జై రాధే కృష్ణ!
జై బృందావన్!
జై బర్సానా!
తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి।
వృషభాను సుతే దేవి ప్రణమామి హరి ప్రియే!!
"కాల్చి కరిగించిన బంగారంలా ప్రకాశించే వర్ణం కలిగిన వృందావనేశ్వరి! వృషభానుని కుమార్తె! శ్రీహరికి పరమ ప్రియమైన రాధాదేవీ! నీకు నా కోటి ప్రణామాలు."
"రాధే... రాధే..." అనే మధురనామం గాలిలో కలిసిపోయి ప్రతిధ్వనించే పవిత్ర బర్సానా ధామం...
వేకువజామున చల్లని పిల్లగాలులు రాధానామాన్ని మోసుకొస్తుంటాయి. గిరిరాజు ఒడిలోని ప్రతి ధూళికణం భక్తి పరిమళాన్ని వెదజల్లుతుంది. పక్షుల కలకూజితాలు మంగళగీతాలుగా వినిపిస్తాయి. ఆ దివ్యభూమిలో ఒక చిన్న గుడిసెలో రజనీకాంత అనే నిరుపేద భక్తురాలు నివసించేది .
ఆమె ఎక్కడనుంచి వచ్చిందో తెలియదు...
ఆమెకు ఎవరూ లేరు...
ఆమెకు ఆస్తిపాస్తులు లేవు...
ఆడంబరమైన జీవనవిధానం లేదు...
ఆమెకు సాహిత్యం, స్తోత్రం, పూజ ఏమీ రావు...
ఆమెది అత్యంత సాధారణమైన, నిరాడంబరమైన పల్లెపడుచు జీవితం...
కానీ ఆమె వద్ద భువనత్రయంలోకెల్లా దుర్లభమైన ఒకే ఒక సంపద ఉంది అది "శ్రీరాధారాణి చరణాలపై అవ్యాజమైన ప్రేమ, అనన్యమైన భక్తి"
రజనీకాంత ప్రతిరోజూ బ్రహ్మముహూర్తానికే లేచి, బావి నుండి నీటిని తోడి తెచ్చి, బానలకొద్దీ మోస్తూ కొండపైనున్న శ్రీరాధారాణి ఆలయానికి తీసుకెళ్ళేది. రాధారాణి గుడి మెట్ల ముందు నిలబడి రెండు చేతులూ జోడించి "అమ్మా... నువ్వు బర్సానాలో, బృందావనంలో సఖులతో, కాన్హాతో కలిసి విహరించడానికి ఈ మెట్లమీదనుంచే వెళతావు. అప్పుడు నీ పాదాలు ఈ మెట్లపై పడతాయి. నిన్ను చూడడానికొచ్చే నీ ప్రియభక్తుల పాదాలు ఈ మెట్లను తొక్కుకుంటూ నీ వద్దకు వస్తారు. ఈ మెట్లమీద నీ పాద ధూళి, నీ సఖుల పాదధూళి, నీ భక్తుల పాదధూళి పడుతుంది. ఆ పాద ధూళి రోజూ నా చేతులతో శుభ్రమైతే... ఈ నా జన్మ సార్థకమైనట్లే." అని ప్రార్థించేది.
అదే ఆమె చేసే స్తోత్రం
అదే ఆమె చేసే పూజ
అదే ఆమె చేసే వ్రతం
అది ఆమెకు నిత్య నోము...
రజనీకాంత ఇలా ప్రార్థించి ఆపై ఒక్కో మెట్టును తుడిచి, నీటితో కడిగి, తన చీరకొంగుతో ప్రేమగా తుడిచేది. చిట్టచివర మెట్టువరకూ తుడిచి కుప్పగా చేర్చిన పాదధూళిని తిలకంగా ధరించేది.
ఆమె శ్వాసలో రాధానామం...
ఆమె హృదయంలో రాధాభావం...
ఆమె పెదవులపై ఎప్పుడూ "రాధే... రాధే... జయ జయ శ్రీరాధే..."
ఆమె తన ఒంటరి తనానికీ, బీదరికానికీ, తన జీవన విధానానికీ ఏనాడూ బాధపడలేదు. రాధమ్మ ఉండగా ఏలోటూ లేదు, రాధమ్మ గుడిమెట్లే నాకు స్వర్గంలోని కల్పవృక్ష కామధేనువులు, ఆమె పాధ ధూళి, ఆమె భక్తుల పాదధూళియే నాకు అనంత ఐశ్వర్యం అని భావించేది.
ఆమె ఎంతో ప్రేమతో తన కన్నుల నిండా ఆనందాశ్రువులు కారుతుండగా అవి ఆ మెట్లకు నిజమైన అభిషేకమయ్యేవి.
ఆమె హృదయంలో ఎల్లప్పుడూ ఒకే కోరిక...
రాధికా చరణరేణుం యస్య మూర్ధ్ని విధారయేత్!
తస్య భాగ్యం న వర్ణేయం బ్రహ్మాద్యైరపి దుర్లభమ్!!
"రాధికాదేవి చరణధూళి ఎవరి తలపై పడుతుందో వారి భాగ్యం బ్రహ్మాదులకు కూడా దుర్లభం."
ప్రతి మెట్టును తుడుస్తూ ఆమె మనసులో "అమ్మా! నీ దర్శనానికి వచ్చే భక్తుల పాదరేణువు నా శరీరాన్ని తాకితే చాలు... ఇక మరొక జన్మ నాకు అవసరం లేదు." అని అనుకునేది.
ఆమె హృదయంలో నిరంతరం శ్రీమద్భాగవతంలోని గోపికల భావమే ప్రవహించేది
ఒక రోజు...
బర్సానాను దట్టమైన పొగమంచు కమ్మేసింది.
చలి ఎముకలను కొరికేస్తోంది.
ఆ రోజు రజనీకాంతకు తీవ్రమైన జ్వరం వచ్చింది.
శరీరమంతా వణికిపోతోంది.
మంచం మీద నుంచి లేవడమే అసాధ్యమైంది.
అంతలో...
ఆలయంలో గంటలు మ్రోగాయి.
శంఖనాదం వినిపించింది.
మంగళహారతి ప్రారంభమైంది.
ఆ శబ్దం విన్న వెంటనే ఆమె హృదయం తల్లడిల్లిపోయింది.
ఆలయ శిఖరం వైపు చూస్తూ కన్నీరుమున్నీరై
"అమ్మా రాధే...! ఈ రోజు నీ గుడి మెట్లు నాకోసం ఎదురుచూస్తున్నాయేమో...! నీ భక్తుల పాదాలకు ధూళి ప్రసాదం ఇవాళ నాకు లభించదేమో...! ఈ పాపిష్టి శరీరం నీ సేవకు పనికిరాకుండా పోయిందమ్మా...!" విలపించింది. ఆమె జ్వరంతో ఏడుస్తూనే మెల్లగా స్పృహ కోల్పోయింది.
ఆమె అంతరంగం మాత్రం రాధమ్మ పాదధూళినే ఉపాసిస్తోంది...
ఆశ్లిష్య వా పాదరతాం పినష్టు మాం
అదర్శనాన్మర్మహతాం కరోతు వా!
యథా తథా వా విదధాతు లంపటో
మత్ప్రాణనాథస్తు స ఏవ నాపరః!!
"రాధే! నీవు నన్ను ఆదరించినా, నిరాదరించినా, దగ్గరకు తీసుకున్నా, దూరం చేసినా, సుఖం ఇచ్చినా, దుఃఖం ఇచ్చినా, నా పట్ల నీ ప్రవర్తన ఏదైనా సరే, నా ప్రేమ మాత్రం మారదు. నీవే నా జీవితం, నీవే నా శరణ్యం, నీవే నా ప్రాణాధారం"
ఆనాటి అర్ధరాత్రి...
ఆ చిన్న గుడిసె అంతా దివ్యజ్యోతితో నిండిపోయింది.
ఆ కాంతి ముందు ఇంట్లోని దీపాలు వెలవెలపోయాయి.
యమునా తీరంలోని మడుగులలో వికసించిన కమలాల పరిమళం గది అంతా వ్యాపించింది.
దూరంగా మువ్వల సవ్వడి...
ఆ శబ్దం క్రమంగా దగ్గరపడింది.
తలుపు వద్ద దివ్యమైన కాంతితో ఒక యువతి నిలబడి ఉంది.
కొత్త నీలిరంగు వోణీ, పట్టుపరికిణి...
బంగారు ఆభరణాలు...
చంద్రబింబాన్ని మించిన ముఖకాంతి...
మూడు లోకాలను మైమరపించే చిరునవ్వు...
ఆ దివ్య దర్శనాన్ని వర్ణించేందుకు జయదేవ మహాకవి మాటలే సరిపోతాయి—
స్మర గరళ ఖండనం
మమ శిరసి మండనం।
దేహి పదపల్లవముదారం!!
ఆ దివ్య చరణాల యజమాని...
బర్సానా కిశోరీ... శ్రీరాధారాణి!
ఆమె మెల్లగా వచ్చి రజనీకాంత పక్కన కూర్చుంది.
తన సుకుమారమైన చేతులతో ఆమె నుదుటిని ప్రేమగా నిమిరింది.
ఆ స్పర్శతోనే రజనీకాంత కళ్లు తెరిచింది.
ఎదురుగా...
తన ప్రాణవల్లభ...
తన రాధే...
ఆమె ఒక్కసారిగా లేవబోయింది.
కానీ రాధారాణి ప్రేమగా ఆమెను ఆపుతూ ఎంతో వాత్సల్యంతో
"రజనీ...! ఈ రోజు నువ్వు నా దగ్గరకు రాలేకపోయావు... అందుకే నీ రాధే నీ దగ్గరకే వచ్చింది." అని పలికింది.
రజనీకాంత శరీరం కంపించిపోతోంది
తన రాధమ్మను చూసిన ఆనందంలో కన్నీళ్లు ఆగలేదు.
కన్నీళ్ళు అడ్డువచ్చి తన రాధమ్మ స్పష్టంగా కనపడటంలేదు.
చేతులతో కళ్ళను తుడుచుకుంటూనే తన రాధమ్మను ఆపాదమస్తకమూ తనివితీరా కళ్లతో గ్రోలుతోంది..
రాధారాణి తన చేతిలోని బంగారు పళ్ళెంపై బట్టతీసింది.
అందులో ఆలయంలో నివేదన చేసిన మహాప్రసాదం ఉంది.
ఒక చిన్న ముద్దను తీసి తన చేతులతోనే ఆమె నోటిలో పెట్టింది.
తన చేతితో చిన్న చిన్న ముద్దలుగా చేసి రజనీకాంత నోటిలో అన్ని ప్రసాదాలు పెడుతోంది.
"రోజూ నా మెట్లు కడిగి, నా పాదధూళి, నా భక్తుల పాదధూళి తలమీద దాల్చి, నన్ను సేవించే నా బిడ్డ అనారోగ్యంతో, ఆకలితో ఉండగా... నేను ప్రసాదం ఎలా స్వీకరిస్తాను రజనీ?" అని అన్నది...
రాధమ్మ చేతిలోని ఆ అమృతప్రసాదం రజనీకాంత తినగానే...
జ్వరం క్షణాల్లో మాయమైంది.
శరీరం తేలికైంది.
హృదయం ఆనందసముద్రంలో మునిగిపోయింది.
//ఆ దివ్య క్షణాన్ని చూసి గోపికలు శ్రీరాధాదేవి మహాభాగ్యాన్ని వర్ణించిన భాగవత వచనం గుర్తుకు వస్తోంది...
అనయారాధితో నూనం భగవాన్హరిరీశ్వరః
యన్నో విహాయ గోవిందః ప్రీతో యామనయద్రహః!!
(శ్రీమద్భాగవతం రాసపంచాధ్యాయీ 10.30.28)
"ఈ గోపిక చేసిన ఆరాధన ఎంత గొప్పదో! అందుకే భగవంతుడు మమ్మల్ని వదిలి ఈమెతో ఏకాంతంగా వెళ్లాడు."
అదే విధంగా రజనీకాంత చేసిన ఆరాధన ఎంత గొప్పదో, బర్సానా సర్కార్ స్వయంగా ఆలయం విడిచి తన భక్తురాలి కుటీరానికి విచ్చేసింది.//
శ్రీరాధారాణి ఆమె తలపై చేయి ఉంచి ప్రేమతో
"రజనీ...
నువ్వు కడిగింది నా ఆలయ మెట్లు కాదు... నీ హృదయం, అది ఎంతో నిర్మలమైంది. అది నా స్థానం.
నీ కన్నీటి బిందువులు నా భక్తుల పాదాలకు అభిషేకమయ్యాయి. నీ సేవ నన్ను కదిలించింది.
నాకు బంగారం, రత్నాలు, ఆస్తులు, భవంతులు అవసరం లేదు...
స్వార్థరహితమైన నిష్కల్మశమైన ప్రేమతో చేసిన చిన్న సేవే నాకు అత్యంత ప్రియమైన ఆరాధన." అంటూ ఆ దివ్యమూర్తి చిరునవ్వు నవ్వింది.
ఆ చిరునవ్వు వేల చందమామల వెలుగుగా మారింది...
ఆ క్షణంలోనే ఆ వెలుగులోనే రాధమ్మ మెల్లగా అంతర్ధానమైంది.
...తెల్లవారింది. ఆలయం అధికారులకు, గోస్వాములకూ రజనీకాంత ఇంటికి బర్సానా సర్కార్ రాధారాణి బంగారు పళ్ళెంలో పెట్టిన నైవేద్యాలతో వెళ్ళిందనీ, రజనీకాంతననుగ్రహించిందనీ తెలిసింది.
అందరూ పరుగు పరుగున వచ్చి రజనీకాంత అదృష్టాన్ని, నిష్కల్మశమైన భక్తిని పొగిడారు...
రజనీకాంత సంపూర్ణ ఆరోగ్యంతో గుడిసె బయటకు వచ్చింది.
గిరిరాజు శిఖరంపై ఉదయసూర్యకిరణాల్లో మెరిసిపోతున్న శ్రీరాధారాణి ఆలయాన్ని చూసింది.
కన్నీళ్లతో నేలపై సాష్టాంగ నమస్కారం చేసింది.
ఆమె పెదవులపై "రాధే... రాధే... జయ జయ శ్రీరాధే..." అనే ఒక్క నామమే
ఆ రోజు నుండి బర్సానా వాసులు "రజనీకాంత ఆలయ మెట్లను మాత్రమే కడగలేదు... తన నిష్కల్మషమైన ప్రేమతో శ్రీరాధారాణి హృదయాన్నే గెలుచుకుంది." అని చెప్పుకుంటారు.
రాధే జయ జయ మాధవ దయితే।
గోకుల తరుణీ మండల మహితే!!
జయ జయ శ్రీరాధే!
జయ జయ శ్రీకృష్ణా!
జయ జయహే రాధామాధవ!
-శంకరకింకరః
No comments:
Post a Comment