Pages

Saturday, July 30, 2022

శంకరుల కాల నిర్ణయం - 1

 ధర్మాకృతి : శంకరుల కాలము - 1

ఆంగ్లేయ చరిత్రకారులు, వారినే అనుసరిస్తున్న ఆధునిక చరిత్రకారులు ఆదిశంకరుల కాలాన్ని క్రీ.శ.766గా నిర్ణయించారు. పాశ్చాత్యులకు మన సంస్కృతి పౌరాతన్యాన్ని ఒప్పుకోవడానికి మనసొప్పలేదు. బానిసలకు ఇంతటి మహోన్నతమైన సంస్కృతి చరిత్రకు అందని అనాది కాలం నుంచే ఉన్నదనే నిజం ముఖ్యంగా మెకాలే తరువాతి కాలపు చరిత్రకారులకు కొరుకుడు పడలేదు. అందువల్లనే మన చారిత్రిక పురుషులు పౌరాతన్యాన్ని సాధ్యమైనంత కుదించడానికి ప్రయత్నం చేశారు. మన దురదృష్టవశాత్తు వామాచారులైన చరిత్రకారులు నెహ్రూ gaari కాలం నుండి ప్రభుత్వంలో ఆధిపత్యం చేయడం మొదలుపెట్టారు. వీరికి మన పూర్వ ఔన్నత్యం మీద నమ్మకం లేదు. మన పురాణాలను, సంప్రదాయాలను, ఆధారాలను పుక్కిట పురాణాలుగా తేల్చివేస్తారు. సంబంధం లేని ఆధారాలను కంబోడియానుండో, చైనా నుండో వీలయితే రష్యా నుండో పట్టుకొని వస్తారు. శంకరుల విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. కంబోడియా శాసనం, శంకరులు తమ గ్రంథాలలో చెప్పిన విషయాలు మొదలుగా గల ఇరవై ఆధారాలను శంకరుల కాలం నిర్ణయించడానికి ప్రమాణాలుగా తీసుకున్నారు. సాంప్రదాయిక చరిత్రకారులు ఆ ఆ ప్రమాణాలను అత్యంత సమర్థవంతంగా ఖండించారు. ఇద్దరి వాదనలనూ విని నిర్ణయించేదెవ్వరు? క్రీ.పూ.ఆరవ శతాబ్దం నుండి క్రీ.శ.తొమ్మిదవ శతాబ్దం వరకూ ఎవరికి తోచిన కాలం వారు చెబుతూనే ఉన్నారు.
అయితే శంకరుల నుండి ఈనాటి వరకూ అవిచ్ఛిన్న పరంపర చూపుతున్న పీఠాలు నాలుగున్నాయి. విచ్ఛిన్నమయిన పరంపరతో ఇంకొక పీఠమున్నది. ఆధునిక పరిశోధకులు ఈ పీఠాల సంప్రదాయాన్ని ఎందుకు పరిగణనలోనికి తీసుకోరో అర్థం కాదు. ద్వారక, పూరీ, కంచి పీఠముల వారు శంకరుల కాలాన్ని వారి వద్దనున్న గురు పరంపర ఆధారంగా క్రీ.పూ.509గా నిర్ణయించారు. శృంగేరీ వారు మాత్రం 1954దాకా శంకరుల కాలం క్రీ.పూ.44 అని చెప్పేవారు. ప్రస్తుతం వీరు శంకరుల కాలం క్రీ.శ.788 అంటున్నారని అర్థమవుతోంది. విచ్ఛిన్నపరంపర అయిన జోషిమఠం వారు కూడా శంకరుల కాలం క్రీ.పూ.509గానే చెబుతున్నారు. ద్వారకా పీఠం వారు ప్రస్తుతపు ఆచార్యుల వారితో సహా 80మంది ఆచార్యుల పీఠాధిరోహణ, సిద్ధి వివరాలను చూపుతున్నారు. 18వ శతాబ్దము వరకు కంచిలో ఎంతమంది పీఠాధిపతులు చూపబడ్డారో దాదాపు అంతేమంది ద్వారకలో కూడా ఉన్నారు. వీరి పూర్వ పీఠాధిపతులచే వ్రాయబడిన గ్రంథంలో సుధన్వమహారాజుగారి తామ్రశాసనపు నకలు ముద్రించబడినది. అందులో శంకరులు యుధిష్ఠిర శకం 2031వైశాఖ శుక్ల పంచమి నాడు జన్మించినట్లు చెప్పబడింది. పూరీ మఠం నూట నలభై మంది ఆచార్యుల పేర్లను తెలియచెబుతూ శంకరుల కాలం క్రీ.పూ.509గా నిర్ణయించింది. కంచి పీఠం వారు 1524-39లలో సర్వజ్ఞ శివేంద్రులచే వ్రాయబడిన పుణ్య శ్లోక మంజరి, సదాశివ బ్రహ్మేంద్రులచే వ్రాయబడిన గురురత్నమాలిక ఆధారంగా ప్రస్తుతము శంకర విజయేంద్రులతో సహా 70మంది ఆచార్యుల వివరాలు అందజేస్తూ శంకరుల కాలం క్రీ.పూ.509గా నిర్ణయించారు.

చిక్కల్లా శృంగేరీ పీఠం వారు చెప్పే కాలంతో వస్తోంది. 1954సం. వరకూ వీరు శంకరుల కాలం క్రీ.పూ.44గా చెప్పారు. వీరి పీఠంతో సంబంధం ఉన్న కూడలి పీఠం వారు కూడా శంకరులాదిగా అరవై ఏడు పీఠాధిపతుల వివరాలు తెలియబరచి శంకరుల కాలం క్రీ.పూ.44గా నిర్ణయించారు. క్రీ.శ.1844లో ఒక కోర్టు అఫిడవిటులో అప్పటి శృంగేరీ యాజమాన్యము వారు వారి పరంపరలో రమారమి 2000సం.ల పూర్వమున్న శంకరుల కాలంనుండి అప్పటివరకూ 68 మంది ఆచార్యులున్నట్లు, వారి అధిష్ఠానములకు పూజ జరుగుతున్నట్లు వ్రాతపూర్వకముగా తెలియజేశారు. తరువాత ఏ కారణము చేతనో ఆ పీఠాధిపతుల పూజాపేటిక నుండి గ్రహించబడినదని చెప్పబడిన పరంపరా విశేశములో ముప్ఫై ఇరువురు పీఠాధిపతుల పేర్లు మాత్రమే ఉదహరించబడినవి. 1910వ సం.లో అప్పటి శృంగేరీ పీఠాధిపతులచే కాలడిలో వేయించబడిన శిలాశాసనం (ప్రస్తుతం తొలగించబడినది). ఆదిశంకరుల కాలం అప్పటికి 2000సం. పూర్వముగా గుర్తించినది. అయితే తరువాత కాలంలో బహుశః 1967-68లలో అప్పటి పీఠాధిపతులు పూర్వాపరాలను పరిశీలించి శంకరుల కాలం క్రీ.శ.788గా నిర్ణయించారు. కాబట్టి శృంగేరీ పీఠం వారిచే చెప్పబడిన కాలం వారి సంప్రదాయ పరంగా వచ్చినది కాదు. శృంగేరీ పరంపర పరస్పర స్పర్థకల ఇరువురి మధ్య బడి విచ్ఛిన్నము చేయబడినందున దానిని దాని ననుసరించు వారిని ప్రమాణముగా అంగీకరింపవీలులేదని, భారత చరిత్ర చతురానన, భారత చరిత్ర భాస్కర శ్రీ కోట వేంకటాచలం గారు స్పష్టపరిచారు.

No comments:

Post a Comment