శ్రీ రాధే కృష్ణ
రాజస్థాన్లోని కరోలీ అనే పుణ్యక్షేత్రంలో, మదనమోహన్ ఆలయం సమీపంలో కాలే ఖాన్ అనే పోస్టుమాన్ జీవించేవాడు. అతను వేరే మతానికి చెందినవాడైనా, అతని హృదయం మాత్రం సున్నితమైనది, నిర్మలమైనది.
ఒక రోజు అతని చేతికి ఒక విచిత్రమైన ఉత్తరం వచ్చింది — మదనమోహన్ పేరుతో, ఆలయ చిరునామాతో. కాలేఖాన్ ఆలయ ద్వారం వద్దకు చేరి గోస్వామి గారిని పిలిచాడు.
“ఇక్కడ మదనమోహన్ గారు ఎవరు?” అని వినయంగా అడిగాడు.
గోస్వామి గారు చిరునవ్వుతో, “మన ఠాకూరే మదనమోహన్. భక్తులు ఆయనకు ఉత్తరాలు రాస్తుంటారు,” అని సమాధానమిచ్చారు.
ఆ సమయంలో గుమ్మం లోపల నుండి ఒక దివ్య కాంతి మెరిసింది. ఆ కాంతిలో — క్షణకాలం — మోహనమూర్తి దర్శనమిచ్చింది. ఆ రూపం కాలే ఖాన్ హృదయంలో చెరిగిపోని ముద్ర వేసింది.
అది ఒక చూపే అయినా — అది అతని జీవితం మారడానికి సరిపోయింది.
దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో, వారి హృదయంలో తనపై విరహాన్ని పెంచుతాడు.
కాలే ఖాన్ హృదయంలో అదే విరహం మొదలైంది.
ఆ రోజు నుంచి కాలే ఖాన్ మనసులో ఒక కొత్త తపన మొదలైంది. మదనమోహనుని మరలా చూడాలని, ఆ మాధుర్యాన్ని మళ్లీ ఆస్వాదించాలని అతని అంతరంగం కోరుకుంది. కానీ అతనికి ఆలయంలోకి ప్రవేశం లేదు. మత పరిమితులు అతన్ని బయటే నిలిపేశాయి.
అయినా ప్రేమ మార్గం ఆగదుగా...
కొన్ని రోజులు గడిచాయి. ఆ ఉత్తరాలు రాక కూడా ఆగిపోయింది. అప్పుడు కాలే ఖాన్ ఒక ఉపాయం ఆలోచించాడు. తానే ఉత్తరాలు రాసి, అవి వచ్చినట్టు తీసుకెళ్లి గోస్వామి గారికి అందించేవాడు. ఆ సందర్భంలో ఆలయ గుమ్మం వద్ద నిలబడి, లోపల కనిపించే మదనమోహనుని కొద్ది లఘు దర్శనంతో తన మనసును నింపుకునేవాడు.
అది ఒక భక్తుని సాహసమా? లేక ప్రేమలోని అమాయకత్వమా? — చెప్పడం కష్టం.
ఒక రోజు అతని హృదయం మరింత మధురమైన ఆర్తితో నిండిపోయింది.
“స్వామీ! నేను లోపలికి రాలేను. కానీ నువ్వు బయటికి రావచ్చు కదా!” అని అతను మృదువుగా ప్రార్థించాడు.
నీ సంపూర్ణ దర్శనం కావాలి అని అతను అన్నపానీయాలను మానేశాడు. “నువ్వు దర్శనం ఇచ్చే వరకు నేను తినను, మంచినీళ్లు కూడా తాగను” అని సంకల్పం చేసుకున్నాడు.
రెండుమూడు రోజులు గడిచాయి… శరీరం బలహీనమైంది… కానీ తపన మాత్రం మరింత బలపడింది.
ఒక నాటి అర్థ రాత్రి — నిశ్శబ్దంలో ఒక అద్భుతం జరిగింది.
ఒక బాలుడు అతని ముందుకు వచ్చాడు. మేఘశ్యామల వర్ణం, పెద్ద కన్నులు, తలపై నెమలిపింఛం, పీతాంబరం — ఆ రూపం మాటల్లో చెప్పలేనిది. అతని చేతిలో పాయసం ఉన్న గిన్నె ఉంది.
“కాలే ఖాన్! నీకోసం తెచ్చాను, తిను ” అని బాలుడు మృదువుగా అన్నాడు.
ఆ క్షణంలో కాలే ఖాన్ హృదయం కరిగిపోయింది. మదనమోహనుడి చేతితో పాయసం స్వీకరించి, ఆ బాలుణ్ణి కౌగిలించుకుని ఆనందభాష్పాలతో తడిసిపోయాడు.
ఆ బాలుడు — స్వయంగా శ్రీకృష్ణుడే.
మరుసటి ఉదయం ఆలయంలో కలకలం చెలరేగింది. నైవేద్యానికి ఉంచిన పాయసం గిన్నె కనిపించలేదు. అందరూ ఆశ్చర్యంతో మాట్లాడుకున్నారు.
ఆ సమయంలో కాలే ఖాన్ ఆ గిన్నెతో ఆలయానికి వచ్చి, జరిగినది అన్నీ వివరంగా చెప్పాడు.
భక్తులు, ఊరి ప్రజలు ముందు సందేహించారు, తరవాత మదనమోహనుని లీలలు తెలిసినవారు కావడంచేత ఆశ్చర్యచకితులైయ్యారు. ఇది మదనమోహనుడి లీలే అని గ్రహించారు.
కాలే ఖాన్ హృదయంలో ఒక కోరిక కలిగింది — “ఇక్కడే సేవ చేయాలి.”
కానీ అతను అన్య మతస్థుడవడం వల్ల ఆలయ నియమాల వల్ల అతన్ని ఆలయం లోపలికి అనుమతించలేకపోయారు. కాబట్టి అతనికి ఆలయం బయట ప్రాంగణం శుభ్రం చేసే సేవ అప్పగించారు.
అతను ఆనందంగా అంగీకరించాడు.
రోజులు గడిచాయి. అతని భక్తి మరింత లోతుగా మారింది. కానీ ప్రపంచం మాత్రం అతన్ని అర్థం చేసుకోలేదు. అతని మతస్తులు విమర్శించారు కాఫిర్లకు సేవ చేస్తున్నావ్ అని నిందించారు, అందుకే నీకు సంతానంలేదు అని హేళన చేసారు.. అతని భార్య కూడా బాధతో అతన్ని నిందించింది, తన మతస్థులను సమర్థించింది.
ఒక రోజు కాలే ఖాన్ మదనమోహనుడితో
“స్వామీ! నాకు ఒక సంతానం ఇవ్వు, వీళ్ల నోళ్లు మూయించు.” అని వేడుకున్నాడు
కొద్ది కాలంలో అతనికి కుమారుడు పుట్టాడు. తన మతం వాళ్ళు అల్లా మెహర్బాన్ అన్నారు, ఇతను కృష్ణుని లీల అన్నాడు, ఆనందంతో గుడిద్వారం బైట నుంచుని పదాలు పాడుతూ కొద్దిగా కనిపిస్తున్న శ్రీ కృష్ణుణ్ణి చూస్తూ భజన చేస్తూ గడుపుతున్నాడు.
కాలం గడిచింది. ఆ బాలుడు పెరిగాడు.
ఒక రోజు — విధి మరో పరీక్షను తీసుకువచ్చింది.
ఆ బాలుడిని పాము కాటేసింది.
కాలే ఖాన్ భార్య భయంతో పరుగెత్తుకుంటూ వచ్చి,
“ఇక్కడ గుళ్ళో భజన చేస్తూ కూర్చున్నావా అక్కడ నాకొడుకును పాము కరిచిది త్వరగా వైద్యుణ్ణి తీసుకురా! ఆలస్యం చేసావో... నాకొడుక్కేదైనా ఐతే నీ సంగతి నీ కృష్ణుడి సంగతి చూస్తాను” అని అరిచింది.
కానీ కాలే ఖాన్ — మదనమోహనుని నామస్మరణలో లీనమైపోయాడు. ఆలస్యంగా వైద్యుణ్ణి తీస్కెళ్లాడు.
చివరకు వైద్యుడు వచ్చేసరికి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
వేదనతో అతని భార్య బాలుణ్ణి ఎత్తుకుని వీధులవెంట పరుగెడుతోంది ఆలయం వేపు, ఆవెనక కాలేఖాన్ వాళ్ళవెనక ఊరిజనాలు వస్తున్నారు . ఆమె తన కొడుకును ఆలయ గుమ్మం ముందు పెట్టి,
“నా కొడుకు బ్రతకాలి! లేకపోతే నిన్నూ ఉండనివ్వను!” అని విలపించింది.
ఆ సమయంలో కాలే ఖాన్ నిశ్చలంగా నిలబడి — కన్నీళ్లు కారుస్తూ — చిరునవ్వుతో ఇలా అన్నాడు:
“ప్రభూ! నేను వేరే మతానికి చెందినవాడిని.
కానీ నువ్వు జగన్నాథుడివని అందరూ అంటారు.
ఈ సత్యాన్ని నిరూపించు!” అంటూ
"దయగలవాడా, కరుణామయుడా, ఈ జగత్తులో ఉన్న శ్రేష్ఠుడా,
నన్ను వంటి పేదవారి పాపాలను క్షమించు.
కాలే ఆతురతతో నీ దర్వాజా ముందు నిలబడి ఉన్నాడు,
నంద కుమారుడా, ఈసారి కొంచెం దయ చూపించు.
హిందువుల దేవుడివే ఐతే నిన్ను నిలదీయడానికొ మాకు ఎలాంటి హక్కు లేదు
కాని జగత్తుకే నాథుడివైతే, మాపై కూడా దృష్టి సారించు కనికరించవా! జగమ్నాథా! మదనమోహనా!"
అని ప్రార్థించాడు. ఈ అర్థం వచ్చేలా పాడాడు.
అప్పుడు అతని కన్నీటి చుక్క బాలుడిపై పడింది…
ఒక్క క్షణం తర్వాత — అద్భుతం!
బాలుడు ఒక్కసారిగా లేచాడు!
“అమ్మా! నా స్నేహితుడు ఎక్కడ?” అని అడిగి, లేచి అటూ ఇటూ వెతికేసుకుంటున్నాడు.
“ఎవడు?” అని ఆశ్చర్యంతో అడిగితే,
“గిరిజాల జుట్టు ఉన్న ఒక బాలుడు… నాతో ఆడుకుంటున్నాడు సాయంత్రం నుంచీ, ఇప్పుడు మీరందరూ వచ్చారు తను ఎటోవెళ్ళిపోయాడు…” అన్నాడు.
అందరూ ఆశ్చర్యపోయారు...
కాలే ఖాన్ ఆనందభాష్పాలతో,
“స్వామీ! నా పిల్లాడితో స్నేహితుడిలా ఆడుకున్నావా! ఈ జగత్తే నీ లీల, అది నీకో ఆటకదా ! జగన్నాథా !” అంటూ, కనుకొనల్లోంచి నీరు ధారగా ప్రవహిస్తున్నా, గానం చేస్తూ ఆ మదనమోహన రూపాన్నే చూస్తూ ఉండిపోయాడు.
----
ఆ రోజు నుంచి కాలే ఖాన్ కేవలం ఒక పోస్టుమాన్ కాదు…
అతను కృష్ణభక్తుల చరిత్రలో ఒక చిరస్మరణీయ వ్యక్తిగా మారాడు.
ఇప్పటికీ కరోలీ ప్రాంతంలో, మదనమోహనుని లీలల్లో ఈ కథను భక్తులు ఆవేదనతో, ఆనందంతో స్మరించుకుంటారు. రాజస్థాన్లోని మేవార్ ప్రాంతాన్ని తన భక్తులకోసం కృష్ణుడే మరో బృందావనంగా ఎంచుకున్నాడని భక్తుల విశ్వాసం ఆ ప్రాంతాన్ని గుప్త బృందావనా పిలుస్తారు.
శ్యామ సుందర్ మదన మోహన్ బాఁసురి వాలే
తూ న సంభాలే తో హమే కౌన్ సంభాలే?
జై మదన మోహన్ - రాధా మోహన్
జై మదన మోహన్ - రాధా మోహన్
-శంకరకింకరః
No comments:
Post a Comment