Pages

Saturday, June 1, 2019

దుర్వాస మహర్షి



(Whatsapp Collection, do not know the original author)
దుర్వాస మహర్షి, కంచి కామాక్షీ అమ్మవారి ఆలయంలో అనేక మంది భక్తులకి వారు ప్రత్యక్ష  దర్శనం ఇచ్చి అనుగ్రహించారు. కామాక్షీ అమ్మవారికి చందనోత్సవం చేసినప్పుడు ఇప్పటికీ, అమ్మవారి కుడి వైపు దుర్వాస మహర్షిని చూడవచ్చని, ఆ దర్శనం చేయగలిగిన సత్పురుషులకు వారు కనబడతారని పెద్దల విశ్వాసం. ఎంతో మంది శ్రీవిద్యోపాసకులకు దుర్వాసో మహర్షి ఆరాధ్య దైవం మరియు సద్గురువు. గురువు నుండి పొందిన శ్రీవిద్యా మంత్రాలు, ఏ కొంచెమైనా కూడా, పూనికతో కామాక్షీ ఆలయంలో అనుష్ఠిస్తే, వారికి తప్పకుండా దుర్వాసో మహర్షి అనుగ్రహం లభిస్తుందనీ, వారికి ఆయనే ఉపాసనలో ముందుకు నడిపించే దిశానిర్దేశం చేస్తారనీ ఎంతో మంది భక్తుల అనుభవం. 

దీనికి ఉదాహరణ, తమిళనాడులోని తిరుచిరాపల్లిలో మీనాక్షీ అమ్మళ్ అని ఒక తల్లి ఉండేది. ఆమెకి చాలా చిన్న వయసులోనే ఆమె మామగారే గురువై శ్రీవిద్యా దీక్ష ఇచ్చారు. అయితే, ఆమె ఎన్నో రోజులు సాధన చేయకమునుపే, ఆ గురువు (ఆమె యొక్క మావగారు) తనువు చాలించారు. అప్పటికి ఆ తల్లికి శ్రీవిద్యోపాసనలో ఇంకా సాధనాబలం లేదు. ఆమెకి గురువు గారు ఇచ్చిన మూలమంత్రము ఒక్కటే తెలుసు.

ఆమె ఆ మూలమంత్రమునే భక్తితో కొంత కాలం సాధన చేసింది. అయితే ఆమె తరచుగా తిరువారూర్ లో ఉన్న కమలామ్బికా అమ్మవారి క్షేత్రములో కూర్చుని ఆ మంత్ర జపము చేసేది. ఒకనాడు, అదేవిధముగా ఆ ఆలయములో జపం చేస్తూ ఉంటే, మంచి స్ఫురద్రూపి అయిన ఒక వృధ్ధుడు ఆమె యెదుటకి వచ్చి, నువ్వు కంచిలోని శ్రీవిద్యా పరమేశ్వరీ అమ్మవారి సన్నిధికి (అంటే కామాక్షీ అమ్మయే) వెళ్ళు, అక్కడ నీవు చేసే మంత్ర జపమునకు న్యాసము (కరన్యాసము, అంగన్యాసము) కూడా దొరుకుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. ఆమె వెంటనే కంచి కామాక్షీ అమ్మవారి సన్నిధికి వెళ్ళింది. ఆశ్చర్యంగా ఆమెకి ఇక్కడ కూడా అదే వృధ్ధుడు దర్శనమిచ్చి, అక్కడ అమ్మ వారి ప్రాంగణములోనే ఉన్న మరొకరిని చూపించి ఆయనని ఆశ్రయించమని చెప్పారు. వెంటనే ఆ తల్లి పరుగు పరుగున వెళ్ళి వారి పాదములకు నమస్కారం చేసి, జరిగినదంతా చెప్పింది.

ఆ పెద్ద మనిషి మైసూర్ కు చెందిన శ్రీ యజ్ఞనారాయణ శాస్త్రి అనే ఒక గొప్ప శ్రీవిద్యోపాసకుడు. శాస్త్రి గారు, నేను నీకు ఎలా తెలుసమ్మా అని ఆవిడని అడిగితే, ఆ తల్లి వెనుకకు తిరిగి, అక్కడ నిల్చున్న వృధ్ధుడిని చూపించింది. విచిత్రముగా, ఆ వృధ్ధుడు శాస్త్రి గారు, ఆ తల్లి ఇద్దరూ చూస్తుండగా అంతర్ధానం చెందారు. తదుపరి ఆ తల్లి కామాక్షీ ఆలయంలో ప్రదకక్షిణ చేస్తూ ఉండగా, దుర్వాస మహర్షి సన్నిధికి వచ్చి నమస్కరించగానే, అక్కడ అంతర్ధానం చెందిన వృధ్ధుడే దుర్వాస మహర్షి మూర్తి యందు కనబడి, ఆమెను దీవించారు. ఇది నిత్య సత్యమైన లీల. ఇప్పటికీ ఆ తల్లి ప్రతీ యేటా కంచి వెళ్ళి అమ్మ దర్శనముతో పాటు, దుర్వాస మహర్షి యొక్క దర్శనము కూడా పొందుతారు.

No comments:

Post a Comment