Pages

Friday, December 21, 2012

దృష్టి కోణం


శ్రీ గురుభ్యోనమః

ఒక్కో మనిషి దృష్టి కోణం, వ్యక్త పరచిన భావాల వల్ల ఆవ్యక్తి ఏ స్థాయిలో ఉన్న వాడనేది పెద్దలు పసిగడుతుంటారు. ముఖ్యంగా గురువులు/ఆచార్యులు తమ శిష్యులను తమ దగ్గర ఉంచుకొని విద్య బోధించేటప్పుడు ఈ విషయాన్ని వారి శిష్యులకి తెలీకుండా పరీక్ష చేసి తగు విధంగా వారికి శిక్షణని ఇచ్చేవారు.

ఇది దేహ దృష్టి, మనో దృష్టి, ఆత్మ దృష్టి అని మూడు రకాలు. ఇందులో ముందు నుంచీ చూసినప్పుడు ఆత్మ దృష్టి అత్యుత్తమమైనదీ, దేహదృష్టి అథమము / కనిష్టమైనది.

ఒక వ్యక్తి అలా మన ముందు నుంచి వెళ్తుంటే అబ్బా భలే ఉన్నాడురా ఒడ్డూ, పొడుగూ, ఆ వంటి రంగూ, వేసుకున్న చక్కని బట్టలూ అని ఆనందించే వారుంటారు. వారికి ఆ దృష్టి ద్వారా, కట్టు బొట్టు, జుట్టు, బట్ట, కులం, రంగు, సౌందర్యం, ఇవి మాత్రమే వారి దృష్టికి అందుతాయి. ఉదాహరణకి ప్రవచనాలు వినడానికి వచ్చి ప్రవచనకర్త భౌతికాకారాన్ని చూసి పొగిడేవారు కొందరు. ఆయన ఏం చెప్పారు అన్నదాంతో సంబంధం ఉండదు. ఏం విన్నారో ప్రవచనం అయ్యాక గుర్తు ఉంటుందా అంటే అక్కడక్కడా వేంకటేశ్వర స్వామి పంచె లాగా అన్న మాట. వీరిది స్థూల/భౌతిక/దేహ దృష్టి. వీరి దృష్టి ఉన్నదాన్ని ఆస్వాదిస్తూనే ఏది లేదా అని వెతుకుతూ ఉంటారు.

ఇంకొకరు ఒక వ్యక్తిని చూస్తూనే ఈయన పండితుడిలాగా ఉన్నాడు అని తలచి ఆ వేపున కాస్త పరిశీలించి అబ్బా గొప్ప పండితుడు అని సర్టిఫికేట్లిస్తారు. చూసావా ఆ పంచె కట్టు ఆ వీబూధి బొట్టు, ఆ గడ్డంఅదీనూ బహుశా ఈయన కవేమో, లేదా ఉపాసకుడేమో అని వారికి వారే పరి పరివిధాలా పరిశీలించుకొని ఆ వ్యక్తిని ఏదో ఒక పాండిత్యానికి అంటగడతారు. ఇలా చెప్పే వారు బోలెడు మంది. అబ్బా ఏం గుర్తు పెట్టుకుంటారండీ అనో, భలే చెప్తారండీ అనో, అబ్బా పద్యాలు ఏం చెప్పారండీ అనో, అన్ని పురాణేతిహాసాలు అన్నీ ఆయనకి కంఠతా అనో, లా ఏదో ఒక సర్టిఫికేట్లిచ్చేవారుంటారు. వారు రెండవ కోవకి చెందినవారు. అలానే వీరూ అంతే అన్నీ బాగున్నాయంటూనే అదిగో చూసారా అక్కడ సరిగ్గా చెప్పలేదు అదీ ఇదీ అని లెక్కలు కడతారు.

ఇక అతి కొద్ది మంది ఉంటారు, ఆపక్కనుంచో ఆ వ్యక్తికి దగ్గరనుంచి అలా వెళుతుంటేనే అవతల వ్యక్తిలోని పరబ్రహ్మాన్ని చూసి నమస్కరిస్తారు. ఆ వ్యక్తిని చూడగానే అసంకల్పితంగా వారి రెండు చేతులూ ముకుళించుకుంటాయి. ముందు ఏదో ప్రణాళిక వేసుకుని వారిని కలిసి ఇలా నమస్కారం చేయాలి అవీ ఇవీ అని ప్రణాళిక చేయకపోయినా, వారిని చూడగానే వారిని తలచుకోగానే అప్రయత్నంగా రెండు చేతులూ ముకుళించుకుపోతాయి. మరో మాట ఉండదు, ప్రశ్నా ఉండదు, అక్కడ ఉండేది ఆనందం ఆత్మానందం. ఆ ఆత్మ దృష్టి అలవడాలనే ప్రతి ఒక్కరూ సాధన చేసేది.

ఓ చిన్న కథ

జనక మహారాజు గారు విదేహ వంశస్థులు, గొప్ప ఆధ్యాత్మిక జిజ్జాస కలిగి యాజ్ఞవల్కుని బ్రహ్మ విద్యా జ్ఞానమును పొందుటకుగానూ సుశిక్షితుడైనవాడు. ప్రజలకు ఎన్నో దాన ధర్మాలు చేసినవాడు. అటువంటి జనక మహారాజు, పండితులను, భాషాకోవిదులను, శాస్త్రకారులను, వివిధ అంశములందు ప్రావీణ్యము కలవారిని ఎందరినో పిలిచి సభలు జరిపేవాడు. ఒకనాడొక సభకు అష్టావక్రుడు అనే మహానుభావుని అతిథిగా ఆహ్వానించాడు. అతని గూర్చి, అతని తపస్సు గూర్చి, జ్ఞానమును గూర్చి సభలో అత్యధికులు అప్పటి వరకు విన్నవారే తప్ప ఆయనను చూసిన వారు లేరు.

ఆమహర్షి దర్శనానికి, ఆయన వేదాంత శాస్త్ర పాండిత్యాదులను వారి గొంతుతో వినడానికి పామరులు పండితులు ఎందరో ఆనాటి సభకి విచ్చేసారు. అందరూ ఆ మహర్షి రాకకై ఎదురుచూడసాగారు. ఈలోగా ప్రభువుకి తమ తమ పాండితీ ప్రకర్ష చూపే వారు కొందరు, తమ తమ ప్రతిభా పాటవాలు చూపేవారు కొందరు ఇలా సభ కిట కిటలాడుతున్నది. అష్టావక్ర మహర్షి శరీరం ఎనిమిది చోట్ల వంకరగా ఉంటుంది అందుకే ఆయన పేరు అష్టావక్రుడు అని పేరు కలిగింది. బహు తపస్వి, సత్య తత్త్వ విచారణ చేసి తెలుసుకోవలసినదానిని తెలుసుకొని స్వస్వరూప జ్ఞానమునెఱిగినవాడు. అతని ముఖము బ్రహ్మవర్చస్సుచే మరో అగ్నిహోత్రమా అన్నచందమును బ్రహ్మ వర్చస్సుచే వెలుగొందేది. అటువంటి మహర్షి సభా ప్రవేశం చేయుటకు సభలో ప్రవేశించారు. ఈలోగా కలకలం మొదలైంది. అందరూ గుసగుసలు ఈయన ఆకారం చూసి పండితలు, పామరులు అన్న తేడా లేకుండా అందరూ ఆయనని చూసి నవ్వడం మొదలెట్టారు. అది తెలిసి జనక మహారాజు అష్టావక్రులు వెళ్ళిపోకుండా వెనక్కి సభకి తీసుకురావాలని పరుగున వెళ్ళి గౌరవంతో తోడ్కొని వచ్చి ఉచితాసనం వేసి అర్ఘ్య పాద్యాదులిచ్చి ఉచిత సత్కారం చేసి నమస్కరించాడు. అప్పుడు అష్టావక్రుడు గట్టిగా నవ్వసాగాడు. జనక మహారాజు అయ్యా ఎందుకు నవ్వుతున్నారు, మిమ్మల్ని మీ దేహాన్ని చూసి ఇతరులు సభికులు ఇతః పూర్వం నవ్వారు మరి మీరెందుకు నవ్వుతున్నారో తెలియపరచండి అని కోరాడు.

అష్టావక్ర మహర్షి తన నవ్వుకి కారణం ఇలా వివరించారు " రాజు నన్ను పండిత సభకి ఆహ్వానించారు, కానీ ఇక్కడ ఒక్క పండితుడూ లేడేమి? సభ అంతా చర్మకారుల, మాంస విక్రేతలతో నిండి ఉంది. చర్మ కారుల సభతో నాకేమి పని అని వెనుదిరుగుతుంటే మీరు పిలిచి సింహాసనం లో కూర్చోపెట్టి అతిథి సత్కార్యాలు చేసారు. మీరు నన్నే సభకి పిలిచారో, ఇది ఆ సభ కాదు. పండితులు, ముని వర్యులు, మహర్షులు ఉండవలసిన సభలో మీరు నన్ను కూర్చోపెట్టి ఇలా ఆతిథ్యం ఇవ్వడం సబబే, కానీ ఈ చర్మకారులు, మాంస విక్రేతల సభలో ఉన్నతుడిగా కూర్చోబెట్టి సన్మానం చేస్తున్నారేమిటా అని నవ్వు వచ్చింది" అని అన్నారు. అంత రాజు అయ్యో అంత మాట ఎందుకన్నారు ఇక్కడున్న పండిత జనులందర్నీ మీరు చర్మకారులూ, మాంస విక్రేతలూ అని ఎందుకన్నారో సెలవీయండి పొరపాటు సవరించుకోగలరు అని అడుగగా, ఆ మహర్షి "వీరు జీవుల ఎడ సమభ్రాంతి ఉన్నవారు కాదు. నా శరీర సౌష్ఠవము చూసి బాగున్నదాలేదా అని తలచి ఎనిమిది వంకరలున్నవని కొలచి, నన్ను చూసి నవ్వుకున్నారు. ఆత్మను వదిలి చర్మము, మాంసమును చూసి దాని విలువ లెక్క కట్టేది చర్మ కారులు మాంస విక్రేతలే కదా అందుకే అలా అన్నాను." అది విని సభికులంతా ఆ మహా జ్ఞానిని చూసి సిగ్గుపడి తమ తప్పిదాన్ని మన్నించమని వేడుకున్నారు.

అష్టావక్ర మహర్షి యొక్క ఈ చిన్న కథ ఆత్మ దృష్టిని అలవర్చుకోవలసిన అవసరాన్ని, అలా అలవర్చుకోని వారి స్థితినీ తెలియజేస్తున్నది.


వ్యక్తి యొక్క ఒడ్డూ, పొడుగూ, సౌందర్యం, వయ్యారం, వస్త్రాడంబరం, వాగాడంబరం కాదు ప్రధానం. ఆత్మగుణ ప్రవృత్తి ఎంత స్వచ్ఛమైనదీ, మాటలచేతల పొంతన ఎంత స్పష్టమైనదీ అన్న విషయం ప్రధానం

ఇందుకే సుభాషితంలో చెప్తారు
అక్షరాణి పరీక్ష్యన్తామమ్బరాడమ్బరేణ కిమ్ !
శమ్భురమ్బరహీనోఽపి సర్వజ్ఞః కిం న జాయతే !

పట్టుపుట్టాలనీ, ఆకారాన్నీ ఏం పరీక్షిస్తావ్? విద్యను పరీక్షించు. దిగంబరుడైనంత శివుడు సర్వజ్ఞుడుకాడా?


సర్వం శ్రీ పరబ్రహ్మరాపణమస్తు

-శంకరకింకర
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
जय जय शंकर हर हर शंकर


క్రోధాద్భవతి సమ్మోహః

శ్రీ గురుభ్యోనమః
ఒకానొక ఊరి చివర ఒక చెఱువుంది. ఒక బ్రాహ్మణుడు దేశాంతరం వెళ్తూ చెఱువు వద్దకు సంధ్యాసమయానికి చేరుకున్నాడు. సంధ్యాసమయమని గుర్తెరికి చెఱువులో స్నానం చేసి గట్టుమీద పక్కగా దగ్గరున్న దర్భాసనం వేసుకుని కూర్చుని సంధ్యావందనం చేసుకుని, జపం చేసుకుంటున్నాడు. ఇంతలో వూరికి సంబంధించిన ఒక రజకుడు ఈయనని చూడక నీళ్ళలో దిగి బట్టలు ఉతకనారంభించాడు. చాకలి బండ మీద బట్టలను దబాదబా బాదడంతో చప్పుడురావడంతో పాటు మురికి నీరు, జపం చేసుకుంటున్న బ్రాహ్మణుడి మీద పడింది. ఆబ్రాహ్మణుడు కళ్ళు తెరిచి చూసి జపం చేస్తుంటే చప్పుడు చేయడమే కాక మురికి నీరు నాపై పడేటట్లు చేసిందెవరు అని కోపంగా చుట్టూ చూసాడు పక్కన నీళ్ళలో నిలబడి బట్టలు ఉతుకుతున్న రజకుడు కనపడ్డాడు. కోపంతో ఊగిపోతూ రజకుణ్ణి పట్టుకుని దబా దబా బాదేసాడు. రజకుడు ఏమీ మాట్లాడలేదు. వెంటనే కోపంతీరి అరెరె ఇలా చేసానేమిటి? నేను బ్రాహ్మణుణ్ణి, స్నానం చేసి జపం చేసుకుంటున్న నేను ఇతన్ని ముట్టుకున్నానే అని చిరాకు పడి చెఱువుకి ఒక పక్కకి వెళ్ళి తిరిగి స్నానం చేయసాగాడు. అదే సమయంలో రజకుడు కూడా అతనికి ఇంకో పక్క స్నానం చేస్తూ కనిపించాడు. "నేను నిన్ను ముట్టుకున్నాను కాబట్టి శుద్ధికోసం స్నానం చేస్తున్నాను నువ్వెందుకు స్నానం చేస్తున్నావు?" అని అడిగాడు. అంత రజకుడు "అయ్యా! పుట్టుక చేత మీరు బ్రాహ్మణులు, మీరు వందనీయులే, కానీ మీ క్రోధం చేత మీలో ఛండాలుడు ప్రవేశించాడు, ఛండాలుడు నన్ను ముట్టుకున్నందుకు శుద్ధికోసం నేను స్నానం చేస్తున్నాను" అని చెప్పాడు. అప్పుడు ఆబ్రాహ్మణునికి తాను చేసిన తప్పు తెలిసి అందరితోనూ ప్రేమతో మెలగడం, క్షమను అలవాటు చేసుకున్నాడు, క్రోధాన్ని వదిలాడు. సమ దృష్టి కలిగి ఉండడం అలవర్చుకున్నాడు. అతనిలోని పాండిత్యం, ఆత్య విద్య చూసి అతని వద్ద ఎందరో రాజాధి రాజులు, రాజ్యాలే దాసోహమన్నాయి. ఆయన మాత్రం సత్ లో రమిస్తూ జీవితాన్ని పండించుకున్నాడు.
మీ

సింహాచల యాత్ర-2

..అది చూస్తూ ఎత్తైన అరుగులు ఆలయ మంటపం గోపురం చూస్తుంటే, మీరు ఇటునుంచి వెళ్ళాలి అది వేరే లైను అని అక్కడ నిల్చున్నవాళ్లని అడగ్గా చెప్పారు, రాజ ద్వార ప్రవేశం లభించింది. పెద్ద ద్వారం నమస్కరించుకుంటూ లోపలికి వెళ్ళాం. మమ్మల్ని పంపిన దగ్గర ఏలైనూ లేదు పక్కన ఊచలతో ఉన్న లైనులో భక్తులు ఎందరో ఉన్నారు. ఏమిటీ అనుక్కుంటుంటే, మీరు ఈ పక్కనుంచి వెళ్ళాలి అని ఒక పెద్ద అలమారా అంత ఇత్తడి హుండీ పక్కనుంచి ముఖమంటపంలోకి పంపారు అక్కడ కాస్త భక్తులు, ఆలయ ఉద్యోగస్తుల కోలాహలం ఉంది. సరే స్వామిని తలచు కుంటూముందుకు సాగుతూ నాలుగడుగులు వేశాం. ఎవరో తల్లి మెట్లకి పసుపు కుంకుమ బొట్లు పెడతానని మొక్కుకుందేమో ఆ పసుపు కుంకుమ గిన్నె తీసుకొని వచ్చింది అందులోని పసుపు కుంకుమలు ఆలయ గోడలకి రాస్తుంటే అక్కడే ఉన్న ఉద్యోగి ఇవి మెట్లు కావమ్మాఇక్కడరాస్తారేటీ అని గట్టిగా చెప్పాడు సరే నాలుగడుగులు ముందుకేయగానే ఎదురుగా గర్భాలయం మధ్యలో గంధం పూసిన పెద్ద స్ఫటిక శివలింగాకారంలో ఊర్ధ్వపుండ్రాలు ధరించి అడ్డంగా సాలగ్రామ మాల ధరించి దర్శనమిచ్చారు. అప్రయత్నంగా ప్రహ్లాద వరద గోవిందా అని నామం నానోట... గర్భాలయం దాకా వెళ్ళి దర్శించుకుని పక్కన లైనులో అర్చనకోసం నిలబడ్డాం. అప్పుడు ఆ ఆలయం చూద్దును కదా అబ్బా ఏమి విశాలమైన ఆలయం అనిపించింది. రెండువేపులా ఎత్తైన అరుగుల మీద కట్టిన గాజు గదులలో ఒక వేపు ఏకాంత సేవ చేయబడిన మూర్తులు ఉయ్యాల, ఉయ్యాలలో ఎఱ్ఱని పట్టుబట్టచిన్న దిండ్లు. అవతలి పక్క ఊరెరిగింపుకి ఉత్సవమూర్తులనుక్కుంటా ఇద్దరు దేవేరులతో స్వామివారు సింహాసనాసీనులై ఉన్నారు. చూస్తూ కాసేపు లైనులో ఉండిపోయాం. ఈలోగా కార్తీక దీపం గుళ్ళో వెలిగించాలని కామోసు, ఓ తల్లి ఒక చిన్న స్టీలు మూతలాంటి దాంట్లో దీపం వెలిగించుకుని లైనులో తీసుకొచ్చింది స్వామి దర్శనం అయ్యింది కానీ ఆవిడ చేతులు ఆ దీపం వేడికి కాలుతున్నట్లున్నాయి లైను మధ్యలో క్రింద పెట్టి ముందుకెళ్ళిపోయింది. అది అక్కడి ఉద్యోగులు చూసారు కాబట్టి సరిపోయింది లేకపోతే అనర్థం జరిగుండేది. ఐనా స్వామి సన్నిధి కదా ఏం జరుగుతుందిలే అనుక్కున్నాను.
స్వామిని చూస్తూ అయ్యా ఇంత చల్లని ప్రదేశం అదీ కొండమీద, ఇంత గంధంలో ఎందుకు స్వామీ దాక్కున్నావు అనుక్కుంటుంటే, అర్థమయ్యింది. గర్భాలయంతో సహా ఆలయ అధికారుల కేకలు, భక్తుల కేకలు అరుపులు... స్వామీ ప్రశాంతత లేదనా గంధంలో దాక్కున్నావ్ అనుక్కున్నా, ఐనా మా మనసుల్లో ఉంచుకోడానికి... ఆ వేడికి ప్రపంచాలే కాలిపోతున్నాయి స్వామీ మీకూ ఆ వేడెందుకు అనుక్కున్నావేమో ఈ గంధంలో దాగున్నావు అనిపించింది. ఇక మా వంతు వచ్చింది మమ్మల్ని గర్భాలయంలోకి పంపారు స్వామి వారు పెద్ద గంధం పూసిన స్ఫటికలింగంలా ఠీవీగా విరాజమానమైనట్టుగా మధ్యలో ఉన్నారు గర్భాలయం మధ్యలో స్వామి వారి చుట్టూ ఇత్తడితో చేసిన కట్టడం ఉంది భక్తులందరూ చెయ్యి పెట్టి స్వామి అందుతారేమోనని ప్రయత్నం, అర్చక స్వామి ఎవరా చెయ్యి పెట్టిందీ అని కేకలు... సరి స్వామినే చూస్తూ.. స్వామి వారికి ప్రదక్షిణం చేసి స్వామివారికి ముందువేపుకి ఒక పక్కకి నిల్చుని స్వామిని చూస్తూ ఉన్నాను. అర్చక స్వామి వచ్చి తులసి స్వీకరించి గోత్రనామాదులు చెప్పి, ఇతరుల గోత్రనామాలూ చెప్పి అర్చించి తీర్థ ప్రసాదాలు, హారతి ఇచ్చి ఆశీర్వదించి పంపారు. స్వామి వారు అసలే గంధం అలది ఉన్నారు పైగా అర్చక స్వాములిచ్చిన హారతి వెలుగుల్లో తప్త కాంచన సన్నిభం అన్నట్లు సింహాచలం సంపెంగకి బంగారు మెఱుపు వచ్చినట్లున్నారు. అడ్డంగా పట్టు వస్త్రం, పైన ఊర్ధ్వపుండ్రాలు, వెండితో చేసిన రెండు సాలగ్రామ మాలలు ఊర్ధ్వపుండ్రం చివర ఎర్ర తామర పువ్వు, పైనుంచి కిందకి తులసి మాల... ఆహా అని స్వామికి నమస్కరించిమళ్ళీ మళ్ళీ నమస్కరించుకుని బయటికి వచ్చాము. బయట ఎడమ వేపున ఒక చిన్న మూర్తులున్నాయి వాటిని బహుశా నేనే పరధ్యానంలో సరిగా చూడలేదు.
గర్భాలయం బయటికి రాగానే కప్ప స్తంభం అలంకరించి ఉంది ఎవరో కౌగిలించుకొని కోరికలు కోరుకుంటున్నట్లున్నారు. ఇంకా ఒక పాతిక మంది లైను ఉన్నట్లుంది. ఆ కప్ప స్తంభం సంతాన గోపాల యంత్రం మీద ప్రతిష్టింపబడినదట, పిల్లలు కోరే దంపతులే కాక, ఇతర కోరికలు కోరుకునే వారూ వెళ్తున్నారు. పక్కకి వచ్చి లైనులో నిలబడనా అని అనిపించింది. మళ్లీ కొత్తగా నేను కోరే కోరిక ఏముంది స్వామికి తెలీనివి ప్రత్యేకంగా నేను చెప్పుకునేవి! అని ఆలయం చుట్టూ చూస్తూ ముందుకు సాగాం. బహు ఉన్నతమైన ఆలయం, చక్కని శిల్పాలు చుట్టూ అరుగులు. విశాలంగా ఉంది. అరుగుల మీద ఏవో ఫోటోల ఫ్రేమ్స్ ఉన్నాయి ఏమిటాఅని తేరిపార చూశాను. స్వామి వారికి చెందిన విలువైన పురాతన ఆభరణాలు ఇత్యాది ఫోటోలు తీసి చుట్టు పెట్టారు. బాగుంది అనుక్కుని ముందుకు కదిలాము. ఆలయం చుట్టూ, వరాహ స్వామి, నరసింహ స్వామి, హిరణ్య కశిపు వధ ఇత్యాది ఘట్టాల సంబంధ శిల్పాలు ఉన్నాయి, చిన్న చిన్న నగిషీల శిల్ప చాతుర్యం అమోఘం. వెనకవేపున శ్రీ హరి ఆలయం దర్శించి తీర్థం తీసుకొని ముందుకు కదిలాం.. పక్కన సత్య నారాయణ వ్రతాలు సామూహికంగా చేయిస్తున్నారు. నమస్కరించి ముందుకు వెళ్ళగా అమ్మ గోదాదేవి ఆలయం కనపడింది. అమ్మకి నమస్కరించుకొని హారతి తీసుకొని బయటికొచ్చాము.
అసలు ఈ ఆలయం గురించి చెప్పలేదు కదూ, ఈ స్వామి ప్రహ్లాద ప్రతిష్టిత ఆలయమని చెప్తారు, పురూరవ చక్రవర్తి విమానంలో వెళ్తుంటే ఈ కొండ దగ్గర ఆగిపోయి ముందుకు వెళ్లలేక కిందకి దిగిపోయిందిట. అప్పుడు ఈ మట్టిలో కూరుకుపోయిన స్వామిమూర్తిని బయటికి తీసి శ్రుతి ప్రమాణకంగా చందనంతో కప్పి ఉంచి, వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రం నిజరూపార్చన చేసే విధంగా పునః పూజాదులను ప్రారంభించాడని తెలుసుకున్నాను. (కానీ చిన్నప్పుడు ఒకసారి కుటుంబంతో వెళ్ళినప్పుడు అక్కడి వారు ఈ ఆలయం దైవ నిర్మితమనీ, నిర్మాణంలో కొంత ఆలస్యం జరిగినందుకు ఒకచోట ఎక్కడో అతి కొద్ది మాత్రం అసంపూర్తిగా ఉందనీ చెప్పారు... )

ఈ సింహ గిరికి గిరి ప్రదక్షిణలు చేస్తారు, దాదాపు 35 కిలోమీటర్లు పరిధి, ప్రత్యేకంగా గిరి ప్రదక్షిణ ఉత్సవం చేస్తారట, ఆ ఉత్సవం ఎంతో కోలాహలంగా ఉంటుందట. చుట్టూ ఉన్న గ్రామాల వాళ్ళు, గిరిజనులు అందరూ ఆ ఉత్సవంలో పాల్గొనేవారికి దారి పొడుగునా మజ్జిగ, పులిహోర, మంచినీరు అందిస్తూ ఉంటారట... ఆ ప్రదక్షిణలో, నడకదారిలో ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతులుంటాయట... మరో విషయం, శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి తల్లిదండ్రులు వయసైపోతోంది పిల్లలు లేరని బెంగపెట్టుకోకుండా సింహాద్రి అప్పన్నే ఉన్నాడని పూనికతో ఈ గిరి ప్రదక్షిణ చేసిన తరవాత అప్పలాచార్య స్వామి పుట్టారట. అందుకే వారికి అప్పన్న పేర అప్పలాచార్యులు అని పెట్టారట.
స్వామిని మనసునిండా నింపుకుని, బయటికి రాగానే అక్కడ గోశాల కనపడింది అక్కడ ఉన్న కపిల గోవుకి ఇతర గోవులకి నమస్కరించి తిరిగి విడిదికి బయలు దేరాను. బయలు దేరుతూ మా యింట్లో సింహాసనానికి, సింహాసనాన్నధిష్టించిన దేవతామూర్తులకు అలంకరించడానికి, అక్కడే ఒక అమ్మి అమ్ముతున్న సింహాచలం సంపెంగ పూల దండ కొన్ని విడిపూలు కొనుక్కుని మళ్ళీ తిరుగు ప్రయాణం కట్టాం.
అనుక్కోకుండా కార్తీక బహుళ ఏకాదశీ భానువారం నాడు స్వామి అనుగ్రహించి ఇచ్చిన దర్శనం ఇది.. స్వామిని పునః పునః దర్శనం కటాక్షించమనీ, ధర్మానుష్టానంలో తొట్రుపాటు పడకుండా నిలదొక్కుకునేలా స్థైర్యాన్ని ఇవ్వమనీ కోరుకుకుంటూ బయలు దేరి... ఒక ముఖ్య స్నేహితుడికి ఫోన్ చేసి ఈ వివరం ఇతర వివరాలు చర్చించుకుంటూ విశాఖపట్నంలోని విడిదికి చేరాను..
ఇక్కడికి వచ్చాక స్వామి వారి మీద కీర్తనలో, పద్యాలో ఏదో సాహిత్యం ఉంటుది కదా అని గూగుల్తే, గోగులపాటి కూర్మనాథ కవి వ్రాసిన సింహాద్రి నారసింహ శతకం గూర్చి తెలిసింది... అక్కడ్నుంచి సేకరించిన ఒక పద్యం మచ్చుకి... పరాకులను పద్యరూపంలో వ్రాసారు
  
సీ: శ్రీమద్రమారమణీ మణీరమణీయ
సరస చిత్తాబ్జ బంభర ! పరాకు
శంఖ చక్రగదాసి శార్జ చపాది భా
సురదివ్య సాధనకర ! పరాకు
ప్రహ్లాద నారద వ్యాస శుకాదిక
భక్త సంరక్షణ పర ! పరాకు
బహుతర బ్రహ్మాండ భాండ పరం పరా
భరణ లీలా దురంధర ! పరాకు

తే: నీకు సాష్టాంగ వినతు లనేక గతుల
జేసి విన్నప మొనరింతు జిత్తగింపు
చెనటి వీడని మదిలోన గినుక మాని
వైరి హర రంహ సింహాద్రి నారసింహ !

సర్వం శ్రీ లక్ష్మీ వరాహ నృసింహ స్వామి పాదారవిందార్పణమస్తు..
మీ

Wednesday, December 12, 2012

సింహాచల యాత్ర -1


           దేశకాలములు అనుక్కోకుండా ఒక్కోసారి మనకి ప్రత్యేక అవకాశాన్ని ఇస్తుంటాయి
,
కొన్నిటిని గుర్తెరిగి అందిపుచ్చుకుంటాము, కొన్ని తెలియకుండానే మనకి ఆ అవకాశం కలిగి తరవాత ప్రాశస్త్యం తెలుస్తుంది. కొన్ని కొన్ని సార్లు అవకాశం అన్ని రకాలూ ఉన్నా అందిపుచ్చుకోడానికి పూర్వ కర్మానుగత పాపం అడ్డుపడుతూంటుంది.         
           పూజ్య గురువుగారిచే ధర్మ సోపానాలు అన్న విషయాంతర్గతంగా మాతృ దేవో భవ
, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్న అంశాలపై విశాఖపట్టణంలో జరుగుతున్న ప్రవచనాలని ప్రత్యక్షంగా వినాలన్న కోరికతో మొన్న శని,ఆది వారాలలో విశాఖపట్టణం వెళ్లడం జరిగింది. ఈ సమయంలోనే దగ్గర్లో ఉన్న సింహాచల క్షేత్రదర్శనం చేద్దామన్న సంకల్పం కలిగి ఆదివారం పొద్దున్నే నిత్యానుష్ఠానం తరవాత ఆటోలో సింహాచలానికి బయలుదేరాను. సంధ్యావందనంలో దేశకాల సంకీర్తనం చేసినా, సింహాచలం బయలు దేరేటప్పుడు ఎందుకో ఆరోజు ఏకాదశి అనీ, ఆదివారమనీ గుర్తు రాలేదు. అక్కడికి వెళ్ళాకకానీ!        
          విశాఖ నాకు తెలియని పట్టణం
, ఎప్పుడో 5ఏళ్ళా క్రితం ఒక సందర్భంలో ఒక్కరోజుకై వెళ్ళాను, అసలు ఆ పట్టణమే గుర్తులేదు. సరి, అక్కడ ఒక ఆటో అతన్ని మాట్లాడుకును ఆది వారం పొద్దున్నే సింహాచల క్షేత్రాన్ని సేవించుకోడానికి బయలుదేరాను. చల్లగాలి ఒక్కణ్ణే ఆటోలో అలా వెళ్తూ సింహాచలం గురించి ఆలోచిస్తూ ఉన్నాను, అంత చల్లని ప్రదేశంలో ఉంటూ కూడా స్వామి అంత వేడిగా ఎలాఉన్నాడాని. ఈలోగా దూరంగా కొండలు కనపడ్డాయి, ఎడమవేపు ఏదో సింహం పడుక్కున్నట్లు దాని వెనకవేపునుంచి నేను చూస్తున్నట్లు ఆకారంగా అనిపించాయి కుడి వైపు దూరంగా ఉన్న ఆకుపచ్చని కొండల మధ్యలోని లోయల గుండా దూరంగా ఉన్న మరో కొండ కనపడింది, అన్నీ పచ్చగా చెట్లతో ఉన్నాయి ఆ కొండ మటుక్కు గంధం, పసుపు, ఎరుపుల కలయికతో సింహాచల సంపంగి పువ్వులాటి రంగుతో లేత సూర్య కిరణాలు పడుతూ గుడిలో ఏం చూస్తావు బయట ఈ విరాట్స్వరూపంలో చూడు అన్నట్లు గంధం అలంకరించబడిన పెద్ద కొండలా కనిపించింది. మనసులోనే నమస్కారం చేసుకుంటుంటే ఆటో రోడ్డుకి ఎడమవేపుకొండ చివర్నుంచి ఎడమవేపుకి మళ్ళింది ఆశ్చర్యం నాకు సింహంపడుక్కున్నట్లు భావన కలిపించిన కొండే సింహాద్రి, అక్కడే శ్రీ లక్ష్మీ వరాహనృసింహస్వామి వేంచేసినది అని సంభ్రమాశ్చర్యానికి గురయ్యాను.
         
ఆటో నిలిపేస్థలానికి వెళ్తూంటే కొండపైకి వెళ్ళేదారిలో మొట్టమొదటే స్వామి విఘ్నేశ్వరాలయం కనిపించింది. స్వామి వారికి నమస్కరించుకుని, ఆటో ఆపుకున్నాము. ఆటోలు కింద ఆపేస్తారుట, వాటికి పైకిఅనుమతి లేదు. బస్సుల్లోకానీ, కార్లలోకానీ వెళ్ళాలి. లేదా దాదాపు వెయ్యి మెట్లు ఉన్న నడకదారి గుండా వెళ్ళాలి. సమయానుభావం వల్ల బస్సులోనే వెళ్ళాను, ఘాట్ రోడ్డులో స్వామివారి నామాలు లిఖించబడి ఉన్నాయి, ఏనామమైతే ఏమిటి అక్కడి వారు అందరూ అప్పన్నా.... అని ఆత్మీయంగా పిలుచుకునే పేరు నేనూ అదే పేరుతో అప్పన్నా సింహాద్రి అప్పన్నా అంటు తలుచుకుంటూ కూర్చున్నాను. ఆ ఆటో అతను పరమ భక్తుడు, భవానీ మాల వేసుకుని ఉన్నారు. భవానీ పద అని ఇద్దరం కలిసి వెళ్ళాం. పొద్దున్నే ఐనా కాస్త జనం ఎక్కువగానే కనిపించారు.

           చుట్టూ చూస్తే ఏవో కొత్త కట్టడాల్లా అనిపించాయి
, సరే అని, స్వామివారికి చక్కని తులసి మాల తీసుకుని ముందుకు వెళ్ళాం. అప్పుడు తల్లి శ్రీమతి గీత (శ్రీ సుబ్బారావుగారి భార్య) గారు చెప్పింది గుర్తి వచ్చింది, సింహాద్రి అప్పన్న దర్శన పూర్తి ఫలం దక్కాలంటే గంగధారలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకోవాలి, కనీసం ప్రోక్షించుకుని దర్శనం చేసుకోండి అని. తిన్నగా మా సెల్ ఫోనులు అక్కడ జమ చేసే చోట ఉంచి. గంగధారకి వెళ్ళాం. వెళ్తుంటే కుడిపక్క మహా ఆలయ గోపురం కనిపించింది అందరూ లైన్లలో వెళ్తున్నారు. కుడిపక్క ఆలయానికి వాయువ్యంలో పురాతన శివాలయం ఉన్నది, నమస్కరించుకుని ముందుకు వెళ్ళాం, ఎందరు భక్తులో ఎంత నమ్మకంతోటో అక్కడికి వచ్చి ఎడం పక్కనున్న కళ్యాణకట్టలో తలనీలు సమర్పిస్తున్నారు. ఎడమ పక్క శ్రీ సీతారామ స్వామి దేవస్థానం ఎప్పటిదో పురాతనం రాతి కట్టడం. గంగ ధార దగ్గరికి రాగానే సింహాల నోటిలోంచి పడుతున్న నీటి ధారలా ఏర్పాటు చేసారుట ఈమధ్య. ఇంతకు పూర్వం వాటి పైన ఉన్న ఏక ధారగానే వచ్చేదిట. ఆ ధార ఎక్కడినుంచి ఊరి ఉబికి బయటికి వస్తున్నదో ఆ కొండమీద తెలియదట. చుట్టూ చూస్తే ఆ కొండ మీద జలపాతాలూ లేవు. వేంకటాచలంలో విరజానది పుష్కరిణి ఐనట్లు, ఇక్కడా గంగమ్మ పాతాళం నుంచి ఉబికి వచ్చిందేమో అనిపించింది. ఆనీటితోనే స్వామికి నిజరూపదర్శన సమయంలో అభిషేకం కోసం అర్చకస్వాములు వినియోగిస్తారట దాదాపు వేయి మందికి పైగా వైష్ణవ స్వాములు ఆ కార్యంలో వారంతట వారుగా పాల్గొంటారట. అక్కడ గంగధార లో నీటిని తీసుకుని కాళ్ళు చేతులు కడుక్కుని తల మీద ప్రోక్షించుకుని ఆ ధారకి నమస్కరించి తిరిగి ఆలయం వేపుకి బయలుదేరాం. అక్కడ పూజకు కావలసిన సామగ్రి తీసుకుని ముందుకు వెళ్ళి 100 రూపాయల వరుసలో వెళ్ళి మా ఇద్దరి దర్శనానికి అర్చనకి కావలసిన రసీదులు తీసుకుని ముందుకు వెళ్ళాం. లైన్లోకి వెళ్ళి పై కుర్తా తీసు ఉత్తరీయం వేసుకుని కుర్తాని సంచీలో పెట్టి ఇంతకు ముందు కొన్న తులసి, పూజా సామగ్రి పట్టుకుని ముందుకు వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు సమర్పించి. ముందుకు సాగాం.
          అలా వరుసలో ముందుకు వెళ్తుంటే అక్కడ కప్ప స్తంభం గురించిన సూచిక కనిపించింది
. ఓహో ఇక్కడే కదా కప్పస్తంభం ఉండేది అసలు దాని వివరమేమో అని ఆలోచిస్తుంటే పక్కనే ఇంకో పలకపై కప్ప స్తంభం గురించి వ్రాసి ఉంది. కప్పస్తంభం అంటే మండూకస్తంభం అన్న భావన కాదని అప్పుడు కానీ అర్థం కాలేదు. సంతానం కోసం పరితపిస్తున్న భార్యా భర్తలు ఆ స్తంభాన్ని కౌగిలించుకుని సంతాన ప్రాప్తికై కోరుకుంటే తప్పక ఆ కోరిక తీరుతుంది. సంతానమే కాదు ఇంకా ఏ కోరికలు కోరుకోవాలన్నా ఆ స్తంభాన్ని కౌగిలించుకుని కోరుకుంటే కోరికలు తీరుతాయి. ఐతే ఆ కోరికలు కోరుకోడానికి అక్కడ కప్పం చెల్లించాలి. కప్పం చెల్లించి కౌగిలించుకుని కోరిక కోర్తే తీర్చే స్తంభం కాబట్టి కప్పం స్తంభం అది కాస్తా కప్పస్తంభం అయ్యింది.
సశేషం..