Pages

Wednesday, November 25, 2020

కార్తీక పురాణము (సంస్కృత మూల సహితం) - 11వ అధ్యాయం

అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే ఏకాదశోధ్యాయః

శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం

 

వసిష్ఠ ఉవాచ:-

భూయశ్శ్రుణుష్వరాజేంద్ర పుణ్యంకార్తికసంభవం

కార్తిక్యామతసీపుష్పైరర్చయేద్యోజనార్దనం!!

యోదుర్వాగ్రైఃకుశాగ్రైశ్చ పూజయేత్కార్తీకేచ్యుతం

ససర్వపాపనిర్ముక్తో యాతితత్పదమవ్యయమ్!!

యోర్చయేదచ్యుతం భక్త్యా కార్తికేరాజసత్తమ

వస్త్రైర్విచిత్రవర్ణైశ్ఛ సలభేత్ఫలముత్తమమ్!!

కార్తికేమాసియస్స్నాత్వా దీపమాలాభిరర్చయేత్

యశ్శ్రావయేత్పురాణాంశ్చ యం కుర్యాచ్ఛ్రవణం తథా!!

అత్త్రైవోదాహరంతీమ మితిహాసంపురాతనం

పాపఘ్నమహదాశ్చర్య మాయురారోగ్యవర్ధనమ్!!

తా: వసిష్ఠుడు చెప్పుచున్నాడు  "రాజోత్తమా! తిరిగి చెప్పెదను వినుము కార్తీకమాసమందు అవిసెపువ్వులతో హరిని పూజించినచో వాని పాపములు నశించి చాంద్రాయణఫలముగలవాడగురు. కార్తీకమాసమందు గరికతోనూ, కుశాగ్రములతోనూ శ్రీహరిని పూజిమ్చువాడు పాపముక్తుడై వైకుంఠము జేరును. కార్తికమాసమందు చిత్రమైన రంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్షమునొందును.  కార్తీకమాసమందు స్నానమాచరించి హరిసన్నిధిలో దీపమాలలను సమర్పించేవాడు, పురాణము చెప్పేవాడు, వినువాడు, పాపములన్నీ నశింపచేసుకొని పరమపదమును పొందెదరు. ఈ విషయ్మై ఒక పూర్వకథ గలదు, అది విన్నంతమాత్రమే అనేక పాపములు పోవును, ఆయురారోగ్యములను యిచ్చును, బహుఆశ్చర్యకరముగానూ ఉండును. ఆ కథ చెప్పెదను వినుము, 

 

కశ్చిత్కళింగ దేశస్థో బ్రాహ్మణోమందరాహ్వయః

స్నానసంధ్యావిహీనస్సన్ పరేషాంభృత్యతాంగతః!!

తస్యభార్యానుశీలాచ పాతివ్రత్యపరాయణా

సర్వలక్షణసంపన్నా నారీణాముత్తమావధూః!!

నాసూయాంకురుతెక్వాపి పతినారాజసత్తమ

సతథాజీవనోపాయం జానీతెసకదాచన

ఖడ్గపాణిశ్చ కాంతారె చౌర్యవిత్తముపాశ్రయన్

పాంథాంనాంబాధతెనిత్యం హత్వావస్తూనివైనృజ!!

గత్వాన్యదేశంబలవాన్ క్రీత్వావస్తూనిస్వశః

తేనోపజీవనంకుర్వన్ కుటుంబభరణాతురః!!

తా: కళింగదేశములో సుందరుడను ఒక బ్రాహ్మణుడు ఉండెను, అతడు స్నాన సంధ్యలను వదిలి ఇతరులకు సేవచేస్తూ కూలిపని చేయుచుండెడివాడు. అతనికి మంచి గుణములు కలిగిన సుశీలయనే పేరు కలిగిన ఒక భార్య ఉండెను ఆమె పతివ్రత, సమస్త సాముద్రిక లక్షణములతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలైయుండెను. ఆ సుశీల భర్త దుర్గుణ పూర్ణుడైనను అతనిమీద ద్వేషభావములేక అతనిని సేవించుచుండెను. ఆ బ్రాహ్మణుడు కూలిపని కష్టమని తలచి చేత ఆయుధము ధరించి అడవి మార్గములో దాగి బాటసారులను కొట్టి వారి ధనములను అపహరించుచుండెడివాడు.

 

పాథం కంచిద్ధ్విజందృష్ట్వా ఖడ్గపాణిస్సకాననే

తమభ్యెత్యాశుసంగృహ్య వటె బధ్వాహరద్ధనం!!

తందృష్ట్వాలుబ్ధకః కౄరః శూరశ్చాపధరశ్శఠః

స్వయంజగ్రాహతత్సర్వం తౌహత్వాదుషధిర్నృప!!

వ్యాఘ్ర సదాగుహాంతస్థో ప్యాజగానుగుహాద్బహిః

తద్గంథమాఘ్రాయాగత్య వ్యాధందృష్ట్వాగ్రహాన్నృప!!

సోపిఖడ్గేనతంవ్యాఘ్ర మహసత్క్రోధసంయుతః

అన్యోన్యాఘాతదోషేణ కాలస్యాయతవంగతౌ!!

తా: ఒక సారి ఆ బ్రాహ్మణుడు దొంగతనము కొరకు మాటు వేసి ఆ మార్గమున వచ్చు బ్రాహ్మణుని పట్టుకుని అతని సొమ్మంతా అపహరించెను, ఇంతలోనో క్రూరుడైన ఒక కిరాతుడు అచ్చి ఆ యిద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమును తాను అపహరించెను. తరవాత గుహలోనుండు ఒక పులి కిరాతుని వాసనచే పసిగట్టి దాడి చేసి వానిని కొట్టెను, ఆ కిరాతుడు తన కత్తితో ఆ పులిని కొట్టెను , ఇద్దరు పరస్పర దాడిలో ఒకేసమయమున చనిపోయిరి.

 

తావేక కాలేహ్యేకత్ర ద్వౌవిప్రౌవ్యాఘ్రలుబ్ధకౌ

జగ్ముర్మరణమేకత్ర కాలసూత్రంతతఃపరమ్!!

తత్రైవకూపెక్రిమివిష్ఠసంకులే మహాభయధ్వాంత సుతప్త రక్తకే

నిమత్నయామాసురధోపరంతాన్ దుఃఖాన్వితాహ్ పాపభరేణ భూపతే!!

సావిప్రపత్నీ సకలైశ్చ ధర్మైరాచార నిష్ఠాహరిభక్తిసంస్థా

సత్సంగసలాపముపాశ్రితాజనైస్సదాపతిధ్యానపరానరేశ్వర!!

తా: ఇట్లు ఇద్దరు బ్రాహ్మణూళూ, కిరాతుడు, పులి నలుగురు ఒకచోట మృతినొంది యమలోకమును చేరి కాలసూత్రముననుసరించి నరకమును పొందిరి. యమభటులు వారినందరినీ పురుగులతోనూ ఆ మేధ్యముతోనూ కూడినటువంటి భయంకర మైన చీకటిలో తప్తరక్త తటాకమునందు పడవేసిరి. ఓ రాజా! ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను చేయుచు ఆచారవంతురాలై హరిభక్తియుతయై సజ్జన సహవాసము చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను.

 

అస్యాగృహంయతిఃకశ్చిదాగతోదైవయోగతః

విష్ణుదేవంస్మరన్నుచ్చైః ప్రనృత్యపులకాంకితః!!

విష్ణు భక్త్యామృతంపీత్వా విష్ణుం సర్వత్రచింతకః

రోమాంచితతనుర్భూవ ఆనందాశ్రుకులేక్షణః!!

తా: ఓ రాజా! ఇట్లుండగా దైవ వశము చేత ఒక యతీశ్వరుడు హరినామ స్మరణమున నృత్యము చేయుచు పులకాంకిత శరీరుడై హరినామామృత పానము చేస్తూ సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనందభాష్పయుతుడై ఆమె యింటికి వచ్చెను.

 

 

తందృష్ట్వా సాచతేభ్యోన్నం దత్వోవాచయతించసా

భవదాగమనంమహ్యం దుర్లభం గృహమేధినాం

గృహీనాస్త్యత్రగేహేస్మిన్ ఏకాకీతత్పరాయణా!!

శ్రుణుభద్రెప్రవక్ష్యామి ముహూర్తమివమందిరె

దినాంతె విష్ణుపురతః పురాణపఠనం మయా!!

కార్యాంతదర్థం దీపస్య వర్తింకృత్వాదదస్వమె

అనేష్యామ్యహమేవాత్ర తైలంతిద్భక్తికారకః

ఇదానీం కార్తికేమాసి పౌర్ణమీవర్తతెశుభా!!

తా: ఆమె ఆ యతిని చూసి భిక్షమిచ్చి అయ్యా యతి పుంగవా మీరు మా యింటికి వచ్చుట చేత నేను తరించితిని, మీ వంటివారి దర్శనము దుర్లభము మాయింటి వద్ద నా భర్తలేడు నేనొకదానినే పతిధ్యానము చేయుచున్నాను. అని చెప్పగా విని ఆ యతీశ్వరుడు ప్రియభాషిణియు శ్యామయునైన ఆమెతో ఇలా అనెను. ’అమ్మాయీ ఈ రోజు కార్తీక పూర్ణిమ, మహాపర్వము ఈ దిన సాయంకాలము హరిసన్నిధిలో మీ యింట్లో పురాణ పఠనము జరుగవలెను, ఆ పురాణముకు దీపముకావలెను, నూనె నాదగ్గర ఉన్నది, కనుక నీవు వత్తిని చేసి యివ్వుము చాలును అని చెప్పెను.

  

ఇతితస్యవచశ్శ్రుత్వా జాతహర్షాన్వితానృప

గృహసంమార్జనంసమ్య ద్గోమయేనోపలిప్యచ

రంగవల్ల్యాస్వస్తికాద్యైరలంకృత్యతతఃపరమ్

తూలంసంశోధ్యవిధివద్వర్తిద్వయమరిందమ

తేనానీ తేన తైలేన దీపం సావిష్ణ వేర్పయత్!!

తా: యతీశ్వరుని మాటలువిని ఆ చిన్నది సంతోషమునొంది గోమయము తెచ్చి ఇల్లు అలికి చక్కగా అందులో పంచరంగులతో ముగ్గులను బెట్టి ఆ తరవాత దూదిని  శుద్ధిచేసి రెండు వత్తులు చేసి ఆ యతికి సమర్పించినది.

 

దీపాపాత్రం తధావర్తిం స్వయందత్వామహర్షిణా

ప్రజ్వాల్యపావకంభక్త్యా జ్వాలాంచసమయోజయత్!!

తత్ప్రకాశస్థలేయోగీ సమర్చ్యజనార్ధనం

పురాణపఠనంతత్ర చకారాత్మవిశుద్ధయె!!

గృహంగృహంతతోగత్వా జనానాహుయసాసతీ

పురాణశ్రవణార్థంతు శుశ్రావచజనైస్స్వయమ్!!

అనన్యబుద్ధ్యారాజేంద్ర స్వయమేవయథాగతః

పశ్చాదంతరితేకాలే కాలధర్మేణసానృప

మమారవిష్ణుధ్యానేన జ్ఞానేనాత్యంతనిర్మలా!!

తా: ఆ చిన్నది దీపపాత్రను వత్తిని తాను సమర్పించినందుకు చాలా ఆనందమును పొందినది. యతి ఆదీపమును వెలిగించి ఆ దీపము ముందర హరిని పూజించి మనశ్శుద్ధికొరకై పురాణపఠనము ప్రారంభించెను. ఆమె, ప్రతియిమ్టికి వెళ్ళి పురాణశ్రవణమునకు రమ్మని చాలామందిని పిలుచుకువచ్చి వారితో సహా ఏకాగ్రమనస్సుతో పురాణమును వినెను. తరువాత ఆ యతీశ్వరుడు యధేచ్చగా పోయెను, కొంతకాలమునకు హరిధ్యానముచేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతినొందెను.

 

తదాజగ్ముర్విష్ణుదూతాశ్శంఖచక్రాంబుజశ్రియః

చతుర్భుజారవిమ్దాక్షాః పీతాంబరధరాశ్శుభాః!!

మనోహరేణదివ్యేనవిమానేనార్కవర్చసా

నానాపుష్ఫఫలై స్తద్వదమరోద్యాన సంభవైః!

ప్రవాళముక్తామణిభిర్విచిత్రైర్వస్తుభూషణైః

అలంకృత్యవిమానాగ్ర్యం తన్మధ్యేతాంనివేశ్యాచ!

విష్ణుభక్త్యైర్వినీతైశ్చ కరతాళైశ్చనర్తనైః

జయశబ్దైస్తూయమానాయయుర్వైకుంఠమందిరమ్!!

తా: అంతలో శంఖచక్రాంకితులు, చతుర్బాహుసమన్వితులు, పద్మాక్షులు, పీతాంబరధారులు ఐన విష్ణుదూతలు దేవతల తోటలో ఉన్న పువ్వులతోను, ముత్యాలు, పగడాలతోను అలంకరించిన మాలికలతోను వస్త్రములతోనూ, అలంకరించబడిన విమానము తీసుకువచ్చి సూర్యునివలె ప్రకాశించే ఆ విమానమందు ఆమెను ఎక్కించి జయ జయ ధ్వనులతో కరతాళధ్వనులు చేస్తూ అనేకమంది వెంటరాగా వైకుంఠలోకమునకు బయలుదేరెను.

 

తదాతద్గమనెశీలా దృష్ట్వాతన్నిరయాలయం

విష్ణుదూతానువాచేదం విస్మితేనాంతరాత్మనా!!

తిష్ఠంతునిమిషం దేవా నరకేతునిపాతితాః

అత్రాంధకూపెపతితః పతిర్మెమృతిమాగతః

త్రిభిస్స్వయంనిపత్యాధో వదధ్వంమమవైష్ణవాః!!

తా: ఆమె వైకుంఠమునకు పోవు దారిలో మధ్యమార్గమున నరకమును చూసి ఆశ్చర్యమొంది విష్ణుదూతలతో ఇట్లు పలికెను, ఓ విష్ణు దూతలారా! నిమిషమాత్రము ఆగండి, ఈ నరకకూపమందు నాభర్తతో ముగ్గురితో పడియుండుటకు కారణమేమీ? అని అడిగెను.

 

విష్ణుదూతాఊచుః :-

పతిస్తవాయం తే మూఢః పరేషాందాసకర్మభిః

చచారచోరవృత్తించ పరవిత్తైకజీవనః!!

వేదమార్గం పరిత్యజ్య దుష్టమార్గేవ్యవస్థితః

తేనకర్మవిపాకేన నిరయం యాతిమంగళే!!

తా: అప్పుడు విష్ణుదూతలు ’ ఓ మంగళా! వీడు నీ భర్త వీడు కూలిచేసి, దొంగతనము చేసి పరధనాపహరణమును చేయుచుండెడివాడు, వేదోక్తమైన ఆచారమును వదిలి దుర్మార్గము చేయుచుండెడివాడు అందువల్ల వీడు నరకమందున్నాడు.’ అని చెప్పెను

 

ద్వితీయోయంద్విజన్సుభ్రు మిత్రఘ్నశ్చాతిపాతకః

బాల్యాదారభ్యతన్మిత్రం ప్రాణాదవ్యధికంశుభె

తంహత్వాదద్ధరం హృత్వా దేశాంతరముపాగమత్!

పతిస్తవాశుభాచార స్తద్ధసంస్వయమాహరత్

మార్గేమధ్యాహ్నసమయె కాననేకమలేక్షణే!

తౌహత్వాలుబ్ధక స్తత్ర సోపివ్యాఘ్రేణదంశితః

శార్దూలమపినాభూయోమృతౌతౌ వ్యాఘ్రలుబ్ధకౌ!

నిరయాలయవాసీచ లుబ్ధకోబ్రహ్మహత్యయా

వ్యాఘ్రోయంచ పురాపాపీ బ్రాహ్మణోద్రావిడశ్శుచిః!

ద్వాదశ్యాంతైలభోక్తాసీద్భక్ష్యభక్ష్యవివర్జితః

తేనకర్మవిపాకేన నిరయాలయమాశ్రితమ్!!

తా: ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు, ఇతని బాల్యమునుంచి మిత్రుడై యున్నవాని నొకనిని చంపి వాని ధనమును అపహరించి ఇతరదేశమునకు పోవుచుండగా ఈ భర్త చేత హతుడయ్యెను, అట్టి పాపాత్ముడు గనుక ఇతను నరకమందున్నాడు. ఈ మూడవవాడు కిరాతుడు, నీభర్తను ఈ బ్రాహ్మణుని ఈ యిద్దరిని చంపినాడు అందుచేత వీడు నరకమునున్నాడు. ఈ పులి పుర్వజన్మమున ద్రావిడ బ్రాహ్మణుడు యితను ద్వాదశినాడు ఏది తినదగినది ఏది కూడదు అనే విచారణ చేయక నూనెను భుజించినాడు అందుచేత వీడు నరకమునందున్నాడు.

 

తైరేవముదితాతన్వీ పునస్తానాహభూపతే

కేనపుణ్యేన తేషాంతు కథం ముక్తిర్భవిష్యతి!!

తా: విష్ణుదేవతలు చెప్పిన మాటలు విని ఆమె వారిని " అయ్యా వీరు ఏ పుణ్యం చేత వీరు నరకమునుంచి విముక్తులయ్యెదరు " అని అడిగెను.

 

తఊచురిత్థం రాజేంద్ర కార్తికేచరితంత్వయా

ఫలందదన్వపౌరాణశ్రవణస్యశుభాననే

పత్యుఃకార్తికమాసస్య తేనముక్తిర్భవిష్యతి

తత్పురాణస్యయద్వర్తిం తత్పాత్రేయత్సమర్పితం

మృగలుబ్ధకయోస్సామ్యం ధర్మం దేహిశుభాననే

మిత్రఘ్నస్యాపుదుర్బుద్ధెః ద్వైజస్యకుటిలాలకే

యదాహూతం జనానాంచ పురాణశ్రవణోత్సుకా

తత్ఫలం దేహివిప్రస్య కృతఘ్నస్యశుభేక్షణే

తేనతేనప్రభావేన ముక్తింయాంతి నసంశయః!!

తా: ఆ మాటవిని విష్ణు పార్శ్వదులు అమ్మా కార్తీకమాసమందు నీచేత చేయబడిన పుణ్యమందు పురాణశ్రవణఫలము నీ భర్తకు ధారపోయుము, దానితో వాడు ముక్తుడగురు, ఆపురాణశ్రవణార్థమై దీపమునకు నీవు వత్తి  సమర్పించిన పుణ్యమును ఈ కిరాతుడు పులుకు ధారపోయుము దానితో వారు ముక్తులగుదురు. ఆపురాణ శ్రవణార్థమై నీవు ప్రతి ఇంటికి వెళ్ళి జనులను పిలిచి పురాణమును వినిపించిన పుణ్యమును ఈ కృతఘ్నుడగు బ్రాహ్మణునకిమ్ము వాడూ ముక్తుడగును అని చెప్పిరి.

 

ఇతితేషాంవచశ్శ్రుత్వా విస్మయాకులితేక్షణా

దత్తందత్తంచ యారాజన్ దానంయన్ముక్తికారణం

తదాతేనారకాన్ముక్తా విమానమధిరుహ్యచ

యయుర్విష్ణుపదంసర్వే శసంతప్తాం నరాధిప

శనైసైజ్ఞానగమ్యస్య ముక్తింయాంతి పరంపదం!!

తా: విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యమును పొందినదై ఆ సుశీల ఆయా పుణ్యములను వారికి ధారపోసెను. దాని చేత వారు నరక బాధా విముక్తులై దివ్యవిమానమునెక్కి ఆ సుశీలను కీర్తిస్తూ మహా జ్ఞానులు పొందెడి ముక్తిపదమును పొందిరి.

 

తస్మాత్కార్తికమాసేతు పురాణశ్రవణంయది

కురుతె రాజశార్దూల సయాతిహరిమందిరమ్!!

యైదందివ్యమాఖ్యానం శ్రుణోతిశ్రద్ధయానివతః

కర్మత్రయార్జితం పాపం తత్క్షణాదేవనశ్యతి!!

తా: కాబట్టి, కార్తీకమాసమందు పురాణశ్రవణము చేయువాడు హరిలోకమును పొందును. ఈ ఆఖ్యానాన్ని వినువారు మనోవాక్కాయములచేత సంపాదించబడిన పాపమును నశింపజేసుకొని మోక్షమును పొందెదరు.

 

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే ఏకాదశోధ్యాయస్సమాప్తః

ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి పదకొండవ అధ్యాయము సమాప్తము.

 

సంకలనం - కూర్పు


శంకరకింకర

(శ్రీఅయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ శర్మ)

~~~~~~~~~~~~~~~~~~~~~~

ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు

जय जय शंकर हर हर शंकर

https://sri-kamakshi.blogspot.com/

 


No comments:

Post a Comment