Pages

Sunday, June 5, 2016

రామాయణమునేఎక్కువ గా ఎందుకు విమర్శిస్తూ ఉంటారు ...?

ఎవరు వ్రాసారో తెలియదుగానీ, వాట్సప్లో ఫార్వర్డ్ గా వచ్చింది... బావుంది విషయం.
------------------------
రామాయణమునే ఎక్కువగా ఎందుకు విమర్శిస్తుంటారు ఈ ఆస్తికనాస్తికులు?

రాముడు శత్రు సంహరం మొదలుపెట్టినదే తాటకతో. అలా అబల ను చంపుట అదేమి న్యాయము? రావణుని చూసి సీత ఆలా ఎందుకు నవ్వింది? సీతాదేవి బంగరు లేడిని ఎందుకు కోరింది?రాజ్య భోగాలు వదిలి వచ్చిన సీతకి బంగారం మీద మోజా ? రాముడు వాలి నెందుకు చెట్టు చాటు నుండి వధించాడు? సీతనిఅగ్ని పరీక్ష ఎందుకు చేశాడు? సీతపై రామునికి నమ్మకము లేదా?
పతివ్రత అయిన సీత తన తపో శక్తితో రావణు ని ఎందుకు చంపలేదు? ఓ చాకలి మాటలు పట్టుకుని మళ్లీ సీతని అడవుల పాలు చేయడం రాముని తప్పు కాదా!!?
...... ఇలా రామాయణం చుట్టూ అనేక ప్రశ్నలు. కొన్నిఅవసరమైనవి,  కొన్నిఅనవసరమైనవి, మరికొన్నితలా తోక లేనివి. 

ప్ర:రామాయణమునేఎక్కువ గా ఎందుకు విమర్శిస్తూ ఉంటారు ఈ ఆస్తిక నాస్తికులు?
జ:ఎందుకంటే రామాయణం ఉత్తమ గ్రంథం కనుక. అటువంటి కావ్యం ఇతః పూర్వం కానీ, ఇతః పరం కానీ లేదు కనుక. అది వారు కూడా ఒక విధంగా ఒప్పుకోలేక ఒప్పు కుంటున్నారు కనుక. దానికి కలిగిన ఆదరణ మరే రచనకు లేదు కనుక.

ప్ర: అంత ఆదరణ కలగడానికి రామాయణం లో ఏముంది?
జ: రామాయణంలో ఏముంది? అనికాదు, ఏది లేదు?అని ప్రశ్నించు కోవాలిమనం.రామాయణ ప్రారంభంలోనే తాను రచిస్తున్నది మామూలు కావ్యం కాదని, అది ఒక ఆదర్శ పురుషుని కథ అని - అనేకులకు ఇది మార్గదర్శకమౌతుందని చెప్పకనే చెపుతారు మహర్షి వాల్మీకి. తన ఆశ్రమానికి వచ్చిన నారదుని వాల్మీకి మహర్షి ఈ విధంగా ప్రశ్నిస్తాడు.

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ।
ధర్మఙ్ఞశ్చ కృతఙ్ఞశ్చ సత్య వాక్యో దృఢవ్రతః ।।

సకలసద్గుణసంపన్నుడు ఎట్టి విపత్తులకు చలించ ని వాడు, సామాన్య- విశేష ధర్మములనన్ని టినీ ఎఱిగిన వాడు, శరణాగత వత్సలుడు, ఎట్టి క్లిష్ట పరిస్థితుల యందును ఆడి తప్పని వాడును, చలించని సంకల్పము కలవాడు అయిన పురుషుడు ఈ లోకమున ఎవడు కలడు?

చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కఃకస్సమర్ధశ్చ కశ్చైక ప్రియదర్శనః | |

సదాచార సంపన్నుడు, సకల ప్రాణులకును హితమును చేకూర్చు వాడు, సకల శాస్త్ర కుశలుడు, సర్వకార్య దురంధరుడు, తన దర్శనముచే ఎల్లరకునూ సంతోషమునుకూర్చువాడు ఎవరు?

ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |
కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే | |

ధైర్యశాలియు క్రోధమును (అరిషడ్వర్గమును) జయించినవాడును, శొభలతోవిలసిల్లువాడును ఎవ్వరిపైనను అసూయ లేని వాడును, రణరంగమున కుపితుడై నచో దేవాసురులను సైతము భయకంపితు లను జేయువాడును అగు మహాపురుషుడు ఎవడు?

ఇటువంటి లక్షణాలు కల మహాపురుషుడు అసలు ఎవరైనా ఈ భూమండలమున నేటి కాలములో ఉన్నాడా? ఉంటే అతని దివ్య చరితమును తెలుసు కోవాలని నాకు కుతూహలముగాఉన్నది

అందుకు నారదుడు  పైగుణములన్నిటికి తగిన వానిగా ఇక్ష్వాకు వంశ ప్రభువైన శ్రీరాముని తెలుపుతాడు. ఇక్ష్వాకు వంశము మిక్కిలి వాసి గాంచినది. లోకోత్తర పురుషుడైన శ్రీరాముడు అందవతరించి, ఎంతయో జగత్ప్రసిద్ధుడాయెను. అతడు మనోనిగ్రహము గలవాడు,గొప్ప పరాక్రమ వంతుడు, మహాతేజస్వి, ధైర్యశాలి,జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతిశాస్త్ర కుశలుడు, చిఱునవ్వుతో మితముగా మాటలాడు టలో నేర్పరి, షడ్గుణ ఐశ్వర్యసంపన్నుడు, శత్రువులను సంహరించు వాడు, ఎత్తైన భుజములు గలవాడు, బలిష్ఠమైన బాహువులు గలవాడు, శంఖమువలె నునుపైన కంఠము గలవాడు, ఉన్నతమైన హనువులు (చెక్కిలి పైభాగములు) గలవాడు, విశాలమైన వక్షఃస్థలము గలవాడు, బలమైన ధనస్సు గల వాడు,అంతశ్శత్రువులను అదుపు చేయగలవాడు, ఆజానుబాహువు, అందమైన గుండ్రని శిరస్సు గలవాడు, అర్థ చంద్రాకారములోఎత్తైన నొసలు గలవాడు, గజాదులకు వలె గంభీర మైననడకగలవాడు .......ఇలా రాముడు సర్వగుణ సంపన్నుడని తెలిపి అతని దివ్య కథను వాల్మీకికి వివరిస్తాడు.

పై గుణములన్నీ కేవలము ఒక కథలోని పాత్రకు కల్పించిన గుణములేఅనుకుందాము రామాయణము కేవలము ఒక (చరిత్ర అని గాక) కథ అనుకుందాము. ఈ గుణములన్నీకథా ప్రారంభముననేప్రస్థావించబడ్డాయి అంటే ఇంతటి గుణములుకలనాయకుని ఈ కావ్యము ద్వారా పరిచయం చేస్తున్నాను అని వాల్మీకి తెలుపకనే తెలుపుతున్నట్టే కదా!

అందులో ఓ భార్యా భర్తల అనురాగం ఉంది. భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి ఉండవలసిన అవగాహన అద్భుతంగా చిత్రించబడింది. ఓ తండ్రి ని ఉత్తమంగా గౌరవించిన కొడుకు కథ ఉంది. ఓ స్వామిభక్తి పరాయణు డైన హనుమ కథ ఉంది. అగ్నిని కూడా భరించ గల ఓ సాధ్వి చరిత ఉంది. ఓ స్నేహ బంధం ( రామ సుగ్రీవులు) ఉంది.  పిత్రు వాక్యపరిపాలకుడు గా, శిష్యుడిగా, సోదరుడి గా, భర్తగా, జగద్రక్షకుడైన రాజుగా రాముని దివ్య గుణముల కీర్తనము అణువణువునా ఉంది. ఆఖరికి రావణుని వంటి వారికి కలిగే గతీ వివరించబడింది. ఇది కేవలం ఒక చరిత్ర ఒక కావ్యం మాత్రమే అనుకుంటే ధర్మ పాలన లో రాముడు, భర్తను అనుసరించడంలొ సీత, సోదర ప్రేమలో లక్ష్మణ - భరతులు, స్వామిభక్తిలో హనుమంతుడు, అధర్మ పరుడైన రావణుడు, బ్రహ్మర్షి వశిష్ఠుడు, రాజ పదవినుండి బ్రహ్మర్షిగా మారిన విశ్వామిత్రుడు.... ఇలా అనేక పాత్రల చిత్రణ అద్భుతంగా రచియింపబడినది. రామాయణంలో ఈ పై పాత్రలన్నీఆయా గుణములలోఅత్యున్నత మైనవి. తరువాత ఏ కావ్యములోనూ ఆయా గుణములలో అంత కంటే  ఉదాత్త పాత్రలను సృష్టించలేక పోయారు. అటువంటి పాత్రలను పరిచయం చేసినవాల్మీకి రచనా పాఠవం తరతరాలు అతనిని మరువకుండా చేసింది. ఇంతటి ఉత్తమ గుణము లు కలిగిన వ్యక్తులు ఒక చోట, ఒకే కాలములో ఉన్నారు అన్నఊహే ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి కథగా చూస్తేనే ఇంతటి పరవశ మైతే ఇక అది నిజంగా మన భరత భూమిమీద జరిగిన చరిత్ర అంటేనో!! అందుకే మన భారతీయ  లకు రామాయణం అంటే అంత ప్రేమ. పరవశం, మమేకత్వం.

ప్ర: మరి ఇంతటి కీర్తి కలిగిన రామాయణానికి ఇన్ని విమర్శలెందుకు వస్తున్నాయి?

జ: ఫలభరితమైన చెట్టుకు దెబ్బలు తగలడం అనేది లోక సహజమే కదా!? హిందూ ప్రజలందరికీ పూజనీయ మైన ఈ రచనలో, అందు లోని పాత్రలలో ఉన్న నీతిని గ్రహించడం మాని దానిని దూషించడమే పనిగా పెట్టుకున్నారు కొందరు వ్యక్తులు. దానికి అనేక కారణములు ఉన్నవి.

రామాయణమును గురించి సరైనఅవగాహన లేకపోవడం:
మనకు అనేకరామాయణ ములు వచ్చినవి.వాటిలో రమణీయమైన వర్ణన ఉండవచ్చునేమో కానీ అసలైన వాల్మీకి రామాయణమును తప్పు దోవ పట్టించినారు. దురదృష్ట వశాత్తు కలి ప్రభావమున ఈ నవీన రామాయణములే పరిచయము కానీ, వాల్మీకి రామాయణము గురించి సరైనఅవగాహన ప్రజలకు లేదు. పైగా పాఠ్యపుస్తకాలలో కూడా ఈ వాల్మీకి రామాయణ మును ఎక్కడాపరిచయం చేయడం లేదు. మన దేశమునే మన రామయణమునకు ఆదరణ లేదు.అయిననూ నేటికీ రామాయణ కథ అనేకులకు ఆదర్శమవు తున్నదీ అంటే అందలి ఆదర్శ గుణములే నని చెప్పవచ్చును.

గుర్తింపు కోసం: 
అవును.!!గుర్తింపు కోసము రామాయణమును కించ పరుచువారూ ఉన్నారు. మనం పక్కింటి వాడినో, ఎదిరింటి వాడినో తిట్టా మనుకోండి వాడికీ వీడికీ ఏదో గొడవ ఉన్నట్టుంది మనకెందుకులే అని ఎవరూపట్టించుకోరు. అదే ఏ ముఖ్యమంత్రినో, ప్రధాన మంత్రినో, సినీ తారనో తిడితే అభిమానులు,వ్యతిరేకులు అందరూ "ఎందుకు తిడుతున్నాడు? ఏమిటి కారణం?" అని మనల్ని గుర్తిస్తారు. టీవీ చానళ్లు మొదలైనవి ఇక ఊదర గొట్టేస్తాయి. అలా అందరి గుర్తింపుమనకిలభిస్తుంది. ఫ్రీ పబ్లిసిటీ అన్నమాట. ఇక మనం ఏమి చేసినా అది ఒకవార్త అవుతుంది. కొన్నిరోజులు మనం తుమ్మినా దగ్గినా అది టీవీలో వచ్చేస్తుంది. కానీ అది ఎన్ని రోజులు? కొన్నిరోజులు మాత్రమే. విషయం పాత బడిన తరువాత మనం ఎవరో పక్కింటి వాడు కూడా పట్టించుకోడు.పైగా మనం అనవసరంగా ఆరాజకీయ నాయకుడినో, సినిమా యాక్టర్నోతిట్టామని తెలిసినా, మనఐడెంటిటీ క్రైసిస్ బయటపడినా మనల్ని ఓ నీచమైన చూపుతో చూస్తారు తెలిసినవారందరూ.

మత వ్యతిరేకత ( లేదా ) నాస్తిక వాదన: 
మత వ్యతిరేకతతోనో, లేదా దైవము మీద నమ్మకము లేకనో కూడా అనేకులు ఈవిమర్శలను గుప్పిస్తుంటారు. సాధారణంగా ఇటువంటి వారు ఇందులోనిమంచిని గుర్తించరు. ఒప్పుకోరు. కేవలం తమకు అసమంజసమని, తప్పు అని అనిపించిన దానిని మాత్రమే పదే పదే చర్చిస్తూ ఉంటారు. ఎవరైనా వీరితో వాదన మనకెందుకులే అని మాటాడక ఊరుకుంటే తామే గెలిచినట్టు,తమదే సరిఅయినమార్గమన్నట్టు అహంకరిస్తారు. పోనీ అది సరికాదని ఖండిస్తే, నిరూపణలతో చూపిస్తే దానిని స్వీకరించక- తప్పు అనిపించినా ఒప్పుకోక మరో వాదన తీసుకు వస్తారు. ఎందుకంటే తామే నిజమై నమార్గంలోఉన్నామన్నది వీరి ఆలోచన.తమలో, తమ భావాలలో మార్పుకు సహజంగా వీరు సిద్ధంగా ఉండరు.

ఋషుల భావం గ్రహించలేకపోవడం: మన పురాణములన్నీ ఋషులచే ప్రసాదించ బడినవి. వారు అనేక సందర్భాలలో ఆయా సంఘటనలను పూర్తిగా వివరింపక మనకే వదిలి వేస్తారు. 
ఉదాహరణకు : సత్యనారాయణ కథలో పేద బ్రాహ్మణుడు వ్రతం చేసిధనవంతుడైపోతాడుఅలాగే కట్టెలమ్ముకునే వాడు సమస్త సంపత్తులూ పొంది సుఖిస్తాడు. అని వివరింపబడి ఉంటుంది కానీ ఎలా పొందారు? అన్నదానికి వివరణ ఉండదు.సరిగ్గాఇటువంటి సందర్భాలు విమర్శ చేయడానికి అనువుగా తోస్తున్నాయి అనేకులకు. వ్రతం చేయగానే ధనవంతుడైపోతాడా!!? లేదా పూజ చేయగానే పాపాలన్నీతొలగి సమస్త సంపదలు అలాఎలా వస్తాయి!!?. పూజ చేస్తే చదువు వస్తుంది. పెళ్లి అవుతుంది అంటారు. ఇవన్నీఎలా సాధ్యం!!?? అంత అసంబద్ధంగా రచన ఎలా చేశారు ఋషులు? వారికి స్క్రిప్ట్ రైటింగ్ సరిగా రాదా!!? అని వాదిస్తారు అనేకులు. నమ్మకం లేని వారికి సమాధానం చెప్పడం చాలా కష్టం.కానీఇలాంటి వారికి ఒక ప్రశ్న. మనం తిండి ఎందుకు తింటాం? {నన్నుతప్పుగా అనుకోకండి.} నిజంగానే అడుగుతున్నాను మనం తిండి ఎందుకు తింటాం? బ్రతకడం కోసం ఔనా!? మరి తిండి తింటే ఎలా బ్రతుకుతాం? తింటే ఓపిక వస్తుంది. లేక పోతే నీరసం వచ్చిక్రుంగి, కృశించిపోతాం. అంటే తిండి మనకు శక్తిని ఇస్తున్నది. అంతవరకు బానే ఉంది. కానీ ఆశక్తి ఎలా వస్తున్నది? ఆహారం గ్లూకోజ్ గామారి రక్తంలో కలుస్తున్నది. అందువలన మనకు శక్తి కలుగుతున్నది. ఇది అందరూ నమ్మేసిద్ధాంతం కానీ ఆ పనితీరు మనకు ఎలా తెలుసు? మనమే మైనా ఎవరి ప్రేగులైనా కోసి చూశామా? లేదు అలా పరిశోధించిన అనేక మంది శాస్త్రఙ్ఞులు చెప్పారు కనుక మన చిన్న నాటి నుండీ ఆ పరిశోధనలను పుస్తకాల లో చదువుకున్నాము కనుక దానినిఅందరమూ నమ్ముతాము. అయితే ఇది మన నమ్మకం మాత్రమే.మనకు అందరికీ ప్రత్యక్షంగా తెలియదు. కేవలం ఆహారం స్వీకరించడంతెలుస్తోంది, శక్తి రావడం తెలుస్తోంది ( పనులు చేయగలుగు తున్నాం కనుక)మధ్యలో జరిగే గ్లూకోజ్గా మారడం - రక్తంలో కలవడం వంటివి మనకు కంటికికనపడవు. అలాగే పూజ చేయడం తెలుస్తుంది. ఫలితం రావడం తెలుస్తుంది. కానీ మధ్యలో జరిగే తంతు మనకు కనపడక దానంతట అదే మనల్ని మన లక్ష్యం వైపుకు నడిపిస్తుంది. నిజానికి మనకు పూజలు, దైవ ధ్యానము మొదలైన వాటివల్ల కేవలం విల్ పవర్ మాత్రమే వస్తుంది. దానితో మనం కోరుకున్నది సాధించ గలము. ఇవన్నీకొందరు చింతన ద్వారా గ్రహించి (పరిశోధించి) వాటి సారాన్నిమనకు అనేక కథలుగా వ్రాశారు. పురాణాలలో అనేక కథలు వివరించడంలో దానిలో ప్రధానమైన విషయాలను విశదంగా వివరించి, కొన్నిటిని మన ఆలోచనకే వదిలేశారు మన ఋషులు. కానీ అవి అర్థం కాక, కలి మాయ చేత అనేక దూషణలు చేస్తుంటారు నాగరికులు.

ఇలా అనేక కారణముల తో రామాయణాదిపురాణ ఇతిహాసములువిమర్శల కు గురి అవుతున్నవి. మరి వీటిని ఆపలేమా? కనీసం ఖండించ లేమా? దానికి మార్గాలు ఏమిటి? అనేకం ఉన్నాయి.

1. పాఠశాల స్థాయి నుండీ మన రామాయణాన్ని ఇతర ఇతిహాస పురాణా లను (మూలములను) పాఠ్యాంశాలలో కొంత వరకైనా పరిచయం చేయాలి.
2. ఇంట్లో పిల్లలకి ఈ మూల రామాయణమును, భారతమును వివరించి కథలుగా చెప్తూ ఉండాలి. అందువలన మధ్యలో చేర్చబడినవి ఏమిటో తెలుస్తుంది.
3. ఈ విధంగా తెలిసిన విషయాలను ఎవరైనా అఙ్ఞాన వశము చేత వ్యతిరేకిస్తుంటే, కించ పరుస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకొనక మన వాదనను వినిపించాలి. అది వారికొరకు కాదు. ఆ కువిమర్శలు నిజమను కుని దానివైపు వేరొకరు ఆసక్తులవకుండాఉండుటకొరకు. కనీసం చుట్టూ చేరిన జనులైనా నిజం ఏమిటో గ్రహిస్తారు. ఒక్కరికి అసలు విషయం చేరినా సంతోషమే కదా! మనం ఖండిచకపోతే సరిఅయిన అవగాహన లేని నేటి తరం పదే పదే వినిపించే భగవద్దూషణ ములే సరి అయిన మార్గమనుకునే అవకాశం చాలా ఉంది. కనుక మనకు తెలిసినంత మేర ఖండించాలి.

4. కేవలం వాదన వినిపించడమే కాక, భారతీయసాంప్రదాయము, పురాణేతిహాసములు నా ప్రాణములు. వాటిని కించ పరచడం నా దేశమును కించపరచ డమే. కనుక చట్టపర మైన, న్యాయపరమైన పోరాటమునకు కూడా నేను సిద్ధమే అని నిరూపించాలి.  అంటే ధర్మ యుద్ధానికి సిద్ధ పడాలి.

ఇలాంటి అనేక చర్యలు తీసుకుంటేగానీ మన వఙ్ఞ్మయమును మనం రక్షించుకొనలేము. ఇది మన అందరి ఆస్థి. దీనిని రక్షించుకొనుట మన కర్తవ్యం. ఇప్పటికైనా గళములు విప్పి మీ వాదన వినిపించండి. ధర్మ పోరాటం చేసే వారికి మీ సమ్మతిని, మేము మీకు తోడున్నాం అనే ధైర్యాన్నిఇవ్వండి. సరి అయిన దారిలో మీరు నడవడమే కాక నలుగురి నీ నడిపించండి. చూస్తూ కూర్చుంటే మన అస్థిత్వాన్నేమనం కోల్పోవలసిన స్థితి వస్తుంది.

। జై శ్రీరామచంద్ర ప్రభు। 🙏🙏🙏

3 comments:

  1. ఈ వ్యాసాన్ని శ్రీ రాజశేఖరుని విజయ శర్మ గారు తన బ్లాగు (rajasekharunivijay.blogspot.com)లో వ్రాసారు!!

    ReplyDelete
  2. ఓహ్ శ్రీ రాజశేఖరునివారిదా.._/।\_

    ReplyDelete
  3. ఓహ్ శ్రీ రాజశేఖరునివారిదా.._/।\_

    ReplyDelete