్సిన ఆలోచనలను రాజకీయపు ఆలోచనలు అధిగమించాయి అన్నదీ తేటతెల్లమైంది "అది ఇరువేపులా.."


అందుకే, ఇకపై ప్రపంచ తెలుగు మహా సభల నిర్వహణకి రాజకీయాలకతీతంగా ఒక ప్రత్యేక నిర్వహణ సంస్థ ఏర్పడాలి. రాజకీయాలకతీతంగానే సభానిర్వహణలుండాలి. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, సభానిర్వహణ ఏర్పాట్లలో తోడ్పాటువరకే ప్రభుత నియంత్రింపబడాలి. తెలుగువారు కేవలం ఆంధ్ర తెలంగాణయే కాదు.. ఒరిస్సా, తమిళ, కన్నడ, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, అండమాన్ ఇత్యాది రాష్ట్రాల్లోనూ ఉన్నారు... ఇవి సాహిత్య కారులు, కవులు, కళాకారులు నిర్వహించుకునే , నిర్వహించుకోవాల్సిన సభలు.


నా వ్యాసం వ్యక్తిగత, రాజకీయాతీతం. ఇంతకుముందు వరకూ జరిగిన రీతిలోనే ఇప్పుడూ జరిగాయి. ఎప్పుడూ ఒక ప్రాంతానికే పెద్ద పీట వేయబడ్డది.. నేటితో కలిపి. రేపైనా మారాలి! తెలుగు భాషకి, తెలుగు జాతికి, తెలుగు సంస్కృతికి, తెలుగు కళలకు పట్టాభిషేకం జరగాలి. ప్రాంతాలకికాదు.


తెలుగు వేర్లు ఐతే, తెలుగు జాతి కాండం, ఈ రెండూ కాపాడబడితేనే.. యాస- సాహిత్యం - కళలు - ప్రాంతాలు అనే కొమ్మలు - రెమ్మలు - ఆకులు + పువ్వులు - కాయలు - పళ్ళు బాగుంటాయి...


వీటిలో రాజకీయం, సినిమా కలరింగు రెండూ దూరకుండా భవిష్యత్తు సభలు "ప్రపంచ" సభలుగా నిర్వహించబడాలని కోరుకుంటూ... 

సినారె వారి గీతం పాడుకుంటూ..

తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

తెలంగాణ నాది
రాయలసీమ నాది
సర్కారు నాది
నెల్లూరు నాది

అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

ప్రాంతాలు వేరైనా
మన అంతరంగ మొకటేనన్న
యాసలు వేరుగవున్న
మన భాష తెలుగు భాషన్న

వచ్చిండన్న వచ్చారన్న
వరాల తెలుగు ఒకటేనన్న

మహాభారతం పుట్టింది రాణ్మమాహేంద్రవరంలో
భాగవతం వెలిసింది ఏకశిలా నగరంలో
ఈ రెంటిలోన ఏదికాదన్న
ఇన్నాళ్ళ సంస్కృతీ నిండు సున్న
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

పోచంపాడు ఎవరిది
నాగార్జునసాగరమేవరిది
మూడు కొండ్రలూ కలిసి దున్నిన
ముక్కరు పంటలు బండ్లకెత్తిన
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలే ఐదుకోట్ల తెలుగువారిది.
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము
స్వతంత్ర భారత్‌కి జై
గాంధి నెహ్రూల పిలుపు నందుకొని సత్యాగ్రహాలు చేసాము
వందేమాతరం వందేమాతరం
స్వరాజ్యసిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము

దేశభక్తితో తెలుగువారికి ధిటే లేదనిపించాము
ఇంటిలోన అరమరికలు వుంటె ఇల్లెక్కి చాటాలా
కంటిలోన నలక తీయాలంటె కనుగ్రుడ్డులు పెరికివేయాలా
పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు
నలుగురిలో మన జాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు

తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

తెలంగాణ మనది
రాయలసీమ మనది
సర్కారు మనది
నెల్లూరు మనది

అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

~~~~~~~~~~

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా.. 

అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు, సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా!

-
శంకరకింకర

Thursday, October 26, 2017

నైతికత బాధ్యత చట్టానిది కాదు న్యాయానిది కాదు

రాజ్యాంగ కర్తలు రాజ్యాంగ నిర్మాణంలో చేసిన పెద్దలోపం, వారు విస్మరించిన విషయం ఏమిటో మొన్న హానరబుల్ జస్టిస్ మిశ్రా తీర్పులో స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. భౌతికమూ లౌకికమూ ఐన న్యాయాన్యాయాల విషయంలో ఈ రాజ్యాంగాన్ననుసరించే చట్టాలు పనిచేస్తాయికాని, మనిషిని మనిషిగా నిలిపే నైతికత విషయంలో ఇదేమీ చేయజాలదు. అవి చిన్నప్పుడే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నేర్పించాలి. తెలిసో తెలీకో హానరబుల్ జడ్జి గారు ఈ అనవసర కామెంట్ (సిక్యులర్ల సెల్ఫ్ గోల్) ఓ విధంగా మంచిపనే చేశారు.


ఉన్నత న్యాయస్థానం చెప్పింది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి, పిల్లలకి చిన్నపటినుండే శ్రీ రామాయణ భారత భాగవతాది కావ్యాలు, వాటిలోని సారమైన సత్య- ధర్మాదులు, నిబద్ధత, నీతి - నియమాలు, మానవీయత - సామాజిక కర్తవ్యం - ధార్మిక జీవనం, భర్తృహరి నీతి శాస్త్రం, పంచతంత్ర కథలు అందులోని నీతి, నైతికత ఇవి పిల్లలకి ఇంట్లో నేర్పించండి, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు కనీసం ప్రతివారం వారానికి రెండురోజులు తమ పీరియడ్లలో ఒక్క ఐదేసి నిమిషాలలో ఒక నీతి విషయం బోధించండి. ఈ చట్టాలు, రాజ్యాంగం త్రీస్టేట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నీతి నైతికత బోధించలేవని హాన్రబుల్ జస్టిస్ మిశ్రా జాతీయ గీతం గురించిన తమ తీర్పులో స్పష్టం చేశారు.


సనాతన ఆర్ష వాజ్ఞమయమా వర్థిల్లు ! జయ జయ!!
-శంకరకింకర

Monday, October 23, 2017

ఆష్టవిధం బ్రాహ్మణ్యం


శ్రీ గురుభ్యోనమః


"మాత్రశ్చ బ్రాహ్మణశ్చైవ శ్రోత్రియశ్చ తతః పరమ్
అనూచానః తథాభౄణః ఋషికల్పః ఋషిర్మునిః"
బ్రాహ్మణ్యం ఎనిమిది రకాలు దీనినే ఆష్టవిధం బ్రాహ్మణ్యం అంటారు,

1)బ్రాహ్మణోదరేజాతః అనుపనీతః క్రియాశున్యతం, జాతి మాత్రేణ మాత్రః
మాత్రకుడు అంటే, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు, ఉపనయనం జరగనివాడు, సరియైన సమయంలో ఉపనయనం జరగని కారణం చేత సంధ్యావందనాది నిత్య కర్మలను చేయని కారణాన క్రియా శూన్యుడు, కేవలం జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడుగా తెలియబడేవాడు / లేదా పుట్టుకవలన మాత్రమే బ్రాహ్మణుడుగా తెలియబడుతున్నవాడు.

2) సంస్కారేణ సంస్కృతః ద్విజముచ్యతే - పైన తెలిపిన బ్రాహ్మణుడు ఉపనయన సంస్కారముతో సహా అప్పటి వరకు అన్ని సంస్కారములను శాస్త్రోక్తంగా నిర్వహించి సంస్కరింబడినందున, ఉపనయనానంతరము రెండవజన్మగా సంస్కరింపబడినవాడగుట వలన ద్విజుడుగా బ్రాహ్మణుడు తెలియబడుతున్నాడు.

3)జన్మ సంస్కార విద్యాభి త్రిభః శ్రోత్రియః - పైన తెలిపిన రెండు విధములైన బ్రాహ్మణత్వమును పొంది వేదవిద్యను (శ్రుతిని చదువుకున్నవాడు) పొందిన తరవాత శ్రోత్రియుడుగా బ్రాహ్మణుడు తెలియబడుతున్నాడు, ఆతరవాతనే

4)వేదవేదాంగ తత్వజ్ఞః శుద్ధాత్మా, పాపవర్జితః, శ్రేష్ఠః ప్రాజ్ఞ అనూచానః - శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు వేదాలను ఉపాంగాలతో సహా నేర్చుకొని, అందులోని తత్త్వాన్ని తెలుసుకొని, నిర్మలమైన ఆత్మ కలవాడైనందువల్ల పాపములు లేనివాడై, అందరికీ శ్రేష్ఠుడై, ప్రాజ్ఞతను పొందినబ్రాహ్మణుడు అనూచానుడని తెలియబడుతున్నాడు.

5)అనూచానః, యజ్ఞస్వాధ్యాయ యంత్రతః భౄణః - అనూచానుడై, యజ్ఞములను స్వాధ్యాయములను దాటనివాడు భౄణుడని తెలియబడుతున్నాడు

6)మంత్ర మంత్రార్థ విద్, ప్రాజ్ఞః, వానప్రస్థః, తపస్వీ ఋషిః - మంత్రమును తెలుసుకొని, దాని అర్థాన్ని అది ప్రతిపాదించే తత్త్వాన్ని తెలుసుకొన్నవాడు, ప్రాజ్ఞ్యుడైనవాడు, వాన ప్రస్థాశ్రమమునందుండు వాడు, తపస్సు యందు మక్కువ కలవాడు ఋషి అని తెలియబడుతున్నాడు, వాళ్ళు మంత్ర ద్రష్టలుగా, మంత్రార్థముల ద్రష్టలుగా తెలియబడుతారు.

7.తపసా మానుష్యం అధిక్రాంతం: ఋషులను మామూలు మనుష్యులకన్నా పై స్థాయిలో చూస్తారు, అందుకే దేవతలతో పాటు ఋషులకూ తర్పణలుంటాయి. తపస్సు చేత మనుష్యత్వాన్ని దాటి ఋషిత్వాన్ని పొందుతారు.) ఈ ఋషిలలో మళ్ళీ స్థాయీ బేధాలిలా ఉంటాయి... ఋషి, మహర్షి, దేవర్షి, బ్రహ్మర్షి.

8)ఆత్మత్వమననాత్ మునిః - ఇవన్నీ దాటి ఆత్మ తత్వమునే మననం చేసే స్థితి కలిగినవాడు ముని అని తెలియబడుతున్నాడు.

ఈవిధంగా "వంశము - జన్మ", "వృత్తము - నడవడిక, చేయవలసిన కర్మలు (కర్మ-గౌణము రెండూ)", "విద్య" ఈ మూడూ ఉన్నవాడు త్రిశుక్లుడను బ్రాహ్మణుడనబడి అ పేర లోకములో గౌరవ మన్ననలను పొందును.
- శంకరకింకర

(మూలం స్కాంద పురాణం)
अथ ब्राह्मणभेदांस्त्वमष्टौ विप्रावधारय
मात्रश्च ब्राह्मणश्चैव श्रोत्रियश्च ततः परम्
अनूचानस्तथा भ्रूणो ऋषिकल्प ऋषिर्मुनिः
इत्येतेऽष्टौ समुद्दिष्टा ब्राह्मणाः प्रथमं श्रुतौ
तेषां परः परः श्रेष्ठो विद्यावृत्तविशेषतः
ब्राह्मणानां कुले जातो जातिमात्रो यदा भवेत्
अनुपेतक्रियाहीनो मात्र इत्यभिधीयते
एकोद्देश्यमतिक्राम्य वेदस्याचारवानृजुः
ब्राह्मण इति प्रोक्तो निभृतः सत्यवाग्घृणी
एकां शाखां संकल्पां षड्भिरङ्गैरधीत्य
षट्कर्मनिरतो विप्रः श्रोत्रियो नाम धर्मवित्
वेदवेदाङ्गतत्वज्ञः शुद्धात्मापापवर्जितः
श्रेष्ठः श्रोत्रियवान् प्राज्ञः सोऽनूचान इति स्मृतः
अनूचानगुणोपेतो यज्ञस्वाध्याययन्त्रितः
भ्रूण इत्युच्यते शिष्टैः शेषभोजी जितेन्द्रियः
वैदिकं लौकिकं चैव सर्वज्ञानमवाप्य यः
आश्रमस्थो वशी नित्यमृषिकल्प इति स्मृतः
ऊर्ध्वरेता भवत्यग्रे नियताशी संशयी
शापानुग्रहयोः शक्तः सत्यसन्धो भवेदृषिः
निवृइत्तः सर्वतत्वज्ञः कामक्रोधविवर्जितः
ध्यानस्थो निष्क्रियो दान्तस्तुल्यमृत्काञ्चनो मुनिः
एवमन्वयविद्याभ्यां वृत्तेन समुच्छ्रिताः
त्रिशुक्ला नाम विप्रेन्द्राः पूज्यन्ते सवनादिषुः
(स्कन्दपुराण, माहेश्वर-कुमारिकाखण्ड, 3- 287....298)

అథ బ్రాహ్మణభేదాంస్త్వమష్టౌ విప్రావధారయ !!
మాత్రశ్చ బ్రాహ్మణశ్చైవ శ్రోత్రియశ్చ తతః పరమ్ !
అనూచానస్తథా భ్రూణో ఋషికల్ప ఋషిర్మునిః!!
ఇత్యేతేఽష్టౌ సముద్దిష్టా బ్రాహ్మణాః ప్రథమం శ్రుతౌ !
తేషాం పరః పరః శ్రేష్ఠో విద్యావృత్తవిశేషతః !!
బ్రాహ్మణానాం కులే జాతో జాతిమాత్రో యదా భవేత్ !
అనుపేతక్రియాహీనో మాత్ర ఇత్యభిధీయతే !!
ఏకోద్దేశ్యమతిక్రామ్య వేదస్యాచారవానృజుః !
స బ్రాహ్మణ ఇతి ప్రోక్తో నిభృతః సత్యవాగ్ఘృణీ !!
ఏకాం శాఖాం సంకల్పాం చ షడ్భిరఙ్గైరధీత్య చ !
షట్కర్మనిరతో విప్రః శ్రోత్రియో నామ ధర్మవిత్ !!
వేదవేదాఙ్గతత్వజ్ఞః శుద్ధాత్మాపాపవర్జితః !
శ్రేష్ఠః శ్రోత్రియవాన్ ప్రాజ్ఞః సోఽనూచాన ఇతి స్మృతః !!
అనూచానగుణోపేతో యజ్ఞస్వాధ్యాయయన్త్రితః !
భ్రూణ ఇత్యుచ్యతే శిష్టైః శేషభోజీ జితేన్ద్రియః !!
వైదికం లౌకికం చైవ సర్వజ్ఞానమవాప్య యః !
ఆశ్రమస్థో వశీ నిత్యమృషికల్ప ఇతి స్మృతః !!
ఊర్ధ్వరేతా భవత్యగ్రే నియతాశీ న సంశయీ !
శాపానుగ్రహయోః శక్తః సత్యసన్ధో భవేదృషిః !!
నివృఇత్తః సర్వతత్వజ్ఞః కామక్రోధవివర్జితః !
ధ్యానస్థో నిష్క్రియో దాన్తస్తుల్యమృత్కాఞ్చనో మునిః !!
ఏవమన్వయవిద్యాభ్యాం వృత్తేన చ సముచ్ఛ్రితాః !
త్రిశుక్లా నామ విప్రేన్ద్రాః పూజ్యన్తే సవనాదిషుః !!
(స్కన్దపురాణం, మాహేశ్వర-కుమారికాఖణ్డం - 03-287-298)
- శంకరకింకర


Tuesday, October 10, 2017

తెలుసుకోవడానికి విచారణ చేయాలి వితండం కాదు

శ్రీ గురుభ్యోనమః

ఓ ఊళ్ళోకెళ్ళి ఒక తెలిసిన వ్యక్తి ఇంటి గురించి విచారణ చేస్తే అక్కడ "పెద్దమనిషి" తిన్నగా వెళ్లండి రైటు తీస్కోండి లెఫ్టుతీస్కోండి మూడో మలుపు, నాలుగో సందు, ఐదో ఇంట్లో ఉంటారన్నారనుకోండీ. అప్పుడు మనం ఏం చేస్తాం? ఏదీ ఋజువు చూపించు అంటామా? లేదు కదా ! మహా ఐతే మళ్లీ ఆ పేరు రూపు రేఖలు చెప్పి అతనిల్లేనా అండీ? అని అడిగి ఇల్లు వెతుకుతూ బయలుదేరతాం.. అలా కాకుండా ఋజువు చూపించు అప్పుడే వెళతా అని అడిగితే.. కిందాపైనా చూసి నీక్కావాలంటే వెళ్ళి చూస్కో అంటారు లేకపోతే నీకేమైనా పిచ్చా అంటారు, కదా! ఆ యింట్లో మనక్కావలసిన వ్యక్తి ఉన్నాడోలేడో వెతికి చూస్కోవాలసిన అవసరం మనది తప్ప ఆ దారి చెప్పినతనిది కాదు. ఒకవేళ అతను తప్పైనా వెళ్ళి చూసుకుని వెతుక్కోవలసింది మనమే. అప్పటివరకూ పక్కవాణ్ణి, ఆ ఊరి "పెద్దమనిషిని" ఆనూపానూ తెలిసినవాణ్ణి నమ్మాలి, దొరక్క పోతే తిరిగి ఆచోటికి వచ్చి మళ్లీ కావలసిన వ్యక్తి గురించి మరింత వివరంగా అడిగి సరియైన చిరునామా అడిగి వెతికి పట్టుకుని ఆ యింటికి చేరాలి. అది మన పని అతని పని కాదు. అవసరాన్ని, అవకాశాన్ని బట్టి ఆ "పెద్దమనిషి" ఉదారుడై మన వెంట వచ్చి కావలసిన వ్యక్తి ఇంటి వరకూ వచ్చి చూపగలడు అది అన్ని వేళలా సాధ్యం కాదు. అది అతని ఔదార్యం మాత్రమే.
 
అలాగే, నువ్వొక్క అడుగూ వేయకుండా ఋషుల మాట గురువుల బాట పట్టకుండా ధర్మం మీద శ్రద్ధలేకుండా భగవంతుడు లేడంటే? దేవుడుంటే చూపించు? అని అంటే ఏమనాలి నిన్నప్పుడు? ఆ అవసరం, అగత్యం ఎవరిది? నీది! అంతే తప్ప ఋషులదీ, గురువులదీ ఆ మార్గంలో కుదురుకున్నవాళ్లదీ, భక్తి మార్గంలో వేదాంతారణ్యంలో హేలగా సంచరించేవారిదీ కాదు. ఏమో ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఔదార్యంతో అలా చూపవచ్చేమో కోట్లల్లో ఒకరికి. ఆ కోట్లల్లో ఒక్కడివి నువ్వే అనుకోవడం అత్యాశ. కాబట్టి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి విచారణ చేయాలి వితండం కాదు. అది శంకరుల దుస్తర్కాత్ సువిరమ్యతామ్...

-శంకరకింకర

బస్తీ మే సవాల్..!!! అది కాదు కావలసింది

శ్రీ గురుభ్యోనమః

"నాకంతుంది నాకింతుంది, ఇంత గొప్పది ఉంటే నాదగ్గరుండాలి తప్ప వాళ్ళ దగ్గరుండడమేమిటి?. "నేనన్నిటిలో యెక్కువే అందరికన్నా ఎక్కువే, ఎవరికన్నా తక్కువ కాదు" రాముడికేముంది నాముందు నిలబడలేడు ఆఫ్ట్రాల్ మానవుడు అడవులబడినవాడు" అంటూ... నేనంత వీరుణ్ణీ, అంత పండితుణ్ణీ, అంత అందగాణ్ణీ, అంత ఐశ్వర్యమున్నవాణ్ణీ, అన్జి భోగాలున్నవాణ్ణీ అన్న వాడికి సీతమ్మ ఓ చిన్న గడ్డిపోచ చూపి నీ స్థాయి యిదీ అని చూపింది.

"నేనెంతమ్మా, నావెనక అవతల వేపు అంతమంది మహానుభావులున్నారు నాకన్నా ఎంతో బలవంతులున్నారు, గొప్పవాళ్ళున్నారు, నాతో సమానమైనవారున్నారు కానీ నాకన్నా తక్కువవాళ్ళెవరూ లేరమ్మా" అసలే పిల్లిపిల్లంతై అని వినయంతో కుచిచుకుపోయిన హనుమని ఉత్సాహపరచి, అడవుల్లో రాజ్యంకూడా సరిగాలేని సుగ్రీవుడికి సచివుడు, ఒక శాఖామృగంగా ఉంటూ అడవులు, కొండలు, గుహలు, చెట్లు ఆవాసంగా ఉంటూ ఉండే హనుమతో, మేరుమందర సంకాశమైన అవతార ప్రకటనం చేయించి చూడామణి యిచ్చి లంకా దహనం చేయించింది ఆ సీతమ్మే..

డిసైడింగ్ ఫ్యాక్టర్ రావణుడిలా ఏయ్ కమాన్ గుసగుస బస్తీ మే సవాల్ కాదు నీ జీవన విధానం, నీ ఆస్తిక్య బుద్ధి, నీ వినయం. అదీ దివ్యత్వాన్ని కలిగిస్తుంది. ఆత్మకి (సీతమ్మకి) ఆనందాన్నీ జవాన్నీ కలిగిస్తుంది.

- శంకరకింకర

Monday, October 9, 2017

రూప సంకరం చేయకూడదు

శ్రీ గురుభ్యోనమః

నువ్వు నమ్మిన గురువునో, దేవుణ్ణో ఇతర దేవీ దేవతల రూపాలుగా మార్చి మార్ఫింగ్ చేస్తున్నావంటే , నీకు నీ గురువు "స్వ స్వరూపం " అంటే అసలైన భౌతిక రూపం మీద ప్రేమ, నమ్మకం లేదన్నమాటే. అది ఆయనను అవమానించడమే - పూజించడం కాదు. అది గణపతి కావచ్చు, సాయి కావచ్చు ఇతర ఏ బాబా ఐనా కావచ్చు.

నిరాకారుడైన పరమాత్మ మనకి ఒక రూపంలో గోచరించాడంటే ఆరూపం ఒక గొప్ప సందేశాన్ని చూపుతుంది, తాను ప్రకటించే రక్షణకి, విభూతికి అనుగుణంగా ఆయుధాలు, కూర్చునే, నించునే భంగిమ ఇవన్నీ ఆ అవతార హేతువునీ, ప్రత్యేకతనీ చూపుతాయి. దాన్ని ఇంకొరికి మార్ఫ్ చేసి చూడడం భావదారిద్ర్యమే. అలా ఆరూపం సగుణంగా రావడానికి వెనక తత్సంబంధ ఋషుల ద్రష్టత్వమూ, తపఃఫలమూ, తపించిన భక్తుల కోరికా ఉంటాయి, వాటిని ఒకరివేరొకరివిగా మార్చడం అంటే ఇవన్నింటినీ, ఋషులనూ అవమానించినట్లే. ముఖ్యంగా ఆ బాబాలను గురువులనూ అవమానించడమే ఔతుంది. ఎవరికి ఏరూపం ఉందో ఆరూపంతో కొలవడమే ఉత్తమ భక్తుని లక్షణం. రూప సంకరం చేయకూడదు.

-శంకరకింకర


కాలానికి తగినట్లుగా మార్చగలమా?

ధర్మశాస్త్రాల్లో చాలా నియమాలు నిబంధనలు ఉన్నాయి అని చాలామంది బాధపడుతుంటారు. కొంతమందైతే వాటిని ఈ కాలానికి తగినట్లుగా సవరించమని అడుగుతుంటారు. అంటే అలా మార్చమని అడగడంలో ముఖ్య ఉద్ద్యేశ్యము ఏమిటంటే, ఈనాడు సమాజంలో జరుగుతున్న తప్పుని ధర్మం అనే గొడుగు కిందకు తీసుకుని రమ్మని. మరి 'సత్యం వద ధర్మం చర' అనే వేదసూక్తిని ఇప్పటి కాలానికి తగినట్లుగా మార్చగలమా? ధర్మం అనునది ఎప్పటికి ఒక్కటే

-అనంత శ్రీ విభూషిత భారతితీర్థ మహాస్వామి

రావణుడి మరణ రహస్యం

శ్రీ గురుభ్యోనమః

విభీషణుడు రావణుడి మరణ రహస్యం రాముడికి చెప్పాడనేది శుద్ధ అబద్ధం. సినిమా రామాయణాలు, నాటక రామాయణాలు పక్కకి పెట్టి మూలమైన వాల్మీకంలో కానీ వ్యాసప్రోక్తంలోకానీ చూస్తే ఆ విషయం లేనే లేదు.. ఒక మానవుడికి బోధించినట్లుగానే గురువైన అగస్త్యుడు వచ్చి ఆదిత్యహృదయ మంత్రాన్ని అస్త్రంగా ప్రయోగించడం నేర్పి దీన్ని ప్రయోగించు రావణుడు హతుడౌతాడు అని దీవించి వెళ్ళారు, రాముడు ఆ మంత్ర ప్రయోగం చేసి రావణుణ్ణి ఒక్కపెట్టులో కూల్చాడు. రాముడి అవతార కారణమైన రెంటిలో ఒకటి రావణ వధ. అది రాముడి వల్ల అవుతుందా అన్న ప్రశ్నే ఉత్పన్నం అవదు. రామావతారం వచ్చిందే అందుకు. రావణుణ్ణి చంపడం ఒక్క రాముడివల్లనే అవుతుంది లేక హనుమవల్లనే అని శ్రీరామాయణం స్పష్టం. ఎవరు ఏమిటో ఏ ఘట్టం ఎలా జరిగిందో రామాయణంలో స్పష్టంగా ఉంటుంది.

అన్నకి సహాయం చేస్తూ తోడుగా ఉంటూ అధర్మాత్ముడైనా ప్రోత్సహిస్తూ అతనిపక్కనుండడమా.. లేక అన్నను విడిచి ధర్మంపక్కనుండడమా అన్న ప్రశ్న వచ్చినప్పుడు ధర్మాత్ములు ధర్మం యెంచుకున్నారు, కుంభకర్ణుడిలాంటివాళ్ళు ధర్మం తెలిసీ ధర్మం కన్నా అధర్మాత్ముడైన అన్న పంచనే ఉండి, ధర్మం కన్నా అన్నే గొప్ప అనుకున్నారు మడిసిపోయారు. 
 
అన్నదమ్ములా - ధర్మమా?
కుటుంబమా - ధర్మమా?
వ్యక్తి ప్రయోజనమా? - ధార్మికమైన నడతయా?

అన్న మీమాంస ఉదయించినప్పుడు సుగ్రీవుడైనా, విభీషణుడైనా యెంచుకున్నది ధార్మికమైన నడవడి తప్ప వ్యక్తిగత అనుబంధాలు కావు. అదే.. ఇప్పటి పాలకుల అధికారులలా అవినీతి అక్రమాలలో కూరుకున్న తమ పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని సమర్థించుకున్నట్లు కాదు..

అనుమాన నివృత్తికి ముందుగా మూల గ్రంథం చదవాలి. అప్పుడింకా అనుమానాలుంటే తెలిసినవారిని వివరణ కోరవచ్చు. స్వస్తి

- శంకరకింకర

Thursday, August 24, 2017

చంద్రశాపానుగ్రహ ఆఖ్యానము (శ్రీ గణేశ పురాణo)

గణేశావిర్భావమును గూర్చి కొన్ని పిట్టకథలు, సినిమా కథలు విరివిగా ప్రచారముననున్నవి. గణేశుడి బాగా ఉండ్రాళ్ళు ఇతర పదార్థాలు తిని తన తల్లి దండ్రులకు నమస్కరించబోగా ఏదో ఉయ్యాల ఊగినట్లు కాళ్ళు నేలకానితే చేతులానవనీ, చేతులానితే కాళ్ళు ఆనవనీ హాస్య స్ఫోరకమైన తప్పుడు కథలల్లి వినాయక వ్రత కథలందు జొప్పించడం జరిగింది. అంత అసంబద్దమైన కథలు పురాణమునందు కానీ, ప్రామాణిక వ్రతకథయందుకానీ లేవు అని గమనించి పురాణోక్తమైన కథలను చదివి వివరము తెలిసి, వ్రత ఫలితమును పొందగలరు. గణేశ పురాణమునుండి చంద్రశాపానుగ్రహమను మూలమునకు తెలుగు అనువాదము మనందరికొరకు  -శంకరకింకర

చంద్రశాపానుగ్రహ ఆఖ్యానము (శ్రీ గణేశ పురాణo)
బ్రహ్మగారు నారదుని కోరిక మేరకు చంద్రునికి కలిగిన శాప వృత్తాంతము, శాప విమోచనమును గూర్చి వివరిస్తూ ఇట్లు పలికెను "ఒకానొక సమయమున  పరమశివుడు నివసించు కైలాసము శిఖరమున సభలో నారదాది మునిముఖ్యులుండే సభకు వెళ్ళి, పరమశివుని అర్చించి శివునకు, శివుని కుమారుడైన గణపతికి ఫలాదులు సమర్పించిన పిమ్మట సభాంతమున బ్రహ్మ మరియు ఇతరులు ఎవరి గృహమునకు వారు వెళ్ళిరి. సమయమున వినాయకుడు కైలాసము నుండి చంద్రలోకమునకు వెళ్లగా, చంద్రుడు, ఉత్తముడు లోకోపకారిఐన వినాయకుని యొక్క బాహ్య ఆకారమును అనగా ఏనుగు మొఖము, జారిన బొజ్జను చూసి పరిహసించాడు. లోకమంతా, శిష్ఠులంతా యెవరిని "సుముఖుడు" అని ప్రశంసిస్తారో అటువంటి గణేశుని చంద్రుడు చూసి పరిహసించాడు. అది చూసిన వినాయకుడు క్రోధమును పొంది. అందముగా ఉన్న కారణముచేత లోకములో అందరూ నిన్ను పొగడుతున్నారన్న అహంకారంతో ఉన్నావు. ఉచ్ఛనీచాలు మరచి ప్రవర్తించావు కాబట్టి నాటి నుండి నీవు మలినుడవు, నిన్ను చూచిన వారికి నీలాపనిందలు కలుగుతాయి" అని శాపమును ఇచ్చి తన గృహానికేగెను.


విషయం సర్వ లోకములలో పాకి ఆనాటి నుండి చంద్రుని ఎవ్వరూ చూడటం మానేశారు. చంద్రుని అతిశయం, బాహ్య సౌందర్యంతో మిడిసి పడి లోకోపకారం చేస్తూ సుముఖుడుగా ప్రసిద్ధికెక్కిన వినాయకునే పరిహసించి శాపవాక్కు పొందిన విషయం సర్వలోకాలలోని వారికి తెలిసిందితాను అందరికీ ఆదర్శుడైన వినాయకునిచే శాపం పొందినందుకు చంద్రుడు సిగ్గుతో వివర్ణుడైనాడు. ఎంత అందమైన స్వరూపమైతే నేమి తన ముఖము ఎవ్వరూ చూడటానికి ఇష్టపడడంలేదని కృంగ సాగాడు.


చంద్ర శాప వృత్తాంతాన్ని తెలుసుకున్న ఇంద్రాది దేవతలు గజాననుని వద్దకు వెళ్ళి నమస్కరించి విధముగా విజ్ఞప్తి చేశారు " దేవ దేవా! సర్వ జగద్వందితా! నీవు స్వతంత్రుడవు, నీయిచ్ఛ వచ్చినట్లు పరిపాలించే నియంతవు. నిర్గుణుడవు, సగుణుడవు, అన్ని గుణములు నీ యందే కలవు. ఈశ్వరా ! పాహి పాహి! నిన్నే శరణు కోరుతున్నాము. చంద్రుడు చేసిన అపరాధమునకు వేసిన శిక్ష లోకమునంతకూ శిక్ష అగుచున్నది కాబట్టి చంద్రుడు పొందిన శాపమునకు విమోచనము ఇచ్చి చంద్రుని క్షేమమును, లోక క్షేమమును చూడవలసినది. లోకములు చంద్రుడు కనపడక, చూడక కష్టములలో ఉన్నవి. మరల అన్ని లోకములకు చంద్రుని దర్శనము , చంద్రుని తో భాషణము చేయు సౌలభ్యము కలుగజేయుము. ధర్మార్థకామ మోక్షములను ప్రసాదించు వినాయకుడు అది విని ప్రసన్నుడయ్యి ఇట్లు పలికెను " దేవతలారా! మీ స్తోత్రమునకు సంతుష్టుడనైతిని. కానీ మీరు కోరిన కోరిక మూడులోకములలోనూ అసాధ్యమైనది. చంద్రుడు చేసిన పనికి  శాప విమోచనము కుదరదు" అని పలికెను. అంత దేవతలు గణపతితో " దేవా! చంద్రుడు వివర్ణుడై ప్రకాశ హీనుడవ్వడం వలన, చంద్రుని అమృత కిరణములు పడక ఓషధులు ప్రకాశించుటలేదు లోకములు ఆపదలో ఉన్నవి కనుక ఆగ్రహింపక చంద్రుణ్ణి ఆపదనుంచి గట్టెక్కించు" మని ప్రార్థన చేసిరి.

దేవతల ప్రార్థన విన్న వినాయకుడు " దేవతలారా! లోకములో ఆదర్శనీయులను, మహాత్ములను నేరుగా కానీ అన్యాపదేశంగా కానీ కించపరిస్తే శిక్ష తప్పదు. చంద్రుడు అటువంటి అపరాధమే చేశాడు. ఉద్దేశ్యపూర్వకంగా వికటా అని పరిహాసం చేసి ఆపదలపాలయ్యాడు. అగ్ని, సూర్యూడూ చల్లగా ఐననూ, సముద్రము ఇంకిననూ నా వాక్కు ఫలించకతప్పదు. సుర సంఘములారా, నేటినుండి భాద్రపద శుక్ల చవితి తిథినాడు తెలిసి కానీ, తెలియక కానీ శాపముపొందిన చంద్రుని చూసినవారి ఎన్నో కష్టములను పొందెదరు." అదివిన్న దేవతలు "ఓం" అనుచూ ప్రణిపాతం చేసి పుష్ప వృష్టి కురిపించిరి తమ ఇండ్లకు వెళ్ళి చంద్రునికి చెప్పగా, అంత చంద్రుడు " నేను మూఢుడను, లోకములకు ఆదర్శుడైన గజాననునిచూచి పరిహాసమాడి కించ పరచినందుకు నాకే కాక మూడులోకములకు ఆపదలు తెచ్చిన అపరాధినిత్రైలోక్యనాయకుడు! దేవుడు! మూడులోకములు పాలించువాడు! అవ్యయుడు!నిర్గుణుడు ! నిత్యుడు! పరబ్రహ్మ స్వరూపమైన! గజాననుని! సమస్త లోకములకు గురువైనవానికి! నావల్ల అపరాధం జరిగినది. సర్వలోకముయొక్క హితము కొరకు నియమించబడినవాడినైనా నావల్ల అపరాధం జరిగినది. భాద్రపద శుక్ల చతుర్థినాడు మాత్రమే నన్ను చూడరాదన్న శాపమునకు విమోచనము ఎట్లు కలుగగలదు" అని పశ్చాత్తాపపడుతూ " గజాననునే శరణు వేడెదను, ఆయన ప్రసాదముగానే తిరిగి నేను ఖ్యాతిని ఆర్జించగలను" అని పల్కి దేవతల వద్ద సెలవు తీసుకొని గంగా నది దక్షిణ తీరమైన కాశీయందు గణేశుని కొరకై తీవ్ర తపస్సు చేసెను. ప్రదేశంలో చంద్రుడు ఇరవైరెండు సంవత్సరాలు కఠిన తపస్సు చేసాడు.


చంద్రుని తపస్సుకు మెచ్చిన గజాననుడు ఎర్రని వస్త్రములు కట్టుకున్నవాడై, ఎర్రని మాలలు ధరించినవాడై చతుర్భుజములతో, మహా కాయముతో, సింధూరవర్ణంతో, కోట్లాది సూర్యుల ప్రకాశంకన్నా ఎక్కువైన కాంతిపుంజపు ప్రకాశంతో చంద్రుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అంత కాంతిపుంజం చూసిన చంద్రుడు కళ్ళుతెరచి స్వామిని చూసి దోసిళ్ళొగ్గి నమస్కరిస్తూ తన మనసులో ఉన్న కోరికను కోరడానికై పరమ భక్తియుతుడై గజాననునితో " దేవా ! విఘ్ననాశకా! సర్వులకూ ధర్మార్థకామములనొసగడంలో విఘ్నములను హరించువాడా! దయా సముద్రుడా! పరబ్రహ్మా! విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడా! సమస్త విశ్వమూ నీయందే ఉన్నవాడా! జగత్తు యందు మాయగా ఉన్నవాడా! మూడులోకాలనూలయించు శక్తి కలవాడా! నీకు పునః పునః నమస్కారములు. బుద్ధిని ప్రకాశింపజేసి ప్రచోదనం చేయు దేవా! దేవతలకు అధిపతీ! నిత్యము సత్యమూ ఐన పరబ్రహ్మమా! నీకు నిత్యమూ నమస్కారములు. అజ్ఞానముతో చేసిన అపరాధమును మన్నించి దయను వర్షించి నన్ను దోష రహితుని చేయవలసినది." అని వేడుకొన్నాడు.


చంద్రుని స్తోత్రము, అతని కోరిక విన్న గజాననుడు " చంద్రా! నేను నీతపస్సుకు సంతోషించాను. నీకు ఇక పూర్వ వైభవం పూర్వ రూపం కలుగుగాక. భాద్రపద శుక్ల చవితి నాడు నావ్రతం చేసిన వారికి భాద్రపద శుక్లచవితినాడు చంద్రుని చూసిన ఎటువంటి దోషము కలుగదు." అని పలికి చంద్రునిలోని ఒక కళను తన తలమీద పెట్టుకుని చంద్రునికి తిరిగి సముచిత స్థానాన్ని కలిగించాడు. ఆనాడు గజాననుడు "ఫాల చంద్రుడు" అన్న నామాన్ని పొంది, దేవతలందరిచేతా షోడశోపచార పూజలందుకొని చంద్రుడు తపస్సు చేసిన క్షేత్రము సిద్ధి క్షేత్రము కాగలదని వరమిచ్చి అక్కడ చేసిన అనుష్ఠానాది కార్యములు త్వరగా సిద్ధించగలవని పలికెను. అంత దేవతలు మునులు సంతోషం చెందినవారై వారి వారి స్వగృహములకేగిరి. గజాననుడు శుక్ల పక్ష ప్రతిపత్తిథి నాటి చంద్రరేఖను ఎంతో ఉల్లాసంగా, ప్రహృష్ఠ వదనంతో తల మీద ధరించి తన గృహమునకేగెను.

శ్రీ గణేశ పురాణమందలి ఉపాసనా ఖండములోని చంద్ర శాపానుగ్రహము అనే ఆఖ్యానం సమాప్తము
-శంకరకింకర