Pages

Sunday, July 9, 2017

వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం

శ్రీ గురుభ్యోనమః

బ్రహ్మసూత్ర కృతే తస్మై వేదవ్యాసాయ వేధసే
జ్ఞాన శక్త్యవతారాయ నమో భగవతే హరేః!

"వ్యాసోచ్చిష్టం జగత్సర్వం" అను నానుడి సనాతన ధర్మ ప్రమాణ వాఙ్మయమెరుగువారెల్లరకునూ సుపరిచితమే. జగత్తందున్న సమస్తమూ వ్యాసభగవానునిచే చెప్పబడినదే తప్ప వ్యాసభగవానుడు చెప్పనిది ఏదీలేదను ప్రమాణమును వక్కాణించుటయే నానుడియొక్క అర్థము. ఉచ్చిష్టము అనగా ఎంగిలి చేయబడినది అని, అనిన జగత్తు ఒక తినెడు పదార్థమినియు, దానిని వ్యాసుడు యెంగిలిజేసెనను అపార్థమునుగొనరాదు. ఆత్మ యెంగిలిజేయబడదు అనిన అర్థము ఆత్మయెరుకను నోటితో చెప్పుట సాధ్యముగాదు అది అనుభవైకవేద్యమే అని చెప్పుట దాని పరమార్థము. అట్లే "వ్యాసుడు ఏది చెప్పేనో జగత్తంతయునూ అదే యున్నది" అని అనూచానంగా వచ్చుచున్న ప్రమాణ వాక్కు. అట్లనిన అది అతిశయోక్తియందురా!? జగత్తునందేమి గలదు? వ్యాసుడేమి చెప్పెను? వ్యాసుడు చెప్పినదే జగత్తునందుగలదనుటకు మూడుకాలములయందు జరిగినదంతయూ వ్యాసుడు చెప్పెనా లేక అతిశయోక్తియాసరి, దీనిని విచారించుటకు పూర్వము వ్యాసుడనయెవరు, వ్యాస పదవిచారణ యేమి యని తరచిచూచిన సత్యమవగతమవగలదు.

నిజమునకు వ్యాసుడు అని పిలువబడువారు వేర్వేరు కాలమున వేర్వేరు వ్యక్తులు గలరు. "వ్యాస" అనునది ఒక పదవి.ఆర్ష వాఙ్మయమును వ్యసనము చేయువారెవరో వారు వ్యాసులనబడుదురు. తేలిక పదములలో తెల్పిన విశేషముగ రచన కావించిన కావింపబడిన అపార విజ్ఞాన భాండాగారమును క్రమబద్ధముగ విభజనము చేసి వినియోగమునందు సందిగ్ధము లేకుండ తీర్చిదిద్దు ఋషి అధిష్టించు పదవి వ్యాస పదవి. ఇట్టి పదవినలంకరించిన విశిష్ఠవ్యక్తులెవరుందురో వారు ఆయాకాలములందు వ్యాసనామముతో తెలియనగుదురు. స్వయం భగవానుడైన విష్ణువే ఒక్కొక్క కాలమున వ్యాసపదవినధిరోహించి జనులకు వేద ప్రామాణిక జీవన సరళిని వాఙ్మయ రూపమున అందించుటకు కలావతారముగ అవతరించుచుండును. వ్యాసావతారము లోకరక్షణ, ధర్మ రక్షణకై విష్ణుభగవానుని అవతారమే అని ప్రసిద్ధి చెందిననూ, వేద ప్రచారమునూ, అద్దానినుగమించు పురాణేతిహాసస్తోత్రాది వాఙ్మయ సృష్టిచేయుటవలననూ చతుర్ముఖబ్రహ్మ అంశనూ, మానవ జన్మ పరమార్థమును సాధించెడి జ్ఞాన వైరాగ్యముల బోధించెడు గురుమూర్తి స్వరూపమును బొందుటవలన శంభుదేవుని యంశనూ కలిగియుండును. త్రిమూర్తుల సమాహార స్వరూపము అగుటవలన జ్ఞానము పంచుటకు వచ్చిన పరబ్రహ్మముయొక్క అవతారమే గురుమూర్తియగు వ్యాసభగవానుడని తెలియవలె.

వ్యాసభగవానుడు తానవతరించు ప్రతికాలమునందు, మనుష్యుల సామర్థ్యమునకు తగినవిధముగా వేదవిభజనయూ, తత్సంబంధ వాఙ్మయమునూ అందించి, ఐహిక ఆముష్మిక ప్రయోజనముల సిద్ధింపజేయు ధార్మిక జీవనమునకు వలసినటువంటి సాధనాసామగ్రినందజేయును. పరంపరావిధమున కలియుగారంభమునకు పూర్వము ద్వాపరాంత సమయమున బ్రహ్మవేత్తయగు పరాశరమహర్షినకూ, దివ్యజన్మమునొందిన మత్స్యగంధికీ కుమారునిగ జన్మమునెత్తిన బాలకుడే వ్యాసపదవినధిరోహించెను. కృష్ణవర్ణమున యమునా ద్వీపమున జన్మించినందులకు కృష్ణద్వైపాయనుడని పేరుకలిగెను. సద్యోగర్భమున జన్మించినదే తడవు యుక్తరూపమును పొంది కృష్ణాజినాంబరములను, కలశకమండలములను ధరించి తల్లి ఆజ్ఞనుగొని, తలచినంతనే మాతృసేవకు రాగలనని మాటయిచ్చి తపస్సుకు చనెను. బదరీవనమున వాసము చేయుటవలన బాదరాయణుడనియు పేర్గాంచెను.

ఈ కృష్ణద్వైపాయన వ్యాసమహర్షి జన్మమును విచారించినచో మనకు పారలౌకిక ఆధ్యాత్మిక విశేషములేగాక ఖగోళ, జ్యోతిష్య విశేషములుగూడ తెలియగలవు. జ్యోతిష్య గ్రంధమున కొన్ని ఒక్కొక్క రాశికి కొన్ని సూచనాత్మకమైన చిత్రములు చూపించబడును. విధమున కన్యారాశికి తెడ్డు చేతనుండి పడవ నడిపించుచున్నటువంటి స్త్రీ కన్యారాశికి గుర్తుగ చూపుట గలదు. మీనరాశికి గానూ రెండు మీనముల గుర్తును చూపించెడు చిహ్నము సైతము విదితమే. మీనమునందు దాశరాజునూ, మత్స్యగంధినీ జల రాశియైన మీన రాశియందు జన్మించినవారుగ సఞ్జాపూర్వకముగ చెప్పబడినదని గ్రంథముల పరిశీలనము వలన తెలియుచున్నది. అటులనే ద్వీపము వద్ద మంచుపొగ తెర సృష్టించుటచే ఏర్పడిన చీకట్లయందు ఉద్భవించిన జ్ఞాన సముద్రుడు కారుణ్యామృతవర్షుడూ ఐన వ్యాసభగవానుని జననము గ్రీష్మతాపముచే అల్లాడు మానవాళికి శుచిమాస పౌర్ణమాసినందు చంద్రదర్శనానంతరము జగత్తున తాపము తీర్చుటకై మేఘములు వర్షామృతములు కురిపించుటను సూచించును. విధమున లోకమున రాబోవు కలియుగమున జనుల తాపత్రయములు తీర్చి సంసారమునుదాటి తరించుటకై ఆషాడ శుద్ధపౌర్ణమి నాడు కృష్ణద్వైపయన వ్యాసుడావిర్భవించెను.

అటులనే వ్యాసోచ్చిష్టమన వ్యాసుడు చెప్పినదే జగత్తునందు గలదు తప్ప అన్యముగాదను వాచ్యార్థము సత్యమే యని యెరుగవలె. అటులైన ఇప్పటి సాంకేతికత, ఆధునిక శాస్త్ర సంపత్తి వ్యాస వాఙ్మయమందు కలదా అని సంశయము కలుగగలదు. నిగూఢముగ పరిశీలించిన ఇప్పటి ఆధునిక శాస్త్ర సాంకేతికతలేకాదు మరియెన్నింటికో ఆలవాలమౌ ముఖ్య మూల సిద్ధాంతములను వ్యాసుడు ప్రకటించెను. అది ప్రమాణ వాక్యమునకు నిగూఢమౌ ముఖ్యార్థమని తెలియవలె. ముఖ్య కారణమేమన, శారీరకమీమాంస లేదా ఉత్తరమీమాంస అని వేదాంత సిద్ధాంతమునకు పేరు అద్దాని సూత్రకర్త వేదవ్యాసుడే. శారీరకమీమాంస యనగా పరబ్రహ్మముయొక్క శరీరరూపమైన యీ జగత్తుయొక్క స్వరూపవిచారమునామూలాగ్రం చేయట వలన దీనికి శారీరకమీమాంసయను పేరుగలదు. ఒక విషయముయొక్క మూల సిద్ధాంతమును యెరిగి సంపూర్ణముగ ఆకళింపుజేసుకొనుట ద్వారా తత్సంబంధ సమస్త విషయ జ్ఞానము ఆకళింపుగాగలదు. బీజమునందున్న వ్యూహమును దెలియుట ద్వారా దాని విస్తారస్వరూపము అవగతముగాగలదు. వేద వేదాంత వేదాంగములందు గల జగత్సృష్టి రహస్యములను ఆకళింపుజేసుకొనుటయేగాక కాలాతీతుడై వాటిని దర్శించి, తాను దర్శించిన ఆరహస్యములను బ్రహ్మసూత్రములుగ ప్రకటించి జనులకందించెను. జగత్తుయొక్క సమస్త స్వరూప విచారమును సూత్రముల రూపమున దెల్పి వ్యాఖ్యానించినది వేదవ్యాసుడే. అనిన, వేదవ్యాసుని నోటినుండి ఈశ్వర శరీరరూపమౌ జగత్విచారణముగశారీరక మీమాంససమస్తమూ ప్రకటింపబడినది శరీరరూపమౌ జగత్తు వ్యాసుని యుచ్చిష్టమను మాట బహుధా యుక్తమనుటయందేవిధమైన సందియములేదని తెలియవలె.

అట్టి వేదవ్యాస భగవానునికి వేనోళ్ళ కీర్తించుచు ఉత్సవాదులు చేయుట ఆర్షభూమియందున్న ప్రతి ఒక్కరి కనీస కర్తవ్యము. ఆషాడ పున్నమనాడు కృష్ణపంచకమాదిగా వైదిక బ్రహ్మవిద్యా గురుపరంపరనావాహనజేసి పూజించి. వేదవిదులను, పౌరాణికులను వ్యాసరూపులుగయెరిగి పూజించుట, సత్కరించుట భగవాన్ శ్రీ వేద వ్యాసునికే సమర్పించు కైంకర్యములు.

నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లార విన్దాయత పత్రనేత్ర,
యేన త్వయా భారత తైలపూర్ణ: ప్రజ్వాలిలో జ్ఞానమయ: ప్రదీప:

జయ జయ శ్రీ సాత్యవతేయా జయ జయ
జయ జయ శ్రీ పారాశరాత్మజా జయ జయ
జయ జయ శ్రీ వేదవ్యాస భగవాన్ జయ జయ


సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు

-శంకరకింకర

Saturday, July 8, 2017

తపస్సు అంటే

నమస్తే
తపస్సు అంటే తపించుట. మనం సాధారణంగా ఏదో ఒకదానిని పొందటం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తాం అది దొరికే/కలిగే వరకూ ఎంతో వేదన పొందుతాం ఆ ఈ ప్రయత్నంలోఇక దేన్నీ మనం లక్ష్యపెట్టం ఆ కోరికలో ఆ వస్తువుని పొందటంకోసం తపించి పోతాం అంటే కాలిపోతాం. ఒక వస్తువుని లేదా స్థితిని పొందే వరకు జరిగే పరిణామాన్నే తపస్సు అంటాం. ఐతే ఐహిక విషయాలకోసం ఐతే తపస్సు అని అనరు. కేవల ఆధ్యాత్మికమైనదైతేనే తపస్సు అంటారు.

పరమేశ్వరుడు మొట్టమొదట భోధించినది "తపః" అని. ఒక్కడుగా ఉన్న పరమాత్మ అనేకముగా విస్తరించాలనుకున్నప్పుడు, ఆ సృష్టి జరిపే క్రమంలో స్థితికర్తకు మొట్ట మొదట పరమాత్మ పరబ్రహ్మము పల్కిన వాక్కు లేదా మొట్ట మొదట పరమాత్మ నుండి వినబడిన వాక్కు "తపించు" అని (పురాణాల ఆధారంగా సృష్ఠి క్రమంలో జరిగినది). ఎవరైనా ఏ పని చేసినా చేయ సంకల్పించినా తపస్సుతో మొదలు పెట్టడం ఉత్తమం. అందుకే సనాతన ధర్మంలో నిద్ర లేస్తూనే బెడ్ కాఫీ, న్యూస్ పేపర్ కాకుండా సంధ్యా వందనాదులు, అర్చనలు బ్రాహ్మీ ముహూర్తం కేవలం భగవదారాధనకు తపస్సుకు మాత్రమే
ఇక తపస్సు చాలా రకాలు. తపస్సు యొక్క ముఖ్య ఉద్దేశ్యం మనోలయం, ఈశ్వర సాన్నిధ్యం లేదా ఈశ్వర కృపకు పాత్రులవడం. ఈ తపస్సు చేసే విధాలు పలు రకాలు. ఉదాహరణకు ఒక గృహస్థు తన ధర్మాలను దైవ పూజ, అతిధి పూజ, తన ధర్మాలను చక్కగా నిష్ఠతో మనస్సులో ఎటువంటి వ్యతిరిక్త భావమూ లేకుండా ఆచరిస్తూ ఉన్నాడనుక్కోండి అదీ తపస్సే. అంటే ఆధ్యాత్మికంగా వైదికమైన ధర్మాచరణము, వేదయుక్తమైన ప్రమాణములని నిష్ఠగా నియమముగా ఆచరిస్తూ చేసే భగవదారాధనమే తపస్సు.

ఇంట్లో రోజూ అర్చన చేసేటప్పుడు మనస్సు, వాక్కు, క్రియలను ఏకం చేసి అర్చించడం కూడా తపస్సే. అనుక్కోకుండా ఆ పరాత్పరుని ఒక సుందర మూర్తి కనపడింది దానిని చూస్తూ దాంట్లో లీనమై ఆ పరమేశ్వరున్నే తలుస్తూ ఉండిపోవడం తపస్సే.

భగవంతుని ధ్యానం తపస్సు, భగవంతుని చూడడం తపస్సు, భగవంతుని లీలలు వినడం తపస్సు (అందుకే శ్రుణ్వం తపః అని అన్నారు), ఒక నియమం, ఒక వ్రతం, ఒక దీక్ష ఏవైనా మనస్సును పూర్తిగా లగ్నం చేయగలిగితే అది తపస్సే.
ఇంద్రియములను వెనక్కి తీసి మనస్సులో కలిపి ఆ మనస్సుని కూడా ఆత్మానుసంధానం చేసి పరమేశ్వరుని ( శివోవా కేశవోవా, పరమేశ్వరుడు అన్నానని శివుడొక్కడే కాదు, నాకు వారిద్దరి మధ్య బేధం లేదు, నాకే ఏమి ఇక్కడ అందరికీ అంతే అని నమ్ముతున్నాను) చూస్తూ ఆ పరమేశ్వరునిగా ఉండిపోయే ప్రక్రియ తపస్సు.

ఇప్పటికీ మన మధ్యలో తపోధనులు ఉన్నారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.

ఇక ఇప్పటి యోగా, ధ్యాన తరగతులు ప్రస్తుతం LKG వంటివి ఒక క్రమంలో జీవనాన్ని సాగించుకోవడం అలవాటు చేసుకోడానికి. ఆధ్యాత్మిక జీవనంలో, తపస్సులో మెల్ల మెల్లగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఉండాలి.

శంకర భగవత్పాదులు యోగతారావళిలో అంటారు శ్రీశైలం కొండలపైన ఉన్న గుహలలో నన్ను నేను మరచి తపస్సు చేస్తుండగా లతలు నన్ను ఒక జడమనితలచి ఎప్పుడు చుట్టుకుంటాయో, పక్షులు ఎప్పుడు నా చెవులలో గూడుకట్టుకుంటాయో (గాత్రం యదా మమలతాః పరివేష్టయన్తి, కర్ణేయదా విరచయంతి ఖగాశ్చనీడాన్..) అని తపస్సు, మనోలయం యొక్క గొప్ప స్థాయిని సూచించారు.

మీ
-శంకరకింకర
03-May-2011

పోటీతత్త్వం

శ్రీ గురుభ్యోన్నమః

ఈ చిన్ని కథ మనలో చాలా మందికి తెలిసినదే ఐనా మొన్న మా గురువుగారి నోట మరోసారి వినడంతో అందరితో పంచుకుందామన్న ఉద్దేశ్యంతో పంపుతున్నాను.

నేటి  విద్యా విధానాలుజీవన విధానాలు ఒకటేమిటి అన్నీ కాంపిటీటివ్నెస్స్ తోపోటీ తత్త్వంతో సాగుతున్నాయిదానివల్ల పొందేది సింహభాగం అనర్థంఎక్కడో అతి కొద్ది ప్రయోజనం ఉండచ్చుఆఖరికి ఈ పోటీతత్త్వం ఆధ్యాత్మిక జీవనంలో కూడా ప్రవేశించిఅసలు ఆధ్యాత్మికతను మరుగున పడేసి ఆడంబరాలనుడాంబికాలను ప్రోత్సహిస్తోంది... సాధనలో ఎన్నోమెట్లు ఎక్కినవారే దీనికి లోనౌతుంటేఇక సామాన్యుల సంగతి చెప్పఖ్ఖర్లేదుగా.. ఈ పోటీతత్త్వమే రాను రానూ స్పర్థలకి దారితీస్తోంది.

ఇక కథలోకి వస్తే...కథ పాతదేపైన చెప్పిన ఉపోద్ఘాతంచేప్తున్న నేను కొత్త అంతే..
పూర్వం ఒకానొక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములుండేవారువారిని చిన్నప్పట్నుంచీ వారి తల్లిదండ్రులు అందట్లోనూ గొప్పవారు కావాలన్న ఉద్దేశ్యంతో పుత్ర వాత్సల్యంతో వారిని వివిధ శాస్త్ర పారంగతులని చేయడంలో ఇతరులతోటి సామం చూపి పోటీతత్త్వాన్ని పెంపొందించారుచివరకి వారి మధ్యనే వారికి పోటీ పెరిగిందిఆ తల్లిదండ్రులు కోరుకున్నట్టు వారికి విద్యావిషయాలలో పోటీ పెరిగి వారు చదువుకున్న దాంట్లో వారు నైపుణ్యం సంపాదించారుకానీ..... వారి నరనరాల్లో ఆ పోటీ తత్త్వం ఇమిడి పోయిందిఅలా చాలా రోజులు జరిగాయి..
ఒకనాడు ఆ ఇద్దరూ భగవంతుని గూర్చి తపస్సు చేసి అనుగ్రహం పొందాలనుక్కున్నారుఅలా తపస్సు చేయడంలో కూడా పోటీ పడ్డారుఎవరికి తొందరగా భగవంతుడు దర్శనమిచ్చి వరమిస్తాడో అన్న విషయం నుంచి ఎవరికి గొప్ప వరం పొందుతారో అన్నంత వరకూ పోటీ పడ్డారుఅలా ఇద్దరూ ఒక అడవికి చేరి తపస్సు చేద్దామని ప్రయత్నించారుఒక పెద్ద చెట్టును చూసి అక్కడ తపించాలనుక్కున్నారుమళ్ళీ అక్కడా పోటీతత్త్వం వారిని గెలిచింది.. ఒకడు చెట్టు క్రింద కూర్చుని తపస్సు చేద్దామనుక్కుంటే ఇంకొకడు చెట్టు చివర కొమ్మలపై కూర్చుని తపస్సు చేద్దామనుక్కున్నాడు కారణం వాడి తలపులో భగవంతుడు పైనుంచి క్రిందకి దిగేటప్పుడు మొదట వాణ్ణి అనుగ్రహించి క్రిందివాడిదగ్గరకెళ్ళాలని తపస్సు చేయసాగాడు... వారి తపస్సులో సాత్వికతలేకుండా పోయింది... అక్కడా ఈ కాంపిటీటివ్నెస్స్ విజృంభించింది.  అలా కొన్ని రోజులు గడిచాయి... భగవంతుడు వారి నిశ్చల తప్పస్సుకు మెచ్చి భగవంతుడు వారికి వరాలివ్వడానికి క్రిందికి దిగివచ్చి చెట్టు చిటారు కొమ్మ మీద ఉన్నవాడ్ని వరం అడిగాడువాడు ఏం వరమడిగినా క్రిందివాడు తనకన్నా ఎక్కువ ఏదైనా అడుగుతాడేమో అన్న భావనతో భయపడి క్రిందివాడేది అడిగితే దానికి రెండింతలు నాకిమ్మని కోరాడుసరే అని భగవంతుడు చెట్టుకింద తపస్సు చేసుకుంటున్నవాడి దగ్గరకి వెళ్ళి ఏంకావలని అడగగా,వాడు ఆలోచించితనతో పుట్టినవాడు ఎలా ఆలోచిస్తాడో గుర్తెరిగినవాడు కావటం చేత భగవంతుడా నాకు ఒక చెయ్యిఒక కాలుఒక కన్ను పని చేయకుండా చేయమని కోరాడుఅంటే ఈ పోటీ తత్త్వంతో పెరిగిన స్పర్థలవల్ల తన తోబుట్టువు గెలవకూడదు భగవద్విషయంలోనూ తానే గెలవాలన్న మంకుపట్టుతో తనకి ఒక కాలుచెయ్యికన్ను పోయినా తమ్ముడికి రెండూ పోతే తానే గెలిచినట్టు భావించాడు అదే గెలుపనుక్కున్నాడు.

ఇదీ ప్రస్తుత కాంపిటీటివ్నెస్స్ యొక్క ప్రభావం ఎవరితో పోటీ పడుతున్నామోఏ విషయంలో పోటీ పడుతున్నామోదాని పర్యవసానాలేమో తెలియకుండానేఅక్షరాభ్యాసంనుంచే వారికి పోటీ తత్త్వం అలవాటు చేసి వారి ఆలోచనా సరళినిభావిజీవితపు పునాదులను నిర్వీర్యం చేస్తున్నాం మనం.

కనీసంలో కనీసం ఈ పోటీలు ఆధ్యాత్మికతను దూరంగా ఉంచితే బాగుండు అది ఇప్పుడు ఇక్కాడా రాజ్యం చేయాలని చూస్తోందిపోటీలేకుండా అందరం కలిసి సామరస్యంగా ముందుకు సాగడం ఉత్తమంఎవరి శక్తి మేర వారు ముందు వెనకలుగా ఉంటారు అంతే...

సర్వం గురుచరణారవిందార్పణమస్తు
-శంకరకింకర
03-Dec-12

Wednesday, May 24, 2017

గురువు - దీక్ష - శిష్యుడు

శ్రీ గురుభ్యోనమః
అసలు ఒక వ్యక్తియందు గురుత్వం కలిగినా లేదా ఆ గురుత్వం కలిగినపుడు ఆ వ్యక్తినుండి దీక్ష తీసుకున్నా తీసుకుందామనుకున్నా, మనం సాంతం త్రికరణ శుద్ధిగా దానికి సిద్ధంగా అవ్వాలి. "గురువును ఆశ్రయించాలి" అని మొత్తం వాఙ్మయం చెప్తోంది. అది నిస్సందేహం, కాబట్టి ఏదో ఒకరిని ఒక గురువుగా వరించడం, ఏదో ఒక మంత్ర దీక్ష తీసుకోవడం చేయడమొక్కటే దాని పరమావధి కారాదు. మంత్ర దీక్ష తీసుకోవడంతోనే స్థాయి మారిపోదు. nothing will change overnight. ఆ దీక్షతోపాటు దీక్షానిమయాలు. సాధనా పద్ధతులు, ఆ దీక్ష ఉపాసన ie., మంత్ర జపం. ఉపాసన స్థాయిని పెంచుతాయి. కొన్ని మంత్రదీక్షలు తీసుకున్న తరవాత కొన్ని కార్యక్రమ నిర్వహణలకు అర్హత సిద్ధిస్తుంది కానీ దాన్ని సాధన చేయకపోతే ? the purpose is in dilema..

ఒక దీక్ష తీసుకుందామని ఉంది అంటే అది ఎందుకు అన్న ప్రశ్న మనలో మనం వేసుకోవాలి. "దీక్ష ఆర్ హావింగ్ ఎ గురు ఈజ్ నాట్ ఎ స్టేటస్ సింబల్". ఎంత సాధన ఎక్కువౌతుంటే అంత అంతః పరిశీలనం పెరగాలి. మౌనాన్ని ఆశ్రయించి ఉండగలగాలి. అనవసరమైన, అసంబద్ధమైన, అలవికాని ఆలోచనలకు కళ్ళెం వేయాలి. ఎంతో తెలుసుకోవాలి అన్న ఆతృత చాలా గొప్ప విషయం. కానీ అన్నప్రాశన నాడే కొత్తావకాయ చందానా అన్నీ ఒక్కసారే తెలిసేసుకోవాలి, గబగబాతెలిసేసుకోవాలి అన్న తత్తరపాటు కొంచెం చేటు. గురువుమీద, గురువిచ్చిన దీక్షాధిష్ఠాన దేవతమీద ఇలవేల్పు మీద నమ్మకం, ఆ మంత్ర సాధన మెల్లమెల్లగా జ్ఙానం సమకూరడానికి సాధనాలౌతాయి. చిత్తశుద్ధికలగాలిగా ముందు.

చిత్రం ఏంటంటే మనసుని కంట్రోల్ చెయ్యకపోతే, ఒకటి తెలుసుకుంటుంటే ఇంకోదాన్ని చూపిస్తుంది, లేదా దానికి వ్యతిరిక్తంగా ఉన్నట్లున్నదాన్ని చూపిస్తుంది. ఎట్ టైమ్స్ వుయ్ మే / షుడ్ ఆస్క్ ఇట్ టు షటప్. నిర్ణయం చేసేస్తుంది, జస్ట్ గెట్స్ కారీడ్ అవే విథౌట్ కంప్లీట్ నాలెడ్జ్. సాధనలో చాలా సార్లు సాధికారికంగా విషయం తెలుసుకునేవరకూ కంక్లూడ్ చేసుకోకూడదు. atleast 99% దగ్గర ఐనా ఆగాలి ఫర్ అథెంటికేటెడ్ కంక్లూజన్ కోసం. లేదా ఇదమిద్దంగా ఈ సాధనలో భాగంగా లేదా ఇది తెలుసుకోవడం ద్వార దీని ఫలితం ఇది అని నిర్ణయించుకున్నప్పటికీ, తరవాత ఎప్పుడో తెలుసుకున్నది అసంపూర్ణం, కొంత కరక్షెన్ చేయడం అవసరం, అన్న విషయం తెలిస్తే వెంటనే విథౌట్ ఎనీ ప్రిజుడీస్ వెంటనే కరెక్ట్ చేసుకోగలగాలి. సరైన విషయం తెలిసింతరవాత సెకండ్ థాట్స్ ఉండకూడదు. ఇందులో మన మైండ్ సెట్ కి అర్థం కాలేదు నేను దీన్ని ఒప్పుకోలేకపోతున్నాను ఇత్యాదికి నోరూమ్.. ఒప్పుకోలేకపోయినా, నచ్చకపోయినా ప్రాబ్లెమ్ ఈజ్ విత్ దట్ ఇండివిడ్యువల్ అండ్ హిజ్ ఇగొ నాట్ విథ్ ద ట్రుత్... సాధారణంగా ఇదే జరుగుతుంది. ఆయన అలా చెప్పారు కాబట్టి ఇది అని కంక్లూడ్ చేసింది. కొంత కాలానికి అందులో కొంత మార్పుందని తెలీగానే ఆ మార్పుకి అంగీకరించదు. దాని వల్ల అసహనానికి, ఆవేశానికి గురిచేస్తుంది.. అలాగే జనరిక్గా చెప్పినవేవి స్పెసిఫిక్ గా చెప్పినవేవి అన్న వివేచన ఉండాలి. ఇలాంటి వాటికి గురువు, పండితుల అవసరం అత్యంత ఆవశ్యకం.

గురువు దీక్ష ఇచ్చింతరవాత, ఏదైనా వేరే అడిగినా ముందు అవన్నీ పక్కనపెట్టి చెప్పింది నియమిత రూపంలో ఫలానా సంఖ్య చెయ్యమని చెప్తారు. అది అభ్యాసం. ఈలోగా మెల్ల మెల్లగా గురువు అనుగ్రహం, గురువు యొక్క ఆపేక్ష/వాత్సల్యం, మంత్ర ఋషి అనుగ్రహం, మంత్రాధిష్ఠాన దేవతానుగ్రహం వలన సాధనా బలం పెరిగి చిత్తశుద్ధి కలుగుతూంటుంది. మెల్ల మెల్లగా తెలియవలసిన విషయాలు తెలుస్తూంటాయి. (కారణ జన్ములు, అవతార పురుషులు వీటికి ఎక్సెప్షన్స్). దీక్షా సాధనలో, సమయం, ఆసన శుద్ధి, ఆహార శుద్ధి, ఆహార్య శుద్ధి (వస్త్రధారణ, అలంకరణ, తినే ఆహారం), శాంత స్వభావం, భావ ప్రకటనం, ఇవన్నీ చాలా గొప్ప సహకారం అందిస్తాయి. ఏదో ఒక మంత్రం పొందడానికి ఆమంత్రం ఉన్న గురువును ఆశ్రయించడం కాదు. ఆ గురువు యందు నిశ్చలమైన అఖండ విశ్వాసం ఉండాలి. ఫలానా "మంత్రంకోసం ఎవరోఒక గురువు" కాదు. "సద్ గురువుకోసం మంత్రం " లా ఆలోచన ఉండాలి... . ie., గురువును ఆశ్రయిస్తే ఏమంత్రం ఇస్తే తరిస్తారో ఆమంత్రం ఇస్తారు... గురువుననుగమిస్తే గురువిచ్చారు కాబట్టి తరిస్తారంతే రెండో ఆలోచన ఉండకూడదు. గురువులు అవకాశాన్ని అర్హతను బట్టి అడిగిన మంత్రదీక్షా ఇస్తారు. గురువు మీద నిశ్చల భక్తి నమ్మకం మోక్షార్హతను సాధించగలదు. గురువు వయసులో చిన్న కావచ్చు ఎప్పుడూ జుట్టు పండిపోయి వగ్గైపోయి ఉండక్కరలేదు. ఆది గురువు దక్షిణామూర్తే 16 యేండ్ల యువకుడు.. వృద్ధా శిష్యా గురుర్యువా అని కదా స్తోత్రం.

ఒకటి గుర్తు పెట్టుకోవాలి. శాస్త్రంలో మనకి శాసనాలెన్నో ఉన్నాయి, అలా అని ఎవరినీ వారి మానాన వారి ఖర్మకి వదిలెయ్యలేదు ఈ ధర్మం ఎప్పటికప్పుడు ఆల్టర్నేటివ్స్ ఇస్తూనే ఉంది. ఎక్సెప్షన్స్ అన్నీ అందరికీ కాదు, దుర్భలులకీ, అది తప్ప మరోమార్గంలేని వారికీ ఎట్స్.. అందుకే ఇలాగే చేస్తారు ఇలాగే చేయాలి అని నిర్ణయించుకునేటప్పుడు ప్రమాణ వాక్యాలను పరిశీలించాలి. ముఖ్యంగా సాంప్రదాయ బేధాలుంటాయని ఎరగాలి... ఐతే వీటివల్ల మూలంలో మార్పుండదు అంగాలలోనూ, ప్రయోగంలోనూ మార్పులుంటాయి తప్ప. ఎట్ ద సేమ్ టైమ్ మనసాంప్రదాయానికి కొంచెం మార్పులతో ఉంటే పరవాలేదు కానీ మూలాన్నే మారుస్తుంటే సౌమ్యంగా విచారణ చేసి ప్రమాణం తెలుసుకోవాలి/ లేదా సరి యైన విధం మనకి తెలిస్తే తెలపాలి.
గురువు అడగకుండా విద్య / లేదా దీక్ష ఇస్తారని ఎదురుచూడవద్దు. అన్ని సార్లూ అందరికీ అలా కుదరదు. అసలు శాస్త్ర ప్రకారం విద్యను/దీక్షను పొందటానికి విద్యార్థి / దీక్షార్థి గురువును అడగాలి. అడగనిదే విద్య నుడువరాదని ధర్మశాస్త్రం అందునా కలియుగం. భారతంలో చాలా క్లియర్గా చెప్పారు వ్యాసులవారు. వినమ్రుడై వినీతుడై అడగని వారికి విద్యనివ్వరాదని. "శిష్యుడు గురువుని" వరించాలి "గురువు శిష్యుని" కాదు. రామాయణంలో విశ్వామిత్రుడు - శ్రీరాముడు విషయంలో ఇటివంటి విషయం ఉంది. అడగకుండానే విశ్వామిత్రుడు శ్రీరామునికి మంత్రగ్రామం ఇచ్చాడు అని. కానీ అప్పటికే విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు గురుభావనతో అనుగమించారు. విశ్వామిత్రుడు అయోధ్యకొచ్చి దశరథుని మీపిల్లల్ని పిలు మంత్రాలిస్తాను అని అనలేదు. గురు భావనతో రామ లక్ష్మణులు అనుగమించిన విధానం చూసి మంత్రగ్రామం ఇచ్చాడు అని అర్థం చేసుకోవాలి. గురువుని వరించాలి, కానీ ఏ దీక్ష కావాలో అది గురువు అనుగ్రహిస్తారు. ఈ విద్య కావాలి అని నిర్బంధించకూడదు. గురువు సంతుష్టుడైతే శిష్యుడు యోగ్యుడైతే వేరే విషయం. అలాగే అగస్త్యుడు కూడా.. అరణ్య కాండలో ఎదురెళ్ళి రాముడిని శిష్యుణ్ణి చేసుకోలేదు. విష్ణువే అని తెలిసినా రాముడొస్తాడని తెలిసినా తన ఆశ్రమంలోనే ఉన్నాడు. రాముడు సీతా లక్ష్మణ సమేతుడై గురు భావనతో సేవించాడు దివ్యమైన అస్త్ర శస్త్రాలు పొందాడు. ఒక్కసారి ఆ గురుశిష్య సంబంధం ఏర్పడిందా శిష్యుడు ఆపదలో ఉన్నాడని తెలిస్తే ఏం చేయాలో గురువది చేస్తాడు. అగస్త్యుడు ఆదిత్య హృదయం ఇచ్చినట్లు... కాబట్టి గురువుని ఆశ్రయించడం శిష్య కర్తవ్యం, ఏదీక్ష ఇవ్వాలో అది గురువు విషయం అది శిష్యుని పని కాదు.

-శంకరకింకర

Saturday, April 8, 2017

ధర్మం విషయంలో మూడు రకాల ప్రవర్తనలు

శ్రీ గురుభ్యోనమః
 
ధర్మం గురించి మూడు రకాల వ్యక్తుల గురించి వారి పరిస్థితి గురించి రామాయణం నుండి.
 
దశకంఠుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురూ సాంగోపాంగంగా వేదం చదువుకున్నారు, తపస్సంపన్నులు, సాక్షాత్ బ్రహ్మ వంశస్థులు. ధర్మం విషయంలో ముగ్గురూ మూడు రకాల ప్రవర్తనలు కలిగి ఉంటారు. దాని వలన ఎవరేం ఫలితం  పొందారో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు కదా...!
 
ధర్మం తెలుసు, కానీ ధర్మం చెప్పడు, ఆచరించడు :-
1] దశకంఠుడు (రావణుడు) - వేదం చదువుకున్నాడు, ధర్మం తెలుసు, కానీ ధర్మం చెప్పడు, ధర్మం ఆచరించడు, భూతదయలేనివాడు. ఎవరైనా తనకు ధర్మబోధ చేసినా వినడు, సహించడు తనకు నచ్చినట్లుగా ఉండడమే ధర్మం అని బుకాయిస్తాడు. రాముడి చేతిలో చచ్చాడు.
 
ధర్మం తెలుసు, ధర్మం బోధిస్తాడు, కానీ ఆచరించడు :-
2] కుంభకర్ణుడు - వేదం చదువుకున్నాడు, ధర్మం తెలుసు, కానీ ధర్మం చెప్తాడు, ధర్మం ఆచరించడు, భూతదయలేనివాడు, అధర్మం ఐనా సరే అన్నకోసం చేసేస్తాడు. రావణుడికే సీతమ్మను అపహరించి అధర్మం చేసి లేనిపోని కష్టం కొని తెచ్చుకున్నావని కోపంతో ధర్మబోధ చేసాడు, కానీ అన్నకోసం అధర్మం వైపే ఉన్నాడు. రాముడి చేతిలో చచ్చాడు.
 
ధర్మం తెలుసు, ధర్మం బోధిస్తాడు, ధర్మమే ఆచరిస్తాడు:-
3] విభీషణుడు - వేదం చదువుకున్నాడు, ధర్మం తెలుసు, ధర్మం చెప్తాడు, ధర్మం ఆచరిస్తాడు, భూతదయఉన్నవాడు, అధర్మం ఐతే అన్నైనా సరే విభేధిస్తాడు. రావణుడికే సీతమ్మను అపహరించి అధర్మం చేసి లేనిపోని కష్టం కొని తెచ్చుకున్నావని ధర్మబోధ చేసాడు. మహాశక్తివంతుడు మహైశ్వర్యవంతుడైన రావణుణ్ణి ఎదిరించి, వానరాలతో వచ్చిన సాధారణ మానవుడు శ్రీరాముని శరణు జొచ్చాడు. ఐశ్వర్యమూ, బలమూ ఎక్కడ ఉన్నదో అని కాదు ధర్మం ఎక్కడుందో అక్కడ ఉంటాడు. రామునికి ప్రాణ మిత్రుడైయ్యాడు.
 
-శంకరకింకర


Friday, April 7, 2017

తమ్ముణ్ణి వదిలినందుకు రావణుడు చనిపోలేదు. "ధర్మాన్ని" వదిలినందుకు చనిపోయాడు...

శ్రీ గురుభ్యోనమః


...నిజానికి తమ్ముణ్ణి వదిలినందుకు రావణుడు చనిపోలేదు. "ధర్మాన్ని" వదిలినందుకు చనిపోయాడు...

ఫేస్ బుక్లోనూ, వాట్సప్లోనూ ఒక రావణుడికి సంబంధించి ఒక కథ చక్కర్లు కొడుతోంది. యుద్ధరంగంలో పడిఉన్న రావణుడు రాముణ్ణి పిలిచి నేను నీకన్నా అన్నింట్లోనూ గొప్ప కానీ నీ చేతిలో ఎందుకు ఓడి చనిపోయాడని అడుగుతాడట (ఇలా రామాయణంలో లేదు, రాముడు కొట్టిన బ్రహ్మాస్త్రానికి రక్తం కక్కుకుని మాట్లాడకుండా కుక్కిన పేనులా చచ్చాడు మరి.) అప్పుడు రాముడంటాట్ట నా తమ్ముళ్ళు నాదగ్గరే ఉన్నారు నీ తమ్ముడు నీదగ్గరలేడు అని. అందుకే నువ్వు చచ్చిపోయావ్ నాచేతిలో అని. అంటే సీతమ్మని అపహరించినందుకూ, దేవ మనుష్యాదులను అందరినీ హింసించి అధర్మ కార్యాలు చేసి పాపం మూటగట్టుకున్నందుకూ కాదుట. తమ్ముడు పక్కనలేడు కాబట్టి చచ్చిపోయాట్ట.



నిజానికి తమ్ముణ్ణి వదిలినందుకు రావణుడు చనిపోలేదు. "ధర్మాన్ని" వదిలినందుకు చనిపోయాడు అన్న సూక్ష్మమైన విషయాన్ని పైన పోస్ట్ చేయబడ్డ కథనం రచించిన రచయిత మరిచాడు. అన్నదమ్ములతో కలిసుండండం శ్రేయోదాయకమే, కానీ అలా కలిసి ఉండీ కూడా ధార్మికమైన జీవితంలో లేకుండా ఉంటే 100 మంది అన్నదమ్ములైనా (కౌరవులు) మడిసిపోయారు. అర్థాత్, దీనిలో ఉన్న కీలకం ఏంటంటే! కేవలం అన్నదమ్ములు కలిసి ఉండడమే కాదు, అ అన్నదమ్ములు ధర్మంతో కలిసి ఉండడం ముఖ్యం. అదీ ఇతిహాసం కానీ, పురాణం కానీ 14 ధర్మ స్థానాలు కానీ చెప్పేవి.

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్య మప్రియం!
ప్రియం చ నానృతం బ్రూయాత్
ఏష ధర్మ స్సనాతన:!!

అందంగా ఉందని అబద్ధాలు కలిపించి చెప్పకూడదు. సత్యమే సనాతనమైన ధర్మము. ఆ సత్యమే భగవత్స్వరూపము. ఆ భగవంతుని విషయంలోనే అసత్య ప్రచారం చేయకూడదు.

పురాణేతిహాసాలను ప్రక్షిప్తం చేసి వాని పవిత్రతను పాడుచేసే అధికారం మనకు లేదు. మనకు ఎంత స్వచ్చంగా పురాణేతి హాసాలివ్వబడ్డాయో అంతే స్వచ్చంగా రాబోవు తరాలకు మనం అందించాలి. పురాణేతిహాసాలపై, పౌరాణిక పాత్రలపై తప్పుడు రచనలు చేయకూడదు.
స్వస్తి"

-శంకరకింకర

Tuesday, January 31, 2017

కొండముచ్చుల చలికాపడం

అనగనగా ఒక అడవి, శీతాకాలం వచ్చింది. ఆ అడవిలో కొండముచ్చులు ఎక్కువ. ఓ సారి ఎప్పుడో దారిన పోయే మనుషులు నిప్పురాజేసి చలి కాచుకోవడం చూసాయి. వాటికి నిప్పు అని తెలీదు. కానీ అవీ చలికాచుకోవాలనుక్కున్నాయి. అన్నీ గుంపుగా బయలు దేరి చలి కాచుకోవడానికి వెళ్ళాయి, దూరంనుంచి వెలుగు కనిపించింది.. వెళ్ళి చలికాచుకోవడం మొదలెట్టాయి. కొంతసేపటికి అటుగా ఒక కుందేలు వెళ్తూ చూసింది. వాటి దగ్గరకెళ్ళి ఏం చేస్తున్నారనడిగింది. అవి చలికాచుకుంటున్నాము అని చెప్పాయి.. అది పక్కున నవ్వి ఇవి మిణుగురుపురుగుల వెలుగులు వేడికాచుకునే నెగడు కాదు అని చెప్పింది. వాటికి కోపం వచ్చి మూర్ఖత్వంతో ఆ కుందేటి మెడవిరిచి చంపేసాయి.....

అందుకే పెద్దలు ఎవరైనా కొందరు ఫలితంలేని పనీ, ఏదోచేయాలికదా అని చేసే పనినీ చూసి... కొండముచ్చులు మిణుగురులతో చలికాచుకున్నట్లుంది అంటూంటారు.. అలాగే మూఢులని సమాధాన పరచి బాగుపరచడంకూడా అంత తేలికవిషయమూ, క్షేమకరమైన విషయమూ కాదని దీన్ని ఉదహరించి చెప్తారన్నమాట.

పక్కవారేదైనా చేప్తే విని ఒకక్షణమైనా ఆలోచించి సరియైన దాన్ని నిర్ణయించి స్థిరపరుచుకుని అప్పుడు మన పూర్వ నిర్ణయం తప్పైతే దిద్దుకోవాలి తప్ప మూఢత్వంతో ఎదురు దాడి చేయకూడదు. అలానే మన పూర్వ నిర్ణయం సరియైనదైతే నిర్భీతిగా నొప్పించకుండా చెప్పి మన కార్యాన్ని మనం సాధించుకోవాలన్నమాట.
----------------------
విద్యఐనా, ఉద్యోగమైనా, ఆధ్యాత్మికత ఐనా ఏ రంగమైనా అంతే ఏదో ఒకటి వ్రాస్తున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం అని కాదు.. ఏం చేస్తున్నామో. ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసుకుని ఆలోచించి చేయాలి బుర్రకి పదునుపెట్టి వ్యవసాయాత్మక బుద్ధిని పెంపొందించుకోవాలి.
-
శంకరకింకర

Monday, January 30, 2017

అవగాహన జ్ఞానము కాదు

నమస్తే
అవగాహన జ్ఞానము కాదు, అవగాహన శ్రవణ మననాదుల వల్ల కలిగినది. సాధారణంగా చాలామంది చేసేది చేస్తున్నది ఆగిపోతున్నది శ్రవణమననాదుల వద్దనే అంటే అవగాహన వద్దనే అదియే జ్ఞానమని పొరబడి ఆగిపోతారు. విషయమై ఎన్నో గ్రంథాలు రచించినవారు రచిస్తున్నవారు, వేదాంత పాఠాలు బోధిస్తున్నలేదా బోధించినవారుకూడా శ్రవణమననాదుల వల్ల కలిగిన అవగాహనే జ్ఞానమని పొరబడ్డవారున్నారు (అటువంటి కొందరు పండితులే స్వయంగా తెలుసుకుని చెప్పారు) వానిని దాటి నిధి ధ్యాసము చేసి అందులో కుదురుకుని అనుభవములోకి వచ్చినదే జ్ఞానము. ధ్యానము ఉపాసకులు చేసేదో లేక మరే మెడిటేషనో కాదు సర్వత్ర సర్వకాలాలయందు సమస్తమునందు దేహంలో మాత్రమే ఉన్నదనుకున్న నేనును సర్వత్రావ్యాప్తమైన ఏకాత్మనుగా చూడడమే ధ్యానము. దాని వల్ల అనుభవమునకు వచ్చేదే జ్ఞానము. అది నిరంతర అనుభవైకవేద్యము.

(పైది ముఖ పుస్తకంలో ఒక మిత్రుని పోస్ట్ కు సవరణగా పంపిన విషయం, )

అవగాహన జ్ఞానము కాదు, అవగాహన శ్రవణ మననాదుల వల్ల కలిగినది.... అంటే శ్రుతి స్మృతులతో సహా పురాణేతిహాసాదులు శాస్త్ర భాష్యాలు పఠించడం వల్లనూ, వినడం వల్లనూ తద్విషయము మీద కలిగేది అవగాహన అది జ్ఞానము కాదు. గురువాక్యమననముతో పాటు కలిగిన అవగాహనను ఆచరణలో ఉంచినిధి ధ్యాసము చేయడం ద్వారా స్థిరీకృతమై అనుభవైకవేద్యమయ్యేదే జ్ఞానము.
- శంకరకింకర
(01/Jan/2015......)


Thursday, December 29, 2016

కోపాయుధం


గురుభ్యోనమః

"క్రుద్ధో హన్యాద్ గురూనపి"

కోపానికి మనం ఆయుధంగా కాక, కోపాన్ని మన ఆయుధంగా మలచుకోవడం సాధకులైన వారికి ప్రతి ఒక్కరికీ  అవసరం.

----

ధన్యాస్తే పురుషశ్రేష్టా యే బుధ్యా కోపముత్థితమ్ !
నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభసా !!
క్రుద్ధః పాపం న కుర్యాత్ కః "క్రుద్ధో హన్యాద్ గురూనపి" !
క్రుద్ధః పరుషయా వాచా నరస్సాధూనధిక్షిపేత్ !!
వాచ్యా వాచ్యం ప్రకుతోపి న విజానాతి కర్హిచిత్ !
నాకార్యమస్తి క్రుద్ధస్య నావాచ్యం విధ్యతే క్వచి !!
య స్సముత్పతితం క్రోధం క్షమయేవ నిరస్యతి !
యథోరగస్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే!!
(సుందరకాండ)

తా!! మహాత్ములైన ధీరులు తమలో పెల్లుబిక్కిన ఆగ్రహావేశములను ఎగయుచున్న మంటలను నీటితో చలార్చినట్లు నిశ్ఛయాత్మక బుద్ధితో నిగ్రహించుకొందురు. వారు నిజముగా ధన్యాత్ములు. కోపావేశమునకు లోనైనవాడు ఎట్టిపాపములకైననూ ఒడిగట్టును. కోపావేశమునకు లోనైనవాడు గురువుని కూడా హత్యచేయగలడు. కోపావేశమునకు లోనైనవాడు సజ్జనులను సైతము నిందించును.
కోపమునకు లోనైనవాడు మంచి చెడ్డల విచక్షణాజ్ఞానము కోల్పోవును. ఆట్టివానికి చేయగూడని పని అనగూడని మాట యుండదు. సర్పము కుబుసమును విడిచినట్లు క్రోధములో జనించిన ఉద్రేకమును ఒర్పుతో అణిచికొనినవాడే నిజమైన పురుషుడు.

క్రుద్ధః పాపం న కుర్యాత్ కః "క్రుద్ధో హన్యాద్ గురూనపి" ! హనుమ ముఖ్యంగా ఈ మాటని పైశ్లోకంలో గట్టిగా చెప్తారు. కోపమో, క్రోధమో, క్షణికావేశమో ఏదైనా సరే కోపమునకు వశమైనవాడు ఏ పాపానికైనా ఒడిగడతాడు. అసలు చేయకూడని పాపం గురువుని నిగ్రహించడం. ఎదిరించడం, అధిక్షేపించడం వంటివి. ఏదో కారణానికి కోపించి గురువుమీద కూడా కినుక వహించేలా చేస్తుంది ఆ పరిస్థితి, అందుకే కోపం రాగానే పరిశీలించుకునేలా మనకి మనం తర్ఫీదిచ్చుకోవాలి. అసలు కోపం దేనికీ అని. గురువు మాట్లాడితే అదృష్టం. మాట్లాడకపోతే అదో అదృష్టం, తిడితే ఇంకా అదృష్టం. దగ్గరకు తీసుకుంటే అదో అదృష్టం. అసలు గురి ఉన్నవారు గురువు దగ్గరలో ఉన్నా లేకున్నా గురువు నాకన్నా దూరంగా ఎప్పుడున్నారు అన్న తృప్తితో ఉంటాడు. లేకపోతే నన్నలా మర్యాదించలేదు ఇలా పొగడలేదు గురువుగారి పక్కవాళ్ళు చూడలేదు వంటి భావనలు చుట్టుముడతాయి. లేదా నేను చెప్పిందెవరూ వినట్లేదు, నేను చెప్పిందెప్పుడూ తప్పంటున్నారు, లేదా నేను చెప్పినవాటికన్నా ఇంకోరు చెప్పినవి సరి అంటున్నారు ఇలా... ఏవేవో నిప్పు కణాలు అగ్నిలోంచి పుట్టినట్లు అసహన రూపంగా బయటికొస్తాయి. ఇవన్నీ కోపంలోంచి పుట్టేవే... కోపానికి మనం ఆయుధంగా కాక, కోపాన్ని మన ఆయుధంగా మలచుకోవడం సాధకులైన వారికి ప్రతి ఒక్కరికీ అవసరం.

-శంకరకింకర


Monday, December 19, 2016

గుర్తింపు!


వాళ్లకి గుర్తింపు రాలేదు వీళ్ళకి గుర్తింపు రాలేదు, వాళ్ళెవరో అర్హతలేకున్నా గొప్పోళ్ళైయ్యారు వీళ్ళకు అర్హతున్నా ఇలా ఉండిపోయారు. వాళ్ళకి డబ్బులు రాలేవు వీళ్ళకి డబ్బులొచ్చాయి, వాళ్ళూ వీళ్లూ సరే... నీ సంగతేంది.. నిజానికెవరైనా, ఎందుకైనా బాధపడాల్సి వచ్చినా, జాగ్రత్తపడాల్సి వచ్చినా, వారికోసం వాళ్ళు. నీ గురించి నీ బాధ గురించి చెప్పుకో భయ్యా.. వీలైతే పక్కోడికి సాయంచెయ్ వాడెవడో నీ పక్కోడికి సాయం చేయలేదని లాభం కూర్చలేదని వాడి మీద పడిపోకు...  రేపొద్దున్న ఒన్ ఫైన్ డే మార్నింగ్ నీ లెక్కలు చెప్పేటయానికి... నీ సంగతేందో అది కూడా చూసుకో...

దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః!
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపి న ముంచత్యాశావాయుః!!

- శంకరకింకర