జై శ్రీ రాధే కృష్ణ
బృందావనంలో ఒక గొప్ప పండితుడు, పరమభక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజూ తన ఇంట్లో పూజించే ఠాకూర్ శ్రీకృష్ణునికి ఒకరోజు అద్భుతమైన పూలబంగళా అలంకారం చేసి, అందులో స్వామిని కూర్చోబెట్టి సేవ చేయాలని సంకల్పించాడు.
దగ్గరలో పెద్ద పూలఅంగడి ఎక్కడ ఉందో విచారించగా, మథురలో ఉందని తెలిసి అక్కడికి వెళ్లాడు. ఎన్నో రంగురంగుల పూలతో కళకళలాడుతున్న ఆ అంగడిలో పువ్వుల ధరలు చూస్తూ వెళ్తుండగా, ఒకచోట గులాబి పూలమ్మేవాడు కనిపించాడు. ఆ గులాబీలు ఎంతో మృదువుగా, తాజాగా, అందమైన గులాబి వర్ణంతో మనోహరంగా మెరిసిపోతున్నాయి.
“ఈ గులాబీలతో నా ఠాకూర్కు ఒక అందమైన మహల్ కట్టి సేవించాలి” అని భావించి, ఆ పూలకొట్టు యజమానితో బేరమాడి ధర నిర్ణయించుకున్నాడు.
ఆ సమయంలో దేశంలో ముఘల్ పాలన సాగుతోంది. అక్బర్ చక్రవర్తి తన షాహీ మహల్ను పూలతో అలంకరించమని ఆజ్ఞాపించడంతో, అతని అధికారులు అదే మార్కెట్కు పూలు కొనడానికి వచ్చారు. వారిలో ఒక అధికారి కళ్ళు ఆ గులాబీలపై పడ్డాయి.
“ఆ పూలు నాకు కావాలి” అని అతడు కొట్టు యజమానితో అన్నాడు.
అందుకు యజమాని, “అయ్యయ్యో! ఇవి ఇప్పటికే వీరికి అమ్మేశాను. మీరు వేరే పూలు తీసుకోండి” అన్నాడు.
“కుదరదు. అవే కావాలి. ఇతను ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తాను” అన్నాడు అధికారి.
యజమాని, “బేరమైపోయిన పూలకు మళ్లీ కొత్త బేరమేమిటి?” అని చెప్పినా, అతడు వినలేదు.
అప్పుడు అధికారి, “నేనెవరినో తెలుసా? ఈ దేశాన్ని పాలించే సుల్తాన్ అక్బర్ దగ్గర పనిచేసే అధికారిని. ఇవాళ సుల్తాన్ మహల్ను అలంకరించాలి. ఈ పూలే కావాలి. ఇతను ఎంత చెప్పాడో దానికి రెట్టింపు ఇస్తాను” అన్నాడు.
అది విన్న ఆ భక్తుడు తనలో తాను ఇలా అనుకున్నాడు:
“ఈ భూమిలో కొంత భాగాన్ని పాలించే రాజు సేవకుడే ఇలా అంటుంటే, సర్వలోకాలను పాలించే సకలబ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణుని సేవకుడైన నేను ఎందుకు వెనక్కి తగ్గాలి?”
అంతే, అతడూ బేరం పెంచసాగాడు. ఇద్దరూ తగ్గకుండా వెండి రూపాయల నుంచి బంగారు మొహరీల వరకూ ధర పెంచుకుంటూ పోయారు — పది, పదిహేను, ఇరవై, ముప్పై, యాభై… చివరకు వంద బంగారు మొహరీల వరకూ వెళ్లింది.
చివరకు ఆ అధికారి,“ఈ గులాబీలకు వంద మొహరీలేమిటి! ఇంకెక్కడో కొనేస్తాను” అని వెళ్లిపోయాడు.
అప్పుడు పూలకొట్టు యజమాని ఆ భక్తుణ్ని చూసి,
“అయ్యా! బేరం వంద బంగారు మొహరీల వద్ద ఆగింది. కాబట్టి మీరు ఆ డబ్బు ఇచ్చి ఈ గులాబీలు తీసుకెళ్లండి” అన్నాడు.
కానీ ఆ భక్తుని దగ్గర చూసుకుంటే పది, పదిహేను వెండి రూపాయలకన్నా ఎక్కువ లేవు. అయినా తన సంకల్పం విడువలేదు. వెంటనే ఇంటికి వెళ్లి తన భార్యను పిలిచాడు. పొరుగువారిని, తాకట్టు వ్యాపారులను రప్పించి ఇల్లు అమ్మేశాడు.
కట్టుకునే ముతక బట్టలు మాత్రమే ఉంచుకుని, ఇంట్లో పూజించే ఠాకూర్ను చేతబట్టి, మిగిలిన విలువైన వస్తువులు, పట్టు బట్టలు, సామగ్రి అన్నీ అమ్మేశాడు. ఇంకా సరిపోక కొద్దిగా అప్పు కూడా చేసి, ఆ డబ్బంతా తీసుకెళ్లి పూలబ్బికి చెల్లించాడు.
తాను, తన భార్య — కట్టుబట్టలతోనే, చేతిలో ఠాకూర్ను పట్టుకుని, తలపై గులాబీపూల బుట్టలు మోసుకుంటూ బృందావనానికి బయలుదేరారు.
బృందావనంలో ఒక విశాలమైన వనం మధ్య పెద్ద నీడనిచ్చే చెట్టు కింద ఆగారు.
“ఇక్కడే బాగుంది” అని భావించి, ఒక బట్ట పరచి ఠాకూర్ను కూర్చోబెట్టాడు. ఆ తరువాత తీగలతో గులాబీపూల దండలు అల్లుతూ, చిన్న అందమైన పూలబంగళా నిర్మించాడు. అందులో ఠాకూర్ను కూర్చోబెట్టాడు. మరికొన్ని గులాబీలతో ఎంతో జాగ్రత్తగా ఒక సుందరమైన దండ అల్లి, ఠాకూర్ మెడలో సమర్పించాడు.
అదే సమయానికి గిరిరాజ్ గోవర్ధనగిరి సమీపంలోని శ్రీనాథ్ ఆలయంలో హారతి సేవ జరుగుతోంది. అక్కడ శ్రీనాథ్ మూర్తి — ఒక చెయ్యి పైకెత్తి, మరొక చెయ్యి నడుముపై ఉంచి, గోవర్ధనగిరిని ఎత్తిన రూపంలో నిటారుగా నిలిచి ఉంటాడు.
గోస్వామిగారు హారతి ఇస్తుండగా, అకస్మాత్తుగా శ్రీనాథ్జీ మెడ వంగిపోయింది. ఆయన కళ్ళలోనుండి టపటపా నీళ్లు కారసాగాయి.
గోస్వామిగారు భయాందోళనలకు గురయ్యారు.
“జై జై ఠాకూర్! ఏమైంది స్వామీ?” అని ఆదుర్దాగా ప్రార్థించారు.
అప్పుడు ఠాకూర్ ఇలా పలికాడు:
“గోవర్ధనగిరిని చిటికెనవేలిపై ఎత్తిన ఈ శ్రీకృష్ణుడు, ముల్లోకాల భారాన్ని నిత్యం భరించే ఈ శ్రీకృష్ణుడు — తన సర్వస్వాన్ని నాకోసం త్యజించిన ఒక భక్తుడు వేసిన ప్రేమమాల బరువును మాత్రం మోయలేకున్నాడు. నా మెడ ఎంతో నొప్పిగా ఉంది.”
అది విన్న గోస్వామిగారు వెంటనే హారతి ఆపించి, పరదా వేయించారు. తరువాత తన శిష్యులను, అక్కడున్న ఐశ్వర్యవంతులైన భక్తులను పిలిచి,
“వెళ్లండి! ఠాకూర్ కోసం సర్వస్వం త్యజించిన ఆ మహాభక్తుడు ఎక్కడున్నాడో వెతికి, అతని కష్టాన్ని తీర్చి, గౌరవంగా ఇక్కడికి తీసుకురండి” అని ఆజ్ఞాపించారు.
వెంటనే వారంతా బృందావనం అంతా వెతకసాగారు. చివరకు ఒక పండితుడు ఠాకూర్ కోసం గులాబీ బంగళా అలంకారం చేయాలని తన యావదాస్తిని అమ్మేసి వనంలోకి వెళ్లిపోయాడని తెలిసింది.
వాళ్లు అక్కడికి వెళ్లి చూసేసరికి — గులాబీలతో నిర్మించిన ఆ బంగళా, అందులో వెలిగిపోతున్న ఠాకూర్ సేవ — చూసి ఆశ్చర్యపోయారు.
వెంటనే ఆ భక్తునికి జరిగిన విషయమంతా వివరించి, ఒప్పించి, అతని ఇల్లు, సామగ్రి అన్నీ తిరిగి విడిపించి, భార్యతో పాటు ఠాకూర్ను తీసుకుని శ్రీనాథ్జీ మందిరానికి తీసుకువచ్చారు.
ఆ భక్తుడు మందిరంలోకి ప్రవేశించి శ్రీనాథ్జీని చూడగానే ఆశ్చర్యపోయాడు.
శ్రీనాథ్జీ మెడ వంగి ఉంది. తాను గులాబీలతో అల్లిన మాలలాగే ఒక పెద్ద గులాబీమాల స్వామి మెడలో అలంకరించి ఉంది.
గోస్వామిగారు ఆ భక్తుడిని చూసి ఆనందంతో ముందుకు వచ్చి, శ్రీనాథ్జీ మెడలో ఉన్న ఆ గులాబీమాలను తీసి ఆ పండితుని మెడలో వేసారు.
అంతే!క్షణంలోనే శ్రీనాథ్జీ మెడ సరిగా నిలిచింది. కళ్ళు విశాలంగా విప్పి, తన ప్రియభక్తుణ్ని ప్రేమగా చూస్తూ, చిరునవ్వుతో మళ్లీ స్థిరంగా నిలిచారు.
-----
అగణితవైభవ కేశవ
నగధర వనమాలి యాది నారాయణ యో
భగవంతుఁడ శ్రీమంతుఁడ
జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణా!
-----
గోవర్ధనగిరిధార గోవింద - గోకులబాలక పరమానంద!
శ్రీ వత్సాంకిత శ్రీ కౌస్తుభధర - భావకభయహర పాహి ముకుంద!
- శంకరకింకరః
No comments:
Post a Comment