Pages

Tuesday, January 29, 2019

పరమాత్మనెలా స్వీకరించగలను?


శ్రీ గురుభ్యోనమః
       మనలో చాలా మందికి ఈ ప్రపంచంలోని కొందరు లేదా కొన్ని కొన్ని విషయాలు నచ్చవు, ఏదో ఒక పేచీ (compliant). అలాగే నాకూనూ, చిత్ర కారుడు గీసిన చిత్రాన్ని ఇష్టపడినప్పుడే కదా ఆ చిత్రకారుణ్ణి స్వీకరించేది (Acceptance), అలాగే చిత్రకారుడి చిత్రంలాంటి ఈ ప్రపంచాన్ని యథాతథంగా అంగీకరించలేకపోతే దాన్ని చిత్రించిన పరమాత్మనెలా స్వీకరించగలను?

       ఆత్మవత్ సర్వభూతాని..... నన్ను నేను ఎన్ని చెడులున్నా మంచి ఉన్నా స్వీకరించుకున్నానో (నాలో బయట ఎవ్వరికీ తెలియని మంచి చెడులతో సహా నన్ను నేను accept చేసుకున్నట్లు) ప్రపంచాన్నీ అలాగే స్వీకరించి చూడాలి.....  విశ్వంలో విశ్వనాధుణ్ణి చూసే ప్రయత్నం....

-శంకరకింకర (10-Jun-2014)


గురువులు మార్గం మాత్రమే చూపుతారు


శ్రీ గురుభ్యోనమః
ఒకనికి మరొకరు దేవుణ్ణి చూపడమేమిటి? అసంబద్ధం కాకపోతే... 

ఆత్మబోధలో శంకరులంటారూ మెడలో ఆభరణం వేసుకుని దాని గురించి ఇల్లంతా ఎక్కడెక్కడో వెతికి చివరికి తనమెడలోనే ఉన్నదని తెలుకొనిన స్వకంఠాభరణంలా... అని...,
ఆత్మాతు సతతంప్రాప్తోపి అప్రాప్తవదవిద్యయా
తన్నాశే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా!!
గురువులు మార్గం మాత్రమే చూపుతారు, ఎక్కడో నూటికో కోటికో ఒక్కరు (పరమహంస వివేకానందునికి లాగా) అవతార ప్రయోజనార్థం అటువంటివి చూపగలరు. లేదా మోళి, ఇంద్రజాలం చేసేవారు అలా భ్రమింపజేస్తారు చేస్తారు తప్ప. భగవంతుడేం సినిమానో నాటకమో కాదు టిక్కెట్లిచ్చి ధ్యానంలో చూపడానికి. ఇలా చేసేవాళ్ళందరూ పరమహంసలూ కారు టిక్కెట్లు కొనుక్కున్నవాళ్ళు వివేకానందులూ కారు.

-శంకరకింకర (17-May-16)


Tuesday, January 22, 2019

తపో జలాలను సిరాగ మార్చి
పదునెక్కిన మనో కలాన్ని ముంచి వ్రాస్తానొక శాసనం!

ధర్మపరుల ఆలోచనలనావాహన చేస్తూ
ఉపాసకుల ఊపిరులతొ కొత్త శ్వాస తీస్తున్నా!

దృశ్యమే తామైన సమాధి స్థితి
పొందిన ద్రష్టల దృష్టిని కోరుతు ఉన్నా!

మాటల చేతల అంతరాలనూ
చండీసింహపు గర్జనలతో ప్రశ్నిస్తున్నా!

శివపార్వతుల తాండవ కేళీ
విలాస సాక్ష్యమై కాలి అందెగా సత్యాన్నై నిలుస్తున్నా!


పితృదేవతలంటే కేవలం “తండ్రులు” అని అర్థం తీసుకోకూడదు!


దేశికచరణస్మరణం!
పితృదేవతలంటే కేవలం తండ్రులు అని అర్థం తీసుకోకూడదు. . పితృదేవతలకు నమస్కారం అని అంటే కేవలం శరీరం విడిచిన తండ్రి, తాతలేకాదు అమ్మ, అమ్మమ్మ, నానమ్మ ఇలా వీరుకూడా పితృదేవతలలో కే వస్తారు... అంతే తప్ప పితృ అని పేరుందికాబట్టి కేవలం శరీరం విడిచిన తండ్రి తాతలన్న అర్థం కాదు.. సంధ్యావందనంలోకానీ నిత్యవిధులలోకానీ పితృభ్యోనమః అంటే శరీరంతో ఉన్న తల్లిదండ్రులకొరకు ఆ నమస్కారం అని కాదు అర్థం. శరీరం తో ఉన్న తల్లిదండ్రులకు నిత్యం చేసేది చేయవలసినది తిన్నగా పాదాభివందనమే, ఏ మంత్రమూ అవసరంలేదు.
సంధ్యావందనం, నిత్య నైమిత్తిక కర్మల్లో చేసే నమస్కార తర్పణాదులు దివ్య పితృదేవతలకు, శరీరంతో లేని మాతా పితరులకు ఆ పరంపరలో ఉన్న పైవారికి. రక్త సంబంధం బంధుత్వం, ఆత్మ బంధుత్వం ఏర్పడిన పితృలోకంలో ఉండే గణాలని గౌరవించడం పితృదేవతా నమస్కారం.
ఊర్థ్వలోకాల్లో అంటే ద్యులోకంలో ఉండే పితృ దేవతలు ఏడు గణాల సమూహం అందులో మూడుగణాలకి ఆకారమే ఉండదు..  ఇక లింగబేధమేమిటీ?.. అక్కడకూడా పితృస్వామ్యం అదీ ఇదీ వంటి ప్రశ్నలు ఉత్పన్నమవడమే అసంబద్ధం.

-శంకరకింకర

యశశ్శరీర హననం


దేశికచరణస్మరణం!

ప్రతి వ్యక్తికీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలుంటాయని సనాతన ధర్మంలో ఉండే ఆస్తికులకు సంబంధించినవారికందరకూ తెలుసు. ఇది కాక స్థూల శరీరంలో ఉన్నప్పుడే మనిషి మరొక శరీరాన్ని తయారు చేసుకుంటాడు. అది తన శీలం వల్ల ఏర్పడుతుంది. శీలం అంటే చారిత్రము, నడవడి అని అర్థం తప్ప సినిమా రచయితల చెత్త అర్థం తీసుకోకండి. ఆ నడవడితోడుగా తనకు ఈశ్వరుడిచ్చిన విభూతిని సమాజ పరం చేసినపుడు యశస్సు కలుగుతుంది. ఆ పరాదేవత ఆ వ్యక్తికిచ్చే మరో శరీరమే యశశ్శరీరం అంటే కీర్తి శరీరం. ఒక వ్యక్తినెలా ఐతే భౌతికంగా ఇబ్బంది పెట్టాలనీ, గాయపరచాలనీ, సంహరించాలనీ ప్రయత్నాలు సాగుతాయో దాని పర్యవసానాలేమిటో, తత్సమానంగా ఈ కీర్తి శరీరాన్ని కూడా ఇబ్బంది పెట్టాలనీ, యశో హననం చేయాలనీ ప్రయత్నాలు సాగుతాయి.

భౌతిక దాడికి హింసకి ఏదో ఒక కారణం, ఒక పగ, ఒక కక్ష వంటివి ఉండే ఆస్కారం ఉంటుంది. కానీ సుకీర్తి వల్ల ఏర్పడిన యశశ్శరీరాన్ని హింసించడానికీ, హననం చేయడానికీ పెద్దగా ఏకారణమూ ఉండదు. అకారణంగానే యశశ్శరీర హననం చేయాలని చూస్తారు. విచారిస్తే అకారణ అసూయా ద్వేషాలే దీనికి ముఖ్యమైన ప్రాతిపదిక. ఫలానా వ్యక్తిని గౌరవించడమేమిటి? ఎందుకు గౌరవించాలి? నాకిష్టంలేదు. అంతే పెద్దగా ఏ వ్యక్తిగత కారణాలూ ఉండవు. "నాకు" నచ్చలేదు "నేను" గౌరవించను. ఈ "నేను నాకు" అన్న అహం, అందువల్ల పుట్టిన అసూయ, ద్వేషం క్రోధంగా మారి వ్యక్తిత్వ హననానికీ యశోశరీర హననానికీ కారణమౌతుంది. దీనికి లోనైనవాడు ఎంత దిగజారిపోతాడంటే తాను పాడవడమే కాదు, తాను బురదలో కూరుకున్నా సరే, ఆ బురద మరక ఎదుటివాడిమీద చిన్నపిసరైనా అంటించాలని ప్రయత్నిస్తాడు. అలా ఆ ప్రయత్నంలో గోరంత సఫలీకృతమైనా కొండంత వికృతానందాన్ని పొందుతాడు.
నిజమేనా ఇలా యశశ్శరీరం ఉంటుందా? రావణుడికి పట్టినదోషాలలో కేవలం సీతమ్మని ఎత్తుకెళ్లడమే కాదు, రాముడి యశస్సుని తగ్గించి తగ్గించి సీతమ్మ దగ్గర ప్రేలడం కూడా... కర్ణుడు దుష్టుడైనా యశశ్శరీరం ఉంది, రామాయణ, భారత వ్యాఖ్యానాలు చదివితే తెలుస్తుంది. యశశ్శరీరహననం చేయడం చేయాలనుకోవడం మహా మహా పాతకమైన క్రూర చర్య.

మరి ఇలా యశశ్శరీర హననాలు చేయ ప్రయత్నించేవాళ్ళు నిఝంగానే ఉంటారా అని అనుమానమా!?... ఓ కోకొల్లలు.. పరికించి చూడండి... పుట్టలు పుట్టలు బారులు బారులు....

-శంకరకింకర

సమత్వ భావననకు చోదనం ఒకటే సోదరభావన





మనిషెంత హిపోక్రాట్ అంటే
, ప్రాకృతికమైన లేదా ఒక నియతికి లోబడి అంటే తనకన్నా ముందు సృష్టించిబడిన ఏ ప్రమాణముతోటో ఉన్న హెచ్చుతగ్గులను అంగీకరించడు. ఒకే తల్లికి పుట్టిన బిడ్డలుకూడా ఎన్నడూ సములు కారు, కాలేరు. కానీ, అదే వ్యక్తి తాను సృష్టించుకున్న ధన, వస్తు, విద్యా, మేథ, సంపత్తి, అధికార, తాహతుల ఇత్యాదుల ద్వారా అదే అసమానతలను తాను వ్రాసుకున్న చట్టసమ్మతమైన వాటిని నిర్మొహమాటంగా అంగీకరించగలడు. నిజానికి ప్రకృతిలో అసమానత ఒక భాగం, అసమానత ఉన్నా దేని స్థాయి దేని ప్రత్యేకత దానిదే. ప్రకృతినర్థం చేసుకోనంత వరకూ, ప్రకృతి నియమాలనర్థం చేసుకోనంత వరకూ తన అవగాహనా రాహిత్యాన్ని ప్రశ్నించడం విప్లవం అనుకుంటాడు, సమాజాన్ని సంస్కరించుకోవడం అనుకుంటాడు. ఎంతైనా మనిషికదా హిపోక్రసీ ఎక్కువ. దాన్ని మనిషి అర్థం చేసుకోనంత వరకూ అర్థం చేసుకోలేని యుగ కవులూ, మహాకవులూ పుట్టుకొస్తూనే ఉంటారు.... వారి వెంట వెంపర్లాడేవారూ పుట్టుకొస్తూనే ఉంటారు. ఒక మనిషి ఇంకోమనిషికి ఎన్నడూ సమం అవ్వలేడు. మనిషికి మనిషేకాదు ఏజీవీ మరోజీవికి సమం కాదు, సమానత్వం సాధించడం కుదరని పని. సమానంగా చూడమని కోరుకుంటేనో నిర్భంధిస్తేనో వచ్చేది కాదు. ప్రతి వ్యక్తిలో ఎదుటివారిపట్ల ఆదరభావం, ఉదారత, ఒకరికోసం మరొకరి త్యాగబుద్ధి పెచ్చరిల్లాలి. దానికి చోదనం ఒకటే సోదరభావన. అందుకే శంకరులు మాతాచ పార్వతీ పితాదేవో మహేశ్వరః బాంధవాశ్శివభక్తాశ్చ అని ప్రార్థననిచ్చి అందరినీ ఒక కుటుంబానికి చెందినవారిలా చేసారు. ఈ యుగంలో సమత్వ దృష్టి చాటింది, సమత్వ భావననెలా అలవర్చుకోవాలో చెప్పి పెంపొంచింది ప్రచారం చేసింది జగద్గురు ఆది శంకరులే, ఆ తరవాత ఎందరైనా ఆ భావాన్ని పలు విధాల చాటవచ్చుగాక.

-శంకరకింకర

ఎల్లో మనసులున్న మనుష్యులూ ఉంటారు!



ఒక్కోరుంటారు మన జీవితాలమీద తమ అభిప్రాయాలు చెప్తారు, అవి అసంబద్ధమైనవని తెలిసినా గౌరవంకొద్దీ చాలా సంతోషం అని చెప్పి వచ్చేస్తే ఊరుకోరు. తన అభిప్రాయం వినలేదని అది పది మంది అభిప్రాయమనీ, మీగురించి పదిమందీ ఇలా అనుకుంటున్నారని తన అభిప్రాయాన్నే పది మంది దగ్గరికీ వెళ్ళి చెప్పి. దాన్నే తిరిగి మీ గురించి పదిమందీ ఫలానా అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారని చెప్పి, ఆ పది మంది అభిప్రాయంగా దాన్ని సృష్టిచేసి తానేదో నిన్నుద్ధరించేవాడిలా పెద్దలముందు బిల్డప్ ఇచ్చి నిన్ను పదిమంది తప్పుగా అనుకోకుండా కాపాడడానికి కష్టపడేలా బిల్డప్లిస్తారు. అవి విన్న పెద్దలతో ఇది నిజమేనేమో పదిమందీ అలా అనుకుంటున్నారేమో మీగురించి ఆలోచించండి అని అనిపిస్తారు. తస్మాత్ జాగ్రత! న్యూసులు చదవట్లేదూ... ఎల్లో జర్నలిజమేకాదు నిత్యం మమేకమైయ్యే ఎల్లో మనసులున్న మనుష్యులూ ఉంటారు!

-శంకరకింకర


నిలిచే చైత్యాన్ని, ఓ దూర్వాంకురాన్ని!

చిరు గాలికి వణికే చిగురుటాకును కాను
ఎదురొడ్డినిలిచే చైత్యాన్ని!

ప్రభంజనానికి వెరసే అడవి మ్రానుని కాను 
తలయెత్తి నిలచే దూర్వాంకురాన్ని!

గంభీరం నా ఆహార్యం
వినయం నా భూషణం

తిలకం నా దర్పం
శిఖయే నా ధర్మం

మాటే నా ఆయుధం
భావం నా కవచం

మౌనం నా తత్వం
తపం నా జీవం

వెరసి,
నిలిచే చైత్యాన్ని,
ఓ దూర్వాంకురాన్ని!

శంకరకింకర

'చిత్‍'తు రాతలు గీతలు


నువ్వేం పెద్ద ధర్మాత్ముడివా? శ్రీరాముళ్ళా బిల్డప్ ఇవ్వకు!
నువ్వేం పెద్ద పండితుడివా? మహామహోపాధ్యాయలా బిల్డప్ ఇవ్వకు
నువ్వేం పెద్ద సిద్ధాంతివా? వరాహమిహిరుడు ఆర్యభట్టుల్లా బిల్డప్ ఇవ్వకు
నువ్వేం పెద్ద సాహితీవేత్తవా? విశ్వనాథవారిలా ఫోజు కొట్టకు
నువ్వేం సంగీతజ్ఞుడివా? నువ్వేం ఎమ్మెస్సూకాదు బాలమురళీకాదు
నువ్వేం...... వా? నువ్వేం...... కాదు, కాస్త తగ్గు.

ఔను, నేను పైవేవీ కాదు. కేవల సాధకుణ్ణి, అతి చిన్నవాణ్ణి.
సరే ఇంకా చెప్పేదా... ధర్మాత్ములందరికీ రాముడాదర్శమే కానీ అందరూ రాముళ్ళే కానక్కరలేదు.

మహామహోపాధ్యాయలేకాదు ఏ బిరుదులు డిగ్రీలు పట్టాలు లేకున్నా పండిన పండితులెందరో,

జీవనగమనానికి ఆర్యభట్టు వరాహమిహిరుడేకాదు రోజువారీ పంచాంగ చూసి అన్వయం చేసుకోగలిగినా పండిపోవచ్చు.

కవికులనాథ విశ్వనాథయే కాదు కాళిదాసైనా కూడా అక్షరాలతోనే మొదలు

ఎమ్మెస్సూ, బాలమురళివంటి సంగీతమేకాదు జోలపాడే తల్లి, చెల్లి, భార్య నువ్వూ సంగీతజ్ఞులే....

శ్యామకృష్ణుని సంగీతానికి జీవించి ఉండగానే పెద్దపేరు రాలేదు ఐనంత ఎవరికీ తక్కువ కాదు అందరికన్నా ఎక్కువే...

ఎందరో మహానుభావులు అందరికీ సాష్టాంగాలు, ఎందరెందరికీ పద్మాలూ, రత్నాలు రాలేదు దానర్థం వచ్చినవాళ్ళు ఎక్కువకాదు రానివాళ్ళు తక్కువకాదు.

పోన్లే అది వదిలెయ్.... చెప్పినా అర్థంకాకపోవచ్చు... ఆలోచనా పరిథి విస్తృతమైతే తప్ప అర్థం అవదు.....

"నువ్వదా, నేనిది" అని ఎంచడాన్ని వదలుతున్నవాణ్ణి
"నువ్వదా, నేనిది" అని ఎంచడాన్ని ఎదిరిస్తున్నవాణ్ణి
వెరసి "నువ్వుకు నేనుకు " మూలాన్ని
పై ఏ ముసుగూ లేని వాణ్ణి,
అవేవీ దాయలేనివాణ్ణి
అణగి ఉండేవాణ్ణి.

-శంకరకింకర


Monday, January 7, 2019

సజ్జన సంగం పొందినా ... తస్మాత్ జాగ్రత


దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకమ్ !
మనుష్యత్వం ముముక్షుత్వం మహా పురుష సంశ్రయః !!

సజ్జనుల సంగం దుర్లభమైనది. అది దొరికనప్పుడు తామర కొలనులో ఇతర జీవాల్లా కాకుండా అడవినుంచి వచ్చి ఆ తామరలలోని మధువును గ్రోలే భ్రమరంలా ఉండగలిగిననాడు సజ్జనులను, సత్పురుషులను ఆశ్రయించినవారి జన్మ సార్థక్యాన్ని పొందుతుంది. అలాకాక, సజ్జన సంగం పొందినా అంతశ్శత్రువులకు లొంగిననాడు, పొందవలసినదానియందార్తి లేక, ఆ తామరతూడు చుట్టూ బురదలో తిరగడంలోనే ఆనందం వెతుక్కోవడం అంటే,  ఆ కొలనులో తామరచుట్టూ తిరిగే ఇతర ప్రాణుల వంటి మరో జీవితమే! తస్మాత్ జాగ్రత శంకరకింకరా!