Pages

Thursday, October 31, 2013

కార్తీక పురాణము (సంస్కృత మూల సహితం) - 01వ అధ్యాయం

శ్రీ గురుభ్యోనమః
శ్రీ గణేశాయ నమః
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే

యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః
తత్రశ్రీర్విజయోః భూతిర్ద్రువానీతిమతిర్మమ
యశ్శివోనామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోస్సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళం

అగ్రతః వృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చమహాబలౌ
ఆకర్ణ పూర్ణధన్వానౌ రక్షతాం రామలక్ష్మణౌ
సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరోయువా
గచ్ఛన్మమాగ్రతోనిత్యం రామః పాతు సలక్ష్మణః

ఓం శ్రీ పరాదేవతాయైనమః
శ్రీ కార్తీక దామోదర త్ర్యంబక దేవతాభ్యోనమః
అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే ప్రథమాధ్యాయః
శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం
ప్రథమ అధ్యాయం

శ్లో! వాగీశాద్యస్సుమనస స్సర్వార్థానాముపక్రమే!
యన్నత్వాకృతకృత్యాస్స్యుస్తంనమామి గజాననమ్!!

ఋషయ ఊచుః!
వసిష్ఠేనవిదేహాయ కధితంబౄహినోమునే
శ్రోతుకామావయంత్వత్తః కార్తికోత్తమముత్తమమ్
తా! నైమిశారణ్యములో సత్రయాగదీక్షితులైన శౌనకాది మహామునులు ఒకప్పుడు మహానుభావుడైన సూత మహర్షిని ఉద్దేశించి " సూత మహర్షీ! జనక మహారాజు కోరిక మేరకు వశిష్ఠ మహర్షిచేత చెప్పబడిన కార్తీక మహాత్మ్యమును విస్తరముగా మేము మీవలన తెలుసుకొనగోరితిమి, కనుక దయతో సెలవీయండి " అని అడిగిరి.

సూత ఉవాచ!
వసిష్ఠేనవిదేహాయ కధితంకీర్తివర్థనం
బ్రహ్మణా కధితంతద్వన్నారదాయమహాత్మనే!!
మహాదేవేనపార్వత్యై రమాయైచక్రిణాతథా
తదహంసంప్రవక్ష్యామి శ్రుణ్వంతుమునయోఖిలాః
యచ్ఛ్రుత్వాముచ్య తేజంతు ర్జన్మసంసార బంధనాత్!!
తా! అంత సూత మహాముని " శౌనకాది మహామునులారా! వినండి, కార్తీక మాహాత్మ్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజుగారికి చెప్పెను, అలానే ఇతః పూర్వము చతుర్ముఖ బ్రహ్మగారు నారదునికి, పార్వతీ దేవికి మహాదేవుడు, లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు చెప్పెను. దీనివలనసమస్త సంపత్తులు ప్రాప్తించును. దీనిని విన్నవాడు జనన మరణ సంసార బంధనమును త్రెంచుకొని మోక్షమును పొందుటకు అర్హుడగును

అగాత్కదాచిద్వై దేహం వసిష్ఠో బ్రహ్మనందనః
దిష్ట్యాసిద్ధాశ్రమంగంతుం విదేహగృహమావిశత్!!
దృష్ట్వావిదేహస్తంవిప్ర మాసనాదవరుహ్యచ
ననామదండవద్భూమౌసంతోషపులకాంకితః!!
అర్ఘ్యపాద్యాదిభిస్సమ్యగభ్యర్చ్యవిధివత్తదా
పాదప్రక్షాళనస్యాపః స్వయం ధృత్వాతుమస్తకే!!
తస్యదివ్యాసవందత్వా భక్తిభావేనతంమునిం
ఉత్ఫుల్ల వదనాంభోజం సర్వభూతదయాపరం!!
శాంతందాంతం సదాచారం బాలసూర్యసమప్రభం
సమస్తగుణసంపన్నమువాచ నృపతి స్తదా!!
తా! ఒకానొకప్పుడు దైవ వశము చేత  సిద్ధాశ్రమమునకు వెళుతున్నటువంటి వశిష్ఠ మహర్షి జనకమహారాజు గృహమునకేగెను. అంత జనక నృపుడు వచ్చిన బ్రహ్మర్షిని చూసి సింహాసనమునుంచి త్వరగా దిగి దండప్రణామము చేసి సంతోషముతో పులకాంకితుడై అర్ఘ్యపాద్యాదులచేత పూజించి ముని పాదోదకమును తన శిరస్సునందుంచుకొని బంగారపు ఆసనమును ఇచ్చివికసించిన తామరలవంటి కన్నులు కలిగి, సమస్త జీవులయందుని దయగలిగి, అంతరింద్రియనిగ్రహముగలవాడై సదాచారవంతుడై బాలసూర్యుని పగిది కాంతి కలిగి సమస్తగుణ సంపన్నుడగు బ్రహ్మర్షితో భక్తిభావముతో ఇట్లడిగెను.

రాజోవాచ!
ధన్యోస్మికృతకృత్యోస్మి దర్శనాత్తవభూసుర
అస్మాకంపితరస్సర్వేతృప్తిమాయాంతిసాంప్రతం!!
మహతాందర్శనంశ్రేష్ఠం దుర్లభంగృహమేధినాం
భవేదాగమనంమహ్యం హేతుఃకళ్యాణసిద్ధయే!!
తా! జనకమహారాజుబ్రాహ్మణోత్తమా! మీదర్శనమువల్ల నేను ధన్యుడనైతిని, నేను చేయతగిన పుణ్యమింకేమీలేదు. మాపితృదేవతలందరూ ఇప్పుడు తృప్తిని పొంది ఉన్నారు. మహాత్ములయొక్క దర్శనము సంసారులకు దుర్లభము, గనుక ఇప్పుడు మీరు మాయింటికి విచ్చేయడం వల్ల నాకు శుభములు సమకూరునుఅని పలికెను.
శ్రీ సూతః!
ఏవంవదంతం రాజానం విప్రేందః పుల్లలోచనః
కృపాభావేనసంతుష్టః ప్రాహేదంప్రహసన్నృపం!!

తా! సూతమహర్షిజనకుడిట్లు పలికిన తరవాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖముకలవాడై దయతో గూడినవాడై సంతోషించి చిరునవ్వు నవ్వుతూ రాజుతో ఇట్లు పలికెనని శౌనకాది మహామునులతో చెప్పెను.

స్వస్తితేస్తునృపశ్రేష్ఠ యాస్యామ్యాశ్రమమండలం
శ్వోయజ్ఞోభవితాస్మాకం ద్రవ్యంత్వందాతుమర్హసి!!
తా! రాజోత్తమా! నీకు క్షేమమగుగాక, నేను మాఆశ్రమమునకు బోవుచున్నాను, రేపు ఆశ్రమమందు యజ్ఞము జరుగవలెను, దానికి ఇప్పుడు ద్రవ్యముని నీవు ఇచ్చుటకు తగి ఉన్నావు

రాజోవాచ!
దాస్యామిద్రవిణంభూరి ధర్మంగోప్యం మహామునే
త్వత్తోహంజ్ఞాతుమిచ్ఛామి శ్రోతౄణామఘనాశనం!!
జానాసిసర్వధర్మాణాం సూక్ష్మంభూరిఫలప్రదం
జ్ఞాతుమిచ్ఛామివిప్రేంద్ర ధర్మంపక్తుమిహాహన్ సి!!
కార్తికస్సర్వమాసేభ్యో ధర్మేభ్యోహ్యధికః కథం
శ్రోతుకామాయమే బౄహిధర్మజ్ఞోసిమహామతే!!
తా! అంత రాజు బ్రహ్మర్షి వశిష్ఠునుద్దేశించి ఇలా పలికుచున్నాడు మహర్షీ ! మీ యజ్ఞమునకు దాసుడనై ద్రవ్యమునివ్వగలవాడను. నాకు మీ వలన వినువారి పాపములను పోగొట్టు ధర్మ రహస్యములను  వినగోరుచున్నాను. మీకు తెలియని ధర్మ రహస్యములు లేవు కాబట్టి అధిక ఫలమిచ్చెడి సూక్ష్మ ధర్మము చెప్పుమా. మునీశ్వరా! కార్తికమాసము సమస్త మాసములకంటెను సమస్త ధర్మములకంటెను ఎట్లు అధికమైనదో దానిని వినగోరుచున్నాను. నాకు తెల్పుము మీ కంటే ధర్మమును చెప్పువారెవ్వరూలేరు.

వసిష్ఠః!
శ్రుణురాజన్ ప్రవక్ష్యామి శ్రోతౄణామఘనాశనం
సాధుత్వయోదితావాణీ లోకోద్ధరణహ్హేతవేః
పూర్వకర్మవిపాకేన సత్వశుద్ధిః ప్రజాయతే!!
తా! అంత వశిష్ఠమహర్షి ఇలా పలుకుచున్నాడు రాజా! పూర్వమందు పుణ్యకార్యములాచరించినందుకు సత్వశుద్ధిగలుగును, సత్వ శుద్ధి కలిగిన పుణ్యమార్గమందు అభిలాష కలుగును, కనుక లోకోపకారార్థమై ఇప్పుడు నీవడికిన మాట చాలా బాగున్నది. చెప్పెదను వినుము, విన్నంతనే పాపములు నశించును.’

తులాసంస్థేదినకరే కార్తికేమాసియోనరః
స్నానందానం పితృశ్రాద్ధం అర్చనం శుద్ధమానసః
తదక్షయ్యఫలంప్రాహుర్యత్కరోతినరేశ్వర!!
సంక్రమం వాసమారభ్య మాసమేకంనిరంతరం
మాసస్యప్రతిపద్యాంవాప్రారభేత్కార్తికవ్రతమ్!!
తా! రాజా! సూర్యుడు తులాసంక్రమణమందుండగా కార్తీకమాసములో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో యేవి చేసినా అవి అక్షయమగును అని మునీశ్వరులు చెప్పిరి. కార్తీక వ్రతమును తులాసంక్రమణము మొదలుకొనిగాని, కార్తీక శుక్ల పాడ్యమి మొదలుకొని గానీ ఆరంభించవలెను.

నిర్విఘ్నంకురుమేదేవ దామోదర నమోస్తుతే
ఇతిసంకల్ప్యవిధివత్పశ్చాత్స్నానంసమాచరేత్!!
తా! కార్తీక వ్రతము మొదలు పెట్టేముందు దామోదరా! నేను కార్తీక వ్రతమారంభించుచున్నాను దానిని నిర్విఘ్నంగా పూర్తిచేయించుము అని సంకల్పించి కార్తీక స్నానమారంభించాలి.

మార్తాండోదయవేళాయాం కార్తిక్యాంకారయేన్నృప
కావేర్యాంకార్తికేమాసి నదీస్నానం విశిష్యతే!!
తులారాశింగతేసూర్యే గంగాత్రైలోక్యపావనీ
సర్వత్రద్రవరూపేణ సాసంపూర్ణాభవేత్తదా!!
యస్మిన్నాస్తేహృషీకేశ స్తులాయాంగోష్పదోదకే
తటాక కూపకూల్యాసు నిత్యంసన్నిహితోహరిః!!
తా! కార్తీక మాసమందు సూర్యోదయ సమయమున కావేరీనదియందు స్నానమాచరించుటచే అట్టి వారికి ఇట్టిట్టిదని చెప్పలేని మహాఫలము కలుగును. సూర్యుడు తులారాశియందు కార్తీకమందు చెరువులలోనూ, బావులలోను, నీటిగుంటలలోను, కాలువలలోనూ నిత్యమూ వసించి ఉండును.

నృపైషాంచసదాచారో వర్ణినాంకార్తికేతథా
గంగాం గత్వాశనైర్విప్రోనమస్కృత్యహరింస్మరన్
ప్రక్షాళ్య పాదౌ హస్తౌచ ఆచమ్యప్రయతశ్శుచిః
అతిశుద్ధేనమంత్రేణచానుజ్ఞాతోథభైరవాన్
కటిప్రమాణముదకంగత్వాస్నానం సమాచరేత్!!
తా! రాజా! సదాచారపరులైన సకల వర్ణమువారునూ కార్తీక మాసమున గంగకు వెళ్ళి నమస్కరించి శ్రీ హరిని స్మరించి కాళ్ళూ చేతులు కడుక్కొని, ఆచమించి భైరవుని ఆజ్ఞ గైకొని మొలలోతునీటిలో మునిగి గంగాస్నానం చేయవలెను.

దేవాన్ ఋషీన్ పితౄన్ భక్త్యాతర్పయిత్వాయథావిధి
తత్రాఘమర్షణంకుర్యాద్భక్తిభావేన కేశవే జపన్
       -ఆలోడ్యతత్తో యమంగుష్ఠాగ్రేణ భూమిప
పశ్చాత్తీరమనుప్రాప్య కుర్యాత్తత్రోదకాంజలిం
       -నిష్పీడ్యధృతవస్త్రం తద్ద్విరాచమ్యతతోనృప
నకుర్యాదార్ద్రవస్త్రేణ శిరసొద్వర్తనంతదా
ధారయేద్ధౌతవస్త్రంతు నారాయణమనుస్మరన్!!
తా! దేవ, ఋషి, పితృదేవతా గణములకు తర్పణము ఇచ్చి, శ్రీ హరి మీద భక్తితో అఘమర్షణ మంత్రములు చదువుతూ బొటనవేలితో ఆలోడనము చేసుకొని, భూమి మీదకు వచ్చి యక్ష్మ తర్పణము చేసి (ఉదకాంజలి) వస్త్రమును విడచి యధా శాస్త్ర ప్రమాణం పొడి వస్త్రం ధరించవలెను.

తతోర్ధ్వపుండ్రకాన్ ధృత్వా గోపీచందనతోద్విజః
సంధ్యాముపాస్యవిధివద్గాయత్రీ జపమాచరేత్!!
తతశ్చాగ్ని మనుక్రమ్య హుత్వాహ్యౌపాసనంశుభం
బ్రహ్మ యజ్ఞం తతః కృత్వా దేవపూజాంసమాచరేత్!!
ఆహృత్యపూజా పుష్పాణి స్వారామోద్భవానిచ
షోడశైరుపచారైశ్చ సాల గ్రామనివాసినం
శంఖచక్రధరం దేవం భక్తి భావేనచార్చయేత్!!
తా! తరవాత ఊర్ధ్వపుండ్ర ధారణమును చేసికొని, సంధ్యావందనము, గాయత్రి, బ్రహ్మ యజ్ఞము ఇత్యాది నిత్య కర్మానుష్ఠానములు చేసుకొనవలెను. స్వంత తోటలోని పువ్వులతో శంఖ చక్రములు ధరించిన శ్రీ హరిని భక్తితో సాలగ్రామమందు షోడశోపచారములతో పూజించవలెను.

తతఃపురాణపఠనం కృత్వా భక్తి సమన్వితః
గృహంగత్వాహరింపూజ్య నైశ్వదేవమతఃపురం!!
భుక్త్వాచాంతె ద్విరాచమ్య పురాణశ్రవణంపునః!
దినాంతెసర్వకర్మాణి సమాప్యవిధిసన్నృప
ప్రదోష సమయె రాజన్ విష్ణొర్వాశంకరస్యచ!!
యథాశక్త్యనుసారేణ దీపప్రజ్వలనం శుభం
భక్ష్యభోజ్యాదిభిస్సమ్య గర్చయేద్భక్తవత్సలం!!
వాచాస్తోత్రంచ తద్విష్ణోః శైవంవా వాగ్యతశ్శుఛిః
జప్త్వాతద్ధ్యాసనిరతః నమస్కారం తతః క్రమాత్!!
తా! తరవాత కార్తీక పురాణమును పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వైశ్వదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచమనము గావించి తరవాత పురాణ శ్రవణం చేయవలెను.
సాయంకాలముకాగానే ఇతర వ్యాపారములనన్నిటినీ ఆపి విష్ణ్వాలయమునకు గానీ, శివాలయమునకు గానీ వెళ్ళి తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష్యభోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణువు యొక్క గానీ శివుని యొక్కగానీ స్త్రోత్ర, జప, ధ్యానాదులను చేసుకొని నమస్కారము చేయవలెను.

ఏవంయః కార్తికేమాసి కురుతెభక్తినమ్రధీః
సయాతివైష్ణనంధామ పునరావృత్తివర్జితం!!
ఇహజన్మనియత్పాపం యత్పాపంపూర్వజన్మని
తత్పాపంవిలయంయాతి కార్తికవ్రతముత్తమం!!
బ్రాహ్మణక్షత్రియోవైశ్యః శూద్రశ్చైవతపోధనః
స్త్రియోవాభక్తిభావేన కార్తికోక్తంచరేద్యది
తేయాంతివైష్ణవంలోకం పునరావృత్తివర్జితం!!
కార్తికే ధర్మనిరతం దృష్ట్వామోదతియఃపుమాన్
తద్దినాఘనివృత్తిస్స్యాన్నాత్రకార్యావిచారణాః
తా! ప్రకారం ఎవరు కార్తీకమాసమందు భక్తితో వ్రతము చేయుచున్నాడో వాడు పునరావృత్తి రహితమైన వైకుంఠమును పొందుచున్నాడు. పూర్వ జన్మార్చితములూ, జన్మార్జితములూ అయిన సమస్త పాపములు కార్తీక వ్రతమాచరించిన యెడల నశించును.

బ్రాహ్మణుడుగానీ, క్షత్రియుడుగానీ, వైశ్యుడుగానీ, శూద్రూడు గానీ, తపస్విగానీ, స్త్రీలు గానీ, ఎవరైనా సరే భక్తిశ్రద్ధలతో కార్తీకవ్రతమును చేసిన వారికి పునరావృత్తిలేదు. ఏవరు కార్తీక వ్రతవంతుని జూచి సంతోషించునో అంత మాత్రమునకే దినమున వానికి కల్గిన పాపములు నశించును. ఇందుకు సందేహములేదు.

ఇతి స్కాందపురాణే కార్తికమహాత్మ్యే ప్రథమాధ్యాయస్సమాప్తః
శ్రీ స్కాందపురాణమందలి కార్తీకమాహాత్మ్యమనబడు కార్తీక పురాణము నందలి మొదటి అధ్యాయము సమాప్తము

సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు


1 comment:

  1. Ayya , meeru ponda parachina kaaritika puranam 9 bagamulu chadivi danyudananti . Meeku Aa Srihari karuna katakshamulu anni vidhamula Deevinchalani korukontunnanu .

    ReplyDelete