Pages

Sunday, July 31, 2022

శంకరుల కాల నిర్ణయం - 2

 ధర్మాకృతి : శంకరుల కాలము - 2


ప్రముఖ చరిత్రకారులు డా.సర్ జడునాథ్ సర్కార్ గారు తమ “History of Dasanami Nagas”లో “No paer earlier than the 19th Century has been preserved in Sringeri Mutt and the same list can be accepted as correct at the best from 13th Century downwards but not earlier than that period” అని శృంగేరీ గురించి చెబుతూ అంటారు. ఇదే పుస్తకంలో ఇంకొక చోట R.N.Ghosh అనే ఆయనకు శివాభినవనృసింహభారతీ స్వామివారు ఈవిధంగా చెప్పినట్లు వ్రాస్తున్నారు. “At the request of modern archaeologist, my Guru constructed this list, in which Sankaracharya’s birth day is given as 14 vikram Samrat and his immediate successor of Sureswara is started to have lived as the head of Monastery for eight hundred years till 757 AD. You may take it as true or false as you like”. సందర్భానుసారంగా చెప్పవలసి వచ్చింది కాబట్టి వ్రాశాను గానీ, శృంగేరీ పీఠ చరిత్రను, ఔన్నత్యాన్ని కించపరచాలని కాదు. హైందవులందరికీ ఆ పీఠం పూజనీయమైనది.


ఏతావాతా చెప్పవచ్చిందేమంటే ఆదిశంకరుల కాలం క్రీ.పూ.509 అనడానికే ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. శృంగేరీ పీఠపు ముప్ఫై రెండవ ఆచార్యుల జీవిత చరిత్రను అత్యంత రమణీయంగా ఆంధ్రీకరించిన ప్రముఖ విద్వాంసులు, విమర్శకులు అయిన శ్రీ నాగపూడి కుప్పుస్వామయ్య గారు కూడా ఈవిధంగానే అభిప్రాయపడ్డారు. శంకరులకాలం క్రీ.పూ.509 అనడానికి సంప్రదాయ చరిత్రకారులు కొన్ని తిరుగులేని ఆధారాలు చెబుతున్నారు. 


౧. పైన చర్చించిన శంకర పీఠాల సంప్రదాయం ప్రకారం (శృంగేరి మినహాయించి) శంకరుల కాలం క్రీ.పూ.509 అనడం సరిగా సరిపోతోంది. వీరందరూ కుమ్మక్కయి ఈ కాల నిర్ణయం చేశారనడానికి వేరువేరు చోట్ల వేరువేరుగా పరిరక్షింపబడిన సంప్రదాయాలు అవడాన వీలులేదు.


౨. ప్రాచీన శంకర విజయాలలో సూచించిన శంకరుల జననకాలపు గ్రహస్థితి ఈ కాలానికే సరిపోతోంది. వేరే ఏ తేదీకీ దగ్గరగా లేదు.


౩. పతంజలి చరిత్ర ఆధారంగా గోవింద భగవత్పాదుల సిద్ధి క్రీ.పూ.493గా నిర్ణయింపబడినది. శృంగేరీ పీఠానికి సంబంధమున్న అభినవ విరూపాక్ష పీఠాచార్యులు ఈ నిర్ణయం చేయడం విశేషం. ఈ నిర్ణయాన్ని అనుసరించి కూడా శంకరుల కాలం క్రీ.పూ.509 అని చెప్పుకోవడం సమంజసం. 


౪. జైన విజయాన్ననుసరించి కుమారిల భట్టు కాలం క్రీ.పూ.557గా గుర్తించబడింది. కుమారిలభట్టు కంటే శంకరులు 46 ఏండ్లు చిన్నవారని శంకర విజయాలు చెబుతున్నాయి. 


౫. క్రీ.శ.788కన్నా ముందున్నారని ఆధునిక చరిత్రకారులు ఒప్పుకొన్న అనేకమంది (ముఖ్యంగా భవభూతి, మహేంద్రవర్మల)గ్రంథాలలో శంకరుల యొక్క అద్వైత సిద్ధాంత ప్రసక్తి ఉంది. 


౬. కోట వేంకటాచలం గారు అనేక విధాలుగా శంకరుల కాలం క్రీ.పూ.509గా నిర్ణయించారు. నేపాళ రాజుల వంశచరిత్ర ఆధారంగా పునరుద్ధరించి వారి కాలాన్ని నిర్ణయించి పురాణ ప్రమాణంతో బలపరిచారు. శంకరులు వృషదేవవర్మ కాలంలో నేపాళదేశం పర్యటించినట్లు చెప్పబడింది. వృషదేవవర్మ కాలం కలిశకం 2555-2615గా నిర్ణయించబడినది. తద్వారా శంకరుల కాలం క్రీ.పూ 509 అనడం సరిపోతుంది. వేంకటాచలం గారు భాగవతము, విష్ణు పురాణము మొదలైన పురాణాల ఆధారంగా బుద్ధుని కాలనిర్ణయం, నాగార్జునుని కాలనిర్ణయం చేశారు. దాని బట్టి కూడా శంకరుల కాలం నిర్ణయింపబడింది. 


౭. శంకరుని కాలంలో మగధ రాజ్యపు రాజుగా చెప్పబడుతున్న ఆంద్రహాలుని కాలాన్ని బట్టి కూడా ఈ నిర్ణయాన్ని సమర్ధించవచ్చు.


౮. ముఖ్యమైనదింకొకటున్నది. కాశ్మీరులో ఉన్న శంకరాచార్య పర్వతంపై ఉన్న శంకరాచార్య దేవాలయం క్రీ.పూ.367కన్నా ముందు అయి ఉండాలని ఋజువు అవుతోంది.


అయితే ఒకే శంకరులు అనేక కాలాల్లో ఉన్నారనడానికి తగిన ఆధారాలు కనిపించడానికి కారణం ఏమిటి? బౌద్ధగ్రంథాలలో శతాబ్దాల అంతరంలో జీవించి ఉన్న బౌద్ధాచార్యులిరువురకు, శంకరులనే బ్రాహ్మణ సన్యాసి సమకాలీనులుగా చెప్పబడింది. ఇదెలా సాధ్యం? బౌద్ధంలో కూడా అనేక కాలాల్లో ఉన్న నాగార్జునాచార్యులందరినీ నాగార్జునాచార్యుడనే పిలుస్తున్నారు. ప్రస్తుతం లామాలను చూడడం లేదా? అలాగే ఆదిశంకరుల నుండి ఇప్పటివరకు అనేక పీఠాలలో, అనేక కాలాలలో శంకర తుల్యులైన మహామహులున్నారు. శంకర పీఠాలలో వారినందరినీ శంకరాచార్యుల వారనే కదా పిలుస్తున్నాం. మరి ఈ ప్రసిద్ధులైన శంకరాచార్యుల ప్రశంస అనేక గ్రంథాలలోనూ, అనేక శాసనాలలోనూ ఉండడం సహజం. కాబట్టి ఇవన్నీ కట్టుకథలని త్రోసి పుచ్చనక్కరలేదు. అయితే ఈ మహాత్ముల కాలాన్ని ఆదిశంకరుల కాలంగా పొరబడడమే ప్రమాదం. ధీమంతులైన మహాపురుషులు కూడా ఈవిషయంలో ప్రమాదంలో పడినారు. ఏం చేస్తాం! ప్రమాదో ధీమతామపి!!


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

No comments:

Post a Comment