Pages

Monday, March 7, 2016

ఈ అహంకారపుటజ్ఞానం మూలఘాతికాక తప్పదు

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

శివరాత్రి వ్రతం ఉపవాసం, జాగరణ, అభిషేకాలు, మహాలింగేష్టి ఎన్నో ఎంతో హడావుడి చేస్తాం. భక్తి శ్రధాసక్తులతో చేసే కార్యాలు అనంత ఫలదాలు. నిస్సందేహం. ఐతే శివరాత్రి ఒక గొప్పనైన ఉపకారపు సందేశాన్నిస్తున్నది. అది అందుకున్నవారికి అందుకున్నంత... టూకీగా ఇందులోని ముఖ్యవిషయాలు తీసుకుంటే

) పరబ్రహ్మము సృష్టిలో మొదట చేసిన ఉపదేశంతపించు’ - తపస్సు చేయడం. ఏపని చేసినా తపస్సు చేయడం. తపస్సెప్పుడూ పక్కవాణ్ణి మెప్పించడానికో, పరపతి పెంచుకోడానికో కాదు అదెప్పుడూ ఆత్మానందానికే
) వేరే వ్యక్తి, పెద్దవాడు, భగవదనుగ్రహం ఉన్నవాడు కనిపిస్తే వినయంతో ప్రవర్తించక, తనకన్న అధికుడు కాదని లేదా అల్పుడని ఎంచి అహంకరించవద్దు.
) పేరు, పరపతికోసం, అసత్యమాడవద్దు, అసత్యమాడించవద్దు.
) లేని పెద్దరికం, లేని అర్హతలతో సత్యాన్ని మరుగునపెట్టి నేనధికుణ్ణని బీరాలు పోవద్దు.
) నాకు తెలుసు, నాకే తెలుసు, అవతలి వారెంత అని ఇచ్చవచ్చినట్లు ఎంచవద్దు.
) నేను గొప్ప అని అహంకరించి నువ్వు చెప్పడం చెప్పించుకోవడంకాదు, వినయశీలివైన నీ సుగుణాలను పెద్దలైన వారు గుర్తించాలి.

చూడండి అగ్నిస్తంభ ఆవిర్భావఘట్టంలో పైవన్నీ కనిపిస్తాయి. అది సృష్టి కర్త లోకానికి నేర్పే గుణపాఠమే ఐనా తానే మూడుగా మారి పాఠం చెప్తాడు. అందుకోవలసినవాడందుకోకపోతే రజోగుణ తమోగుణాలు పెచ్చరిల్లి జరగవలసినది జరుగుతుంది. శివరాత్రి నాడు ఓహ్ గొప్ప గొప్పవి బ్రహ్మాండమైనవి ఐన పూజలు, ఉపవాసాలు, జాగరణ చేసి నేర్చినదేమైనా ఉందా? అన్న విచారణ ముఖ్యం. అది అత్యంత ఉద్ధరణ కారకం. అప్పుడు పెల్లిబికే భక్తి శ్రద్ధలు వాటి స్థాయి ఉత్తమం.

ఎంత బ్రహ్మగారైనప్పటికీ విష్ణువు ఆధిక్యమేమి అని ప్రశ్నించారు అనవసరంగా కయ్యానికి కాలు దువ్వారు. చిన్నపెద్ద అంతరం లేకుండా తన మానాన తాను తపస్సు చేసుకుంటున్న విష్ణు మూర్తితో తలపడ్డారు. కారణం ఏమిటి దీనికి, నేను గొప్ప, నేను అధికుణ్ణి అని నిరూపించుకోవడం తప్ప వేరు కారణమూ కనపడదు (భగవంతుని లీల మాయ అన్నది పక్కనపెట్టండి). మన జీవితంలోనూ ఎందరినో చూస్తుంటాం ఎన్నో పటాటోపాలూనేనది నేనిది వాడెంత వీడెంత నాఅంత వాణ్ణి నేను అనే వాళ్ళు కోకొల్లలు అది రంగమైనా సరే అలాంటి వాళ్ళు చాలా కనపడుతుంటారు.

ఇక విష్ణు మూర్తో తన మానాన తాను తపస్సు చేసుకుంటుంటే వచ్చిన బ్రహ్మగారితో అలాకాదురా అబ్బాయి ఇదీ విషయం అని చెప్పారు, బ్రహ్మగారు విన్నారా లేదు. పోనీ వెళ్ళిపోయారా విష్ణుమూర్తిని ఆయన తపస్సుకి ఆయనని వదిలి అంటే అదీలేదు. కయ్యానికి కాలు దువ్వారు. మొదట బ్రహ్మగారికి అహంకారం పెచ్చుమీరింది, నేనెందుకు తగ్గాలని విష్ణుమూర్తి కయ్యానికి సిద్ధపడ్డారు. చూడండి నేను గొప్ప అని ప్రూవ్ చేసుకోవాలనుక్కునే మనస్తత్త్వం వల్ల ఎంత ప్రమాదం వాడు ఆవేశకావేశాలకి లోనై ప్రశాంతంగా ఉన్నవాడినీ పాడుచేస్తాడు. ఎంత భయంకరమైన అహంకారపుటజ్ఞానం!!! అప్పుడే కదా జ్ఞానం కావాల్సింది.

కథగా, లోకులకి పాఠంగా చెప్పాలంటే, పరబ్రహ్మం ఊరుకోదు కదా సాధుజనులవద్దకెవరైనా వస్తే... సరే ఇద్దరి మధ్యలో అగ్ని స్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడా ఇద్దర్లో ఎక్కూ తక్కూలే... సరే ఒకరు హంస రూపమై ఆది చూస్తానన్నారు మరొకరు సూకరమై అంత్యం చూస్తానన్నారు... ఇద్దరివల్లా కాలేదు.

సత్వగుణ ప్రధానుడు, వినయంతో పరబ్రహ్మం చెప్పిన మాటవింటూ తపస్సు చేసుకునే విష్ణుమూర్తికి అర్థం అయ్యి తేరుకొని స్వస్థితికి వచ్చి ఎక్కడమొదలైయ్యారో అక్కడికి వచ్చారు. మరి బ్రహ్మగారు ఉక్రోషం పెరిగి ఎక్కడ విష్ణుమూర్తి ఆధిక్యాన్ని ఒప్పుకోవాల్సొస్తుందో అని ఎదురుగా వచ్చిన మొగలి పువ్వుని, ఆవుని అబద్ధపు సాక్ష్యం చెప్పమన్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిందేమంటే ఎవరితో కూడాలి ఎవరిని వదలాలి అని. మొగలి పువ్వు, ఆవు ఏది ఏమైనా  పరవాలేదు మేము అబద్ధం చెప్పము, మాకు పరమేశ్వరుడున్నాడు అని నమ్ముకుంటే సరిపోయేది, కానీ మొహమాటానికి లేని గౌరవాలకో అబద్ధం చెప్పడానికి ఒప్పుకున్నాయి.

సర్వజ్ఞుడు ఆయనకి తెలీదూఎంత వేదాలని గడగడా వల్లించి సృష్టి చేసే బ్రహ్మైనా... ఇంత అహంకరించినందుకు ఫలితంగా ఒకకుత్తుకతెగింది తస్మాత్ జాగ్రత్త ఎదుటివారి ఔన్నత్యాన్ని గుర్తు పెట్టుకుని ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించకపోతే ఆతల ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అని పరమేశ్వరుని తీర్పు శిరోధార్యంగా ఇందులోంచి తీసుకోవాలి. ఎంత బ్రహ్మగారైనా ఆలయమేలేకపోయింది. అంటే పదిమందీ పూజించడానికి అర్చించడానికీ కుదరకుండా ఐంది.   అటువంటి వారికి సహకరించినందుకు ఎంత గొప్పనైన గుబాళింపుంటేనేమి? మొగలికి స్వామి పాదాలు చేరే అర్హత జీవితంలో కోల్పోయింది. ఎంత పవిత్రమైన దైనా అమ్మా అని అందరూ పిలిచినా గోమాత తన ముఖానికి పూజా కోల్పోయింది.

అహంకారులు, గొడవలు పెట్టుకునేవారు, చులకన చేసి గేలిచేసేవారున్నా తనకు విధించిన తన కర్తవ్యం చేస్తూ ఉన్నవాడు లోకానికి నాథుడైయ్యాడు పరమపూజ్యుడై జగన్నాథుడై అనంత నామాలతో కొడియాడబడుతూ సృష్టిలో ఆలయాలలో ఇళ్లలో పూజలనందుకొంటున్నారు. ఒక్క అహంకారం ఎంత పని చేస్తుందో మనం ఎరగాలి. వినయంగా మౌనంగా ఉన్నవాడు ఎదురుగా మాటలు భరిస్తున్నవాడు అశక్తుడు కాదు సాధువు అని గుర్తెరగి జాగ్రత్తగా మసలుకోగలగాలి. లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు అహంకారపుటజ్ఞానం మూలఘాతికాక తప్పదు

ఇలాంటి మూర్తీభవించిన అజ్ఙానపు అహంకారపు తలపులతో ఉన్నవారు కోకో..... కో కొల్లలు... ఎంతమందిని చూస్తుంటాం  ఏ సాహితీరంగమైనా, ఏ కార్యాలయాలైనాఏ రాజకీయ రంగమైనా, ఇక్కడా అక్కడా కాదు ఆధ్యాత్మిక రంగమైనా సరే బహుశా ఇక్కడే కాస్త ఎక్కువేమో ఇది... వాళ్ళు వీళ్ళుకాదు ఇది వ్రాస్తున్న నాతో సహా ఎందరో... అది పోగొట్టుకునే భాగంగా ఈ చిన్ని ప్రయత్నం.. పరమేశ్వరునికి ఈ నివేదనం..