శ్రీ గురుభ్యో నమః
శ్రీమాత్రే నమః
"అమ్మా అని పిలిస్తేనే అమ్మ దగ్గరకు చేరగలం; అమ్మను తలిస్తేనే ఆమె లీలామృతాన్ని ఆస్వాదించగలం."
కాంచీపురం...
సప్తమోక్షపురులలో ఒకటి...
వేదఘోషలు, నిత్యోపాసనలు, యజ్ఞయాగాదులు, నిత్యోత్సవాలతో భాసిల్లే పవిత్ర పుణ్యభూమి...
ఆ కంచి పుణ్యక్షేత్రానికి తలమానికం శ్రీ కామాక్షీ అమ్మవారి ఆలయం.
ఆ ఆలయంలోని ప్రతి రాయి ఒక మహాత్ముని తపస్సుకు సాక్షి...
ప్రతి మండపంలో ఉపాసకుల, భక్తుల దివ్యానుభూతులు నిక్షిప్తమై ఉన్నాయి...
ప్రతి ఘంటానాదం, ప్రతి దీపజ్యోతి, ప్రతి జయజయధ్వానం "ఇక్కడ జగజ్జనని సాక్షాత్తుగా కొలువై ఉంది" అని భక్తుల హృదయాలకు స్పష్టం చేస్తుంటాయి.
జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే !
జయ జయ మహేశదయితే జయ జయ చిద్గగనకౌముదీధారే !!
(ఇక ఇప్పుడు మనం తెలుసుకోబోయేది, ఇది ఆ ప్రాంతంలో చెప్పుకునే కథ... పదండి కథలోకి వెడదాం!)
అటువంటి కామాక్షీ తల్లి సన్నిధిలో, తన జీవితంలో సింహభాగం గడిపిన ఒక మహాభక్తురాలు "మీనాక్షి అమ్మాళ్".
ఆమె ఒక సాధారణ కుటుంబీకురాలు...
ఆమెకు ధన-కనకాదులపై ఆశ లేదు...
పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనే ఇచ్ఛ అంతకంటే లేదు...
"అమ్మా! నిన్ను కేవలం గుడిలోని మూర్తిగానే కాక... నీ పరమతత్త్వాన్ని దర్శించే భాగ్యాన్ని ప్రసాదించు. సంపూర్ణ శ్రీచక్రారాధనా యోగ్యతను, దాని అంతరార్థాన్ని నాకు బోధించు" అని నిత్యం వేడుకునేది.
అదే ఆమె శ్వాస... అదే ఆమె తపస్సు...
ప్రతిరోజూ బ్రహ్మముహూర్తాన లేచి, స్నానాదులు ముగించుకుని, మడి వస్త్రాలు ధరించి, ఇంటి పనులు పూర్తయ్యాక... ఇమ్ట్లో పూసిన పూలతో దండ కట్టి, కొన్ని విడిపూలతో కామాక్షీ ఆలయానికి చేరుకునేది. అమ్మవారి సన్నిధిలో గంటల తరబడి కూర్చొని లలితా సహస్రనామం, లలితా త్రిశతి, పూర్వులనుండి తనకు లభించిన మంత్రజపం చేసుకునేది.
జపం ముగిసినా ఇంటికి వెళ్లేది కాదు...
ఆలయ ఆవరణలోని పుష్కరిణి వద్దనో, మారేడు చెట్టు కిందనో, మండపంలోనో కూర్చొని కన్నులు మూసుకుని తల్లి పాదపద్మాలను ధ్యానిస్తూ ఉండేది. ఆలయ ద్వారాలు మూసే సమయానికి ఇంటికి వెళ్లి తన ఇంటి పనులు చక్కగా నిర్వర్తించేది.
లీనస్థితి మునిహృదయే ధ్యానస్తిమితం తపస్యదుపకంపం!
పీనస్తనభరమీడే మీనధ్వజతంత్రపరమతాత్పర్యం!!
అలా రోజులు... నెలలు... సంవత్సరాలు గడుస్తున్నాయి.
ఆమె భక్తి మరింత గాఢమవుతూ వచ్చింది.
ఒకానొక సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాల సమయం...
అది ఒక శుక్రవారం రాత్రి వేళ...
ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శుక్రవార మండపంలో ఉంచి ఉపచారాలు సమర్పించి, "తంగ తేరు" (బంగారు రథం)లో వేంచేపు చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మీనాక్షి అమ్మాళ్, పల్లవ రాజ మండపం మొదట్లో ఉన్న దూర్వాస మహాముని విగ్రహం ముందు ఓ పక్కగా కూర్చొని, అమ్మను ధ్యానిస్తూ మనసులోనే త్రిశతి జపం చేస్తోంది.
ఆలయంలోని దీపాల వెలుగు మాత్రమే చీకటిని చీల్చుతోంది.
అర్చకులంతా శుక్రవార మండపానికి వెళ్లారు. ఒకరిద్దరు సహాయకులు తప్ప ఆలయం వద్ద ఎవరూ లేరు. అడపా దడపా భక్తులు వచ్చి కామాక్షమ్మను దర్శించుకుని వెళ్తున్నారు...
మండపమంతా గొప్ప నిశ్శబ్దం.
కేవలం అఖండదీపపు జ్వాలలు మాత్రమే కదులుతున్నాయి.
త్రిశతి ధ్యానం పూర్తయ్యాక మీనాక్షి అమ్మాళ్ లేచి, గర్భగుడి ఎదురుగా ఎత్తుగా ఉన్న పల్లవరాజు మండపంపై ఆసీనురాలై, సంపూర్ణ ఏకాగ్రతతో అక్కడనుంచే అమ్మవారిని తిలకిస్తూ జపంలో లీనమైంది.
కుండలి కుమారి కుటిలే చండి చరాచరసవిత్రి చాముండే!
గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి!!
అప్పుడే... ఆమెకు కాలమే స్తంభించిపోయినట్లు తోచింది.
ఆలయంలోకి జనుల రాకపోకలు ఆగిపోయాయి...
ఆలయమంతా అపూర్వమైన దివ్య విభూతి పరిమళంతో నిండిపోయింది...
మీనాక్షీ అమ్మాళ్కు సమస్త లోకమూ అరుణ కాంతులలో మునిగిపోయినట్లు తోచింది...
అది వర్ణనాతీతమైన దివ్యసాన్నిధ్యపు పరిమళం... దివ్య సింధూర కాంతి!
ఆమె మెల్లగా కన్నులు తెరిచింది.
తన ఎదురుగా...
జటాజూటధారి... మహాతపోమూర్తి...
పుటము పెట్టిన బంగారం వలే దివ్యతేజస్సుతో ప్రకాశిస్తూ, చంద్రుని వంటి పవిత్రమైన చిరునవ్వుతో, శాంత స్వరూపుడైన ఒక మహర్షి నిలబడి ఉన్నారు.
రాగి తీగల వంటి ఎర్రని జటలు, పెద్ద మీసాలు, గడ్డంతో...
ఫాలభాగాన, ఒంటినిండా విభూతి రేఖలు భాసిస్తుండగా...
తీక్షణమైనవి, అపార కరుణను కురిపించేవి అయిన తెల్లని కళ్ళు...
సూటిగా మొనదేలిన నాసిక, పెదవులపై శాంతమైన చిరునవ్వు!
సాక్షాత్ శివస్వరూపంగా దర్శనమయ్యింది!
ఆ దివ్య దర్శనంతో మీనాక్షి అమ్మాళ్ శరీరం పులకరించింది.
ఎవరీ మహానుభావుడో తెలియదు... కానీ ఒక మహా ఉపాసకుడిని, మహర్షిని చూస్తున్న పవిత్ర భావన!
సొంత తండ్రిని చూస్తున్న అవ్యాజమైన గౌరవంతో కూడిన ప్రేమ... కళ్లల్లో ఆనందబాష్పాలు పొంగిపొర్లాయి.
వెంటనే పంచాంగ నమస్కారం చేసింది. ఏం మాట్లాడాలో, ఏం అడగాలో పాలుపోలేదు.
ఆ మహర్షి మృదువుగా "అమ్మా... ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప కామాక్షి సన్నిధిలో ఇంత నిశ్చలమైన ధ్యానం సాధ్యపడదు" అంటూ వాత్సల్యంతో ఆమెను చూస్తూ...
"నీవు చేస్తున్న ఉపాసనలో నీ భక్తి అనన్యం, నీ ధృడ చిత్తం అపారం. కానీ, నీవు కోరుకుంటున్న శ్రీచక్ర రహస్యాలు, అమ్మవారి తత్త్వం కేవలం మంత్రోచ్చారణలో మాత్రమే లేవు... ప్రతి ఆవరణలోనూ పరాశక్తిని సాక్షాత్కరించుకునే భావనలో ఉన్నాయి" అని శ్రీచక్రాన్ని చూపుతూ వివరించడం ప్రారంభించారు.
"ఈ తొమ్మిది ఆవరణలు కేవలం గీసిన గీతలు కావు... ఇవి భక్తుని హృదయం నుండి పరబిందువు వైపు తీసుకెళ్లే నవద్వారాలు. పరబ్రహ్మరూపిణి అయిన ఆ ప్రకృతిమాతలోని తత్త్వాలు ఇవి. ప్రతి ఆవరణ దాటేకొద్దీ మనలోని అహంకారం కరగాలి, లౌకిక మమకారం నశించాలి. నీ శరీరమే శ్రీచక్రం, నీ ఎదురుగా ఉన్నది దానికి సూచనాత్మకం. అన్ని ఆవరణల దేవతలనూ, తత్త్వాలనూ తెలుసుకున్నాక... అన్ని రూపాలూ తత్త్వాలూ లయమై, చివరకు మిగిలేది ఆ మహాత్రిపురసుందరి కామాక్షి మాత్రమే..."
అంటూ శ్రీవిద్యా సంప్రదాయంలో గురుపరంపరగా వచ్చిన భావనోపనిషత్తు జ్ఞానాన్ని, శ్రీచక్ర అంతరార్థాలను, ఉపాసన రహస్యాలను, 'ఆర్యాద్విశతి'లో దాచబడిన గుహ్య తత్త్వాలను ఉపదేశించారు.
మీనాక్షి అమ్మాళ్ ఆ దివ్యవాక్కులను శ్రద్ధగా ఆలకించింది.
యే సంధ్యారుణయంతి శంకరజటాకాంతారచన్రార్భకం
సిందూరంతి చ యే పురందరవధూసీమంతసీమాంతరే!
పుణ్యం యే పరిపక్కయంతి భజతాం కాంచీపురే మామమీ
పాయాసుః పరమేశ్వరప్రణయినీపాదోద్భవాః పాంసవః!!
ఆ క్షణం నుండి ఆమెకు శ్రీచక్రం కేవలం ఒక యంత్రంగా అనిపించలేదు... ఆమె దృష్టికోణం మారింది, తాత్త్విక దృష్టి అలవడింది. ప్రతి ఆవరణలోని యోగినీగణాలు, పరాశక్తి తత్త్వాలు విభిన్న రూపాలుగా దివ్యంగా సాక్షాత్కరించాయి.
చివరకు మధ్య బిందువులో...
అరుణోదయ కాంతిని మించిన ఎర్రని వర్ణం...
చంపక, పారిజాతాది దివ్య కుసుమాలతో అలంకరించిన ఘనజటాభారం...
నవరత్నమయ కిరీట ప్రకాశం...
ఓపక్కన పదహారవ కళతో అలరారే అమృతకాంతిపూరిత చంద్ర రేఖ...
పాపిట సంధ్యారుణ కాంతుల సిందూరంతో...
కస్తూరి తిలకంతో...
చీకటి వంటి నల్లని కాటుక దిద్దిన కళ్ళతో...
రత్న తాటంకాలు అలంకరించిన చెవులతో...
కిరీటం అంచులనుంచి చెవులపక్కగా ఊగుతున్న నొక్కు నొక్కు వెంట్రుకల సమూహంతో...
దొండపండు మెరుపును, చిలుకముక్కుల రంగును తలదన్నే ఎర్రని పెదవుల చిరు మందహాసంతో...
అద్దాల వంటి చెక్కిళ్లపై మహాకామేశ్వరుడి రూపం ప్రతిఫలిస్తుండగా...
ఎర్రని బంగారు జరీ పట్టుచీర కట్టుకొని...
పంచబ్రహ్మాసనస్థితయై,
రమావాణీ సేవితయై,
మహాకామేశ్వరాంకస్థితయై...
చెరకువిల్లు, పంచబాణాలు, పాశం, అంకుశాలను ధరించిన కరుణామయి మహాత్రిపురసుందరి శ్రీ కామాక్షీ పరమేశ్వరి సాక్షాత్కరించింది.
ఆ దివ్య మంగళ రూపాన్ని చూసిన మీనాక్షి అమ్మాళ్ ఆనందబాష్పాలతో తడిసిముద్దయింది. ఆమెకు బాహ్యస్మృతి నశించింది. అలా ఎంత సమయం గడిచిందో తెలీదు.
కైవల్యదాయ కరుణారసకింకరాయ
కామాక్షి కందలితవిభ్రమశంకరాయ!
ఆలోకనాయ తవ భక్తశివంకరాయ
మాతర్నమోఽస్తు పరతంత్రితశంకరాయ!!
కొద్ది సేపటికి... ఆ మహర్షి ఆమె తలపై హస్తముంచి " బిడ్డా! శ్రీవిద్యారహస్యం కేవలం గ్రంథాలలో సంపూర్ణంగా లభించదు. అది గురుకృపతో వికసిస్తుంది... జగదంబ మహాత్రిపురసుందరి కామాక్షి కటాక్షంతో పరిపూర్ణమవుతుంది" అని చెబుతూ, చరమ మంత్రాలను అంగోపాంగంగా ఉపదేశించారు.
"దీనిని అత్యంత పవిత్రంగా కాపాడుకో. కాలానుగుణంగా కామాక్షియే నీకు తదుపరి మార్గాన్ని చూపుతుంది. ఎందుకంటే... ఆమెయే పరమగురువు, గురుమండల రూపిణి" అని బోధించారు.
ఆ మాటలు ముగియగానే...
ఆ మహర్షి రూపం క్రమంగా దివ్యజ్యోతిగా మారి, నేరుగా కామాక్షీ అమ్మవారి విగ్రహంలో లీనమైపోయింది.
అది క్షణకాలమో... యుగకాలమో... ఆమెకు తెలియదు.
మళ్లీ భక్తుల సంచారం, గంటానాదం వినిపించేసరికి ఆమెకు బాహ్యస్మృతి వచ్చింది.
కానీ మీనాక్షి అమ్మాళ్ జీవితం శాశ్వతంగా మారిపోయింది.
మరుసటి రోజు ఆమె ఆలయ వృద్ధ అర్చకునికి జరిగినదంతా వివరించింది. ఆ అర్చకుడు ఆనందభాష్పాలతో — "మీనాక్షీ అమ్మాళ్! నీ అదృష్టం వర్ణనాతీతం. శ్రీచక్రారాధనా సంప్రదాయంలో దూర్వాస మహర్షికి అత్యున్నత స్థానం ఉంది. నిన్ను అనుగ్రహించినది సాక్షాత్తు దూర్వాస మహర్షులే! వారు మాకు ఆద్యులు. వారు సూచించిన మార్గంలోనే నేటికీ కామాక్షి అమ్మవారి అర్చన కొనసాగుతోంది. ఇలాంటి కటాక్షం కోట్లలో ఒకరికి దక్కడం కూడా అరుదు" అని ఆమెకు నమస్కరించారు.
ఆ రోజు నుండి మీనాక్షి అమ్మాళ్ జీవితం సంపూర్ణంగా మారిపోయింది.
ఆమె మాటల్లో మునుపటికన్నా సౌమ్యత్వం, ముఖంలో ప్రశాంతత, చూపులో కరుణ తాండవించాయి.
తాను గొప్ప ఉపాసకురాలిననే గర్వం లేశమాత్రం కూడా లేకుండా మరింత సౌమ్యంగా తయారైంది.
ఆమెను చూసినవారు "నిజమైన కామాక్షీ కటాక్షం పొందిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకోవాలంటే మీనాక్షి అమ్మాళ్ను చూడాలి" అని చెప్పుకునేవారు.
---
శ్రీవిద్యామార్గంలోనైనా మరే ఉపాసనా మార్గంలోనైనా పాండిత్యం కంటే నిర్మలమైన భక్తి, గ్రంథజ్ఞానం కంటే గురుభక్తి మిన్న.
భక్తుడు ఒక అడుగు వేస్తే, అమ్మ పది అడుగులు ముందుకు వస్తుంది.
భక్తుని కంటి నుండి జారే ఒక్క కన్నీటి బొట్టుకే అమ్మ హృదయం కరిగి అనంతమైన కరుణను వర్షిస్తుంది.
ఆమె కటాక్షం ఉంటే మహర్షులే గురువులై మార్గదర్శకులవుతారు...
జీవితమే ఒక దివ్యానుభూతిగా మారుతుంది.
"భక్తుని హృదయంలో ప్రేమ, వినయం, గురువాక్యంపై విశ్వాసం ఉంటే ఆ మహాత్రిపురసుందరి కామాక్షి నిశ్చయంగా అనుగ్రహిస్తుంది."
---
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే!
జయ దుర్గే! శివ దుర్గే! హర దుర్గే!
జయ జయ – జయ జయ కామాక్షీ!
జయ జయ – జయ జయ కామాక్షీ!
యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ |
తత్సర్వం క్షమ్యతాం దేవి కామాక్షి నమోస్తుతే ||
విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ |
న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి ||
- శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేంద్ర)
No comments:
Post a Comment