Pages

Thursday, October 4, 2018

పూజ, అభిషేకం, నీ భజనలు పారాయణలు ట్రాష్ అని ఏ జ్ఞానీ, పండిన ఏ పండితుడూ చెప్పడు


పరమాత్మనాశ్రయించిన గజేంద్రుడు గొప్పవాడుకాడా? స్తోత్రం చేయలేదా భగవానుడు రక్షించలేదా?

శ్రీకృష్ణుణ్ణాశ్రయించి రాజ్యం బడసిన పాండవులు గొప్పవారు కారా? పూజించలేదా భగవానుడు రక్షించలేదా?
-------------++

శ్రీగురుభ్యోనమః

చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున !
ఆర్తో జిజ్ఞాసురర్థార్టీ జ్ఞానీ చ భరతర్షభ !!
అర్జునా! ఆపదలో ఉన్నవారు, ధనాన్ని కోరుకునేవారు, నన్ను తెలుసుకోగోరేవారు, జ్ఞాని అనే ఈ నాలుగు రకములవారూ నన్ను భజిస్తారు.

ఈ శ్లోకం అనంతరం ఇందులో నాకు జ్ఞాని, జ్ఞానికి నేను ఇష్టులం అని చెప్పారు పరమాత్మ. సరే అసలు విషయానికొస్తే, స్వయం పరమాత్మయే ఆయనను పూజించేవారు/ కీర్తించేవారు/స్తుతించేవారి/ సేవించేవారు నాలుగురకాలు అని ఒప్పుకున్నారు. కాదనడానికి మనమెవరం?  స్థాయీ బేధాలున్నాయని భగవానుడే చెప్పినపుడు, ఠాఠ్ మిగతా ముగ్గురూ వేష్ట్ జ్ఞానమున్నవాళ్ళే బెస్ట్ అని చెప్పడానికి కాదు జ్ఞానం ప్రోది చేసుకునేది.

కొత్త కొత్త మాటలు వినబడుతున్నాయ్ భగవంతుడు స్తోత్రప్రియుడుకాడు, పూజాప్రియుడుకాడు ఇత్యాది ఇత్యాది... అది అహంకారాజ్ఞానజనితమైన మాట అని భగవంతుని మాటల సారంగా ఎరగవచ్చు.

Ø పరమాత్మనాశ్రయించిన గజేంద్రుడు గొప్పవాడుకాడా? స్తోత్రం చేయలేదా భగవానుడు రక్షించలేదా?

Ø శ్రీకృష్ణుణ్ణాశ్రయించి రాజ్యం బడసిన పాండవులు గొప్పవారు కారా? పూజించలేదా భగవానుడు రక్షించలేదా?

Ø ధ్రువ ప్రహ్లాదాదులు గొప్పవారు కారా? సర్వత్ర సమభావన చూపి రాజ్యాదులు పొంది భగవంతుని తెలుసుకోలేదా?

Ø జ్ఞానులైన నారద మైత్రేయ విదురాదులు పైవారినెప్పుడైనా తక్కువగా చూశారా? మా భక్తియే భక్తి మీవికావన్నారా?
 
అలా కానే కాదు, అలా తేడా చూపడం కుదరదు. పండిన జ్ఞానం ఉన్నప్పుడు ఔదార్యం ఇనుమడించాలి.

న బుద్ధిభేధం జనయేదజ్ఞానాం కర్మసఙ్గినామ్!
జోషయేత్సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్!!
కర్మలయందాసక్తిని కలిగియున్నవారి బుద్ధిని పండితుడు/జ్ఞాని చెదర కొట్టరాదు. తాను జ్ఞానమార్గంలో నిలిచి, ఆమార్గంలో  చక్కగా కర్మలనాచరిస్తూ, కర్మాసక్తులైన వాళ్ళని ఆ మార్గాన్ని అనుసరించి కర్మలాచరించేలా ప్రోత్సహించాలి.

పైవిధంగా భగవానుడే చెప్పాడు. నువ్వు చేసే పత్రి పూజ ట్రాష్, నువ్వు చేసే అభిషేకం ట్రాష్, నీ భజనలు పారాయణలు ట్రాష్ అని ఏ జ్ఞానీ, పండిన ఏ పండితుడూ చెప్పడు , భగవంతుడంతకన్నా చెప్పడు. సగం సగం జ్ఞానం ఉంటేనే మిడిసిపాటు తొట్రుపాటు అది పామర జనానికి గ్రహపాటు.
 

మేము సామూహికంగా పారాయణ చేస్తున్నామండీ. సంతోషం ఈఈ జాగ్రత్తలు తీస్కుని ఇలా పారాయణ చేయండి. ఫలానా అభిషేకం అండీ, ఓహ్ అద్భుతం, ఆయా ద్రవ్యాలను చక్కగావాడి ఈ విధంలో వినియోగించి చక్కగా అభిషేకించండి, ఫలానా పత్రి పూజండి, రొట్టలు తెచ్చి వేయకండి, ఇదిగో ఈఈ రకంగా సేకరించి తెచ్చి చేయండి సమాజంలో కలిసి మెలిసి చేయీ చేయీ పట్టుకుని ప్రస్థానం సాగించండి అని మార్గదర్శనం చేస్తారు విజ్ఞులు. అంతే తప్ప ఠాఠ్ ఎవడు చెప్పాడు, ఒక్కడివీ పూజ చెయ్, ఒక్కడివీ భజన చెయ్ ఇవి తాలుధాన్యం మాటలు.
 

సాధన క్రమంలో ఒక్కడుగా సాధించలేనివి సంగంతో పదిమందితో కలిసి సాధిస్తాడు. పోను పోనూ ఏకాంతతపై అనురక్తి కలుగుతుంది ఒక్కోమెట్టూ ఎక్కుతాడు. అంతే తప్ప పై అంతస్థులలో ఉన్నవాడు కిందున్నవాణ్ణి చూసి గేలి చేస్తే ఆ వ్యక్తిని అవివేకి అనే అంటారనడంలో సందేహంలేదు!

పండిన జ్ఞానానికి గుర్తు నీలో లోకులపై పెరిగిన ఔదార్యం, ప్రేమ. అంతేకాని హేళన లోకువ కాదు!

-శంకరకింకర

2 comments:

  1. పండిన జ్ఞానానికి గుర్తు నీలో లోకులపై పెరిగిన ఔదార్యం, ప్రేమ. అంతేకాని హేళన లోకువ కాదు-

    చాలా బాగా చెప్పారు. ఒక బ్లాగ్ స్వామీజీ ఉన్నారు. ఆయన మహా పండితుడే. కానీ అమాయకంగా అయ్యప్ప పూజలు చేసుకునే వారిని అదేపనిగా విమర్శిస్తాడు.

    ReplyDelete
  2. చక్కని వివరణ ఇచ్చారు. జైశ్రీరామ్

    ReplyDelete