చంద్ర సాచివ్యం - సుందరకాండ, రాసపంచాధ్యాయీ
వాల్మీకి మహర్షి రచించిన సుందరకాండ 5వ సర్గలో, లంకలోకి ప్రవేశించిన ఆంజనేయస్వామికి ఆ రాత్రి చంద్రుడు అపూర్వమైన సహకారం అందిస్తాడు. తన శీతల కిరణాలను సర్వత్రా విరజిమ్మి, ప్రతి వీధిని, ప్రతి గృహాన్ని, ప్రతి దారిని స్పష్టంగా దర్శనమిచ్చేలా చేస్తాడు. సీతామాత అన్వేషణకు బయలుదేరిన హనుమంతునికి ఆ చంద్రప్రకాశమే మార్గదర్శిగా నిలుస్తుంది.
హంసో యథా రాజతపఞ్జరస్థః - సింహో యథా మన్దరకన్దరస్థః!
వీరో యథా గర్వితకుఞ్జరస్థః - చన్ద్రోఽపి బభ్రాజ తథామ్బరస్థః!!
(వాల్మీకి రామాయణం, సుందరకాండ 5వ సర్గ)
వెండి పంజరంలో ఉన్న హంసవలె, మందరపర్వత గుహలోని సింహంవలె, గర్విత గజంపై ఆసీనుడైన వీరునివలె, ఆకాశంలో చంద్రుడు అపూర్వ కాంతితో ప్రకాశించాడు.
తదనంతరం చంద్రుని శీతల కాంతి జగత్తును ఎలా ప్రకాశింపజేసిందో మహర్షి ఇలా వర్ణిస్తారు...
ప్రకాశచన్ద్రోదయ నష్టదోషః - ప్రవృత్త రక్షః పిశితాశ దోషః!
(వాల్మీకి రామాయణం, సుందరకాండ 5వ సర్గ)
చంద్రోదయంతో రాత్రి చీకట్లు తొలగిపోయాయి. చంద్రుని నిర్మల కాంతి సమస్త దిక్కులను ప్రకాశింపజేసి, సీతాన్వేషణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించింది. ఈ చంద్రకాంతి కేవలం ప్రకృతిలోని వస్తువులను ప్రకాశింపజేయలేదు; హనుమంతుని కార్యసిద్ధికి సహాయకంగా మార్గదర్శకంగా నిలిచింది.
అదేవిధంగా, శ్రీమద్భాగవతం దశమ స్కంధంలోని రాసపంచాధ్యాయి (29-33 అధ్యాయాలు)లో, వేణునాదాన్ని ఆలకించి పరమప్రియుడైన శ్రీకృష్ణుని అన్వేషించేందుకు గోపికలు రాత్రివేళ బృందావనంలోకి ప్రవేశిస్తారు. ఆ సందర్భంలో కూడా వ్యాసమహర్షి శరద్ పూర్ణిమ చంద్రుని నిర్మల కాంతిని ఎంతో రమణీయంగా వర్ణిస్తారు.
భగవానపి తా రాత్రిః శరదోత్ఫుల్లమల్లికాః |
వీక్ష్య రన్తుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రితః ||
(శ్రీమద్భాగవతం 10.29.1)
"శరదృతువులో వికసించిన మల్లెల పరిమళాలతో నిండిన ఆ పూర్ణిమ రాత్రిని దర్శించిన శ్రీకృష్ణుడు, యోగమాయను ఆశ్రయించి రాసలీలకు సంకల్పించాడు."
ఈ రెండు మహాగ్రంథాలలోనూ ఒక అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది.
ఇక్కడ వెతుకుతున్నవారు సాధకులు.
వెతకబడేది పరమాత్మ.
ఎటువైపు నడవాలో, ఏ మార్గంలో సాగాలో, ఏమి గ్రహించాలో స్పష్టంగా చూపించే వెలుగే గురువు.
అజ్ఞానతిమిరాన్ధస్య జ్ఞానాఞ్జనశలాకయా !
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః !!
"అజ్ఞానాంధకారంలో మునిగిన శిష్యునికి జ్ఞానాంజనం అద్ది దృష్టిని ప్రసాదించేవాది గురువు."
సుందరకాండలో హనుమంతుడు లంకలోని గృహాలను పరిశీలిస్తూ, రత్నఖచిత కిటికీలను, వాటి అలంకారాలను ఎంతో నిశితంగా దర్శిస్తాడు.
భాగవతంలో గోపికలు శ్రీకృష్ణుని వెతుకుతూ వస్తున్నప్పుడు, ఆయన ముఖారవిందాన్ని, ముఖ్యంగా చెవులలో ఊగిసలాడుతున్న మకరకుండలాలను పరమాత్మ దగ్గరకు వచ్చేవారికి దారిచూపడానికి ఊగుతున్నాయా అన్నట్లు వ్యాసమహర్షి మనోహరంగా వర్ణిస్తారు.
మనిషి ముఖానికి ద్వారం నోరైతే, చెవులు జ్ఞానానికి కిటికీలు.
చెవుల ద్వారానే శ్రుతి, అంటే వేదం, మనలోకి ప్రవేశిస్తుంది.
రత్నాలతో అలంకరించిన కిటికీలు, మకరకుండలాలు - వేదాభరణాలు, వేదానికి ఆభరణం వేద విహిత ఆచరణకు సంకేతాలు.
వేదానికి ఆభరణం వేదవిహిత కర్మాచరణ, అదే జ్ఞానానికి పరమాత్మను పొణ్దడానికి మార్గం.
---
సుందరకాండలో హనుమంతుడు లంకలో సంచరిస్తూ ఎన్నో రకాల సాధకులను దర్శిస్తాడు. ఎవరో అగ్నిహోత్రం నిర్వహించడంలో నిమగ్నులై ఉంటారు. ఎవరో జపమాలను చేతబట్టి, దర్భకట్టలు మంత్రాలు చేస్తుంటారు. పూర్తిగా కర్మకాండలో లీనమై ఉంటారు.
ప్రతి ఒక్కరి మార్గం వేరు. ప్రతి ఒక్కరి సాధన వేరు. హనుమంతుడు మాత్రం వారందరినీ గమనిస్తూ, తన లక్ష్యమైన సీతామాత అన్వేషణను కొనసాగిస్తాడు.
అదేవిధంగా భాగవతంలో గోపికలందరూ బృందావనంలో శ్రీకృష్ణుని అన్వేషణలో పరుగులు తీస్తుంటారు. వారు ఒకరిని ఒకరు చూడరు; ఎవరి సాధనను వారు గమనించరు. ఎవరు ముందున్నారు, ఎవరు వెనుక ఉన్నారు అనే భావమే వారికి లేదు.
ఎందుకంటే
పరమాత్మను చేరే మార్గంలో పోటీ ఉండదు.
పోలిక ఉండదు.
ప్రతి సాధకుని ప్రయాణం అతనిదే.
నాయమాత్మా ప్రవచనేన లభ్యో
న మేధయా న బహునా శ్రుతేన!
యమేవైష వృణుతే తేన లభ్యః !!
(కఠోపనిషత్ 1.2.23)
"ఆత్మతత్త్వం వాక్చాతుర్యంతో కాదు, మేధస్సుతో కాదు, వినికిడితో మాత్రమే కాదు; తనను ఆశ్రయించినవారికి మాత్రమే పరమాత్మ తనను తాను అనుగ్రహిస్తాడు."
అందుకే వ్యాస వాల్మీకులిద్దరూ ఈ రెండు ఘట్టాలూ ఒకే విధంగా చెప్పారు.
సాధన మార్గాలు అనేకం కావచ్చు.
సాధకులు ఎందరో కావచ్చు.
ఎలాగైతే ఎవరి ఆకలి వారిదే,
ఎవరి నిద్ర వారిదే,
ఎవరి అనుభవం వారిదే... అదేవిధంగా...
కానీ, సాధకుల అంతిమ గమ్యం ఒక్కటే "పరమాత్మను పొందడం"
ఆ గమ్యానికి దారి చూపి, ఆ మార్గంలో నడిపించే "చంద్రకాంతి - స్వగురుకృపయే", ఆ ప్రయాణాన్ని సార్థకం చేసేది నిరంతర సాధన.
"గురుకృపా హి కేవలం - శిష్య పరమ మంగళం."
- శంకరకింకరః
No comments:
Post a Comment