"దేవతలకైనా దుర్లభమైనది బృందావన ధూళి"
జయ శ్రీరాధేకృష్ణ!
బంగారానికి విలువ ఉంది...
ముత్యాలకు విలువ ఉంది...
వజ్రాలకు విలువ ఉంది...
అవి మనిషిని ధనవంతుణ్ని చేయగలవు.
కానీ...
కృష్ణ భక్తిలోకంలో వాటన్నింటికంటే అమూల్యమైన ఒక సంపద ఉంది.
అది బంగారం కాదు...
అది మాణిక్యం కాదు...
అది రాజ్యమూ కాదు...
అది బ్రజరజస్సు... బృందావన ధూళి!
అది సాధారణ మట్టిలా కనిపించవచ్చు.
కానీ...
ప్రేమతో చూసే కన్నులకు...
అది మట్టి కాదు...
శ్రీశ్రీ రాధా-కృష్ణుల పాదరేణువులు.
అందుకే బ్రజధామంలో అడుగుపెట్టిన మహానుభావులు ముందుగా చేసే పని...
ఆ ధూళిని తలపై చల్లుకోవడం...
కళ్లకు అద్దుకోవడం...
హృదయానికి హత్తుకోవడం.
తమ వంటికి పూసుకోవడం.
ఆ మట్టిపై నందనందనుడు తన చిన్నిపాదాలతో పరుగులు తీశాడు...
ఆ మట్టిపై శ్రీరాధారాణి చరణకమలాలు విహరించాయి..
ఆ మట్టిపై గోపికల ప్రేమతోకూడిన కన్నీళ్లు ముత్యాల్లా జారాయి...
ఆ మట్టిపై గోపకులతో కలిసి ఆడుకున్న కృష్ణుని ఆటలు దాగున్నాయి...
ఆ మట్టిపై కృష్ణుడి కాచిన గోవుల గిట్టల ముద్రలు పడ్డాయి...
ఆ మట్టిపై కృష్ణుడు చేసిన అనేకానేక లీలల గాథలు ఇంకా సజీవంగా ఉన్నాయి...
ఆ రేణువులపై గోపబాలుర నవ్వులు, వేణునాదాలు, గోపికల రాసలీలలు కలిసిపోయాయి...
అందుకే...
అది మట్టి కాదు...
కృష్ణ ప్రేమకు తెఱగు...
కృష్ణ భక్తుల ప్రాణం...
వారి ముక్తికి మార్గం...
ఒకరోజు...
మథుర నుండి శ్రీకృష్ణుడు తన ప్రియసఖుడు, పరమ జ్ఞానియైన ఉద్ధవుడిని బృందావనానికి తన కుశల సందేశం చెప్పడానికి పంపాడు.
ఉద్ధవుడు గొప్ప జ్ఞాని.
సాక్షాత్తూ బృహస్పతికి శిష్యుడు.
వేదశాస్త్రాలలో నిష్ణాతుడు.
అటువంటి మహాజ్ఞాని బృందావనంలో అడుగుపెట్టిన క్షణం నుండి...
అతను చూసింది తాను శాస్త్రాలద్వారా తెలుసుకోనిది...
ప్రతి చెట్టు - పుట్టా "కృష్ణా..." అని నిట్టూరుస్తోంది.
ప్రతి లత ఆయన కోసం ఎదురు చూస్తోంది.
ప్రతి గోవు ఆయన దారినే చూస్తూ అంబారావం చేస్తున్నది.
ప్రతి గాలి వేణుగానాన్ని మోస్తోంది.
అక్కడి గోపికలను చూసిన ఉద్ధవుడు ఆశ్చర్యపోయాడు.
వారు కృష్ణుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ బాధతో ఏడవడం కాదు...
కృష్ణుడు చెప్పినవిధంగానే జీవిస్తున్నారు
కృష్ణుడు ఇష్టపడేవిధంగా జీవిస్తున్నారు
కాదు కాదు కృష్ణుడిగానే జీవిస్తున్నారు.
వారి శ్వాసలో కృష్ణుడు...
వారి చూపులో కృష్ణుడు...
వారి మాటల్లో కృష్ణుడు...
వారి కన్నీళ్లలో కృష్ణుడు...
వాళ్లను చూసినతరవాత, అంత జ్ఞానిఐన ఉద్ధవుడు మరింత వినయంతో కరిగిపోయాడు.
పరంపరగా వస్తున్న వేల సంవత్సరాల జ్ఞానాన్ని తాను తెలుసుకున్నా...
అది గోపగోపికలు, బృందావనం ఆ కృష్ణ పరమాత్మపై చూపే నిష్కల్మశమైన ప్రేమ ముందు తక్కువేనని తెలుసుకున్నాడు.
చివరకు ఆయన చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు—
ఆసామహో చరణరేణుజుషామహం స్యాం
వృన్దావనే కిమపి గుల్మలతౌషధీనామ్!
యా దుస్త్యజం స్వజనమార్యపథం చ హిత్వా
భేజుర్ముకున్దపదవీం శ్రుతిభిర్విమృగ్యామ్!!
(శ్రీమద్భాగవతం 10.47.61)
"అయ్యో! ఈ గోపికల పాదరేణువును పొందే భాగ్యం నాకు కలిగితే ఎంత ధన్యుడనయ్యేదాన్ని! వారు నడిచే బృందావనంలో ఒక చిన్న గడ్డిమొక్కగా, ఒక లతగా, ఒక ఔషధిగా పుట్టినా చాలు. వారి పాదధూళి నాపై పడుతుంది."
జ్ఞానానికి ప్రతీక అయిన ఉద్ధవుడు...
స్వర్గాన్ని కోరుకోలేదు.
వైకుంఠాన్ని అడగలేదు.
ఒక్క చిటికెడు బ్రజరజస్సును మాత్రమే కోరుకున్నాడు.
---
మరో సందర్భంలో...
సకల కామనలనూ జయించిన పరమశివుడికీ బృందావనంలో జరిగే రాసలీలను చూడాలి... అనే కోరిక కలిగింది...
కానీ...
అది అందరికీ లభించే భాగ్యం కాదు. సమస్తాన్నీ నియంత్రించగల శివుడే ఐనా లోకాచారప్రియుడైన కారణాన
శ్రీరాధాదేవి అనుమతితో గోపికా రూపాన్ని ధరించి...
బృందావనంలో ప్రవేశించి రాసలీలలను స్వయంగా దర్శించాడు...
నేటికీగోపేశ్వర మహాదేవుడుగా అక్కడే నిలిచి ఉన్నాడు.
బ్రజధామ మహాత్మ్యాన్ని కాపాడడానికే కాదు...
బ్రజరజస్సును తన శిరస్సుపై ధరించడానికి కూడా.
సృష్టికర్త బ్రహ్మదేవుడే...
ఒకప్పుడు తన పదవిపై, త్నకున్న జ్ఞానంపై గర్వించాడు.
గోపబాలులను, గోవులను అపహరించి శ్రీకృష్ణుని పరీక్షించాలని చూశాడు.
కానీ...
కృష్ణుని అనంత వైభవాన్ని దర్శించిన తరువాత...
ఆయన అహంకారం కరిగిపోయింది.
బ్రజభూమిలోని ఒక్క రేణువు కూడా బ్రహ్మలోక వైభవానికంటే గొప్పదన్న సత్యం అవగతమైంది.
ఈ యుగంలోనూ ...
ఎందరో భక్తులు బృందావనంలో అడుగుపెట్టారు బ్రజధూళిని తమ నెత్తిన వేసుకున్నారు.
శ్రీకృష్ణచైతన్య మహాప్రభువు
యమునాతీరంలో...
గోవర్ధన సమీపంలో...
బృందావన ధూళి కనిపించగానే...
ఆయన ఒక్కసారిగా నేలపై సాష్టాంగంగా పడ్డారు.
ఆ ధూళిని గుండెలకు పూసుకున్నారు.
కళ్లకు అద్దుకున్నారు.
భక్తులు ఆశ్చర్యంగా చూస్తుండగా
"ఇది ధూళి కాదు...
నా గోపాలుడి పాదరేణువు...
నా రాధారాణి చరణస్పర్శతో పవిత్రమైన బ్రజరజస్సనే అమృతం..." అనేవారు.
నేటికీ...
బృందావనానికి వెళ్లే భక్తులు...
అక్కడి నుండి బంగారం తీసుకురారు...
రత్నాలు తీసుకురారు...
పట్టు వస్త్రాలు తీసుకురారు...
బొమ్మలో, మరే కానుకలో తీసుకురారు...
ఒక్క పిడికెడు...
బ్రజరజస్సు తీసుకొస్తాడు.
అది ఇంట్లో అలంకరించడానికి కాదు...
హృదయంలో నిలుపుకోడానికి.
ఆ బ్రజరేణువులను నుదుటిపై ధరించినప్పుడు...
తన మనసు వినయాన్ని నేర్చుకుంటుంది.
ఆ బ్రజరేణువులను కళ్లకు అద్దుకున్నప్పుడు...
తన దృష్టి పవిత్రమవుతుంది.
ఆ బ్రజరేణువులను హృదయానికి పూసుకున్నప్పుడు...
రాధా-కృష్ణుల ప్రేమ తన హృదయంలో చిగురిస్తుంది.
బ్రజరజస్సు మామూలు మట్టి కాదు.
అది శ్రీశ్రీ రాధా-కృష్ణుల చరణస్పర్శతో పవిత్రమైనపరమతీర్థం.
ఆ ధూళిని గౌరవించే హృదయంలోవినయం పుడుతుంది.
వినయం ఉన్న చోటభక్తి వికసిస్తుంది.
భక్తి వికసించిన చోటప్రేమ పుష్పిస్తుంది.
ప్రేమ వికసించిన హృదయంలో...
శ్రీశ్రీ రాధా-కృష్ణులు శాశ్వతంగా నివసిస్తారు.
బ్రజరజస్సును శిరస్సుపై ధరించడం - దాని మహిమను హృదయంలో ధరించడం.
ఈ రెండూ బృందావన రాధాకృష్ణ భక్తుల నిత్య నియమం.
జయ జయ శ్రీరాధే!
జయ జయ శ్యామసుందర!
జయ జయ శ్రీ బృందావన్!
- శంకరకింకరః
No comments:
Post a Comment