Pages

Wednesday, June 12, 2013

అవైదికమైన మతాలు ఏవిధంగా సనాతన ధర్మంకన్నా ఉన్నత ప్రమాణాలు కలవి?

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

నడిచే దేవుడు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణం నుండి కొద్దిగా సంగ్రహించి, ఇతర పెద్దల వల్ల తెలుసుకొన్నది, విచారించి తెలుసుకొన్నదీ

జగద్గురు ఆది శంకరులు అవైదికమైన బౌద్ధాది మతాల సిద్ధాంతాలను ఖండించి వైదిక ధర్మాన్ని పునరుద్ధరించారని అందరికీ తెలిసినదే, ఐతే ముఖ్యంగా ఎంతో ఉన్నత ప్రమాణాలున్నాయని కొందరు భావించే బౌద్ధమతంలోని పరస్పర విరుద్ధ సిద్ధాంతాలవల్లనూ, మతంలో ఉన్న ఆయా సిద్ధాంతాల అనాచరణల వల్లనూ వేద భూమినుండి బయటకెళ్ళవలసి వచ్చిందన్నది సత్యం.

శ్రీ శంకరులు ఏ సిద్ధాంతాన్ని ఖండించినా అందులోని మంచిని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకునేవారు గౌరవించేవారు అనాచారాన్ని అవైదికవిధానాన్ని ఖండించేవారు. ఉదాహరణనకి వైదిక సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నా సాంఖ్య, మీమాంసాలలో ఉన్న ఈశ్వరుని యొక్క ఉనికిని నిరాకరించే సిద్ధాంతాలని ఖండించారు. శంకరుల వాదన వారి ప్రతిపాదన ఏమంటే అపౌరుషేయములైన వేద పదములకర్థం ప్రకారం, బ్రహ్మసూత్రానుసారం గల ఈశ్వర నిర్వచనాన్ని గానీ, ఈశ్వరుడు సృష్టి కర్త అని గానీ, ఫలదాత అని గానీ నిరాకరించటం సమంజసం కాదు. వేదములో చెప్పినదే సత్యం, ఈశ్వరుడు లేకుండా జగత్సృష్టి లేదు, అంతే కాదు కర్మాచరణమే వ్యక్తికి ఫలితాన్నిస్తుందని చెప్పటం కుదరదు. ఈశ్వరుడే ఫలదాత, ఫలనియంత, ఈశ్వరుని చైతన్యమే సంకల్పమే జగత్సృష్టికి కారణం. కార్యానుసారం ఫలితాలేర్పడడం, సుఖదుఃఖాలు కలగటం కూడా ఈశ్వరుపు కల్పించినకర్మవల్లనే. శంకరులు ఏది ఖండించినా వేదములు, బ్రహ్మసూత్రాదులను దాటలేదు వాటిని, ఈశ్వర ఉనికిని ప్రశ్నించి అనుమానించిన భాగాలనెప్పుడూ ఖండించారు.

శంకరులకన్నా ముందే ఉదయనాచార్యుడనే నైయాయికుని (న్యాయ శాస్త్రంలో ప్రవీణుడు) వాదనల వల్లనూ కుమరిలభట్టు (మీమాంసకుడు) కర్మ ప్రచారం వల్లనూ బౌద్ధం వేద భూమి దాటిపోయింది.
బౌద్ధమతం చెప్పే ఈశ్వర రాహిత్యం లేదా ఈశ్వరుడు లేదా భగవంతుడు లేడని చేసిన ప్రచారాన్ని ఉదయనాచార్యులు ఖండించారు.
అలాగే మీమాంసకులు కర్మలు ఫల ప్రదాతలని నమ్మినా, వేదాన్ని వేద విహిత కర్మలను శ్రద్ధగా నమ్మి ఆచరించాలనీ కర్మలే ఫలదాతలనీ నమ్మిన కుమరిలభట్టు ఆ వేద విహిత కర్మలనాచరించవలసిన అవసరంలేదని ప్రచారం చేసిన బౌద్ధాన్ని ఖండించి వేద విహిత కర్మలను నిలబెట్టారు. వారి వారి సిద్ధాంతాలముందు బౌద్ధం నిలవలేకపోయింది.
బౌద్ధమతాన్ని, దాని నాస్తికత్వాన్ని (వేదాన్ని నమ్మని వారిని నాస్తికులంటారు, నమ్మే వారిని ఆస్తికులంటారు) ఉదయనాచార్యుడూ, వేద కర్మాచరణ విముఖతని కుమరిలభట్టూ ఖండించారు. వీరి తరవాత వచ్చిన శంకరులు బౌద్ధంతో పాటు పాఖండ మతాలలోని విపరీత ధోరణులను ఎత్తి చూపించ వలసిన కష్టం లేకుండానే మిగిలిన తప్పులను చూపి ఖండించడంతోటే ఆయన పని సుగమం అయ్యింది.

అసలుగా బౌద్ధం, వేదాంగాలలోని న్యాయ, మీమాంసలముందే నిలువలేకపోయింది అటువంటిది వేదం ముందు ఆ సిద్ధాంతాలేమి నిలుస్తాయి?

బుద్ధుడు ఈ దేశస్థుడే, ఆయనకి తగిన గౌరవం ఇవ్వబడింది. కానీ ఆయన సూత్రాలు ఆచరణ దూరాలు సత్య దూరాలవడం చేత, ఆయనని గౌరవించిన వారే ఆ మతాన్ని ఆయన సూత్రాలను పాటించలేదు. ఉదాహరణకు పాలీలో మాత్రమే వారి గ్రంథ రచన చేసేవారు కానీ తరవాత వచ్చిన వారు పాలీ వదిలి సంస్కృతంలో చేసారు పోనీ భాషదేముంది అంటారా.. అసలు ఈశ్వరుడే లేడని బల్ల గుద్ధిన బౌద్ధం గ్రంథాలన్నీ సరస్వతీ స్తోత్రం తో మొదలు... కాస్త అయోమయం కదూ... నీలాధార ( నీల సరస్వతి, లేదా రాజ శ్యామలా దేవి అని మనమారాధించే అమ్మవారు) స్తోత్రం తో మొదలు. అలానే ఇతర ఎన్నో దేవతల మూర్తులను అర్చిస్తారు. తంత్ర విద్యలూ చేస్తారు. అయోమయంగా ఉంది కదూ చెప్పే సూత్రాలకీ, చేసే ఆచరణలకీ సామ్యంలేకుండా. గౌతమ బుద్ధుని బోధలు విని బౌద్ధంలో ఉన్నా వారి జీవనంలో వైదిక ఆచారాలెన్నో పాటిస్తారు. కానీ వేదం తప్పంటారు ఈశ్వరుడు లేడంటారు. వివాహాది కార్యాలు కొన్ని సంస్కారాలు వైదికంగానే జరుగుతాయి. కర్మ కాండను బుద్ధుడు ఖండించినంత మాత్రాన అప్పటి ప్రజలు, బౌద్ధులు దాన్ని వదలలేదు. ఆయన చెప్పిన శాంతి, అహింసా మంత్రాలూ అనుష్టించలేదు, ఎక్కడిదాకానో ఎందుకు కుమరిల భట్టు  వృత్తాంతమే చూడండి అంత అహింస బోధించే వారు కుమరిలభట్టును హతమార్చదలచారు. అసలు సంపూర్ణ అహింస అన్నది కుదరని పని. వేదాలూ అహింసని బోధించాయి. అపరిగ్రహము కానంతవరకూ హింసనంగీకరించాయి. గురువు శిష్యుణ్ణి సన్మార్గంలో పెట్టడం కోసం మందలించడం హింసకాదుగా...? అసలు మన పుట్టుకే హింసతో కూడుకున్నది, తల్లిని హింసించకుండా ఏజీవి పుట్టగలదు? హింసలేనిదే మానవజీవితంలేదు. మనిషి ఊపిరి తీస్తే ఎన్నో కోట్ల క్రిములు నశిస్తున్నాయి, ఎంత శాఖాహారమైనా తిండి కోసం ఎన్నో చెట్లు చేమలు నరకట్లేదా అది హింస కాదా... ఐతే అది ధర్మబద్ధమై తాను దానిని మీరలేని స్థితిలో ఉన్నాడా అని చూసుకోవాలి.  ధర్మబద్ధమైన అటువంటివి ఎన్నడూ హింసగా పరిగణింపబడవు. ఊరికెనే ఉత్త హింస చేయడం వేదమూ అంగీకరించలేదు. అంతే కాని మతం పేర ఎదుట వారిని హింసించడాన్నివేదం ఒప్పుకోలేదు. ఆచరణంలోకి తీసుకురాలేని ఆచరణదూరమైన బోధలవల్లనే అది నిలబడలేదు అందునా అది కేవలం ఒక మనిషి మతినుండి పుట్టినది...అక్కడే అసలు తేడా! ఆచరణకి - బోధనకి తేడా ఉండబట్టే కనీసం వేదాంగాలముందు కూడా నిలవలేకపోయింది బౌద్ధం. అశోకుడే బౌద్ధం తీసుకున్నా సనాతన ధర్మ విలువలని వదలలేదు ఆ పద్ధతిలోనే పాలించాడు అతని శాసనాలే అందుకు ఋజువు.

ఈ దేశంలో బుద్ధ భగవానుడు తాను పొందిన సిద్ధిచేతనూ, తన గొప్పనైన జీవితం చేతనూ అమిత కీర్తిని గడించాడన్నది సత్యం. ఏ మహనీయుడుగా తలచిన వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు లేదా అనుచరులైనా ఆయా సంస్థలు లేదా వ్యవస్థలలో వైదిక ఆచారాలను కొద్దితేడాలు చేసి పాటిస్తుంటారు కానీ వారి ఇళ్ళల్లో అవి పాటించరు. గాంధీమతం అని గాంధీగారి సమయంలో వచ్చింది, గాంధీగారి బోధనలు లోకోద్ధరణ, మానవ సేవ, ఆయన గొప్ప గుణాలు చూసి ఆయనను అందరూ గౌరవించారు అంత మాత్రాన అందరూ వారి వారి ధర్మాలు వదిలి గాంధీ మతం తీసుకోలేదుగా, అంత మాత్రాన ఆయన మాటల్ని యథాతథంగా ఆచరించలేదుగా... బుద్ధుని విషయంలోనూ జరిగిందదే, బుద్ధుని జీవితం గొప్పగా ఉన్నా బోధలు ఆచరణదూరాలు కావడం సత్య దూరాలు (సత్యం అంటే ఈశ్వరుడు అని అన్వయం చేసుకోగలరు) కావడం వల్లనూ, కర్మ కాండను బుద్ధుడు ఖండించినా ప్రజలు వైదిక మతానురక్తులవ్వడం వల్లనూ, బౌద్ధంలో ఉన్న పరస్పర విరుద్ధమైన “కర్మ ఖండన మరియు తంత్ర విద్యాసాధన” , “నిరీశ్వర వాదన అదే సమయంలో దేవతార్చనగా మూర్తులను సేవించడం” అనే పద్ధతులవల్లనూ ఆ మత బోధలన్నీ నేతి బీరకాయ చందంగా ఉండడం వల్లనూ నిర్ద్వంద్వంగా బౌద్ధ సూత్రాలు ఖండించబడ్డాయి.


ఎప్పుడో ఖండించబడిన, పరస్పర విరుద్ధ భావాలను బోధించిన సిద్ధాంతాలను, సనాతన ధర్మ సిద్ధాంతములకన్నా ఉన్నతములను కీర్తించడంఅయ్యిపోయిన పెళ్ళికి బాజా భజంత్రీలవంటివేమో... లేక కిందపడ్డా పైచేయి మాదే అనే వాదనో

ధర్మస్య జయోస్తు - అధర్మస్య నాశోస్తు
వేదమే ప్రమాణం - శంకరులే గురుమూర్తి
హర హర శంకర - జయ జయ శంకర

మారిన సామాజిక పరిస్థితులవల్ల సనాతన ధర్మాన్ని తగు విధంగా మార్చకూడదా?

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

చాలామంది ప్రశ్న అడుగుతుంటారు, పరిస్థితులు మారిపోయాయి, తదనుగుణంగా ఆచారకాండలో, ధర్మశాస్త్రాలలో ఎందుకు మార్చకూడదు? సామాజిక విప్లవాలు అంగీకరించబడుతున్నప్పుడు ఆధ్యాత్మికతలో విప్లవాలెందుకు తేరాదు ధర్మశాస్త్రాదులను ఎందుకు మార్చకూడదు. ఇతర మతాలలో ఉన్న వెసులుబాటు కొత్త తనాన్ని, మార్పుని ఆహ్వానించే గుణం వల్ల అవి ఎంతో విస్తరింపబడుతున్నాయి, మీ హిందూ ధర్మంలో (సనాతన ధర్మం) ఎందుకు అంత చాదస్తంగా ఉంటారు అని.

వచ్చిన చిక్కల్లా సనాతన ధర్మం అంటే ఏమిటో అది ఏమి చెప్తోందో తెలియని ప్రతి వ్యక్తికీ దాన్ని విమర్శించడం దానిపై సంచలన వ్యాఖ్యలు చేయడం గొప్ప పని చేసినట్టనిపిస్తుందనుక్కుంటా... ధర్మం సనాతనమైనది, భగవంతుడు ఎప్పటివాడని లెఖ్ఖకట్టగలిగితే అప్పటినుంచీ ఉన్నది, తప్ప మనిషి బుర్రకాయలోనుంచి వచ్చింది కాదు అన్న చిన్న విషయం తెలియని వారూ అరకొర తెలివితో వసపోసినట్లు వాగేవాళ్ళూ నోటికొచ్చినట్లు మాట్లాడడం గొప్పనుక్కుంటారనుక్కుంటా...

పైగా దీనికి కొసరేమంటే గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అని పేర్లకింద కొత్త కొత్త హోదా తగిలించుకున్నవాళ్ళు, వ్యాకరణ జ్యోతిష్యాది వేదాంగాలలో కొన్నింటిని నేర్చుకొని ప్రవీణులని ప్రకటించుకునేవారే వక్ర బుద్ధివల్ల సనాతన ధర్మంకన్నా పాఖండ మతాలలో ఉన్నతమైనవెన్నో ఉన్నాయని సర్టిఫికేట్లివ్వడం చూస్తే అసలు వీళ్ళు హోదాలు తగిలించుకోవడం, ఆయా వేదాంగ పఠనాలు చేసిందీ కుక్షింభరత్వానికేనేమో ఆచరణకి జ్ఞాన సముపార్జనకి కాదేమోనని నా ప్రబలమైన అనుమానం, అనుమానం కన్నా నమ్మకం కూడా..

సరే అసలు విషయానికొస్తే ప్రశ్నని ఒకానొక విదేశియుడు పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి  వారిని ఒక ప్రశ్న అడిగాడు

ప్రశ్న: మారిని సామాజిక పరిస్థితుల్లో హిందూ సాంప్రదాయాలు. ఆచారాలు అవసరమా? ఆచరణ సాధ్యమని మీరనుక్కుంటున్నారా?
స్వామి వారి సమాధానం "సామాజిక విప్లవమ్ అనేది కాలంలో కొత్తగారాలేదు అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అతి ప్రాచీన కాలం నుంచీ వస్తూనే ఉన్నాయి. ఐతే అప్పటి మార్పులు ఇంత దారుణంగా ఉండేవి కావు. సంఘంలో వచ్చే మార్పులు గాలి వాన లాంటివి, గాలి వాన వచ్చి వెలిసిన తరవాత కొంత భౌతిక మార్పు తటస్థిస్తుంది. అన్నీ తేలికవి మాసిపోతాయి తప్ప అన్నీ మారిపోవు కొన్నే మారుతాయి. అలాగే మౌలికమైన విలువలనేవి ఎప్పటికీ మారవు వాటిని నిలబెట్టుకుని ఎప్పుడూ చెప్తూ ఉండడం దానియందు చరిస్తూ ఉండడం అవసరం. నైతిక విలువలు ఉండడానికి మౌలికమైన సనాతన ధర్మంలోని విలువలు ఎప్పటికీ అవసరం. నాటి నైతిక విలువలు ఎలా పడిపోతున్నాయో వాటి స్థాయి ఎంత దిగజారి పోతున్నాయో అన్న సంగతి తెలియందెవరికి. చరిత్ర పుటల్లోనే ఉంది అలెగ్జాండర్ వచ్చినప్పుడు భారత దేశంలో దొంగల బెడద లేదని. అంతటి నైతిక విలువలున్న సమాజం ఇప్పుడుందా? అలా లేదని ఇప్పటికి దొంగతనాన్నీ, దొంగలనీ, అవినీతుల్నీ కూడా సామాజిక మార్పు అని చెప్పి దాని పేర దానికీ నైతిక హక్కు అంటూ చట్టంలో చేర్చగలమా? ఇప్పటి పరిస్థితులు ఇలాగున్నాయి కాబట్టి ఇలా ఉండడమే సబబు అని చెప్పగలమా? అదేవిధంగా ఆధ్యాత్మిక క్రమశిక్షణ ప్రమాణాలు (సనాతన ధర్మ సాంప్రదాయాలు, ఆచార కాండాదులు) దిగజార్చటానికి కుదరదు"

{అకార్యమెప్పుడూ అకార్యమే, మనం మారామని ధర్మాన్ని మారుస్తామా? ధర్మం చెప్పేది మనం చేయాలి కానీ, మనం చేసినదానికి ధర్మం అనే ముద్ర వేసుకోవడం కోసం చేసే ప్రయత్నమే సనాతన ధర్మంలో మార్పులు తీసుకురావడం వంటివి, చాలా మంది కొత్తగా reforms to hindu dharma అంటున్నారు వారు కొత్తగా రిఫార్మ్స్ తీసుకురానక్కర్లేదు, ఉన్నది ఉన్నట్టుగా ముమ్దు తెలుసుకొని ఆచరిస్తే చాలు }

మరో ప్రశ్న: ఆధ్యాత్మికమైన విలువలకూ, మతపరమైన ఆచారాలకూ సంబంధం లేదంటారా? ఫ్యాక్టరీలోనో, ఆఫీసులోనో ఉద్యోగిగా ఉన్నవారు పొద్దున్న 9 కల్లా పనికి వెళ్ళాలి. లోగా అతని ఆచారకాండ పూర్తవ్వాలి అంటే 4కో నిద్రలేవాలి, మీ సనాతన హిందువుల ధర్మంలో నిత్యానుష్ఠాన విధానం ఆచార కాండ కొన్ని గంటలు పడుతుంది. ఇలాంటి విషయాల్లో అతని అనుష్ఠాన విధానాన్ని కుదించే దిశగా మార్పు చేయటం అవసరం కాదంటారా?

స్వామివారి సమాధానం "ప్రతినిత్యం తాను చేయవలసిన తీరులో పూజాధికాలు, అనుష్ఠానాలు, జపాలూ చేయలేకపోతున్నానే అని మథన పడాలి, ప్రాయశ్చిత్తం చేసుకొని సెలవు దినాల్లోనో అనుమతింపబడ్డ తీరిక వేళల్లోనో యధావిధిగా ఆచారకాండంతా జరుపుకోవాలి.  అనుష్ఠానం విషయంలో రాజీపడ్డామా ఇక అంతే సంగతులు ఒకటికొకటి  శాస్త్ర నియమాలు క్రమంగా సడలి ఒక్కొక్కటిగా అంతరించి పోతాయి."


కొనసాగింపు ప్రశ్న: ఆధునిక సమాజంలో విహిత కర్మాచరణము చేయలేని పరిస్థితులలో పశ్చాత్తాప్పడుతూ క్రుంగి పొవటం, తపించిపోవటంతో లాభమేముంది?

స్వామివారి సమాధానం: నిజంగా పశ్చాత్తాపపడితే దాని ఫలితం దానికుంటుంది.

మరో ప్రశ్న : మరి ఇన్ని ఉపాసనలలో ఉపాసన ఒకటీ రెండూ కాదు కదా ఎన్నో ఉంటాయి కదా? ఎన్నో దేవుళ్ళు ఎన్నో పూజలు మరి సాధ్యమేనా?

స్వామి వారి సమాధానం: "ధ్యానమేవ ఉపాసనా, ధ్యానమే ఉపాసన అంటే మనస్సును ఏకాగ్రం చేయడమే. అది కేంద్రీకృతమవ్వాలంటే ఒక వస్తువుని అంటే ఒక మూర్తిని పట్టుకోవాలి. ఉదాహరణకు నీ మనస్సుని రెండు చేతులున్న భగవంతుని మీద కేంద్రీకరించవచ్చు ఎనిమిది చేతులున్న భగవంతుని మీదా కేంద్రీకరించవచ్చు.
కానీ సత్యం ఒక్కటే, దానికి మార్పుండదు.  భగవంతుడే పరమ సత్యం. అవ్యయుడు మార్పూ లేని వాడు.  ఉపాసన అనేది ఒక ప్రయోజనం కోసం జరిగేది, రెండు చేతుల దేవుడి మీద మనసు లగ్నం చేసినదాని ప్రయోజనం ఎనిమి చేతుల దేవుడి మీద మనసు లగ్నం చేసిన దాని ప్రయోజనం వేరు వేరు. మూర్తిని ఎందుకు పద్ధతిలో ఉపాసించాలో శాస్త్రాలు నిర్దేశించాయి.  ఉపాసనకి శాస్త్రాలనాశ్రయించక తప్పదు. సత్యాన్ని గ్రహించటానికే, అన్ని రకాల ఉపాసనలూ,  ఉపాసనలన్నీ గమ్యం చేరుకోవటానికి సోపానాలు, సాధనములూనూ, మనస్సును ఒక శిక్షణలో పెట్టి ఏకాగ్రం చెయ్యటం కోసం శాస్త్రాలు మార్గనిర్దేశం చేస్తాయి.


ఐతే శాస్త్రాలు అనేక విధాలైన ఉపాసనా మార్గాలు చెప్పాయి, వాటినన్నింటినీ ఆచరించాల్సిన పనిలేదు, అన్నీ అందరూ చేయలేరు సాధ్యం కూడా కాదు. సాధారణంగా ఒకటి రెండు ఉపాసనాపద్ధతులు మాత్రం అందరూ అనుసరిస్తారు. పూజాకలాపం నిర్దిష్ట సయమంలో జరగాలి, ఉపాసన మాత్రం కేవలం వైయక్తికం, అది సామూహికం కానేకాదు. ఉపాసనా పద్ధతి అనేది కుటుంబ సాంప్రదాయం మీదనో, వ్యక్తి అభిరుచిమీదనో, గురువు చేసిన ఉపదేశం మీదనో ఆధారపడి ఉంటుంది."
  
{ఇలా ఎన్నో అత్యున్నత ప్రమాణాలు, వెసులుబాట్లు మనస్సంస్కార మార్గాలు, ఉపాసనా మార్గాలు, అన్ని భూమికలో ఉన్నవారినీ ఉద్ధరించే సార్వభౌమ ధర్మమైన ధర్మం విలువలకన్నా మనిషి మతిలోంచి పుట్టిన మతాలలెలా ఉన్నతములో ధర్మంలో ఉంటూ బౌద్ధాది పాఖండ మతాలని (పా=వేదం అంటే వేదాల్నిఖండించేవి) ఉన్నతములని కీర్తించే వారు తరచి చూసుకోవాలి, తెలియకపోతే తెలుసుకోవాలి, తెలియక పోవడం తప్పు కాదుగా, తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం తప్పుకానీ.}