జై రాధే కృష్ణ
కృష్ణునికి దాసుడిగా తనను ప్రకటించుకుని, నిరంతరం ఆయన సేవలో లీనమై జీవించిన ఒక భక్తుడు “కృష్ణదాస్”గా ప్రసిద్ధి చెందాడు.
ఒకసారి బృందావనంలో సత్సంగంలో మహాభారత కథలు వింటూ ఉండగా, “ఏ కార్యమైనా పుష్కరకాలం — పన్నెండేళ్లు — వ్రతంలాగా ఆచరిస్తే అది సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది” అని భీష్మాదులు చెప్పిన మాటలు అతని హృదయంలో గాఢంగా ముద్రపడ్డాయి.
మరుసటి రోజు ఒక దివ్యమైన సంకల్పం పుట్టింది. ఒక అందమైన పూలమాల తీసుకుని ఠాకూర్ కి సమర్పించి ఇలా అన్నాడు:
“స్వామీ! ఈరోజు నుంచి పన్నెండేళ్ల పాటు ప్రతిరోజూ నీకు పూలమాలలు తీసుకొస్తాను. పదమూడో సంవత్సరపు మొదటి రోజున నువ్వే నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించి, నీ చేతులారా మాలను నువ్వే ధరించాలి.”
ఆ రోజు నుంచి ప్రతిరోజూ రంగురంగుల, సువాసనభరితమైన పూలమాలలు సమర్పిస్తూ, కృష్ణస్మరణలో మునిగి జీవించాడు.
ఒక సంవత్సరం… రెండు… మూడు… ఐదు… ఏడు… పది… చివరకు పన్నెండో సంవత్సరపు చివరి రోజు వచ్చింది.
ఆ రోజు కూడా స్వామికి మాల సమర్పించి, తన వ్రతాన్ని మరలా గుర్తు చేశాడు:
“స్వామీ! పన్నెండేళ్లు నీకు సేవ చేశాను. రేపు నేను రాను… నువ్వే నీ మిత్రులతో, గోపికలతో కలిసి నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం తీసుకోవాలి, మాల వేసుకోవాలి నేను ఎదురుచూస్తుంటాను.” అని ఒకటికి పది సార్లు చెప్పాడు.
ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు.
“ఎవరెవరితో వస్తాడు? గోపాలురతోనా? గోపికలతోనా? సర్కార్ (రాధమ్మ)ని తీసుకొస్తాడా? ఎలా వస్తాడు? ఎప్పుడొస్తాడు?”
అని ఆలోచిస్తూ, తన చిన్న కుటీరాన్ని శుభ్రపరిచి, కడిగి, ముగ్గులు వేసి అలంకరించాడు.
తెల్లవారుఝామునే స్నానం చేసి, ఛప్పన్ భోగ్ సిద్ధం చేశాడు. సువాసనగల పూలమాలలు కట్టి సిద్ధం చేశాడు.
గుమ్మం దగ్గర నిలబడి ఎదురు చూస్తున్నాడు.
సూర్యుడు ఉదయించి అరుణ కాంతుల నుంచి క్రమంగా తీక్ష్ణ కాంతిని విరజిమ్ముతున్నాడు… కానీ స్వామి రాలేదు.
“ఏమో… నందుడు ఏదైనా పని చెప్పాడేమో… యశోదమ్మ ఆపిందేమో… ఇంకొంచెంలో వస్తాడు…”
అని తనను తాను ఓదార్చుకున్నాడు.
మధ్యాహ్నం సమీపించింది.
“ఈ ఠాకూర్కి ఎక్కడలేని రాచకార్యాలుంటాయి… ఎవరైనా కష్టంలో ఉంటే వెంటనే సహాయం చేయాలి కదా…”
అని ప్రేమతో కూడిన కోపంతో అనుకుంటున్నాడు.
మధ్యాహ్నం దాటింది… అలక పెరిగింది… కోపం మరింత ఉద్ధృతమైంది:
“అవున్లే! ఈ కృష్ణుడికి ఇప్పుడు రాచరికాలు ఎక్కువైపోయాయి!
పన్నెండేళ్లు సేవ చేశాను… ఒక్కరోజు రమ్మంటే రాడా?”
సాయంత్రం సమీపించింది.
ఇక రాడని నిర్ణయించుకున్నాడు.
వండిన ఛప్పన్ భోగ్, పూలమాలలు మూటకట్టుకుని,
“ఈ కృష్ణుడు మాట మీద ఉండడు! సేవ చేయించుకుంటాడు కానీ సేవకుల మనసులోని కోరికలు నెరవేర్చడు! ఏం తనని దర్శించడానికి వచ్చిన పెద్ద పెద్ద భక్తుల కోరికలే తీరుస్తాడా, వాళ్ళమాటలే విని వాళ్ళనే పట్టించుకొని, వాళ్ళకి కావలసినవి తీరుస్తాడా? మరి నేను వెర్రివాణ్ణా ఇన్నేళ్లు సేవచేసాను, నన్ను పట్టించుకోడా?నేనంటే అసలు లెక్కలేదా” అని కోపంతో, అలకతో, బృందావనాన్ని వదిలి, బర్సానాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
ఇల్లు తాళం వేసి, మూటముల్లె నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు… లోలోపల మాత్రం — “పన్నెండేళ్ల వ్రతం ఫలించలేదే?” అనే వేదన, రోషం.
అప్పుడే వెనకనుండి ఒక గోపాలుడు కేక వేశాడు:
“బాబా! పక్కకు జరుగు! గోవుల మంద వస్తోంది!”
కృష్ణదాస్ పక్కకు జరిగి చూస్తే — వందలాది, వేలాది గోవులు మందలుగా వస్తున్నాయి.
“ఎవరివి ఇవి?” అని అడిగాడు.
“నందబాబావి!” అన్నాడు ఆ బాలుడు.
కొద్దిసేపటికి బాలుడు దగ్గరకు వచ్చి,
“బాబా! నీ దగ్గర ఎంతో మంచి వంటల వాసన వస్తోంది. ఏముంది మూటలో?” అని అడిగాడు.
కృష్ణదాస్ విసుగుతో జరిగిందంతా చెప్తూ
“కృష్ణుడి కోసం సిద్ధం చేసినవి. కానీ అతను రాలేదు!” అన్నాడు
బాలుడు మృదువుగా అన్నాడు:
“నాకు చాలా ఆకలేస్తోంది బాబా… పొద్దున్నుంచి గోవులు కాస్తూ ఏమీ తినలేదు… నువ్వూ తినలేదు కదా… ఇద్దరం కలిసి తిందామా?”
కృష్ణదాస్ కోపంతోనే:
“అవును! నేనూ తినలేదు! రాని కృష్ణుడి కోసం ఎందుకు ఆకలితో ఉండాలి?”అని మూట విప్పాడు.
అప్పుడు బాలుడు అన్నాడు:
“బాబా! నువ్వొక ముద్ద తిను… నాకు ఒక ముద్ద పెట్టు… ఇద్దరం కలిసి తిందాం.”
కృష్ణదాస్ చిరాకు పడ్డాడు:
“నీకు భోజనం పెట్టడం కాకుండా నోట్లో పెట్టాలా? ఈ నందగావ్ పిల్లలందరికీ ఇదే అలవాటా!”
బాలుడు అమాయకంగా తన చేతులు చూపించాడు:
“చూడూ బాబా… గోవుల సేవ చేస్తూ చేతులు అన్నీ పేడతో నిండిపోయాయి… నేను ఎలా తినగలను? నువ్వే తినిపించవా?”
అది చూసి కృష్ణదాస్ " మీ నందగావ్ పిల్లలకి ఏదో మాయ మాటలు చెప్పి సేవ చేయించుకోవడం బాగా అలవాటు, ఆ కృష్ణుడు అలవాటు చేసాడా?" అంటూ దెప్పుతూ ఒక ముద్ద అతనికి పెట్టి, ఒక ముద్ద తాను తినసాగాడు.
అలా కొద్దిసేపటికి బాలుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి.
“ఏమైంది?” అని అడిగాడు.
బాలుడు ఏడుస్తూ అన్నాడు:
“బాబా… మాల ఎందుకు వేయలేదు? మాల వేయి బాబా!”
అప్పుడే కృష్ణదాస్ ఆశ్చర్యపోయి:
“నువ్వెవరు?” అని అడిగాడు.
క్షణంలోనే ఆ బాలుడు పెద్ద పెద్ద కళ్ళతో, గిరజాల జుట్టుతో, ముత్యాలసరాలు, నెమలి పింఛంతో, పీతాంబరధారియై శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు:
“బాబా! ప్రతిరోజూ నువ్వు నీ చేతులతో నాకు మాల వేస్తుంటే, అది నీ ఆలింగనం లాంటిది. పన్నెండేళ్లుగా ఆ ప్రేమకు నేను అలవాటు పడ్డాను. నేను నీ ఇంటికి వచ్చి నేనే మాల ఎలా వేసుకుంటాను? నువ్వే వేయాలి కదా!”
భక్తులు దేవుని యెదుట పొంగిన భక్తి వల్ల అమాయకంగానూ, ఒక్కోసారి గడుసుగానూ ప్రవర్తిస్తారు, భగవంతుడు ఆ చేష్టలు చూసి మురిసిపోతాడు.
ఇది విని కూడా కృష్ణదాస్ గడుసుగా అన్నాడు:
“అది కాదు! నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు! నేను బర్సానా వెళ్లి అక్కడ సర్కార్ కి (రాధారాణికి) ఫిర్యాదు చేస్తానని భయపడి వచ్చావు! నాకోసం కాదులే ! ఈ మాలను నేను మా లాడ్లీ రాధారాణికే ఇస్తాను!”
అని మూటలు సర్దుకుని వేగంగా బర్సానా వైపు బయలుదేరాడు.
వెనక కృష్ణుడు ఆత్రంగా పిలుస్తూ:
“బాబా! ఆగు! నా మాట విను, చెప్పేది విను!” అంటూ వడిగా వస్తున్నాడు
కానీ కృష్ణదాస్ వినలేదు:
“నేనాగను! ఇకపై నా పేరు కృష్ణదాస్ కాదు… రాధాదాస్!”
అని వెనక్కి చూడకుండా ముందుకు సాగిపోయాడు.
తన వెనక కృష్ణుడు "బాబా! ఆగు, ఆగు! అని అరుస్తూ వెంటపడి, వెంటపడి వస్తున్నాడు"
కృష్ణదాస్ పట్టించుకోకుండా నేను లాడ్లీ దగ్గరకెళ్ళిపోతానని వడివడిగా వెనక్కి చూడకుండా వెళ్తున్నాడు.
కాసేపటికి కృష్ణదాస్ బర్సానాకు చేరుకుని రాధారాణి సన్నిధిలో చూసే సరికి — అక్కడ కృష్ణుడు నిలబడి చిలిపి నవ్వులు రువ్వుతూ ఉన్నాడు!
ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి చూస్తే — వెనుకనుండి వస్తున్నది కృష్ణుడు కాదు గారాలపట్టి తన సర్కార్ రాధారాణి!
ఆ దివ్యలీల చూసి కృష్ణదాస్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.
ఆ ఇద్దరూ వేరు కాదు
కిశోరీయే కిశోర్ - కిశోరే కిశోరీ,
లాడ్లీయే లాలా -'లాలాయే లాడ్లి,
ఠాకూరే సర్కార్, సర్కారే ఠాకూర్,
రాధాకృష్ణులు వేర్వేరు కాదు ఇద్దరూ ఒకటే అని తెలుసుకొని, భక్తి పరవశంలో నామం చేస్తూ, పాటలు పాడుతూ నృత్యం చేస్తూ, ఇద్దరికీ తాను చేసిన వంటలు ప్రేమతో సమర్పించి, ఇద్దరికీ పూలమాలలు తానే స్వయంగా అర్పించాడు.
పన్నెండేళ్ళూ తాను పూమాలలు సమర్పిస్తున్నాననుకున్నాడు, కానీ పూమాలలు వేస్తూ రోజూ ఠాకూర్ని ఆలింగనం చేస్కుంటున్నానని గమనించలేకపోయాడు. పన్నెండేళ్లలో ప్రతిదినం కృష్ణదాస్ వల్ల పొందిన ఆలింగన సాంత్వనను శ్రీ కృష్ణుడు వదలలేకపోయాడు... అది కృష్ణుడికి తదేక వ్రతమైంది, కృష్ణదాస్ పుష్కర కాలం తదేక దీక్షతో చేసిన కార్యం ఇలా సిద్ధించి వ్రతం సంపూర్ణంగా సాఫల్యమైంది.
ఆవిధంగా కృష్ణదాస్… రాధాదాస్ అయ్యాడు.
తుమ్ కృపాళు సర్కార్ హమారీ!
పార్ కరో యా మారోరీ కిశోరీ రాధే!!
-శంకరకింకరః
No comments:
Post a Comment