Pages

Wednesday, August 12, 2026

బృందావన కథలు – 50 (స్వామి హరిదాస్)

జయ శ్రీరాధేకృష్ణ!

లోకంలో గాయకులనేకులు
ధనాన్ని కోరేవారుంటారు...
కీర్తిని కోరేవారుంటారు...
సుఖసంతోషాలను కోరేవారుంటారు.
రాజుల మెప్పును కోరేవారుంటారు...
కానీ...
తన గానంతో దేవుడినే తన వద్దకు రప్పించిన భక్తుడు ఒకరున్నారు!
ఆయనకు సంగీతం కేవలం ఒక కళ కాదు - అది ఒక ఆరాధన.
ఆయనకు రాగం ఒక స్వర సమ్మేళనం కాదు.
అది రాధాశ్యాముల పాదపద్మాలకు సమర్పించిన పుష్పం.
ఆయనకు తంబురా మీటే ఒక వాద్యపరికరం కాదు.
అది ఆయన హృదయంతో పలికించే ప్రార్థన.
ఆ మహాభక్తుడు బృందావన నికుంజాలలో తన ప్రాణనాథుడైన శ్రీకృష్ణుని కోసం పాడిన సిద్ధపురుషుడు సంగీత సమ్రాట్ "స్వామి హరిదాస్!"
---
బృందావనం...
యమున ఒడ్డున వెన్నెల పరుచుకుంది.
కదంబ వృక్షాలు మౌనంగా నిలబడి ఉన్నాయి.
నిధివనంలోని తీగలు గాలికి ఊగుతూ, ఏదో రహస్యాన్ని ఒకదానికొకటి చెప్పుకుంటున్నాయి.
ఎక్కడో ఒక కోయిల కుహూ రాగాలు, నెమళ్ల ఖ్రేంకణాలు...
“రాధే... రాధే...” అంటున్నట్లు వినిపిస్తున్నాయి.
అ ప్రాంతంలోనే ఒక చిన్న కుటీరం.
ఆ కుటీరం అతి సాధారణం, వైభోగాలు ఏం లేవు.
బంగారు సింహాసనాలు లేవు.
వెండి పాత్రలు లేవు.
సేవకులు లేరు.
ప్రముఖంగా ఉన్నది ఒక్కటే ఒక పాత తంబురా...
వినపడుతున్నది ఒక్కటే రాధానామం...
కనిపిస్తున్నది ఒక్కటే శ్యామసుందరునిపై అంతులేని ప్రేమ.
స్వామి హరిదాస్ తన గానాన్ని ఎవరికో వినిపించడానికి పాడేవారు కాదు.
ఆయన పాడేది తనకు కనిపిస్తున్న రాధేశ్యామసుందరుని కోసం!
అందుకే ఆయన గానం విని మనుషులే కాదు ప్రకృతే పరవశించేది.
---
ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన ఆస్థాన గాయకుడు తాన్సేన్ గానం విని ముగ్ధుడయ్యాడు. “తానసేన్! నీ గానంలో ఇంత మాధుర్యం ఉంటే, నీకు ఈ సంగీతం నేర్పిన గురువు గానం ఇంకెంత అద్భుతంగా ఉండాలి! ఆయనను నా ఆస్థానానికి తీసుకురా. నేను ఆయన గానం వినాలి.” అని అన్నాడు.
తాన్సేన్ సన్నగా నవ్వి “రాజా! నా గురువుగారు బృందావనంలో ఉంటారు. ఆయన రాజుల కోసం పాడరు. బంగారం కోసం పాడరు. కీర్తి కోసం పాడరు. ఆయనకు ఉన్న ఒకే ఒక్క ప్రముఖ శ్రోతఉన్నాడు ఆయనకోసమే పాడతారు మా గురువుగారు, ఆ ప్రముఖ శ్రోత నికుంజ బిహారి శ్రీకృష్ణుడు. మీరు నిజంగా ఆయన గానం వినాలనుకుంటే... రాజుగా వెళ్లకండి. ఒక భక్తుడిగా వెళ్లండి.” అని చెప్పాడు
అక్బర్ ఆ మాటను ఆశ్చర్యపోయి సరే చూద్దాం అని బయలుదేరాడు.
రాజవస్త్రాలను విడిచాడు.
రాజభటులను దూరంగా ఉంచాడు.
సామాన్య భక్తుని వేషంలో తాన్సేన్వెంట బృందావనానికి బయలుదేరాడు.
నిధివన సమీపంలో స్వామి హరిదాస్ తన సాధనలో ఉన్నారు.
తాన్సేన్ తన గురువు నమస్కరించి పక్కన కూర్చున్నాడు. అదిగమనించిన స్వామి హరిదాస్ తాన్సేన్ ను పాడమన్నారు. తాన్సేన్ అద్భుతంగా పాడసాగాడు. మధ్యలో ఒక స్వరాన్ని తప్పుగా ఆలపించాడు...
ఆ క్షణం స్వామిహరిదాస్ తలెత్తి చూసి ఆపమన్నట్లు సైగ చేసారు.
తంబురాను చేతిలోకి తీసుకున్నారు.
ఒక్కసారి శ్రుతిని సరిచేసి.
గానం మొదలు పెట్టారు.
ఆ రాగ తాళ స్వరాల లయ విన్యాసం...
చుట్టూ ఉన్న భక్తులందరి హృదయాలను కరిగించింది.
మరో స్వరం, మరో రాగం, మరో గానం...
అది యమునా అలలపై సున్నితంగా తేలుతున్న ఆకులా అందరి మనసులలో ఊగుతోంది.
మరో రాగం విరిసింది.
అది కదంబ పుష్పాల పరిమళంలా నిధివనమంతా వ్యాపించింది.
కోయిల తన గానాన్ని ఆపింది.
నెమలి తన నాట్యాన్ని ఆపింది.
యమునా ప్రవాహం సైతం నెమ్మదించినట్లు అనిపించింది.
తాన్సేన్ తలవంచాడు.
అక్బర్ కళ్లను మూసుకున్నాడు.
ఆయన చెంపలపై కన్నీటి బిందువులు జారాయి.
"అది సంగీతం కాదు - అది భక్తి స్వస్వరూపం."
గానం ముగిసిన తరువాత అక్బర్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు.
కొంతసేపటికి తాన్సేన్ వైపు తిరిగి “ఇంతటి గానం నేను ఎప్పుడూ వినలేదు. నువ్వు ఇంత అద్భుతంగా పాడగలిగితే, నీ గురువు గానం నీకంటే ఎందుకు ఇంత గొప్పగా ఉంది? అంత గొప్పగా నువ్వెందుకు పాడలేకపోతున్నావు” అని అన్నాడు
తాన్సేన్ చిరునవ్వు నవ్వి
“షెహన్ షాహ్! నేను మీ కోసం పాడుతాను.
నా గురువుగారు సమస్తలోకాలకీ షెహన్ షాహ్ ఐన శ్రీకృష్ణుని కోసం పాడుతారు.
మీరు నా గానానికి బహుమతి ఇస్తారు.
కానీ నా గురువు గానానికి స్వయంగా శ్రీకృష్ణుడు తనను తానే అర్పించుకుంటాడు.” అన్నాడు.
ఔను ఆమాట సత్యం, గతంలో కొంత కాలం క్రితం జరిగిందదే!
స్వామి హరిదాస్ గానం చేసేటప్పుడు కొన్నిసార్లు ఎవరో ఎదురుగా నిలబడి ఉన్నట్లుగా చిరునవ్వేవారు.
ఎవరో అదృశ్య అతిథితో మాట్లాడుతున్నట్లుగా కనిపించేవారు.
భక్తులకు, శిష్యులకు ఆశ్చర్యంగా ఉండేది, ఆయనలో ఆయనే ఏమైనా మాట్లాడుకుంటున్నారా లేక నిజంగానే దివ్య స్వరూపాలేమైనా ఆయనకు కనపడుతున్నాయా అని సందేహించేవారు.
ఒకరోజు ధైర్యం చేసి “గురుదేవా! అక్కడ ఎవరూ లేరు కదా? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు?” అని అడిగారు
స్వామి హరిదాస్ నవ్వి...
“ఎవరితోనా?
నా శ్యాముడితో!
పక్కనున్న రాధమ్మతో!
మీకు కనిపించడంలేదా?” అని అడిగారు.
శిష్యులు ఒకరినొకరు చూసుకున్నారు.
వారికి ఏమీ కనిపించలేదు.
స్వామి హరిదాస్ మాత్రం మళ్లీ తన గానంలో మునిగిపోయారు.
ఆయనకు కనిపించేది ఏదో అదృశ్య స్వరూపం కాదు "మన కళ్లకు కనిపించని సత్యం" .
“గురుదేవా! మీరు దర్శిస్తున్న ఆ దివ్యరూపాన్ని మాకూ చూపించండి.” అని శిష్యులు రోజూ ప్రార్థించసాగారు.
ఒకరోజు అదే అదే విషయం అడిగారు శిష్యులు. ఆ కోరిక విని స్వామి హరిదాస్ కొంతసేపు మౌనంగా ఉన్నారు.
తరువాత శిష్యులను వెంటబెట్టుకుని నిధివనంలోని ఒక పవిత్ర ప్రదేశంలో ఆసీనులయ్యారు.
తంబురాను చేతిలోకి తీసుకున్నారు.
కళ్లను మూసి
“రాధే...”
మరోసారి...
“శ్యామా...”
ఈసారి...
“రాధే... శ్యామా...”
అంటూ నామాన్ని రాగయుక్తంగా పాడసాగారు...
ఆ స్వరం నిధివనాన్ని తాకింది.
కదంబ వృక్షాలను తాకింది.
యమునను తాకింది.
ఆకాశాన్ని తాకింది.
అప్పుడు..
ఒక అపూర్వమైన పరిమళం వ్యాపించింది.
వెన్నెల మరింత తెల్లగా మారింది.
గాలి ఒక్కసారిగా నిశ్చలమైంది.
శిష్యులు కళ్లెత్తి చూశారు.
అక్కడ...
రాధారాణి!
ఆమె పక్కన...
శ్యామసుందరుడు!
వర్ణించలేని సౌందర్యం.
చూడలేనంత మాధుర్యం.
శిష్యుల నోటి నుంచి మాట రాలేదు.
కళ్ల నుంచి మాత్రం కన్నీళ్లు ఆగలేదు.
స్వామి హరిదాస్ మాత్రం వారిని చూసి ఆశ్చర్యపడలేదు.
ఎందుకంటే ఆయనకు వారు కొత్తవారు కాదు.
ప్రతిరోజూ తన గానంలో ఆయన వారినే పిలిచేవారు. వారిముందే, వారికోసమే పాడేవారు.
ఆ రోజు మాత్రం
బృందావనం మొత్తం స్వామి హరిదాస్ కి శ్రీ యుగళం ఇచ్చే దర్శనానికి సాక్షిగా నిలిచింది.
స్వామి హరిదాస్ తన గానం ఆపి చేతులు జోడించి
“ప్రభూ!
మీరు నా కోసం వచ్చారు.
కానీ నా కోరిక నా కోసం కాదు.
ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికీ ఇలాంటి దివ్యదర్శనం సాధ్యం కాదు.
నా బృందావనానికి వచ్చే ప్రతి దీనుడికీ...
ప్రతి కన్నీటి భక్తుడికీ...
ప్రతి నామస్మరణ చేసే హృదయానికీ...
మీ కరుణ లభించాలి.
మీరు ఇక్కడే ఉండండి.
మమ్మల్ని విడిచి వెళ్లవద్దు.” అని కోరాడు
రాధారాణి చిరునవ్వు నవ్వింది.
శ్యామసుందరుడు తన భక్తుని వైపు చూశాడు.
ఆ దివ్యరూపాలు క్రమంగా ఒకదానిలో ఒకటి లీనమయ్యాయి.
రాధా...
శ్యామ...
రెండు రూపాలు...
ఒకే మాధురమైన రూపంగా మారాయి.
ఆ రూపమే "శ్రీ బాంకే బిహారీ!"
అది కేవలం ఒక మూర్తి ప్రకటింపబడడం కాదు.
భక్తి పిలిస్తే భగవంతుడు వస్తాడనే సత్యానికి బృందావనం ఇచ్చిన సజీవ సాక్ష్యం.
కాలం గడిచింది స్వామి హరిదాస్ బాంకే బిహారీలో లీనమైయ్యారు.
ఆయన సంగీతం ముగిసింది...
కానీ గానం ఇంకా వినిపిస్తూనే ఉంది
ఈరోజు కూడా నిధివనం వైపు గాలి వీచినప్పుడు...
చాలా జాగ్రత్తగా చెవులు రిక్కించి భక్తితో వింటే ఎవరికైనా వినిపించవచ్చు..
ఆ తంబురా నాదం...
ఆ మృదువైన ఆలాపన...
ఆ హృదయాన్ని కట్టేసే కృష్ణ నామ గానం...
“రాధే... శ్యామా...”
అది స్వామి హరిదాస్ గానమో...
యమునా అలల గుసగుసో...
బృందావనపు గాలి పలికే నామమో...
విడిగా చెప్పడం కష్టం?
కానీ ఒక విషయం మాత్రం నిజం...
భగవంతుణ్ణి స్వార్థం లేకుండా ప్రేమించిన హృదయానికి,
భగవంతుడు ఎప్పుడూ దూరంగా ఉండడు.
ఆయనను వెతకడానికి అడవులకు వెళ్లవలసిన అవసరం లేదు.
ఆయనను చూడటానికి కళ్లను మూసుకోవలసిన అవసరం లేదు.
ఒక్కసారి హృదయం నిజంగా “రాధే... శ్యామా...” అని పిలిస్తే చాలు.
ఎందుకంటే...
భక్తుడు దేవుణ్ణి పిలిచినప్పుడు,
దేవుడు రావాలా వద్దా అని ఆలోచించడు.
భక్తుని ప్రేమే ఆయనకు ఆహ్వానం.
భక్తుని హృదయమే ఆయనకు బృందావనం.
---
బృందావన కథలకు మంగళం
ఇలా యభై వ కథతో మన “బృందావన కథలు” యాత్ర ప్రస్తుతానికి ముగుస్తోంది.
కళ్ళతోచూసిన పదాలు మనసులోకి చేరి నిశ్శబ్దమవుతాయి.
పుస్తకాల్లో దూరి పుటలు మూసుకుపోతాయి.
కథలన్నీ ముగుస్తాయి, ఎవరి గాథలైనా కంచికే చేరతాయి.
ఐతే...
బృందావనం ఎప్పుడూ భక్తులకై తెరిచే ఉంటుంది.
రాధానామం మాత్రం ఆగదు.
యమున ప్రవహిస్తూనే ఉంటుంది.
కదంబాలు ఊగుతూనే ఉంటాయి.
నిధివనం తన రహస్యాన్ని దాచుకుంటూనే ఉంటుంది.
బాంకే బిహారీ తన మధురమైన చిరునవ్వుతో భక్తులను కాస్తూనే ఉంటాడు.
మనం ఈ కథలను చదివింది కేవలం గతాన్ని తెలుసుకోవడానికి కాదు.
మన హృదయంలో ఒక చిన్న బృందావనం నిర్మించుకోవడానికి.
అక్కడ...
కోపానికి చోటుండకూడదు.
అహంకారానికి చోటుండకూడదు.
ద్వేషానికి చోటుండకూడదు.
ఉండవలసింది ఒక్కటే—
రాధా...
కృష్ణా...
అనే రెండు నామాలు.
ఆ రెంటిమధ్య ఉండే ప్రేమ...
చివరగా...
మన జీవితంలో ఎన్నో జన్మలు గడిచినా,
ఎన్నో మార్గాలు తిరిగినా,
ఎన్నో సాధనలు చేసినా,
నిత్యం మన శ్వాసలో ఖచ్చితంగా
“రాధే... కృష్ణా...”
అనే నామం ఉండాలి.
అప్పుడు...
మన హృదయం కూడా బృందావనమే.
మన కన్నీరు కూడా యమునే.
మన నిశ్వాసం కూడా వేణునాదమే.
మన జీవితం కూడా...
రాధాశ్యాముల పాదపద్మాలకు ఒక చిన్న సేవే!
గట్టివాడవని పట్టితి నీ చేయి
పట్టి విడువరాదు కృష్ణా!
పుట్టినప్పటినుండి పుణ్యములెరుగను
పాపపు పనులే చేసితిని అట్టే
నా కర్మము అణచగ జాలక
పట్టితి నీ పాద పద్మములు కృష్ణా!
గట్టివాడవని పట్టితి నీ చేయి
పట్టి విడువరాదు కృష్ణా!
ఎన్ని జన్మలనో ఎత్తి అలసితిని
ఇకనైనా నన్ను బ్రోవగదే
అన్యమెరుగని దాసుడనయ్యా
నన్ను నీ దరి చేర్చుకోరాదా కృష్ణా!
గట్టివాడవని పట్టితి నీ చేయి
పట్టి విడువరాదు కృష్ణా!
ఈకృతితో మంగళం చెప్పుకుంటూ
జయ శ్రీరాధే!
జయ శ్రీకృష్ణ!
జయ బృందావన్!
రాధే రాధే!
- శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేంద్ర కుమార్)

No comments:

Post a Comment