Pages

Tuesday, February 24, 2015

నేను చాలా తెలివైన వాణ్ణి...

ఎప్పుడో ఫేస్ బుక్కులో వచ్చిన కొన్ని పోస్ట్లు తెనిగించా...
-
మా ముత్తాత గారు వేద విదులు త్రికాల సంధ్య చేసేవారు, మా తాతగారు త్రికాల సంధ్య చేసేవారు, మా నాన్నగారు ప్రాతః సంధ్య, దేవతార్చన. వాళ్ళకి సమయం విలువ తెలీదు! నాకు అవన్నీ కుదరవు! వాళ్ళకున్నసమయం నాకులేదు నేను తెలివైనవాణ్ణి.

-మా ముత్తాతగారు పెద్దలు కనబడితే ప్రణిపాతం, అభివాదం చేసేవారు, మాతాతగారూ అభివాదం చేసేవారు, మానాన్నగారికి తెలుసు కొంతమందికి చేసేవారు మమ్మల్నీ పెద్దలకి నమస్కరించమని చెప్పేవారు, ఇప్పుడు నేను ఇండివిజ్యువలిస్ట్ ని, నా పిల్లలు ప్రశ్నేలేదు నేను నా పిల్లలు మరోపెద్దాయనముందు తలవంచడం కాళ్ళు పట్టుకోవడం సవ్వాల్ లేదు... నేను తెలివైనవాణ్ణి.

-మా ముత్తాతగారికి శిఖ ఉండేది, తాతగారికి క్రాఫ్ తో పాటుండేది, నాన్నగార్కి కూడా, నాకు శిఖ లేదు కానీ పిల్లి గడ్డం, మేక గడ్డం ఉంది... నేను తెలివైనవాణ్ణి.

-మాముత్తాతగారు, తాతగార్లది పెద్ద కుటుంబం అందరూ కలిసి ఉండేవారు, మా నాన్నగారు చాలా యేళ్ళకు ఉద్యోగరీత్యా వేరు కాపురం పెట్టారు, నేను పెళ్ళితోటే వేరుకాపురం, నాపిల్లాడికి సంబంధం కుదుర్చుకునే ముందే చెప్పేస్తాను వేరుకాపురం పెట్టమని అప్పుడే నేనూ గృహాప్రవేశం చేస్తాను... సారీ వృద్ధాశ్రమ ప్రవేశం చేస్తాను.. నాకు తెలుసు నేనేమిచ్చానో అదే తిరిగొస్తుందని. నేను తెలివైనవాణ్ణి.

-మాముత్తాతగారి హయాంలో మా ఊళ్ళో ఉండేవారు లేదా కాశీలో ఉండేవారు. కాశీ వెళ్ళి చదువుకోవడం శాస్త్రిడిగ్రీ పొందడం కాశీవాసం, గంగాస్నానం గొప్ప విషయం, అక్కడ శాస్త్ర బోధ, చర్చ చేసేవారు, మారిన పరిస్థితులు మాతాతగారిని కొంత పాఠం చదివాక అప్పట్లో మెట్రిక్ తరవాత ప్రభుత్వోద్యోగం చేయించింది పట్నం పంపింది, ఆయనా కాశీ వెళ్ళేవారు. పరిస్థితులు మా నాన్నగారిని కాలేజీ చదువు చదివించాయి దేశంలోని ఇతర పట్నాల్లో ఉద్యోగానికి పంపాయి, మధ్యలో అప్పుడో సారి కాశీ వెళ్ళి కొన్ని రోజులుండి వచ్చారు, పరిస్థితులు నన్ను అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ దేశాలకు ఉద్యోగం కోసం పంపాయి.. నేను కాశీకి వెళ్ళలేదు.. వెళ్తానో లేదో తెలీదు... నా పిల్లలు ఉంటే విదేశంలో నాదగ్గర లేదా మరో విదేశంలో డిగ్రీలు ఉద్యోగం చేస్తారు విదేశవాసం, సముద్ర స్నానం, ఆకాశయానం చేస్తుంటాం, అదేదో పానీయ సేవనం చేస్తారేమో తెలీదు.. కాశీ వాతావరణం హైజీన్ గా లేని వాతావరణం, ఇరుకు సందులు, గంగస్నానం వాళ్ళ ఆరోగ్యానికి హానికరం. మా తాత ముత్తాతగార్లకు కాశీ వాసం ప్రియారిటీ మాకు విదేశవాసం... అంతే తేడా.. అంతా సేమ్ టు షేమ్

ఇంకోటి...

-నేను రిటైర్ అయ్యాను, నా పిల్లల్ని విదేశంలో డిగ్రీలు, ఉద్యోగం సంపాదించేలా పెంచాను వాళ్ళక్కడే స్థిరపడ్డారు. నేను వెళ్లలేను వాళ్ళురారు. నాకు తెలిసిన కొంతమంది కొత్త జనరేషన్కి మాత్రం నీతులు చెప్తాను Don't run after money + Don't run after foreign degrees అని.... నేను చాలా తెలివైన వాణ్ణి...

-another... మా తాత ముత్తాలు సాంప్రదాయ పద్ధతులలోనే పెరిగారు, మా నాన్నగారూ అంతే, ఒక్క ఉద్యోగాలలో మార్పు తప్ప... నేను నా పిల్లల్ని ఆధునిక భావాలతో పెంచాను (modern upbringing) ఛాదస్తంతో పెంచలేదు. సాంప్రదాయం నాకు తెలీదు అందుకే అది ఛాధస్థం.. నేను చాలా తెలివైనవాణ్ణి..

మా తాతమ్మ, నానమ్మగార్లు ప్రత్యేకంగా మడి చీర కట్టుకుని వండి వార్చేవారు. పట్నంలో మా అమ్మ వాళ్ళలా కాకున్నా పాత పట్టుచీర కట్టుకుని మడి ఆచారం పాటించేది. హ్హుహ్హ్.. మా ఆవిడకి సౌకర్యంగా ఉండదు నార్త్ డ్రెస్సెస్ వేసుకుంటుంది లేదా పొడుగు గౌను (అదేనండీ నైటీ వేసుకుంటుంది)... చీర మాత్రం అప్పుడప్పుడూ పూజలు వ్రతాలకి మాత్రమే కడుతుంది మన సాంప్రదాయాన్ని కాపాడాలి కదూ, ...!!! తనూ నాలాగే చాలా తెలివైంది.. నాకైతే రెడీమేడ్ కుట్టిన పంచెలు (పంచెలనాలా పంచెలలాంటి పైజామా అనాలా) తనకన్నా పూజించే దేవుడికన్నా... నేను తెలివైన వాణ్ణి ...


.... ఇంకా చాలా ఉన్నాయ్ ఎంతని చెప్పుకుంటాం...
Disclaimer : Not pointed at any individual but the circumstances..

Saturday, February 14, 2015

నిరంతర భక్తి భావన - చంద్రశేఖర భారతీ స్వామి శ్రీ చరణులు

శ్రీ గురుభ్యోనమః
సభాయై నమః

ఒక శిష్యుడు దూరదేశంనుండి రైలు ప్రయాణం చేసి శృంగేరి వచ్చి అప్పటి శృంగేరి పీఠాధిపతులైన జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారిని దర్శించిన తరవాత వారి సంభాషణ ఇలా జరిగింది.

శ్రీ చరణులు : ఇంటినుంచి నేరుగా వస్తున్నావా? లేక మధ్యలో ఎక్కడైనా ఆగి వస్తున్నావా ?
శిష్యుడు     : లేదు స్వామీ నేరుగానే వస్తున్నాను.
శ్రీ చరణులు : మొన్న భోజనం చేసి బయలుదేరి ఉంటావు. రాత్రి భోజనం చేయటానికి వీలు లేదు మరి నిన్నటిమాటేమిటి?
శిష్యుడు     : జోలార్పేట స్టేషన్లో రెండుగంటల వ్యవధి దొరికింది. అక్కడే తొందరగా స్నానం చేసి లఘువుగా జపం ముగించుకుని రెండు అరటి పళ్ళు మాత్రం తిన్నాను.
శ్రీ చరణులు : స్నానం వదలక చేస్తావన్నమాట. మరి పూజ
శిష్యుడు     : స్టేషనులో పూజ సాంతం చేయడానికి వీలు లేదు.
శ్రీ చరణులు : ఔను. నిజమే స్టేషనులో పూజ సాంతం చేయడినికి కుదరదు. మరి క్లుప్తంగా?
శిష్యుడు     : పూజచేయటానికి వ్యవధి ఎక్కడ?
శ్రీ చరణులు : మరి స్టేషనులో అరటిపండ్లు తినడానికి వ్యవధి ఉన్నది కదా?
శిష్యుడు     : పూజ అంత సులభంగా చేయడానికి వీలు లేదు కదా?
శ్రీ చరణులు : ఎందుకు కాదు? నువ్వు తెచ్చిన అరటిపళ్ళు తినడానికి ముందు దేవతార్చనకు అర్పించి తరవాత ప్రసాదంగా స్వీకరించవచ్చును. కాదా?
శిష్యుడు     : నేను అలా చేయలేదు. మూర్తి పెట్టెలోపెట్టి నా మూటలో ఉన్నది కదా.. బయటకు తీస్తే కదా నివేదనం చేసేది.
శ్రీ చరణులు : నీవు మూర్తి పెట్టెలో పెట్టి బుట్టలో ఉన్నందువల్ల నువ్వు చేసే నివేదనం మూర్తి గ్రహించలేదని నీ భావన. నువ్వు ఉపాసించే దేవతను గూర్చి నీకు తెలిసిందింతేనా?
శిష్యుడు     : మీరు చెప్తుంటే అర్థం అవుతోంది. నేను నివేదన చేసి ఉండవచ్చు........
శ్రీ చరణులు : ఇంతా చెప్పడం......  మన స్థితి ఎటువంటిదైనా ఉన్నదానిలో మన కర్తవ్యం చేయాలి అని. భగవంతుడు సర్వ వ్యాపి. విస్తారంగా పూజ చేయడానికి వీలు లేనిచోట నిండు మనసుతో భగవంతుని స్మరిస్తే చాలు. ఆయన అపరిమిత అనుగ్రహాన్ని వర్షిస్తాడు.


శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య పరమ హంస పరివ్రాజకాచార్య చంద్రశేఖర భారతీ స్వామి పాదారవిందములకు నమస్సుమాంజలులతో....

మీ....

--
~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
जय जय शंकर हर हर शंकर