Pages

Friday, August 14, 2026

శ్రీమాత లీలామృతం – 7 (లోపాముద్రాగస్త్యుల కరవీరపుర యాత్ర )

శ్రీ గురుమూర్తే త్వాం నమామి కామాక్షి!


దక్షిణ దిక్కున ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ, పవిత్ర తీర్థాలను సేవిస్తూ, ఎన్నో దివ్యస్థలాల మహిమను అనుభవిస్తూ అగస్త్య మహర్షి తన ధర్మపత్నియైన లోపాముద్రతో కలిసి యాత్ర సాగిస్తున్నాడు. ఎన్నో పుణ్యక్షేత్రాల ధూళిని తమ పాదాలకు తాకించుకున్న ఆ మహాతపస్వి దంపతులు, అనేక తీర్థాల పవిత్ర జలాలను స్పృశిస్తూ సాగిపోతూ, ఒకానొక రోజు కరవీరపుర పావన భూమికి చేరుకున్నారు.


కరవీరపుర సరిహద్దుల్లోకి అడుగుపెట్టగానే అగస్త్యుని అడుగులు నెమ్మదించి ఒక్క క్షణం ఆగిపోయాయి. పరిసరాల వైపు చూస్తే బాహ్యంగా ఏ విశేషమూ కనిపించలేదు. అదే ఆకాశం, అదే నేల, అవే చెట్లు, అదే గాలి. అయినా ఆ నేలలో ఏదో చెప్పలేని పవిత్రత తొణికిసలాడుతోంది. కంటికి కనిపించని ఏదో ఒక దివ్యశక్తి ఆ ప్రాంతమంతటినీ తన వాత్సల్యపుటొడిలోకి తీసుకున్నట్లు అనిపించింది. ఎన్నో పుణ్యతీర్థాలను దర్శించిన ఆ మహర్షి అంతరంగానికే ఆ అనుభూతి ఎంతో అపురూపంగా, కొత్తగా తోచింది.


మంత్రద్రష్టయైన లోపాముద్ర కూడా ఆ నిశ్శబ్దంలో దాగివున్న మాధుర్యాన్ని గ్రహించింది. కొద్దిసేపు నిశ్చలంగా నిలబడి, తన చుట్టూ ఉన్న ఆ దివ్య వాతావరణాన్ని ఆస్వాదిస్తూ భర్తతో మెల్లగా అన్నది:


“నాథా! మనం ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించాం. ఎందరో మహర్షుల తపోభూములను చూశాం. ఎన్నో దేవాలయాల్లో సాక్షాత్తు దైవసాన్నిధ్యాన్ని అనుభవించాం. కానీ ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచే నా హృదయంలో ఏదో తెలియని ప్రశాంతత అలుముకుంది. ఈ గాలిలోనే ఏదో ఒక పవిత్రమైన పరిమళం ఉంది. ఈ నేల మన పాదాలను తాకడం కాదు... మన అంతరంగాన్నే తాకుతున్నట్లుంది. ఈ భూమి సాధారణమైనది కాదనిపిస్తోంది.”


అగస్త్య మహర్షి ఆమె మాటలు విని చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో చిరపరిచితమైన ఆనందం కనిపించింది. ఎన్నాళ్లుగానో వెతికిన తనవారి సన్నిధిని తిరిగి చేరుకున్న భక్తుడి ప్రశాంతత ఆయన ముఖంలో మెరిసింది.


“లోపాముద్రా! నీ హృదయం ఈ నేల మహిమను ముందే గుర్తించింది. కొన్ని క్షేత్రాలను మనం వెతుక్కుంటూ వెళ్లి దర్శిస్తాం; కానీ కొన్ని దివ్యక్షేత్రాలు మాత్రం మన అంతరంగాన్ని తామే దర్శించి, తమ వైపునకు ఆకర్షించుకుంటాయి. ఈ కరవీరపురం అలాంటి పుణ్యభూమి,” అంటూ కొద్దిసేపు మౌనంగా ఉండి, భక్తితో ఆ నేలను చూస్తూ కొనసాగించాడు:


“ఇది కేవలం మట్టితో కూడిన సాధారణ భూమి కాదు లోపాముద్రా. దేవతలకూ, మహర్షులకూ, భక్తులకూ పరమపావనమైన కరవీర క్షేత్రమిది. ఇక్కడ జగన్మాత శ్రీ మహాలక్ష్మి స్వయంగా కొలువై తన దివ్యసాన్నిధ్యాన్ని ప్రసాదించింది. ఆమె పాదస్పర్శతో పునీతమైన ఈ నేలలోని ప్రతి రేణువులోనూ, వీచే ప్రతి గాలివీచికలోనూ ఆమె కరుణ నిండివుంది. ఈ క్షేత్రాన్ని ఆశ్రయించే ప్రతి భక్తుని హృదయంలోనూ ఆమె మౌనంగా ఏదో ఒక దివ్య భావాన్ని పలికిస్తూనే ఉంటుంది.”


లోపాముద్ర పరమభక్తితో, వినమ్రంగా ఆ పుణ్యక్షేత్రానికి తలవంచి “అయితే నాథా... ఈ కరవీరానికి ఇంతటి మహిమ ఎలా కలిగింది? జగజ్జననియైన ఆ మహాలక్ష్మి తల్లి ఇక్కడే ఎందుకు కొలువైందో నాకు వివరంగా చెప్పండి,” అని కోరింది.


అగస్త్యుని చూపు విశాలంగా విస్తరించి ఉన్న ఆ పవిత్ర క్షేత్రం వైపు మళ్లింది.


“అది ఒక మహత్తరమైన కథ లోపాముద్రా. ఒకప్పుడు ఈ నేలపై అహంకారం తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. అదే అహంకారం చివరకు తల్లి పాదాల వద్ద నిండు శరణాగతిగా మారింది. ఆ శరణాగతికి సాక్షిగా నిలిచిన ఈ కరవీర భూమినే తల్లి తన నివాసంగా స్వీకరించింది.”


లోపాముద్ర ఎంతో ఆసక్తిగా అగస్త్యుని ముఖం వైపు చూస్తూ వినసాగింది.


అగస్త్యుడు ప్రశాంతమైన స్వరంతో “విను లోపాముద్రా... కరవీరంలో తల్లి ఎలా కొలువైందో చెబుతాను. పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని కొల్హాసురుడు అనే రాక్షసుడు పరిపాలించేవాడు. అతడు ఘోర తపస్సు చేసి ఎన్నో వరాలను పొందాడు. కానీ శక్తి చేతికి వచ్చినప్పుడు అహంకారానికి లోనయ్యాడు. బలం పెరిగినప్పుడు వివేకం నశిస్తుంది. లోకంలో తనకు ఎదురునిలబడగలవారు ఎవరూ లేరని భావించాడు. దేవతలను, మునులను, ప్రజలను నానా బాధలకు గురిచేయడం మొదలుపెట్టాడు. అతని పేరు వింటేనే లోకాలు భయంతో వణికిపోయేవి.”


లోపాముద్ర ఆశ్చర్యంతో, “అంతటి అధర్మాన్ని చూస్తూ దేవతలు ఊరుకున్నారా నాథా? వారేమీ చేయలేకపోయారా?” అని అడిగింది.


“తమ తమ శక్తులన్నీ ఒడ్డి ప్రయత్నించారు లోపాముద్రా. కానీ కొన్నిసార్లు సమస్యను స్వశక్తితో ఎదుర్కోవడం సాధ్యం కాదు. అటువంటి విపత్కర సమయాల్లో సర్వశక్తులకూ మూలమైన ఆ జగన్మాతనే శరణువేడాలి,” అని అగస్త్యుడు చెప్పాడు.


“అంటే దేవతలందరూ ఆ శక్తిస్వరూపిణియైన జగజ్జననిని ప్రార్థించారా?” అని ఉపాసనా ముద్రల అంతరార్థాన్ని ఎరిగిన లోపాముద్ర కళ్ళు విప్పార్చి అడిగింది.


“అవును. వారి ప్రార్థనలో ఎలాంటి కపటమూ లేదు. తమ పదవులపై గర్వం లేదు, తమ శక్తిపై అహంకారం లేదు. తమ చేతులతో సాధ్యం కాని లోకరక్షణ భారాన్ని తల్లి చేతుల్లో పెట్టారు. వారి హృదయాల నుంచి ఒకే ఆర్తనాదం వినిపించింది—‘అమ్మా! దుష్టశిక్షణ చేసి ధర్మాన్ని రక్షించు, లోకాలను కాపాడు!’ అని.”


అగస్త్యుని స్వరం మరింత గంభీరమైంది.


“ఆ పిలుపు తల్లి హృదయానికి చేరడానికి ఎంతో సమయం పట్టలేదు. జగన్మాత శ్రీ మహాలక్ష్మి రూపంలో కరవీరపురానికి తరలివచ్చింది. ఆమె రాక చిమ్మచీకట్లను తరిమివేసే ఉదయసూర్యుడి కాంతిలా ప్రకాశించింది. కొల్హాసురుడు అహంకారంతో తన బలాన్ని నమ్ముకున్నాడు; తల్లి మాత్రం ముల్లోకాల సాధుజీవుల రక్షణే ధ్యేయంగా ధర్మబలంతో నిలిచింది. యుద్ధం భీకరంగా జరిగింది. చివరకు మహాలక్ష్మి చేతిలో కొల్హాసురుడు నేలకూలాడు.”


లోపాముద్ర కళ్లు మూసుకుని ఆ దృశ్యాన్ని మనసులో ప్రత్యక్షంగా జరుగుతున్నట్లు ఊహించుకుంది.


“అంతటితో కథ ముగిసిందా నాథా?” అంది ఒక ఊరటతో కూడిన నిట్టూర్పు విడుస్తూ...


అగస్త్యుడు తల ఊపుతూ, “లేదు లోపాముద్రా. అసలైన కథ అక్కడే మొదలైంది,” అన్నాడు.


“అదేమిటి నాథా? అలా ఎలా?” అంది లోపాముద్ర.


“ప్రాణాలు పోయే చివరి క్షణంలో కొల్హాసురుని హృదయంలో అనూహ్యమైన మార్పు వచ్చింది. జీవితమంతా తాను ఏ అహంకారంతో విర్రవీగాడో, ఏ అధర్మ పనులు చేశాడో అన్నీ గుర్తొచ్చాయి. తాను ఏ ధర్మాన్నైతే ఎదిరించాడో, ఆ ధర్మస్వరూపమే ఇప్పుడు జగన్మాతగా తన ఎదుట నిలిచివుందని అతడు గ్రహించాడు. తన బలం, తన గర్వం, తన వరాలు అన్నీ ఒక్క క్షణంలో నిరర్థకమైపోయాయి.”


అగస్త్యుడు కాసేపు మౌనంగా ఉండి, ఆ దృశ్యాన్ని అనుభూతి చెందుతూ మళ్లీ ప్రారంభించాడు:


“నేలపై సత్తువలేక పడివున్న కొల్హాసురుడు తల్లి వైపు చూశాడు. ఆ చూపులో ఇక క్రూరత్వం లేదు; పోరాడాలనే ఆలోచన లేదు; గర్వం, అహంకారం సమసిపోయాయి. కేవలం హృదయపూర్వకమైన పశ్చాత్తాపం మాత్రమే మిగిలింది.”


లోపాముద్ర ఆర్ద్రతతో, “అప్పుడు తల్లి ఏమి చేసింది నాథా? అతనితో ఏమంది?” అని అడిగింది.


“తల్లి కరుణ నిండిన కళ్లతో మౌనంగా అతని వైపు చూసింది.”


“అప్పుడతడు?”


“‘అమ్మా! జీవితమంతా అహంకారంతో దేవతలను, మానవులను పీడించాను. ధర్మస్వరూపిణివైన నిన్నే ఎదిరించాను. నా బలం నన్ను కాపాడుతుందని విర్రవీగాను. కానీ ఇప్పుడు ప్రాణం పోయే సమయంలో తెలిసొచ్చింది... నీ ముందు నా బలమంతా సాయంత్రపు నీడ లాంటిది. నిన్ను జయించగలననుకున్న నా అహంకారమే నా అసలైన శత్రువు. నా చేతులతో చేసిన పాపాలకు తగిన ఫలితం అనుభవించాను. ఇప్పుడు నిన్ను వేడుకునే అర్హత కూడా నాకు లేదు. జీవితమంతా నీకు దూరంగా పరుగెత్తాను; చివరకు మరణం నన్ను నీ పాదాల దగ్గరకే తీసుకొచ్చింది. అయినా... నీవు విశ్వానికే తల్లివి కదా! తల్లి ముందు నిలిచిన బిడ్డకు అర్హతలతో పనేముంటుంది? నన్ను కరుణించు!’ అని వేడుకున్నాడు.”


లోపాముద్ర కళ్లలో నీళ్లు తిరిగాయి. శ్రద్ధగా వినసాగింది.


అగస్త్యుడు కొనసాగిస్తూ “కొల్హాసురుడు ఒక వరాన్ని కోరాడు: ‘అమ్మా! నన్ను క్షమించమని అడగడం లేదు. నా పాపాలకు తగిన శిక్ష నాకు లభించింది. కానీ ఒక వరం మాత్రం అనుగ్రహించు. నీవు ఈ భూమిని విడిచి వెళ్లవద్దు. నా పేరు ఈ క్షేత్రంతో శాశ్వతంగా కలిసిపోవాలి. నీవు ఇక్కడే కొలువై ఉండి, నీ దర్శనానికి వచ్చే భక్తులందరినీ కరుణించు’ అని ప్రార్థించాడు.”


“తల్లి ఆ కోరికను అంగీకరించిందా నాథా?”


అగస్త్యుని ముఖంలో చిరునవ్వు విరిసింది. “అదే కదా జగజ్జననియైన శ్రీ మహాలక్ష్మి తల్లి అపార మహిమ! ఆ తల్లి అతని పూర్వపాపాలను, క్రౌర్యాన్ని సమర్థించలేదు. కానీ చివరి క్షణంలో అతని హృదయంలో పుట్టిన నిష్కల్మషమైన పశ్చాత్తాపాన్ని మాత్రం తిరస్కరించలేదు. నిజమైన పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి ఉండదు. తల్లి అతని కోరికను మన్నించింది. అప్పటి నుంచి ఈ పుణ్యభూమి ‘కొల్హాపురం’గా ప్రసిద్ధి చెందింది. ఆ దేవి కరవీరనివాసినిగా, కొల్హాపుర మహాలక్ష్మిగా భక్తుల హృదయాల్లో శాశ్వతంగా కొలువైంది.”


లోపాముద్ర నెమ్మదిగా, “నాథా! ఎంతటి విచిత్రమైన మాతృహృదయం! ఒక చేత్తో దుష్టశిక్షణ చేస్తూనే, మరొక చేత్తో అభయకరుణలను కురిపించే వరదాభయ ప్రదాయిని జగన్మాత!” అంది.


అగస్త్యుడు నవ్వుతున్న కళ్ళతో ఆమె వైపు చూశాడు. “నిజమే లోపాముద్రా. మాతృత్వం అంటే బిడ్డలు చేసిన తప్పులను సమర్థించడం కాదు. దారితప్పిన బిడ్డ తిరిగి తన వైపు వచ్చినప్పుడు, ఆ బిడ్డను హృదయానికి హత్తుకుని అక్కున చేర్చుకోవడం.”


కొద్దిసేపు అక్కడ దివ్యమైన నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ “అందుకే తల్లి ముందు మనం మన గొప్పతనాన్ని చూపించాల్సిన అవసరం లేదు. మన హృదయం ఎలా ఉందో అలాగే ఆమె ఎదుట ఉంచాలి. సర్వాంతర్యామి అయిన ఆమె ముందు మనం నటించలేం. మన నోటి మాటలు ఆమెకు వినిపించకముందే మన అంతరంగం స్పష్టంగా కనిపిస్తుంది,” అన్నాడు అగస్త్యుడు.


లోపాముద్ర తదేకధ్యానంతో వింటోంది. 


“తల్లి వద్దకు రావడానికి ఎంత ఆలస్యమైనా ఫర్వాలేదు... తన గడప దాకా వచ్చిన బిడ్డను ఏ తల్లీ గుమ్మం దగ్గరే నిలబెట్టి ఉంచదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి ‘తల్లి ఎలాగూ క్షమిస్తుంది కదా’ అని తెలిసి తెలిసి తప్పు చేస్తూ ఉండటం భక్తి అనిపించుకోదు. తల్లి పాదాల దగ్గర నిజంగా నిలబడినప్పుడు, మనలోని తప్పే మనకు భారంగా అనిపించాలి. కొల్హాసురునికి చివరి క్షణంలో అదే జరిగింది. అందువల్లే అతని పేరుతో ఇంతటి గొప్ప క్షేత్రం నిలిచింది.”


---


ఇద్దరూ అడుగులు వేస్తూ ఆలయానికి చేరువయ్యారు.

ఆలయం సమీపిస్తున్న సంకేతంగా దూరంగా ఘంటానాదం వినిపిస్తోంది. వేదఘోష గాలిలో తేలుతూ చెవులను తాకుతోంది. భక్తుల నోళ్లలో “అంబాబాయి... అంబాబాయి...” అనే నామస్మరణ చిన్న అలల తాకిడిలా ఎంతో మధురంగా వినిపిస్తోంది.


ఆలయం చేరి గర్భగుడికి చేరుకున్న అగస్త్య మహర్షి లోపాముద్రతో కలిసి నిశ్చలుడై నిలబడి అమ్మవారిని దర్శించాడు. ఆ దివ్య మంగళమూర్తిని చూసిన క్షణంలో ఆయన కళ్లు చెమ్మగిల్లాయి; తీవ్రమైన భావోద్వేగం ఆయన్ను ముంచెత్తింది.


లోపాముద్ర భర్తను అనునయిస్తూ ఆయన చేతిని పట్టుకుని, “నాథా...?” అంది. అగస్త్యుడు బదులు చెప్పలేదు. ఆయన చూపు జగన్మాత ముఖంపైనే నిలిచిపోయింది.


ఆ ముఖంలో అంతులేని కరుణ ఉంది.

ఆ నేత్రాల్లో అనంతమైన శాంతి ఉంది.

ఆ చేతుల్లో విశ్వాన్ని నడిపించే శక్తి ఉంది.

ఆమె సన్నిధిలో చెప్పలేనంత గంభీరమైన మాధుర్యం ఉంది.

అగస్త్యునికి ఒక్కసారిగా ‘ఈ సమస్త సృష్టినీ తన శక్తితో నడిపించే తల్లి, భక్తుల కోసం తన వైభవాన్నంతా పక్కన పెట్టి ఒక సాధారణ తల్లిలా ఇక్కడ ఎందుకు కూర్చుంది?’ అనిపించింది.


వెంటనే "అమ్మ" అనే పదం స్ఫురించింది. ఆ స్ఫురణ రాగానే ఆయన చేతులు వాటంతట అవే జోడించబడ్డాయి. “అమ్మా!” అన్న ఒక్క పిలుపుతో మహర్షి తన సర్వస్వాన్నీ ఆ తల్లి పాదాల వద్ద సమర్పించుకున్నాడు.


లోపాముద్ర కూడా అమ్మవారి ముందు నిలిచింది. ‘తాను తల్లిని చూడడం కాదు; ఆ తల్లే తనను చూస్తోందన్న’ అనిర్వచనీయమైన భావన ఆమెలో కలిగింది.


కొంతసేపటి తర్వాత అగస్త్యుడు మెల్లగా “లోపాముద్రా! మనం తల్లిని చూడడానికి వచ్చాం అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తోంది... మనం ఎప్పుడూ ఆమె చూపుల పరిధిలోనే ఉన్నామని. తల్లి దృష్టి ఎప్పుడూ బిడ్డల మీదే ఉంటుంది కదా!” అన్నాడు.


“మీరెలా గుర్తించారు నాథా!” అంది లోపాముద్ర.


“మనిషి దేవుణ్ణి దర్శించడానికి వెళ్తాడు. కానీ దేవుని ఎదుట నిలబడిన క్షణంలో తన అసలు స్వరూపం తనకే కనిపిస్తుంది. తల్లి చూపు నిర్మలమైన అద్దం లాంటిది. అందులో మన బాహ్య ముఖం కాదు, మన హృదయం కనిపిస్తుంది.”


అగస్త్యుడు అమ్మవారికి భక్తితో నమస్కరించాడు. ఆయన హృదయంలో మహాలక్ష్మి స్తుతి ఉప్పొంగింది:


జయ పద్మపలాశాక్షి జయ త్వం శ్రీపతిప్రియే!

జయ మాతర్మహాలక్ష్మి సంసారార్ణవతారిణి !!

మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి !

హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే !!

పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే!

సర్వభూతహితార్థాయ వసువృష్టిం సదా కురు!!

జగన్మాతర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే!

దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోఽస్తు తే !!

నమః క్షీరార్ణవసుతే నమస్త్రైలోక్యధారిణి !

వసువృష్టే నమస్తుభ్యం రక్ష మాం శరణాగతం!!


అంటూ స్తుతించి, అగస్త్యుడు కళ్లు మూసుకుని “అమ్మా! లోకమంతా నీ దగ్గరకు ఏదో ఒకటి అడగడానికే వస్తుంది. కొందరు ధనం అడుగుతారు, కొందరు సంతానం కోరుతారు, కొందరు ఆరోగ్యం అడుగుతారు, కొందరు కష్టాలు తీరాలని వేడుకుంటారు. వారి కోరికలన్నీ నీవు వింటావు. కానీ తల్లీ! నీ సన్నిధిలో కొంతసేపు నిలబడిన తర్వాత, మనిషి తన కోరికలనే మరిచిపోతాడు. ఎందుకంటే నీ ముఖంలో కనిపించే ఆ మాతృవాత్సల్యం ముందు మేం అడగబోయే వరాలన్నీ చాలా చిన్నవైపోతాయి.” అన్నాడు.


లోపాముద్ర కళ్లలో నీళ్లు నిండాయి “అమ్మా! నాకేం కావాలో కూడా నాకు తెలియడం లేదు. నాకు సుఖం కావాలో, ఐశ్వర్యం కావాలో, శాంతి కావాలో ఏదీ తేల్చుకోలేకపోతున్నాను. ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత నాలో ఒకటే కోరిక కలుగుతోంది ‘శ్రీమాతవైన నిన్ను మరచిపోయే జీవితం మాత్రం నాకు ఇవ్వవద్దు తల్లీ!’”


అగస్త్యుడు చిరునవ్వు నవ్వి, “లోపాముద్రా! నీవు అడిగినదే అన్నిటికన్నా గొప్ప వరం. ధనం అడిగితే అది ఒక జన్మకే తోడుంటుంది; సుఖం కోరితే అది కాలంతో పాటు మారిపోతుంది. కానీ తల్లి స్మరణను వేడుకుంటే, జీవుడు ఎక్కడ ఉన్నా ఆ తల్లి రక్షణ అతనితోనే ఉంటుంది.”


ఆ సమయంలో ఆలయంలో మంగళహారతి ప్రారంభమైంది.

కర్పూర జ్యోతి వెలిగింది.

ఆ చిన్న జ్వాల అమ్మవారి ముఖం ముందు దేదీప్యమానంగా వెలుగుతోంది.

అమ్మవారి కళ్లలో ఆ హారతి కాంతి మెరిసింది.

లోపాముద్ర ఆ దృశ్యాన్ని చూస్తూ మైమరచిపోయింది.

“నాథా... లోకాలన్నిటికీ వెలుగునిచ్చే తల్లికి, మనిషి చేతిలోని ఈ చిన్న దీపం ఎంత స్వల్పమైన హారతి కదా!” అన్నది.


అగస్త్యుడు మృదువుగా నవ్వి “తల్లికి ఆ హారతి దీపం వెలుగు అవసరం లేదు లోపాముద్రా. ఆ హారతి దీపం వెలిగించే మన మనసులకే ఆ జ్ఞానపు వెలుగు కావాలి,” అన్నాడు.


ఆ మాట లోపాముద్ర హృదయంలో లోతుగా నాటుకుపోయింది.


శరణ్యే త్వాం ప్రపన్నోఽస్మి కమలే కమలాలయే!

త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణపరాయణే !!

పాండిత్యం శోభతే నైవ న శోభంతి గుణా నరే !

శీలత్వం నైవ శోభేత మహాలక్ష్మి త్వయా వినా!!


ఆ తర్వాత అగస్త్యుడు కొల్హాపుర మహాలక్ష్మి క్షేత్రంలో జరిగే కిరణోత్సవం గురించి కూడా అగస్త్యుడు ఆమెకు వివరించాడు:


“ఇక్కడ ఒక అద్భుతం ఉంది లోపాముద్రా. సంవత్సరంలోని కొన్ని నిర్దిష్ట రోజుల్లో సూర్యుని కిరణాలు ఆలయ నిర్మాణంలోని ప్రత్యేక మార్గం గుండా ప్రయాణించి, గర్భగుడిలోని తల్లి పాదాలను తాకుతూ మొత్తం మంగళమూర్తిని బంగారు కాంతులతో అలంకరిస్తాయి.”


లోపాముద్ర ఆశ్చర్యంతో, “ఆకాశంలో ఉన్న సూర్యుని కిరణాలే స్వయంగా వచ్చి తల్లి పాదాలను తాకుతాయా?” అంది.


“అవును. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు భక్తులు పరవశించిపోతారు. సూర్యుడు ప్రతిరోజూ ఉదయిస్తాడు, ప్రతిరోజూ అస్తమిస్తాడు. కానీ ఆ రోజుల్లో మాత్రం ఆయన ప్రయాణమే ఒక నిశ్శబ్ద పూజగా మారుతుంది. ఆకాశం నుంచి జారిన బంగారు కిరణాలు ఆలయ ద్వారాల గుండా, రాతి నిర్మాణాల మధ్యగా ప్రయాణించి, చివరకు తల్లి దివ్యమూర్తిని తాకుతాయి.


అది చూసిన భక్తునికి—‘తల్లీ! పూలు తెచ్చే స్తోమత లేని భక్తుడికి నీవు పువ్వును ఇచ్చావు. దీపం వెలిగించలేని వాడికి నీవే సూర్యుడిని ఇచ్చావు. మేము చేతిలో చిన్న దీపంతో నీకు హారతి ఇస్తుంటే, నిన్ను దర్శించడానికి ఆకాశమే తన బంగారు కిరణాలను పూలదండగా అల్లుకుని పంపుతోందా!’ అనే సహజ భావన కలుగుతుంది.


సూర్యకిరణం తల్లి మూర్తిని తాకిన ఆ క్షణం కేవలం వెలుగు కాదు; తన తల్లిని సేవించడానికి సూర్యుడు వచ్చి పాదసేవ చేస్తూ జరిపే సంభాషణలా అనిపిస్తుంది.


సూర్యుడు—తన వెలుగుతో,

భక్తుడు—తన కన్నీటితో,

పూజారి—తన మంత్రంతో,

పువ్వు—తన పరిమళంతో,

దీపం—తన జ్యోతితో...


అందరూ తమకు చేతనైన రీతిలో ఆ ఒక్క తల్లినే చేరుకుంటున్నారు.


లోపాముద్రా! ప్రకృతిలోని ప్రతి కణమూ తల్లి సన్నిధిలో తనదైన భాషలో పూజ చేస్తోంది. మనిషి మాత్రం తన హృదయపూర్వకమైన భావంతో పూజ చేయడం నేర్చుకోవాలి,” అని అగస్త్యుడు ఉపదేశించాడు.


---


సూర్యుడు పడమటి ఆకాశంలోకి వాలుతుండగా.

కరవీరంపై సాయంత్రపు కాంతి పరుచుకుంది.

అగస్త్యుడు, లోపాముద్ర ఇద్దరూ ఆలయం బయటకు వచ్చారు.

కొంతదూరం వెళ్లిన తర్వాత లోపాముద్ర వెనక్కి తిరిగి చూసింది.

“నాథా! మనం ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక క్షేత్రాన్ని చూడాలని వచ్చాము. ఇప్పుడు వెళ్తుంటే... ఏదో మనలో వదిలిపెట్టి, మనసు నిండుగా వెళ్తున్నట్లుంది,” అన్నది.


అగస్త్యుడు చిరునవ్వు నవ్వి, “అదే తల్లి ప్రసాదం లోపాముద్రా!” అన్నాడు.

“ఏమిటది నాథా?” అన్నది లోపాముద్ర.

“తల్లి మన చేతిలో ఏదో ఒక వస్తువును పెట్టి పంపాల్సిన పనిలేదు. కొన్నిసార్లు ఆమె మన హృదయంలో పేరుకుపోయిన భారాన్ని తీసుకుపోతుంది.” అన్నాడు అగస్త్యుడు

“ఏమి తీసుకుపోతుంది?” అని అడిగింది లోపాముద్ర.

“భయం, అహంకారం, ‘నేనే చేశాను, నా అంతటివాడు లేడు’ అనే భావాన్ని తీసుకుపోతుంది.” అని చెప్పాడు అగస్త్యుడు

“మరి దానికి బదులుగా ఏమిస్తుంది నాథా?” అనడిగింది లోపాముద్ర.


//“‘అమ్మ ఉంది’ అనే ఒక్క తిరుగులేని నమ్మకాన్ని ఇస్తుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ” అన్నాడు అగస్త్యుడు//


ఆ మాట విన్న లోపాముద్ర కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె చేతులు జోడించి వెనక్కి తిరిగి కరవీర మహాలక్ష్మికి నమస్కరిస్తూ “అమ్మా! మేము నీ వద్దకు వచ్చి ఎన్నో విషయాలు అడగాలని అనుకున్నాము. నువ్వు మాత్రం మేము ఏమీ అడగకుండానే మా హృదయాన్ని పరిపూర్ణమైన శాంతితో నింపావు,” అని వేడుకుంది.


అగస్త్యుడు మృదువుగా “తల్లిని దర్శించిన తర్వాత మనం కోరుకున్నది లభించిందా లేదా అని చూడకూడదు; మన ఆలోచనల్లో మార్పు వచ్చిందా లేదా అని చూసుకోవాలి. అదే నిజమైన దర్శనఫలం,” అన్నాడు.


---


కరవీరపురంలో వెలసిన కొల్హాపుర మహాలక్ష్మి కథ అందుకే కేవలం ఒక రాక్షసుని సంహారగాథ కాదు.

అది అహంకారం చివరి క్షణంలో శరణాగతిగా మారిన కథ.

అది ఒకేసారి తల్లి చేతిలోని శక్తిని, అదే చేతిలోని కరుణను రెండింటినీ చూపించిన కథ.

అది ఒక మహర్షి కళ్లలో తల్లి దివ్యరూపాన్ని నిలిపిన కథ.

అది ఒక భక్తురాలి హృదయంలో “నీవే చాలు” అనే భావాన్ని మేల్కొల్పిన కథ.

అందుకే కొల్హాపురానికి వెళ్లే ప్రతి భక్తుడు తల్లి ముందు నిలబడి ఒక్కసారైనా “అమ్మా! నేను ఎన్నో అడగడానికి వచ్చాను. కానీ ఇప్పుడు ఏమి అడగాలో తెలియడం లేదు. నా గురించి నాకంటే నీకే బాగా తెలుసు. నాకు నీవు ఇవ్వదలచుకున్నదే ఇవ్వు. నాలోంచి నీవు తీసివేయవలసినదేదైనా ఉంటే తీసివేయి. కానీ నీ స్మరణను మాత్రం నా హృదయం నుంచి ఎన్నడూ దూరం చేయకు తల్లీ!” అని ప్రార్థించాలి. అలా మనసారా వేడుకోగలిగిన క్షణంలో, భక్తుని ప్రార్థనకు మాటలతో పని ఉండదు.


అమ్మ చూస్తుంది.

అమ్మ వింటుంది.

అమ్మ అర్థం చేసుకుంటుంది.

ఎందుకంటే...


అమ్మ ముందు పలికిన వేయి మాటల కంటే,

అమ్మ ముందు రాలిన ఒక్క కన్నీటి బొట్టుకే ఎక్కువ భాష ఉంటుంది... ఎంతో అర్థం ఉంటుంది!


దీనార్తిభీతం భవతాపపీడితం ధనైర్విహీనం తవ పార్శ్వమాగతం!

కృపానిధిత్వాన్మమ లక్ష్మి సత్వరం ధనప్రదానాద్ధన్నాయకం కురు!!

మాం విలోక్య జనని హరిప్రియే నిర్ధనం త్వత్సమీపమాగతం!

దేహి మే ఝటితి లక్ష్మి కరాగ్రం వస్త్రకాంచనవరాన్నమద్భుతం!!

త్వమేవ జననీ లక్ష్మి పితా లక్ష్మి త్వమేవ చ!

భ్రాతా త్వం చ సఖా లక్ష్మి విద్యా లక్ష్మి త్వమేవ చ!!

త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి!

త్రాహి త్రాహి జగన్మాతర్దరిద్రాత్త్రాహి వేగతః!!

నమస్తుభ్యం జగద్ధాత్రి నమస్తుభ్యం నమో నమః!

ధర్మాధారే నమస్తుభ్యం నమః సంపత్తిదాయినీ!!

దరిద్రార్ణవమగ్నోఽహం నిమగ్నోఽహం రసాతలే!

మజ్జంతం మాం కరే ధృత్వా సముద్ధర త్వం రమే ద్రుతం!!

కిం లక్ష్మి బహునోక్తేన జల్పితేన పునః పునః !

అన్యన్మే శరణం నాస్తి సత్యం సత్యం హరిప్రియే!!



కరవీరంలో కొలువైన అంబాబాయీ!

శ్రీమహావిష్ణు హృదయకమలవాసినీ!

కొల్హాసురుని అహంకారాన్ని సంహరించి, అతని చివరి శరణాగతిని కూడా కరుణతో స్వీకరించిన తల్లీ!

మా హృదయంలోని అహంకారాన్ని తొలగించు.

మా చేతిలో సంపద ఉంటే దానికి ధర్మాన్ని జోడించు.

మా జీవితంలో సుఖం ఉంటే దానికి వినయాన్ని జోడించు.

మా జీవితంలో కష్టం వస్తే దానికి ధైర్యాన్ని జోడించు.

మా కోరికలు నెరవేరకపోయినా, నీపై నమ్మకం సడలిపోని హృదయాన్ని ప్రసాదించు.

సూర్యుడు తన కిరణాలను నీ సన్నిధిలో సమర్పించినట్లే, మేమూ మా జీవితాన్నంతటినీ నీ పాదపద్మాల వద్ద సమర్పించగలిగే సద్బుద్ధిని ఇవ్వు తల్లీ.

మా చేతిలో పూజకు పువ్వు లేకపోయినా ఫర్వాలేదు,

మా ఇంట్లో భౌతిక ఐశ్వర్యం లేకపోయినా ఫర్వాలేదు,

మా కోరికలన్నీ తీరకపోయినా ఫర్వాలేదు...

కానీ నీ పాదాలను మరచిపోని భక్తిని మాత్రం మాకు ఎల్లప్పుడూ ప్రసాదించు.

అదే మా మహాలక్ష్మి.

అదే మా అసలైన ఐశ్వర్యం.


లక్ష్మీర్భూషయతే రూపం లక్ష్మీర్భూషయతే కులం!

లక్ష్మీర్భూషయతే విద్యాం సర్వాల్లక్ష్మీర్విశిష్యతే!!


జయ జయ కరవీరవాసినీ!

జయ జయ కొల్హాపుర మహాలక్ష్మీ!

జయ జయ అంబాబాయి!

జయ జయ శ్రీమాత!


జయదుర్గే శివదుర్గే హరదుర్గే

అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే!


జయ జయ జయ జయ కామాక్షీ!

జయ జయ జయ జయ కామాక్షీ!


— శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేంద్ర కుమార్)


No comments:

Post a Comment