Pages

Thursday, August 24, 2017

చంద్రశాపానుగ్రహ ఆఖ్యానము (శ్రీ గణేశ పురాణo)

గణేశావిర్భావమును గూర్చి కొన్ని పిట్టకథలు, సినిమా కథలు విరివిగా ప్రచారముననున్నవి. గణేశుడి బాగా ఉండ్రాళ్ళు ఇతర పదార్థాలు తిని తన తల్లి దండ్రులకు నమస్కరించబోగా ఏదో ఉయ్యాల ఊగినట్లు కాళ్ళు నేలకానితే చేతులానవనీ, చేతులానితే కాళ్ళు ఆనవనీ హాస్య స్ఫోరకమైన తప్పుడు కథలల్లి వినాయక వ్రత కథలందు జొప్పించడం జరిగింది. అంత అసంబద్దమైన కథలు పురాణమునందు కానీ, ప్రామాణిక వ్రతకథయందుకానీ లేవు అని గమనించి పురాణోక్తమైన కథలను చదివి వివరము తెలిసి, వ్రత ఫలితమును పొందగలరు. గణేశ పురాణమునుండి చంద్రశాపానుగ్రహమను మూలమునకు తెలుగు అనువాదము మనందరికొరకు  -శంకరకింకర

చంద్రశాపానుగ్రహ ఆఖ్యానము (శ్రీ గణేశ పురాణo)
బ్రహ్మగారు నారదుని కోరిక మేరకు చంద్రునికి కలిగిన శాప వృత్తాంతము, శాప విమోచనమును గూర్చి వివరిస్తూ ఇట్లు పలికెను "ఒకానొక సమయమున  పరమశివుడు నివసించు కైలాసము శిఖరమున సభలో నారదాది మునిముఖ్యులుండే సభకు వెళ్ళి, పరమశివుని అర్చించి శివునకు, శివుని కుమారుడైన గణపతికి ఫలాదులు సమర్పించిన పిమ్మట సభాంతమున బ్రహ్మ మరియు ఇతరులు ఎవరి గృహమునకు వారు వెళ్ళిరి. సమయమున వినాయకుడు కైలాసము నుండి చంద్రలోకమునకు వెళ్లగా, చంద్రుడు, ఉత్తముడు లోకోపకారిఐన వినాయకుని యొక్క బాహ్య ఆకారమును అనగా ఏనుగు మొఖము, జారిన బొజ్జను చూసి పరిహసించాడు. లోకమంతా, శిష్ఠులంతా యెవరిని "సుముఖుడు" అని ప్రశంసిస్తారో అటువంటి గణేశుని చంద్రుడు చూసి పరిహసించాడు. అది చూసిన వినాయకుడు క్రోధమును పొంది. అందముగా ఉన్న కారణముచేత లోకములో అందరూ నిన్ను పొగడుతున్నారన్న అహంకారంతో ఉన్నావు. ఉచ్ఛనీచాలు మరచి ప్రవర్తించావు కాబట్టి నాటి నుండి నీవు మలినుడవు, నిన్ను చూచిన వారికి నీలాపనిందలు కలుగుతాయి" అని శాపమును ఇచ్చి తన గృహానికేగెను.


విషయం సర్వ లోకములలో పాకి ఆనాటి నుండి చంద్రుని ఎవ్వరూ చూడటం మానేశారు. చంద్రుని అతిశయం, బాహ్య సౌందర్యంతో మిడిసి పడి లోకోపకారం చేస్తూ సుముఖుడుగా ప్రసిద్ధికెక్కిన వినాయకునే పరిహసించి శాపవాక్కు పొందిన విషయం సర్వలోకాలలోని వారికి తెలిసిందితాను అందరికీ ఆదర్శుడైన వినాయకునిచే శాపం పొందినందుకు చంద్రుడు సిగ్గుతో వివర్ణుడైనాడు. ఎంత అందమైన స్వరూపమైతే నేమి తన ముఖము ఎవ్వరూ చూడటానికి ఇష్టపడడంలేదని కృంగ సాగాడు.


చంద్ర శాప వృత్తాంతాన్ని తెలుసుకున్న ఇంద్రాది దేవతలు గజాననుని వద్దకు వెళ్ళి నమస్కరించి విధముగా విజ్ఞప్తి చేశారు " దేవ దేవా! సర్వ జగద్వందితా! నీవు స్వతంత్రుడవు, నీయిచ్ఛ వచ్చినట్లు పరిపాలించే నియంతవు. నిర్గుణుడవు, సగుణుడవు, అన్ని గుణములు నీ యందే కలవు. ఈశ్వరా ! పాహి పాహి! నిన్నే శరణు కోరుతున్నాము. చంద్రుడు చేసిన అపరాధమునకు వేసిన శిక్ష లోకమునంతకూ శిక్ష అగుచున్నది కాబట్టి చంద్రుడు పొందిన శాపమునకు విమోచనము ఇచ్చి చంద్రుని క్షేమమును, లోక క్షేమమును చూడవలసినది. లోకములు చంద్రుడు కనపడక, చూడక కష్టములలో ఉన్నవి. మరల అన్ని లోకములకు చంద్రుని దర్శనము , చంద్రుని తో భాషణము చేయు సౌలభ్యము కలుగజేయుము. ధర్మార్థకామ మోక్షములను ప్రసాదించు వినాయకుడు అది విని ప్రసన్నుడయ్యి ఇట్లు పలికెను " దేవతలారా! మీ స్తోత్రమునకు సంతుష్టుడనైతిని. కానీ మీరు కోరిన కోరిక మూడులోకములలోనూ అసాధ్యమైనది. చంద్రుడు చేసిన పనికి  శాప విమోచనము కుదరదు" అని పలికెను. అంత దేవతలు గణపతితో " దేవా! చంద్రుడు వివర్ణుడై ప్రకాశ హీనుడవ్వడం వలన, చంద్రుని అమృత కిరణములు పడక ఓషధులు ప్రకాశించుటలేదు లోకములు ఆపదలో ఉన్నవి కనుక ఆగ్రహింపక చంద్రుణ్ణి ఆపదనుంచి గట్టెక్కించు" మని ప్రార్థన చేసిరి.

దేవతల ప్రార్థన విన్న వినాయకుడు " దేవతలారా! లోకములో ఆదర్శనీయులను, మహాత్ములను నేరుగా కానీ అన్యాపదేశంగా కానీ కించపరిస్తే శిక్ష తప్పదు. చంద్రుడు అటువంటి అపరాధమే చేశాడు. ఉద్దేశ్యపూర్వకంగా వికటా అని పరిహాసం చేసి ఆపదలపాలయ్యాడు. అగ్ని, సూర్యూడూ చల్లగా ఐననూ, సముద్రము ఇంకిననూ నా వాక్కు ఫలించకతప్పదు. సుర సంఘములారా, నేటినుండి భాద్రపద శుక్ల చవితి తిథినాడు తెలిసి కానీ, తెలియక కానీ శాపముపొందిన చంద్రుని చూసినవారి ఎన్నో కష్టములను పొందెదరు." అదివిన్న దేవతలు "ఓం" అనుచూ ప్రణిపాతం చేసి పుష్ప వృష్టి కురిపించిరి తమ ఇండ్లకు వెళ్ళి చంద్రునికి చెప్పగా, అంత చంద్రుడు " నేను మూఢుడను, లోకములకు ఆదర్శుడైన గజాననునిచూచి పరిహాసమాడి కించ పరచినందుకు నాకే కాక మూడులోకములకు ఆపదలు తెచ్చిన అపరాధినిత్రైలోక్యనాయకుడు! దేవుడు! మూడులోకములు పాలించువాడు! అవ్యయుడు!నిర్గుణుడు ! నిత్యుడు! పరబ్రహ్మ స్వరూపమైన! గజాననుని! సమస్త లోకములకు గురువైనవానికి! నావల్ల అపరాధం జరిగినది. సర్వలోకముయొక్క హితము కొరకు నియమించబడినవాడినైనా నావల్ల అపరాధం జరిగినది. భాద్రపద శుక్ల చతుర్థినాడు మాత్రమే నన్ను చూడరాదన్న శాపమునకు విమోచనము ఎట్లు కలుగగలదు" అని పశ్చాత్తాపపడుతూ " గజాననునే శరణు వేడెదను, ఆయన ప్రసాదముగానే తిరిగి నేను ఖ్యాతిని ఆర్జించగలను" అని పల్కి దేవతల వద్ద సెలవు తీసుకొని గంగా నది దక్షిణ తీరమైన కాశీయందు గణేశుని కొరకై తీవ్ర తపస్సు చేసెను. ప్రదేశంలో చంద్రుడు ఇరవైరెండు సంవత్సరాలు కఠిన తపస్సు చేసాడు.


చంద్రుని తపస్సుకు మెచ్చిన గజాననుడు ఎర్రని వస్త్రములు కట్టుకున్నవాడై, ఎర్రని మాలలు ధరించినవాడై చతుర్భుజములతో, మహా కాయముతో, సింధూరవర్ణంతో, కోట్లాది సూర్యుల ప్రకాశంకన్నా ఎక్కువైన కాంతిపుంజపు ప్రకాశంతో చంద్రుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అంత కాంతిపుంజం చూసిన చంద్రుడు కళ్ళుతెరచి స్వామిని చూసి దోసిళ్ళొగ్గి నమస్కరిస్తూ తన మనసులో ఉన్న కోరికను కోరడానికై పరమ భక్తియుతుడై గజాననునితో " దేవా ! విఘ్ననాశకా! సర్వులకూ ధర్మార్థకామములనొసగడంలో విఘ్నములను హరించువాడా! దయా సముద్రుడా! పరబ్రహ్మా! విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడా! సమస్త విశ్వమూ నీయందే ఉన్నవాడా! జగత్తు యందు మాయగా ఉన్నవాడా! మూడులోకాలనూలయించు శక్తి కలవాడా! నీకు పునః పునః నమస్కారములు. బుద్ధిని ప్రకాశింపజేసి ప్రచోదనం చేయు దేవా! దేవతలకు అధిపతీ! నిత్యము సత్యమూ ఐన పరబ్రహ్మమా! నీకు నిత్యమూ నమస్కారములు. అజ్ఞానముతో చేసిన అపరాధమును మన్నించి దయను వర్షించి నన్ను దోష రహితుని చేయవలసినది." అని వేడుకొన్నాడు.


చంద్రుని స్తోత్రము, అతని కోరిక విన్న గజాననుడు " చంద్రా! నేను నీతపస్సుకు సంతోషించాను. నీకు ఇక పూర్వ వైభవం పూర్వ రూపం కలుగుగాక. భాద్రపద శుక్ల చవితి నాడు నావ్రతం చేసిన వారికి భాద్రపద శుక్లచవితినాడు చంద్రుని చూసిన ఎటువంటి దోషము కలుగదు." అని పలికి చంద్రునిలోని ఒక కళను తన తలమీద పెట్టుకుని చంద్రునికి తిరిగి సముచిత స్థానాన్ని కలిగించాడు. ఆనాడు గజాననుడు "ఫాల చంద్రుడు" అన్న నామాన్ని పొంది, దేవతలందరిచేతా షోడశోపచార పూజలందుకొని చంద్రుడు తపస్సు చేసిన క్షేత్రము సిద్ధి క్షేత్రము కాగలదని వరమిచ్చి అక్కడ చేసిన అనుష్ఠానాది కార్యములు త్వరగా సిద్ధించగలవని పలికెను. అంత దేవతలు మునులు సంతోషం చెందినవారై వారి వారి స్వగృహములకేగిరి. గజాననుడు శుక్ల పక్ష ప్రతిపత్తిథి నాటి చంద్రరేఖను ఎంతో ఉల్లాసంగా, ప్రహృష్ఠ వదనంతో తల మీద ధరించి తన గృహమునకేగెను.

శ్రీ గణేశ పురాణమందలి ఉపాసనా ఖండములోని చంద్ర శాపానుగ్రహము అనే ఆఖ్యానం సమాప్తము
-శంకరకింకర

Wednesday, August 23, 2017

వినాయకోత్పత్తి (గణేశోపాఖ్యానము) శ్రీ శివ మహాపురాణాంతర్గతం

గణేశావిర్భావమును గూర్చి కొన్ని పిట్టకథలు, సినిమా కథలు విరివిగా ప్రచారముననుండి, శివునికి తన పుత్రుడే తెలియదా, అలా ఎలా బాలుని సంహరిస్తాడు వంటి అనేక అపభ్రంశ సందేహాలు నాస్తిక భావనలు వ్యాప్తిజెందుట, అసంబద్ధ ప్రశ్నలువేయుట ఎల్లరకూ విదితమే. శివపురాణమందలి గణేశోపాఖ్యానము స్పష్టముగా ఈ విషయములన్నింటినీ వివరించును. చాలామంది వానిని చదవక, సినిమా కథలు, అన్యులు వేయు చవకబారు ప్రశ్నల నిజమని తలచి మన ధర్మమును, మన దేవుళ్ళను మనవారే కిఞ్చపరచుచుందురు. రాబోవు వినాయక చతుర్థి సందర్భమున శివపురాణాంతర్గత వినాయకోత్పత్తి మూలమునకు తెలుగున అనువదించి మన అందరికోసం పంచడమైనది. అందరూ దీనిని చదివి "లోకాచార పరుడు, లోకాచారమును గౌరవించి తగురీతిన ప్రవర్తించువాడు ఐన పరమేశ్వరుని లీలలను, జగజ్జనని లీలలని వినాయకోత్పత్తిని తెలుసుకోగలరు" -శంకరకింకర

శ్రీ శివ మహాపురాణాంతర్గత వినాయకోత్పత్తి (గణేశోపాఖ్యానము)
శ్రీ గురుభ్యోనమః

 
సూత మహర్షి, తక్కిన మునులకు శివపురాణమును ప్రవచించుచూ, అనేక విషయములను ప్రస్తావించుచుండెను. చతుర్ముఖ బ్రహ్మగారు, నారదునికి కుమార జననము అవతార ప్రశస్తి చెప్పిన పిమ్మట, నారదుడు అత్యంత ప్రేమతో బ్రహ్మగారిని గణేశ జననమును గూర్చిన విషయములు వివరించమని కోరెను. అంత బ్రహ్మగారు నారదుని ప్రేమారగాంచి దివ్యము, మంగళములలోకెల్ల అతి మంగళమగు గణేశ జన్మ వృత్తాంతమును మనసున ఒకసారి శివుని స్మరించి చెప్పసాగెను. " గణేశుని వృత్తాంతము ఒక సారి నేను ఇంతకు ముందు చెప్పియుంటిని, గణేశుడు పుట్టుట, శని గణేశుని చూడగా ఆతని శిరస్సు భిన్నమగుట, అప్పుడతనికి ఏనుగుతలను అతికించుట అను గాథను చెప్పియుంటిని. ఆ గాథ వేరొక కల్పమునకు చెందినది. ప్రస్తుతము శ్వేత వరాహ కల్పమునకు సంబంధించిన గణేశును జననమును గూర్చి చెప్పెదను సావధానముగా వినుము. ఈ గాథలో పరమ దయాళువైన శివుడు గణేశుని శిరము నరుకును. ఓ నారదా ఈ విషయములో నీవు ఏ మాత్రము సందేహము వైక్లవ్యము పొందకుము. అనన్య సామాన్య లీలలు చేయువాడు ఆ శంభుడు, సర్వేశ్వరుడూ. ఆయనే నిర్గుణుడూ, సగుణుడూ. ఓ నారదా! ఆయన లీలామాత్ర సంకల్పముచేతనే సకల జగత్తు సృజింపబడి, పాలింపబడి, లయం కావించబడుతున్నది. ప్రస్తుత కల్పమునకు సంబంధించి శివుడు పార్వతీదేవిని వివాహమాడి కైలాసమునకేగిన కొంత కాలమునకు గణేశ జననము జరిగినది. గణేశ జనన గాథను శ్రద్ధగా వినుము.


ఒకానొక సమయములో జయ, విజయ అను చెలికత్తెలు పార్వతీ దేవితో కలిసి చర్చించుచుండిరి. "రుద్రగణాలన్నీ శివుని ఆజ్ఞనే పాలించుచున్నవి. వారిలో నంది, భృంగి మనవారే ఐనా మిగిలిన ప్రమథ గణాలన్నీ లెక్కలేనన్ని ఉన్నవి. మన మాట విని మన ఆజ్ఞ పాలించే ఒక్కడైనా లేడు. అందరూ మన వారే ఐనా వారి యందు బేధ బుద్ధి కలుగుచున్నది. కావున ఓ పుణ్యాత్మురాలా! నీవు మన మాట వినే ఒకనిని ద్వారము వద్ద ఏర్పాటు చేయవలెను" అని పల్కిరి. ఆది విన్న పార్వతీదేవి, అదీ నిజమే అని తలచి వారి కోరిక మేరకు చేయుటకు నిశ్చయించుకొన్నది. ఒకనాడు తల్లి స్నానమాచరించుచుండగా ద్వార పాలకుడగు నందిని గద్దించి సదాశివుడు ఇంటిలోపలికి వచ్చెను. సమయము కాని సమయములో వచ్చిన శంకరుని చూసి తల్లి పార్వతి సిగ్గుపడి లేచి నిలబడిది. ఆఉత్కంఠ సమయములో తన చెలికత్తెలు చెప్పిన మాటలు గుర్తుకువచ్చినవి.


కొద్ది కాలం తరవాత తల్లి పార్వతి సమర్థుడైన ఒక వ్యక్తి నాకు సేవకుడుగా ఉంటే చాలాబాగుండు, ఆవ్యక్తి నా ఆజ్ఞను కించిత్ కూడా జవదాటనివాడై ఉండగలడు అని తలచెను. తన శరీరమునుండి రాలిన నలుగు పిండితో తాను కోరిన లక్షణములుండు విధముగా ఒక పురుషాకారమును నిర్మించెను. ఏ దోషములులేని అవయవములతో సుందరమైన అవయవములతో, సమర్థుడు, సర్వ శుభలక్షణములతో మహా బల పరాక్రమములు కలదిగా ఆ పురుషాకారమును నిర్మించి ప్రాణములు పోసెను. ఆ తల్లి ఆ పురుషునకు అనేక వస్త్రములు, అలంకారములు ఇచ్చి సర్వోత్తమునిగ అనేక ఆశీర్వచనములు ఇచ్చెను. "నీవు నా పుత్రుడవు, నీవు తప్ప నా సేవకొరకు నావాడనువాడు మరొకడు ఇక్కడ లేడు." అని పార్వతీదేవి పలుకగా, ఆ పురుషుడు జగజ్జననికి వినయముగా నమస్కరించి అమ్మా ఇప్పుడు నేను చేయదగిన పనియేమి. నీ మాటను నేను నెరవేర్చెదను అని అడుగగా, పార్వతీ దేవి " ఓ పుత్రా! ఇపుడు నీవు నాద్వారమును రక్షించుము. నీవు నాపుత్రుడవు గనుక నావాడవు నీవు తప్ప మరొకడు నావాడు లేడు. పుత్రా! ఎవ్వరైనా ఎప్పుడైనా నా ఆజ్ఞ లేనిదే నా గృహములోనికి ప్రవేశించరాదు." అని పలికి ధృడమగు దండమును ఒకదానిని ఆయుధముగా ఆ బాలునికిచ్చెను. ఆ ద్వారము వద్ద తన పుత్రుడు కాపలా ఉండగా, పార్వతీ మాత తన సఖులతో కూడి స్నానము చేయుచుండెను.


"నానాలీలా విశారదుడగు శివుడు" అకస్మాత్తుగా ఆ ద్వారము వద్దకు వచ్చెను. ఆయనే శివుడని తెలియక ద్వారము వద్ద కాపలా ఉన్న దేవీపుత్రుడు ఇట్లు పల్కెను " ఓ దేవా! తల్లి ఆజ్ఞ లేనిదే నీవిపుడు లోనికి పోరాదు. తల్లి స్నానమునకు వెళ్ళినది. నీవు అటు వెళ్ళరాదు " అని శివుని నిలువరించడానికి చేతిలోకి కర్రతీసుకొనెను. అది చూసి శివుడు విస్మయం తో " ఎవరు నీవు? నీవు ఎవరికి అడ్డుపడుతున్నావో తెలుసా ఓ మూర్ఖా! నేను శివుడను" అని అన్నా వినక ఆ దేవీ పుత్రుడు అనేక విన్యాసములు చూపుతూ మహేశ్వరుని ఆ కర్రతో కొట్టెను. అంత కోపించిన మహేశ్వరుడు తిరిగి ఆ ద్వారపాలకుని చూచి "ఓ మూఢా! నేను శివుడను, పార్వతీపతినని తెలుసుకో. నా ఇంటికి వెళ్ళకుండ నన్నే అడ్డుకుంటావా" అని పలికి లోపలికి ప్రవేశిస్తున్న శివుని పై మరోమారు ఆ దేవీపుత్రుడు కర్రతో ప్రహారము చేసెను. అంత కోపించిన శివుడు రుద్రగణములతో "వీడెవ్వడు? ఇక్కడేమి చేస్తున్నాడు, చూడండి" అని "లోకాచారములను పాటిస్తూ అనేక అద్భుత లీలలను ప్రదర్శించు ప్రభువు" ఇంటిబయట నిలబడెను. (13 వ అధ్యాయం) -శంకరకింకర


రుద్రగణములు ఆ పార్వతీ నందనుని వద్దకు వచ్చి విచారించి, వచ్చినవాడు పార్వతీ నాధుడైన శివుడనీ పక్కకు తొలగమనీ చెప్పిరి. ఆ దేవీ పుత్రుని కూడా రుద్రగణములలో ఒకనిగా చూస్తున్నామనీ, అనవసరంగా మృత్యువుని కొనితెచ్చుకోవద్దనీ హితవు చెప్పినంత, ఆ పార్వతీ నందనుడు కొంచెమైనా బెదరక మీరు శివుని సేవకులు, నేను పార్వతీ మాత సేవకుని అని గద్దించి బెదిరించెను. ఈ విషయమంతా గణములు శివునకు విన్నవించగా శివుడు కోపించి ఎట్టిపరిస్థితులలోనైనా ఆ బాలకుని తొలగించమని ఆజ్ఞాపించెను. ద్వారమువద్ద కలకలమును విని పార్వతీ దేవి చెలికత్తెలు ఆ పార్వతీ నందనుడు శివగణములతో జరుపు వాదమును విని సంతోషిచి పార్వతీ దేవితో ఇట్లు పలికిరి " ఓ మాహేశ్వరీ! అభిమానవతీ! శివగణములు ద్వారమునందు నీ పుత్రుని చేత నిలువరింపబడినవి. ఆతనిని వాదమున గెలవక వారు లోనికి రాలేరు. తల్లీ నీవు కూడ నీ అభిమానమును విడవకు. శివగణములను ఎదిరించి మన మాట వినే సేవకుడు ఉన్నాడని వారికి తెలిసి వారి అహంకారము తగ్గి మనకు అనుకూలురు కాగలరు" అప్పుడు పతివ్రత, అభిమానవతి అగు పార్వతీ దేవి శివుని (మాయకు) ఇచ్ఛకు వశురాలై తన మనస్సులో ఇలా అనుక్కున్నది. "ఆయన ఒక్క క్షణకాలము ద్వారమున నిలచియుండిన వాడు కాదు, పైగా లోపలికి వెళ్లవలెనని హఠము చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన యందు ఉన్న వినయమునకు భంగం కలగకుండా ఎలా వ్యవహరించాలి? జరిగేది జరగక మానదు" అని తన సఖిని పిలిచి తన పుత్రుని వద్దకు పంపెను. ఆ సఖి దేవీపుత్రుని తో ఇట్లు పలికెను " ఓ కుమారా! నీవు చేసిన పని బాగున్నది. వారిని బలవంతముగా ప్రవేశింపకుండ చేయుము. నీఎదుట ఈ గణములు నిలువలేవు. నీ వంటి పరాక్రమ వంతుని ఆ గణములు జయించలేవు. వారి కర్తవ్యము వారు చేసినా చేయకపోయినా, నీకర్తవ్యమును నీవు చేయుము. నీవు గెలిచినా వైరము మాత్రము పొందవద్దు జ్ఞప్తి ఉంచుకో". దేవీపుత్రుడు ఆమాటలను విని సంతోషించి రెట్టించిన ఉత్సాహముతో నిర్భయముగా ఆ గణములనుద్దేశించి ఇలా పలికెను. " నేను పార్వతీ పుత్రుడను, మీరు గణములు. మనమిద్దరమూ సమానమే. కాబట్టి ఎవరి కర్తవ్యమును వారు నిర్వర్తించెదము. మీరు ద్వారపాలకులు, ఇప్పుడు నేనూ ద్వారపాలకుడను. నేనిక్కడ పార్వతీ మాత అనుజ్ఞమేరకు నిలబడియున్నాను. మీ కర్తవ్యమేమో తెలిసికొని నిర్వర్తించండి శివుని ఆజ్ఞను పాలించండి. ఇపుడూ నేను పార్వతీ మాత ఆజ్ఞను పాటించుచున్నాను. ఈ నా నిర్ణయము యథోచితమైనదే." అంత గణములు సిగ్గుతో శివుని వద్దకు వెళ్ళి నమస్కరించి స్తుతించి అద్భుతమగు పార్వతీ నందనుని వద్ద జరిగిన వృత్తాంతముని విన్నవించిరి. లోకాచారమును అనుసరించి లీలలు చేయు మహానుభావుడైన శివుడు తన గణములతో " ఓ వీరులారా! ఇప్పుడు యుద్ధము సముచితము కాదు. మీరు నాగణములు , నాకు సంబంధించిన వారు. ఆతడు గౌరికి సంబంధించినవాడు. కానీ, నేనీ సమయములో వెనుకకు తగ్గినచో శివుడు సర్వదా గౌరికి దాసుడని భార్యావిధేయుడనీ అపవాదు కలుగగలదు. ఎదుటివాని పరాక్రమము శక్తిని కొలచి ప్రతీకారము చేయవెలె. ఆబాలుడు ఏకాకి ఏమి పరాక్రమము చూపగలడు? మీరు యుద్దములో బహు పరాక్రమము కలిగినవారని పేరొందినారు అట్టివారు ఎలా యుద్ధములో తేలిక అవుతారు? స్త్రీ మొండి పట్టు పట్టరాదు. అందునా భర్త యెదుట అసలు పట్టరాదు. గిరిజాదేవి తన పట్టు సడలించనిచో దాని ఫలము నిశ్చయముగ అనుభవించగలదు. కావున మీరందరూ శ్రద్దగా నా మాట విని నిశ్చయంగా యుద్ధము చేయండి. ఏది జరుగ వలెనో అది జరుగకమానదు" "లోక వ్యవహారమును మన్నించి మహాలీలా విశారదుడైన శివుడు అనెను". (14 వ అధ్యాయము) -శంకరకింకర


రుద్ర గణములు పార్వతీ దేవి మందిరము వద్దకు యుద్ధ సన్నద్ధులై వెళ్ళగా వారిని చూసిన పార్వతీ నందనుడు " గణములకు స్వాగతము. బాలుడను, ఒంటరిని ఐన నేను పార్వతీ మాత ఆజ్ఞను పాటించెదను. మీరు శివాజ్ఞను పాటించండి. పార్వతీ దేవి ఇక తన కుమారుని బల పరాక్రమముని చూడగలదు. అలానే శివుడు కూడా తన గణముల బల పరాక్రమాలెట్టివో చూడగలడు. మీరెన్నో గొప్ప యుద్ధములు చేసినవారు.యుద్ధములో ప్రావీణ్యమున్నవారు. నాకు అటువంటి అనుభవములేదు. నేను ఇప్పుడు మీతో యుద్ధము చేయబోతున్నాను. ఈ విషయమై నాకు కలిగే వినాశనమేమీలేదు. పార్వతీ పరమేశ్వరులు సిగ్గుపడితే అది మన ఇద్దరికీ సిగ్గుపడవలసిన విషయమే కాబట్టి మీరు శివుని ముఖం చూసి గౌరవం ఇనుమడించేలా యుద్ధం చేయండి నేను నాతల్లి పార్వతి ముఖం చూసి గౌరవం ఇనుమడించేలా యుద్ధం చేస్తాను. దీనిని ఆపగల సమర్థుడు లోకంలోనే లేడు." అని పలికెను


నంది, భృంగి ఇత్యాది ముఖ్యులందరూ పార్వతీ నందనుని చే యుద్ధములో ఎదురిడి ఓడిరి. ఒక్క గణము కాని, గణాధ్యక్షుడు కానీ యుద్ధమున నిలువలేకుండిరు. పార్వతీనందనుని దెబ్బలకు తాళలేక పారిపోవుచుండిరి. ఎముకలు విరిగినవి, కాళ్లూ తెగినవి, చేతులు తెగినవి. కల్పాంతంలో భయపెట్టే ప్రళయాన్ని ఆయుద్ధము తలపింప చేసినది. అదే సమయమున నారదుడు ఈ విలయానికి కారణమేమో చెప్పి బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలతో కూడి శివుని వద్దకు వచ్చి నమస్కరించి ఈ అకాల ప్రళయానికి కారణమడిగిరి. శివుడు వారికి ద్వారమునందున్న బాలకుని వృత్తాంతమంతా చెప్పగా బ్రహ్మాదులు ఆ బాలకునికి నచ్చచెప్పబోయి ఆ బాలుని పరాక్రమమునకు నిలువలేక వెనుతిరిగిరి.


నారదాది మునులు శివునికి నమస్కరించి " ఓ పరమ శివా! ఈ బాలుడెవ్వడు? పూర్వము ఎన్నో యుద్ధముల గురించి విన్నాము కానీ ఇటువంటి యుద్ధాన్ని ఎప్పుడూ చూడలేదు, వినలేదు. ఓ దేవా సావకాశముగా ఆలోచించి నిర్ణయించుము . లేనిచో జయము కలుగదు. హే స్వామీ! జగద్రక్షకుడవు నీవే. ఈ ఆపదనుండి గట్టెక్కించుము." అని పలుకగా రుద్రుడైన శివుడు తన గణములతో కూడి యుద్ధస్థానముకు బయలుదేరెను. దేవ సైన్యం విష్ణువుతో కూడి గొప్ప ఉత్సవము వలె శివుని అనుసరించినది. అప్పుడు తిరిగి నారదుడు ఇట్లు పలికెను" ఓ దేవ దేవా! మహాదేవా! విభూ! నామాటలను ఆలకించండి. సర్వవ్యాపివగు నీవు అనేక లీలలను హేలగా చేయగల ప్రభువు. నీవు ఇంత గొప్ప లీలను చూపి సకల గణముల గర్వమునూ అణిచావు. ఓ శంకరా! ఈ పార్వతీ నందనునకు మహాబలమిచ్చి దేవతల గణముల గర్వాన్ని అణిచావు. ఓ నాథా! శుభంకరా! సర్వస్వతంత్రా నీవు అందరి గర్వమునూ ఆ పిల్లవాని చేతిలో అణచివేసి నీ బలమును లోకమునకు చాటి చెప్పితివి. ఓ భక్త ప్రియా! ఇంకా నీ ఈ లీలను కొనసాగించవద్దు. ఈ ఆటను ఇక్కడితో ఆపుము" అని పల్కెను"
అంత ఆ మహేశ్వరుడు విష్ణువుతో సంప్రదించి తన గణములు దేవ సైన్యముతో కలిసి ఆ బాలుని సంహరింప యుద్ధమునకు తరలెను. అక్కడ జరిగిన యుద్ధములో పార్వతీ నందనుని చేతి కర్ర తో దెబ్బలు తిననివారులేరు. పార్వతీ దేవి శక్తులు ఆ బాలుని వచ్చి చేరినవి. ఆ బాలునికి దేవ సైన్యానికి, విష్ణువుకు గొప్ప యుద్ధము జరిగినది. విష్ణువు బాలుని చేతిలో పరాభవము పొందుట చూచిన శివుడు కృద్ధుడై త్రిశూలముతో, పినాకముతో, శూలముతో రక రకముల ఆయుధములతో ఆ బాలుని సంహరించ ప్రయత్నింప ఆబాలుడు తన తల్లి శక్తితో అన్నింటినీ పరిహరించెను. లోకాచారముననుసరించి శివుడు మిక్కిలి ఆశ్చర్య చకితుడైయ్యెను. అటుతరవాత శివ గణములతో, విష్ణువుతో, దైవ సైన్యముతో శివునితో, శివ శక్తిచే వృద్ధిపొందిన శక్తి తనయుడు యుద్ధముచేసి అందరినీ పీడించెను. లీలా రతుడైన శివుడు సమయము చూసి ఆబాలుని కుత్తుకను శూలముచే ఉత్తరించి ఆబాలుని సంహరించెను.(15, 16 వ అధ్యాయము) -శంకరకింకర

అంత గణములు, దైవ సైన్యములు తప్పెట్లు తాళములు మ్రోగిస్తూ నృత్యము చేయనారంభించిరి. అంత నారదుడు ఆ విషయమును తల్లి పార్వతికి తెలియజేసి తన అభిమానమును కాదని శాంతముతో ఉండమని చెప్పెను. అది విన్న పార్వతీ దేవి క్రోధావేశయై, దుఃఖముతో నాకుమారుని సంహరించినారాయని బాధతో లోకమునకు ప్రళయమును కలిగించెదనని తలచి కొన్ని లక్షల సంఖ్యలో శక్తులను సృజించెను. ఆ శక్తులతో దేవి ఇట్లు పలికెను " ఓ శక్తులారా! నా ఆదేశముచే మీరిపుడు ఇక్కడ ప్రళయమును కావించండి. దేవతలను, గణములను, యక్షులను, రాక్షసులను వీరు వారని లేక అందరినీ భక్షించండి" అప్పటివరకూ పార్వతీ నందనునితో యుద్ధము ప్రళయమును తలపించి అతని మృత్యువుచే శాంతము పొందగా తిరిగి ఈ కొత్త ప్రళయమేమని దేవతలు, గణములు, సర్వ భూతములు బెంబేలు పడినవి.

అంత అందరూ కలిసి ఈ ప్రళయము ఎలా శమించునని నారదుని ప్రశ్నించగా, దానికి ఒకే మార్గము పార్వతీ దేవి శాంతించుట అని తెల్పెను. అంత మునులు దేవతలు అందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడి పార్వతీ మాత వద్దకు చేరి నమస్కరించి శాంతింపమని కోరిరి. "తల్లీ, నీ భర్త! లీలా విలాసములనొనరించువాడు ఇక్కడే ఉన్నాడు. బ్రహ్మ, విష్ణువు మేమందరమూ నిన్ని శరణుజొచ్చాము మేమందరము కూడా నీకు బిడ్డలమే కదా" అని పల్కి శాంతించుటకుపాయము కోరిరి. అంత ఆ తల్లి నాకుమారుడు పునర్జీవితుడైన నేను శాంతించెదనని పలికినది. అతడు తిరిగి జీవించిన ఈ సంహారము ఆగును. అతడు మీ అందరికీ పూజ్యుడు కాగలడు. అతడు మీ గణములకందరకీ అధ్యక్షుడు కాగలడు. అపుడు లోకము శాంతిని పొందగలదు.
అది విని శంకరుడు ఉత్తర దిక్కునకు వెళ్ళి ముందు కనిపించిన ప్రాణి శిరస్సును తీసుకురమ్మని పంపెను. శివుని ఆజ్ఞను పాలించే దేవతలు ఆజ్ఞ తీసుకుని బయలుదేరిరి. వారికి కనిపించిన ఒక ఏనుగు శిరమును తీసుకువచ్చి శుభ్రముగా కడిగి ఆబాలకుని దేహమునకు అతికించి శివునితో " హే పరమేశ్వరా! శిరము బాలుని తలకు అతికించితిమి ఇక మీరు చేయవలసిన కార్యము చేయండి అని పలికిరి" అక్కడనే ఉన్న బ్రహ్మ విష్ణువులు శివుని జూచి" హే మహాదేవా! నీవు ప్రభువువు, నిర్గుణుడవు, పాలకుడవు. నీ తేజస్సు చేతనే మేమందరమూ జన్మించితిమి. వేద మంత్ర ప్రభావములచే నీ ఆతేజస్సు ఇక్కడకు వచ్చుగాక" అని స్మరించి. శివుని కి నమస్కరించి మంత్ర జలములను దేహముపై చల్లిరి. అపుడా బాలకుడు శివ సంకల్పముచే ఆ జలములు తగిలిన వెంటనే చైతన్యమును పొంది నిద్దుర నుండి లేచిన వాని వలె లేచి నిలబడెను. మిక్కిలి సౌభాగ్యవంతుడు, అందగాడు, ఏనుగు మోము కలవాడు, ఎర్రని రంగు కలవాడు ప్రసన్న ముఖుడు, గొప్ప కాంతితో సుందరమైన ఆకారము కల ఆ పార్వతీ తనయుని చూసి అందరూ ఆనందించిరి. ఆ పార్వతీ దేవి సహితము తన తనయుని చూసి అతని పరాక్రమము తలచి బహుసంతోషించినది. (17 వ అధ్యాయము) -శంకరకింకర

ఆ జీవించిన బాలకుని చూసి పార్వతీ పరమేశ్వరులు ఆనందము పొందిరి లోకమంతయును శాంతిని పొందినది. ఆ గజాననుని దేవతలు, మునులు గణనాయకులు అభిషేకించిరి. పార్వతీ దేవి తన కుమారుని చూసి ఆనందముతో దగ్గరకు తీసికొని ఆనందించి వివిధ వస్త్రములు ఆభరణములు ఇచ్చినది. ఆ దేవి గజాననునికి అనేక సిద్ధులనిచ్చే తన చేతితో నిమిరి ముద్దాడి ప్రీతితో ఎన్నో వరములిచ్చినది. గజాననుడు పుట్టుకతోనే ఆపదకలిగి తొలగినందున ఇక ఎల్లప్పుడూ దుఃఖరహితుడవౌదువని వరమిచ్చెను. అప్పుడు "గజాననుని చెక్కిళ్ళపై ఆ తల్లి సింధూరము అంటుకుని గజాననుడు మరింత అందముగా కన్పడగా ఆతల్లి మానవులు గజాననుని సర్వదా సింధూరముతో పూజించెదరిని పలికెను".

పుష్పములు, శుభ్రమగు గంధము (తెల్ల గంధము), నైవేద్యము, తామ్బూలము, నీరాజనము, ప్రదక్షిణ నమస్కారములు అను విధానములో ఎవరు పూజిస్తారో వారికి నిస్సంశయంగా సర్వమూ సిద్ధించును, సకల విఘ్నములు నశించును అని పలికి తన భర్తతో కూడి విఘ్నేశ్వరుని మరల అనేక వస్తువులతో అలంకరించెను. అప్పుడు ఇంద్రాది దేవతలు శివుని శాంతింపజేసి మహేశ్వరుని మహేశ్వరి పక్కన కూర్చుండబెట్టి సకల లోక శాంతి కొరకై పార్వతీదేవి ఒడిలో గజాననుని కూర్చుండబెట్టిరి. అప్పుడు శివుడు ఆ గజాననుని శిరస్సున పద్మములవంటి తన చేతులనుంచి వీడు నాకుమారుడు అని పలికెను. అప్పుడు గణేశుడు లేచి శివునకు, పార్వతికి, విష్ణువునకు, బ్రహ్మగారికి, తక్కిన పెద్దలకు ఋషులకు నమస్కరించి ఇట్లు పలికెను" నా అపరాధమును మన్నించండి. నా అహంకారము, అభిమానము కలిగి ఉండడం జీవుల లక్షణం" అంత త్రిమూర్తులు ముగ్గురూ ఒకేసారి గజాననునికి ముల్లోక పూజార్హత, ప్రథమ పూజార్హతను ఇచ్చి ఇట్లు పలికిరి " ఈతనిని పూజించకుండ ఎవరిని పూజించినా అది పూజించినట్లు కాదు. ముందు ఇతనిని పూజించిన పిదపనే ఇతరులను పూజించవలె" అని పలికిరి. పార్వతీ దేవిని ఆనందింపజేయుట కొరకు బ్రహ్మా విష్ణువులు గజాననుడే సర్వాధ్యక్షుడని తెలిపి కీర్తించిరి. సకల లీలలకు మూలమైన శివుడు సర్వకాలములందూ సుఖాన్నిచ్చే వరాలనెన్నింటినో ఇచ్చి ఇట్లు పలికెను " ఓ పార్వతీ పుత్రా! నేను సంతోషించితిని. నేను సంతోషించిన జగత్తు సంతోషించును. నీవు శక్తి పుత్రుడవు గొప్ప తేజోశాలివి. నీవు బాలుడవే ఐనా మహా పరాక్రమము ప్రదర్శించితివి. ఎల్లప్పుడూ సుఖముగా ఉండు. నేటి నుండి నీవు నా గణములన్నింటికీ అధ్యక్షత వహించి గణాధ్యక్షునిగా , గణేశునిగా పూజలు పొందుము."

లోకమునకు మంగళములు చేయు ఆ శంభుడు గణేశునికి మరల వరాలిచ్చెను " ఓ గణేశా ! నీవు భాద్రపద శుక్ల చతుర్థినాడు చంద్రోదయ శుభకాలమున జన్మించితివి. పరమ పవిత్రురాలైన గిరిజ శరీరము నుండి మొదటి ఝాము లో నీ రూపము ఆవిర్భవించెను కాబున ఈ రోజు నీ వ్రతము చేయుట ఉత్తమమైనది. కాబట్టి సర్వ కార్యములు సిద్ధించుటకు ఆ తిథినాడు ఆరంభిమ్చి శుభకరమగు వ్రతమును ఆనందముతో శ్రద్ధతో అనుష్ఠించవలెను. మరల సంవత్సరము ఈ తిథి వచ్చు వరకు ఈ వ్రతమాచరించవలెను. సంసారమందు ఎన్ని సుఖములున్నవో అన్నీ పొందగోరువాడు, నిన్ని చవితి తిథినాడు భక్తితో యథావిధిగా పూజించవలెను. మార్గశీర్ష కృష్ణ చతుర్థినాడు ఉదయమే స్నానము చేసి వ్రతమాచరిమ్చి బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను, ఉపవాసముండి దూర్వములతో పూజించవలెను. లోహమూర్తిని గానీ, పగడముల మూర్తిని గానీ, తెల్ల జిల్లేడుతో చేసిన మూర్తిని గానీ, మట్టితో చేసిన మూర్తినిగానీ పూజించవలెను. ఆమూర్తిని చక్కగా ప్రతిష్ఠించి నానావిధములగు దివ్య చందనములతో సుగంధ ద్రవ్యములతో, పుష్పములతో శ్రద్ధగా పూజించవలెను. దూర్వళూ పన్నెండు అంగుళముల పొడుగు ఉండి చివర్లు, మొలకలు లేనివిగా ఉండవలెను నూటొక్క దూర్వలతో ఆ ప్రతిమను పుజించవలెను. అలానే ఇరవైయొక్క పత్రములతో గణపతి ప్రతిమను పూజించి, ధూప దీప నైవేద్యములతో పూజించవలెను. తరవాత బాల చంద్రుని పూజించి బ్రాహ్మణులకు మధుర పదార్థములతో ఆనందముగా భోజనము ఏర్పాటు చేయవలెను. తానుకూడ లవణమును వర్జించి భుజించవలెను. తరవాత అక్కడనే ఇద్దరు స్త్రీలను ఇద్దరు బాలకులను పూజించి భోజనము ఏర్పాటు చేయవలెను. రాత్రి జాగరమొనర్చి మరల మరల తిరిగి రావలెనని ఉద్యాపన చెప్పవలెను. వ్రతము పూర్ణమగుట కోసం ఒక బాలకునికి దోసిలి నిండా పువ్వులు ఇచ్చి వాని నుండి ఆశీస్సులు గ్రహించవలెను. తరవాత మిగిలిన సత్కారాలు పూర్తిచేయవలెను. ఇలా వ్రతము చేసిన వారికి సకల కోరికలు తీరుతాయి. ఓ గణేశా! నిన్ను నిత్యము శ్రద్దతో పూజించువాని కోర్కెలన్నీ ఈడేరును. నిన్ని సింధూరము, గంధము, బియ్యము, మొగలి పువ్వులు మొదలైన వివిధ ద్రవ్యములతో ఉపచారములతో పూజించవలెను. ఎవరైతే భక్తితో నీకు అనేక ఉపచారములు సమర్పించి పూజిస్తారో వారికి సిద్ధి కలుగును. వారిని విఘ్నములు ఏనాడూ బాధించవు. అన్ని వర్ణముల వారూ, స్త్రీలూ కూడా ఈ వ్రతమును ప్రత్యేకముగ చేయవలెను. ఎవరెవరు ఏయే కోర్కెలు కలిగి ఉందురో, నిత్యమూ నిన్ను పూజించటం ద్వారా వారికి ఆయా కోర్కెలు సిద్ధించును." అని శివుడే గణేశ ఫుజావిధిని నిర్ణయించి తత్ఫలితమును తెల్పెను.

అప్పుడు సకల దేవతలు, శివ గణములు, మునులు, సకలురు ప్రీతితో మేమలాగే చేసెదము అని పలికిరి. గణేశుని యథావిధిగా పూజించిరి. అప్పుడు సర్వ గణములు గణేశునికి ప్రణమిల్లి అనేక వస్తువులతో పూజించిరి. పార్వతీ దేవి సంతోషము వర్ణింపనలవి కాదు. దేవ దుందుభులు మ్రోగినవి, అప్సరసలాడిరి, పాడిరి, సర్వులకూ దుఃఖములు తొలగినవి. సకల దేవతలూ, బ్రహ్మ విష్ణు ఇంద్రాదులు పార్వతీపరమేశ్వరుల అనుజ్ఞతో వారి వారి లోకాలకు వెళ్ళిరి. అని బ్రహ్మగారు గజాననోత్పత్తి అంతా నారదునికి తెలిపి ఇట్లు పలికెను " ఓ నారదా! మహర్షీ! పుజనీయుడా! నీవు అడిగిన ప్రశ్నకు బదులుగా, పార్వతీ పరమేశ్వరుల మరియు గజాననుని వృత్తాంతము చెప్పితిని. ఎవరైతే ఈ పరమ పవిత్ర గాథను భక్తితో వింటాడో, వానికి సమస్త మంగళములు పొందగలడు. పుత్రుడులేని వానికి పుత్రులు కలుగుదురు, భార్యను కోరు వాడు భార్యను పొందును. సంతానమును కోరువాడు సంతానమును పొందును. రోగి ఆరోగ్యవంతుడగును, దురదృష్ఠవంతుడు భాగ్యశాలి అగును, పోయినవి తిరిగి లభించును. దూరదేశములనున్న భార్య,భర్త, బంధువులు కలుసుకొనెదరు. శోకముతో ఉండేవాని శోకము తొలగిపోవును..

ఈ గణేశోపాఖ్యానము ఎవరి ఇంట్లో ఉండునో వాడు నిత్యమంగళుడనుటలో సందేహములేదు. ప్రయాణ కాలమందు, పర్వదినములందు ఎవరైతే దీనిని సావధాన చిత్తుడై వినునో వాడు గణేశుని అనుగ్రహముచే ఇష్టములన్నీ పొందును. (18 వ అధ్యాయము) -శంకరకింకర

శ్రీ శివమహాపురాణాంతర్గత రుద్రసంహితలోని కుమార ఖండంలో గణేశోపాఖ్యానమను పదమూడు (13) నుండి పద్దెనిమిది (18) అధ్యాయములు సమాప్తము



Wednesday, August 2, 2017

కాలం మారుతోందా.. ఖచ్చితంగా లేదు!

కాలం మారుతోందా.. ఖచ్చితంగా లేదు, కాలం మారడం అంటే GMT ప్రకారం గడియారంలో అంకెలు మార్చుకోవడం కాదు. కాలం ఎన్నటికీ మారదు. కాలం ఎవరికోసమూ మారదు, కాలం ఏ కారణానికీ ఆగదు. తన గమనంలో మనం చేసే సుకృతాలనీ వికృతాలనీ గమనిస్తూ నిశ్శబ్దంగా వెళ్ళిపోతుందంతే. కాలంతో పరిగెడదామని ప్రయత్నించి ప్రయత్నించీ మనిషి ఆగినచోట ఓ నవ్వేసుకుని తన పనిలో తానుంటుంది. కాలం మారదు, మనిషి మారుతున్నాడు. ప్రాకృతికమైన మార్పులని జయించాలని కృత్రిమతని జోడిస్తున్నాడు. మనిషి కదా! ఆశాజీవి, అందనిదేదో అందాలనే ఉబలాటం, అనుకున్నది అందినా అందకున్నా ఏం సాధించాడో ఇంకా ఏం సాధించాలో తెలుసుకోకుండానే పాల్గొనే జీవిత పరుగుపందెం. అంతే, మనకోసం కాలం మారదు, ఆగదు, వెనక్కెళ్ళదు నువ్వు ఆ కాలానికి ఇరుసువై ధృవతారలా నిలిస్తే తప్ప కాలం నీకు వశవర్తి కాబోదు.

 

మనిషి తన అలవాట్లనీ, జీవన విధానాన్నీ మార్చుకుంటున్నాడు. కాలంతో మారకపోతే మనం మనలేం అనుకుంటున్న మనకు మారుతున్న జీవన విధానాలే మనని యాంత్రికంగా మార్చేస్తున్నాయని తెలీదా.... తెలుసు తెలిసీ కాలంతోపాటు మనమూ అనే నిర్లిప్తతతో కూడిన నవ్వుతో తన ఆలోచనల్ని బలవంతంగా కొత్త ధోరణులకు కొత్త పోకడలకు అలవాటు పడేలా చేసుకుంటూ మారుతున్న ఆలోచనా సరళిని, కొత్త పోకడలనీ, ధోరణులనీ కాలానికి ఆపాదించి కాలం మారుతుందంటున్నాడు. కాలం మారదు నీకోసమో నాకోసమో ఎవరికోసమో మారదు. మారాల్సిన అవసరం దానికి లేదు, అది మనలా మనిషి కాదుకదా మారిపోడానికి. ఉత్తమమైన మనిషివిగా పుట్టావుగా! ఉత్తమమైన దాన్ని పొందు కాలాన్ని జయించి ఋషిలా నిలిచిపో కాలాన్ని దాటిపో నువ్వు మనిషినుండి ఋషిగా ఎదిగితే తప్ప ఆ కాలం నీకు సాహో అనదు.

ప్రకృతిలోని శక్తిని, ప్రకృతి ద్వారా లభించే వస్తువులనీ ఉపయోగించి ప్రకృతి విరుద్ధంగా సౌకర్యాలను పెంచుకున్న మనిషి ఒక విధంగా ప్రకృతితో యుద్ధమే చేస్తున్నాడు. కాలంలో ఎప్పుడో వచ్చే ఆపత్తికి ఇప్పుడే నివారణ అంటూ ఎన్నో కనుగొన్నాడు కాలాన్ని జయించాననుకున్నాడు. పూర్వులు అవసరార్థంగా కనుగొని వాడినవి ఇప్పుడు నిత్యావసరంగా మార్చుకున్నాడు, కాలంతో పరిగెట్టాననుకుంటూ పరిగెడుతున్నాననుకుంటూ కాలాన్ని ఓడిస్తున్నాననుకుంటూ కాలం ముందు ఓడిపోతూనే ఉన్నాడు తోడుగా మనిషిగా కూడా ఓడిపోయి రెంటికీ చెడ్డవాడౌతున్నాడు. సుఖం కోసం దేన్ని తయారు చేసుకున్నాడో అదే దుఃఖమై కాలంలో కాటేస్తున్నా ఎడారిలో ఒంటె బ్రహ్మజెముడు ముళ్ళని నమిలితే దాని పంటిచిగుర్లు దవడలు చీరుకుపోయి వచ్చే రక్తాన్ని నీళ్ళనుకుని మరిన్ని మరిన్ని బ్రహ్మజెముళ్ళను తిన్నట్లు, సుఖం కోసం సౌకర్యం కోసం ఇంకా ఇంకా ఎవరికో ఏదో ఇవ్వాలనీ, ఏదో చేయాలనీ ప్రాకులాడుతుంటాడు కాలాన్ని వెనక్కి తోసాననుకుంటాడు తీరా చూస్తే ఆ కాలం మనని ముందుకు తోసినట్లుగా కనపడినా ఆ కాలానికి వ్యతిరేక దిశలో మనం పరిగెట్టామని అవగతమవదు.

 

కాలం నీకోసం ఆగదు, అది ఆగకుండానే ఎన్నో పాఠాలు చెప్తుంది అందుకోవడమా వదులుకోవడమా నీ వంతు. కానీ కాలంతో నీతో మాట్లాడదు, నువ్వు చెప్పిందీ వినదు అది సాగుతూనే ఉంటుంది కాలాన్ని ఓడించడం మామూలు మనిషి తరం కాదు, కాలాన్ని ఓడించినవాడెవడూ మామూలు మనిషిగా మిగలరు కాలాతీతంగా మిగిలే ఋషులంటారు. కాలానికెంత నవ్వొస్తుందో మనిషిని చూసి, తన సౌకర్యాలు, తన అవసరాలు, తన వాళ్ళ సౌకర్యాలు, తన వాళ్ళ అవసరాలు, అహంకారాలు మమకారాలు వీటితో అంటకాగి తన ఆలోచనలను ధోరణిని జీవనవిధానాన్నీ మార్చుకుంటూ మారిపోతూ కాలం మారుతోంది కాలంతోపాటు మనమూ మారాలని అనుకుంటూ మారని ఇతరులనీ తనతో పాటు కలుపుకుంటూ వాళ్లూ మారాలని అన్యాపదేశంగా చెబుతూ తన వడి చెదరని కాలానికి మార్పునాపాదించి తృప్తి పొందుతున్నాడు. మనిషి కదా! మార్పు కోరుకుంటాడు కానీ కాలం ఆగబోదు. అన్నింటినీ చూస్తూ మనిషి పడినప్పుడల్లా నవ్వుతూ వెళుతూనే ఉంటుంది!

కాలః అస్మి అని ఆ పరబ్రహ్మముయొక్క వాక్కు... అదే మారని సత్యం...

-శంకరకింకర

 


Tuesday, July 11, 2017

హేతువాది అతిపెద్ద మూఢవిశ్వాసం

హేతువాది, నాస్తికవాది దృష్టిలో ఆస్తికులందరూ ఆలోచన చేయనివాళ్ళు లేదా ఆలోచించే శక్తిని వదులుకున్నవాళ్లు గిరిగీసుకుని బ్రతికేవాళ్లు. ఆస్తికుడైన వ్యక్తి ఒక వ్యక్తికి పనికివచ్చే మాట మాట్లాడినా పదిమందికి పనికి వచ్చే పని చేసినా ఆ వ్యక్తి మాట ప్రభావం వలన సమాజంలో ఏ మంచి జరిగినా దాన్ని ఒప్పుకోలేడు. ఒక వ్యక్తిని రోడ్డు దాటించే సహాయం నుంచి తీసుకుని జీవితాన్ని పండించుకునేదైనా లేక సమాజానికి పనికి వచ్చే ఎంత పెద్ద మాట సహాయమైనా సరే జరిగిన ఆ మంచిని అంగీకరించలేడు. పూర్వ నిర్ధారిత సిద్ధాంతం భావజాలం వల్ల ధార్మిక ఆలోచనలు గానీ లేదా మత సంబంధమైన సాహిత్యం కానీ ఎంత మంచిదైనా సహేతుకం కానివనీ, అవి పనికిరానివనే అపోహలో బ్రతికేస్తుంటాడు. ఆ భ్రమ కూడా ఓ మతమే అనీ తానందులో భాగమనీ ఎరుగడు, ఎరిగినా అహం వల్ల అసలంగీకరించడు.

ముఖ్యంగా సంస్కృతి సంప్రదాయం అనేవి అభివృద్ధికి అడ్డుఅనీ భౌతికంగా ఎన్నో సాధించదలచుకున్నవి వీనివల్ల కుదరదనీ ప్రగాఢ విశ్వాసం. ఐతే వాళ్ళు తమ సిద్ధాంతాల ప్రచారానికి కూడా ఎన్నుకునే మార్గం కళలే. రచన ఒక కళ, బోధన ఒక కళ, ఇంద్రజాలాది ప్రదర్శనలు ఒక కళ, పాట ఒక కళ. ఐనా కానీ వీళ్ళ దృష్టిలో కళ అనేది కేవలం వినోదానికే ఉండాలనీ, దానివల్ల పరంపరాగత చారిత్రక సంప్రదాయిక విషయాలు చెప్పకూడదనీ దాని వల్ల మౌఢ్యం పెరుగుతుందనిన్నీ ఒక నమ్మకం. విచారణ విశ్లేషణ చేయకుండా కళలు, ధార్మిక విషయాలు, మత సంబంధ విషయాలు ఆసాంతం పనికిరాని మూఢవిశ్వాసాలని విశ్వసించడం అతిపెద్ద మూఢవిశ్వాసం. ఆ విశ్వాసంలోనే బ్రతుకుతూ హేతువాదులు నాస్తికులు జబ్బలు చరుస్తుంటారు.

ఏ ఆస్తికుడు కానీ ధార్మికుడు కానీ ఏ నాస్తికుణ్నీ హేతువాదినీ అగౌరవ పరచడు. నిజానికి ఆస్తికులెవరూ ఒకరిపట్ల ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించరు అకారణంగా నిందకూడా చేయరు. ఇతరుల్ని అనవసరంగా అకారణంగా విషయం తెలియకుండా గేలి చేసి మాట్లాడరు. దీనికి ఫక్తు వ్యతిరేకం హేతువాదులు, అవతల వ్యక్తి ఎంత సహృదయుడైనా అతని వల్ల, అతని మాటల వల్ల ప్రజలకి, దేశానికి, ప్రపంచానికి ఎంత మంచి జరిగినా ఒప్పుకోడు. అది మంచే కాదంటాడు. భౌతికమైన, ఆర్థికమైన అభివృద్ధే మంచి గా బేరీజు వేస్తాడు తప్ప వ్యక్తిగత, కుటుంబగత, సామాజిక శాంతి సౌఖ్యాలు వాని పవిత్రతని అంగీకరించడు. దివ్యత్వాన్ని, పవిత్రతనీ అంగీకరించని వానికి దేవుడెలా అర్థం అవుతాడు? తాళం వేసి ఇంట్లో కూర్చున్నవాళ్ళని గుమ్మంలోంచి బైటకి తీసుకురావడం, అవగతం చేసుకోవడం అన్నవిషయానికి వ్యతిరేకంగా బుర్రకి తాళం వేసుకున్న వాళ్ళకి అర్థం చేయించడం కుదరని పని. కూడా ఎక్కడా ఏ డిక్షనరీలోనూ లేని అర్థాన్ని అప్పటికప్పుడు కలిపించి మరీ మంచి అంటే అది కాదు ఇదీ అనే అర్థం సృష్టిస్తాడు. అసలు ప్రజలకి మంచి అంటే అర్థం కేవలం భౌతికం, ఆర్థికం అన్న భావనలో ఉంటాడు.


ఆస్తికులు తమకున్న ఆధ్యాత్మిక భావాలవల్ల కొన్ని కట్టుబాట్లకి లొంగి ఉంటారు. ఎక్కువగా సామాజిక కట్టుబాట్లకి లొంగి తమ జీవనాధారాన్ని సాగిస్తారు. మానవుడు సంఘజీవి అన్న కనీస జీవన సూత్రాలననుసరించి సామాజిక కట్టుబాట్లననుసరిస్తాడు. నాస్తికుడు లేదా హేతువాదులు ఈ కట్టుబాట్లకి ఫక్తు వ్యతిరేకులు. ఇక్కడే, ఇదే వారి అసలు వ్యథ. అలవిమాలిన స్వాతంత్ర్యాన్ని నిగ్రహించేటటువంటి సామాజిక రీతి నియమాల్ని అంగీకరించలేక దాన్ని నిర్దేశించే, లేదా ఉపదేశించే నీతి ఏ రూపంలో ఉన్నా ఏ రూపంలో చెప్పబడినా వ్యతిరేకించడం, అసహన ప్రకటనం, తూలనాడడం జరుగుతుంది. ఆ నీతి నియమాలని ధార్మిక జీవనాన్ని ఎవరు బోధ చేసినా, ప్రచారం చేసినా, వారిని శత్రువులుగా చూసి నీచ కర్మమైన వ్యక్తిగత దాడికి, వ్యక్తిత్వ హననానికి ఒడిగడతారు. కట్టుబాట్లకి లొంగని మనిషికీ ఇతర జంతు జాలానికీ తేడా ఉండదు. కేవలం అవి మాట్లాడలేవు ఇతను మాట్లాడగలడు.

“Science without religion is Lame;
Religion without science is Blind.”
-Albert Einstein

-శంకరకింకర